05-05-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - సదా మేము సంగమయుగీ బ్రాహ్మణులము అనే
ఈ నషాలోనే ఉండండి, ఏ బాబానైతే అందరూ పిలుస్తున్నారో, వారు మన సమ్ముఖములో ఉన్నారు అని
మనకు తెలుసు’’
ప్రశ్న:-
ఏ
పిల్లల బుద్ధియోగము సరిగ్గా ఉంటుందో, వారికి ఏ సాక్షాత్కారాలు జరుగుతూ ఉంటాయి?
జవాబు:-
సత్యయుగీ
కొత్త రాజధానిలో ఏమేమి ఉంటాయి, ఏ విధంగా మనము స్కూల్లో చదువుకుంటాము, ఆ తర్వాత
రాజ్యము చేస్తాము అనే ఈ సాక్షాత్కారాలన్నీ మీరు ఎంతెంతగా సమీపముగా వస్తూ ఉంటారో, అవి
అంతంతగా కలుగుతూ ఉంటాయి. కానీ ఎవరి బుద్ధియోగమైతే సరిగ్గా ఉంటుందో, ఎవరైతే తమ
శాంతిధామాన్ని మరియు సుఖధామాన్ని స్మృతి చేస్తారో, వ్యాపార-వ్యవహారాలు చేసుకుంటూ
కూడా ఒక్క తండ్రి స్మృతిలోనే ఉంటారో, వారికే ఈ సాక్షాత్కారాలన్నీ జరుగుతాయి.
పాట:-
ఓం నమః శివాయ...
ఓంశాంతి
భక్తి మార్గములో ఇతర సత్సంగాలేవైతే జరుగుతూ ఉంటాయో, వాటికైతే అందరూ వెళ్ళి ఉంటారు
కదా. అక్కడ, అందరూ ‘వాహే గురువు’ అని అనండి అని చెప్తారు లేక రామ నామాన్ని జపించమని
చెప్తారు. ఇక్కడ పిల్లలకు ఏదీ జపించవలసిన అవసరము కూడా ఉండదు. ఒకసారి చెప్పిన తర్వాత
ఇక ఘడియ-ఘడియ చెప్పవలసిన అవసరముండదు. తండ్రి కూడా ఒక్కరే, వారు చెప్పేది కూడా ఒక్కటే.
వారు ఏం చెప్తారు? పిల్లలూ, నన్నొక్కరినే స్మృతి చేయండి. మొదట నేర్చుకుని ఆ తర్వాత
ఇక్కడకు వచ్చి కూర్చుంటారు. మనము ఏ తండ్రికి పిల్లలమో, వారిని స్మృతి చేయాలి.
ఆత్మలైన మన అందరికీ తండ్రి వారొక్కరే అన్నది కూడా మీరు ఇప్పుడు బ్రహ్మా ద్వారా
తెలుసుకున్నారు. ప్రపంచానికి ఇది తెలియదు. మీకు తెలుసు, మనమందరమూ ఆ తండ్రికి
పిల్లలము, వారిని అందరూ గాడ్ ఫాదర్ అని అంటారు. ఇప్పుడు తండ్రి అంటారు - నేను ఈ
సాధారణ తనువులోకి మిమ్మల్ని చదివించడానికి వస్తాను. బాబా వీరిలోకి వచ్చారని, మనము
వారికి చెందినవారిగా అయ్యామని మీకు తెలుసు. బాబాయే వచ్చి పతితుల నుండి పావనులుగా
అయ్యే మార్గాన్ని తెలియజేస్తారు. ఇది రోజంతా బుద్ధిలో ఉంటుంది. నిజానికి అందరూ
శివబాబా సంతానమే కానీ ఈ విషయము మీకు తెలుసు, ఇంకెవ్వరికీ తెలియదు. మనము ఆత్మ అని,
మనకు తండ్రి - నన్ను స్మృతి చేయండి అనే ఆజ్ఞ ఇచ్చారని పిల్లలైన మీరు అర్థం
చేసుకుంటారు. నేను మీ అనంతమైన తండ్రిని. ఓ పతిత-పావనా రండి, మేము పతితముగా అయ్యాము
అని అందరూ ఆర్తనాదాలు చేస్తూ ఉంటారు. ఈ మాటను దేహము అనదు. ఆత్మ ఈ శరీరము ద్వారా
