04-07-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - సోదరీ-సోదరులము అన్న భానము నుండి కూడా బయటకు వచ్చి పరస్పరం సోదరులుగా భావించండి, తద్వారా నిర్వికారీ దృష్టి ఏర్పడుతుంది. ఆత్మ ఎప్పుడైతే నిర్వికారీ దృష్టి కలదిగా అవుతుందో, అప్పుడు కర్మాతీతముగా అవ్వగలుగుతుంది’’

ప్రశ్న:-
తమ లోపాలను తొలగించుకునేందుకు ఏ యుక్తిని రచించాలి?

జవాబు:-
తమ క్యారెక్టర్ యొక్క రిజిస్టరును పెట్టుకోండి. అందులో మీ రోజువారీ లెక్కాపత్రాన్ని నోట్ చేసుకోండి. రిజిస్టరు పెట్టుకున్నట్లయితే తమ లోపాల గురించి తెలుస్తుంది, ఆపై సహజంగానే వాటిని తొలగించుకోగలుగుతారు. ఆ లోపాలను తొలగించుకుంటూ, తొలగించుకుంటూ ఏ అవస్థ వరకు చేరుకోవాలంటే - ఒక్క తండ్రి తప్ప ఇంకేదీ గుర్తుకురాకుడదు. ఏ పాత వస్తువు పట్ల మమకారము ఉండకూడదు. లోపల ఏదైనా అడగాలి అనే కోరిక ఉండకూడదు.

