02-07-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - మీరు డబుల్ అహింసకులైన ఆత్మిక సైన్యము,
మీరు శ్రీమతముపై మీ దైవీ రాజధానిని స్థాపన చేయాలి’’
ప్రశ్న:-
ఆత్మిక
సేవాధారీ పిల్లలైన మీరు అందరినీ ఏ విషయములో అప్రమత్తము చేస్తారు?
జవాబు:-
మీరు అందరినీ
ఏ విషయములో అప్రమత్తము చేస్తారంటే - ఇది ఆ మహాభారత యుద్ధ సమయమే, ఇప్పుడు ఈ పాత
ప్రపంచము వినాశనమవ్వనున్నది, తండ్రి కొత్త ప్రపంచ స్థాపనను చేయిస్తున్నారు, వినాశనము
తర్వాత మళ్ళీ జయజయకారాలు జరుగుతాయి. వినాశనానికి ముందే అందరికీ తండ్రి పరిచయము ఏ
విధముగా లభించగలదు అని మీరు పరస్పరము కలుసుకుని చర్చించుకోవాలి.
పాట:-
నీవు నిదురించి
రాత్రిని పోగొట్టుకున్నావు...
ఓంశాంతి
తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఉన్నతోన్నతమైనవారు భగవంతుడు, వారిని మీరు
ఉన్నతోన్నతమైన కమాండర్ ఇన్ చీఫ్ అని కూడా అనవచ్చు, ఎందుకంటే మీరు సైన్యము కదా. మీ
సుప్రీమ్ కమాండర్ ఎవరు? రెండు సైన్యాలు ఉన్నాయని కూడా మీకు తెలుసు. అది దైహికమైన
సైన్యము, మీరు ఆత్మిక సైన్యము. వారు హద్దులోనివారు, మీరు అనంతమైనవారు. మీలో
కమాండర్లు కూడా ఉన్నారు, జనరల్స్ కూడా ఉన్నారు మరియు లెఫ్టినెంట్లు కూడా ఉన్నారు.
మనము శ్రీమతము ఆధారముగా రాజధానిని స్థాపన చేస్తున్నామని పిల్లలకు తెలుసు. ఇందులో
యుద్ధము మొదలైన విషయాలేవీ లేవు. మనము శ్రీమతము ఆధారముగా మొత్తం విశ్వమంతటిపై మన దైవీ
రాజ్యాన్ని మళ్ళీ స్థాపన చేస్తున్నాము. కల్ప-కల్పము మన ఈ పాత్ర నడుస్తుంది. ఇవన్నీ
అనంతమైన విషయాలు. ఆ యుద్ధాలలో ఈ విషయాలు ఉండవు. ఉన్నతోన్నతమైనవారు తండ్రి. వారిని
ఇంద్రజాలికుడు, రత్నాకరుడు, జ్ఞానసాగరుడు అని కూడా అంటారు. తండ్రి మహిమ ఎంతో
అపారమైనది. మీరు బుద్ధి ద్వారా కేవలం తండ్రిని స్మృతి చేయాలి. మాయ స్మృతిని
మరపింపజేస్తుంది. మీరు డబుల్ అహింసకులైన ఆత్మిక సైన్యము. మేము మా రాజ్యాన్ని ఎలా
స్థాపన చేయాలి అని మీకు ఇదే ఆలోచన ఉంది. డ్రామా తప్పకుండా చేయిస్తుంది.
