06-10-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - శ్రీమతము ఆధారముగా భారత్ ను స్వర్గముగా తయారుచేసే సేవ చేయాలి, మొదట స్వయము నిర్వికారులుగా తయారవ్వాలి, ఆ తర్వాత ఇతరులకు చెప్పాలి’’

ప్రశ్న:-
మహావీర పిల్లలైన మీరు ఏ విషయాన్ని లెక్క చేయకూడదు? కేవలం ఏ చెకింగ్ చేసుకుంటూ స్వయాన్ని సంభాళించుకోవాలి?

జవాబు:-
ఒకవేళ ఎవరైనా పవిత్రముగా అవ్వడములో విఘ్నము వేసినట్లయితే, మీరు దానిని లెక్క చేయకూడదు. కేవలము చెక్ చేసుకోండి - నేను మహావీరునిగా ఉన్నానా? నన్ను నేను మోసము చేసుకోవడము లేదు కదా? నాకు అనంతమైన వైరాగ్యము ఉంటుందా? నేను నా సమానముగా తయారుచేస్తున్నానా? నాలో క్రోధము అయితే లేదు కదా? ఇతరులకు ఏదైతే చెప్తున్నానో, అది స్వయము కూడా చేస్తున్నానా?

పాట:-
మిమ్మల్ని పొంది మేము...

ఓంశాంతి
ఇందులో చెప్పవలసినదేమీ లేదు, ఇది అర్థం చేసుకోవలసిన విషయము. మేము మళ్ళీ దేవతలుగా అవుతున్నామని, సంపూర్ణ నిర్వికారులుగా అవుతున్నామని మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు అర్థం చేసుకుంటున్నారు. తండ్రి వచ్చి చెప్తున్నారు - పిల్లలూ, కామమును జయించండి అనగా పవిత్రముగా అవ్వండి. పిల్లలు పాటను విన్నారు. ఇప్పుడు పిల్లలకు మళ్ళీ స్మృతి కలిగింది - మేము అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకుంటున్నాము, దీనినెవ్వరూ లాక్కోలేరు, అక్కడ లాక్కునే వారెవ్వరూ ఉండరు. దానిని అద్వైత రాజ్యమని అంటారు. ఆ తర్వాత రావణ రాజ్యము, ఇతరుల రాజ్యము ఉంటుంది. ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటున్నారు. ఇతరులకు కూడా ఇలానే అర్థం చేయించాలి. మనము శ్రీమతము ఆధారముగా భారత్ ను మళ్ళీ నిర్వికారిగా తయారుచేస్తున్నాము. భగవంతుడు ఉన్నతోన్నతమైనవారు అని అందరూ అంటారు. వారినే తండ్రి అని అంటారు. కనుక ఏ భారత్ అయితే ఒకప్పుడు సంపూర్ణ నిర్వికారీ స్వర్గముగా ఉండేదో, అది ఇప్పుడు వికారీ నరకముగా అయిపోయింది అని కూడా అర్థం చేయించాలి మరియు వ్రాయాలి కూడా. మనము శ్రీమతము ఆధారముగా భారత్ ను మళ్ళీ స్వర్గముగా తయారుచేస్తున్నాము. తండ్రి ఏదైతే చెప్తున్నారో, దానిని నోట్ చేసుకుని, ఆ తర్వాత దానిపై విచార సాగర మంథనము చేసి వ్రాయడములో సహాయము చేయాలి. తప్పకుండా భారత్ స్వర్గముగా ఉండేది అని మనుష్యులు అర్థం చేసుకునే విధంగా ఏమేమి వ్రాయాలి? ఇంతకుముందు రావణ రాజ్యము ఉండేది కాదు. ఇప్పుడు భారతవాసులైన మనల్ని తండ్రి నిర్వికారులుగా తయారుచేస్తున్నారని పిల్లల