06-06-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - తండ్రి తోట యజమాని, ఈ తోట యజమాని
వద్దకు తోటమాలులైన మీరు చాలా మంచి-మంచి సుగంధభరితమైన పుష్పాలను తీసుకురావాలి,
వాడిపోయి ఉన్న పుష్పాలను తీసుకురాకండి’’
ప్రశ్న:-
తండ్రి
దృష్టి ఏ పిల్లలపై పడుతుంది, ఏ పిల్లలపై పడదు?
జవాబు:-
ఎవరైతే మంచి
సుగంధాన్ని ఇచ్చే పుష్పాలుగా ఉన్నారో, అనేక ముళ్ళను పుష్పాలుగా తయారుచేసే సేవను
చేస్తున్నారో, వారిని చూస్తూ-చూస్తూ తండ్రి సంతోషిస్తారు, వారి వైపుకే తండ్రి దృష్టి
వెళ్తుంది మరియు ఎవరి వృత్తి అయితే అశుద్ధంగా ఉందో, కళ్ళు మోసగిస్తున్నాయో, వారిపై
తండ్రి యొక్క దృష్టి కూడా పడదు. తండ్రి ఏమంటారంటే - పిల్లలూ, పుష్పాలుగా అయి
అనేకులను పుష్పాలుగా తయారుచేయండి, అప్పుడు తెలివైన తోటమాలులుగా పిలవబడతారు.
ఓంశాంతి
తోట యజమాని అయిన తండ్రి కూర్చొని తమ పుష్పాలను చూస్తున్నారు, ఎందుకంటే మిగిలిన అన్ని
సెంటర్లలోనైతే పుష్పాలు మరియు తోటమాలులు ఉన్నారు, ఇక్కడ మీరు మీ సుగంధాన్ని
ఇవ్వడానికి తోట యజమాని వద్దకు వస్తారు. మీరు పుష్పాలు కదా. ముళ్ళ అడవికి బీజరూపుడు
రావణుడు అని మీకు కూడా తెలుసు, తండ్రికి కూడా తెలుసు. వాస్తవానికి మొత్తం
వృక్షమంతటికీ బీజము ఒక్కరే, కానీ పుష్పాలతోట నుండి మళ్ళీ ముళ్ళ అడవిగా చేసేవారు కూడా
తప్పకుండా ఉంటారు. అతడే రావణుడు. కావున నిర్ణయించండి, తండ్రి కరక్టుగా అర్థం
చేయిస్తున్నారు కదా. దేవతల రూపీ పుష్పాల తోటకు బీజరూపుడు తండ్రి. మీరు ఇప్పుడు
దేవీ-దేవతలుగా అవుతున్నారు కదా. తాము ఏ రకమైన పుష్పము అనేది ప్రతి ఒక్కరికీ తెలుసు.
తోట యజమాని కూడా పుష్పాలను చూడడానికి ఇక్కడికే వస్తారు. అక్కడ వారందరూ తోటమాలులు.
అందులో కూడా అనేక రకాల తోటమాలులు ఉన్నారు. ఆ తోటలకు కూడా రకరకాల తోటమాలులు ఉంటారు
కదా. కొందరికి 500 రూపాయల జీతం ఉంటుంది, కొందరికి 1000, మరికొందరికి 2000 రూపాయల
జీతం ఉంటుంది. ఉదాహరణకు మొఘల్ గార్డెన్ యొక్క తోటమాలి తప్పకుండా చాలా చురుకైనవారై
ఉంటారు, అతని జీతం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇదైతే అనంతమైన పెద్ద తోట, ఇందులో కూడా
అనేక రకాల తోటమాలులు నంబరువారుగా ఉన్నారు. చాలా మంచి తోటమాలులు ఎవరైతే ఉంటారో వారు
తోటను చాలా మంచిగా, శోభాయమానంగా తయారుచేస్తారు, మంచి పుష్పాలను నాటుతారు. గవర్నమెంట్
హౌస్ యొక్క మొఘల్ గార్డెన్ ఎంత బాగుంటుంది. ఇది అనంతమైన తోట. తోట యజమాని ఒక్కరే.
