03-04-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీ ఈ కొత్త వృక్షము చాలా మధురమైనది, ఈ మధురమైన వృక్షానికే పురుగులు పడతాయి, పురుగులను అంతము చేసే మందు మన్మనాభవ’’

ప్రశ్న:-
పాస్ విత్ ఆనర్ (గౌరవప్రదముగా ఉత్తీర్ణులయ్యే) విద్యార్థుల గుర్తులు ఏమిటి?

జవాబు:-
వారు కేవలం ఒక సబ్జెక్టుపైనే కాదు, అన్ని సబ్జెక్టులపైనా పూర్తిగా శ్రద్ధ పెడతారు. స్థూల సేవ సబ్జెక్టు కూడా చాలా మంచిది, దీని ద్వారా చాలా మందికి సుఖము లభిస్తుంది, ఈ సేవతో కూడా మార్కులు జమ అవుతాయి కానీ దానితో పాటు జ్ఞానము కూడా కావాలి, నడవడిక కూడా ఆ విధంగా ఉండాలి. దైవీ గుణాలపై పూర్తి అటెన్షన్ ఉండాలి. జ్ఞాన-యోగాలు పూర్తిగా ఉండాలి, అప్పుడు పాస్ విత్ ఆనర్ (గౌరవప్రదముగా ఉత్తీర్ణులు) అవ్వగలరు.

పాట:-
వారు మా నుండి వేరు కారు...

ఓంశాంతి
పిల్లలు ఏం విన్నారు? పిల్లల మనసు ఎవరిపై లగ్నమై ఉంది? గైడ్ (మార్గదర్శకుడు) పై. గైడ్ ఏమేమి చూపిస్తారు? స్వర్గానికి వెళ్ళే గేటును చూపిస్తారు. పిల్లలకు దాని యొక్క పేరు కూడా ఇవ్వడం జరిగింది - ‘‘గేట్ వే టూ హెవెన్ (స్వర్గానికి ద్వారము)’’. స్వర్గ ద్వారము ఎప్పుడు తెరుచుకుంటుంది? ఇప్పుడు ఇది నరకము కదా. స్వర్గానికి వెళ్ళే ద్వారమును ఎవరు తెరుస్తారు మరియు ఎప్పుడు తెరుస్తారు? ఇది పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. మీకు సదా సంతోషము ఉంటుంది. స్వర్గానికి వెళ్ళేందకు దారి మీకు తెలుసు. మేళాలు, ప్రదర్శినీల ద్వారా మీరు - మనుష్యులు స్వర్గ ద్వారము వద్దకు ఎలా వెళ్ళవచ్చు అనేది చూపిస్తారు. చిత్రాలైతే మీరు ఎన్నో తయారుచేశారు. బాబా అడుగుతున్నారు - ఈ చిత్రాలన్నింటిలోనూ ఏ చిత్రము ద్వారా మనము ఎవరికైనా - ఇది స్వర్గానికి వెళ్ళే గేటు అని అర్థం చేయించగలము? సృష్టి చక్రము యొక్క చిత్రము ద్వారా స్వర్గానికి వెళ్ళే గేటు స్పష్టమవుతుంది. ఇది కరక్ట్. పైన అటువైపు నరకము యొక్క గేటు ఉంది, ఇటువైపు స్వర్గము యొక్క గేటు ఉంది. చాలా స్పష్టముగా ఉంది. ఇక్కడి నుండి ఆత్మలన్నీ శాంతిధామానికి పరుగెత్తుతాయి, తర్వాత స్వర్గములోకి వస్తాయి. ఇది గేటు. మొత్తము చక్రమునంతటినీ గేటు అని అనరు. పై భాగములో ఎక్కడైతే సంగమయుగాన్ని చూపించారో, అది పూర్తి గేటు. దాని నుండి ఆత్మలు పైకి వెళ్ళిపోయి, మళ్ళీ కొత్త ప్రపంచములోకి వస్తాయి. మిగిలిన ఆత్మలన్నీ శాంతిధామములో ఉంటాయి. ఆ గడియారము ముల్లు - ఇది నరకము, ఇది స్వర్గము అని చూపిస్తుంది. అర్థము చేయించేందుకు ఇది అన్నింటికంటే ఫస్ట్ క్లాస్ చిత్రము. గెట్ వే టూ హెవెన్ (స్వర్గానికి ద్వారము) చాలా స్పష్టముగా ఉంది. ఇది బుద్ధితో అర్థము చేసుకునే విషయము కదా. అనేక ధర్మాల వినాశనము మరియు ఏక ధర్మ స్థాపన జరుగుతుంది. మనము సుఖధామానికి వెళ్తామని, మిగిలిన వారంతా శాంతిధామానికి వెళ్ళిపోతారని మీకు తెలుసు. గేటు అయితే చాలా స్పష్టముగా ఉంది. ఈ సృష్టి చక్రమే ముఖ్యమైన చిత్రము. ఇందులో నరక ద్వారము, స్వర్గ ద్వారము చాలా స్పష్టముగా ఉన్నాయి. స్వర్గ ద్వారములోకి ఎవరైతే కల్పక్రితము వెళ్ళారో, వారే వెళ్తారు, మిగిలినవారంతా శాంతి ద్వారములోకి వెళ్ళిపోతారు. నరక ద్వారము మూసుకుని శాంతి మరియు సుఖము యొక్క ద్వారము తెరుచుకుంటుంది. అన్నింటికంటే ఫస్ట్ క్లాస్ చిత్రము ఇదే. బాబా ఎప్పుడూ చెప్తూ ఉంటారు - త్రిమూర్తి చిత్రము, రెండు గోళాల చిత్రాలు (స్వర్గము, నరకము) మరియు ఈ సృష్టి చక్రము యొక్క చిత్రము, ఇవి ఫస్ట్ క్లాస్ చిత్రాలు. ఎవరు వచ్చినా వారికి మొదట ఈ చిత్రాన్ని చూపించి - ఇది స్వర్గములోకి వెళ్ళే ద్వారము అని చెప్పండి. ఇది నరకము, అది స్వర్గము. నరకము ఇప్పుడు వినాశనమవుతుంది. ముక్తి యొక్క గేటు తెరుచుకుంటుంది. ఈ సమయములో మనము స్వర్గములోకి వెళ్తాము, మిగిలినవారంతా శాంతిధామములోకి వెళ్తారు. ఎంత సులభము. స్వర్గ ద్వారములోకి అందరూ వెళ్ళరు. అక్కడ ఈ దేవీ-దేవతల రాజ్యమే ఉండేది. స్వర్గ ద్వారములోకి వెళ్ళేందుకు ఇప్పుడు మనము యోగ్యులుగా అయ్యామని మీ బుద్ధిలో ఉంది. బాగా చదువుకుంటే నవాబులుగా అవుతారు, ఆటపాటల్లోనే ఉంటే బాగా పాడవుతారు. అన్నింటికంటే మంచి చిత్రము ఈ సృష్టి చక్రము చిత్రము, బుద్ధి ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారి చిత్రాన్ని చూస్తే ఇక బుద్ధితో అర్థము చేసుకోవచ్చు. ముఖ్యముగా ఏ చిత్రము చూపించి మంచి రీతిగా అర్థం చేయించగలము అని పిల్లలైన మీకు రోజంతా ఈ ఆలోచనలు నడుస్తూ ఉండాలి. గేట్ వే టు హెవెన్ (స్వర్గ ద్వారము) అనే ఈ ఇంగ్లీషు పదము చాలా బాగుంది. ఇప్పుడైతే అనేక భాషలైపోయాయి. హిందీ అనే పదము హిందుస్థాన్ నుండి వచ్చింది. హిందుస్థాన్ అనే పదము రైట్ పదమేమీ కాదు. దీని అసలు పేరు భారత్. భారత ఖండము అని అంటారు. వీధులు మొదలైనవాటి పేర్లను మారుస్తుంటారు. ఖండము పేరు మార్చబడదు. మహాభారత్ అనే పదము ఉంది కదా. అన్నింటిలో భారత్ యే గుర్తుకు వస్తుంది. భారత్ మా దేశము అని పాడుతారు కూడా. హిందూ ధర్మము అని అన్నందుకు భాషను కూడా హిందీ అని అన్నారు. ఇది అన్ రైటియస్ (అధర్మయుక్తము). సత్యయుగములో సత్యమే సత్యముండేది - సత్యమైనవి ధరించడము, సత్యమైనవి భుజించడము, సత్యమే మాట్లాడడము. ఇక్కడ అన్నీ అసత్యమైపోయాయి. గేట్ వే టు హెవెన్ అనే పదము చాలా బాగుంది. మేము మీకు స్వర్గానికి వెళ్ళే ద్వారము చూపిస్తాము పదండి. ఎన్ని భాషలైపోయాయి. పిల్లలైన మీకు తండ్రి సద్గతి కొరకు శ్రేష్ఠ మతాన్ని ఇస్తారు. తండ్రి మతము గురించి గాయనముంది - ‘‘వారు ఇచ్చే గతి, మతము అతీతమైనవి’’. పిల్లలైన మీకు ఎంత సహజమైన మతాన్ని ఇస్తారు. భగవంతుని శ్రీమతముపైనే మీరు నడవాలి. డాక్టరు ఇచ్చే మతాన్ని అనుసరిస్తే డాక్టరుగా అవుతారు. భగవంతుని మతాన్ని అనుసరిస్తే భగవాన్-భగవతిగా అవుతారు. ఉండడము కూడా భగవానువాచ అని ఉంది, అందుకే బాబా అన్నారు - మొదట భగవంతుడు అని ఎవరిని అంటారు అనేది నిరూపించండి. స్వర్గానికి యజమానులు తప్పకుండా భగవాన్-భగవతీలే. బ్రహ్మ తత్వములో ఏమీ లేదు. స్వర్గము కూడా ఇక్కడే ఉంటుంది, నరకము కూడా ఇక్కడే ఉంటుంది. స్వర్గము, నరకము, రెండూ పూర్తిగా వేరు. మనుష్యుల బుద్ధి పూర్తిగా తమోప్రధానమైపోయింది, ఏ మాత్రమూ అర్థము చేసుకోరు. సత్యయుగానికి లక్షల సంవత్సరాలు అని అన్నారు. కలియుగము ఇంకా 40 వేల సంవత్సరాలు ఉంటుంది అని అంటారు. పూర్తిగా ఘోర అంధకారములో ఉన్నారు.

తండ్రి మమ్మల్ని స్వర్గములోకి తీసుకువెళ్ళేందుకు ఇటువంటి గుణవంతులుగా తయారుచేస్తున్నారు అని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. ముఖ్యమైన చింత ఇదే పెట్టుకోవాలి - మేము సతోప్రధానముగా ఎలా అవ్వాలి? నన్నొక్కరినే స్మృతి చేయండి అని తండ్రి చెప్పారు. నడుస్తూ, తిరుగుతూ, పని చేస్తూ బుద్ధిలో ఇది గుర్తుండాలి. ప్రేయసి-ప్రియుడు కూడా కర్మలైతే చేస్తారు కదా. భక్తిలో కూడా కర్మలైతే చేస్తారు కదా. బుద్ధిలో వారి స్మృతి ఉంటుంది. స్మృతి చేయడము కోసము మాలను తిప్పుతారు. తండ్రి కూడా పదే-పదే చెప్తున్నారు, తండ్రినైన