02-04-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - ఈ పాత పతిత ప్రపంచముపై మీకు అనంతమైన వైరాగ్యము ఉండాలి ఎందుకంటే మీరు పావనముగా అవ్వాలి, మీ ఎక్కే కళతో మీ కారణముగా సర్వులకు మేలు జరుగుతుంది’’

ప్రశ్న:-
ఆత్మ తనకు తానే శత్రువు, తనకు తానే మిత్రుడు అని అనడము జరుగుతుంది, సత్యమైన మిత్రత ఏది?

జవాబు:-
ఒక్క తండ్రి శ్రీమతముపై సదా నడుచుకుంటూ ఉండటము - ఇదే సత్యమైన మిత్రత. సత్యమైన మిత్రత అంటే, ఒక్క తండ్రిని స్మృతి చేస్తూ పావనముగా అవ్వడము మరియు తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవడము. ఈ మిత్రత చేసే యుక్తిని తండ్రియే తెలియజేస్తారు. సంగమయుగములో మాత్రమే ఆత్మ తనకు తాను మిత్రునిగా అవుతుంది.

పాట:-
నీవు నిద్రించి రాత్రిని పోగొట్టుకున్నావు...

ఓంశాంతి
నిజానికి ఈ పాట భక్తి మార్గానికి చెందినది, పూర్తి ప్రపంచములో ఏవైతే పాటలు పాడుతున్నారో లేక శాస్త్రాలు చదువుతున్నారో, తీర్థ యాత్రలు చేస్తున్నారో, అవన్నీ భక్తి మార్గము. జ్ఞాన మార్గమని దేనినంటారు, భక్తి మార్గమని దేనినంటారు, ఇది పిల్లలైన మీరు మాత్రమే అర్థం చేసుకుంటారు. వేద-శాస్త్రాలు, ఉపనిషత్తులు మొదలైనవన్నీ భక్తికి చెందినవి. అర్ధకల్పము భక్తి నడుస్తుంది, తర్వాత అర్ధకల్పము జ్ఞాన ప్రారబ్ధము నడుస్తుంది. భక్తి చేస్తూ-చేస్తూ కిందకు దిగాల్సిందే. 84 పునర్జన్మలు తీసుకుంటూ కిందకు దిగుతారు. తర్వాత ఒక్క జన్మలో మీది ఎక్కే కళ అవుతుంది. దీనిని జ్ఞాన మార్గమని అంటారు. ఒక్క సెకండులోనే జీవన్ముక్తి అని జ్ఞానము విషయములో అంటూ ఉంటారు. రావణ రాజ్యము ఏదైతే ద్వాపరము నుండి నడుస్తూ వచ్చిందో, అది సమాప్తమై మళ్ళీ రామ రాజ్యము స్థాపనవుతుంది. డ్రామాలో ఎప్పుడైతే మీ 84 జన్మలు పూర్తి అవుతాయో, అప్పుడు ఎక్కే కళ ద్వారా అందరికీ మేలు జరుగుతుంది. కొన్ని శాస్త్రాలలో ఈ పదాలు అక్కడక్కడ ఉన్నాయి. ఎక్కే కళ ద్వారా అందరికీ మేలు జరుగుతుంది. సర్వులకు సద్గతిని ఇచ్చేవారైతే ఒక్క తండ్రి మాత్రమే కదా. సన్యాసులు మొదలైనవారైతే అనేక రకాల వారు ఉన్నారు. అనేక మత-మతాంతరాలు ఉన్నాయి. కల్పము ఆయువు లక్షల సంవత్సరాలని శాస్త్రాలలో వ్రాసి ఉంది, కానీ 10 వేల సంవత్సరాలని ఇప్పుడు శంకరాచార్యుని మతము వెలువడింది... ఎంత వ్యత్యాసమైపోతుంది. ఇన్ని వేలని ఇంకొకరు చెప్తారు. కలియుగములో అనేకమంది మనుష్యులు ఉన్నారు, అనేక