06-06-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - అమృతవేళ సమయము చాలా-చాలా మంచిది, అందుకే ఉదయాన్నే లేచి ఏకాంతములో కూర్చుని బాబాతో మధురాతి-మధురమైన మాటలు మాట్లాడండి’’

ప్రశ్న:-
ఏ జ్ఞానము నిరంతర యోగులుగా అవ్వడములో చాలా సహాయము చేస్తుంది?

జవాబు:-
డ్రామా జ్ఞానము. ఏదైతే గడిచిపోయిందో, అది డ్రామాలో నిశ్చితము. కొద్దిగా కూడా స్థితి అలజడిలోకి రాకూడదు. ఎలాంటి పరిస్థితి అయినా, భూకంపము వచ్చినా కానీ, వ్యాపారములో నష్టము కలిగినా కానీ, కొద్దిగా కూడా సంశయము ఉత్పన్నమవ్వకూడదు. ఇటువంటి వారిని మహావీరులని అంటారు. ఒకవేళ డ్రామాకు సంబంధించిన యథార్థ జ్ఞానము లేకపోతే కన్నీరు కారుస్తూ ఉంటారు. నిరంతర యోగులుగా అయ్యేందుకు డ్రామా జ్ఞానము చాలా సహాయము చేస్తుంది.

పాట:-
ఓం నమః శివాయ...

ఓంశాంతి
ఇప్పుడు పతిత ప్రపంచము యొక్క అంతం జరుగుతుందని, పావన ప్రపంచము ప్రారంభమవుతుందని పిల్లలు మంచి రీతిలో అర్థం చేసుకుంటారు. ఇది కేవలం పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. అంతేకాక, పిల్లలకు మాత్రమే ఈ డైరెక్షన్లు మరియు శ్రీమతము లభిస్తుంది. ఎవరిస్తారు? ఉన్నతోన్నతమైన భగవంతుడు. పతితుల నుండి పావనులుగా అవ్వాలని వారు అర్థం చేయిస్తూ ఉంటారు. ఈ జ్ఞానము మీ కోసమే ఉంది, మిగిలినవారంతా పతితులు. ఈ పతిత ప్రపంచము తప్పకుండా వినాశనమవ్వనున్నది. పతితులు అని వికారులను అంటారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - మీరు జన్మజన్మలుగా ఒకరికొకరు దుఃఖము ఇచ్చుకుంటూ వచ్చారు, అందుకే మీరు ఆదిమధ్యాంతాలు దుఃఖము పొందారు. ఒకరినొకరు పతితులుగా చేసుకుంటారు. మేము పతితులము అని పిలుస్తారు కూడా, కానీ బుద్ధిలో పూర్తిగా కూర్చోదు. ఓ పతిత-పావనా రండి, అని అంటారు కూడా, అయినా కానీ పతితత్వాన్ని వదలరు. పావనముగా అవ్వడమే ముఖ్యమైన విషయమని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. ఇది అర్థం చేయించేవారు కూడా ఎవరో కావాలి కదా. అర్థం చేయించేవారు ఒక్కరే. ఇకపోతే, ఈ గురువులు ఎవరైతే ఉన్నారో, వారు ఎవరినీ పావనముగా చేయలేరు. పావనముగా అవ్వడమనేది కూడా కేవలం ఒక్క జన్మ కోసమే కాదు, జన్మజన్మల కోసం పావనముగా అవ్వాలి. మీలో కూడా జ్ఞానవంతులు ఎవరైతే ఉన్నారో, వారు చురుకుగా ఉంటారు. డ్రామానుసారముగా అది నిశ్చితము. మీలో కూడా మహావీరత కావాలి. అది తండ్రి స్మృతిలో ఉండటము ద్వారానే వస్తుంది. తండ్రి చాలా మంచి రీతిలో కూర్చుని అర్థం చేయిస్తారు. ఉదాహరణకు, ఉదయాన్నే లేచి స్మృతి చేయండి అని బాబా అంటారు. స్మృతి చేయడానికి ఆ సమయము చాలా బాగుంటుంది, ఆ సమయాన్ని ప్రభాత సమయమని అంటారు. ఓ మనసా, ప్రభాత సమయములో రాముడిని స్మరించు - అని భక్తి మార్గములో కూడా అంటారు. తండ్రి కూడా అంటారు, ఉదయాన్నే లేచి తండ్రిని స్మృతి చేసినట్లయితే చాలా ఆనందము కలుగుతుంది. తండ్రి స్మృతిలో కూర్చుని ఎవరికి ఏ విధముగా అర్థం చేయించవచ్చు - అని ఆలోచించాలి. అమృతవేళలో వాయుమండలము చాలా శుద్ధముగా ఉంటుంది. పగలంతా వ్యాపార-వ్యవహారాలు ఉంటాయి. రాత్రి 12 గంటల వరకు వికారీ వాయుమండలము ఉంటుంది. సాధు-సత్పురుషులు, భక్తులు మొదలైనవారంతా భక్తిని కూడా ప్రభాత సమయములోనే చేస్తారు. వాస్తవానికి పగలు కూడా స్మృతి చేయవచ్చు. వ్యాపారము చేస్తున్నా కానీ, ఎవరు ఏ దేవతకు పూజారి అయితే, బుద్ధియోగము ఆ దేవత వద్ద ఉండాలి. కానీ ఎవరికీ ఈ విధముగా ఉండటం లేదు. భక్తి మార్గములో కేవలం దర్శనము కోసం శ్రమిస్తారు. కానీ, ఏమీ లభించదు. వారు కూడా భక్తి చేస్తూ-చేస్తూ తమోప్రధానముగా అవ్వాల్సిందే. భక్తి మార్గములో కూడా శివునిపై బలిహారమవుతారు, దానిని కాశీ కల్వట్ (కత్తుల బావిలో దూకి మరణించడం) అని అంటారు. శివుడిని స్మృతి చేస్తూ-చేస్తూ బావిలో దూకేస్తారు. శివునిపై బలిహారమవుతారు. అది భక్తి మార్గములోని బలి. ఇది జ్ఞాన మార్గములోని బలి. అది కూడా కష్టమే, ఇది కూడా కష్టమే. భక్తి మార్గములో దాని వలన ఎటువంటి లాభము లేదు. అది ఎలాంటిదంటే, ఆత్మ తన శరీరాన్ని హతమార్చుకున్నట్లే. ఇది జ్ఞానమేమీ కాదు. వారు కూడా ఆత్మయే పరమాత్మ అని అనేస్తారు. ఒక్క తండ్రి మాత్రమే ఆత్మాభిమాని. నేనొక్కడినే పరమాత్మను అని వారు పిల్లలకు అర్థం చేయిస్తారు. ఆత్మనైన నేనే పరమాత్మను అని అనడము - ఇది అన్నింటికంటే పెద్ద అసత్యము. ఇది అసంభవము.