అంటుంది. 84 జన్మలు కూడా ఆత్మయే తీసుకుంటుంది కదా. మనము పాత్రధారులము అన్నది
బుద్ధిలో ఉండాలి. బాబా మనల్ని ఇప్పుడు త్రికాలదర్శులుగా తయారుచేసారు. ఆదిమధ్యాంతాల
జ్ఞానాన్ని ఇచ్చారు. తండ్రినే అందరూ పిలుస్తారు కదా. ఇప్పటికీ వారు పిలుస్తున్నారు,
రండి అని పిలుస్తూనే ఉంటారు కానీ సంగమయుగీ బ్రాహ్మణులైన మీరు - బాబా వచ్చి ఉన్నారు
అని అంటారు. ఈ సంగమయుగము గురించి కూడా మీకు తెలుసు, ఇది పురుషోత్తమ యుగముగా మహిమ
చేయబడుతుంది. పురుషోత్తమ యుగము ఉండేదే కలియుగాంతము మరియు సత్యయుగ ఆదికి మధ్యలో.
సత్యయుగములో సత్యమైన పురుషులు, కలియుగములో అసత్యమైన పురుషులు ఉంటారు. సత్యయుగములో
ఎవరైతే ఒకప్పుడు ఉండి వెళ్ళారో, వారి చిత్రాలు ఉన్నాయి. అన్నింటికన్నా అతి
పురాతనమైనవి ఈ చిత్రాలు, వీటికన్నా పురాతనమైన చిత్రాలేవీ ఉండవు. ఆ మాటకొస్తే చాలా
మంది మనుష్యులు కూర్చుని వ్యర్థమైన చిత్రాలను తయారుచేస్తారు. కానీ ఎవరెవరు ఒకప్పుడు
ఉండి వెళ్ళారు అనేది మీకు తెలుసు. ఏ విధంగా కింద అంబ యొక్క చిత్రాన్ని తయారుచేసారు
లేదా కాళీ యొక్క చిత్రము ఉంది, కానీ ఇటువంటి భుజాలు కలవారు ఎవ్వరూ ఉండరు. అంబకు కూడా
రెండు భుజాలే ఉంటాయి కదా. మనుష్యులైతే వెళ్ళి చేతులు జోడించి పూజిస్తారు. భక్తి
మార్గములో అనేక రకాల చిత్రాలను తయారుచేసారు. మనుష్యులనే వివిధ రకాలుగా అలంకరిస్తే
రూపము మారిపోతుంది. వాస్తవానికి ఈ చిత్రాల రూపములో ఎవరూ లేరు. అదంతా భక్తి మార్గము.
ఇక్కడైతే మనుష్యులు చేతులు లేనివారిగా, కాళ్ళు లేనివారిగా ఉంటూ ఉంటారు. సత్యయుగములో
అలా ఉండరు. సత్యయుగము గురించి కూడా మీకు తెలుసు, అక్కడ ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము
ఉండేది. ఇక్కడి వస్త్రాలను చూడండి, ఒక్కొక్కరిది ఒక్కొక్క రకము, ఎన్ని వెరైటీలు
ఉన్నాయి. అక్కడైతే యథా రాజా రాణి తథా ప్రజా. ఎంతగా సమీపముగా వస్తూ ఉంటారో, అంతగా
మీకు మీ రాజధాని యొక్క వస్త్రాలు మొదలైనవాటి యొక్క సాక్షాత్కారాలు కూడా జరుగుతూ
ఉంటాయి. మేము ఇటువంటి స్కూల్లో చదువుకుంటాము, ఇది చేస్తాము అని చూస్తూ ఉంటారు. అది
కూడా ఎవరి బుద్ధియోగమైతే బాగుంటుందో, ఎవరైతే తమ శాంతిధామాన్ని-సుఖధామాన్ని స్మృతి
చేస్తారో, వారే చూస్తారు. వ్యాపార-వ్యవహారాలనైతే చేయవలసిందే. భక్తి మార్గములో కూడా
వ్యాపారాలు మొదలైనవి చేస్తారు కదా. జ్ఞానము ఏ మాత్రమూ ఉండేది కాదు. అదంతా భక్తి.