మతాలు, అనేక ధర్మాలు ఉన్నాయి. సత్యయుగములో ఒకే మతము ఉంటుంది. ఈ తండ్రి కూర్చుని పిల్లలైన మీకు సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానము వినిపిస్తున్నారు. ఇది వినిపించడానికి కూడా ఎంత సమయము పడుతుంది. వినిపిస్తూనే ఉంటారు. ముందే ఇదంతా ఎందుకు వినిపించలేదని అనడానికి లేదు. స్కూల్లో చదువు నంబరువారుగా ఉంటుంది. చిన్న పిల్లలకు ఇంద్రియాలు చిన్నవిగా ఉంటాయి కనుక వారికి కొద్దిగానే నేర్పిస్తారు. తర్వాత ఇంద్రియాలు పెద్దవిగా అయ్యే కొద్దీ బుద్ధికి వేయబడిన తాళము తెరచుకుంటూ ఉంటుంది. చదువును ధారణ చేస్తూ ఉంటారు. చిన్న పిల్లల బుద్ధిలో ఏదీ ధారణ అవ్వదు. పెద్దవారైన తర్వాత బ్యారిస్టర్లు, జడ్జి మొదలైనవారిగా అవుతారు. ఇందులో కూడా అలాగే ఉంటుంది. కొందరి బుద్ధిలో ధారణ బాగా అవుతుంది. తండ్రి చెప్తున్నారు - నేను పతితము నుండి పావనముగా తయారుచేయడానికి వచ్చాను. కావున ఇప్పుడు పతిత ప్రపంచముపై వైరాగ్యము ఉండాలి. ఆత్మ పావనముగా అయితే ఇక పతిత ప్రపంచములో ఉండలేదు. పతిత ప్రపంచములో ఆత్మ కూడా పతితముగా ఉంది, మనుష్యులు కూడా పతితముగా ఉన్నారు. పావన ప్రపంచములో మనుష్యులు కూడా పావనముగా ఉంటారు, పతిత ప్రపంచములో మనుష్యులు కూడా పతితముగా ఉంటారు. ఇది ఉన్నదే రావణ రాజ్యము. యథా రాజా-రాణి తథా ప్రజా. ఈ జ్ఞానమంతా బుద్ధి ద్వారా అర్థము చేసుకోవలసినది. ఈ సమయములో అందరికీ తండ్రి పట్ల విపరీత బుద్ధి ఉంది. పిల్లలైన మీరైతే తండ్రిని స్మృతి చేస్తారు. లోపల తండ్రి పట్ల ప్రేమ ఉంది. ఆత్మలో తండ్రి పట్ల ప్రేమ ఉంది, గౌరవము ఉంది ఎందుకంటే తండ్రి గురించి తెలుసుకుంది. ఇక్కడ మీరు సమ్ముఖములో ఉన్నారు. శివబాబా నుండి వింటున్నారు. వారు మనుష్య సృష్టికి బీజరూపుడు, జ్ఞానసాగరుడు, ప్రేమసాగరుడు, ఆనంద సాగరుడు. గీతా జ్ఞానదాత పరమపిత త్రిమూర్తి శివ పరమాత్మ ఉవాచ. త్రిమూర్తి అన్న పదాన్ని తప్పకుండా వేయాలి ఎందుకంటే త్రిమూర్తి యొక్క గాయనముంది కదా. బ్రహ్మా ద్వారా స్థాపన కావున తప్పకుండా బ్రహ్మా ద్వారానే జ్ఞానము వినిపిస్తారు. శ్రీకృష్ణుడు ఎప్పుడూ శివ భగవానువాచ అని అనరు. ప్రేరణ ద్వారా ఏమీ జరగదు. అలాగే శ్రీకృష్ణుని తనువులో శివబాబా ప్రవేశము జరగదు. శివబాబా అయితే పరాయి దేశములోకి వస్తారు. సత్యయుగమైతే శ్రీకృష్ణుని దేశము కదా. కనుక ఇరువురి మహిమ వేర్వేరు. ముఖ్యమైన విషయము ఇదే.

