06-01-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - బ్రహ్మాబాబా శివబాబా రథము, ఇరువురి
పాత్ర కలిసే నడుస్తుంది, ఇందులో కొద్దిగా కూడా సంశయము రాకూడదు’’
ప్రశ్న:-
మనుష్యులు దుఃఖాల నుండి విముక్తిని పొందేందుకు ఏ యుక్తిని రచిస్తారు కానీ దానిని
మహాపాపమని అంటారు?
జవాబు:-
మనుష్యులు
ఎప్పుడైతే దుఃఖితులుగా అవుతారో, అప్పుడు స్వయాన్ని హతమార్చుకునేందుకు (అంతము
చేసుకునేందుకు) అనేక ఉపాయాలను రచిస్తారు, జీవహత్య చేసుకోవాలని ఆలోచిస్తారు, దీనితో
మేము దుఃఖాల నుండి విముక్తులమవుతామని భావిస్తారు. కానీ ఇటువంటి మహాపాపము మరొకటి
ఉండదు. వారు మరిన్ని దుఃఖాలలో చిక్కుకుంటారు ఎందుకంటే ఇది ఉన్నదే అపారమైన దుఃఖాల
ప్రపంచము.
ఓంశాంతి
పిల్లలను తండ్రి అడుగుతున్నారు, ఆత్మలను పరమాత్మ అడుగుతున్నారు - మేము పరమపిత
పరమాత్ముని సమ్ముఖములో కూర్చున్నామని మీకు తెలుసా. వారికి తమ రథమంటూ లేదు. ఈ భృకుటి
మధ్యలో తండ్రి యొక్క నివాస స్థానముందని ఈ నిశ్చయమైతే ఉంది కదా. తండ్రి స్వయంగా
అంటున్నారు - నేను ఇతని భృకుటి మధ్యలో కూర్చుంటాను, ఇతని శరీరాన్ని అప్పుగా
తీసుకుంటాను. ఆత్మ భృకుటి మధ్యలో ఉంటుంది కావున తండ్రి కూడా అక్కడే కూర్చుంటారు.
బ్రహ్మా కూడా ఉన్నారు మరియు శివబాబా కూడా ఉన్నారు. బ్రహ్మా లేకపోతే శివబాబా ఎలా
మాట్లాడుతారు? శివబాబాను పైన అయితే సదా స్మృతి చేస్తూనే వచ్చాము. మనము తండ్రి వద్ద
ఇక్కడ కూర్చున్నామని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. అలాగని శివబాబా పైన ఉన్నారని,
వారి ప్రతిమ ఇక్కడ పూజింపబడుతుందని కాదు. ఈ విషయాలు చాలా అర్థం చేసుకోవలసినవి.
తండ్రి జ్ఞానసాగరుడని మీకైతే తెలుసు. జ్ఞానాన్ని ఎక్కడ నుండి వినిపిస్తారు? పై నుండి
వినిపిస్తారా? వారు ఇక్కడ కిందకు వచ్చారు. బ్రహ్మా తనువు ద్వారా వినిపిస్తారు. మేము
బ్రహ్మాను అంగీకరించమని చాలామంది అంటారు. కానీ - నన్ను స్మృతి చేయండి అని బ్రహ్మా
తనువు ద్వారా శివబాబా స్వయంగా చెప్తున్నారు. ఇది అర్థం చేసుకోవలసిన విషయము కదా. కానీ
మాయ చాలా శక్తివంతమైనది. ఒక్కసారిగా ముఖము తిప్పేసి వెనక్కు నెట్టేస్తుంది. ఇప్పుడు
మీ తలను శివబాబా తమ వైపుకు తిప్పుకున్నారు. మీరు సమ్ముఖములో కూర్చున్నారు. మరి
ఎవరైతే బ్రహ్మా అసలు ఏమీ కాదని భావిస్తారో, వారి గతి ఏమవుతుంది! వారు దుర్గతిని
పొందుతారు. వారికి జ్ఞానము ఏ మాత్రము లేదు. మనుష్యులు - ఓ గాడ్ ఫాదర్ అని పిలుస్తారు
కూడా. మరి ఆ గాడ్ ఫాదర్ వింటారా? వారిని - ముక్తిదాత రండి అని పిలుస్తారు కదా, లేదా
వారు అక్కడ కూర్చునే విముక్తులుగా చేస్తారా? కల్ప-కల్పము పురుషోత్తమ సంగమయుగములోనే
తండ్రి వస్తారు, వారు ఎవరిలోనైతే వస్తారో ఒకవేళ వారినే పక్కన పెట్టేస్తే ఇక ఏమంటారు!