తండ్రి అంటారు - నేను పతితులను పావనముగా చేసేందుకే వస్తాను, ఇప్పుడు మళ్ళీ పావనముగా చేస్తున్నాను. ఇకపోతే డ్రామాలో ఏది జరగాల్సి ఉంటే అదే జరుగుతుంది. ఒకవేళ భూకంపము వచ్చినా, ఇంటి పైకప్పు పడిపోయినా, ఇది నిశ్చితమై ఉందని, కల్పక్రితం కూడా ఇలాగే జరిగిందని అంటారు. ఇందులో కొద్దిగా కూడా చలించవలసిన అవసరము లేదు. డ్రామాపై పక్కాగా నిలబడి ఉండాలి. ఇలా ఉండేవారినే మహావీరులని అంటారు. ఏక్సిడెంట్లు మొదలైనవైతే చాలా జరుగుతూ ఉంటాయి. అప్పుడు ఎవరినైనా రక్షించడము జరుగుతుందా? ఇది డ్రామాలో నిశ్చితమై ఉంది. డ్రామాలో వారి పాత్ర అలానే ఉంది. ఎవరికైతే డ్రామా గురించి తెలియదో, వారు దేహాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీరు కారుస్తారు. వారు ఎప్పుడూ శివబాబాను స్మృతి చేయలేరు ఎందుకంటే వారికి శివబాబా పట్ల ప్రేమ లేదు, సత్యమైన ప్రీతి లేదు. తండ్రి పట్ల అయితే పూర్తి ప్రీతి ఉండాలి. శివబాబా పట్ల ప్రీతి బుద్ధి కలవారిగా మీరు కల్ప-కల్పము అవుతారు. దేవతలకు తండ్రి పట్ల ప్రీతి బుద్ధి ఉండేదని ఎప్పుడూ అనరు. ఇప్పటి ప్రీతి కారణముగా వారు ఆ పదవిని పొందారు. అక్కడైతే వారికి అసలేమీ తెలియదు. శివబాబా పట్ల ప్రీతి పెట్టుకోవడానికి, మొత్తం కల్పములో అసలు మీకు వారి గురించి తెలియనే తెలియదు. ఇప్పుడు తండ్రి తమ పరిచయాన్ని ఇచ్చారు. ఇప్పుడు తండ్రి అంటారు, ఇతర సాంగత్యాలన్నింటినీ వదిలి నా ఒక్కరితోనే జోడించండి. ఇది తప్పకుండా వినాశన సమయమే. ఇది కూడా పిల్లలైన మీకు తెలుసు. మనుష్యులైతే పూర్తిగా ఘోర అంధకారములో ఉన్నారు. మేమైతే తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి అని మీరిప్పుడు భావిస్తారు. స్మృతి లేకుండా సతోప్రధానముగా అవ్వలేరు. సర్జన్ గా అయి తమ రోగాన్ని చూసుకోవాలి. మాకు తండ్రి పట్ల ఎంత ప్రీతి ఉందని శ్రీమతమనుసారముగా చూసుకోవాలి. అమృతవేళ సమయములోనే తండ్రిని స్మృతి చేయడము మంచిది. ప్రభాత సమయము చాలా మంచిది. ఆ సమయములో మాయ తుఫానులు రావు. రాత్రి 12 గంటల వరకు తపస్య చేయడము వల్ల లాభమేమీ లేదు, ఎందుకంటే ఆ సమయము అశుద్ధముగా