02-03-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - స్మృతిలో ఉంటూ ఇతరుల చేత స్మృతి యొక్క అభ్యాసాన్ని చేయించండి, యోగము చేయించేవారి బుద్ధియోగము ఇటూ-అటూ భ్రమించకూడదు’’

ప్రశ్న:-
ఏ పిల్లలపై చాలా పెద్ద బాధ్యత ఉంది? వారు ఏ విషయము పట్ల తప్పకుండా అటెన్షన్ పెట్టాలి?

జవాబు:-
ఏ పిల్లలైతే నిమిత్త టీచర్లుగా అయ్యి ఇతరుల చేత యోగము చేయిస్తారో, వారిపై చాలా పెద్ద బాధ్యత ఉంది. ఒకవేళ యోగము చేయించే సమయములో బుద్ధి బయట భ్రమిస్తే సర్వీస్ కు బదులుగా డిస్సర్వీస్ చేస్తారు, అందుకే - నా ద్వారా పుణ్య కార్యము జరుగుతూ ఉండాలి అని అటెన్షన్ పెట్టాలి.

పాట:-
ఓం నమః శివాయ...

ఓంశాంతి
తండ్రి ఇక్కడ కూర్చుని పిల్లలందరినీ లక్ష్యములో స్థిరపరిచేందుకు మొట్టమొదట దృష్టినిస్తారు - ఏ విధముగా నేను శివబాబా స్మృతిలో కూర్చున్నానో, అదే విధముగా మీరు కూడా శివబాబా స్మృతిలో కూర్చోండి. యోగము చేయించేందుకు ఎవరైతే ఎదురుగా కూర్చున్నారో, వారు మొత్తం సమయము శివబాబా స్మృతిలో ఉంటున్నారా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది, తద్వారా ఇతరులకు కూడా ఆకర్షణ కలగాలి. స్మృతిలో ఉండటముతో ఎంతో శాంతిలో ఉంటారు. అశరీరిగా అయి శివబాబా స్మృతిలో ఉన్నట్లయితే ఇతరులను కూడా శాంతిలోకి తీసుకువెళ్తారు, ఎందుకంటే టీచర్ గా అయి కూర్చుంటారు కదా. ఒకవేళ టీచరే సరైన రీతిలో స్మృతిలో లేకపోతే ఇతరులు కూడా ఉండలేరు. ప్రియుడైన ఆ బాబాకు ప్రేయసిగా ఉన్న నేను, వారి స్మృతిలో కూర్చున్నానా అని మొదట ఆలోచించాలి. ప్రతి ఒక్కరూ తమను తాము ఈ విధముగా ప్రశ్నించుకోవాలి. ఒకవేళ బుద్ధి వేరేవైపుకు వెళ్ళిపోతుందంటే, దేహాభిమానములోకి వచ్చేస్తున్నారంటే, అది సర్వీస్ కాదు, డిస్సర్వీస్ చేయడానికి కూర్చున్నట్లు. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయము కదా. ఏ సేవ చేయలేదు, ఊరికే అలా కూర్చున్నారంటే వారు నష్టమే కలిగిస్తారు. టీచర్ బుద్ధియోగమే భ్రమిస్తూ ఉన్నట్లయితే ఇక వారు ఏమి సహాయము చేయగలరు. ఎవరైతే టీచర్ గా అయి కూర్చుంటారో, వారు తమను తాము ప్రశ్నించుకోండి - నేను పుణ్య కార్యము చేస్తున్నానా? ఒకవేళ పాప కార్యము చేసినట్లయితే దుర్గతిని పొందుతారు, పదవి భ్రష్టమైపోతుంది. ఒకవేళ అటువంటివారిని గద్దెపై కూర్చోబెట్టినట్లయితే దానికి మీరు