సత్యయుగములో గీతను ఎవరూ చదవరు. భక్తి మార్గములోనైతే జన్మ-జన్మాంతరాలు చదువుతారు. జ్ఞాన మార్గములోనైతే అలా జరగదు. భక్తి మార్గములో జ్ఞాన విషయాలు ఉండవు. ఇప్పుడు రచయిత అయిన తండ్రియే రచన యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని ఇస్తారు. మనుష్యులు రచయితగా అవ్వలేరు. నేను రచయితను అని మనుష్యులు చెప్పలేరు. తండ్రి స్వయంగా చెప్తున్నారు - నేను మనుష్య సృష్టికి బీజరూపుడను. నేను జ్ఞాన సాగరుడను, ప్రేమ సాగరుడను, సర్వుల సద్గతిదాతను. శ్రీకృష్ణుని మహిమ వేరు. ఈ విధముగా ఇరువురికి గల పూర్తి వ్యత్యాసాన్ని వ్రాయాలి. దానిని చదివిన వెంటనే మనుష్యులు అర్థము చేసుకోవాలి - గీతా జ్ఞానదాత శ్రీకృష్ణుడు కాదు. ఈ మాటను అంగీకరిస్తే మీరు విజయులుగా అయినట్లు. మనుష్యులు శ్రీకృష్ణుని కోసం ఎంతగా తపిస్తారు. శివుని భక్తులు, శివుని కోసం శిరస్సు ఖండించుకోవడానికి సిద్ధమైపోతారు, మేము ఇక శివుని వద్దకు వెళ్ళిపోవాలి అని కోరుకుంటారు. అలాగే వాళ్ళు శ్రీకృష్ణుని వద్దకు చేరుకోవాలని అనుకుంటారు కానీ శ్రీకృష్ణుని వద్దకు చేరుకోలేరు. శ్రీకృష్ణుని విషయములో బలి అయ్యే మాట ఉండదు. దేవీలపై బలి అవుతారు. దేవతలపై ఎప్పుడూ ఎవరూ బలి అవ్వరు. మీరు దేవీలు కదా. మీరు శివబాబాకు చెందినవారిగా అయ్యారు కనుక శివబాబాపై కూడా బలి అవుతారు. శాస్త్రాలలో హింసాత్మక విషయాలను వ్రాసేశారు. మీరైతే శివబాబా పిల్లలు. తనువు, మనసు, ధనములను బలి ఇస్తారు, వేరే విషయమేదీ లేదు, అందుకే శివుడు మరియు దేవీలపై బలి ఇస్తారు. ఇప్పుడు ప్రభుత్వము వారు శివకాశీలో (కాశిలో ఉన్న కత్తుల బావిలో) బలి ఇవ్వడాన్ని రద్దు చేశారు. ఇప్పుడు ఆ కత్తులే లేవు. భక్తి మార్గములో ఏదైతే ఆత్మహత్య చేసుకుంటారో, అది తమ పట్ల తాము శత్రుత్వము చూపించుకునే ఒక ప్రక్రియ. తమకు తాము మిత్రులుగా అయ్యేందుకు ఒకే ఒక ఉపాయము ఉంది, దానిని తండ్రి తెలియజేస్తున్నారు, అదేమిటంటే - పావనముగా అయి తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోండి. ఒక్క తండ్రి శ్రీమతముపై నడుస్తూ ఉండండి, ఇదే మిత్రత. జీవాత్మ తనకు తానే శత్రువు అని అంటారు. మళ్ళీ తండ్రి వచ్చి జ్ఞానాన్ని ఇచ్చినప్పుడు జీవాత్మ తనకు తాను మిత్రునిగా అవుతుంది. ఆత్మ పవిత్రముగా అయి తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటుంది. సంగమయుగములో ప్రతి ఆత్మను తండ్రి వచ్చి తనకు తాను మిత్రునిగా అయ్యేలా తయారుచేస్తారు. ఆత్మ తనకు తాను మిత్రునిగా అవుతుంది. శ్రీమతము లభించినప్పుడు నేను తండ్రి మతముపైనే నడుస్తాను అని ఆత్మ భావిస్తుంది. తమ సొంత మతముపై అర్ధకల్పము నడుచుకున్నారు. ఇప్పుడు శ్రీమతము ఆధారముగా సద్గతిని పొందాలి, ఇందులో తమ సొంత మతము నడవదు. తండ్రి కేవలం తన మతాన్ని ఇస్తారు. మీరు దేవతలుగా అయ్యేందుకు వచ్చారు కదా. ఇక్కడ మంచి కర్మలు చేస్తే మరుసటి జన్మలో కూడా అనగా అమరలోకములో మంచి ఫలము లభిస్తుంది. ఇది ఉన్నదే మృత్యులోకము. ఈ రహస్యము కూడా పిల్లలైన మీకు మాత్రమే తెలుసు, అది కూడా నంబరువారుగా. కొందరి బుద్ధిలో బాగా ధారణ అవుతుంది, కొందరు ధారణ చేయలేకపోతే, అందులో టీచరు ఏం చేయగలరు. టీచరు నుండి కృప లేక ఆశీర్వాదాన్ని వేడుకుంటారా? టీచరు అయితే చదివించి తన ఇంటికి వెళ్ళిపోతారు. స్కూలుకు వచ్చి మొట్టమొదట భగవంతుని ప్రార్థనను చేస్తారు - ఓ భగవంతుడా, మమ్మల్ని పాస్ చేయిస్తే మేము నైవేద్యము అర్పిస్తాము. టీచరును ఎప్పుడూ ఆశీర్వదించండి అని అడగరు. ఈ సమయములో పరమాత్మ మన తండ్రి కూడా, అలాగే టీచరు కూడా. తండ్రి ఆశీర్వాదము అయితే తప్పకుండా ఉండనే ఉంది. తండ్రి పిల్లలు పుట్టాలని కోరుకుంటాడు, బిడ్డ పుడితే అతడికి ధనమివ్వాలని కోరుకుంటాడు. మరి ఇది ఆశీర్వాదమే కదా. ఇది ఒక నియమము. పిల్లలకు తండ్రి నుండి వారసత్వము లభిస్తుంది. ఇప్పుడు ఇక తమోప్రధానముగానే అవుతూ ఉంటారు. ఎటువంటి తండ్రో, అటువంటి పిల్లలు. రోజురోజుకూ ప్రతి వస్తువు తమోప్రధానమవుతూ ఉంటుంది. తత్వాలు కూడా తమోప్రధానముగానే అవుతూ ఉంటాయి. ఇది ఉన్నదే దుఃఖధామము. ఇంకా 40 వేల సంవత్సరాలు ఆయువు ఉంటే ఇక పరిస్థితి ఎలా ఉంటుంది. మనుష్యుల బుద్ధి పూర్తిగా తమోప్రధానమైపోయింది.

ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలోకి తండ్రితో యోగాన్ని జోడించినందుకు ప్రకాశము వచ్చింది. తండ్రి అంటారు, ఎంతగా స్మృతిలో ఉంటారో అంతగా ప్రకాశము పెరుగుతూ ఉంటుంది. స్మృతి ద్వారా ఆత్మ పవిత్రముగా అవుతుంది. ప్రకాశము పెరుగుతూ ఉంటుంది. స్మృతే చేయకపోతే ప్రకాశము లభించదు. స్మృతి ద్వారా ప్రకాశము వృద్ధి చెందుతుంది. స్మృతి చేయకుండా ఏదైనా వికర్మ చేసినట్లయితే, ప్రకాశము తగ్గిపోతుంది. మీరు సతోప్రధానముగా అయ్యేందుకు పురుషార్థము చేస్తారు. ఇవి బాగా అర్థము చేసుకునే విషయాలు. స్మృతి ద్వారానే మీ ఆత్మ పవిత్రముగా అవుతూ ఉంటుంది. ఈ రచయిత మరియు రచనల జ్ఞానాన్ని శ్రీకృష్ణుడు ఇవ్వలేరు అని మీరు వ్రాయవచ్చు కూడా. అతనిది ప్రారబ్ధము. 84వ చివరి జన్మలో కృష్ణుని ఆత్మ మళ్ళీ జ్ఞానము తీసుకుంటూ ఉందని, మళ్ళీ ఫస్టు నంబరులో వస్తుందని కూడా వ్రాయాలి. తండ్రి ఇది కూడా అర్థము చేయించారు - సత్యయుగములో జనాభా 9 లక్షలు మాత్రమే ఉంటుంది, తర్వాత వారి ద్వారా వృద్ధి కూడా జరుగుతుంది కదా. పూర్తి 84 జన్మలు తీసుకునే దాస-దాసీలు కూడా చాలా మంది ఉంటారు కదా. లెక్క 84 జన్మలదే. ఎవరైతే పరీక్షలో బాగా పాస్ అవుతారో వారు మొట్టమొదట వస్తారు. ఎంత ఆలస్యముగా వెళ్తారో అంతగా ఇంటిని పాతదని అంటారు కదా. కొత్త ఇల్లు తయారైన తర్వాత ఇక రోజురోజుకూ దాని ఆయువు తగ్గుతూ వస్తుంది. అక్కడైతే బంగారు మహళ్ళు తయారవుతాయి, అవి పాతవిగా అవ్వవు. బంగారము సదా మెరుస్తూనే ఉంటుంది. అయినా తప్పకుండా శుభ్రము చేయాల్సి వస్తుంది. నగలు కూడా మేలిమి బంగారముతో తయారుచేసినా, చివరికి మెరుపైతే తగ్గుతుంది, తిరిగి వాటిని పాలీష్ చేయాలి. పిల్లలైన మీకు సదా - మేము కొత్త ప్రపంచములోకి వెళ్తాము అన్న ఈ సంతోషము ఉండాలి. ఈ నరకములో ఇది అంతిమ జన్మ. ఈ కనులతో ఏదైతే చూస్తున్నారో, ఇదంతా పాత ప్రపంచము, పాత శరీరము అని తెలుసు. ఇప్పుడు మనము సత్యయుగ కొత్త ప్రపంచములో కొత్త శరీరాన్ని తీసుకోవాలి. పంచ తత్వాలు కూడా కొత్తవిగా ఉంటాయి. ఇలా విచార సాగర మంథనము నడవాలి. ఇది చదువు కదా. చివరి వరకు మీ ఈ చదువు నడుస్తూనే ఉంటుంది. చదువు సమాప్తమైతే ఇక వినాశనమైపోతుంది. కావున స్వయాన్ని విద్యార్థిగా భావిస్తూ - భగవంతుడు మమ్మల్ని చదివిస్తున్నారు అన్న ఈ సంతోషములో ఉండాలి కదా. ఈ సంతోషము తక్కువైనదేమీ కాదు. కానీ దానితో పాటు మాయ కూడా తప్పుడు కర్మలు చేయిస్తుంది. 