19-04-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - తండ్రి మొత్తం ప్రపంచమంతటి యొక్క
హాహాకారాలను తొలగించి జయజయకారాలను మ్రోగించేందుకే వచ్చారు, పాత ప్రపంచంలో హాహాకారాలు
ఉన్నాయి, కొత్త ప్రపంచంలో జయజయకారాలు ఉంటాయి’’
ప్రశ్న:-
ఏ ఈశ్వరీయ నియమము కారణంగా పేదవారే తండ్రి యొక్క పూర్తి
వారసత్వాన్ని తీసుకుంటారు, షావుకారులు తీసుకోలేకపోతారు?
జవాబు:-
ఈశ్వరీయ నియమము ఏమిటంటే - పూర్తి బికారులుగా అవ్వండి,
ఏదైతే ఉందో దానినంతటినీ మర్చిపోండి. పేద పిల్లలు సహజంగానే మర్చిపోతారు కానీ
షావుకారులు ఎవరైతే తాము స్వర్గంలో ఉన్నామని భావిస్తారో, వారు బుద్ధి ద్వారా ఏదీ
మర్చిపోరు, అందుకే ఎవరికైతే ధనము, సంపద, మిత్ర-సంబంధీకులు గుర్తుంటారో, వారు
సత్యమైన యోగులుగా అవ్వనే అవ్వలేరు. వారికి స్వర్గంలో ఉన్నత పదవి లభించదు.
ఓంశాంతి
మధురాతి మధురమైన, నిశ్చయబుద్ధి కల పిల్లలకు బాగా తెలుసు మరియు వారికి పూర్తి
నిశ్చయముంది, ఏమనంటే - తండ్రి మొత్తం ప్రపంచమంతటి గొడవలను అంతం చేయడానికి వచ్చారు.
తెలివైన, వివేకవంతులైన పిల్లలెవరైతే ఉన్నారో వారికి - ఈ తనువులోకి తండ్రి వచ్చి
ఉన్నారని మరియు వారి పేరు శివబాబా అని తెలుసు. వారు ఎందుకు వచ్చారు? హాహాకారాలను
అంతం చేసి జయజయకారాలను మ్రోగింపజేసేందుకు. మృత్యులోకంలో ఎన్ని గొడవలు మొదలైనవి
ఉన్నాయి. అందరూ తమ లెక్కాచారాలను తీర్చుకొని వెళ్ళాలి. అమరలోకంలో గొడవల విషయమేమీ
లేదు. ఇక్కడ ఎన్ని హంగామాలు, హాహాకారాలు జరుగుతూ ఉంటాయి. ఎన్ని కోర్టులు, ఎందరు
జడ్జీలు మొదలైనవారు ఉన్నారు. మారణహోమాలు జరుగుతున్నాయి. విదేశాలు మొదలైన చోట్ల కూడా
చూడండి, హాహాకారాలు ఉన్నాయి. మొత్తం ప్రపంచమంతటిలో గొడవలు ఎన్నో ఉన్నాయి. దీనిని
పాత తమోప్రధాన ప్రపంచము అని అంటారు. అంతా చెత్తయే చెత్త, అంతా అడవియే అడవి. అనంతమైన
తండ్రి వీటన్నింటినీ అంతం చేయడానికి వచ్చారు. ఇప్పుడు పిల్లలు చాలా తెలివైనవారిగా,
వివేకవంతులుగా అవ్వాలి. ఒకవేళ పిల్లల్లో కూడా గొడవలు-కొట్లాటలు జరుగుతూ ఉన్నట్లయితే
ఇక తండ్రికి సహాయకులుగా ఎలా అవుతారు. తండ్రికైతే చాలా సహాయకులైన పిల్లలు కావాలి,
వారు తెలివైనవారు, వివేకవంతులై ఉండాలి, వారిలో ఎటువంటి గొడవలు ఉండకూడదు. ఇది పాత
ప్రపంచమని, ఇక్కడ అనేక ధర్మాలు ఉన్నాయని, ఇది తమోప్రధానమైన వికారీ ప్రపంచమని కూడా
పిల్లలకు తెలుసు. మొత్తం ప్రపంచమంతా పతితముగా ఉంది. పతిత పాత ప్రపంచంలో అన్నీ గొడవలే
గొడవలు. వీటన్నింటినీ అంతం చేసేందుకు, జయజయకారాలను మ్రోగించేందుకు తండ్రి వస్తారు.