దానిని భక్తి యొక్క జ్ఞానము అని అంటారు. మీరు విశ్వానికి యజమానులుగా ఎలా అవుతారు
అన్న ఈ జ్ఞానాన్ని వారు ఇవ్వలేరు. ఇప్పుడు మీరు ఇక్కడ చదువుకుని భవిష్య విశ్వానికి
యజమానులుగా అవుతారు. మీకు తెలుసు, ఈ చదువు ఉన్నదే కొత్త ప్రపంచము, అమరలోకము కొరకు.
అంతేకానీ అమరనాథ్ లో శంకరుడు పార్వతికి అమరకథను వినిపించలేదు. వారు శివ-శంకరులను
కలిపేస్తారు.
ఇప్పుడు తండ్రి పిల్లలైన మీకు అర్థం చేయిస్తున్నారు, ఇతను కూడా వింటారు. తండ్రి
తప్ప సృష్టి యొక్క ఆదిమధ్యాంతాల రహస్యాన్ని ఎవరు అర్థం చేయించగలరు. ఇతనేమి
సాధు-సన్యాసి మొదలైనవారు కాదు. ఏ విధంగా మీరు గృహస్థ వ్యవహారములో ఉండేవారో, అలాగే
ఇతను కూడా. డ్రెస్ మొదలైనవన్నీ మునపటివే. ఏ విధంగా ఇంటిలో తల్లి, తండ్రి, పిల్లలూ
ఉంటారో అలాగే ఉన్నారు, తేడా ఏమీ లేదు. తండ్రి ఈ రథముపై స్వారీ చేస్తూ పిల్లల వద్దకు
వస్తారు. వీరిని భాగ్యశాలీ రథము అని అంటూ ఉంటారు. కొన్నిసార్లు ఎద్దుపై స్వారీ
చేయడాన్ని కూడా చూపిస్తారు. దానిని మనుష్యులు తప్పుగా అర్థం చేసుకున్నారు. మందిరములో
ఎప్పుడైనా ఎద్దు ఉండగలదా ఏమిటి? శ్రీకృష్ణుడు యువరాజు, అతను ఏమైనా ఎద్దుపై
కూర్చుంటారా. భక్తి మార్గములో మనుష్యులు ఎంతగానో తికమక చెంది ఉన్నారు. మనుష్యులకు
ఉన్నది భక్తి మార్గపు నషా. మీకు ఉన్నది జ్ఞాన మార్గపు నషా. ఈ సంగమములో బాబా మమ్మల్ని
చదివిస్తున్నారు అని మీరంటారు. మీరు ఉన్నది ఈ ప్రపంచములో కానీ బ్రాహ్మణులమైన మేము
సంగమయుగములో ఉన్నాము మరియు మిగిలిన మనుష్యులంతా కలియుగములో ఉన్నారు అని మీరు బుద్ధి
ద్వారా తెలుసుకున్నారు. ఇవి అనుభవముతో కూడిన విషయాలు. బుద్ధి చెప్తుంది - మనము
కలియుగము నుండి ఇప్పుడు బయటకు వచ్చాము, బాబా వచ్చి ఉన్నారు, ఈ పాత ప్రపంచమే
మారనున్నది. ఇది మీ బుద్ధిలో ఉంది, ఇది ఇంకెవ్వరికీ తెలియదు. ఒకే ఇంట్లో ఉండేవారు
కావచ్చు, ఒకే పరివారమువారు కావచ్చు, కానీ అందులో కూడా తండ్రి - మనము సంగమయుగవాసులము
అని అంటారు, కొడుకు - కాదు, మనము కలియుగములో ఉన్నాము అని అంటారు. విచిత్రము కదా. మన
చదువు పూర్తి అయితే వినాశనమవుతుంది అని పిల్లలకు తెలుసు. వినాశనమవ్వడము తప్పనిసరి.