ఇప్పుడు ముళ్ళ అడవికి బీజము రావణుడు మరియు పుష్పాలతోటకు బీజము శివబాబా. వారసత్వము
తండ్రి నుండి లభిస్తుంది. రావణుడి నుండి వారసత్వము లభించదు, అతడు శపిస్తాడు.
ఎప్పుడైతే శ్రాపగ్రస్థులుగా అవుతారో అప్పుడు సుఖాన్ని ఇచ్చేవారు ఎవరైతే ఉన్నారో,
వారిని అందరూ తలచుకుంటారు ఎందుకంటే వారు సుఖదాత, సదా సుఖాన్ని ఇచ్చేవారు. తోటమాలులు
కూడా రకరకాలుగా ఉంటారు, తోట యజమాని వచ్చి తోటమాలులు ఏ విధంగా చిన్నా-పెద్దా తోటలను
తయారుచేస్తున్నారు అనేది చూస్తారు. ఎటువంటి పుష్పాలుగా ఉన్నారు అన్నది కూడా ఆలోచనలో
పెట్టుకుంటారు. అప్పుడప్పుడు చాలా మంచి-మంచి తోటమాలులు కూడా వస్తారు, చాలా వరకు వారి
పుష్పాల అలంకరణ కూడా బాగుంటుంది. కావున తోట యజమానికి కూడా సంతోషము కలుగుతుంది - ఓహో!
ఈ తోటమాలి అయితే చాలా బాగున్నారే, పుష్పాలు కూడా మంచి-మంచివి తీసుకువచ్చారు. వీరు
అనంతమైన తండ్రి మరియు వీరివి అనంతమైన విషయాలు. బాబా పూర్తిగా సత్యమే చెప్తున్నారని
పిల్లలైన మీరు మీ మనసులో భావిస్తారు. అర్ధకల్పం రావణరాజ్యం కొనసాగుతుంది.
పుష్పాలతోటను ముళ్ళ అడవిగా రావణుడే తయారుచేస్తాడు. అడవిలో అన్నీ ముళ్ళే ఉంటాయి, అవి
ఎంతో దుఃఖాన్ని కలిగిస్తాయి. పుష్పాలతోట మధ్యలో ముళ్ళు ఏమైనా ఉంటాయా, ఒక్కటి కూడా
ఉండదు. రావణుడు దేహాభిమానంలోకి తీసుకువస్తాడు అని పిల్లలకు తెలుసు. అన్నింటికన్నా
పెద్ద ముల్లు దేహాభిమానము.
తండ్రి రాత్రి కూడా అర్థం చేయించారు - కొందరి దృష్టి కామముతో కూడినదిగా ఉంటుంది,
మరికొందరి దృష్టి సెమీ కామముతో కూడినదిగా ఉంటుంది. కొంతమంది కొత్త-కొత్తవారు కూడా
వస్తారు, వారు మొదట్లో చాలా బాగా నడుస్తారు, మేము ఇక వికారాలలోకి ఎప్పుడూ వెళ్ళము,
పవిత్రంగా ఉంటాము అని భావిస్తారు. ఆ సమయంలో స్మశాన వైరాగ్యము కలుగుతుంది. మళ్ళీ
ఇంటికి వెళ్ళిన తర్వాత పాడైపోతారు, దృష్టి అశుద్ధముగా అయిపోతుంది. ఇక్కడ కొందరిని
మంచి-మంచి పుష్పాలుగా భావించి - బాబా, వీరు చాలా మంచి పుష్పము అని తోట యజమాని వద్దకు
తీసుకొస్తారు. కొందరు తోటమాలులు వచ్చి - వీరు ఫలానా పుష్పము అని చెవిలో చెప్తారు.