కూడా బాధ్యులవుతారు. శివబాబాకైతే అందరి గురించి తెలుసు. ఈ బాబాకు కూడా అందరి అవస్థ గురించి తెలుసు. శివబాబా అంటారు - ఫలానావారు టీచర్ గా అయి కూర్చున్నారు కానీ వారి బుద్ధియోగమే భ్రమిస్తూ ఉంటుంది, ఇక వారు ఇతరులకేమి సహాయము చేయగలరు. ఎవరినైనా శివబాబాకు చెందినవారిగా అయ్యి వారి నుండి వారసత్వాన్ని తీసుకునేలా చేయడానికి బ్రాహ్మణ పిల్లలైన మీరు నిమిత్తము అయ్యారు. బాబా అంటారు - ఓ ఆత్మలూ, నన్నొక్కరినే స్మృతి చేయండి. టీచర్ గా అయి కూర్చున్నట్లయితే, ఇంకా మంచి రీతిలో ఆ అవస్థలో కూర్చోండి. వాస్తవానికి ప్రతి ఒక్కరూ తండ్రిని స్మృతి చేయాలి. విద్యార్థులు తమ అవస్థను తాము అర్థం చేసుకోగలరు. నేను పాస్ అవుతానా లేదా అన్నది వారికి తెలుస్తుంది, టీచర్ కు కూడా తెలుస్తుంది. ఒకవేళ ప్రైవేట్ టీచర్ ను పెట్టుకున్నట్లయితే వారికి కూడా తెలుస్తుంది. ఆ చదువులోనైతే ఎవరైనా స్పెషల్ టీచర్ ను పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ ఎవరైనా, మమ్మల్ని యోగములో కూర్చోబెట్టండి అని అన్నట్లయితే, మీరు బాబా స్మృతిలో కూర్చోవాలి. నన్నొక్కరినే స్మృతి చేయండి అని తండ్రి ఆజ్ఞయే ఉంది. మీరు ప్రేయసులు, నడుస్తూ-తిరుగుతూ మీ ప్రియుడిని స్మృతి చేయండి. సన్యాసులు బ్రహ్మతత్వాన్ని తలచుకుంటారు. మేము వెళ్ళి బ్రహ్మతత్వములో లీనమవుతామని భావిస్తారు. ఎవరైతే ఎక్కువ తలచుకుంటూ ఉంటారో వారి అవస్థ బాగుంటుంది. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక విశేషత అయితే ఉంటుంది కదా. స్మృతియాత్రలో ఉండండి అని అంటారు. స్వయము కూడా స్మృతిలో ఉండాలి. బాబా వద్ద కొంతమంది సత్యమైనవారు కూడా ఉన్నారు, కొంతమంది అసత్యమైనవారు కూడా ఉన్నారు. స్వయము నిరంతర స్మృతిలో ఉండడమంటే, అది చాలా కష్టము. కొంతమందైతే తండ్రితో పూర్తిగా సత్యముగా ఉంటారు. ఈ బాబా కూడా తన అనుభవాన్ని పిల్లలైన మీకు తెలియజేస్తున్నారు - నేను కొంత సమయము స్మృతిలో ఉంటాను, మళ్ళీ మర్చిపోతాను అని అంటారు, ఎందుకంటే వీరిపైనైతే చాలా భారము ఉంది. ఎంతమంది పిల్లలు ఉన్నారు. ఈ మురళీని శివబాబా వినిపించారా లేదా బ్రహ్మా వినిపిస్తున్నారా అనేది కూడా పిల్లలైన మీకు తెలియదు ఎందుకంటే ఇద్దరూ కలిసి ఉన్నారు కదా. నేను కూడా శివబాబాను స్మృతి చేస్తాను అని వీరు అంటారు. ఈ బాబా కూడా