పురుషార్థమైతే చేయవలసి ఉంటుంది కదా. మంచి-మంచి పిల్లలెవరైతే ఉంటారో, వారు పరస్పరము
చర్చించుకోవాలి. మాయతో మీ యుద్ధమనేది అంతిమము వరకు జరుగుతూనే ఉంటుంది. మహాభారత
యుద్ధము తప్పకుండా జరిగి తీరవలసిందేనని కూడా మీకు తెలుసు, లేదంటే పాత ప్రపంచ
వినాశనము ఎలా జరుగుతుంది. బాబా మనకు శ్రీమతాన్ని ఇస్తున్నారు. పిల్లలైన మనము మళ్ళీ
మన రాజ్య భాగ్యాన్ని స్థాపన చేసుకోవాలి. ఈ పాత ప్రపంచము వినాశనమై మళ్ళీ భారత్ లో
జయజయకారాలు జరగనున్నాయి, దాని కోసమే మీరు నిమిత్తము అయ్యారు. కావున పరస్పరము మీరు
కలుసుకోవాలి, మనము ఎలా, ఎలా సేవ చేయాలి అని చర్చించుకోవాలి. ఇప్పుడు ఈ పాత ప్రపంచము
వినాశనము అవ్వనున్నది అని అందరికీ తండ్రి సందేశాన్ని వినిపించాలి. తండ్రి కొత్త
ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు. లౌకిక తండ్రి కూడా కొత్త ఇంటిని నిర్మించినట్లయితే
పిల్లలు సంతోషిస్తారు. అది హద్దులోని విషయము, ఇది మొత్తము విశ్వానికి సంబంధించిన
విషయము. కొత్త ప్రపంచాన్ని సత్యయుగమని, పాత ప్రపంచాన్ని కలియుగమని అంటారు. ఇప్పుడు
ఇది పాత ప్రపంచము, కావున - తండ్రి ఎప్పుడు మరియు ఎలా వచ్చి కొత్త ప్రపంచాన్ని
స్థాపన చేస్తారు అనేది మీకు తెలిసి ఉండాలి. మీకు నంబరువారు పురుషార్థానుసారముగా ఈ
విషయాలు తెలుసు. అందరికన్నా ఉన్నతమైనవారు తండ్రి, ఇక తర్వాత నంబరువారుగా మహారథులు,
గుర్రపుస్వారీ వారు మరియు పాదచారులు ఉన్నారు. కమాండర్, క్యాప్టెన్ మొదలైన టైటిల్స్
ను కేవలం ఉదాహరణగా వినిపించడం జరుగుతుంది. అందరికీ తండ్రి పరిచయాన్ని ఏ విధముగా
ఇవ్వాలి అని పిల్లలు పరస్పరము కలుసుకుని చర్చించుకోవాలి. ఇది ఆత్మిక సేవ. తండ్రి
కొత్త ప్రపంచాన్ని స్థాపన చేయడానికి వచ్చారని మనము మన సోదరీ-సోదరులను ఏ విధముగా
అప్రమత్తము చేయాలి. పాత ప్రపంచ వినాశనము కూడా ఎదురుగా నిలబడి ఉంది. ఇది అదే మహాభారత
యుద్ధము. మహాభారత యుద్ధము తర్వాత ఏమి జరుగుతుంది అనేది కూడా మనుష్యులకు తెలియదు!
మనము ఇప్పుడు సంగమములో పురుషోత్తములుగా అవుతున్నామని మీరు ఇప్పుడు అనుభవం
చేసుకుంటారు. ఇప్పుడు తండ్రి పురుషోత్తములుగా తయారుచేయడానికి వచ్చారు. ఇందులో
యుద్ధము మొదలైనవాటి విషయమేదీ లేదు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - పిల్లలూ, పతిత
ప్రపంచములో పావనులు ఒక్కరు కూడా ఉండరు మరియు పావన ప్రపంచములో పతితులు ఒక్కరు కూడా
ఉండరు. ఇంత చిన్న విషయాన్ని కూడా ఎవరూ అర్థం చేసుకోరు. పిల్లలైన మీకు మొత్తం
చిత్రాలు మొదలైనవాటి యొక్క సారము అర్థం చేయించడం జరుగుతుంది. భక్తి మార్గములో
మనుష్యులు జప-తపాలు, దాన-పుణ్యాలు మొదలైనవి ఏవైతే చేస్తారో, వాటి ద్వారా
అల్పకాలికమైన కాకిరెట్టతో సమానమైన సుఖము ప్రాప్తిస్తుంది. కానీ ఎవరైనా ఇక్కడికి
వచ్చి అర్థం చేసుకున్నప్పుడే, ఈ విషయాలు బుద్ధిలో కూర్చుంటాయి. ఇప్పుడు ఈ రాజ్యమే
భక్తి రాజ్యము. జ్ఞానము అంశమాత్రము కూడా లేదు. ఏ విధంగా పతిత ప్రపంచములో పావనులు
ఒక్కరు కూడా లేరో, అలా జ్ఞానము కూడా ఒక్కరిలో తప్ప మరెవ్వరిలోనూ లేదు.
