02-05-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - ఏకాంతములో కూర్చుని మీతో మీరు మాట్లాడుకోండి, నేను అవినాశీ ఆత్మను, తండ్రి నుండి వింటున్నాను, ఈ అభ్యాసము చేయండి’’

ప్రశ్న:-
ఏ పిల్లలైతే స్మృతిలో నిర్లక్ష్యులుగా ఉంటారో, వారి నోటి నుండి ఎటువంటి మాటలు వెలువడుతాయి?

జవాబు:-
వారంటారు - మేము ఎలాగూ శివబాబా పిల్లలమే. స్మృతిలోనే ఉన్నాము. కానీ బాబా అంటారు - అవన్నీ ప్రగల్భాలు, అది నిర్లక్ష్యము. ఇందులోనైతే పురుషార్థము చేయాలి, ఉదయమే లేచి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ కూర్చోవాలి. ఆత్మిక సంభాషణ చేయాలి. ఆత్మయే మాట్లాడుతుంది, ఇప్పుడు మీరు దేహీ-అభిమానులుగా అవుతారు. దేహీ-అభిమానులైన పిల్లలే స్మృతి యొక్క చార్టును పెట్టుకుంటారు, కేవలం జ్ఞానపు గొప్పలే మాట్లాడుతూ ఉండరు.

పాట:-
ముఖాన్ని చూసుకో ఓ ప్రాణీ...