నన్ను స్మృతి చేయండి. సర్వవ్యాపి అని అంటే ఇక ఎవరిని స్మృతి చేస్తారు? తండ్రి అర్థం చేయిస్తున్నారు, మీరు ఎంత నాస్తికులుగా అయిపోయారు. తండ్రి గురించే తెలియదు. ఓ గాడ్ ఫాదర్, అని అంటారు కూడా, కానీ వారెవరు అనేది కొద్దిగా కూడా తెలియదు. ఆత్మ, ఓ గాడ్ ఫాదర్ అని అంటుంది. కానీ ఆత్మ అంటే ఏమిటి. ఆత్మ వేరు. వారిని పరమ ఆత్మ అనగా సుప్రీమ్ అని అంటారు, వారు ఉన్నతోన్నతమైనవారు, సుప్రీమ్ సోల్, పరమ ఆత్మ. ఒక్క మనిషికి కూడా తన ఆత్మ గురించిన జ్ఞానము లేదు. నేను ఆత్మను, ఇది నా శరీరము. ఇవి రెండు వస్తువులు కదా. ఈ శరీరము పంచ తత్వాలతో తయారుచేయబడినది. ఆత్మ అయితే ‘అవినాశీ’, అది ఒక బిందువు. ఆత్మ దేనితో తయారవుతుంది. అది చాలా చిన్న బిందువు, సాధు-సత్పురుషులు మొదలైనవారెవ్వరికీ దీని గురించి తెలియదు. ఇతనైతే చాలా మంది గురువులను ఆశ్రయించారు కానీ ఎవ్వరూ కూడా ఆత్మ అంటే ఏమిటి, పరమపిత పరమాత్మ అంటే ఎవరు అనేది వినిపించలేదు. కేవలం పరమాత్మ గురించే తెలియదు అని కాదు, వారికి ఆత్మ గురించి కూడా తెలియదు. ఆత్మను తెలుసుకుంటే, పరమాత్మను వెంటనే తెలుసుకుంటారు. పిల్లలు తమ గురించి తాము తెలుసుకుని తమ తండ్రి గురించి తెలుసుకోకపోతే ఎలా ఉండగలరు? మీకు ఆత్మ అంటే ఏమిటి, అది ఎక్కడుంటుంది అనేది ఇప్పుడు తెలుసు. డాక్టర్లకు కూడా - అది సూక్ష్మమైనదని, ఈ కనులతో దానిని చూడలేమని ఈ మాత్రము తెలుసు, మరి ఆత్మను గాజుపెట్టేలో బంధించినా సరే ఎలా చూడగలరు? ప్రపంచములో మీకున్న జ్ఞానము ఇంకెవ్వరికీ లేదు. ఆత్మ బిందువని, పరమాత్మ కూడా బిందువని మీకు తెలుసు. కానీ ఆత్మలమైన మనము పతితము నుండి పావనముగా, పావనము నుండి పతితముగా అవుతాము. అక్కడైతే పతితాత్మలు ఉండరు. అక్కడి నుండి అందరూ పావనముగానే వస్తారు, తర్వాత పతితముగా అవుతారు. మళ్ళీ తండ్రి వచ్చి పావనముగా చేస్తారు. ఇది చాలా సహజాతి సహజమైన విషయము. ఆత్మ అయిన మనము 84 జన్మల చక్రములో తిరిగి ఇప్పుడు తమోప్రధానముగా అయ్యామని మీకు తెలుసు. మనమే 84 జన్మలు తీసుకుంటాము. ఇది కేవలం ఇతనొక్కరి విషయమే కాదు. తండ్రి చెప్తున్నారు, నేను అర్థం చేయించేది ఇతనికి, మీరూ వింటారు. నేను ఇతనిలో ప్రవేశించాను, ఇతనికి వినిపిస్తాను, మీరు వినేస్తారు. వీరు రథము. బాబా ‘గేట్ వే టు హెవెన్’ అన్న పేరు పెట్టమని