5-6 సంవత్సరాలు పవిత్రముగా ఉంటారు, తర్వాత మాయ కింద పడేస్తుంది. ఒక్కసారి పడిపోయిన తర్వాత ఇక మళ్ళీ ఆ అవస్థ రాదు. మేము పడిపోయాము అని అసహ్యము కలుగుతుంది. ఇప్పుడు పిల్లలైన మీరు అంతా గుర్తుంచుకోవాలి. ఈ జన్మలో ఏవైతే పాపాలు చేసారో, ప్రతి ఆత్మకు తన జీవితము గురించి అయితే తెలుసు కదా. కొందరు మందబుద్ధి కలవారిగా, కొందరు విశాల బుద్ధి కలవారిగా ఉంటారు. చిన్నతనపు చరిత్ర గుర్తు అయితే ఉంటుంది కదా. ఈ బాబా కూడా తమ చిన్ననాటి చరిత్రను వినిపిస్తారు కదా. బాబాకు ఆ ఇల్లు మొదలైనవి కూడా గుర్తున్నాయి. కానీ ఇప్పుడైతే అక్కడ కూడా అన్నీ కొత్త ఇళ్ళు తయారై ఉంటాయి. 6 సంవత్సరాల వయసు నుండి తమ జీవిత కథ జ్ఞాపకముంటుంది. ఒకవేళ మర్చిపోతే మందబుద్ధి అని అంటారు. తండ్రి చెప్తున్నారు - మీ జీవిత కథను వ్రాయండి. జీవితానికి సంబంధించిన విషయము కదా. జీవితములో ఎన్ని చమత్కారాలు జరిగాయే తెలుస్తుంది. గాంధీ, నెహ్రూ మొదలైనవారి జీవిత కథలు ఎంత పెద్ద-పెద్ద పుస్తకాలుగా తయారయ్యాయి. వాస్తవానికి మీ జీవితము చాలా అమూల్యమైనది. అద్భుతమైన జీవితము ఇదే. ఇది అత్యంత విలువైన, అమూల్యమైన జీవితము. దీని విలువను వర్ణించలేము. ఈ సమయములో మీరే సేవ చేస్తారు. ఈ లక్ష్మీ-నారాయణులు ఏ సేవా చేయరు. మీ జీవితము ఎంతో విలువైనది ఎందుకంటే మీరు ఇతరుల జీవితాన్ని కూడా ఈ విధంగా తయారుచేసే సేవ చేస్తారు. ఎవరైతే బాగా సేవ చేస్తారో వారు మహిమా యోగ్యులుగా అవుతారు. వైష్ణవ దేవీ మందిరము కూడా ఉంది కదా. ఇప్పుడు మీరు సత్యాతి-సత్యమైన వైష్ణవులుగా అవుతారు. వైష్ణవులు అనగా పవిత్రమైనవారు. ఇప్పుడు మీ ఆహార-పానీయాలు కూడా వైష్ణవముగా (పవిత్రముగా) ఉన్నాయి. మొదటి నంబరు వికారము విషయములోనైతే మీరు ఎలాగూ వైష్ణవులే (పవిత్రులే). జగదంబ పిల్లలైన వీరంతా బ్రహ్మాకుమార-కుమారీలే కదా. బ్రహ్మా మరియు సరస్వతి. మిగిలిన పిల్లలంతా వారి సంతానము. నంబరువారుగా దేవీలు కూడా ఉన్నారు, వారి పూజ జరుగుతుంది. అయితే వారికి అనేక భుజాలు మొదలైనవేవైతే చూపించారో, అవన్నీ అనవసరము. మీరు చాలామందిని మీ సమానముగా తయారుచేస్తారు కావున అన్ని భుజాలను చూపించారు. బ్రహ్మాను కూడా 100 భుజాలు కలవారిగా, వేయి భుజాలు కలవారిగా చూపిస్తారు. అవన్నీ భక్తి మార్గములోని విషయాలు. మీకు తండ్రి చెప్తున్నారు, దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి. ఎవరికీ దుఃఖమునివ్వకండి. ఎవరికీ కూడా తప్పుడు మార్గము చెప్పి సర్వనాశనము చేయకండి. ఒకటే ముఖ్యమైన విషయాన్ని తెలియజేయాలి - తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి. అచ్ఛా.