పిల్లలకు యోగము చేయిస్తారు. వీరు కూర్చున్నప్పుడు, మంచి నిశ్శబ్దము ఏర్పడడాన్ని మీరు చూసారు, వీరు చాలామందిని ఆకర్షిస్తారు, తండ్రి కదా. పిల్లలూ, స్మృతియాత్రలో ఉండండి అని అంటారు. స్వయము కూడా స్మృతిలో ఉండాలి, కేవలం పండితునిలా అవ్వకూడదు. స్మృతిలో ఉండకపోతే అంతిమములో ఫెయిల్ అయిపోతారు. బాబా-మమ్మాలదైతే ఉన్నత పదవి, కాకపోతే ఇప్పుడింకా మాల తయారవ్వలేదు. ఒక్క పూస కూడా పూర్తిగా తయారై లేదు. పూర్వము పిల్లలకు లిఫ్ట్ ఇచ్చేందుకని మాలను తయారుచేసేవారు. కానీ మాయ చాలామందిని సమాప్తము చేసేసింది అన్నది గమనించడము జరిగింది. మొత్తమంతా సేవపైనే ఆధారపడి ఉంది. ఎవరైతే యోగము చేయించేందుకు ఎదురుగా కూర్చుంటారో వారు - నేను సత్యమైన టీచర్ గా అయి కూర్చోవాలి అని భావించాలి. లేదంటే - నా బుద్ధి ఇక్కడికి-అక్కడికి వెళ్ళిపోతుంది, నేను ఇక్కడ కూర్చునేందుకు యోగ్యుడిని కాదు అని చెప్పాలి, స్వయమే చెప్పాలి. ఎవరైనా తమంతట తామే వచ్చి కూర్చోవచ్చని కాదు. కొంతమంది నోటి ద్వారా మురళీ వినిపించరు కానీ వారు స్మృతిలో ఉంటారు. కానీ ఇక్కడైతే రెండింటిలోనూ చురుకుగా ముందుకు వెళ్ళాలి. ప్రియుడు చాలా ప్రియముగా ఉన్నారు, వారినైతే చాలా స్మృతి చేయాలి. ఇందులోనే శ్రమ ఉంది. ఇకపోతే ప్రజలుగా అవ్వడమైతే సహజమే. దాస-దాసీలుగా అవ్వడమనేది పెద్ద విషయమేమీ కాదు, వారు జ్ఞానాన్ని తీసుకోలేరు. చూడండి, యజ్ఞములో భోలీ దాదీజీ ఉన్నారు కదా, వారు అందరినీ చాలా సంతోషపరుస్తారు, ఎవ్వరికీ దుఃఖము ఇవ్వరు, అందరూ వారిని మహిమ చేస్తారు. వాహ్, శివబాబా యొక్క భోలీ దాదీ నంబరువన్. వారు అనేకుల హృదయాలను సంతోషపరుస్తారు. బాబా కూడా పిల్లల హృదయాలను సంతోషపరుస్తూ వచ్చారు. తండ్రి అంటారు - నన్ను స్మృతి చేయండి మరియు ఈ చక్రాన్ని బుద్ధిలో ఉంచుకోండి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ తమ కళ్యాణము చేసుకోవాలి. కష్టపడి ఎముక ఎముకను సేవలో పెట్టాలి. మీరు చాలా దయార్ద్ర హృదయులుగా అవ్వాలి. మనుష్యులు ముక్తి-జీవన్ముక్తుల కోసం చాలా భ్రమిస్తూ ఉంటారు. ఎవ్వరికీ సద్గతిని గురించి తెలియనే తెలియదు. ఎక్కడి నుండైతే వచ్చామో, అక్కడికే తిరిగి వెళ్ళాలని భావిస్తారు. నాటకమని కూడా భావిస్తారు కానీ దానిపై నడుచుకోరు. చూడండి, కొన్నిచోట్ల క్లాసుకు ముసల్మానులు కూడా వస్తారు. వారేమంటారంటే - మేము వాస్తవానికి దేవీ-దేవతా ధర్మానికి చెందినవారము, ఆ తర్వాత వెళ్ళి మేము ముసల్మాన ధర్మములోకి కన్వర్ట్ అయిపోయాము, మేము 84 జన్మలు తీసుకున్నాము. సింధ్ లో కూడా 5-6 మంది ముసల్మానులు వచ్చేవారు. ఇప్పుడు కూడా వస్తున్నారు. ఇప్పుడిక ముందుకు వెళ్ళగలరా లేదా అనేది చూద్దాము ఎందుకంటే మాయ కూడా పరీక్ష తీసుకుంటుంది. కొంతమంది పక్కాగా నిలిచిపోతారు, కొంతమంది నిలవలేరు. అసలు ఎవరైతే బ్రాహ్మణ ధర్మానికి చెందినవారు ఉంటారో, ఎవరైతే 84 జన్మలు తీసుకుని ఉంటారో, వారెప్పుడూ చలించరు. ఇక మిగిలినవారు, ఏదో ఒక కారణము చేత వెళ్ళిపోతారు. దేహాభిమానము కూడా చాలా వచ్చేస్తుంది. పిల్లలైన మీరైతే అనేకుల కళ్యాణము చేయాలి, లేదంటే ఏమి పదవిని పొందుతారు. మీ కళ్యాణము కోసమనే ఇళ్ళు-వాకిళ్ళను వదిలారు. తండ్రిపై ఎవరూ దయ చూపించడము లేదు. తండ్రికి చెందినవారిగా అయ్యారంటే మరి సేవ కూడా ఆ విధముగా చేయాలి. మీకైతే రాజ్యము యొక్క మెడల్ లభిస్తుంది, 21 జన్మలు సదా సుఖము యొక్క రాజ్యము లభిస్తుంది. కేవలం మాయపై విజయము పొందాలి మరియు ఇతరులకు కూడా నేర్పించాలి. కొంతమంది ఫెయిల్ కూడా అయిపోతారు. రాజ్యాధికారాన్ని తీసుకోవడము కష్టమని భావిస్తారు. తండ్రి అంటారు, అలా భావించడము బలహీనత. తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయడమైతే చాలా సహజము. పిల్లలకు రాజ్యాన్ని తీసుకునే ధైర్యము కలగకపోతే పిరికివారిగా అయి కూర్చుండిపోతారు. స్వయమూ తీసుకోరు, ఇతరులను తీసుకోనివ్వరు. అప్పుడు పరిణామము ఎలా ఉంటుంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు, రాత్రింబవళ్ళు సేవ చేయండి. కాంగ్రెస్ వారు కూడా కృషి చేసారు. ఎంత పెనుగులాట జరిగింది, అంత జరిగిన తర్వాతే విదేశీయుల నుండి రాజ్యము తీసుకున్నారు. మీరు రావణుడి నుండి రాజ్యము తీసుకోవాలి. రావణుడు అందరికీ శత్రువు. మేము రావణుడి మతముపై నడుస్తున్నాము, అందుకే దుఃఖితులుగా ఉన్నాము అని ప్రపంచానికి తెలియదు. ఎవ్వరికీ కూడా మనస్ఫూర్తిగా సత్యమైన, స్థిరమైన సుఖము లేదు. శివబాబా అంటారు - నేను పిల్లలైన మిమ్మల్ని సదా సుఖవంతులుగా చేయడానికి వచ్చాను. ఇప్పుడు శ్రీమతముపై నడుస్తూ శ్రేష్ఠముగా అవ్వాలి. భారతవాసులెవరైతే ఉన్నారో, వారు తమ ధర్మాన్ని మర్చిపోయారు. యథా రాజా-రాణి తథా ప్రజ. ఇప్పుడు పిల్లలైన మీకు సృష్టి చక్రము ఎలా తిరుగుతుంది అన్న అవగాహన లభిస్తుంది. కానీ అది కూడా ఘడియ, ఘడియ మర్చిపోతారు. బుద్ధిలో నిలవనే నిలవదు. బ్రాహ్మణులుగా అయితే చాలామంది అవుతారు కానీ కొంతమంది కచ్చాగా (అపరిపక్వముగా) ఉన్న కారణముగా వికారాలలోకి కూడా వెళ్తూ ఉంటారు. మేము బి.