మీలో కూడా కొద్దిమందికే తెలుసు. ఒకవేళ ప్రపంచము వినాశనమవ్వనున్నది అన్నది అర్థం
చేసుకుంటే, మరి ఇక కొత్త ప్రపంచము కొరకు ఏర్పాట్లలో నిమగ్నమైపోతారు.
బ్యాగ్-బ్యాగేజీని తయారుచేసుకుంటారు. ఇంకా కొద్ది సమయమే ఉంది, బాబాకు
చెందినవారిగానైతే అయిపోవాలి. ఆకలితో మరణించవలసి వచ్చినా కూడా - మొదట బాబా, ఆ తర్వాతే
పిల్లలు. ఇది బాబా యొక్క భండారా (వంటశాల). మీరు శివబాబా భండారము నుండి తింటారు.
బ్రాహ్మణులు భోజనాన్ని తయారుచేస్తారు, అందుకే బ్రహ్మా భోజనము అని అంటారు. పవిత్రమైన
బ్రాహ్మణులు ఎవరైతే ఉంటారో, వారు స్మృతిలో ఉండి తయారుచేస్తారు, బ్రాహ్మణులు తప్ప
శివబాబా స్మృతిలో ఇంకెవ్వరూ ఉండలేరు. ఆ బ్రాహ్మణులేమీ శివబాబా స్మృతిలో ఉండరు.
శివబాబా భండారా ఇదే, ఇక్కడ బ్రాహ్మణులు భోజనాన్ని తయారుచేస్తారు. బ్రాహ్మణులు
యోగములో ఉంటారు. పవిత్రముగానైతే ఎలాగూ ఉంటారు. ఇక మిగిలినది యోగానికి సంబంధించిన
విషయము. ఇందులోనే శ్రమ చేయవలసి ఉంటుంది. ఇందులో ప్రగల్భాలు నడవవు. నేను సంపూర్ణముగా
యోగములో ఉన్నాను లేక 80 శాతము యోగములో ఉన్నాను అని ఈ విధంగా ఎవ్వరూ అనలేరు. జ్ఞానము
కూడా కావాలి. పిల్లలైన మీలో కూడా యోగీ ఎవరంటే ఎవరైతే తమ దృష్టితోనే ఎవరినైనా
శాంతపర్చగలరో వారు. ఇది కూడా శక్తి. పూర్తిగా నిశ్శబ్దత ఏర్పడుతుంది. ఎప్పుడైతే మీరు
అశరీరిగా అవుతారో మరియు తండ్రి స్మృతిలో ఉంటారో, అదే సత్యమైన స్మృతి. మళ్ళీ ఈ
అభ్యాసము చేయాలి. మీరు ఇక్కడ స్మృతిలో కూర్చుంటారు, ఈ అభ్యాసము చేయించబడుతుంది.
అయినా అందరూ ఏమీ స్మృతిలో ఉండరు. బుద్ధి ఎక్కడెక్కడికో పరిగెడుతూ ఉంటుంది. ఇక దాని
వల్ల నష్టము కలుగుతుంది. ఎవరైతే - మేము డ్రిల్ టీచర్ అని భావిస్తారో, వారిని ఇక్కడ
గద్దెపై కూర్చోబెట్టాలి. తండ్రి స్మృతిలో ఎదురుగా కూర్చుంటారు. బుద్ధియోగము
ఇంకెటువైపుకూ వెళ్ళకూడదు. నిశ్శబ్దత ఏర్పడుతుంది. మీరు అశరీరిగా అయిపోతారు మరియు
తండ్రి స్మృతిలో ఉంటారు. ఇది సత్యమైన స్మృతి. సన్యాసులు కూడా శాంతిలో కూర్చుంటారు,
వారు ఎవరి స్మృతిలో ఉంటారు? అది యథార్థమైన స్మృతి ఏమీ కాదు. అది ఎవరికీ లాభాన్ని
కలిగించదు. వారు సృష్టిని శాంతపర్చలేరు. వారికి తండ్రి గురించి తెలియనే తెలియదు.