ఓంశాంతి
ఒకటేమో మానవ బుద్ధి, మరొకటి ఈశ్వరీయ బుద్ధి, ఆ తర్వాత దైవీ బుద్ధి ఉంటుంది. మానవ బుద్ధి అసురీ బుద్ధి. వికారీ దృష్టి కలవారిగా ఉన్నారు కదా. ఒకటేమో, నిర్వికారీ దృష్టి కలవారిగా ఉండటము, ఇంకొకటి, వికారీ దృష్టి కలవారిగా ఉండటము. దేవతలు నిర్వికారులు, నిర్వికారీ దృష్టి కలవారు మరియు ఇక్కడ కలియుగ మనుష్యులు వికారులు, వికారీ దృష్టి కలవారు. వారి ఆలోచనలే వికారీగా ఉంటాయి. వికారీ దృష్టి కల మనుష్యులు రావణుడి జైలులో పడి ఉంటారు. రావణ రాజ్యములో అందరూ వికారీ దృష్టి కలవారే, ఒక్కరు కూడా నిర్వికారీ దృష్టి కలవారు లేరు. ఇప్పుడు మీరు పురుషోత్తమ సంగమయుగములో ఉన్నారు. ఇప్పుడు బాబా మిమ్మల్ని వికారీ దృష్టి కలవారి నుండి మార్చి నిర్వికారీ దృష్టి కలవారిగా తయారుచేస్తున్నారు. వికారీ దృష్టి కలవారిలో కూడా అనేక రకాలుగా ఉంటారు. కొందరు సెమీ వికారీ దృష్టి కలవారు ఉంటారు, కొందరు మరోలా ఉంటారు. ఎప్పుడైతే నిర్వికారీ దృష్టి కలవారిగా అవుతారో అప్పుడు కర్మాతీత అవస్థ ఏర్పడుతుంది, ఆ తర్వాత సోదర దృష్టి తయారవుతుంది. ఆత్మ ఆత్మను చూస్తే, శరీరమనేదే లేకపోతే ఇక వికారీ దృష్టి కలవారిగా ఎలా ఉంటారు? అందుకే తండ్రి అంటారు, మిమ్మల్ని మీరు సోదరీ, సోదరులము అన్న భానము నుండి తొలగించుకుంటూ వెళ్ళండి. పరస్పరం సోదరులము అని భావించండి. ఇది కూడా చాలా గుహ్యమైన విషయము. ఇది ఎప్పుడూ ఎవరి బుద్ధిలోకి రాలేదు. నిర్వికారీ దృష్టి కలవారు అన్న మాటకు అర్థము ఎవరి బుద్ధిలోకి రాలేదు. ఒకవేళ అలా వచ్చినట్లయితే ఉన్నత పదవిని పొందగలుగుతారు. స్వయాన్ని ఆత్మగా భావించండి, శరీరాన్ని మర్చిపోవాలి అని తండ్రి అర్థం చేయిస్తారు. ఈ శరీరాన్ని కూడా తండ్రి స్మృతిలోనే వదలాలి. ఆత్మనైన నేను తండ్రి వద్దకు వెళ్తున్నాను. దేహము యొక్క అభిమానాన్ని వదిలి పవిత్రముగా తయారుచేసే తండ్రి స్మృతిలోనే శరీరాన్ని వదలాలి. వికారీ దృష్టి కలవారిగా ఉన్నట్లయితే లోలోపల మనస్సు తప్పకుండా తింటూ ఉంటుంది. గమ్యము చాలా ఉన్నతమైనది. మంచి-మంచి పిల్లలైనా సరే, ఏవో పొరపాట్లు తప్పకుండా జరుగుతూ ఉంటాయి ఎందుకంటే మాయ ఉంది కదా. కర్మాతీతులుగానైతే ఎవ్వరూ అవ్వలేరు. కర్మాతీత అవస్థను చివరిలో పొందుతారు, అప్పుడు నిర్వికారీ దృష్టి కలవారిగా అవ్వగలుగుతారు. అప్పుడిక ఆ ఆత్మిక సోదర ప్రేమ ఉంటుంది. ఆత్మిక సోదర ప్రేమ చాలా బాగుంటుంది, అప్పుడిక వికారీ దృష్టి ఉండదు, అప్పుడే ఉన్నత పదవిని పొందగలుగుతారు. బాబా లక్ష్యమును, ఉద్దేశ్యమును పూర్తిగా తెలియజేస్తారు. మాలో ఈ-ఈ లోపాలు ఉన్నాయి అని పిల్లలు భావిస్తారు. ఎప్పుడైతే మీరు రిజిస్టరును పెట్టుకుంటారో, అప్పుడు లోపాలను గురించి కూడా తెలుస్తుంది. కొందరు రిజిస్టరు వ్రాయకపోయినా కానీ బాగైపోవచ్చు. కానీ ఎవరైతే కచ్చాగా (అపరిపక్వముగా) ఉంటారో, వారు రిజిస్టరును తప్పకుండా పెట్టాలి. అపరిపక్వముగానైతే ఎంతోమంది ఉన్నారు, కొందరికైతే అసలు వ్రాయడమే రాదు. మీ అవస్థ ఎలా ఉండాలంటే, ఇక మీకు ఇంకెవ్వరి స్మృతి రాకూడదు. ఆత్మ అయిన మనం శరీరము లేకుండా వచ్చాము, ఇప్పుడిక అశరీరిగా అయి వెళ్ళాలి, దీనికి సంబంధించి ఒక కథ కూడా ఉంది - మీరు చేతికర్రను కూడా తీసుకోకండి, అది కూడా చివరిలో గుర్తుకువస్తుంది అని ఆ కథలో చెప్పారు. ఏ వస్తువు పట్ల మమకారము పెట్టుకోకూడదు. చాలామందికి పాత వస్తువులపై మమకారము ఉంటుంది. ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ గుర్తుకురాకూడదు. ఇది ఎంత ఉన్నతమైన గమ్యము. రాయి-రప్పలు ఎక్కడ, శివబాబా స్మృతి ఎక్కడ. ఏదైనా అడగాలి అన్న కోరిక ఉండకూడదు. ప్రతి ఒక్కరూ తక్కువలో తక్కువ 6 గంటలైనా సేవను తప్పకుండా చేయాలి. ఆ మాటకొస్తే గవర్నమెంట్ సర్వీస్ 8 గంటలు ఉంటుంది, కానీ పాండవ గవర్నమెంట్ సర్వీస్ ను తక్కువలో తక్కువ 5-6 గంటలైనా తప్పకుండా చేయండి. వికారీ మనుష్యులు ఎప్పుడూ బాబాను స్మృతి చేయలేరు. సత్యయుగములో నిర్వికారీ ప్రపంచము ఉంటుంది. సర్వగుణ సంపన్నులు, 16 కళల సంపూర్ణులు... అని దేవీ-దేవతల మహిమ గానం చేయబడుతుంది. పిల్లలైన మీ అవస్థ ఎంత ఉపరామముగా ఉండాలి. ఏ అశుద్ధమైన వస్తువు పట్ల మమకారము ఉండకూడదు. శరీరము పట్ల కూడా మమకారము ఉండకూడదు. అంతటి యోగీగా అవ్వాలి. ఎప్పుడైతే నిజంగానే ఇటువంటి యోగీగా అవుతారో, అప్పుడు ఫ్రెష్ గా (తాజాగా) ఉన్నట్లు ఉంటారు. ఎంతగా మీరు సతోప్రధానముగా అవుతూ ఉంటారో, అంతగా సంతోషపు పాదరసము పైకెక్కుతూ ఉంటుంది. 5000 సంవత్సరాల క్రితం కూడా ఇటువంటి సంతోషము ఉండేది. సత్యయుగములో కూడా అదే సంతోషము ఉంటుంది. ఇక్కడ కూడా సంతోషము ఉంటుంది, మళ్ళీ ఇదే సంతోషమును మీతో పాటు తీసుకువెళ్తారు. అంతమతిని బట్టి గతి ఏర్పడుతుంది అని అంటారు కదా. ఇప్పటి అంతిమ స్థితి బట్టి గతి (జన్మ) సత్యయుగములో ఉంటుంది. ఈ విషయాలను బాగా విచార సాగర మంథనము చేయవలసి ఉంటుంది.

