04-10-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - శ్రేష్ఠాతి శ్రేష్ఠముగా తయారయ్యేందుకు స్వయముగా భగవంతుడు మీకు శ్రేష్ఠ మతాన్ని ఇస్తున్నారు, దీని ద్వారా మీరు నరకవాసుల నుండి స్వర్గవాసులుగా అవుతారు’’

ప్రశ్న:-
దేవతలుగా అయ్యే పిల్లలు విశేషముగా ఏ విషయాల పట్ల ధ్యానముంచాలి?

జవాబు:-
ఎప్పుడూ ఏ విషయములోనూ అలగకూడదు, ముఖాన్ని శవం వలె చేసుకోకూడదు. ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు. దేవతలుగా అవ్వాలంటే నోటి నుండి సదా పుష్పాలే వెలువడాలి. ఒకవేళ ముళ్ళు లేక రాళ్ళు వెలువడితే ఇక రాళ్ళుగానే ఉండిపోయినట్లు. చాలా మంచి గుణాలను ధారణ చేయాలి. ఇక్కడే సర్వగుణ సంపన్నులుగా అవ్వాలి. శిక్షలు అనుభవించినట్లయితే ఇక మంచి పదవి లభించదు.

ఓంశాంతి
కొత్త విశ్వానికి లేక కొత్త ప్రపంచానికి యజమానులుగా అయ్యే ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. తండ్రి అనంతమైన వారసత్వాన్ని ఇచ్చేందుకు వచ్చారని పిల్లలు అర్థం చేసుకుంటారు. ఇంతకుముందు మనము యోగ్యులుగా లేము. ఓ ప్రభూ, నేను యోగ్యునిగా లేను, నన్ను యోగ్యునిగా తయారుచేయండి అని అంటారు. తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు - మీరూ మనుష్యులే, ఈ దేవతలు కూడా మనుష్యులే, కానీ వీరిలో దైవీ గుణాలు ఉన్నాయి. వీరిని సత్యాతి-సత్యమైన మనుష్యులని అంటారు. మనుష్యులలో ఆసురీ గుణాలు ఉంటే వారి నడవడిక జంతువుల వలె అయిపోతుంది. దైవీ గుణాలు లేకపోతే, వారిని ఆసురీ గుణాలు కలవారని అంటారు. ఇప్పుడు మళ్ళీ తండ్రి వచ్చి మిమ్మల్ని శ్రేష్ఠమైన దేవతలుగా తయారుచేస్తారు. సత్యఖండములో ఉండే సత్యాతి-సత్యమైన మనుష్యులు ఈ లక్ష్మీ-నారాయణులు, వీరిని దేవతలు అని అంటారు. వీరిలో దైవీ గుణాలు ఉన్నాయి. ఓ పతితపావనా, రండి అని పాడుతారు కూడా, కానీ పావన రాజులుగా ఎలా అవుతారు, మళ్ళీ పతిత రాజులుగా ఎలా అవుతారు అనే ఈ రహస్యము ఎవ్వరికీ తెలియదు. అది భక్తి మార్గము. జ్ఞానము గురించి అయితే ఎవ్వరికీ తెలియదు. ఇది పిల్లలైన మీకు తండ్రి అర్థం చేయిస్తారు మరియు ఆ విధంగా తయారుచేస్తారు. కర్మలైతే ఈ దేవతలు కూడా సత్యయుగములో చేస్తారు కానీ వారు పతిత కర్మలు చేయరు. వారిలో దైవీ గుణాలు ఉన్నాయి. ఛీ-ఛీ కర్మలు చేయనివారే స్వర్గవాసులుగా అవుతారు. నరకవాసుల చేత మాయ ఛీ-ఛీ కర్మలు