తోటమాలులైతే తప్పకుండా చెప్తారు కదా. బాబా అంతర్యామి అనేమీ కాదు. తోటమాలులు ప్రతి
ఒక్కరి నడవడికను గురించి తెలియజేస్తారు - బాబా, వీరి దృష్టి బాలేదు, వీరి నడవడిక
రాయల్ గా లేదు, వీరి దృష్టి 10-20 శాతం బాగయ్యింది అని. ముఖ్యమైనవి కళ్ళు, ఇవి
ఎంతగానో మోసగిస్తాయి. తోటమాలులు వచ్చి తోట యజమానికి అన్ని విషయాలను తెలియజేస్తారు.
మీరు ఎటువంటి పుష్పాలను తీసుకువచ్చారో చెప్పండి? అని బాబా ఒక్కొక్కరినీ అడుగుతారు.
కొందరు గులాబీ పుష్పాల వలె ఉంటారు, కొందరు మల్లెల వలె ఉంటారు, కొందరు జిల్లేడు
పుష్పాలను కూడా తీసుకువస్తారు. ఇక్కడ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటారు. అడవిలోకి
వెళ్ళిపోయిన తర్వాత ఇక వాడిపోతారు. వీరు ఏ రకమైన పుష్పము అనేది బాబా చూస్తారు. మాయ
కూడా ఎటువంటిదంటే, అది తోటమాలులకు కూడా చాలా జోరుగా చెంపదెబ్బ వేస్తుంది, ఇకప్పుడు
తోటమాలులు కూడా ముళ్ళలా అయిపోతారు. తోట యజమాని వచ్చినప్పుడు మొట్టమొదట తోటనే
చూస్తారు, ఆ తర్వాత తండ్రి కూర్చొని వారిని అలంకరిస్తారు. పిల్లలూ, అప్రమత్తంగా
ఉండండి, లోపాలను తొలగించుకుంటూ వెళ్ళండి, లేకపోతే తర్వాత చాలా పశ్చాత్తాపపడతారు.
బాబా లక్ష్మీ-నారాయణుల వలె తయారుచేయడానికి వచ్చారు, దానికి బదులుగా మనం నౌకర్లుగా
అవుతామా! మేము ఈ విధంగా ఉన్నతంగా, యోగ్యులుగా అవుతున్నామా అని తమను తాము చెక్
చేసుకోవడం జరుగుతుంది. ముళ్ళ అడవికి బీజము రావణుడు మరియు పుష్పాల తోటకు బీజము రాముడు
అనైతే తెలుసు. ఈ విషయాలన్నింటినీ తండ్రి కూర్చొని తెలియజేస్తారు. బాబా అయితే స్కూల్
చదువును మహిమ చేస్తారు, ఆ చదువు ఎంతైనా మంచిదే, ఎందుకంటే అందులో సంపాదన యొక్క ఆధారము
ఉంది. లక్ష్యము-ఉద్దేశ్యము కూడా ఉంది. ఇది కూడా పాఠశాల, ఇందులో లక్ష్యము-ఉద్దేశ్యము
ఉంది. ఇంకెక్కడా ఇటువంటి లక్ష్యము-ఉద్దేశ్యము ఉండదు. మీకు నరుని నుండి నారాయణునిగా
అయ్యే లక్ష్యము ఒక్కటే ఉంది. భక్తి మార్గములో సత్యనారాయణుని కథను ఎంతగానో వింటారు,
ప్రతి నెల బ్రాహ్మణుడిని పిలుస్తారు, ఆ బ్రాహ్మణుడు గీతను వినిపిస్తారు. ఈ
రోజుల్లోనైతే గీతను అందరూ వినిపిస్తున్నారు, సత్యాతి-సత్యమైన బ్రాహ్మణులైతే ఎవ్వరూ