ఓంశాంతి
ఆత్మిక పిల్లలకు అర్థం చేయించడం జరిగింది - ప్రాణము అని ఆత్మను అనడము జరుగుతుంది. ఇప్పుడు తండ్రి ఆత్మలకు అర్థం చేయిస్తారు, ఈ పాట అయితే భక్తి మార్గానికి చెందినది. ఇక్కడ కేవలం దీని సారాన్ని అర్థం చేయించడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు స్వయాన్ని ఆత్మగా భావించండి. దేహ భానాన్ని వదిలేయాలి. ఆత్మనైన నేను చాలా చిన్నని బిందువును. నేనే ఈ శరీరము ద్వారా పాత్రను అభినయిస్తాను. ఈ ఆత్మ జ్ఞానము ఎవరికీ లేదు. తండ్రి అర్థం చేయిస్తారు, స్వయాన్ని ఆత్మగా భావించండి - నేను చిన్నని ఆత్మను, ఆత్మయే ఈ శరీరము ద్వారా మొత్తం పాత్రనంతటినీ అభినయిస్తుంది, తద్వారా దేహాభిమానం తొలగిపోతుంది. ఇది శ్రమతో కూడుకున్నది. ఆత్మలమైన మనము ఈ మొత్తము నాటకములోని పాత్రధారులము. ఉన్నతోన్నతమైన పాత్రధారి పరమపిత పరమాత్మ. వారు కూడా ఎంతో చిన్నని బిందువు, కానీ వారి మహిమ ఎంత గొప్పది అన్న విషయము బుద్ధిలో ఉంటుంది. వారు జ్ఞానసాగరుడు, సుఖసాగరుడు. కానీ వారు చిన్నని బిందువు. ఆత్మలమైన మనము కూడా చిన్నని బిందువే. దివ్య దృష్టి లేకుండా ఆత్మను చూడలేరు. ఈ కొత్త-కొత్త విషయాలను ఇప్పుడు మీరు వింటున్నారు. ప్రపంచానికి ఏమి తెలుసు. ఆత్మనైన నేను చిన్న బిందువును అని యథార్థ రీతిలో అర్థం చేసుకునేవారు మరియు బుద్ధిలో ఉంచుకునేవారు మీలో కూడా కొద్దిమందే ఉన్నారు. మన తండ్రి ఈ డ్రామాలో ముఖ్యమైన పాత్రధారి. ఉన్నతోన్నతమైన పాత్రధారి తండ్రి, ఆ తర్వాత ఫలానా-ఫలానావారు వస్తారు. మీకు తెలుసు - తండ్రి జ్ఞానసాగరుడు కానీ శరీరము లేకుండా జ్ఞానాన్ని వినిపించలేరు. శరీరము ద్వారానే మాట్లాడగలరు. అశరీరిగా అయినట్లయితే ఆత్మ నుండి ఇంద్రియాలు వేరైపోతాయి. భక్తి మార్గములోనైతే దేహధారులనే స్మరణ చేస్తారు. పరమపిత పరమాత్మ యొక్క నామ, రూప, దేశ, కాలాల గురించి తెలియదు. కేవలం పరమాత్మ నామ-రూపాలకు అతీతుడు అని అంటారు. తండ్రి అర్థం చేయిస్తారు - డ్రామానుసారంగా మీరు ఎవరైతే నంబరువన్ సతోప్రధానముగా ఉండేవారో, మీరే మళ్ళీ సతోప్రధానముగా అవ్వాలి. తమోప్రధానము నుండి సతోప్రధానముగా అయ్యేందుకు మీరే మళ్ళీ ఈ అవస్థను దృఢంగా చేసుకోవాలి - నేను ఆత్మను, ఆత్మ ఈ శరీరము ద్వారా మాట్లాడుతుంది. ఆత్మలోనే జ్ఞానము ఉంది. ఇంకెవ్వరి బుద్ధిలో కూడా - మన ఆత్మలో 84 జన్మల పాత్ర అవినాశీగా నిశ్చయించబడి ఉంది అన్న జ్ఞానము లేదు. ఇవి చాలా కొత్త-కొత్త పాయింట్లు. ఏకాంతములో కూర్చొని మీతో మీరు ఈ విధంగా మాట్లాడుకోవాలి - నేను ఆత్మను, తండ్రి నుండి వింటున్నాను. ఆత్మనైన నాలో ధారణ జరుగుతుంది. ఆత్మనైన నాలోనే పాత్ర నిండి ఉంది. ఆత్మనైన నేను అవినాశీ. ఈ విషయాలను లోలోపల అభ్యాసం చేయాలి. మనము తమోప్రధానము నుండి సతోప్రధానముగా అవ్వాలి. దేహాభిమానులైన మనుష్యులకు ఆత్మ జ్ఞానము కూడా లేదు, ఎంత పెద్ద-పెద్ద పుస్తకాలను తమ వద్ద పెట్టుకుంటారు. ఎంత అహంకారం ఉంది. ఇది ఉన్నదే తమోప్రధానమైన ప్రపంచము. ఉన్నతోన్నతమైన ఆత్మలు ఎవరూ లేరు. ఇప్పుడు మనము తమోప్రధానము నుండి సతోప్రధానముగా అయ్యే పురుషార్థము చేయాలి అని మీకు తెలుసు. ఈ విషయాన్ని లోలోపల అభ్యాసం చేయాలి. జ్ఞానము వినిపించేవారైతే ఎంతో మంది ఉన్నారు. కానీ స్మృతి లేదు. లోలోపల ఆ అంతర్ముఖత ఉండాలి. మనము తండ్రి స్మృతి ద్వారా పతితుల నుండి పావనులుగా అవ్వాలి, కేవలం పండితులుగా అవ్వకూడదు. దీనికి సంబంధించి ఒక పండితుని ఉదాహరణ కూడా ఉంది - రామ-రామ అంటూ ఉంటే తీరానికి చేరుకుంటారు అని మాతలకు చెప్తారు... కావున ఇలా గొప్పలు చెప్పేవారిగా అవ్వకూడదు. ఇటువంటివారు ఎంతో మంది ఉన్నారు.