చేయిస్తుంది. ఇప్పుడు భగవంతుడు కూర్చుని శ్రేష్ఠ కర్మలు చేయిస్తారు మరియు ఇటువంటి ఛీ-ఛీ కర్మలు చేయకండి అని శ్రేష్ఠ మతాన్ని ఇస్తారు. శ్రేష్ఠాతి శ్రేష్ఠముగా అయ్యేందుకు శ్రేష్ఠాతి శ్రేష్ఠమైన మతాన్ని ఇస్తారు. దేవతలు శ్రేష్ఠమైనవారు కదా. వారు ఉండటము కూడా కొత్త ప్రపంచమైన స్వర్గములో ఉంటారు. ఇది కూడా మీకు నంబరువారు పురుషార్థమనుసారముగా తెలుసు, అందుకే మాలలు కూడా 8 మణులవి, 108 మణులవి తయారవుతాయి, ఒకవేళ 16,108 మణుల మాల అని అన్నా కూడా, అది ఎంతమంది. ఇన్ని కోట్లమంది మనుష్యులు ఉన్నారు, ఇందులో 16 వేల మంది వెలువడడమంటే ఎంతమంది తయారైనట్లు. పావు శాతము కూడా కాదు. తండ్రి పిల్లలను ఎంత ఉన్నతముగా తయారుచేస్తారు. ఎటువంటి వికర్మలు చేయకండి అని రోజూ పిల్లలకు అర్థం చేయిస్తారు. మీకు ఇటువంటి తండ్రి లభించారు కనుక మీకు చాలా సంతోషముండాలి. మమ్మల్ని అనంతమైన తండ్రి దత్తత తీసుకున్నారు, మేము వారికి చెందినవారిగా అయ్యామని మీరు భావిస్తారు. తండ్రి స్వర్గ రచయిత. కావున అటువంటి స్వర్గానికి యజమానులుగా అయ్యేందుకు యోగ్యులుగా, సర్వగుణ సంపన్నులుగా అవ్వవలసి ఉంటుంది. ఈ లక్ష్మీ-నారాయణులు సర్వగుణ సంపన్నులుగా ఉండేవారు. వీరి యోగ్యత గురించి మహిమ చేయడం జరుగుతుంది, మళ్ళీ 84 జన్మల తర్వాత అయోగ్యులుగా అయిపోతారు. ఒక జన్మ కిందికి దిగినా కానీ కొంత కళ తగ్గిపోయినట్లే. అలా మెల్లమెల్లగా తగ్గిపోతూ ఉంటాయి. డ్రామా కూడా పేను వలె నడుస్తుంది కదా. అలా మీరు కూడా మెల్లమెల్లగా కిందకి దిగుతారు, అప్పుడు 1250 సంవత్సరాలలో రెండు కళలు తగ్గిపోతాయి. ఇక తర్వాత రావణ రాజ్యములో త్వరత్వరగా కళలు తగ్గిపోతాయి. గ్రహణము పడుతుంది. సూర్య-చంద్రులకు కూడా గ్రహణము పడుతుంది కదా. చంద్రునికి, నక్షత్రాలకు గ్రహణము పట్టదని కాదు. అందరికీ పూర్తిగా గ్రహణము పట్టి ఉంది. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - స్మృతి ద్వారానే గ్రహణము తొలగిపోతుంది. ఏ పాపమూ చేయకండి. మొదటి నంబరు పాపము దేహాభిమానములోకి రావడము. ఇది కఠినమైన పాపము. పిల్లలకు ఈ ఒక్క జన్మ కోసమే శిక్షణ లభిస్తుంది ఎందుకంటే ఇప్పుడు ప్రపంచము పరివర్తన అవ్వనున్నది. ఇటువంటి శిక్షణ ఇక మళ్ళీ ఎప్పుడూ లభించదు. బ్యారిస్టరీ మొదలైనవాటి శిక్షణలైతే మీరు జన్మ-జన్మాంతరాలుగా తీసుకుంటూ వచ్చారు. స్కూళ్లు