తండ్రి దుఃఖహర్త, సుఖకర్త. మేము తండ్రి పిల్లలము అని మీరు అంటారు కావున ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు. అందరికీ సుఖము యొక్క మార్గాన్ని తెలియజేయాలి. ఒకవేళ సుఖాన్ని ఇవ్వకపోతే తప్పకుండా దుఃఖాన్ని ఇస్తారు. ఇది పురుషోత్తమ సంగమయుగము, ఇప్పుడు మీరు సతోప్రధానముగా అయ్యేందుకు పురుషార్థం చేస్తారు. పురుషార్థులు కూడా నంబరువారుగా ఉంటారు. ఎప్పుడైతే పిల్లలు మంచి సేవను చేస్తారో, అప్పుడు తండ్రి - ఫలానా బిడ్డ యోగీ అని వారి మహిమను చేస్తారు. సర్వీసబుల్ పిల్లలెవరైతే ఉన్నారో, వారు నిర్వికారీ జీవితములో ఉన్నారు. ఎవరికైతే కొద్దిగా కూడా అలాంటి-ఇలాంటి ఆలోచనలు రావో, వారే చివరిలో కర్మాతీత అవస్థను పొందుతారు. బ్రాహ్మణులైన మీరే నిర్వికారీ దృష్టి కలవారిగా అవుతున్నారు. మనుష్యులను ఎప్పుడూ దేవతలు అని అనలేరు. ఎవరైతే వికారీ దృష్టి కలవారిగా ఉంటారో, వారు పాపము తప్పకుండా చేస్తారు. సత్యయుగ ప్రపంచము పవిత్ర ప్రపంచము. ఇది పతిత ప్రపంచము. దీని అర్థాన్ని కూడా అర్థం చేసుకోరు. ఎప్పుడైతే బ్రాహ్మణులుగా అవుతారో, అప్పుడు అర్థం చేసుకుంటారు. జ్ఞానము చాలా బాగుంది కానీ తీరిక దొరికినప్పుడు వస్తాము అని అంటారు. ఇక వారు ఎప్పటికీ రారు అని బాబా అర్థం చేసుకుంటారు. అది తండ్రిని అవమానపర్చడమే అవుతుంది. మనుష్యుల నుండి దేవతలుగా తయారవుతారు కావున వెంటనే అది చేయాలి కదా. రేపటిపై వదిలితే మాయ ముక్కును పట్టుకొని బురదలో పడేస్తుంది. రేపు, రేపు అంటూ మృత్యువు కబళించి వేస్తుంది. శుభకార్యములో ఆలస్యం చేయకూడదు. మృత్యువు మీ శిరస్సుపై ఉంది. ఎంతమంది మనుష్యులు అకస్మాత్తుగా మరణిస్తూ ఉంటారు. ఇప్పుడు బాంబులు పడితే ఎంతమంది మనుష్యులు మరణిస్తారు! భూకంపాలు వచ్చినప్పుడు ముందే తెలియదు. డ్రామానుసారంగా ప్రకృతి వైపరీత్యాలు కూడా జరగనున్నాయి, వాటిని ఎవ్వరూ తెలుసుకోలేరు. ఎంతో నష్టము వాటిల్లుతుంది. దాని వలన ఇక ప్రభుత్వం రైలు కిరాయి మొదలైనవి కూడా పెంచేస్తుంది. కానీ మనుష్యులైతే ప్రయాణించవలసిందే. మనుష్యులు ఇవ్వగలిగే విధంగా వారి సంపాదనను ఎలా పెంచాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ధాన్యము ఎంత ఖరీదైపోయింది. నిర్వికారీ దృష్టి కలవారిని పవిత్ర ఆత్మ అని అంటారు అని తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. ఈ ప్రపంచమే వికారీ దృష్టి కలదిగా అయిపోయింది. మీరు ఇప్పుడు నిర్వికారీ దృష్టి కలవారిగా అవుతారు. ఇందులో శ్రమ ఉంది, ఉన్నత పదవిని పొందడం అంత సులువైన విషయమేమీ కాదు. ఎవరైతే ఎంతో నిర్వికారీ దృష్టి కలవారిగా అవుతారో, వారే ఉన్నత పదవిని పొందుతారు. మీరు ఇక్కడకు నరుని నుండి నారాయణునిగా అయ్యేందుకు వచ్చారు. కానీ ఎవరైతే నిర్వికారీ దృష్టి కలవారిగా అవ్వరో, జ్ఞానాన్ని చేపట్టలేరో, వారు పదవి కూడా తక్కువది పొందుతారు. ఈ సమయములో మనుష్యులందరిదీ వికారీ దృష్టి, సత్యయుగములో నిర్వికారీ దృష్టి ఉంటుంది.