అర్థం చేయించడము చాలా బాగా అర్థం చేయిస్తారు, కానీ యోగము లేదు. మొత్తం రోజంతా దేహాభిమానములో ఉంటారు. లేదంటే బాబాకు చార్టు పంపించాలి - నేను ఈ సమయములో మేల్కొంటాను, ఇంత సమయము స్మృతి చేస్తాను అని. కానీ సమాచారమేమీ ఇవ్వరు. జ్ఞానపు విషయాలను ఎంతో గొప్పగా చెప్తూ ఉంటారు. యోగము లేదు. పెద్ద-పెద్దవారికి జ్ఞానము ఇస్తారు, కానీ యోగములో అపరిపక్వంగా ఉన్నారు. ఉదయమే లేచి తండ్రిని స్మృతి చేయాలి. బాబా, మీరు ఎంత అతి ప్రియమైనవారు. ఈ డ్రామా ఎంత విచిత్రంగా తయారుచేయబడి ఉంది. ఈ రహస్యము గురించి ఎవరికీ తెలియదు. ఆత్మ గురించి కానీ, పరమాత్మ గురించి కానీ తెలియదు. ఈ సమయములో మనుష్యులు జంతువుల కన్నా హీనముగా ఉన్నారు. మనము కూడా అలాగే ఉండేవారము. మాయా రాజ్యములో ఎంతటి దుర్దశ ఏర్పడుతుంది. ఈ జ్ఞానాన్ని మీరు ఎవరికైనా ఇవ్వవచ్చు. ఆత్మలైన మీరు ఇప్పుడు తమోప్రధానముగా ఉన్నారు, మీరు సతోప్రధానముగా అవ్వాలి అని చెప్పండి. ముందు స్వయాన్ని ఆత్మగా భావించండి. పేదవారికైతే ఇది ఇంకా సహజము. షావుకారులకు ఎన్నో ఇబ్బందులు ఉంటాయి.