ఈ ప్రపంచంలో ఎంత దుఃఖము మరియు అశాంతి ఉన్నాయో ప్రతి ఒక్కరికీ తెలుసు, అందుకే
విశ్వంలో శాంతి కావాలి అని కోరుకుంటారు. ఇప్పుడు మొత్తం విశ్వంలో శాంతిని
మానవమాత్రులెవరైనా ఎలా తీసుకురాగలరు. అనంతమైన తండ్రిని రాయి-రప్పల్లో ఉన్నారని
అనేసారు. ఇది కూడా ఒక ఆటయే. తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు - ఇక ఇప్పుడు లేచి
నిలబడండి, తండ్రికి సహాయకులుగా అవ్వండి, తండ్రి నుండి మీ రాజ్యభాగ్యాన్ని తీసుకోవాలి.
ఇది తక్కువేమీ కాదు, అపారమైన సుఖము ఉంది. తండ్రి అంటారు - మధురమైన పిల్లలూ, డ్రామా
అనుసారంగా మిమ్మల్ని అనంతమైన తండ్రి పదమాపదమ భాగ్యశాలురుగా చేయడానికి వచ్చారు. భారత్
లో ఈ లక్ష్మీ-నారాయణులు రాజ్యం చేసేవారు. భారత్ స్వర్గముగా ఉండేది. స్వర్గాన్నే
ప్రపంచ అద్భుతము అని అంటారు. త్రేతాను కూడా ఇలా అనరు. ఇటువంటి స్వర్గంలోకి
వచ్చేందుకు పిల్లలు పురుషార్థం చేయాలి. మొట్టమొదటే రావాలి. మేము స్వర్గంలోకి రావాలి,
లక్ష్మిగా లేక నారాయణుడిగా అవ్వాలి అని పిల్లలు కోరుకుంటారు కూడా. ఇప్పుడు ఈ పాత
ప్రపంచంలో ఎన్నో హాహాకారాలు జరగనున్నాయి. రక్తపు నదులు ప్రవహించనున్నాయి. రక్తపు
నదుల తర్వాత నేతి నదులు ప్రవహిస్తాయి. దానిని క్షీరసాగరము అని అంటారు. ఇక్కడ కూడా
పెద్ద కొలనును తయారుచేస్తారు, తర్వాత ఒక రోజును నిశ్చితము చేస్తారు, అప్పుడు వచ్చి
అందులో పాలు పోస్తారు, మళ్ళీ అందులో స్నానం చేస్తారు. శివలింగం పైన కూడా పాలు
పోస్తారు. సత్యయుగంలో నేతి, పాల నదులు ఉంటాయి అని అక్కడి కోసం ఒక మహిమ ఉంది. కానీ
అటువంటి విషయమేమీ లేదు. ప్రతి 5,000 సంవత్సరాల తర్వాత మీరు విశ్వాధిపతులుగా అవుతారు.
ఈ సమయంలో మీరు బానిసలుగా ఉన్నారు, తర్వాత మీరు చక్రవర్తులుగా అవుతారు. మొత్తం
ప్రకృతి అంతా మీకు దాసిగా అయిపోతుంది. అక్కడ ఎప్పుడూ నియమ విరుద్ధంగా వర్షం కురవదు,
నదులు పొంగవు. ఎటువంటి విపత్తులు సంభవించవు. ఇక్కడ ఎన్ని విపత్తులు ఉన్నాయో చూడండి.
అక్కడ పక్కా వైష్ణవులు ఉంటారు, వికారీ వైష్ణవులు ఉండరు. ఇక్కడ ఎవరైనా శాకాహారులుగా
అయితే వారిని వైష్ణవులు అని అంటారు. కానీ అలా కాదు, వికారాల ద్వారా ఒకరికొకరు ఎంతో
దుఃఖాన్ని ఇచ్చుకుంటూ ఉంటారు. తండ్రి ఎంత బాగా అర్థం చేయిస్తారు. పల్లెటూరి
పిల్లవాడు అన్న గాయనం కూడా ఉంది. శ్రీకృష్ణుడు అలా పల్లెటూరి బాలుడిగా అవ్వలేరు.
వారు వైకుంఠానికి అధిపతి. వారే మళ్ళీ 84 జన్మలు తీసుకుంటారు.