మొదలైనవైతే ఎల్లప్పుడూ ఉండనే ఉన్నాయి. ఈ జ్ఞానము కేవలం ఒక్కసారి మాత్రమే లభిస్తుంది, అంతే. జ్ఞానసాగరుడైన తండ్రి ఒక్కసారి మాత్రమే వస్తారు. వారు తమ మరియు తమ రచన యొక్క ఆదిమధ్యాంతాల పూర్తి జ్ఞానాన్ని ఇస్తారు. తండ్రి ఎంత సహజంగా అర్థం చేయిస్తున్నారు - ఆత్మలైన మీరు పాత్రధారులు. ఆత్మలు తమ ఇంటి నుండి వచ్చి ఇక్కడ పాత్రను అభినయిస్తారు. దానిని ముక్తిధామమని అంటారు. స్వర్గము జీవన్ముక్తి. ఇక్కడ ఉన్నది జీవనబంధనము. ఈ పదాలను కూడా యథార్థముగా గుర్తుంచుకోవాలి. మోక్షము ఎప్పుడూ లభించదు. మనుష్యులు మోక్షము లభించాలని కోరుకుంటారు అనగా రాకపోకల నుండి విముక్తులవ్వాలని కోరుకుంటారు. కానీ పాత్ర నుండైతే విముక్తులు కాలేరు. ఇది అనాదిగా తయారై, తయారుచేయబడిన నాటకము. ప్రపంచ చరిత్ర-భౌగోళికాలు యథావిధిగా రిపీట్ అవుతాయి. సత్యయుగములో ఆ దేవతలే మళ్ళీ వస్తారు. ఆ తర్వాత వారి వెనుక ఇస్లామీయులు, బౌద్ధులు మొదలైనవారంతా వస్తారు. ఈ మానవ వృక్షము తయారవుతుంది. దీని బీజము పైన ఉన్నారు. తండ్రి మనుష్య సృష్టికి బీజరూపుడు. మనుష్య సృష్టి అయితే ఎప్పుడూ ఉంటుంది కానీ సత్యయుగములో ఇది చాలా చిన్నదిగా ఉంటుంది, ఆ తర్వాత మెల్లమెల్లగా చాలా వృద్ధి చెందుతూ ఉంటుంది. అచ్ఛా, మళ్ళీ చిన్నదిగా ఎలా అవుతుంది? తండ్రి వచ్చి పతితము నుండి పావనముగా తయారుచేస్తారు. ఎంత కొద్దిమంది పావనముగా అవుతారు. కోట్లలో ఏ ఒక్కరో వెలువడుతారు. అర్ధకల్పము చాలా కొద్దిమందే ఉంటారు. ఆ తర్వాత వచ్చే అర్ధకల్పములో ఎంత వృద్ధి జరుగుతుంది. అందరికన్నా ఎక్కువగా ఈ దేవతా సాంప్రదాయము వారే ఉండాలి ఎందుకంటే మొట్టమొదట వీరే వస్తారు కానీ వారు వేరే-వేరే ధర్మాలలోకి వెళ్ళిపోతారు ఎందుకంటే వారు తండ్రినే మర్చిపోయారు. ఇది ఒకే ఒక్క పొరపాటు యొక్క నాటకము. మర్చిపోవడముతో నిరుపేదగా అయిపోతారు. మర్చిపోతూ, మర్చిపోతూ ఇక పూర్తిగా మర్చిపోతారు. భక్తి కూడా మొదట ఒక్కరికే చేస్తారు ఎందుకంటే సర్వులకు సద్గతిని ఇచ్చేవారు ఒక్కరే, కావున ఇంకెవరికైనా ఎందుకు భక్తి చేయాలి. ఈ లక్ష్మీ-నారాయణులను కూడా తయారుచేసేవారు శివుడే కదా. శ్రీకృష్ణుడు తయారుచేసేవారిగా ఎలా అవుతారు. అది జరగదు. రాజయోగాన్ని నేర్పించేవారు శ్రీకృష్ణుడు ఎలా అవుతారు. వారు సత్యయుగ రాకుమారుడు. ఎంత పొరపాటు చేసేశారు. బుద్ధిలో