వేద-శాస్త్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గానికి చెందినవి. మెట్లు దిగవలసిందే. ఇప్పుడు
మీరు బ్రాహ్మణులుగా అయ్యారు, ఇక్కడ నంబరువారుగా సైన్యము ఉంది. ముఖ్య ముఖ్యమైన
కమాండర్స్, క్యాప్టెన్స్, జనరల్స్ మొదలైనవారు ఎవరైతే ఉన్నారో, వారు - మేము బాబా
సందేశాన్ని అందరికీ ఏ విధముగా అందించాలి అని పరస్పరము కలుసుకుని చర్చించుకోవాలి.
మెసెంజర్, పైగంబర్ మరియు గురువు ఒక్కరేనని, మిగిలినవారందరూ భక్తి మార్గానికి
చెందినవారని పిల్లలకు అర్థం చేయించారు. సంగమయుగానికి చెందినవారు కేవలం మీరు మాత్రమే.
లక్ష్మీ-నారాయణులుగా అయ్యే ఈ లక్ష్యము-ఉద్దేశ్యము చాలా ఏక్యురేట్ అయినది. భక్తి
మార్గములో సత్యనారాయణుని కథను, మూడవ నేత్రము యొక్క కథను మరియు అమరకథను కూర్చుని
వినిపిస్తారు. ఇప్పుడు తండ్రి మీకు సత్యమైన సత్యనారాయణుని కథను వినిపిస్తున్నారు.
భక్తి మార్గములోనివి గతించిన విషయాలు, ఎవరైతే ఇక్కడ ఉండి వెళ్ళారో, వారివి తర్వాత
మందిరాలు మొదలైనవి తయారుచేస్తారు. ఉదాహరణకు శివబాబా ఇప్పుడు మిమ్మల్ని
చదివిస్తున్నారు, దానికి తర్వాత భక్తి మార్గములో స్మృతిచిహ్నాన్ని తయారుచేస్తారు.
సత్యయుగములో శివుడివి లేక లక్ష్మీ-నారాయణులు మొదలైనవారెవరివీ చిత్రాలు ఉండవు.
జ్ఞానము పూర్తిగా వేరు, భక్తి వేరు. ఇది కూడా మీకే తెలుసు, అందుకే తండ్రి అన్నారు,
చెడు వినకండి, చెడు మాట్లాడకండి...
కొత్త ప్రపంచము స్థాపన అవుతోందని పిల్లలైన మీకు ఇప్పుడు ఎంత సంతోషము ఉంది.
సుఖధామాన్ని స్థాపన చేసేందుకు బాబా మనకు మళ్ళీ డైరెక్షన్లు ఇస్తున్నారు, అందులోనూ
నంబర్ వన్ డైరెక్షన్ ఏమిస్తున్నారంటే - పావనముగా అవ్వండి. అందరూ పతితముగానే ఉన్నారు
కదా. మంచి-మంచి పిల్లలెవరైతే ఉన్నారో, వారు - సేవను ఏ విధముగా పెంచాలి, నిరుపేదలకు
ఏ విధముగా సందేశాన్ని ఇవ్వాలి అని పరస్పరము కలుసుకుని చర్చించుకోవాలి. తండ్రి అయితే
కల్పపూర్వము వలె వచ్చారు. వారు అంటారు, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైన నన్ను
స్మృతి చేయండి. రాజధాని తప్పకుండా స్థాపన అవ్వనున్నది. అందరూ అర్థం చేసుకుంటారు.