ఉంటుంది. వాయుమండలము అశుద్ధముగా ఉంటుంది. కావున ఒంటి గంట వరకు వదిలేయాలి. ఒంటి గంట తర్వాత వాయుమండలము బాగుంటుంది. తండ్రి అంటారు - మీది సహజ రాజయోగము, కావున ప్రశాంతముగా కూర్చోండి. బాబాతో ఎలా మాట్లాడుతారు అని బ్రహ్మాబాబా వారి అనుభవాన్ని కూడా వినిపిస్తారు. బాబా, ఈ డ్రామా ఎంత అద్భుతమైనది! మీరు ఎలా వచ్చి పతితము నుండి పావనముగా తయారుచేస్తారు! మొత్తం ప్రపంచాన్ని ఎలా పరివర్తన చేస్తారు! ఇది గొప్ప అద్భుతము! తండ్రికి ఎటువంటి ఆలోచనలు వస్తాయో, పిల్లలకు కూడా అటువంటి ఆలోచనలే రావాలి. మనుష్యుల నావలను తీరానికి ఎలా చేర్చాలి అనగా నావను తీరానికి ఎలా చేర్చాలి అన్న ఆలోచన కలగాలి. తండ్రి అంటారు - ఓ పతిత-పావనా రండి, అని మీరు పిలుస్తూ ఉంటారు, ఇప్పుడు నేను వచ్చాను, ఇప్పుడు మీరు పతితముగా అవ్వకండి. పతితముగా అయి సభలోకి వచ్చి కూర్చోకండి. లేదంటే వాయుమండలాన్ని పాడు చేస్తారు. బాబాకు అయితే తెలిసిపోతుంది. ఢిల్లీలో, బొంబాయిలో ఇలా వికారాలలోకి వెళ్ళేవారు వచ్చి కూర్చుండిపోయేవారు. అసురులు వచ్చి విఘ్నాలు వేసేందుకు కూర్చునేవారని అంటూ ఉంటారు. వికారాలలోకి వెళ్ళేవారిని అసురులని అనడము జరుగుతుంది. వారు వాయుమండలాన్ని పాడు చేస్తారు. అలాంటివారికి చాలా కఠినమైన శిక్షలు ఉంటాయి. బాబా అయితే అన్ని విషయాలను అర్థం చేయిస్తారు కానీ పిల్లలు తమను తాము నష్టపర్చుకోకుండా ఉండటం లేదు. అబద్ధాలు కూడా చెప్తారు. లేదంటే వెంటనే - బాబా, మా ద్వారా ఈ తప్పు జరిగింది, క్షమించండి అని వ్రాయాలి. మీరు చేసిన పాపాలు వ్రాయండి లేదంటే అవి వృద్ధి చెందుతూ ఉంటాయి మరియు పాతాళములోకి వెళ్ళిపోతారు. ఏదో పొందాలని వస్తారు కానీ మరింత నష్టం కలిగించుకుంటారు. ఇది కూడా డ్రామాలోని పాత్ర. ఇలాంటి అసురులు కల్పక్రితం కూడా ఉండేవారు, ఇప్పుడు కూడా ఉన్నారు. అమృతాన్ని వదిలి విషం తాగుతారు. స్వయాన్ని కూడా నష్టపర్చుకుంటారు, ఇతరులకు కూడా నష్టము కలిగిస్తారు. వాయుమండలాన్ని పాడు చేస్తారు. బ్రాహ్మణీలు కూడా అందరూ ఒకేలా లేరు. మహారథులు, గుర్రపు స్వారీ వారు, పాదచారులు అందరూ ఉన్నారు.