మనం భక్తిలో ఎన్ని ఎదురుదెబ్బలు తిన్నాము, ఎంత ధనం పాడుచేశాము అనేది కూడా మీకు
ఇప్పుడు తెలుసు. తండ్రి అడుగుతున్నారు - నేను మీకు ఇంత ధనాన్ని ఇచ్చాను,
రాజ్యభాగ్యాన్ని ఇచ్చాను, అదంతా ఏమైంది? మిమ్మల్ని విశ్వాధిపతులుగా తయారుచేసాను, మరి
మీరు ఏం చేసారు? తండ్రికైతే డ్రామా గురించి తెలుసు. కొత్త ప్రపంచమే పాత ప్రపంచంగా
అవుతుంది, మళ్ళీ పాత ప్రపంచమే కొత్త ప్రపంచంగా అవుతుంది. ఇది ఒక చక్రము. ఏదైతే
గతించిందో అదంతా మళ్ళీ పునరావృతమవుతుంది. తండ్రి అంటారు, ఇప్పుడు ఇంకా కొద్ది సమయమే
ఉంది, ఇప్పుడు ఇక పురుషార్థం చేసి భవిష్యత్తు కొరకు జమ చేసుకోండి, పాత ప్రపంచానికి
సంబంధించినదంతా మట్టిలో కలిసిపోనున్నది. షావుకారులు ఈ జ్ఞానాన్ని తీసుకోరు. తండ్రి
పేదల పాలిటి పెన్నిధి. పేదవారు అక్కడ షావుకారులుగా అవుతారు. ఇక్కడి షావుకారులు
అక్కడ పేదవారిగా అవుతారు. ఇప్పుడైతే పదమపతులు ఎందరో ఉన్నారు. వారు అక్కడకు వస్తారు
కానీ పేదవారిగా అవుతారు. వారు ఇప్పుడు తాము స్వర్గంలో ఉన్నామని భావిస్తారు, అది వారి
బుద్ధిలో నుండి పోదు. ఇక్కడైతే తండ్రి అంటారు, అన్నింటినీ బుద్ధి ద్వారా మర్చిపోండి,
ఖాళీగా బికారులుగా అయిపోండి. ఈ రోజుల్లోనైతే కిలోగ్రాం, కిలోమీటర్ మొదలైనవి ఏవేవో
వెలువడ్డాయి, సింహాసనంపై ఏ రాజు కూర్చుంటే అతను తన భాషను నడిపిస్తాడు. విదేశీయులను
కాపీ చేస్తారు. తమ తెలివైతే లేదు. తమోప్రధానంగా ఉన్నారు. అమెరికా మొదలైన చోట్ల
వినాశన సామాగ్రి కోసం ఎంత ధనాన్ని వినియోగిస్తారో చూడండి. ఏరోప్లేన్ల నుండి బాంబులు
మొదలైనవి వేస్తూ ఉంటారు, ఇప్పుడు మంటలు అంటుకోనున్నాయి. తండ్రి వినాశనం మరియు
స్థాపన చేయించేందుకే వస్తారని పిల్లలకు తెలుసు. మీలో కూడా అర్థం చేయించేవారందరూ
నంబరువారుగా ఉన్నారు. అందరూ ఒకే విధమైన నిశ్చయబుద్ధి కలవారిగా లేరు. బాబా ఎలా చేసారో,
అలా బాబాను ఫాలో చేయాలి. పాత ప్రపంచంలో ఎందుకూ కొరగాని ఈ డబ్బును ఏం చేసుకుంటారు? ఈ
రోజుల్లో పేపర్ నోట్లు చలామణిలో ఉన్నాయి, అక్కడైతే నాణాలు ఉంటాయి. బంగారముతో మహళ్ళే
తయారవుతున్నప్పుడు మరి అక్కడ బంగారు నాణాలకు విలువేమిటి. అక్కడంతా ఉచితంగానే ఉంటుంది,
అది సతోప్రధానమైన ధరణి కదా. ఇప్పుడైతే పాతబడిపోయింది. అది సతోప్రధానమైన కొత్త
ప్రపంచం. పూర్తిగా కొత్త భూమి. మీరు సూక్ష్మవతనంలోకి వెళ్ళినప్పుడు శూభీరసం మొదలైనవి
త్రాగుతారు. కానీ అక్కడ వృక్షాలు మొదలైనవేవీ లేవు. అలాగే మూలవతనంలోనూ లేవు. మీరు
ఎప్పుడైతే వైకుంఠంలోకి వెళ్తారో అప్పుడు అక్కడ మీకు అన్నీ లభిస్తాయి. బుద్ధి ద్వారా
అర్థం చేసుకోండి, సూక్ష్మవతనంలో వృక్షాలు మొదలైనవేవీ ఉండవు. వృక్షాలు భూమి పైన
ఉంటాయే కానీ ఆకాశంలో ఉండవు. బ్రహ్మమహాతత్వము అన్న పేరు ఉంది కానీ అదంతా ఆకాశమే.