బ్రహ్మ తత్వమునే భగవంతునిగా భావిస్తూ ఉంటారు. కానీ అది కాదు. ఇప్పుడు మీకు శ్రీమతము
లభిస్తుంది - నన్నొక్కరినే స్మృతి చేయండి. మనము 84 జన్మలు తీసుకుంటాము అని మీకు
తెలుసు. చంద్రునిలో కళలు తగ్గినట్లుగా ప్రతి జన్మలోనూ కళలు కొద్దికొద్దిగా తగ్గిపోతూ
ఉంటాయి. అది చూసినంతమాత్రాన ఏమీ తెలియదు. ఇప్పుడు ఎవ్వరూ సంపూర్ణులుగా అవ్వలేదు.
మున్ముందు మీకు సాక్షాత్కారాలు జరుగుతాయి. ఆత్మ ఎంత చిన్నది. ఆత్మ సాక్షాత్కారము
కూడా జరగవచ్చు. లేదంటే - వీరిలో లైట్ తక్కువగా ఉంది, వీరిలో ఎక్కువగా ఉంది అని
కుమార్తెలు ఎలా చెప్తున్నారు. దివ్యదృష్టి ద్వారానే ఆత్మను చూస్తారు. ఇవన్నీ కూడా
డ్రామాలో నిశ్చితమై ఉన్నాయి. నా చేతుల్లో ఏమీ లేదు. డ్రామా నా ద్వారా చేయిస్తుంది.
ఇదంతా డ్రామానుసారముగా నడుస్తూ ఉంటుంది. భోగ్ మొదలైనవన్నీ డ్రామాలో నిశ్చితమై
ఉన్నాయి. క్షణ-క్షణమూ పాత్ర నడుస్తూ ఉంటుంది.
ఇప్పుడు తండ్రి - పావనముగా ఎలా అవ్వాలి అనే శిక్షణను ఇస్తున్నారు. తండ్రిని
స్మృతి చేయాలి. ఎంత చిన్నని ఆత్మ, పతితముగా అయ్యింది, మళ్ళీ పావనముగా అవ్వనున్నది.
ఇది అద్భుతమైన విషయము కదా. దీనిని సృష్టి అద్భుతము అని అంటారు కదా. తండ్రి నుండి
మీరు అన్నీ సృష్టి అద్భుతానికి సంబంధించిన విషయాలనే వింటారు. అన్నింటికన్నా
అద్భుతమైన విషయము - ఆత్మ మరియు పరమాత్మకు చెందినది, అది ఎవ్వరికీ తెలియదు. ఋషులు,
మునులు మొదలైనవారెవ్వరికీ తెలియదు. ఇంత చిన్నని ఆత్మయే రాతిబుద్ధి కలదిగా, మళ్ళీ
పారసబుద్ధి కలదిగా అవుతుంది. బుద్ధిలో ఇదే చింతన నడుస్తూ ఉండాలి - ఆత్మ అయిన మనము
రాతిబుద్ధి కలవారిగా అయ్యాము, ఇప్పుడు మళ్ళీ తండ్రిని స్మృతి చేసి పారసబుద్ధి
కలవారిగా అవుతున్నాము. లౌకిక రీతిలో తండ్రి కూడా, అలాగే టీచర్, గురువు కూడా
పెద్దవారే లభిస్తారు. ఇక్కడైతే ఒక్క బిందువే తండ్రి కూడా, టీచర్ కూడా, గురువు కూడా.