నంబర్ వన్ తమోప్రధానమని అంటారు. నిశ్చయము ఉంటుండగా కూడా మాయ ఒక్కసారిగా ముఖాన్ని
తిప్పేస్తుంది. మాయలో ఎంతటి బలముందంటే, అది ఒక్కసారిగా పైసకు కొరగానివారిగా
చేసేస్తుంది. ఇటువంటివారు కూడా ఎవరో ఒకరు సెంటర్లలో ఉన్నారు, అందుకే తండ్రి
చెప్తున్నారు, జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ విన్న విషయాలను ఇతరులకు వినిపిస్తూ ఉన్నా
కానీ అది పండితుని ఉదాహరణ వలె ఉంటుంది. ఉదాహరణకు బాబా పండితుని కథను వినిపిస్తారు
కదా. రామ-రామ అని అన్నట్లయితే నదిని దాటేస్తారని అతను చెప్పారు. ఇది కూడా
తయారుచేయబడిన ఒక కథ. ఈ సమయములో మీరు తండ్రి స్మృతితో విషయ సాగరము నుండి క్షీర
సాగరములోకి వెళ్తారు కదా. వారు భక్తి మార్గములో అనేక కథలను తయారుచేసారు. అటువంటి
విషయాలేవీ ఉండవు. ఇది ఒక కథగా తయారుచేయబడి ఉంది. పండితుడు ఇతరులకు చెప్పేవారు కానీ
అతను స్వయము పూర్తిగా నష్టఖాతాలో ఉన్నారు. స్వయము వికారాలలోకి వెళ్తూ ఉండడము కానీ
ఇతరులకు నిర్వికారులుగా అవ్వండి అని చెప్పడము, దాని ప్రభావము ఎలా ఉంటుంది. ఇటువంటి
బ్రహ్మాకుమార-కుమారీలు కూడా ఉన్నారు - స్వయము నిశ్చయముతో ఉండరు కానీ ఇతరులకు
వినిపిస్తూ ఉంటారు, అందుకే అక్కడక్కడా వినిపించేవారి కంటే కూడా వినేవారే చురుకుగా
ముందుకు వెళ్ళిపోతారు. ఎవరైతే అనేకుల సేవ చేస్తారో, వారు తప్పకుండా ప్రియమనిపిస్తారు
కదా. పండితుడు అసత్యమైనవారని బయటపడితే వారినెవరు ప్రేమిస్తారు! అప్పుడు ఎవరైతే
ప్రాక్టికల్ గా స్మృతి చేస్తారో, ప్రేమ వారి వైపుకు వెళ్ళిపోతుంది. మంచి-మంచి
మహారథులను కూడా మాయ మింగేస్తుంది. అలా చాలా మంది మింగేయబడ్డారు. ఇప్పుడు ఇంకా
కర్మాతీత అవస్థ ఏర్పడలేదని బాబా కూడా అర్థం చేయిస్తున్నారు. ఒకవైపు యుద్ధము
జరుగుతుంది, మరోవైపు కర్మాతీత అవస్థ ఏర్పడుతుంది, ఈ రెండింటికి పూర్తి కనెక్షన్ ఉంది.
ఇక తర్వాత యుద్ధము పూర్తి అయిపోతే ట్రాన్స్ఫర్ అయిపోతారు. మొదట రుద్రమాల తయారవుతుంది.