ఎవరైతే దేవీ-దేవతా ధర్మానికి చెందినవారు కారో, వారు అర్థం చేసుకోరు. వినాశన కాలములో
ఈశ్వరుని పట్ల విపరీత బుద్ధి కలిగి ఉన్నారు కదా (ప్రీతి లేకపోవడం). వారు మన నాథుడైన
తండ్రి అని పిల్లలైన మీకు తెలుసు, అందుకే మీరు వికారాలలోకి వెళ్ళకూడదు, అలాగే
పరస్పరము గొడవపడటం, కొట్లాడటం చేయకూడదు. మీ బ్రాహ్మణ ధర్మము చాలా ఉన్నతమైనది. వారు
శూద్ర ధర్మానికి చెందినవారు, మీరు బ్రాహ్మణ ధర్మానికి చెందినవారు. మీరు పిలక
వంటివారు, వారు పాదాల వంటివారు. పిలకపైన ఉన్నది ఉన్నతోన్నతుడైన భగవంతుడు, నిరాకారుడు.
ఈ కళ్ళకు కనిపించరు కావున విరాట రూపములో పిలకను (బ్రాహ్మణులను) మరియు శివబాబాను
చూపించరు. కేవలం దేవతలు, క్షత్రియులు, వైశ్యులు మరియు శూద్రులు అని అంటారు. ఎవరైతే
దేవతలుగా అవుతారో, వారే మళ్ళీ పునర్జన్మలు తీసుకుని క్షత్రియులుగా, వైశ్యులుగా,
శూద్రులుగా అవుతారు. విరాట రూపము యొక్క అర్థము కూడా ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు మీకు
అర్థమవుతుంది కావున కరెక్టు చిత్రాలను తయారుచేయాలి. శివబాబాను కూడా చూపించారు మరియు
బ్రాహ్మణులను కూడా చూపించారు. మీరు ఇప్పుడు అందరికీ ఈ సందేశాన్ని ఇవ్వాలి -
స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి అని. మీ పని సందేశమివ్వడమే. ఏ
విధంగా తండ్రి మహిమ ఎంతో అపారమైనదో, అలా భారత్ కు కూడా ఎంతో మహిమ ఉంది. ఈ విషయాలను
కూడా ఎవరైనా ఏడు రోజులు వింటే అప్పుడు బుద్ధిలో కూర్చుంటాయి. కానీ తీరిక లేదని
అంటారు. అరే! అర్ధకల్పము నుండి పిలుస్తూ వచ్చారు, ఇప్పుడు వారు ప్రాక్టికల్ గా వచ్చి
ఉన్నారు. తండ్రి అంతిమ సమయములోనే రావలసి ఉంటుంది. ఇది కూడా బ్రాహ్మణులైన మీకు
నంబరువారు పురుషార్థానుసారముగా తెలుసు. చదువును ప్రారంభించగానే నిశ్చయమేర్పడింది -
ఏ ప్రియుడినైతే మేము పిలుస్తూ వచ్చామో, వారు వచ్చారు అన్న నిశ్చయమేర్పడింది,
తప్పకుండా ఏదో ఒక శరీరములోకి వచ్చి ఉంటారు. వారికి తమదంటూ శరీరమైతే లేదు కదా. తండ్రి
అంటారు, నేను ఇతనిలోకి ప్రవేశించి పిల్లలైన మీకు సృష్టి చక్రము యొక్క మరియు రచయిత,
రచనల యొక్క జ్ఞానాన్ని ఇస్తాను. ఇది ఇంకెవ్వరికీ తెలియదు. ఇది చదువు. దీనిని చాలా
సహజము చేసి అర్థము చేయిస్తారు. బాబా అంటారు, నేను మిమ్మల్ని ఎంత ధనవంతులుగా చేస్తాను.