కె.లము అని అంటారు కానీ వారు కాదు. ఇకపోతే, ఎవరైతే డైరెక్షన్లపై పూర్తిగా నడుచుకుంటూ ఉంటారో, తమ సమానముగా తయారుచేస్తూ ఉంటారో, వారే ఉన్నత పదవిని పొందగలరు. విఘ్నాలైతే కలుగుతాయి. అమృతాన్ని తాగుతూ-తాగుతూ మళ్ళీ వెళ్ళి విఘ్నాలను కలిగిస్తారు అని కూడా అంటూ ఉంటారు, అటువంటివారి పదవి ఏమవుతుంది. కొంతమంది కుమార్తెలైతే వికారాల కారణముగా దెబ్బలు కూడా తింటారు. ఏమంటారంటే - బాబా, ఈ దుఃఖాన్ని కాస్త సహనము చేసేస్తాను, నా ప్రియుడైతే బాబాయే కదా, దెబ్బలు తింటున్నప్పుడు కూడా నేను శివబాబాను స్మృతి చేస్తాను. అటువంటివారు చాలా సంతోషములో ఉంటారు. ఈ అపారమైన సంతోషములో ఉండాలి. తండ్రి నుండి మనము వారసత్వాన్ని తీసుకుంటున్నాము, ఇతరులను కూడా మనము మన సమానముగా తయారుచేస్తూ ఉంటాము.

బాబా బుద్ధిలోనైతే ఈ మెట్ల వరుస చిత్రము బాగా ఉంటుంది. దీనికి వారు చాలా మహత్వాన్ని ఇస్తారు. ఏ పిల్లలైతే విచార సాగర మంథనము చేసి ఇటువంటి చిత్రాలను తయారుచేస్తారో, బాబా కూడా అటువంటివారికి ధన్యవాదాలను తెలియజేస్తారు లేదా బాబా ఆ పిల్లలను టచ్ చేసారని అంటారు. మెట్ల వరుస చిత్రాన్ని చాలా బాగా తయారుచేసారు. 84 జన్మలను తెలుసుకోవడముతో మొత్తం సృష్టి ఆదిమధ్యాంతాలను తెలుసుకున్నారు. ఇది ఫస్ట్ క్లాస్ చిత్రము. త్రిమూర్తి, సృష్టి చక్రము యొక్క చిత్రాల కన్నా కూడా ఇందులో జ్ఞానము బాగుంది. ఇప్పుడు మనము ఎక్కుతూ ఉన్నాము. ఇది ఎంత సహజము. బాబా వచ్చి లిఫ్ట్ ఇస్తారు. శాంతిగా తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నారు. మెట్ల వరుస చిత్రములోని జ్ఞానము చాలా బాగుంటుంది. మీరు హిందువులు కారు, మీరు దేవీ-దేవతా ధర్మానికి చెందినవారు అని అర్థం చేయించాలి. మేము 84 జన్మలను తీసుకోలేదని ఒకవేళ వారు అంటే మీరు ఇలా చెప్పండి - అరే, మీరు 84 జన్మలు తీసుకున్నారని ఎందుకు నమ్మటము లేదు, మళ్ళీ స్మృతి చేసినట్లయితే మీరు మళ్ళీ మొదటి నంబరులోకి వచ్చేస్తారు అని. మన కులానికి చెందినవారైతే, అందరూ 