ఈ విషయాలు ఇంకెవ్వరికీ తెలియవు. వినాశనము ఎదురుగా నిలబడి ఉందని మీకు తెలుసు. ఇప్పుడు
మీరు మైనారిటీ (కొద్ది మంది), వారు మెజారిటీ (ఎక్కువ మంది) కావున మిమ్మల్ని ఎవరు
ఒప్పుకుంటారు. ఎప్పుడైతే మీ వృద్ధి జరుగుతుందో అప్పుడు మీ యోగబలముతో చాలా మంది
ఆకర్షింపబడి వస్తారు. ఎంతగా మీ నుండి తుప్పు తొలగుతూ ఉంటుందో, అంతగా బలము నిండుతూ
ఉంటుంది. బాబా అన్నీ తెలిసినవారు అని కాదు. ఇక్కడకు వచ్చి అందరినీ చూస్తారు, వారికి
అందరి అవస్థల గురించి తెలుసు. తండ్రికి పిల్లల అవస్థ గురించి తెలియదా ఏమిటి? వారికి
అంతా తెలుస్తుంది. ఇందులో అంతర్యామి అనే విషయమేమీ లేదు. ఇప్పుడైతే కర్మాతీత అవస్థ
ఇంకా ఏర్పడలేదు. ఆసురీ సంభాషణ, నడవడిక మొదలైనవన్నీ ప్రసిద్ధమైపోతాయి. మీరైతే దైవీ
నడవడికను తయారుచేసుకోవాలి. దేవతలు సర్వగుణ సంపన్నులు కదా. ఇప్పుడు మీరు అలా
తయారవ్వాలి. ఆ అసురులెక్కడ, దేవతలెక్కడ! కానీ మాయ ఎవ్వరినీ విడిచిపెట్టదు,
ముట్టుకుంటే ముడుచుకుపోయేవారిలా చేస్తుంది. పూర్తిగా హతమార్చేస్తుంది. 5 మెట్లు
ఉన్నాయి కదా. దేహాభిమానము రావడముతోనే ఒక్కసారిగా పై నుండి కిందకు పడిపోతారు.
పడిపోయారంటే మరణిస్తారు. ఈ రోజుల్లో స్వయాన్ని హతమార్చుకునేందుకు ఎటువంటి ఉపాయాలను
రచిస్తున్నారు. 21 అంతస్తుల నుండి దూకుతారు, ఇక ఒక్కసారిగా అంతమైపోతారు. మళ్ళీ
ఆసుపత్రిలో పడి ఉంటూ దుఃఖాన్ని అనుభవిస్తూ ఉండకూడదని భావిస్తారు. 5 అంతస్తుల నుండి
పడిపోయి మరణించలేదు అంటే ఎంత దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు! కొందరు స్వయానికి నిప్పు
అంటించుకుంటారు. ఒకవేళ ఎవరైనా వారిని రక్షిస్తే ఇక వారు ఎంత దుఃఖాన్ని సహనము చేయవలసి
ఉంటుంది. కాలిపోయినట్లయితే ఆత్మ పారిపోతుంది కదా! అందుకే జీవహత్య చేసుకుంటారు,
శరీరాన్ని సమాప్తము చేసుకుంటారు. శరీరము వదిలేస్తే దుఃఖాల నుండి విముక్తులమైపోతామని
భావిస్తారు. కానీ అది కూడా మహాపాపమే, ఇంకా ఎక్కువ దుఃఖాన్ని అనుభవించాల్సి ఉంటుంది
ఎందుకంటే ఇది ఉన్నదే అపారమైన దుఃఖాల ప్రపంచము, అక్కడ ఉన్నవి అపారమైన సుఖాలు. ఇప్పుడు
మనము రిటర్న్ అవుతామని, దుఃఖధామము నుండి సుఖధామానికి వెళ్తామని పిల్లలైన మీరు
భావిస్తారు. ఇప్పుడు ఏ తండ్రి అయితే సుఖధామానికి యజమానులుగా తయారుచేస్తారో, వారిని
స్మృతి చేయాలి. వీరి ద్వారా బాబా అర్థం చేయిస్తారు, చిత్రాలు కూడా ఉన్నాయి కదా.