బుద్ధిలో ఉంది. మొదట స్వయాన్ని చూసుకోవాలి - నేను నిర్వికారిగా అయ్యానా? ఈశ్వరుడిని నేను మోసము చేయడం లేదు కదా? ఈశ్వరుడు మనల్ని చూడరని కాదు, మీ నోటి నుండి ఈ మాటలు రావడానికి వీల్లేదు. పవిత్రముగా తయారుచేసే పతిత-పావనుడు ఒక్క తండ్రి మాత్రమే అని మీకు తెలుసు. భారత్ నిర్వికారిగా ఉన్నప్పుడు స్వర్గముగా ఉండేది. ఈ దేవతలు సంపూర్ణ నిర్వికారులు కదా. యథా రాజా రాణి తథా ప్రజలు ఉంటారు, అందుకే మొత్తం భారత్ ను స్వర్గమని అంటారు కదా. ఇప్పుడు నరకముగా ఉంది. ఈ 84 జన్మల మెట్ల వరుస చిత్రము చాలా మంచిది. ఎవరైనా మంచివారు ఉంటే, వారికి దీనిని కానుకగా కూడా ఇవ్వవచ్చు. పెద్ద-పెద్ద వ్యక్తులకు పెద్ద కానుక లభిస్తుంది కదా. కనుక మీరు కూడా ఎవరు వచ్చినా, వారికి అర్థం చేయించి ఇటువంటి కానుకలను ఇవ్వవచ్చు. ఎవరికైనా ఇచ్చేందుకని వస్తువులు ఎప్పుడూ తయారుగా ఉండాలి. మీ వద్ద కూడా జ్ఞానము తయారుగా ఉండాలి. మెట్ల వరుస చిత్రములో పూర్తి జ్ఞానముంది. మనమెలా 84 జన్మలను తీసుకున్నాము అనేది గుర్తుండాలి. ఇది అర్థం చేసుకోవలసిన విషయము కదా. తప్పకుండా ఎవరైతే మొదట వచ్చారో వారే 84 జన్మలు తీసుకున్నారు. తండ్రి 84 జన్మల గురించి తెలియజేసిన తర్వాత ఏమని చెప్తారంటే - వీరి అనేక జన్మల అంతిమములో సాధారణ తనువులో ప్రవేశిస్తాను, అప్పుడు వీరికి బ్రహ్మా అన్న పేరు పెడతాను. వీరి ద్వారా బ్రాహ్మణులను రచిస్తాను. లేదంటే బ్రాహ్మణులను ఎక్కడి నుండి తీసుకువస్తాను. బ్రహ్మా యొక్క తండ్రి గురించి ఎప్పుడైనా విన్నారా? తప్పకుండా అది భగవంతుడే అని అంటారు. బ్రహ్మా మరియు విష్ణువులను సూక్ష్మవతనములో ఉన్నట్లుగా చూపిస్తారు. తండ్రి అయితే అంటారు, నేను వీరి 84 జన్మల అంతిమములో ప్రవేశిస్తాను. దత్తత తీసుకున్నప్పుడు పేరు మార్చడం జరుగుతుంది. సన్యాసము కూడా చేయించడం జరుగుతుంది కదా, సన్యాసులు కూడా సన్యాసము చేసినప్పుడు వెంటనే అన్నీ మర్చిపోరు, తప్పకుండా గుర్తుంటాయి. మీకు కూడా గుర్తుంటాయి కానీ మీకు వాటి పట్ల వైరాగ్యము ఉంది ఎందుకంటే ఇదంతా శ్మశానవాటికగా అవ్వనున్నదని మీకు తెలుసు, అందుకే మనము వాటిని ఎందుకు గుర్తు చేసుకోవాలి. జ్ఞానము ద్వారా అంతా బాగా అర్థం చేసుకోవాలి. వారు కూడా జ్ఞానము ద్వారానే ఇళ్ళు-వాకిళ్ళను వదిలేస్తారు. ఇళ్ళు-వాకిళ్ళను ఎలా వదిలారని వారిని అడిగితే చెప్పరు. ఇక వారిని యుక్తిగా ఇలా అడగడం జరుగుతుంది - మీకు వైరాగ్యము ఎలా వచ్చిందో మాకు వినిపిస్తే మేము కూడా అలాగే చేస్తాము. మీరు పవిత్రముగా