84 జన్మలను తీసుకుంటారా అని ప్రశ్నించరు. అరే, మేము ఆలస్యముగా వచ్చామని మీరెందుకు అనుకుంటున్నారు. తండ్రి పిల్లలందరికీ చెప్తున్నారు - భారతవాసులైన మీరు 84 జన్మలు తీసుకున్నారు, ఇప్పుడు మళ్ళీ మీ వారసత్వాన్ని తీసుకోండి, స్వర్గములోకి పదండి. పిల్లలైన మీరు యోగములో కూర్చున్నప్పుడు, మెట్ల వరుస చిత్రాన్ని గుర్తు చేసుకున్నట్లయితే చాలా ఆనందముగా ఉంటారు. మనము 84 జన్మలను పూర్తి చేసాము, ఇప్పుడు మనము తిరిగి వెళ్తాము. ఎంత సంతోషము కలుగుతుంది. సేవ చేయడానికి కూడా ఉల్లాసము ఉండాలి. అర్థం చేయించే పద్ధతులు కూడా చాలా లభిస్తున్నాయి. మెట్ల వరుస చిత్రము గురించి అర్థం చేయించండి. చిత్రాలైతే అన్నీ కావాలి కదా. త్రిమూర్తి చిత్రము కూడా కావాలి. బాబా అంటారు కూడా - మీరు నా భక్తుల వద్దకు వెళ్ళండి, వారికి ఈ జ్ఞానాన్ని వినిపించండి, వారు మందిరాల్లోనే దొరుకుతారు. మందిరాల్లో కూడా ఈ మెట్ల వరుస చిత్రముపై అర్థం చేయించవచ్చు. మేము బాబా పరిచయాన్ని ఇవ్వాలి, ఇతరుల కళ్యాణాన్ని చేయాలి అని రోజంతా బుద్ధిలో ఉండాలి. రోజురోజుకు బుద్ధి తాళము తెరుచుకుంటూ ఉంటుంది. ఎవరైతే వారసత్వాన్ని పొందవలసి ఉంటుందో, వారు వస్తారు. రోజురోజుకు నేర్చుకుంటూ కూడా ఉంటారు. కొంతమందిపై గ్రహచారము కూర్చుంటుంది, అప్పుడు బాబా వారికి అర్థం చేయించవలసి ఉంటుంది. మాపై గ్రహచారము ఉంది, అందుకే మా ద్వారా సేవ జరగడము లేదు అని వారు అర్థం చేసుకోరు. మొత్తము బాధ్యత అంతా పిల్లలైన మీపై ఉంది. మీ సమానముగా బ్రాహ్మణులుగా తయారుచేస్తూ ఉండండి. సేవలో ఉన్నట్లయితే చాలా సంతోషము కలుగుతుంది. అనేకుల కళ్యాణము జరుగుతుంది. బాబాకు బొంబాయిలో సేవ చేసేటప్పుడు చాలా ఆనందము కలిగేది, చాలామంది కొత్త-కొత్తవారు వచ్చేవారు. బాబాకైతే సేవ చేయాలని చాలా మనసు కలిగేది. పిల్లలు కూడా ఈ విధముగా దయార్ద్ర హృదయులుగా అవ్వాలి. సేవలో నిమగ్నమైపోవాలి. మనసులో ఎలా ఉండాలంటే, ఎప్పటివరకైతే ఎవరినైనా నా సమానముగా తయారుచేయనో అప్పటివరకు భోజనము చేయకూడదు, ముందు నేను పుణ్య కర్మనైతే చేయాలి కదా. పాపాత్మను పుణ్యాత్మగా తయారుచేసిన తర్వాతనే రోటీ తినాలి. కనుక సేవలో నిమగ్నమై ఉండాలి. ఎవరి జీవితాన్ని అయినా సఫలము చేసిన తర్వాతనే రోటి తినాలి. తమ సమానముగా బ్రాహ్మణులుగా తయారుచేసే ప్రయత్నము చేయాలి.