బ్రహ్మా ద్వారా స్వర్గ స్థాపన. బాబా, మేము అనేక సార్లు మీ నుండి స్వర్గ వారసత్వాన్ని
తీసుకునేందుకు వచ్చామని మీరు అంటారు. తండ్రి కూడా సంగమములోనే వస్తారు, ప్రపంచము
మారవలసి ఉన్నప్పుడు వస్తారు. కావున తండ్రి అంటారు, నేను పిల్లలైన మిమ్మల్ని దుఃఖము
నుండి విడిపించి సుఖము యొక్క పావన ప్రపంచములోకి తీసుకువెళ్ళేందుకు వచ్చాను. ఓ
పతిత-పావనా... అని పిలుస్తారు కూడా. మమ్మల్ని ఈ ఛీ-ఛీ ప్రపంచము నుండి ఇంటికి
తీసుకువెళ్ళండని మేము మహాకాలుడిని పిలుస్తున్నామని మనుష్యులు అర్థం చేసుకోరు.
తప్పకుండా బాబా వస్తారు. మనము మరణిస్తాము, అప్పుడే శాంతి ఏర్పడుతుంది కదా.
శాంతి-శాంతి అని అంటూ ఉంటారు. శాంతి ఉండేది పరంధామములో. అంతేకానీ ఈ ప్రపంచములో
ఇంతమంది మనుష్యులు ఉన్నంత వరకు శాంతి ఎలా ఏర్పడుతుంది! సత్యయుగములో సుఖ-శాంతులు
ఉండేవి. ఇప్పుడు కలియుగములో అనేక ధర్మాలు ఉన్నాయి. అవి ఎప్పుడైతే సమాప్తమవుతాయో,
అప్పుడు ఏక ధర్మ స్థాపన జరుగుతుంది, అప్పుడే సుఖ-శాంతులు ఉంటాయి కదా! హాహాకారాల
తర్వాతనే మళ్ళీ జయజయకారాలు జరుగుతాయి. మున్ముందు మృత్యువు యొక్క బజారు ఎంత వేడి
ఎక్కిపోతుందో చూడండి! వినాశనము తప్పకుండా జరగనున్నది. ఏక ధర్మ స్థాపనను తండ్రి వచ్చి
చేయిస్తారు. రాజయోగాన్ని కూడా నేర్పిస్తారు. మిగిలిన అనేక ధర్మాలన్నీ సమాప్తమైపోతాయి.
గీతలో ఏమీ చూపించలేదు. పంచ పాండవులు మరియు కుక్క హిమాలయాలపై కరిగిపోయారని అంటారు.
మరి ఫలితమేమిటి? ప్రళయము చూపించారు. జలమయమైపోతుంది కానీ మొత్తం ప్రపంచమంతా
జలమయమైపోదు. భారత్ అవినాశీ పవిత్రమైన ఖండము కదా. అందులో కూడా ఆబూ అన్నింటికన్నా
పవిత్రమైన తీర్థ స్థానము, అక్కడకు తండ్రి వచ్చి పిల్లలైన మీ ద్వారా సర్వుల సద్గతిని
చేస్తారు. దిల్వాడా మందిరములో ఎంత మంచి స్మృతిచిహ్నము ఉంది. ఎంత అర్థ సహితముగా ఉంది.
కానీ దానిని ఎవరైతే తయారుచేసారో వారికి తెలియదు. కానీ ఎంతైనా మంచి వివేకవంతులే కదా.
ద్వాపరములో తప్పకుండా మంచి వివేకవంతులు ఉంటారు. కలియుగములో తమోప్రధానముగా ఉంటారు.
ద్వాపరములో ఎంతైనా తమోబుద్ధి కలవారిగా ఉంటారు. అన్ని మందిరాల కంటే మీరు కూర్చున్న ఈ
స్థానము ఉన్నతమైనది.
వినాశనములో హోల్ సేల్ మృత్యువు జరుగుతుంది అన్నది ఇప్పుడు మీరు చూస్తూ ఉంటారు.