పిల్లలైన మీకు అపారమైన సంతోషము ఉండాలి - బాబా లభించారు, ఇంకేమి కావాలి. అయితే, ఇంటిలో పిల్లలు మొదలైనవారిని తప్పకుండా సంభాళించాలి. అంతేకానీ, బాబా, వీరందరూ మీ వారే, ఇక మీరే సంభాళించండి, మేమైతే మీ వారిగా అయ్యాము అని అనకూడదు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, గృహస్థ వ్యవహారములో ఉంటూ కమల పుష్ప సమానముగా పవిత్రముగా అవ్వండి. ఎటువంటి పతిత కర్మలు చేయకండి. మొదటి విషయము, కామానికి సంబంధించినది. దీని కారణముగానే ద్రౌపది కూడా - నన్ను వీరు వివస్త్రగా చేస్తున్నారు, వచ్చి కాపాడండి అని పిలిచారు. అది కూడా, ఎప్పుడైతే వినేటువంటి తండ్రి వచ్చారో, అప్పుడే పిలిచారు. తండ్రి రాక ముందు ఎవరూ పిలవరు. ఎవరినని పిలుస్తారు? బాబా వచ్చారు కావుననే పిలుస్తారు. పతితుల నుండి పావనులుగా అయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు? తిరిగి వెళ్ళాలి, తిరిగి వెళ్ళే సమయము ఇదే. సర్వుల సద్గతిదాత, లిబరేటర్ ఒక్కరే. ఇక్కడైతే దుఃఖముంది. సాధు-సత్పురుషులు మొదలైనవారు కూడా సుఖముగా ఉండలేరు. అందరికీ ఏదో ఒక దుఃఖము, రోగము మొదలైనవి తప్పకుండా ఉంటాయి. కొందరు గురువులు అంధులుగా, కుంటివారిగా కూడా ఉంటారు. వారు తప్పకుండా అలాంటి పని ఏదో చేసారు కావుననే అంధులుగా, కుంటివారు మొదలైనవారిగా అవుతారు. సత్యయుగములో అంధులు, కుంటివారు ఎవరూ ఉండరు. మనుష్యులు ఇది అర్థం చేసుకోరు. తండ్రియే వచ్చి అర్థం చేయిస్తారు. తండ్రియే జ్ఞాన సాగరుడు, పతిత-పావనుడు. మిగిలినదంతా భక్తి. ఆ భక్తి మార్గమే వేరు. అది మెట్లు దిగే మార్గము. దిగడానికి, జీవన బంధనములోకి రావడానికి 84 జన్మలు పడుతుంది, ఆ తర్వాత జీవన్ముక్తులుగా అవ్వడానికి ఒక్క క్షణము పడుతుంది. ఒకవేళ తండ్రి ఇచ్చే మతాన్ని అనుసరిస్తూ వారిని స్మృతి చేసినట్లయితే జీవన్ముక్తులుగా అవుతారు. నంబరువారుగా అయితే ఉంటారు కదా. మాకు ఫలానా టీచరు ఉంటే బాగుంటుందని అంటారు. అంటే వారు స్వయము బలహీనముగా ఉన్నారు, కావుననే ఫలానావారిని 2-4 నేలల కోసం పంపించండి అని అడుగుతారు. ఇది కూడా తప్పు అని బాబా అంటారు. తండ్రి ఎంత సహజమైన విషయాన్ని తెలియజేస్తున్నారు - కేవలం తండ్రిని స్మృతి చేయండి మరియు స్వదర్శన చక్రాన్ని తిప్పండి, ఇతరులకు కూడా అర్థం చేయించండి, అంతే. అయినా సరే, మీరు బ్రాహ్మణీని ఎందుకు స్మృతి చేస్తారు. ఇందులో బ్రాహ్మణి వచ్చి ఏం చేస్తారు? ఇది క్షణము యొక్క విషయము. మీరు