కూర్చోదు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేయండి మరియు దైవీ గుణాలను ధారణ చేయండి. ఆస్తికి సంబంధించిన గొడవలు మొదలైనవి ఏవైనా ఉంటే వాటిని సమాప్తము చేయండి. గొడవ పడుతూ, గొడవ పడుతూ ప్రాణాలు కూడా పోతాయి. తండ్రి అర్థం చేయిస్తున్నారు, వీరు (బ్రహ్మాబాబా) విడిచిపెట్టినప్పుడు గొడవేమీ చేయలేదు కదా. తక్కువ లభిస్తే లభించనివ్వండి, దానికి బదులుగా ఎంత రాజ్యము లభించింది. బాబా అంటారు, నాకు వినాశనము మరియు రాజ్యము యొక్క సాక్షాత్కారమైనప్పుడు ఎంత సంతోషము కలిగింది, నాకు విశ్వ రాజ్యాధికారము లభించబోతుంది అన్నప్పుడు ఇక ఇవన్నీ ఏమిటి. ఆకలితో ఎవ్వరూ మరణించరు కదా. ధనము లేని వారు కూడా కడుపు నింపుకుంటారు కదా. మమ్మా ఏమైనా తీసుకువచ్చారా. మమ్మాను ఎంతగా గుర్తు చేసుకుంటూ ఉంటారు. తండ్రి అంటారు, గుర్తు చేసుకుంటూ ఉంటారు, అది సరే కానీ ఇప్పుడు మమ్మా యొక్క నామ-రూపాలను గుర్తు చేసుకోకూడదు. మనము కూడా మమ్మా వలె ధారణ చేయాలి. మనము కూడా మమ్మా వలె మంచిగా తయారై సింహాసనానికి యోగ్యులుగా తయారవ్వాలి. కేవలం మమ్మాను మహిమ చేయడము వలన అలా తయారైపోరు కదా. తండ్రి అంటారు, నన్నొక్కరినే స్మృతి చేయండి, స్మృతి యాత్రలో ఉండాలి. మమ్మా వలె జ్ఞానాన్ని వినిపించాలి. మీరు కూడా అటువంటి మహిమా యోగ్యులుగా తయారై చూపించినప్పుడే మమ్మా మహిమను ఋజువు చేసినట్లు. కేవలం మమ్మా-మమ్మా అని అంటే కడుపు నిండదు, అంతేకాదు, ఇంకా కడుపు వీపుకు అంటుకుంటుంది. శివబాబాను స్మృతి చేస్తే కడుపు నిండుతుంది. ఈ దాదాను స్మృతి చేసినా కడుపు నిండదు. ఒక్కరినే స్మృతి చేయాలి. గొప్పతనమంతా ఒక్కరిదే. సేవ కోసం యుక్తులు రచించాలి. సదా నోటి నుండి పుష్పాలే వెలువడాలి. ఒకవేళ ముళ్ళు, రాళ్ళు వెలువడినట్లయితే రాళ్ళుగానే ఉండిపోయినట్లు. చాలా మంచి గుణాలను ధారణ చేయాలి. మీరు ఇక్కడే సర్వగుణ సంపన్నులుగా అవ్వాలి. శిక్షలు అనుభవించినట్లయితే ఇక మంచి పదవి లభించదు. ఇక్కడకు పిల్లలు తండ్రి నుండి డైరెక్టుగా వినేందుకు వస్తారు. ఇక్కడ బాబా తాజా-తాజా నషాను ఎక్కిస్తారు. సెంటర్లో నషా ఎక్కుతుంది, మళ్ళీ ఇంటికి వెళ్తే, సంబంధీకులు మొదలైనవారిని చూస్తే అది సమాప్తమైపోతుంది. ఇక్కడ, మేము బాబా పరివారములో కూర్చున్నామని మీరు భావిస్తారు. అక్కడ ఆసురీ పరివారము ఉంటుంది. ఎన్ని గొడవలు మొదలైనవి ఉంటాయి. అక్కడకు