లేరు. మీరే సత్యాతి-సత్యమైన బ్రాహ్మణులు, సత్యమైన తండ్రికి పిల్లలు. మీరు
సత్యాతి-సత్యమైన కథను వినిపిస్తారు. సత్యనారాయణుని కథ కూడా ఉంది, అమరకథ కూడా ఉంది,
అలాగే మూడవ నేత్రము యొక్క కథ కూడా ఉంది. భగవానువాచ - నేను మిమ్మల్ని
రాజులకే-రాజులుగా తయారుచేస్తాను. వాళ్ళు గీతనైతే వినిపిస్తూ వచ్చారు, మరి రాజుగా
ఎవరు అయ్యారు? నేను మిమ్మల్ని రాజులకే రాజులుగా తయారుచేస్తాను, నేను స్వయం అలా
అవ్వను అని అనేవారు ఎవరైనా ఉన్నారా? ఇలా అనడం ఎప్పుడైనా విన్నారా? ఈ తండ్రి ఒక్కరే
అలా కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తారు. ఇక్కడ తోట యజమాని వద్దకు రిఫ్రెష్
అయ్యేందుకు వస్తామని పిల్లలకు తెలుసు. తోటమాలులుగా కూడా అవుతారు, పుష్పాలుగా కూడా
అవుతారు. తోటమాలులుగానైతే తప్పకుండా అవ్వాలి. రకరకాల తోటమాలులు ఉన్నారు. సేవ
చేయకపోతే మంచి పుష్పాలుగా ఎలా తయారవుతారు? నేను ఏ రకమైన పుష్పాన్ని? ఏ రకమైన
తోటమాలిని? అని ప్రతి ఒక్కరూ తమ మనసును ప్రశ్నించుకోండి. పిల్లల విచార సాగర మంథనము
చేయవలసి ఉంటుంది. తోటమాలులు కూడా రకరకాలుగా ఉంటారు అన్నది బ్రాహ్మణీలకు తెలుసు.
కొందరు మంచి-మంచి తోటమాలులు కూడా వస్తారు, వారికి మంచి పెద్ద పుష్పాలతోట ఉంటుంది.
మంచి తోటమాలి అయితే తోటను కూడా బాగా తయారుచేస్తారు. వారు మంచి, మంచి పుష్పాలను
తీసుకువస్తారు, ఆ పుష్పాలను చూస్తే మనసు సంతోషిస్తుంది. కొంతమంది తేలికపాటి
పుష్పాలను తీసుకొస్తారు. వారు ఎలాంటి-ఎలాంటి పదవులను పొందుతారు అనేది తోట యజమానికి
అర్థమైపోతుంది. ఇప్పుడైతే ఇంకా సమయం ఉంది. ఒక్కొక్క ముల్లును పుష్పంగా తయారుచేయడంలో
కష్టపడవలసి ఉంటుంది. కొందరైతే పుష్పముగా అవ్వాలని అనుకోరు, ముల్లుగానే ఉండడానికి
ఇష్టపడతారు. కళ్ళ యొక్క వృత్తి చాలా అశుద్ధంగా ఉంటుంది. ఇక్కడకు వచ్చినా కూడా వారి
నుండి సుగంధము రాదు. నా ఎదురుగా పుష్పాలు కూర్చుంటే బాగుంటుంది, వారిని చూసి నేను
సంతోషిస్తాను అని తోట యజమాని కోరుకుంటారు. ఎవరి వృత్తి అయినా సరిగ్గా లేదని గమనిస్తే
ఇక వారివైపుకు దృష్టిని కూడా సారించరు, అందుకే ఒక్కొక్కరినీ చూస్తారు - నా ఈ
పుష్పాలు ఏ రకమైనవి? ఎంత సుగంధాన్ని ఇస్తాయి? ముళ్ళ నుండి పుష్పాలుగా అయ్యారా లేదా?