అవ్వండి అని అందరికీ ప్రేరణనిస్తారు, ఇకపోతే మీకు అన్నీ గుర్తున్నాయి. బాల్యము నుండి మొదలుకొని అన్నీ చెప్పగలరు. ఈ డ్రామాలోని పాత్రధారులందరూ ఎలా పాత్రను అభినయిస్తూ వచ్చారు అనే జ్ఞానము మీ బుద్ధిలో పూర్తిగా ఉంది. ఇప్పుడు అందరి కలియుగీ కర్మ బంధనాలు తెగిపోనున్నాయి. ఆ తర్వాత శాంతిధామానికి వెళ్ళిపోతాము. అక్కడి నుండి మళ్ళీ అందరికీ కొత్త సంబంధాలు జోడించబడతాయి. అర్థం చేయించేందుకు పాయింట్లు కూడా బాబా మంచి-మంచివి ఇస్తూ ఉంటారు. ఈ భారతవాసులే ఆది సనాతన దేవీ-దేవతా ధర్మమువారిగా ఉన్నప్పుడు నిర్వికారిగా ఉండేవారు, మళ్ళీ 84 జన్మల తర్వాత వికారీగా అయ్యారు. ఇప్పుడు మళ్ళీ నిర్వికారులుగా అవ్వాలి. కానీ పురుషార్థము చేయించేవారు కావాలి. ఇప్పుడు మీకు తండ్రి తెలియజేసారు. మీరు ఆ పిల్లలే కదా అని తండ్రి అంటారు. పిల్లలు కూడా - బాబా మీరు ఆ తండ్రియే అని అంటారు. తండ్రి అంటారు, కల్పక్రితము కూడా మిమ్మల్ని చదివించి రాజ్య భాగ్యాన్ని ఇచ్చాను. కల్ప-కల్పము ఇలా చేస్తూ ఉంటాను. డ్రామాలో ఏదైతే జరిగిందో, విఘ్నాలు వచ్చాయో, అవి మళ్ళీ వస్తాయి. జీవితములో ఏమేమి జరుగుతూ ఉంటుందో, అది గుర్తు అయితే ఉంటుంది కదా. వీరికైతే అన్నీ గుర్తున్నాయి. పల్లెటూరి పిల్లవానిగా ఉండేవాడిని, తర్వాత వైకుంఠానికి యజమానిగా అయ్యాను అని కూడా చెప్తారు. వైకుంఠములో పల్లెటూరు ఎలా ఉంటుంది అనేది మీకిప్పుడు తెలుసు. ఈ సమయములో మీ కొరకు కూడా ఈ పాత ప్రపంచము పల్లెటూరే కదా. వైకుంఠమెక్కడ, ఈ నరకమెక్కడ. పెద్ద-పెద్ద మహళ్ళు, బిల్డింగులు మొదలైనవి చూసి మనుష్యులు ఇదే స్వర్గమని భావిస్తారు. తండ్రి అంటారు, ఇదంతా మట్టి, రాళ్ళు, వీటికి ఏ విలువ లేదు. అన్నిటికన్నా ఎక్కువ విలువ వజ్రాలకు ఉంటుంది. తండ్రి అంటారు, ఆలోచించండి, సత్యయుగములో మీ బంగారు మహళ్ళు ఎలా ఉండేవి. అక్కడ గనులన్నీ నిండుగా ఉంటాయి. లెక్కలేనంత బంగారముంటుంది. మరి పిల్లలకెంత సంతోషము ఉండాలి. ఎప్పుడైనా ఉదాసీనత కలిగితే బాబా అర్థము చేయించారు, మిమ్మల్ని వెంటనే సంతోషములోకి తీసుకొచ్చేటటువంటి రికార్డులు (పాటలు) చాలా ఉన్నాయి, మొత్తము జ్ఞానమంతా బుద్ధిలోకి వచ్చేస్తుంది. బాబా మమ్మల్ని విశ్వానికి యజమానులుగా తయారుచేస్తున్నారని భావిస్తారు. దానినెప్పుడూ ఎవ్వరూ లాక్కోలేరు. అర్ధకల్పము కొరకు మనము సుఖధామానికి యజమానులుగా అవుతాము. రాజు యొక్క కుమారుడు, నేను ఈ హద్దు రాజ్యానికి వారసుడిని అని భావిస్తారు. మేము అనంతమైన తండ్రికి వారసులమని మీకెంత నషా