అర్థం చేయించారు. కానీ సత్యయుగములో ఏదైతే దేవీ-దేవతా ధర్మము ఉండేదో, అది ఇప్పుడు కనుమరుగైపోయింది అని కూడా అర్థం చేయించాలి. ఎవ్వరికీ తెలియదు. క్రిస్టియన్లు కూడా మొదట సతోప్రధానముగా ఉండేవారు, తర్వాత పునర్జన్మలు తీసుకుంటూ-తీసుకుంటూ తమోప్రధానముగా అవుతారు. వృక్షము కూడా తప్పకుండా పాతది అవుతుంది. ఇది వెరైటీ ధర్మాల వృక్షము. వృక్షము అనుసారముగా ఇతర ధర్మాల వారందరూ తర్వాతనే వస్తారు. ఈ డ్రామా తయారై, తయారుచేయబడినది. సత్యయుగములోకి వచ్చే అవకాశము అంత సులువుగా ఎవరికీ లభించదు. అలా జరగదు. ఇది అనాదిగా తయారైన ఆట. సత్యయుగములో ఆది సనాతన ప్రాచీన దేవి-దేవతా ధర్మము ఒక్కటే ఉండేది. మనము స్వర్గములోకి వెళ్తూ ఉన్నామని ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. ఆత్మ అంటుంది, నేను తమోప్రధానముగా ఉన్నాను కనుక ఇంటికి ఎలా వెళ్తాను, స్వర్గానికి ఎలా వెళ్తాను? దాని కొరకు సతోప్రధానముగా అయ్యే యుక్తిని కూడా తండ్రి తెలియజేశారు. తండ్రి చెప్తున్నారు, నన్నే పతిత-పావనుడు అని అంటారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. భగవానువాచ అని వ్రాయబడి ఉంది. క్రైస్టుకు ఇన్ని సంవత్సరాల పూర్వము భారత్ స్వర్గముగా ఉండేది అని కూడా అందరూ అంటూ ఉంటారు. కానీ అది ఎలా తయారైంది మరియు అది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది, ఇది ఎవ్వరికీ తెలియదు. మీకైతే బాగా తెలుసు. ఇంతకుముందు ఈ విషయాలు ఏవీ తెలియవు. ఆత్మయే మంచిగా మరియు చెడుగా అవుతుంది అని కూడా ప్రపంచములో ఎవ్వరికీ తెలియదు. ఆత్మలందరూ నా పిల్లలు, తండ్రిని స్మృతి చేస్తారు. తండ్రి అందరికీ ప్రియుడు, అందరూ ప్రేయసులు. ఆ ప్రియుడు వచ్చారని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. వారు చాలా మధురమైన ప్రియుడు. లేదంటే అందరూ వారిని ఎందుకు స్మృతి చేస్తారు? నోటి నుండి పరమాత్ముని పేరు పలకని మనిషంటూ ఎవ్వరూ ఉండరు. కాకపోతే వారి గురించి తెలియదు. ఆత్మ అశరీరి అని మీకు తెలుసు. ఆత్మలకు కూడా పూజలు జరుగుతాయి కదా. పూజ్యులుగా ఉన్న మనమే మళ్ళీ మన ఆత్మనే పూజించడం మొదలుపెట్టాము. పూర్వ జన్మలో బ్రాహ్మణ కులములో జన్మ తీసుకుని ఉండవచ్చు. శ్రీనాథునికి నైవేద్యము సమర్పిస్తారు కానీ తినేది పూజారులే. ఇదంతా భక్తి మార్గము.