ప్రతి ఒక్కరూ స్వయం కూడా అర్థం చేసుకోగలరు - మేము ఎంతవరకు పుష్పాలుగా అయ్యాము?
పురుషార్థము చేస్తున్నామా? అని. బాబా, మేము మిమ్మల్ని మర్చిపోతున్నాము, యోగములో
నిలవలేకపోతున్నాము అని ఘడియ-ఘడియ అంటారు. అరే, స్మృతి చేయకపోతే పుష్పాలుగా ఎలా
అవుతారు? స్మృతి చేసినట్లయితే పాపాలు అంతమవుతాయి, అప్పుడు పుష్పాలుగా అయి ఇతరులను
కూడా పుష్పాలుగా తయారుచేస్తారు, అప్పుడు తోటమాలి అన్న పేరును పెట్టవచ్చు. బాబా
తోటమాలులు కావాలి అని అడుగుతూ ఉంటారు. తోటమాలులు ఎవరైనా ఉన్నారా? తోటమాలులుగా ఎందుకు
అవ్వలేరు? బంధనాలనైతే విడిచిపెట్టాలి. లోలోపల ఉత్సాహము రావాలి. సేవ యొక్క ఉల్లాసము
ఉండాలి. మీ రెక్కలను స్వతంత్రం చేసుకునేందుకు కష్టపడాలి. ఎవరి పట్లనైతే ఎంతో ప్రేమ
ఉంటుందో, వారినేమైనా వదిలేది ఉంటుందా? తండ్రి సేవ కొరకు ఎప్పటివరకైతే పుష్పాలుగా అయి
ఇతరులను తయారుచేయరో, అప్పటివరకు ఉన్నత పదవిని ఎలా పొందుతారు? ఇది 21 జన్మల కొరకు
ఉన్నత పదవి. మహారాజులు, రాజులు, గొప్ప-గొప్ప షావుకార్లు కూడా ఉంటారు. ఆ తర్వాత
నంబరువారుగా తక్కువ షావుకార్లు కూడా ఉంటారు, ప్రజలు కూడా ఉంటారు. ఇప్పుడు మనం ఎలా
తయారవ్వాలి? ఎవరైతే ఇప్పుడు పురుషార్థం చేస్తారో వారు కల్ప-కల్పాంతరాలూ అలా
తయారవుతారు. ఇప్పుడు ఫుల్ ఫోర్స్ తో పురుషార్థము చేయవలసి ఉంటుంది. నరుని నుండి
నారాయణునిగా అవ్వాలి, ఎవరైతే మంచి పురుషార్థులు ఉంటారో వారు అమలుపరుస్తారు. ప్రతి
రోజూ సంపాదనను మరియు నష్టాన్ని చూసుకోవాల్సి ఉంటుంది. 12 నెలల విషయం కాదు, ప్రతి
రోజూ తమ లాభ-నష్టాల లెక్కను తీయాలి. నష్టం రానివ్వకూడదు. లేదంటే థర్డ్ క్లాస్ వారిగా
అయిపోతారు. స్కూల్లో కూడా నంబరువారుగా ఉంటారు కదా.
మన బీజము వృక్షపతి అని, వారు రావడంతో మనపై బృహస్పతి దశ కూర్చొని ఉంటుందని
మధురాతి-మధురమైన పిల్లలకు తెలుసు. మళ్ళీ రావణరాజ్యం వచ్చినప్పుడు రాహువు దశ
కూర్చుంటుంది. అది పూర్తిగా ఉన్నతమైనది, ఇది పూర్తిగా కనిష్ఠమైనది. పూర్తిగా శివాలయం
నుండి వేశ్యాలయంగా తయారుచేసేస్తారు. ఇప్పుడు పిల్లలైన మీపై బృహస్పతి దశ ఉంది. మొదట
కొత్త వృక్షం ఉంటుంది, ఆ తర్వాత సగం నుండి పాతదిగా అవ్వడం మొదలవుతుంది. తోట యజమాని
కూడా ఉన్నారు, తోటమాలులు కూడా వృద్ధి చెందుతూ ఉంటారు. తోట యజమాని వద్దకు
తీసుకువస్తారు. ప్రతి ఒక్క తోటమాలి పుష్పాలను తీసుకువస్తారు. కొందరైతే ఎటువంటి మంచి
పుష్పాలను తీసుకువస్తారంటే, వారు బాబా వద్దకు వెళ్ళాలి అని తపిస్తారు. ఎలాంటి-ఎలాంటి
యుక్తులతో కుమార్తెలు వస్తారు. బాబా అంటారు - చాలా మంచి పుష్పాన్ని తీసుకొని వచ్చావు.