ఉండాలి. తండ్రి స్వర్గ స్థాపనను చేస్తున్నారు, మనము 21 జన్మల కొరకు వారసులుగా అవుతాము. ఎంత సంతోషముండాలి. ఎవరికైతే వారసులుగా అవుతామో, వారిని కూడా తప్పకుండా స్మృతి చేయాలి. స్మృతి చేయకుండా వారసులుగా అవ్వలేరు. స్మృతి చేస్తేనే పవిత్రముగా అవుతారు, అప్పుడే వారసులుగా అవ్వగలరు. మనము శ్రీమతము ఆధారముగా విశ్వానికి యజమానులుగా, డబల్ కిరీటధారులుగా అవుతామని మీకు తెలుసు. జన్మ-జన్మాంతరాలు మనము రాజ్యము చేస్తాము. మనుష్యులు భక్తి మార్గములో వినాశీ దాన-పుణ్యాలు చేస్తారు. మీది అవినాశీ జ్ఞాన ధనము. మీకు ఎంత గొప్ప లాటరీ లభిస్తుంది. కర్మల అనుసారముగా ఫలము లభిస్తుంది కదా. ఎవరైనా గొప్ప రాజుకు కుమారునిగా అయితే, అది హద్దులోని పెద్ద లాటరీ అని అంటారు. సింగిల్ కిరీటము కలవారు పూర్తి విశ్వానికి యజమానులుగా అవ్వలేరు. డబల్ కిరీటధారులుగా, విశ్వానికి యజమానులుగా మీరు అవుతారు. ఆ సమయములో ఇతరుల రాజ్యమేదీ ఉండదు. ఇతర ధర్మాలు తర్వాత వస్తాయి. అవి వృద్ధి పొందేసరికి ముందు వచ్చిన రాజులు వికారులుగా అయిన కారణముగా అభిప్రాయ భేదాలతో రాజ్యాన్ని ముక్కలు-ముక్కలుగా వేరు చేసేస్తారు. మొదటిలోనైతే మొత్తము విశ్వమంతటిపైనా ఒకే రాజ్యముండేది. ఇది పూర్వ జన్మ కర్మల ఫలమని అక్కడ ఎవ్వరూ అనరు. ఇప్పుడు తండ్రి పిల్లలైన మీకు శ్రేష్ఠ కర్మలను నేర్పిస్తున్నారు. ఎవరెవరు ఎలాంటి కర్మలు చేస్తారో, సేవ చేస్తారో, దానికి రిటర్న్ కూడా అలాగే లభిస్తుంది. మంచి కర్మలే చేయాలి. ఏదైనా కర్మ చేయవలసి ఉంటే, అది అర్థం కావటము లేదంటే దాని కోసం శ్రీమతము తీసుకోవాలి. ఉత్తరాల ద్వారా పదే-పదే అడుగుతూ ఉండాలి. ఇప్పుడు ప్రైమ్ మినిస్టరు ఉన్నారనుకోండి, వారికి ఎన్ని పోస్టులు వస్తూ ఉండవచ్చో మీకు తెలుసు. కానీ వారొక్కరే ఏమీ చదవరు కదా. వారికి చాలామంది సెక్రెటరీలు ఉంటారు, వారు పోస్టులన్నీ చూస్తారు. ఏవైతే చాలా ముఖ్యమైనవి ఉంటాయో, వాటిని వారు అనుమతించాక ప్రైమ్ మినిస్టరు టేబుల్ పై పెడతారు. ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది. ముఖ్యమైన ఉత్తరాలకైతే వెంటనే జవాబులు ఇస్తారు. మిగిలినవాటికి ప్రియస్మృతులను వ్రాస్తారు. ఒక్కొక్కరికి విడిగా కూర్చుని ఉత్తరాలు వ్రాయాలంటే వీలుపడదు, అది చాలా కష్టము. ఓహో! ఈ రోజు అనంతమైన తండ్రి నుండి ఉత్తరము వచ్చింది అని పిల్లలకెంత సంతోషము కలుగుతుంది. శివబాబా బ్రహ్మా ద్వారా జవాబునిస్తారు. పిల్లలకు చాలా సంతోషము కలుగుతుంది. బంధనములో ఉన్నవారు అందరికన్నా ఎక్కువగా