తండ్రి అంటారు - నేను సాధారణ తనువులోకే వస్తాను. చాలా పేదవారు కాదు, చాలా షావుకారు కాదు. ఇప్పుడు మీకు తెలుసు - కల్ప-కల్పమూ తండ్రి వచ్చి పావనముగా ఎలా అవ్వాలి అన్న శిక్షణను మనకు ఇస్తారు. ఇకపోతే మీ వ్యాపార-వ్యవహారాలు మొదలైనవాటిలో ఏవైతే గొడవలు ఉన్నాయో, దాని కోసం బాబా రాలేదు. ఓ పతిత-పావనా రండి అని మాత్రమే మీరు పిలుస్తారు, కావున బాబా పావనముగా అయ్యేందుకు యుక్తిని తెలియజేస్తారు. స్వయంగా ఈ బ్రహ్మాకు కూడా ఏమీ తెలిసేది కాదు. పాత్రధారి అయి ఉండి, డ్రామా యొక్క ఆదిమధ్యాంతాల గురించి తెలియకపోతే వారిని ఏమంటారు. ఆత్మలమైన మనము ఈ సృష్టి చక్రములోని పాత్రధారులము, ఇది కూడా ఎవరికీ తెలియదు. ఆత్మ మూలవతనములో నివసిస్తుంది అని అంటారు కానీ అనుభవముతో చెప్పరు. మీకు ఇప్పుడు ప్రాక్టికల్ గా తెలిసింది - ఆత్మలమైన మనము మూలవతన నివాసులము. ఆత్మలమైన మనము అవినాశీ. ఇదైతే బుద్ధిలో గుర్తుండాలి. చాలా మందికి యోగము అసలు లేదు. దేహాభిమానం కారణంగా మళ్ళీ పొరపాట్లు కూడా చాలా జరుగుతాయి. ముఖ్యమైన విషయమే దేహీ-అభిమానులుగా అవ్వడము. మేము సతోప్రధానముగా అవ్వాలి అన్న చింత ఉండాలి. ఏ పిల్లలకైతే సతోప్రధానముగా అవ్వాలి అన్న తపన ఉంటుందో, వారి నోటి నుండి ఎప్పుడూ రాళ్ళు వెలువడవు. ఏదైనా పొరపాటు జరిగితే వెంటనే తండ్రికి రిపోర్ట్ చేస్తారు (జరిగినది వివరిస్తారు). బాబా, మా ద్వారా ఈ పొరపాటు జరిగింది, క్షమించండి అని. వారు దాచిపెట్టరు. అలా దాచిపెడితే, అది ఇంకా వృద్ధి చెందుతుంది. బాబాకు సమాచారాన్ని ఇస్తూ ఉండండి. మీ యోగము సరిగ్గా లేదు అని బాబా వ్రాస్తారు. పావనముగా అవ్వడమే ముఖ్యమైన విషయము. పిల్లలైన మీ బుద్ధిలో 84 జన్మల కథ ఉంది. ఎంత వీలైతే అంత సతోప్రధానముగా అవ్వాలి అన్న చింతయే ఉండాలి. దేహాభిమానాన్ని విడిచిపెట్టాలి. మీరు రాజఋషులు. హఠయోగులు ఎప్పుడూ రాజయోగాన్ని నేర్పించలేరు. రాజయోగాన్ని తండ్రియే నేర్పిస్తారు. జ్ఞానాన్ని కూడా తండ్రియే ఇస్తారు. ఇకపోతే ఈ సమయములో తమోప్రధానమైన భక్తి ఉంది. జ్ఞానాన్ని తండ్రి కేవలం సంగమములోనే వచ్చి వినిపిస్తారు. తండ్రి వచ్చారు కావున భక్తి సమాప్తమవుతుంది, ఈ ప్రపంచము కూడా సమాప్తమవుతుంది. జ్ఞానము మరియు యోగము ద్వారా సత్యయుగ స్థాపన జరుగుతుంది. భక్తి అనేది పూర్తిగా వేరు. సుఖ-దుఃఖాలు ఇక్కడే ఉంటాయని మనుష్యులు అంటారు. ఇప్పుడు పిల్లలైన మీపై చాలా బాధ్యత ఉంది. తమ కళ్యాణమును చేసుకునే యుక్తిని రచిస్తూ ఉండండి. పావన ప్రపంచము శాంతిధామము మరియు సుఖధామము అని