స్వర్గ ద్వారము తెరిచేవారు తండ్రి అని పిల్లలైన మీరు అర్థం చేయించాలి. కానీ దానిని ఎలా తెరుస్తారు, ఎలా అర్థం చేయిస్తారు? భగవానువాచ అన్నప్పుడు తప్పకుండా శరీరము ద్వారానే మాట్లాడుతారు కదా. ఆత్మయే శరీరము ద్వారా మాట్లాడుతుంది, వింటుంది. ఈ బాబా విస్తారముగా వివరిస్తారు. బీజము మరియు వృక్షము ఉన్నాయి. ఇది కొత్త వృక్షమని పిల్లలైన మీకు తెలుసు. మెల్ల-మెల్లగా వృద్ధి చెందుతుంది. మీ ఈ కొత్త వృక్షానికి పురుగులు కూడా చాలా పడతాయి ఎందుకంటే ఈ కొత్త వృక్షము చాలా మధురమైనది. తీయని వృక్షాలకే పురుగులు మొదలైనవి పడతుంటాయి, అప్పుడు మందులు వేస్తారు. తండ్రి కూడా మన్మనాభవ అనే చాలా మంచి మందు ఇచ్చారు. మన్మనాభవగా లేకపోతే పురుగులు తినేస్తాయి. పురుగులు పట్టిన వస్తువు ఏం పనికొస్తుంది. దానిని పారేస్తారు. ఉన్నత పదవి ఎక్కడ, కనిష్ట పదవి ఎక్కడ? వ్యత్యాసముంది కదా. మధురమైన పిల్లలకు అర్థం చేయిస్తూ ఉంటారు - చాలా మధురాతి మధురంగా అవ్వండి, ఎవరితోనూ ఉప్పునీరులా అవ్వకండి, క్షీరఖండము వలె అవ్వండి (పాలు పంచదార వలె కలిసిమెలిసి ఉండండి). అక్కడ పులి, మేక కూడా క్షీరఖండము వలె ఉంటాయి. కనుక పిల్లలు కూడా క్షీరఖండము వలె అవ్వాలి. కానీ ఎవరికైనా భాగ్యములోనే లేకపోతే ఇక పురుషార్థము కూడా ఏం చేస్తారు! ఫేయిల్ అవుతారు. టీచరు అయితే భాగ్యాన్ని ఉన్నతముగా తయారుచేయడానికి చదివిస్తారు. టీచర్ అయితే అందరినీ చదివిస్తారు. తేడా కూడా మీరు చూస్తారు. ఎవరు ఏ సబ్జెక్టులో తెలివైనవారిగా ఉన్నారు అనేది క్లాసులో విద్యార్థులు తెలుసుకోగలరు. ఇక్కడ కూడా అలాగే ఉంది. స్థూల సేవ అనే సబ్జెక్టు కూడా ఉంది కదా. ఉదాహరణకు భోళీ దాదీ ఉన్నారు, వారి ద్వారా ఎంతోమందికి సుఖము లభిస్తుంది, ఎంతగా వారిని అందరూ జ్ఞాపకము చేస్తుంటారు. ఈ సబ్జెక్టు ద్వారా కూడా మార్కులు అయితే లభిస్తాయి, అది సరే. కానీ పాస్ విత్ ఆనర్ అయ్యేందుకు కేవలం ఒక సబ్జెక్టులోనే కాదు, అన్ని సబ్జెక్టులపై పూర్తి శ్రద్ధ పెట్టాలి. జ్ఞానము కూడా కావాలి, నడవడిక కూడా ఆ విధంగా ఉండాలి, దైవీ గుణాలు కూడా కావాలి. అటెన్షన్ పెట్టడం మంచిది. భోళీ దాదీ వద్దకు కూడా ఎవరైనా వస్తే వారు చెప్పాలి - ‘‘మన్మనాభవ’’. శివబాబాను స్మృతి చేస్తే వికర్మలు వినాశనమవుతాయి మరియు మీరు స్వర్గానికి యజమానులుగా అవుతారు. తండ్రిని స్మృతి చేస్తూ, ఇతరులకు కూడా పరిచయాన్ని ఇస్తూ ఉండాలి. జ్ఞానము మరియు యోగము కావాలి. ఇది చాలా సులభము. ముఖ్యమైన విషయము ఇదే. అంధులకు చేతికర్రగా అవ్వాలి. ప్రదర్శినీకి కూడా ఎవరినైనా తీసుకువెళ్ళి వారికి ఇలా చెప్పండి - పదండి, మేము మీకు స్వర్గ ద్వారాన్ని చూపిస్తాము. ఇది నరకము, అది స్వర్గము. తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేయండి, పవిత్రముగా అవ్వండి, అప్పుడు మీరు పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతారు. మన్మనాభవ. కల్పక్రితము వలె మీకు గీత వినిపిస్తారు. అందుకే బాబా - ‘‘గీతా భగవానుడు ఎవరు?’’ అన్న చిత్రాన్ని తయారుచేయించారు. స్వర్గము యొక్క గేటును ఎవరు తెరుస్తారు? శివబాబాయే తెరుస్తారు. శ్రీకృష్ణుడు ఆ ద్వారము ద్వారా వెళ్తారు. ముఖ్యమైన చిత్రాలు రెండే. మిగిలినవన్నీ వాటి విస్తారమే. పిల్లలు చాలా మధురముగా తయారవ్వాలి. ప్రేమగా మాట్లాడాలి. మనసా, వాచా, కర్మణా అందరికీ సుఖాన్ని ఇవ్వాలి. చూడండి, భోళీ దాదీ అందరినీ సంతోషపరుస్తారు కనుక వారి కొరకు కానుకలు కూడా తీసుకువస్తారు. ఇది కూడా ఒక సబ్జెక్టే కదా. కానుకలు తీసుకువచ్చి ఇస్తారు, అప్పుడు దాదీ అంటారు, నేను మీ నుండి ఎందుకు తీసుకోవాలి, తీసుకుంటే మీరే గుర్తుకొస్తారు. శివబాబా భండారము నుండి లభిస్తే మాకు శివబాబాయే గుర్తుంటారు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. తమ ఉన్నతమైన భాగ్యాన్ని తయారుచేసుకునేందుకు పరస్పరము చాలా-చాలా క్షీరఖండము వలె, మధురముగా ఉండాలి, ఎప్పుడూ ఉప్పునీరులా అవ్వకూడదు. అన్ని సబ్జెక్టులపై పూర్తి అటెన్షన్ పెట్టాలి.

2. సద్గతి కొరకు తండ్రి నుండి ఏ శ్రేష్ఠ మతమైతే లభించిందో దానిపై నడుచుకోవాలి మరియు అందరికీ శ్రేష్ఠ మతమునే వినిపించాలి. స్వర్గములోకి వెళ్ళే దారిని చూపించాలి.

వరదానము:-
ప్రతి ఆత్మకు ధైర్యాన్ని, ఉల్లాసాన్ని అందించే దయార్ద్ర హృదయ, విశ్వ కళ్యాణకారీ భవ

ఎప్పుడూ కూడా బ్రాహ్మణ పరివారములోని ఏ బలహీన ఆత్మను - నీవు బలహీనముగా ఉన్నావు అని అనకండి. దయార్ద్ర హృదయులైన, విశ్వ కళ్యాణకారులైన పిల్లలైన మీ నోటి నుండి సదా ప్రతి ఆత్మ పట్ల శుభ వచనాలే వెలువడాలి, నిరుత్సాహపరిచే మాటలు కాదు. ఎవరు ఎంత బలహీనముగా ఉన్నా కానీ వారికి సూచనను ఇవ్వవలసి వచ్చినా లేక శిక్షణను ఇవ్వవలసి వచ్చినా, మొదట వారిని సమర్థులుగా చేసి ఆ తర్వాత శిక్షణను ఇవ్వండి. మొదట ధరణిపై ధైర్యము మరియు ఉత్సాహము అనే నాగలితో దున్నండి, ఆ తర్వాత బీజాలు వేయండి, అప్పుడు సహజముగా ప్రతి బీజము యొక్క ఫలము వెలువడుతుంది. దీని ద్వారా విశ్వ కళ్యాణ సేవ తీవ్రతరమవుతుంది.

స్లోగన్:-
తండ్రి దీవెనలను తీసుకుంటూ సదా నిండుదనాన్ని అనుభవం చేయండి.

అవ్యక్త సూచనలు - ‘‘కంబైండ్ రూపపు స్మృతి ద్వారా సదా విజయులుగా అవ్వండి’’

సదా ప్రతి కర్మను చేస్తూ స్వయాన్ని కర్మయోగి ఆత్మగా అనుభవము చెయ్యండి. ఏ కర్మను చేస్తున్నా కూడా స్మృతిని మర్చిపోకూడదు. కర్మ మరియు యోగము - రెండూ కంబైండ్ అవ్వాలి. కలిసిపోయినవాటిని ఏ విధంగా వేరు చెయ్యలేమో అలా కర్మయోగిగా అవ్వండి.