పిల్లల కోసం మ్యాగజీన్ వెలువడుతుంది కానీ బి.కె.లు అంతగా చదవరు. ఇది మేము చదవనవసరము లేదు, ఇది బయట వారి కోసమని భావిస్తారు. బాబా అంటారు - బయటివారైతే టీచర్ లేకుండా ఏమీ అర్థం చేసుకోలేరు. ఇది బ్రహ్మాకుమార, కుమారీలైన మీరు చదివి రిఫ్రెష్ అవ్వడము కోసముంది. కానీ పిల్లలు చదవరు. అన్ని సెంటర్లవారిని బాబా అడుగుతారు - మ్యాగజీన్ ను పూర్తిగా ఎవరు చదువుతున్నారు, మ్యాగజీన్ నుండి ఏమి అర్థం చేసుకుంటున్నారు, అది ఎంతవరకు సరిగ్గా ఉంటుంది. మ్యాగజీన్ తయారుచేసేవారిని కూడా మెచ్చుకోవాలి - మీరు చాలా మంచి మ్యాగజీన్ వ్రాసారు, మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. కృషి చేయాలి, మ్యాగజీన్ చదవాలి. ఇవి పిల్లలు రిఫ్రెష్ అవ్వడము కోసమున్నాయి కానీ పిల్లలు చదవరు. ఎవరి పేరైతే ప్రఖ్యాతమవుతుందో, వారిని అందరూ పిలుస్తారు - బాబా, భాషణ చేయడానికి ఫలానా వారిని మా వద్దకు పంపించండి అని. బాబా అనుకుంటారు - స్వయానికి భాషణ చేయడము రాదు, అందుకే అడుగుతున్నారు అని. కావున సర్వీసబుల్ గా ఉన్నవారికి ఎంత గౌరవము ఇవ్వాలి. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. రాజ్యాధికారము యొక్క మెడల్ ను తీసుకునేందుకు అందరి హృదయాలను సంతోషపరచాలి. చాలా-చాలా దయార్ద్ర హృదయులుగా అయి తమ కళ్యాణాన్ని మరియు సర్వుల కళ్యాణాన్ని చేయాలి. కష్టపడి ఎముక ఎముకను సేవలో పెట్టాలి.

2. దేహాభిమానములోకి వచ్చి డిస్సర్వీస్ చేయకూడదు. సదా పుణ్య కార్యాలే చేయాలి. తమ సమానముగా బ్రాహ్మణులుగా తయారుచేసే సేవను చేయాలి. సర్వీసబుల్ గా ఉన్నవారికి గౌరవము ఇవ్వాలి.

వరదానము:-
మనన శక్తి ద్వారా వేస్ట్ యొక్క వెయిట్ (వ్యర్థము యొక్క బరువును) సమాప్తము చేసే సదా శక్తిశాలి భవ

ఆత్మపై వ్యర్థము యొక్క బరువే ఉంది. వ్యర్థ సంకల్పాలు, వ్యర్థ వాణి, వ్యర్థ కర్మలు, వీటి వలన ఆత్మ బరువెక్కిపోతుంది. ఇప్పుడు ఈ బరువును సమాప్తము చేయండి. ఈ బరువును సమాప్తము చేయడానికి సదా సేవలో బిజీగా ఉండండి, మనన శక్తిని పెంచండి. మనన శక్తితో ఆత్మ శక్తిశాలిగా అవుతుంది. ఏ విధముగా భోజనము జీర్ణము అయిన తర్వాత రక్తముగా మారుతుందో, ఆ తర్వాత అది శక్తిలా పని చేస్తుందో, అదే విధముగా మననము చేయడము ద్వారా ఆత్మ శక్తి పెరుగుతుంది.

స్లోగన్:-
ఎవరైతే తమ స్వభావాన్ని సరళము చేసుకుంటారో, వారి సమయము వ్యర్థముగా పోదు.

అవ్యక్త సూచనలు - ‘‘నిశ్చయమనే పునాదిని దృఢముగా చేసుకుని సదా నిర్భయులుగా మరియు నిశ్చింతగా ఉండండి’’

ఎవరైతే నిశ్చియబుద్ధి కలవారిగా ఉంటారో వారు నిశ్చింతగా ఉంటారు, వారికి ఏ విధమైన చింతన లేక చింత ఉండదు. ‘‘ఏమి అయ్యింది? ఎందుకు అయ్యింది? ఇలా అవ్వకుండా ఉండి ఉంటే’’ - ఇది వ్యర్థ చింతన. నిశ్చయబుద్ధి కలవారు నిశ్చింతగా ఉంటారు, వారు ఎప్పుడూ వ్యర్థ చింతన చెయ్యరు. సదా స్వచింతనలో ఉండేవారు స్వస్థితి ద్వారా పరిస్థితిపై విజయాన్ని ప్రాప్తి చేసుకుంటారు.