తోటమాలి సెకండ్ క్లాస్ వారు అయినా కానీ, తోటమాలి కన్నా పుష్పాలు బాగుంటారు. వారు
శివబాబా వద్దకు వెళ్ళాలి అని తపిస్తారు, ఏ బాబా అయితే మమ్మల్ని ఇంత ఉన్నతంగా,
విశ్వాధిపతులుగా తయారుచేస్తారో, వారి వద్దకు వెళ్ళాలి అని తపిస్తారు. ఇంట్లో దెబ్బలు
తిన్నా కూడా, శివబాబా మమ్మల్ని రక్షించండి అని అంటారు. అటువంటివారినే సత్యమైన
ద్రౌపది అని అంటారు. ఏదైతే గతించిందో అది మళ్ళీ రిపీట్ అవ్వనున్నది. నిన్న పిలిచారు
కదా, ఈ రోజు బాబా వచ్చారు, రక్షించడం కోసం యుక్తులను తెలియజేస్తున్నారు - ఇలా, ఇలా
భూ-భూ చేయండి, మీరు భ్రమరీలు, వారు పురుగులు, వారిపై భూ-భూ చేస్తూ ఉండండి. వారికి
ఇలా చెప్పండి - భగవానువాచ, కామం మహాశత్రువు, దానిని జయించడం ద్వారా విశ్వాధిపతులుగా
అవుతారు. ఏదో ఒక సమయంలో ఆ అబలల మాటలు వారికి తగులుతాయి, అప్పుడిక వారు చల్లబడతారు.
అప్పుడు ఇలా అంటారు - అచ్ఛా - అయితే వెళ్ళు, ఈ విధంగా తయారుచేసేవారి వద్దకు వెళ్ళు,
నా భాగ్యములోనైతే లేదు, నీవైతే వెళ్ళు. ఈ విధంగా ద్రౌపదులు పిలుస్తారు. భూ-భూ చేయండి
అని బాబా వ్రాస్తారు. కొందరు స్త్రీలు కూడా ఎలా ఉంటారంటే వారిని శూర్పణఖ, పూతన అని
పిలవడం జరుగుతుంది. పురుషులు వారికి భూ-భూ చేస్తారు, ఆ స్త్రీలు పురుగుల్లా ఉంటారు,
వికారాలు లేకుండా ఉండలేకపోతారు. తోట యజమాని వద్దకు రకరకాలవారు వస్తారు, ఇక అడగకండి.
కొందరు కన్యలు కూడా ముళ్ళలా అయిపోతారు, అందుకే బాబా అంటారు, మీ జన్మపత్రిని
తెలియజేయండి. తండ్రికి వినిపించకపోతే, వారి నుండి దాచి పెట్టినట్లయితే అది వృద్ధి
అవుతూ ఉంటుంది. ఇక్కడ అసత్యం నడవదు. మీ వృత్తి పాడైపోతూ ఉంటుంది. తండ్రికి
వినిపించినట్లయితే మీరు కాపాడబడతారు. సత్యాన్ని వినిపించాలి, లేదంటే పూర్తిగా
మహారోగులుగా అయిపోతారు. తండ్రి అంటారు, ఎవరైతే వికారులుగా అవుతారో వారి ముఖం నల్లగా
అయిపోతుంది. పతితులు అనగా నల్లని ముఖం. కృష్ణుడిని కూడా శ్యామ-సుందరుడు అని అంటారు.