పులకరించిపోతారు. ఓహో! మేము బంధనములో ఉన్నాము, అనంతమైన తండ్రి మాకు ఉత్తరము ఎలా వ్రాశారు. దానిని కళ్ళకద్దుకుంటారు. అజ్ఞానకాలములో కూడా పతిని పరమాత్మునిగా భావించేవారికి పతి నుండి ఉత్తరము వస్తే వారు దానిని ముద్దు పెట్టుకుంటారు. మీలో కూడా బాప్ దాదా ఉత్తరాన్ని చూస్తే కొంతమంది పిల్లలకు ఒక్కసారిగా రోమాలు నిక్కబొడుచుకుంటాయి, ప్రేమ అశ్రువులు వచ్చేస్తాయి, దానిని ముద్దు పెట్టుకుంటారు, కళ్ళకద్దుకుంటారు. చాలా ప్రేమగా ఆ ఉత్తరాన్ని చదువుతారు. బంధనములో ఉన్నవారు ఏమైనా తక్కువా. కొంతమంది పిల్లలపై మాయ విజయము పొందుతుంది. కొంతమందైతే, మేమైతే పవిత్రముగా తప్పకుండా అవ్వాలని భావిస్తారు. భారత్ నిర్వికారిగా ఉండేది కదా, ఇప్పుడు వికారీగా ఉంది. ఇప్పుడు ఎవరైతే నిర్వికారిగా అవ్వవలసి ఉందో, వారే కల్పక్రితము వలె పురుషార్థము చేస్తారు. పిల్లలైన మీకు అర్థం చేయించడం చాలా సహజము. మీ ప్లాన్ కూడా ఇదే కదా. గీతా యుగము నడుస్తుంది. గీతా యుగమునే పురుషోత్తమ యుగము అని అంటూ ఉంటారు. మీరు వ్రాయడము కూడా - ఇది గీత యొక్క పురుషోత్తమ యుగమని వ్రాయండి, ఈ సమయములోనే పాత ప్రపంచము మారి కొత్తదిగా అవుతుంది. అనంతమైన తండ్రి మాకు టీచరు కూడా, వారి నుండి మేము రాజయోగాన్ని నేర్చుకుంటున్నామని మీ బుద్ధిలో ఉంది. బాగా చదువుకుంటే డబల్ కిరీటధారులుగా అవుతారు. ఇది ఎంత పెద్ద స్కూలు. రాజ్యము స్థాపనవుతుంది. ప్రజలు కూడా తప్పకుండా అనేక రకాలుగా ఉంటారు. రాజ్యము వృద్ధి చెందుతూ ఉంటుంది. జ్ఞానము తక్కువగా తీసుకునేవారు వెనుక వస్తారు. ఎవరు ఎంతగా పురుషార్థము చేస్తారో, వారు అంతగా ముందు వస్తూ ఉంటారు. ఇదంతా తయారై, తయారుచేయబడిన డ్రామా. ఈ డ్రామా చక్రము రిపీట్ అవుతుంది కదా. ఇప్పుడు మీరు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నారు. తండ్రి అంటారు, పవిత్రముగా అవ్వండి. ఇందులో ఎవరైనా విఘ్నాలు కలిగిస్తే, వాటిని లెక్క చేయకూడదు. రొట్టెముక్క అయితే లభిస్తుంది కదా. పిల్లలు పురుషార్థము చేయాలి, అప్పుడు స్మృతి ఉంటుంది. బాబా భక్తి మార్గములోని ఉదాహరణను తెలియజేస్తున్నారు - పూజ చేసే సమయములో బుద్ధియోగం బయటకు వెళ్తే తమ చెవిని పట్టుకునేవారు, చెంపదెబ్బ వేసుకునేవారు. ఇప్పుడిది జ్ఞానము. ఇందులో కూడా ముఖ్యమైన విషయము స్మృతి. స్మృతి ఉండటము లేదు అంటే స్వయానికి చెంపదెబ్బ వేసుకోవాలి. మాయ నా పై విజయము ఎందుకు పొందుతుంది. నేను అంత కచ్చాగా (అపరిపక్వంగా) ఉన్నానా. నేను అయితే దీనిపై విజయము పొందాలి. తమను