వెళ్ళగానే చెత్తలోకి వెళ్ళి పడిపోతారు. ఇక్కడైతే మీరు తండ్రిని మర్చిపోకూడదు. ప్రపంచములో సత్యమైన శాంతి ఎవ్వరికీ లభించదు. పవిత్రత, సుఖము, శాంతి, సంపదలను తండ్రి తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు. అలాగని తండ్రి - ఆయుష్మాన్ భవ, పుత్రవాన్ భవ అని ఆశీర్వదిస్తారు అని కాదు, ఆశీర్వాదాల ద్వారా ఏమీ లభించదు. ఇది మనుష్యుల పొరపాటు. సన్యాసులు మొదలైనవారు కూడా ఆశీర్వదించలేరు. ఈ రోజు ఆశీర్వదిస్తారు, రేపు స్వయమే మరణిస్తారు. పోప్ లు కూడా ఎంతమంది ఉండి వెళ్ళిపోయారో చూడండి. గురువుల సింహాసనము కొనసాగుతూ ఉంటుంది, గురువులు చిన్నతనములో మరణిస్తే, తర్వాత వేరొకరిని నియమిస్తారు లేదా ఒక చిన్న శిష్యుడిని గురువుగా నియమిస్తారు. ఇక్కడ ఇచ్చేవారు బాప్ దాదా. వారు మన వద్ద తీసుకుని ఏం చేస్తారు. తండ్రి అయితే నిరాకారుడు కదా. సాకారములో ఉన్నవారు తీసుకుంటారు. ఇది కూడా అర్థం చేసుకోవలసిన విషయము. మేము శివబాబాకు ఇస్తున్నాము అని ఎప్పుడూ అనకూడదు. అలా కాదు. మనము శివబాబా నుండి పదమాలు తీసుకున్నాము, అంతేకానీ ఇవ్వలేదు. బాబా అయితే మీకు లెక్కలేనంత ఇస్తారు. శివబాబా అయితే దాత, మీరు వారికి ఎలా ఇస్తారు? నేను ఇచ్చాను అని భావించినట్లయితే దేహాభిమానము వచ్చేస్తుంది. మనము శివబాబా నుండి తీసుకుంటున్నాము. బాబా వద్దకు ఎంతమంది పిల్లలు వస్తారు, వారు వచ్చి ఉంటారు కావున ఏర్పాట్లు కావాలి కదా, అంటే మీరు మీ కోసమే ఇస్తున్నారు. బాబా స్వయం కోసం ఏమీ చేసుకోరు. వారు రాజధానిని కూడా మీకే ఇస్తారు, కావున చేసుకునేది కూడా మీరే. నేను మిమ్మల్ని నా కంటే కూడా ఉన్నతముగా తయారుచేస్తాను. ఇటువంటి తండ్రిని మీరు మర్చిపోతారు. అర్ధకల్పము పూజ్యులుగా, అర్ధకల్పము పూజారులుగా అవుతారు. పూజ్యులుగా అవ్వడముతో మీరు సుఖధామానికి యజమానులుగా అవుతారు, మళ్ళీ పూజారులుగా అవ్వడముతో దుఃఖధామానికి యజమానులుగా అవుతారు. తండ్రి ఎప్పుడు వచ్చి స్వర్గ స్థాపన చేస్తారు అనేది కూడా ఎవ్వరికీ తెలియదు. ఈ విషయాల గురించి సంగమయుగీ బ్రాహ్మణులైన మీకు మాత్రమే తెలుసు. బాబా ఇంత మంచి రీతిలో అర్థం చేయిస్తారు, అయినా బుద్ధిలో కూర్చోదు. బాబా ఏ విధముగా అర్థం చేయిస్తారో, అలా యుక్తిగా అర్థం చేయించాలి. పురుషార్థము చేసి ఇలా శ్రేష్ఠముగా అవ్వాలి. తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు, పిల్లల్లో