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. గాయన యోగ్యులుగా లేక పూజకు యోగ్యులుగా అయ్యేందుకు పక్కా వైష్ణవులుగా అవ్వాలి. ఆహార-పానీయాల శుద్ధతతో పాటు పవిత్రముగా ఉండాలి. ఈ విలువైన జీవితములో సేవ చేసి అనేకుల జీవితాలను శ్రేష్ఠముగా చేయాలి.

2. తండ్రితో యోగాన్ని ఎలా జోడించాలంటే, దానితో ఆత్మ యొక్క ప్రకాశము పెరుగుతూ వెళ్ళాలి. ఏ వికర్మలూ చేసి ప్రకాశాన్ని తగ్గించుకోకూడదు. మీకు మీరు మిత్రులుగా అవ్వాలి.

వరదానము:-
స్వస్థితి అనే సీటుపై స్థితులై పరిస్థితులపై విజయాన్ని ప్రాప్తి చేసుకునే మాస్టర్ రచయిత భవ

ఏ పరిస్థితి అయినా సరే ప్రకృతి ద్వారా వస్తుంది, అందుకే పరిస్థితి అనేది రచన మరియు స్వస్థితి కలవారు రచయిత. మాస్టర్ రచయితలు లేక మాస్టర్ సర్వశక్తివంతులు ఎప్పుడూ ఓడిపోలేరు, అది అసంభవము. ఒకవేళ ఎవరైనా తమ సీటును వదిలితే ఓడిపోతారు. సీటును వదలడము అనగా శక్తిహీనముగా అవ్వడము. సీటు ఆధారముపై శక్తులు స్వతహాగా వస్తాయి. ఎవరైతే సీటు నుండి కిందకు దిగిపోతారో వారిపై మాయ ధూళి అంటుకుంటుంది. బాప్ దాదాల ప్రియమైన పిల్లలు, మరజీవా జన్మధారులైన బ్రాహ్మణులు ఎప్పుడూ దేహాభిమానపు మట్టిలో ఆడుకోలేరు.

స్లోగన్:-
దృఢత్వము కఠినమైన సంస్కారాలను కూడా మైనము వలే కరిగించివేస్తుంది (సమాప్తము చేసేస్తుంది).

అవ్యక్త సూచనలు - ‘‘కంబైండ్ రూపపు స్మృతి ద్వారా సదా విజయులుగా అవ్వండి’’

ఏ విధంగా జ్ఞాన స్వరూపులుగా అయ్యారో, అలా స్నేహ స్వరూపులుగా అవ్వండి, జ్ఞానము మరియు స్నేహము రెండూ కంబైండ్ గా ఉండాలి, ఎందుకంటే జ్ఞానము బీజము, స్నేహము నీరు. ఒకవేళ బీజానికి నీరు లభించకపోతే అది ఫలము ఇవ్వదు. జ్ఞానముతోపాటు మనస్ఫూర్వకమైన స్నేహము ఉంటే ప్రాప్తి అనే ఫలము లభిస్తుంది.