తాము బాగా సంభాళించుకోవాలి. స్వయాన్ని ప్రశ్నించుకోండి - నేను అంతటి మహావీరునిగా ఉన్నానా? ఇతరులను కూడా మహావీరులుగా తయారుచేసే పురుషార్థము చేయాలి. ఎంతగా అనేకులను తమ సమానముగా తయారుచేస్తారో, అంత ఉన్నతమైన హోదా ఉంటుంది. తమ రాజ్య భాగ్యాన్ని తీసుకునేందుకు రేస్ చేయాలి. ఒకవేళ నాలోనే క్రోధముంటే, ఇతరులకు క్రోధము చేయకండి అని ఎలా చెప్పగలరు. అది సత్యత కాదు కదా. సిగ్గు కలగాలి. ఇతరులకు అర్థం చేయించినందుకు వారు ఉన్నత పదవిని పొంది, నేను క్రిందనే ఉండిపోతే, ఇదేమైనా పురుషార్థమా! (పండితుని కథ ఉంది కదా) తండ్రిని స్మృతి చేస్తూ మీరు ఈ విషయ సాగరము నుండి క్షీర సాగరములోకి వెళ్ళిపోతారు. ఇకపోతే ఈ ఉదాహరణలన్నింటినీ తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు, వీటిని మళ్ళీ భక్తి మార్గములో రిపీట్ చేస్తారు. భ్రమరము ఉదాహరణ కూడా ఉంది. మీరు బ్రాహ్మణీలు కదా - బి.కె.లు సత్యాతి-సత్యమైన బ్రాహ్మణులు. ప్రజాపిత బ్రహ్మా ఎక్కడ ఉన్నారు? తప్పకుండా ఇక్కడే ఉంటారు కదా. అక్కడ ఉండరు. పిల్లలైన మీరు చాలా తెలివైనవారిగా అవ్వాలి. మనుష్యులను దేవతలుగా తయారుచేయడం బాబా ప్లాను. ఈ చిత్రాలు కూడా అర్థం చేయించేందుకని ఉన్నాయి. వీటిలో మ్యాటర్ కూడా ఈ విధముగా వ్రాసి ఉండాలి. ఇది గీతా భగవానుడి ప్లాను కదా. బ్రాహ్మణులమైన మనము పిలక వంటి వారము. ఇది ఒక్కరి విషయము కాదు. ప్రజాపిత బ్రహ్మా ఉన్నారు కనుక బ్రాహ్మణులు పిలక వంటి వారు కదా. బ్రహ్మా బ్రాహ్మణుల తండ్రి. ఈ సమయములో చాలా పెద్ద కుటుంబము ఉంటుంది కదా. తర్వాత మీరు దైవీ కుటుంబములోకి వస్తారు. ఈ సమయములో మీకు చాలా సంతోషము కలుగుతుంది ఎందుకంటే లాటరీ లభిస్తుంది. మీకు చాలా పేర్లు ఉన్నాయి. వందే మాతరమ్, శివుని శక్తి సైన్యము మీరే కదా. అవన్నీ అసత్యమైనవి. చాలా ఉన్న కారణముగా తికమకపడతారు, అందుకే రాజధానిని స్థాపన చేయడములో శ్రమ కలుగుతుంది. తండ్రి అంటారు, ఈ డ్రామా తయారుచేయబడి ఉంది. ఇందులో నా పాత్ర కూడా ఉంది. నేను సర్వశక్తివంతుడను. నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పవిత్రముగా అయిపోతారు. అందరికన్నా పెద్ద అయస్కాంతము శివబాబా, వారే ఉన్నతోన్నతముగా ఉంటారు. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. మేము 21 జన్మల కొరకు అనంతమైన తండ్రికి వారసులుగా అయ్యాము అనే నషాలో మరియు సంతోషములో సదా ఉండాలి, ఎవరికైతే వారసులుగా అయ్యారో, వారిని స్మృతి కూడా చేయాలి మరియు పవిత్రముగా కూడా తప్పకుండా అవ్వాలి.