ఆకాశంలో ఏ విధంగా నక్షత్రాలు నిలబడి ఉన్నాయో అలా చిన్న-చిన్న ఆత్మలైన మీరు కూడా
ఎందరో నిలబడి ఉన్నారు. నక్షత్రాలు చూడడానికి పెద్దగా ఉంటాయి. అలాగని
బ్రహ్మమహాతత్వంలో కూడా పెద్ద-పెద్ద ఆత్మలు ఉంటాయని కాదు. ఇది బుద్ధి ద్వారా అర్థం
చేసుకోవాలి. విచార సాగర మంథనం చేయాలి. కావున ఆత్మలు కూడా పైన నిలబడి ఉంటాయి. అవి
చిన్నని బిందువులు. ఈ విషయాలన్నింటినీ మీరు ధారణ చేయాలి, అప్పుడే ఇతరులెవరి చేతనైనా
ధారణ చేయించగలుగుతారు. టీచరుకు తప్పకుండా ముందు తెలిసి ఉంటుంది, అప్పుడే ఇతరులచేత
చదివిస్తారు కదా. లేకపోతే వారు టీచరెలా అవుతారు. కానీ ఇక్కడ టీచర్లు కూడా
నంబరువారుగా ఉన్నారు. పిల్లలైన మీరు వైకుంఠాన్ని కూడా అర్థం చేసుకోగలరు. మీరు
వైకుంఠాన్ని చూడలేదని కాదు. చాలామంది పిల్లలు సాక్షాత్కారాలలో చూసారు. అక్కడ
స్వయంవరం ఎలా జరుగుతుంది, ఏ భాష ఉంటుంది, అవన్నీ చూసారు. చివరిలో కూడా మీకు
సాక్షాత్కారాలు కలుగుతాయి, కానీ ఎవరైతే యోగయుక్తులుగా ఉంటారో వారికే అవి కలుగుతాయి.
ఇకపోతే ఎవరికైతే తమ మిత్ర-సంబంధీకులు, ధన-సంపదలు మొదలైనవి గుర్తుకొస్తూ ఉంటాయో, వారేం
చూస్తారు. సత్యమైన యోగులే అంతిమం వరకూ ఉంటారు, వారిని చూసి తండ్రి సంతోషిస్తారు.
పూల ద్వారానే తోట తయారవుతుంది. ఎంతోమందైతే 10-15 సంవత్సరాలు ఉండి కూడా వెళ్ళిపోతారు.
వారిని జిల్లేడు పుష్పాలు అని అంటారు. చాలా మంచి-మంచి కుమార్తెలు ఎవరైతే మమ్మా-బాబా
కోసం కూడా డైరెక్షన్లు తీసుకువచ్చేవారో, ఎవరైతే డ్రిల్ చేయించేవారో, వారు ఈ రోజు
లేరు. మాయ చాలా శక్తివంతమైనదని కుమార్తెలకు కూడా తెలుసు, అలాగే బాప్ దాదాకు కూడా
తెలుసు. ఇది మాయతో జరిగే గుప్తమైన యుద్ధము. ఇది గుప్తమైన తుఫాను. బాబా అంటారు, మాయ
మిమ్మల్ని ఎంతగానో హైరానా పరుస్తుంది, ఇది గెలుపు-ఓటములతో తయారుచేయబడి ఉన్న డ్రామా.
మీదేమీ ఆయుధాలతో చేసే యుద్ధం కాదు. భారత్ యొక్క ఈ ప్రాచీన యోగం ఎంతో ప్రసిద్ధమైనది,
ఈ యోగబలం ద్వారా మీరు ఈ విధంగా అవుతారు. బాహుబలంతో ఎవ్వరూ విశ్వ రాజ్యాధికారాన్ని
తీసుకోలేరు. ఈ ఆట కూడా అద్భుతమైనది. రెండు పిల్లులు కొట్లాడుకుంటే మధ్యలో వెన్నను
ఇంకెవరో తీసుకున్నట్లు కథ కూడా ఉంది. క్షణంలో విశ్వ రాజ్యాధికారము అని కూడా అంటారు.