మొత్తము కల్పమంతా దేహధారులను స్మృతి చేసారు. ఇప్పుడు తండ్రి అంటారు, నన్నొక్కరినే
స్మృతి చేయండి. మీ బుద్ధిని వారు ఎంత సూక్ష్మముగా తయారుచేస్తారు. విశ్వాధిపతులుగా
అవ్వడమనేది ఏమైనా తక్కువ విషయమా! ఈ లక్ష్మీ-నారాయణులు సత్యయుగ అధిపతులుగా ఎలా
అయ్యారు అని కూడా ఎవ్వరూ ఆలోచించరు. మీకు కూడా నంబరువారు పురుషార్థానుసారముగానే
తెలుసు. కొత్తవారెవ్వరూ ఈ విషయాలను అర్థం చేసుకోలేరు. మొదట పైపైన అర్థం చేయించి, ఆ
తర్వాత సూక్ష్మముగా అర్థం చేయించడం జరుగుతుంది. తండ్రి ఒక బిందువు, కానీ వారు ఎంతో
పెద్ద-పెద్ద లింగ రూపాలను తయారుచేస్తారు. మనుష్యులవి కూడా చాలా పెద్ద-పెద్ద చిత్రాలు
తయారుచేస్తారు. కానీ వాస్తవానికి అలా ఉండరు. మనుష్యుల శరీరాలైతే ఇలానే ఉంటాయి. భక్తి
మార్గములో ఏమేమో కూర్చుని తయారుచేసారు. మనుష్యులు ఎంతగా తికమక చెంది ఉన్నారు. తండ్రి
అంటారు, ఏదైతే గతించిపోయిందో అది మళ్ళీ జరుగుతుంది. ఇప్పుడు మీరు తండ్రి శ్రీమతముపై
నడవండి. ఇతనికి కూడా తండ్రి శ్రీమతాన్ని ఇచ్చారు, సాక్షాత్కారాలు చేయించారు కదా -
నీకు నేను రాజ్యాధికారాన్ని ఇస్తాను, ఇప్పుడు ఇక ఈ సేవలో నిమగ్నమైపో, నీ
వారసత్వాన్ని తీసుకునేందుకు పురుషార్థము చెయ్యి, ఇదంతా వదిలేసేయ్ అని అన్నారు, ఇక
అప్పుడు ఇతను కూడా నిమిత్తము అయ్యారు. అందరూ ఇలా నిమిత్తము అవ్వరు, ఎవరికైతే నషా
ఎక్కిందో వారు ఇక వచ్చి కూర్చున్నారు. మాకైతే రాజ్యాధికారము లభిస్తుంది, ఇక పైసకు
కొరగానివాటిని ఏం చేసుకుంటాము అని భావించారు. ఇప్పుడు తండ్రి పిల్లల చేత పురుషార్థము
చేయిస్తారు. రాజధాని స్థాపన అవుతోంది. మేము లక్ష్మీ-నారాయణుల కన్నా తక్కువవారిగా
అవ్వము అని అంటారు. మరి శ్రీమతముపై నడిచి చూపించండి. సాకులు ఏమీ చెప్పకండి. మరి నా
పిల్లల పరిస్థితి ఏమవుతుంది అని బాబా ఏమైనా అన్నారా? ఏక్సిడెంట్లో అకస్మాత్తుగా
ఎవరైనా మరణిస్తే వాళ్ళ వాళ్ళు ఏమైనా ఆకలితో ఉండిపోతారా. మిత్ర-సంబంధీకులు మొదలైనవారు
ఎవరో ఒకరు తినడానికి ఇస్తారు. ఇక్కడ చూడండి, బాబా పాత కూటీరములో ఉంటారు. పిల్లలైన
మీరు వచ్చి మహళ్ళలో ఉంటారు. తండ్రి - పిల్లలు బాగా ఉండాలి, తినాలి, తాగాలి అని
అంటారు. ఎవరైతే ఏమీ తీసుకురాలేదో వారికి కూడా అన్నీ బాగా లభిస్తాయి. ఈ బాబా కంటే
కూడా బాగా ఉంటారు. శివబాబా అంటారు - నేనైతే రమించే యోగిని, నేను ఎవరి కళ్యాణము
చేయడానికైనా వెళ్ళగలను. జ్ఞానీ పిల్లలు ఎవరైతే ఉంటారో, వారు ఎప్పుడూ సాక్షాత్కారాలు
మొదలైన విషయాల్లో సంతోషపడిపోరు. యోగము తప్ప ఇంకేది కాదు. ఈ సాక్షాత్కారాల విషయాల్లో
సంతోషపడిపోకూడదు. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ఎటువంటి యోగ స్థితిని తయారుచేసుకోవాలంటే, దృష్టి ద్వారానే ఎవరినైనా
శాంతపర్చగలగాలి. పూర్తిగా నిశ్శబ్దత ఏర్పడాలి. దాని కోసము అశరీరిగా అయ్యే అభ్యాసము
చేయాలి.