కృష్ణుడిని నల్లగా చేసేసారు. రాముడిని, నారాయణుడిని కూడా నల్లగా చూపిస్తారు,
అర్థమేమీ తెలియదు. మీ వద్దనైతే నారాయణుని చిత్రము తెల్లగా ఉంటుంది, మీదైతే ఇదే
లక్ష్యము-ఉద్దేశ్యము. మీరేమైనా నల్లని నారాయణునిగా అయ్యేది ఉందా. ఈ మందిరాలలో
ఎలాగైతే తయారుచేసారో, మీరు ఆ విధంగా ఉండేవారు కాదు. వికారాలలో పడిపోవడం వలన మళ్ళీ
నల్లని ముఖం అయిపోతుంది. ఆత్మ నల్లగా అయిపోయింది. ఇనుపయుగము నుండి బంగారుయుగములోకి
వెళ్ళాలి. బంగారు పిచ్చుకలా తయారవ్వాలి. కాళిని కలకత్తా కాళి అని అంటారు. ఎంతటి
భయంకరమైన ముఖాన్ని చూపిస్తారు, ఇక అడగకండి. తండ్రి అంటారు - పిల్లలూ, ఇదంతా భక్తి
మార్గం, ఇప్పుడు మీకైతే జ్ఞానం లభించింది. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్, ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. మీ రెక్కలను స్వతంత్రంగా చేసుకునేందుకు కష్టపడాలి, బంధనాల నుండి ముక్తులై
తెలివైన తోటమాలులుగా అవ్వాలి. ముళ్ళను పుష్పాలుగా తయారుచేసే సేవను చేయాలి.
2. మిమ్మల్ని మీరు చూసుకోవాలి - నేను ఎంతటి సుగంధభరితమైన పుష్పంగా అయ్యాను? నా
వృత్తి శుద్ధముగా ఉందా? కళ్ళు మోసగించడం లేదు కదా? మీ నడవడిక యొక్క లెక్కాపత్రాన్ని
పెట్టుకొని లోపాలను తొలగించుకోవాలి.
వరదానము:-
స్వరాజ్య అధికారము యొక్క నషా మరియు నిశ్చయముతో సదా
శక్తిశాలిగా అయ్యే సహజయోగి, నిరంతర యోగీ భవ
స్వరాజ్య అధికారి అనగా ప్రతి కర్మేంద్రియముపై మీ రాజ్యము.
ఎప్పుడూ సంకల్పములో కూడా కర్మేంద్రియాలు మోసం చెయ్యకూడదు. ఎప్పుడైనా కొంచెం
దేహాభిమానము వచ్చినా, ఆవేశము లేక క్రోధము సహజంగా వచ్చేస్తాయి. కానీ ఎవరైతే స్వరాజ్య
అధికారులుగా ఉంటారో, వారు సదా నిరహంకారులుగా, సదా నిర్మానులుగా అయ్యి సేవ చేస్తారు,
అందుకే నేను స్వరాజ్య అధికారీ ఆత్మను అన్న ఈ నషా మరియు నిశ్చయంతో శక్తిశాలిగా అయ్యి
మాయాజీతుల నుండి జగత్ జీతులుగా అవ్వండి, అప్పుడు సహజయోగులుగా, నిరంతర యోగులుగా
అవుతారు.
స్లోగన్:-
లైట్ హౌస్ గా అయ్యి
మనసు-బుద్ధి ద్వారా లైట్ ను వ్యాపింపజేయటంలో బిజీగా ఉండండి, అప్పుడు ఏ విషయములోనూ
భయమనిపించదు.
| | |