కుమార్తెలకు సాక్షాత్కారాలు కలుగుతాయి. శ్రీకృష్ణుని నోట్లో వెన్న ఉంది అని అంటారు.
వాస్తవానికి శ్రీకృష్ణుని నోట్లో కొత్త ప్రపంచాన్ని చూస్తారు. యోగబలం ద్వారా మీరు
విశ్వరాజ్యాధికారమనే వెన్నను తీసుకుంటారు. రాజ్యం కొరకు ఎన్ని యుద్ధాలు జరుగుతుంటాయి
మరియు ఆ యుద్ధాలలో ఎంతమంది మరణిస్తూ ఉంటారు. ఈ పాత ప్రపంచ లెక్కచారాలు
తీరిపోనున్నాయి. ఈ ప్రపంచానికి సంబంధించినదేదీ ఉండదు. తండ్రి శ్రీమతమేమిటంటే -
పిల్లలూ, చెడును వినకండి, చెడును చూడకండి... వారు కోతుల చిత్రాన్ని ఒకటి తయారుచేసారు.
ఈ రోజుల్లో మనుష్యులది కూడా తయారుచేస్తున్నారు. ఇంతకుముందు చైనా వైపు నుండి ఏనుగు
దంతాలతో తయారుచేసిన వస్తువులు వచ్చేవి. గాజులు కూడా గాజుతో తయారుచేసినవి ధరించేవారు.
ఇక్కడైతే నగలు మొదలైనవి ధరించేందుకు ముక్కు, చెవులకు రంధ్రాలు చేస్తారు. సత్యయుగంలో
అలా ముక్కు, చెవులకు రంధ్రాలు చేయవలసిన అవసరం ఉండదు. ఇక్కడ మాయ ఎలా ఉందంటే అది అందరి
ముక్కు, చెవులను కోసేస్తుంది. పిల్లలైన మీరు ఇప్పుడు స్వచ్ఛంగా అవుతారు. అక్కడ
ప్రకృతిసిద్ధమైన సౌందర్యము ఉంటుంది. అక్కడ ఎటువంటి ఆభరణాలు ధరించవలసిన అవసరం ఉండదు.
ఇక్కడైతే శరీరమే తమోప్రధానమైన తత్వాలతో తయారవుతుంది, అందుకే రోగాలు మొదలైనవి ఉంటాయి.
అక్కడ ఈ విషయాలేవీ ఉండవు. ఇప్పుడు మీ ఆత్మకు ఎంతో సంతోషము ఉంది - మమ్మల్ని అనంతమైన
తండ్రి చదివించి నరుని నుండి నారాయణునిగా మరియు అమరపురికి అధిపతులుగా
తయారుచేస్తున్నారు అని. అందుకే అతీంద్రియ సుఖము గురించి తెలుసుకోవాలంటే గోప-గోపికలను
అడగండి అన్న గాయనము ఉంది. భక్తులకు ఈ విషయాల గురించి తెలియదు. మీలో కూడా చాలా
సంతోషంగా ఉంటూ ఈ విషయాలను స్మరిస్తూ ఉండే పిల్లలు చాలా కొద్దిమందే ఉన్నారు. అబలలపై
ఎన్ని అత్యాచారాలు జరుగుతూ ఉంటాయి. ద్రౌపది గురించి ఏదైతే చెప్తూ ఉంటారో, అదంతా
ఇప్పుడు ప్రత్యక్షంగా జరుగుతోంది. ద్రౌపది ఎందుకు పిలిచింది? ఇది మనుష్యులకు తెలియదు.
మీరందరూ ద్రౌపదులేనని తండ్రి అర్థం చేయించారు. స్త్రీలు సదా స్త్రీలుగానే అవుతారని
కాదు, రెండు సార్లు స్త్రీలుగా అవ్వగలరు, అంతకన్నా ఎక్కువ కాదు. బాబా, రక్షించండి,
మమ్మల్ని దుశ్శాసనులు వికారాల కోసం హైరానా పరుస్తున్నారు అని మాతలు పిలుస్తారు.
దీనిని వేశ్యాలయము అని అంటారు. స్వర్గాన్ని శివాలయము అని అంటారు. వేశ్యాలయము రావణుడి
ద్వారా స్థాపించబడినది. శివాలయము శివబాబా ద్వారా స్థాపించబడినది. మరియు వారు మీకు
జ్ఞానాన్ని కూడా ఇస్తారు. తండ్రిని నాలెడ్జ్ ఫుల్ అని కూడా అంటారు. నాలెడ్జ్ ఫుల్
అంటే వారు అందరి హృదయాలలో ఏముందో తెలిసినవారు అని కాదు, దాని వల్ల లాభమేముంది!