2. జ్ఞానము యొక్క సత్యమైన నషాలో ఉండేందుకు గుర్తు ఉండాలి - మేము సంగమయుగ వాసులము,
ఇప్పుడు ఇక ఈ పాత ప్రపంచము మారనున్నది, మేము మా ఇంటికి వెళ్తున్నాము. శ్రీమతముపై సదా
నడుస్తూ ఉండాలి, సాకులు ఏమీ చెప్పకూడదు.
వరదానము:-
పరమాత్మ మిలనము ద్వారా ఆత్మిక సంభాషణకు సరైన రెస్పాన్స్ ను
ప్రాప్తి చేసుకునే తండ్రి సమాన బహురూపీ భవ
ఏ విధంగా తండ్రి బహురూపియో - క్షణములో నిరాకారీ నుండి
ఆకారీ వస్త్రాన్ని ధారణ చేస్తారో, అలా మీరు కూడా ఈ మట్టి వస్త్రాన్ని వదిలి ఆకారీ
ఫరిశ్తా డ్రెస్ ను, మెరిసే డ్రెస్ ను ధరించినట్లయితే సహజముగా మిలనము కూడా జరుగుతుంది
మరియు ఆత్మిక సంభాషణకు లభించిన స్పష్టమైన రెస్పాన్స్ అర్థమైపోతుంది, ఎందుకంటే ఈ
డ్రెస్ పాత ప్రపంచపు వృత్తి మరియు వైబ్రేషన్ల నుండి, మాయ యొక్క వాటర్ మరియు ఫైర్
నుండి ప్రూఫ్ (సురక్షితము)గా ఉంటుంది. ఇందులో మాయ జోక్యము చేసుకోలేదు.
స్లోగన్:-
దృఢత
అసంభవాన్ని కూడా సంభవము చేసేస్తుంది.
అవ్యక్త సూచనలు -
ఆత్మిక రాయల్టీని మరియు పవిత్రత యొక్క పర్సనాలిటీని ధారణ చెయ్యండి
బ్రహ్మాకుమారులు
అంటేనే అర్థము - సదా పవిత్రత యొక్క పర్సనాలిటీ మరియు రాయల్టీలో ఉండటము. ఈ పవిత్రత
యొక్క పర్సనాలిటీయే విశ్వాత్మలను తనవైపుకు ఆకర్షితము చేస్తుంది, మరియు ఈ పవిత్రత
యొక్క రాయల్టీయే ధర్మరాజపురిలో చెల్లించవలసిన అవసరము లేకుండా విడుదల చేస్తుంది. ఈ
రాయల్టీ అనుసారముగానే భవిష్య రాయల్ కుటుంబములోకి రాగలరు. ఏ విధంగా శరీరము యొక్క
పర్సనాలిటీ దేహభానములోకి తీసుకువస్తుందో, అలా పవిత్రత యొక్క పర్సనాలిటీ
దేహీ-అభిమానులుగా చేసి తండ్రికి సమీపముగా తీసుకువస్తుంది.
| | |