కల్ప-కల్పము మీ వంటి పవిత్రమైనవారు మరియు సుఖమయమైనవారు ఇంకెవ్వరూ ఉండరు. పిల్లలైన
మీరు ఈ సమయములో అందరికీ జ్ఞాన దానమును ఇస్తారు. తండ్రి మీకు రత్నాల దానమును ఇస్తారు,
మీరు వాటిని ఇతరులకు ఇస్తారు. భారత్ ను స్వర్గముగా తయారుచేస్తారు. మీరు మీ తనువు,
మనసు, ధనముల ద్వారానే శ్రీమతము ఆధారముగా భారత్ ను స్వర్గముగా తయారుచేస్తున్నారు. ఇది
ఎంత ఉన్నతమైన కార్యము. మీరు గుప్తమైన సైన్యము, మీ గురించి ఎవ్వరికీ తెలియదు. మేము
విశ్వ రాజ్యాధికారాన్ని తీసుకుంటున్నామని మీకు తెలుసు. మీరు శ్రీమతము ద్వారా
శ్రేష్ఠముగా తయారవుతారు. ఇప్పుడు తండ్రి అంటారు, నన్నొక్కరినే స్మృతి చేయండి.
శ్రీకృష్ణుడు ఇలా అనలేరు, అతను ఒక యువరాజు. మీరు యువరాజులుగా అవుతారు కదా. సత్య,
త్రేతాయుగాలలో పవిత్ర ప్రవృత్తి మార్గము ఉండేది. అపవిత్ర రాజులు పవిత్ర
రాజు-రాణులైన లక్ష్మీ-నారాయణులను పూజిస్తారు. పవిత్ర ప్రవృత్తి మార్గము వారి రాజ్యము
కొనసాగుతుంది, ఆ తర్వాత అపవిత్ర ప్రవృత్తి మార్గము ప్రారంభమవుతుంది. రెండూ సగం, సగం
ఉంటాయి కదా. రాత్రి మరియు పగలు. ఇది లక్షల సంవత్సరాల విషయమైతే మరి సగం, సగం ఉండవు.
లక్షల సంవత్సరాలైనట్లయితే, దేవీ-దేవతా ధర్మానికి చెందిన హిందువుల సంఖ్య చాలా
ఎక్కువగా ఉండి ఉండాలి, లెక్కలేనంతగా ఉండాలి. ఇప్పుడైతే ఇంకా లెక్కపెట్టగలుగుతున్నారు
కదా. ఇది డ్రామాలో నిశ్చితమై ఉంది, ఇది మళ్ళీ జరుగుతుంది. మృత్యువు ఎదురుగా నిలబడి
ఉంది. ఇది ఆ మహాభారత యుద్ధమే. కావున పరస్పరము కలుసుకుని సేవా ప్లాన్లు తయారుచేయాలి.
సేవ చేస్తూ కూడా ఉంటారు, కొత్త-కొత్త చిత్రాలు తయారవుతూ ఉంటాయి, ప్రదర్శనీలు కూడా
చేస్తారు. అచ్ఛా, మరి ఇప్పుడు ఇంకేమి చేయాలి? అచ్ఛా, ఆత్మిక మ్యూజియంను తయారుచేయండి,
వచ్చేవారు ముందు వారు వచ్చి చూసి వెళ్తారు, ఆ తర్వాత ఇతరులను పంపిస్తారు. పేదవారు
మరియు షావుకారులు అందరూ ధర్మార్థము తమ సంపదలో కొంత భాగాన్ని వేరుగా తీస్తారు కదా.
షావుకారులు కాస్త ఎక్కువగా తీస్తారు, ఇక్కడ కూడా అంతే. కొందరు వెయ్యి రూపాయలు
తీస్తారు, కొందరు తక్కువగా తీస్తారు. కొందరైతే రెండు రూపాయలను కూడా పంపిస్తారు. ఒక
రూపాయితో ఒక ఇటుకను పెట్టండి, ఇంకొక రూపాయిని 21 జన్మల కొరకు జమ చేయండి అని అంటారు.