తండ్రి అర్థం చేయిస్తారు - మధురమైన పిల్లలూ, దేవీ-దేవతలైన మీరు స్వర్గానికి యజమానులుగా అవ్వాలనుకుంటే చాలా-చాలా నిర్వికారీ దృష్టి కలవారిగా అవ్వండి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి, తద్వారా 100 శాతము ఆత్మాభిమానులుగా అవ్వగలుగుతారు. ఎవరికైనా అర్థాన్ని వివరించాలి. సత్యయుగములో పాపము యొక్క విషయమేదీ ఉండదు. వారు సర్వగుణ సంపన్నులుగా మరియు సంపూర్ణ నిర్వికారీ దృష్టి కలవారిగా ఉంటారు. చంద్రవంశీయులకు కూడా రెండు కళలు తక్కువ ఉంటాయి. చంద్రునికి కూడా చివరిలో సన్నని రేఖ మిగిలి ఉంటుంది. పూర్తిగా లేకుండా అయిపోదు, మాయమైపోయింది అని అంటారు. మేఘాల కారణంగా కనిపించదు. తండ్రి అంటారు, అలా మీ జ్యోతి కూడా పూర్తిగా ఆరిపోదు, ఎంతోకొంత ప్రకాశము ఉంటుంది. సుప్రీమ్ బ్యాటరీ నుండి మళ్ళీ మీరు శక్తిని తీసుకుంటారు. నాతో మీరు ఏ విధంగా యోగాన్ని జోడించగలరు అన్నది వారు స్వయమే వచ్చి తెలియజేస్తారు. టీచర్ చదివించేటప్పుడు బుద్ధియోగము టీచర్ తో జోడింపబడి ఉంటుంది కదా. టీచర్ ఇచ్చే డైరెక్షన్ల అనుసారంగా చదువుతారు. మేము కూడా చదువుకుని టీచర్ లేక బ్యారిస్టరుగా అవుతాము అని భావిస్తారు. ఇందులో కృప లేక ఆశీర్వాదము చూపించే విషయమేమీ ఉండదు. తల వంచి నమస్కరించవలసిన అవసరం ఉండదు. అయితే, ఎవరైనా హరి ఓం అని లేక రాం రాం అని అంటే దానికి బదులు ఇవ్వవలసి ఉంటుంది. అది కూడా గౌరవాన్ని ఇవ్వడమే. అహంకారాన్ని చూపించకూడదు. మనమైతే ఒక్క తండ్రినే స్మృతి చేయాలి అని మీకు తెలుసు. ఎవరైనా భక్తిని వదిలినా గొడవ అయిపోతుంది. భక్తిని వదిలేవారిని నాస్తికులుగా భావిస్తారు. వారు నాస్తికులు అని ఎవరిని అంటారు మరియు మీరు నాస్తికలు అని ఎవరిని అంటారు అన్నదానిలో ఎంత తేడా ఉంటుంది. వారికి తండ్రి గురించి తెలియదు కావున వారు నాస్తికులు, అనాథలు అని మీరంటారు. అందుకే వారంతా కొట్లాడుకుంటూ-గొడవపడుతూ ఉంటారు. ప్రతి ఇంటిలోనూ గొడవలు, అశాంతి ఉన్నాయి. క్రోధానికి గుర్తు అశాంతి. అక్కడ ఎంతటి అపారమైన శాంతి ఉంటుంది. భక్తిలో ఎంతో శాంతి లభిస్తుంది అని మనుష్యులు అంటారు, కానీ అది అల్పకాలికముగా లభిస్తుంది. మీకు సదా కొరకు శాంతి కావాలి కదా. మీరు సనాథల నుండి అనాథలుగా అవుతారు, అప్పుడు శాంతి నుండి మళ్ళీ అశాంతిలోకి వచ్చేస్తారు. అనంతమైన తండ్రి అనంతమైన సుఖ వారసత్వాన్ని ఇస్తారు. హద్దు తండ్రి నుండి హద్దు సుఖము యొక్క వారసత్వం లభిస్తుంది. వాస్తవానికి అది దుఃఖపు మరియు కామవికారపు వారసత్వము, అందులో అంతా దుఃఖమే దుఃఖము ఉంది. అందుకే తండ్రి అంటారు - మీరు ఆదిమధ్యాంతాలు దుఃఖాన్ని పొందుతారు.