వ్యాపార-వ్యవహారాల్లో పడి దీనిని మర్చిపోయినప్పటికీ బ్రాహ్మణీ కూడా మన్మనాభవ అనే చెప్తారు. చాలా మంది తెలివిహీనులు అర్థం చేసుకోరు, కేవలం మంచి బ్రాహ్మణి కావాలి అని అడుగుతారు. మీకు జ్ఞానమైతే లభించింది కదా. తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి. దేహాభిమానాన్ని వదలండి. ఇది మా సెంటరు, ఇది వీరి సెంటరు, ఈ జిజ్ఞాసువు అక్కడికెందుకు వెళ్తున్నారు... ఇదంతా దేహాభిమానము. అన్నీ శివబాబా సెంటర్లే, ఏ సెంటరు మనది కాదు. ఫలానావారు మా సెంటరుకు ఎందుకు రావడము లేదు అని మీకెందుకు అనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా, ఎవరినీ ఏమీ అడగవద్దు అని బాబా ఎప్పుడూ అంటారు. బీజం నాటకపోతే ఏమి లభిస్తుంది అనేది అర్థం చేసుకోగలరు. భక్తి మార్గములో కూడా దాన-పుణ్యాలు చేస్తారు. మీరంతా భక్తి మార్గములో ఇన్డైరెక్టుగా (పరోక్షముగా) ఈశ్వరార్థము దానము చేసేవారు. సన్యాసులకు కూడా చాలా ఇస్తారు. వాస్తవానికి దానమనేది పేదవారికి ఇవ్వడము జరుగుతుంది, అంతేకానీ షావుకారులకు కాదు. అందులోనూ ధాన్యాన్ని దానము చేయడము అన్నింటికన్నా మంచిది. దానము చేస్తే దాని ఫలం మరుసటి జన్మలో లభిస్తుందని తండ్రి అర్థం చేయిస్తారు. ఈశ్వరుడే అందరికీ ఫలం ఇస్తారు. సాధు-సత్పురుషులు మొదలైనవారు ఎవరూ ప్రతిఫలాన్ని ఇవ్వలేరు. ఎవరి ద్వారా ఇచ్చినా సరే, ఇచ్చేవారు ఆ ఒక్క తండ్రి మాత్రమే. తండ్రి అర్థం చేయిస్తున్నారు, మీరు ఈశ్వరార్థము ఇచ్చినా సరే మరుసటి జన్మలో నేను మీకు దాని ప్రతిఫలాన్ని ఇచ్చేవాడిని. కానీ ఇప్పుడైతే నేను డైరెక్టుగా వచ్చాను. ఇప్పుడు మీకు 21 జన్మల కోసం ప్రతిఫలం లభిస్తుంది. మృత్యువు అయితే ఎదురుగా నిలబడి ఉంది. మృత్యువు ఎదురుగా నిలబడి ఉంది కావున తమదంతా సఫలం చేసుకోండి అని భక్తి మార్గములో ఎవరూ చెప్పేవారు కాదు. కావున, ఎవరు కావాలనుకుంటే వారు ఈ ఆత్మిక హాస్పిటల్ ను తెరవండి అని ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు. మేము ఇల్లు కట్టుకుని, అందులో ఈ హాస్పిటల్ తెరుస్తాము అని కొందరు అంటారు. తండ్రి అంటారు, ఈ రోజు మీరు ఇల్లు కట్టుకుని రేపు చనిపోయారనుకోండి, అంతా సమాప్తమైపోయినట్లే. శరీరముపై నమ్మకము లేదు. ఈ లోపు, ఏదైతే ఉందో అందులోనే ఒక గదిని ఏర్పాటు చేయండి, అందులో ఆత్మిక హాస్పిటల్ ను, ఆత్మిక కాలేజీని తెరవండి. అనేకుల కళ్యాణము చేసినట్లయితే చాలా ఉన్నత పదవిని పొందుతారు. అచ్ఛా!