ఇది గుప్తమైనది. పేదవారి ఒక్క రూపాయి షావుకారుల వేయి రూపాయలతో సమానమవుతుంది. పేదవారి
వద్ద ఉండేదే తక్కువ కావున వారేమి చేయగలరు. లెక్క ఉంది కదా. వ్యాపారస్థులు ధర్మార్థము
కొంత ధనాన్ని వేరుగా తీస్తారు కదా. మరి ఇప్పుడేమి చేయాలి. తండ్రికి సహాయము అందించాలి,
తండ్రి తిరిగి ప్రతిఫలము 21 జన్మల కొరకు ఇస్తారు. తండ్రి వచ్చి పేదవారికి సహాయము
అందిస్తారు. ఇప్పుడిక ఈ ప్రపంచమే ఉండదు. అన్నీ మట్టిలో కలిసిపోతాయి. కల్పక్రితము వలె
స్థాపన తప్పకుండా జరగనున్నది అని కూడా మీకు తెలుసు. నిరాకారుడైన తండ్రి చెప్తున్నారు
- పిల్లలూ, దేహపు సర్వ ధర్మాలను త్యజించి ఒక్క తండ్రిని స్మృతి చేయండి. ఈ బ్రహ్మా
కూడా రచనయే కదా. బ్రహ్మా ఎవరి సంతానము, వారిని ఎవరు రచించారు.
బ్రహ్మా-విష్ణువు-శంకరులను ఎలా రచిస్తారు, ఇది ఎవ్వరికీ తెలియదు. తండ్రి వచ్చి
సత్యమైన విషయాలను అర్థం చేయిస్తారు. బ్రహ్మా కూడా తప్పకుండా మనుష్య సృష్టిలోనే
ఉంటారు. బ్రహ్మా వంశావళి గాయనము చేయబడింది. భగవంతుడు మనుష్య సృష్టి యొక్క రచనను ఎలా
రచిస్తారు, ఇది ఎవ్వరికీ తెలియదు. బ్రహ్మా అయితే ఇక్కడే ఉండాలి కదా. తండ్రి అంటారు,
నేను ఎవరిలోనైతే ప్రవేశించానో, ఇతను కూడా అనేక జన్మల అంతిమ జన్మలో ఉన్నవారు. ఇతను
పూర్తి 84 జన్మలు తీసుకున్నారు. బ్రహ్మా ఏమీ రచయిత కారు, ఒక్క నిరాకారుడు మాత్రమే
రచయిత. ఆత్మలు కూడా నిరాకారీ అయినవే, అవి అనాదిగా ఉన్నాయి. వాటిని ఎవ్వరూ రచించలేదు,
మరి ఈ బ్రహ్మా ఎక్కడి నుండి వచ్చారు. తండ్రి అంటారు, నేను ఇతనిలోకి ప్రవేశించి ఇతని
పేరును మార్చాను. బ్రాహ్మణులైన మీ పేర్లను కూడా మార్చాను. మీరు రాజర్షులు.
ప్రారంభములో అంతా సన్యసించి కలిసి ఉండేవారు, కావున పేర్లు మార్చడం జరిగింది. ఆ
తర్వాత మాయ తినేస్తుంది అన్నది గమనించారు, ఇక మాలను తయారుచేయడం, పేర్లు మార్చడం
మానేసారు.
ఈ రోజుల్లో ప్రపంచములో అన్ని విషయాలలోనూ ఎంతో మోసము ఉంది. పాలల్లో కూడా మోసము
ఉంటుంది. స్వచ్ఛమైన వస్తువేదీ దొరకదు. తండ్రి వద్ద కూడా మోసము చేస్తూ ఉంటారు.
స్వయాన్నే భగవంతుడు అని పిలుచుకుంటూ ఉంటారు. ఆత్మ ఏమిటి, పరమాత్మ ఏమిటి అనేది
ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. మీలో కూడా నంబరువారు పురుషార్థానుసారముగా ఉన్నారు.