హోల్ సేల్ మహాభారీ యుద్ధము జరుగుతుంది. అందరూ సమాప్తమైపోతారు. ఇకపోతే ఒక్క ఖండము
మిగులుతుంది. భారత్ చాలా చిన్నదిగా ఉంటుంది, మిగిలినవన్నీ సమాప్తమైపోతాయి. స్వర్గము
ఎంత చిన్నదిగా ఉంటుంది. ఇప్పుడు ఈ జ్ఞానము మీ బుద్ధిలో ఉంది. కొందరికి అర్థం
చేయించడానికి కూడా సమయము పడుతుంది. ఇది పురుషోత్తమ సంగమయుగము. ఇక్కడ ఎంతమంది
మనుష్యులు ఉన్నారు మరియు అక్కడ ఎంత కొద్దిమంది మనుష్యులు ఉంటారు, వీరంతా
సమాప్తమైపోతారు. ప్రపంచ చరిత్ర-భౌగోళికాలు ప్రారంభము నుండి రిపీట్ అవుతాయి.
తప్పకుండా స్వర్గము ఆరంభము నుండే రిపీట్ అవుతుంది. చివరి నుండైతే మొదలవ్వదు. ఈ
డ్రామా చక్రము అనాది అయినది, ఇది తిరుగుతూనే ఉంటుంది. ఇటువైపు కలియుగము ఉంది,
అటువైపు సత్యయుగము ఉంది. మనము సంగమములో ఉన్నాము. ఇది కూడా మీరు అర్థం చేసుకుంటారు.
తండ్రి వస్తారు, తండ్రికి రథమైతే తప్పకుండా కావాలి కదా. తండ్రి అర్థం చేయిస్తున్నారు,
ఇప్పుడు మీరు ఇంటికి వెళ్తారు, ఆ తర్వాత ఈ లక్ష్మీ-నారాయణులుగా అవ్వాలి కావున దైవీ
గుణాలను కూడా ధారణ చేయాలి.
రావణ రాజ్యము మరియు రామ రాజ్యమని వేటినంటారు అనేది కూడా పిల్లలైన మీకు అర్థం
చేయించడము జరుగుతుంది. పతితము నుండి పావనముగా, మళ్ళీ పావనము నుండి పతితముగా ఎలా
అవుతారు! ఈ ఆట రహస్యాన్ని తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. తండ్రి నాలెడ్జ్ ఫుల్,
బీజరూపుడు కదా! వారు చైతన్యమైనవారు. వారే వచ్చి అర్థం చేయిస్తారు. మొత్తం కల్ప
వృక్ష రహస్యాన్ని అర్థం చేసుకున్నారా? ఇందులో ఏమేమి జరుగుతాయి? మీరు ఇందులో ఎంత
పాత్రను అభినయించారు? అని కేవలం తండ్రియే అడుగుతారు. అర్ధకల్పము దైవీ స్వరాజ్యము.
అర్ధకల్పము ఆసురీ రాజ్యము. మంచి-మంచి పిల్లలెవరైతే ఉన్నారో, వారికి బుద్ధిలో
జ్ఞానముంటుంది. తండ్రి తమ సమానముగా తయారుచేస్తారు కదా! టీచర్లలో కూడా నంబరువారుగా
ఉంటారు. కొంతమందైతే టీచర్లు అయ్యి ఉండి కూడా డిస్టర్బ్ అవుతారు. అనేకులకు నేర్పించి
స్వయము సమాప్తమైపోయారు. చిన్న-చిన్న పిల్లలలో రకరకాల సంస్కారాలు కలవారు ఉంటారు.