తండ్రి అంటారు, ఈ సృష్టి ఆదిమధ్యాంత జ్ఞానాన్ని నేను తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు, నేనే
కూర్చొని మిమ్మల్ని చదివిస్తాను. జ్ఞానసాగరుడు ఒక్క తండ్రే. అక్కడ భక్తి యొక్క
ప్రారబ్ధము ఉంటుంది. సత్య, త్రేతాయుగాలలో భక్తి ఉండదు. చదువు ద్వారానే రాజధాని
స్థాపన అవుతోంది. ప్రెసిడెంట్ మొదలైనవారికి ఎంతమంది మంత్రులు ఉన్నారో చూడండి. సలహాలు
ఇవ్వడానికి మంత్రులను పెట్టుకుంటారు. సత్యయుగంలో మంత్రులను పెట్టుకోవలసిన అవసరముండదు.
ఇప్పుడు తండ్రి మిమ్మల్ని తెలివైనవారిగా తయారుచేస్తారు. ఈ లక్ష్మీ-నారాయణులు ఎంత
తెలివైనవారిగా ఉండేవారో చూడండి. అనంతమైన రాజ్యాధికారము తండ్రి ద్వారా లభిస్తుంది.
శివ జయంతి తండ్రిదే జరుపుకుంటారు. తప్పకుండా శివబాబా భారత్ లోకి వచ్చి
విశ్వాధిపతులుగా తయారుచేసి వెళ్ళారు. ఇది లక్షల సంవత్సరాల విషయం కాదు. ఇది నిన్నటి
విషయమే. అచ్ఛా, ఎక్కువేమి అర్థం చేయించాలి. తండ్రి మన్మనాభవ అని అంటారు. వాస్తవానికి
ఈ చదువు సూచనా ప్రాయమైనది. అచ్ఛా.
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. తండ్రికి పూర్తి సహాయకులుగా అయ్యేందుకు తెలివైనవారిగా అవ్వాలి. లోపల ఎటువంటి
గొడవలు ఉండకూడదు.
2. స్థాపన మరియు వినాశన కర్తవ్యాలను చూస్తూ పూర్తి నిశ్చయబుద్ధి కలవారిగా అయి
తండ్రిని ఫాలో చేయాలి. పాత ప్రపంచము యొక్క ఎందుకూ కొరగాని వాటి నుండి బుద్ధిని
తొలగించి పూర్తి బికారులుగా అవ్వాలి. మిత్ర-సంబంధీకులు, ధన-సంపదలు
మొదలైనవాటన్నింటినీ మర్చిపోవాలి.
వరదానము:-
సంగఠనలో ఉంటూ, అందరికీ స్నేహీలుగా అవుతూ ఒక్క తండ్రినే
బుద్ధి యొక్క ఆధారంగా చేసుకునే కర్మయోగీ భవ
కొంతమంది పిల్లలు సంగఠనలో స్నేహీలుగా అయ్యేందుకు బదులుగా
అతీతంగా అయిపోతారు. ఎక్కడైనా చిక్కుకుపోతామేమో, దీని కన్నా దూరంగా ఉండటమే మంచిది అని
భయపడతారు. కానీ అలా కాదు, 21 జన్మలు పరివారములో ఉండాలి, ఒకవేళ భయపడి పక్కకు
తప్పుకున్నట్లయితే ఇవి కూడా కర్మ-సన్యాసుల సంస్కారాలు అయినట్లు. కర్మయోగులుగా
అవ్వాలి, కర్మ సన్యాసులుగా కాదు. సంగఠనలో ఉండండి, అందరికీ స్నేహీలుగా అవ్వండి, కానీ
బుద్ధి యొక్క ఆధారము ఒక్క తండ్రే అవ్వాలి, ఇతరులెవ్వరూ అవ్వకూడదు. బుద్ధిని ఏ ఆత్మ
యొక్క తోడు కానీ, గుణము కానీ లేక విశేషత కానీ ఆకర్షించకూడదు, అప్పుడే కర్మయోగీ
పవిత్ర ఆత్మ అని అంటారు.
స్లోగన్:-
బాప్ దాదాకు కుడి భుజంగా
అవ్వండి, ఎడమ భుజంగా కాదు.
| | |