కూడా అర్థం చేయించబడింది. ఇది అశాంతిధామము, దుఃఖధామము. మొట్టమొదట ముఖ్యమైన విషయము - యోగము. యోగము లేకపోతే పండితుని వలె కేవలం జ్ఞానపు ప్రగల్భాలు ఉంటాయి. ఈ రోజుల్లోనైతే మంత్ర-తంత్రాలు కూడా ఎన్నో వెలువడ్డాయి, వీటికి జ్ఞానముతో సంబంధము లేదు. మనుష్యులు ఎంతటి అసత్యములో చిక్కుకొని ఉన్నారు. పతితులుగా ఉన్నారు. తండ్రి స్వయముగా అంటారు - నేను పతిత ప్రపంచములోకి, పతిత శరీరములోకి వస్తాను. పావనమైనవారు ఎవరూ ఇక్కడ లేనే లేరు. వీరైతే స్వయాన్ని భగవంతుడు అని పిలుచుకోరు. వీరంటారు - నేను కూడా పతితుడినే, పావనముగా అయితే ఫరిశ్తాగా అవుతారు. మీరు కూడా పవిత్రమైన ఫరిశ్తాలుగా అవుతారు. కావున ముఖ్యమైన విషయము ఏమిటంటే - మనము పావనముగా ఎలా అవ్వాలి. స్మృతి చాలా అవసరము. ఏ పిల్లలైతే స్మృతిలో నిర్లక్ష్యులుగా ఉంటారో, వారంటారు - మేమైతే శివబాబాకు ఎలాగూ పిల్లలమే. స్మృతిలోనే ఉన్నాము. కానీ బాబా అంటారు - అవన్నీ ప్రగల్భాలు. అది నిర్లక్ష్యము. ఇందులో పురుషార్థము చేయాలి, ఉదయమే లేచి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ కూర్చోవాలి. ఆత్మిక సంభాషణ చేయాలి. ఆత్మయే మాట్లాడుతుంది కదా. ఇప్పుడు మీరు దేహీ-అభిమానులుగా అవుతారు. ఎవరైతే ఇతరుల కళ్యాణం చేస్తారో, వారి మహిమను కూడా చేయడం జరుగుతుంది కదా. అది దేహము యొక్క మహిమ అవుతుంది. ఇదైతే నిరాకార పరమపిత పరమాత్ముని మహిమ. దీనిని కూడా మీరు అర్థం చేసుకుంటారు. ఈ మెట్ల వరుస ఇంకెవ్వరి బుద్ధిలోనూ ఉండదు. మనము 84 జన్మలు ఎలా తీసుకుంటాము, మళ్ళీ కిందకు ఎలా దిగుతూ వస్తాము. ఇప్పుడైతే పాపపు కుండ నిండిపోయింది, అది ఎలా శుభ్రమవ్వాలి? అందుకే తండ్రిని పిలుస్తారు. మీరు పాండవ సాంప్రదాయము కలవారు. ధార్మిక-రాజనీతి మనస్తత్వం కలవారు. బాబా అన్ని ధర్మాలకు సంబంధించిన విషయాల గురించి అర్థం చేయిస్తారు. ఇతరులు ఎవరూ అర్థం చేయించలేరు. ఇకపోతే ఆ ధర్మ స్థాపన చేసేవారు ఏం చేస్తారు, వారి వెనుక ఇతరులు కూడా కిందకు రావలసి వస్తుంది. అంతేకానీ వారు మోక్షాన్ని ఏమైనా ఇస్తారా. తండ్రియే చివర్లో వచ్చి అందరినీ పవిత్రముగా చేసి తిరిగి తీసుకువెళ్తారు, అందుకే వారొక్కరికి తప్ప ఇంకెవ్వరికీ మహిమ లేదు. బ్రహ్మాకు కానీ, మీకు కానీ ఎటువంటి మహిమ లేదు. బాబా రాకపోతే మీరు కూడా ఏం చేస్తారు. ఇప్పుడు తండ్రి మిమ్మల్ని ఎక్కే కళలోకి తీసుకువెళ్తారు. మీ కారణంగా సర్వులకు మేలు జరుగుతుంది అని అంటూ ఉంటారు కూడా. కానీ అర్థాన్ని తెలుసుకోరు. మహిమనైతే ఎంతగానో చేస్తారు.