కొంతమందిని చూడండి, నంబరువన్ సైతానులా ఉన్నారు, కొందరు పరిస్తాన్ కు వెళ్ళేందుకు
యోగ్యులుగా ఉన్నారు. కొంతమంది ఎలా ఉన్నారంటే, జ్ఞానము తీసుకోరు, తమ నడవడికను
తీర్చిదిద్దుకోరు, అందరికీ దుఃఖమే ఇస్తూ ఉంటారు. అసురులు వచ్చి దాగి కూర్చునేవారని
శాస్త్రాలలో కూడా చూపించారు. అసురులుగా అయి ఎంత ఇబ్బంది కలిగిస్తారు. ఇదంతా
జరుగుతూనే ఉంటుంది. ఉన్నతోన్నతమైన తండ్రియే స్వర్గ స్థాపనను చేయడానికి రావలసి
ఉంటుంది. మాయ కూడా చాలా శక్తివంతముగా ఉంది. దానమిస్తారు, అయినా మాయ బుద్ధిని
తిప్పేస్తుంది. సగము మందిని మాయ తప్పకుండా తినేస్తుంది, అందుకే మాయ గొప్ప
శక్తివంతమైనదని అంటారు. అర్ధకల్పము మాయ రాజ్యము చేస్తుంది కావున తప్పకుండా అంతటి
శక్తిశాలిగా ఉంటుంది కదా. మాయతో ఓడిపోయేవారి పరిస్థితి ఏమైపోతుంది! అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ఎప్పుడూ కూడా ముట్టుకుంటే ముడుచుకుపోయేవారిలా అవ్వకూడదు. దైవీ గుణాలను ధారణ
చేసి తమ నడవడికను తీర్చిదిద్దుకోవాలి.
2. తండ్రి ప్రేమను పొందేందుకు సేవ చేయాలి, కానీ ఏదైతే ఇతరులకు వినిపిస్తారో,
దానిని స్వయము ధారణ చేయాలి. కర్మాతీత అవస్థకు చేరుకునేందుకు పూర్తి-పూర్తి
పురుషార్థము చేయాలి.
వరదానము:-
సాకార రూపములో బాప్ దాదాను సమ్ముఖముగా అనుభవం చేసే కంబైండ్
రూపధారి భవ
ఏ విధముగా శివుడు మరియు శక్తి కంబైండ్ గా ఉన్నారో, అదే
విధముగా పాండవపతి మరియు పాండవులు కంబైండ్ గా ఉన్నారు. ఎవరైతే ఈ విధముగా కంబైండ్
రూపములో ఉంటారో వారి ఎదురుగా బాప్ దాదా సాకార రూపములో సర్వ సంబంధాలతో ఎదురుగా ఉంటారు.
ఇప్పుడు రోజురోజుకు ఇంకా ఎక్కువ అనుభవము చేస్తారు, బాప్ దాదా ఎదురుగా వచ్చినట్లుగా,
చేయి పట్టుకున్నట్లుగా అనుభవము చేస్తారు. బుద్ధి ద్వారా కాదు, కనులతో చూస్తారు,
అనుభవమవుతుంది. కానీ, కేవలం ఒక్క బాబా తప్ప మరెవ్వరూ లేరు అన్న ఈ పాఠము పక్కాగా
ఉండాలి, అప్పుడిక ఏ విధముగా నీడ చుట్టూ తిరుగుతూ ఉంటుందో అలా బాప్ దాదా కళ్ళ ముందు
నుండి పక్కకు తప్పుకోలేరు, సదా సమ్ముఖముగా ఉన్నట్లు అనుభూతి కలుగుతుంది.
స్లోగన్:-
మాయాజీతులుగా, ప్రకృతీజీతులుగా అయ్యే శ్రేష్ట ఆత్మలే స్వ కళ్యాణీ మరియు విశ్వ
కళ్యాణీ ఆత్మలు.
అవ్యక్త ప్రేరణలు - ఈ
అవ్యక్త మాసములో బంధనముక్తులుగా ఉంటూ జీవన్ముక్త స్థితిని అనుభవము చేయండి
ఇప్పుడు మీరు
జీవన్ముక్తులుగా అయినట్లయితే మీ జీవన్ముక్త స్థితి యొక్క ప్రభావము జీవన బంధనము కల
ఆత్మల బంధనాన్ని సమాప్తము చేస్తుంది. మరి అందరూ జీవన్ముక్తులుగా అయి, ఎటువంటి బంధనము
లేనటువంటి ఆ డేట్ ఎప్పుడు వస్తుంది? అన్ని బంధనాలలో కల్లా మొదటి బంధనము - దేహ భానము
యొక్క బంధనము, దీని నుండి ముక్తులుగా అవ్వండి. దేహమే లేకపోతే ఇతర బంధనాలు స్వతహాగానే
సమాప్తమైపోతాయి.
| | | |