చాలా మంచి దైవీ గుణాలు ఉండాలి, ఏ విషయములోనూ అలగకూడదు, ముఖము శవము వలె చేసుకోకూడదు. తండ్రి అంటారు, ఇటువంటి పనులేవీ ఇప్పుడు చేయకండి. చండీ దేవీకి కూడా మేళా జరుగుతుంది. తండ్రి మతముపై నడవనివారిని చండిక అని అంటారు. ఎవరైతే దుఃఖమునిస్తారో, అటువంటి చండికలకు కూడా మేళా జరుగుతుంది. మనుష్యులు అజ్ఞానులు కదా, వారికి అర్థం తెలియదు. ఎవ్వరిలోనూ శక్తి లేదు, వారు లోపల పూర్తిగా ఖాళీగా ఉన్నారు. మీరు బాబాను మంచి రీతిలో స్మృతి చేస్తే తండ్రి ద్వారా మీకు శక్తి లభిస్తుంది. కానీ ఇక్కడ ఉంటున్నా కూడా చాలామంది బుద్ధి బయట భ్రమిస్తూ ఉంటుంది, అందుకే బాబా అంటారు, ఇక్కడ చిత్రాల ఎదురుగా కూర్చున్నట్లయితే మీ బుద్ధి వీటిలో బిజీగా ఉంటుంది. సృష్టిచక్రము, మెట్లవరుస చిత్రముపై ఎవరికైనా అర్థం చేయించేటప్పుడు వారికి చెప్పండి - సత్యయుగములో చాలా తక్కువమంది మనుష్యులు ఉంటారు, ఇప్పుడు అనేకమంది మనుష్యులు ఉన్నారు. తండ్రి అంటారు, నేను బ్రహ్మా ద్వారా కొత్త ప్రపంచ స్థాపనను చేయిస్తాను, పాత ప్రపంచ వినాశనమును చేయిస్తాను. కూర్చుని ఈ విధముగా అభ్యాసము చేయాలి. మీ అంతట మీరే నోరు తెరవగలరు. లోపల ఏదైతే నడుస్తుందో అది బయటకు కూడా రావాలి. మీరు మూగవారైతే కాదు కదా. ఇంట్లో అరవడానికి నోరు తెరుచుకుంటుంది, జ్ఞానము వినిపించడానికి తెరుచుకోదా! చిత్రాలైతే అందరికీ లభించగలవు, మీ ఇంటివారి కళ్యాణము చేసేందుకు ధైర్యము ఉంచాలి. మీ గదిని చిత్రాలతో అలంకరించినట్లయితే మీరు బిజీగా ఉంటారు. అది మీ లైబ్రరీగా అయిపోతుంది. ఇతరుల కళ్యాణము చేసేందుకు చిత్రాలు మొదలైనవి తగిలించి పెట్టాలి. ఎవరు వస్తే వారికి అర్థం చేయించండి. మీరు చాలా సేవ చేయగలరు. కొద్దిగా విన్నా ప్రజలుగా అవుతారు. బాబా ఉన్నతి కోసం ఇన్ని యుక్తులను తెలియజేస్తున్నారు. తండ్రిని స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి. ఇకపోతే గంగలోకి వెళ్ళి పూర్తిగా మునిగినా కూడా వికర్మలు వినాశనమవ్వవు. ఇదంతా అంధవిశ్వాసము. హరిద్వార్ లోనైతే మొత్తం నగరములోని మురికి అంతా వచ్చి గంగలోనే కలుస్తుంది. సాగరములోకి ఎంత మురికి చేరుతుంది. నదులలోకి కూడా చెత్త చేరుకుంటూ ఉంటుంది, మరి వాటి ద్వారా పావనముగా ఎలా అవ్వగలరు. మాయ అందరినీ పూర్తిగా తెలివిహీనులుగా చేసేసింది.