ఇప్పడు తండ్రి అర్థం చేయించారు - ఆత్మ అకాల్ (మరణము లేనిది), ఇది ఆత్మ యొక్క సింహాసనము. ఆత్మ అవినాశీ. మృత్యువు ఎప్పుడూ కబళించదు. ఆత్మ ఒక శరీరాన్ని వదలి ఇంకొక పాత్రను అభినయించాలి. అంతేకానీ తీసుకువెళ్ళేందుకు కాలుడు ఏమీ రాడు. ఎవరైనా శరీరాన్ని విడిచిపెట్టినా మీకు దుఃఖము కలగదు. శరీరాన్ని వదిలి ఇంకొక పాత్రను అభినయించేందుకు వెళ్ళారు, ఏడవవలసిన అవసరమేముంది. ఆత్మలమైన మనము సోదరులము. ఇది కూడా మీకు ఇప్పుడు తెలుసు. ఆత్మలు పరమాత్మ చాలా కాలం వేరుగా ఉన్నారు... అని అంటూ ఉంటారు. తండ్రి ఎక్కడికి వచ్చి కలుసుకుంటారు. ఇది కూడా తెలియదు. ఇప్పుడు మీకు ప్రతి విషయము గురించి వివరణ లభిస్తుంది. ఎప్పటి నుండో వింటూనే వస్తున్నారు. వీరు పుస్తకాలు మొదలైనవి ఏమైనా చదువుతారా. కేవలం అర్థం చేయించేందుకు రిఫర్ చేస్తారు. తండ్రి సత్యమైనవారు కావున సత్యమైన రచనను రచిస్తారు. సత్యము చెప్తారు. సత్యముతో గెలుపు, అసత్యముతో ఓటమి. సత్యమైన తండ్రి సత్య ఖండాన్ని స్థాపన చేస్తారు. రావణుడితో మీరు చాలా ఓడిపోయారు. ఈ ఆట అంతా తయారుచేయబడి ఉంది. ఇప్పుడు మీకు తెలుసు - మన రాజ్యస్థాపన జరుగుతుంది, ఆ తర్వాత ఇవేవీ ఉండవు. ఇవన్నీ తర్వాత వచ్చాయి. ఈ సృష్టి చక్రాన్ని బుద్ధిలో ఉంచుకోవడము ఎంత సహజము. పురుషార్థీ పిల్లలు ఎవరైతే ఉన్నారో, వారు - మేము జ్ఞానాన్ని చాలా బాగా వినిపిస్తాము అని ఇందులోనే సంతోషపడరు. జ్ఞానముతోపాటు యోగాన్ని మరియు మ్యానర్స్ (నడవడిక) ను కూడా ధారణ చేస్తారు. మీరు చాలా-చాలా మధురముగా అవ్వాలి. ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు. ప్రేమగా అర్థం చేయించాలి. పవిత్రతపై కూడా ఎన్ని గొడవలు జరుగుతాయి. అవి కూడా డ్రామా అనుసారముగా జరుగుతాయి. ఇది తయారై తయారుచేయబడిన డ్రామా కదా. అలాగని డ్రామాలో ఉంటే లభిస్తుంది అని కాదు. అలా కాదు. కృషి చేయాలి. దేవతల వలె దైవీ గుణాలను ధారణ చేయాలి. ఉప్పునీటి వలె అవ్వకూడదు. మేము తప్పుడు నడవడికను నడుచుకుని తండ్రి పరువునైతే పోగొట్టడం లేదు కదా అని గమనించుకోవాలి. సద్గురువుకు నింద తీసుకొచ్చేవారు ఉన్నత పదవిని పొందలేరు. వీరైతే సత్యమైన తండ్రి, సత్యమైన టీచర్. ఆత్మకు ఇప్పుడు స్మృతి కలుగుతుంది. బాబా జ్ఞానసాగరుడు, సుఖసాగరుడు. నేను తప్పకుండా జ్ఞానాన్ని ఇచ్చి వెళ్ళాను అందుకే మహిమ జరుగుతుంది. వీరి ఆత్మలో ఏమైనా జ్ఞానము ఉందా? ఆత్మ ఏమిటి, డ్రామా ఏమిటి అనేది ఎవరికీ కూడా తెలియదు. తెలుసుకోవలసింది మనుష్యులే కదా. రుద్ర యజ్ఞాన్ని రచించినప్పుడు ఆత్మలను పూజిస్తారు, వారి పూజ మంచిదా లేక దైవీ శరీరాల పూజ మంచిదా? ఈ శరీరము 5 తత్వాలతో తయారైనది, అందుకే ఒక్క శివబాబా పూజయే అవ్యభిచారీ పూజ. ఇప్పుడు ఆ ఒక్కరి నుండే వినాలి, అందుకే - చెడు వినకండి... అని అనడం జరుగుతుంది. నిందకు సంబంధించిన విషయాలేవీ వినకండి. నా ఒక్కరి నుండే వినండి. ఇది అవ్యభిచారి జ్ఞానము. ముఖ్యమైన విషయము ఏమిటంటే - ఎప్పుడైతే దేహాభిమానం తెగుతుందో అప్పుడే మీరు శీతలముగా అవుతారు. తండ్రి స్మృతిలో ఉన్నట్లయితే నోటి నుండి కూడా తప్పుడు మాటలు మాట్లాడరు, చెడు దృష్టి వెళ్ళదు. చూస్తూ కూడా చూడనట్లుగా ఉంటారు. మన జ్ఞానమనే మూడవ నేత్రము తెరుచుకుని ఉంది. తండ్రి వచ్చి త్రినేత్రులుగా, త్రికాలదర్శులుగా తయారుచేశారు. ఇప్పుడు మీకు మూడు కాలాలు మరియు మూడు లోకాల జ్ఞానము ఉంది. అచ్ఛా.