ఎవరు ఎలా చదువుతున్నారు మరియు చదివిస్తున్నారు, ఎలాంటి పదవిని పొందుతారు అనేది
తండ్రికి తెలుసు. మేము తండ్రి ద్వారా విశ్వానికి యువరాజులుగా అవుతున్నామనే
నిశ్చయముంది. కావున అటువంటి పురుషార్థాన్ని చేసి చూపించాలి. మనము యువరాజులుగా
అయ్యాము, తర్వాత 84 జన్మల చక్రములో తిరిగాము, ఇప్పుడు మళ్ళీ అలా తయారవుతున్నాము. ఇది
నరకము, ఇందులో ఏమీ లేదు. తండ్రి వచ్చి భాండాగారాన్ని పూర్తిగా నింపి, కష్టాలు,
దుఃఖాలను దూరం చేస్తారు. ఇక్కడ మీరు మీ భాండాగారాన్ని నింపుకునేందుకని వచ్చారు కదా
అని అందరినీ అడగండి. అమరపురిలో కాలుడు రాలేడు. తండ్రి భాండాగారాన్ని నింపి దుఃఖాలు,
కష్టాలను దూరం చేసేందుకే వస్తారు. అది అమరలోకము, ఇది మృత్యులోకము. ఇలాంటి మధురాతి
మధురమైన విషయాలనే వింటూ, వినిపిస్తూ ఉండాలి, అంతేకానీ వ్యర్థమైన విషయాలను కాదు.
అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. విశ్వానికి యజమానులుగా తయారయ్యే చదువును చదివించేందుకు తండ్రి వచ్చారు, అందుకే
ఎప్పుడూ మాకు తీరిక లేదు అని అనకండి. శ్రీమతము ఆధారముగా తనువు, మనసు, ధనముల ద్వారా
భారత్ ను స్వర్గముగా తయారుచేసే సేవను చేయాలి.
2. పరస్పరము చాలా మధురాతి మధురమైన జ్ఞాన విషయాలను వినాలి మరియు వినిపించాలి.
తండ్రి ఇచ్చిన ఈ డైరెక్షన్ సదా గుర్తుండాలి - చెడు వినవద్దు, చెడు మాట్లాడవద్దు.
వరదానము:-
హద్దులోని సర్వ కామనలపై విజయాన్ని పొందే కామజీత్ జగజ్జీత్ భవ
హద్దులోని సర్వ కోరికలు కామ వికారము యొక్క అంశమే. కామన
అనేది ఒకటి, వస్తువులకు సంబంధించి ఉంటుంది, రెండు, వ్యక్తుల ద్వారా హద్దు
ప్రాప్తులకు సంబంధించి ఉంటుంది, మూడు, సంబంధాలను నిర్వర్తించే విషయములో ఉంటుంది,
నాలుగు, సేవా భావనలో హద్దు కామన యొక్క భావము. ఏ వ్యక్తి లేక వస్తువు పట్లనైనా విశేష
ఆకర్షణ ఉండటము - కోరిక లేదు కానీ మంచిగా అనిపిస్తుంది అని అనటము, ఇది కూడా కామ
వికారము యొక్క అంశమే. ఎప్పుడైతే ఈ సూక్ష్మ అంశము కూడా సమాప్తమైపోతుందో, అప్పుడు కామ
జీతులు జగత్ జీతులు అని అంటారు.
స్లోగన్:-
మనస్ఫూర్తిగా రియలైజ్ అవ్వడము ద్వారా మనోభిరాముడైన తండ్రి నుండి ఆశీర్వాదాలు
తీసుకునేందుకు అధికారులుగా అవ్వండి.
అవ్యక్త సూచనలు -
సంకల్ప శక్తిని జమ చేసుకుని శ్రేష్ఠమైన సేవకు నిమిత్తులుగా అవ్వండి
మనసే ఒక సూక్ష్మ శక్తి,
అది కంట్రోల్ లో ఉన్నట్లయితే అనగా ఆర్డర్ అనుసారంగా కార్యము చేసినట్లయితే పాస్ విత్
ఆనర్ గా మరియు రాజ్యాధికారులుగా అవుతారు. సంకల్ప శక్తిని జమ చేసుకునేందుకు ఏది
ఆలోచిస్తారో అదే చేయండి, స్టాప్ అనగానే సంకల్పాలు స్టాప్ అయిపోవాలి (ఆగిపోవాలి),
సేవ గురించి ఆలోచిస్తే సేవలోనే నిమగ్నమైపోవాలి, పరంధామము గురించి ఆలోచిస్తే
పరంధామానికి చేరుకోవాలి. ఇటువంటి కంట్రోలింగ్ పవర్ ను పెంచుకోండి.
| | |