తండ్రి అంటారు, పతిత-పావనుడైన తండ్రినైన నన్ను స్మృతి చేయండి. దీనిని సహజ స్మృతి మరియు సృష్టి చక్రము యొక్క సహజ జ్ఞానము అని అంటారు. మీరు స్వయాన్ని ఆది సనాతన దేవీ-దేవతా ధర్మానికి చెందినవారిగా భావించినట్లయితే తప్పకుండా స్వర్గములోకి వస్తారు. స్వర్గములో అందరూ నిర్వికారీ దృష్టి కలవారిగా ఉండేవారు. దేహాభిమానులను వికారీ దృష్టి కలవారు అని అంటారు. నిర్వికారీ దృష్టి కలవారిలో ఎటువంటి వికారాలు ఉండవు. తండ్రి ఎంత సహజంగా చేసి అర్థం చేయిస్తున్నారు కానీ పిల్లలకు ఇది కూడా గుర్తుండదు ఎందుకంటే వికారీ దృష్టి కలవారిగా ఉన్నారు. అందుకే వారికి అశుద్ధమైన ప్రపంచమే గుర్తుకువస్తుంది. తండ్రి అంటారు, ఈ ప్రపంచాన్ని మర్చిపోండి. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. శరీరము పట్ల కొద్దిగా కూడా మమకారము లేనటువంటి యోగీగా అవ్వాలి. ఎటువంటి అశుద్ధమైన వస్తువు వైపు ఆసక్తి కలగకూడదు. మీ అవస్థ అంత ఉపరామముగా ఉండాలి. సంతోషము యొక్క పాదరసము పైకెక్కి ఉండాలి.

2. మృత్యువు శిరస్సుపై ఉంది, అందుకే శుభకార్యములో ఆలస్యం చేయకూడదు. దేనిని రేపటికని వదిలేయకూడదు.

వరదానము:-

అన్నీ తెలిసిన చతురులైన తండ్రితో చతురతతో వ్యవహరించడానికి బదులుగా రియలైజేషన్ శక్తి ద్వారా సర్వ పాపాల నుండి ముక్త భవ

చాలామంది పిల్లలు అన్నీ తెలిసిన చతురులైన తండ్రితో కూడా చతురతతో వ్యవహరిస్తుంటారు. వారి పనిని నిరూపించుకునేందుకు, వారి పేరును మంచిగా చేసుకునేందుకు, ఆ సమయములో రియలైజ్ అవుతారు, కానీ ఆ రియలైజేషన్ లో శక్తి ఉండదు, అందుకే పరివర్తన జరగదు. ఇది కరక్ట్ కాదు అని చాలామంది అర్థం చేసుకుంటారు కానీ ఎక్కడా తమ పేరు పాడవ్వకూడదు అని ఆలోచిస్తారు, అందుకే తమ వివేకాన్ని హతమార్చేస్తారు, ఇది కూడా పాప ఖాతాలో జమ అవుతుంది, అందుకే చతురతను వదిలి సత్యమైన హృదయము యొక్క రియలైజేషన్ తో స్వయాన్ని పరివర్తన చేసుకుని పాపాల నుండి ముక్తులుగా అవ్వండి.

స్లోగన్:-

జీవితములో ఉంటూ భిన్న-భిన్న బంధనాల నుండి ముక్తులుగా ఉండటమే జీవన్ముక్త స్థితి.