నన్ను స్మృతి చేయండి అని తండ్రి పిల్లలకే చెప్తారు. ఓ పతిత-పావనా రండి అని మీ ఆత్మ పిలుస్తుంది కదా. మీ శరీరానికి లౌకిక తండ్రి అయితే ఉన్నారు. పతిత-పావనుడు ఆ తండ్రి ఒక్కరు మాత్రమే. ఇప్పుడు మనము పావనముగా తయారుచేసే ఆ తండ్రిని స్మృతి చేస్తాము. జీవన్ముక్తి దాత ఒక్కరే, ఇతరులెవ్వరూ కాదు. ఇంత సహజమైన విషయము యొక్క అర్థాన్ని కూడా ఎవ్వరూ అర్థం చేసుకోరు. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. నోటి ద్వారా జ్ఞాన రత్నాలు వెలువడేలా అభ్యాసము చేయాలి. ఎప్పుడూ నోటి నుండి ముళ్ళు లేక రాళ్ళు వెలువడనివ్వకూడదు. స్వ కళ్యాణము మరియు ఇంటివారి కళ్యాణము చేసేందుకు ఇంటిలో చిత్రాలతో అలంకరించాలి, వాటిపై విచార సాగర మంథనము చేసి ఇతరులకు అర్థం చేయించాలి. బిజీగా ఉండాలి.

2. తండ్రి నుండి ఆశీర్వాదాలను అడిగేందుకు బదులుగా వారి శ్రేష్ఠ మతముపై నడవాలి. గొప్పతనమంతా శివబాబాదే, అందుకే వారినే స్మృతి చేయాలి. నేను బాబాకు ఇంత ఇచ్చాను అన్న అభిమానము రాకూడదు.

వరదానము:-
బాబా సమానమైన స్థితి ద్వారా సమయాన్ని సమీపముగా తీసుకువచ్చే తతత్వమ్ యొక్క వరదానీ భవ

నాది అన్న భావాన్ని తొలగించడము అనగా బాబా సమాన స్థితిలో స్థితులై సమయాన్ని సమీపముగా తీసుకురావడము. ఎక్కడైతే తమ దేహము పట్ల లేక ఏదైనా తమ వస్తువు పట్ల నాది అనేది ఉంటుందో అక్కడ సమానతలో పర్సెంటేజ్ ఉంటుంది. ఇలా పర్సెంటేజ్ ఉండడం అనగా డిఫెక్ట్ (లోపము) ఉండడము, ఇటువంటి డిఫెక్ట్ కలవారు ఎప్పటికీ పర్ఫెక్ట్ అవ్వలేరు. పర్ఫెక్ట్ గా అయ్యేందుకు బాబా ప్రేమలో సదా లవలీనులై ఉండండి. సదా ప్రేమలో లవలీనులై ఉండటము ద్వారా సహజముగానే ఇతరులను కూడా తమ సమానముగా మరియు బాబా సమానముగా తయారుచేయగలుగుతారు. బాప్ దాదా తమ లవ్లీ మరియు లవలీనులై ఉండే పిల్లలకు సదా తతత్వమ్ అనే వరదానాన్ని ఇస్తారు.

స్లోగన్:-
పరస్పరం ఒకరి ఆలోచనలకు ఒకరు గౌరవాన్ని ఇచ్చినట్లయితే స్వయం యొక్క రికార్డ్ మంచిగా అవుతుంది.

అవ్యక్త సూచనలు - స్వయము కొరకు మరియు సర్వుల కొరకు మనసు ద్వారా యోగ శక్తులను ప్రయోగించండి

మనసా సేవ కొరకు మనసు, బుద్ధి వ్యర్థము ఆలోచించటము నుండి ముక్తిగా ఉండాలి. ‘మన్మనాభవ’ మంత్రము యొక్క సహజ స్వరూపులుగా ఉండాలి, ఏ శ్రేష్ఠ ఆత్మల మనసు అనగా సంకల్పాలు శ్రేష్ఠముగా మరియు శక్తిశాలిగా ఉంటాయో, శుభ భావన, శుభ కామనతో కూడినవిగా ఉంటాయో, వారు మనసు ద్వారా శక్తులను దానము ఇవ్వగలరు.