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. జ్ఞానాన్ని వినిపించడముతోపాటు యోగములో కూడా ఉండాలి. మంచి మ్యానర్స్ (నడవడిక) ను ధారణ చేయాలి. చాలా మధురంగా అవ్వాలి. నోటి నుండి ఎప్పుడూ రాళ్ళు వెలువడకూడదు.

2. అంతర్ముఖులుగా అయి ఏకాంతములో కూర్చుని మీతో మీరు ఆత్మిక సంభాషణ చేసుకోవాలి. పావనముగా అయ్యే యుక్తులను తీయాలి. ఉదయముదయమే లేచి తండ్రిని చాలా ప్రేమగా స్మృతి చేయాలి.

వరదానము:-
వైర్ లెస్ సెట్ ద్వారా వినాశన సమయములో అంతిమ డైరెక్షన్లను క్యాచ్ చేసే వైస్ లెస్ భవ

వినాశన సమయములో అంతిమ డైరెక్షన్లను క్యాచ్ చేసేందుకు వైస్ లెస్ (నిర్వికారీ) బుద్ధి అవసరము. ఏ విధంగా వారు వైర్ లెస్ సెట్ ద్వారా ఒకరి నుండి మరొకరి వరకు శబ్దాన్ని చేరుస్తారు. ఇక్కడ ఉన్నది వైస్ లెస్ యొక్క వైర్ లెస్. ఈ వైర్ లెస్ ద్వారా మీకు ఏమని శబ్దము వస్తుందంటే - ఈ సురక్షితమైన స్థానానికి చేరుకోండి. ఏ పిల్లలైతే తండ్రి స్మృతిలో వైస్ లెస్ గా ఉండేవారు ఉంటారో, ఎవరికైతే అశరీరులుగా అయ్యే అభ్యాసము ఉందో, వారు వినాశన సమయములో వినాశనమవ్వరు కానీ స్వేచ్ఛగా శరీరాన్ని విడిచిపెడతారు.

స్లోగన్:-
యోగాన్ని పక్కకు పెట్టి కర్మలలో బిజీ అవ్వడము - ఇదే నిర్లక్ష్యము.

అవ్యక్త సూచనలు -‘‘ఆత్మిక రాయల్టీని మరియు పవిత్రత యొక్క పర్సనాలిటీని ధారణ చెయ్యండి’’

పవిత్రత యొక్క రాయల్టీ అనగా ఏకవ్రతగా అవ్వటము, (ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ లేరు). ఈ బ్రాహ్మణ జీవితములో సంపూర్ణ పావనముగా అయ్యేందుకు ఏకవ్రత పాఠాన్ని పక్కా చేసుకోండి. వృత్తిలో శుభ భావన, శుభ కామన ఉండాలి, దృష్టి ద్వారా ప్రతి ఒక్కరినీ ఆత్మిక రూపములో లేక ఫరిశ్తా రూపములో చూడండి. కర్మల ద్వారా ప్రతి ఆత్మకు సుఖాన్ని ఇవ్వండి మరియు సుఖాన్ని తీసుకోండి. ఎవరైనా దుఃఖమిచ్చినా, నిందించినా, అవమానపరచినా మీరు సహనశీలత దేవీలుగా, సహనశీలత దేవతలుగా అవ్వండి.