2. తండ్రి ఏవైతే శ్రేష్ఠ కర్మలు నేర్పిస్తున్నారో, ఆ కర్మలే చేయాలి. శ్రీమతము తీసుకుంటూ ఉండాలి.

వరదానము:-
స్థూల దేశము మరియు శరీరము యొక్క స్మృతి నుండి అతీతముగా సూక్ష్మ దేశము యొక్క వేషధారులుగా కండి

ఏ విధముగా ఈ రోజుల్లోని ప్రపంచములో ఎటువంటి కర్తవ్యమో అటువంటి వేషాన్ని ధారణ చేస్తారు, అలా మీరు కూడా ఏ సమయములో ఎటువంటి కర్మలు చేయాలనుకుంటే అటువంటి వేషాన్ని ధారణ చేయండి. ఇప్పుడిప్పుడే సాకారీ మరియు ఇప్పుడిప్పుడే ఆకారీ. ఇటువంటి బహురూపులుగా అయినట్లయితే సర్వ స్వరూపాల సుఖాలను అనుభవం చేయగలరు. ఇవి మన స్వరూపాలే. ఇతరుల వస్త్రాలు ఫిట్ అయినా, అవ్వకపోయినా కానీ మీ వస్త్రాలనైతే మీరు సహజముగానే ధారణ చేయగలరు, అందుకే ఈ వరదానాన్ని ప్రాక్టికల్ అభ్యాసములోకి తీసుకురండి, అప్పుడు అవ్యక్త మిలనము యొక్క విచిత్ర అనుభవాలను పొందగలరు.

స్లోగన్:-
అందరినీ గౌరవించేవారే ఆదర్శముగా అవ్వగలరు. గౌరవము ఇవ్వండి, అప్పుడు గౌరవము లభిస్తుంది.

అవ్యక్త సూచనలు - స్వయము కొరకు మరియు సర్వుల కొరకు మనసు ద్వారా యోగ శక్తులను ప్రయోగించండి

ఏ విధముగా మీ స్థూల కార్యాల ప్రోగ్రామ్ ను దినచర్య అనుసారముగా సెట్చేసుకుంటారో, అదే విధముగా మీ మనసా సమర్థ స్థితి యొక్క ప్రోగ్రామ్ ను సెట్చేసుకున్నట్లయితే ఎప్పుడూ అప్సెట్అవ్వరు (అలజడి చెందరు). ఎంతగా మీ మనసును సమర్థ సంకల్పాలలో బిజీగా ఉంచుకుంటారో, అంతగా మనసు అప్సెట్అయ్యేందుకు సమయమే లభించదు. మనసు సదా సెట్అయ్యి ఉంటే అనగా ఏకాగ్రముగా ఉంటే స్వతహాగానే మంచి వైబ్రేషన్లు వ్యాపిస్తాయి. సేవ జరుగుతుంది.