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. శ్రీమతము అనుసారముగా స్వయాన్ని చూసుకోవాలి - ఈ వినాశన సమయములో నాకు ఒక్క తండ్రి పట్ల సత్యమైన ప్రీతి ఉందా? ఇతర సాంగత్యాలన్నింటినీ వదిలి ఒక్కరితోనే సాంగత్యాన్ని జోడించానా? ఎప్పుడైనా ఏదైనా వికర్మ చేసి అసురునిగా అవ్వడము లేదు కదా? ఇటువంటి చెకింగ్ చేసుకుని స్వయాన్ని పరివర్తన చేసుకోవాలి.

2. ఈ శరీరముపై ఎలాంటి నమ్మకము లేదు, అందుకే తమదంతా సఫలం చేసుకోవాలి. తమ స్థితిని ఏకరసముగా, అచలముగా తయారుచేసుకునేందుకు డ్రామా రహస్యాన్ని బుద్ధిలో పెట్టుకుని నడుచుకోవాలి.

వరదానము:-
పదే-పదే ఓటమిని చవి చూసేందుకు బదులుగా బలిహారమయ్యే మాస్టర్ సర్వశక్తివాన్ విజయీ భవ

స్వయాన్ని సదా విజయీ రత్నముగా భావిస్తూ ప్రతి సంకల్పాన్ని మరియు కర్మను చేసినట్లయితే ఎప్పుడూ కూడా ఓటమి పాలవ్వరు. మాస్టర్ సర్వశక్తివంతులు ఎప్పుడూ ఓడిపోలేరు. ఒకవేళ పదే-పదే ఓటమి పాలవుతున్నట్లయితే ధర్మరాజు శిక్షలను అనుభవించవలసి ఉంటుంది మరియు ఓడిపోయేవారు భవిష్యత్తులో పూలహారాలను తయారుచేయవలసి ఉంటుంది, ద్వాపరము నుండి అనేక మూర్తులకు హారాలను వేయవలసి ఉంటుంది. అందుకే ఓడిపోయేందుకు బదులుగా బలిహారమవ్వండి. మీ సంపూర్ణ స్వరూపాన్ని ధారణ చేసే ప్రతిజ్ఞ చేసినట్లయితే విజయులుగా అయిపోతారు.

స్లోగన్:-
‘ఎప్పుడు’ అన్న పదము బలహీనతను నిరూపిస్తుంది, అందుకే ‘ఎప్పుడో చేస్తాము’ అని అనకండి, ‘ఇప్పుడే’ చేయాలి.

అవ్యక్త ప్రేరణలు - సదా హర్షితముగా ఉండేందుకు మీ నేచర్ ను సరళముగా చేసుకోండి, సహనశీలురుగా అవ్వండి

ఈ అనంతమైన స్టేజ్ పై నేను ఆటగాడిని. ఈ ఆటగాని స్టేజ్ అనేది సదా హర్షితముఖులుగా ఉండే అనుభవాన్ని చేయిస్తుంది. ఎటువంటి విషయమైనా గాని, దేనినైతే ప్రపంచములోనివారు ఆపదగా భావిస్తారో, దానిని ఆటగానిగా అయ్యి ఆడేవారు మరియు సాక్షీగా అయ్యి ఆ ఆటను చూసేవారు ఆ ఆపదను ఆటగా భావిస్తూ సహనశీలతా శక్తితో మనోరంజనాన్ని అనుభవం చేస్తారు.