07-01-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - ఎప్పుడూ కూడా లా ను (చట్టాన్ని) మీ చేతిలోకి తీసుకోకండి, ఒకవేళ ఎవరి వలన అయినా పొరపాటు జరిగినట్లయితే తండ్రికి రిపోర్ట్ చేయండి, తండ్రి వారిని సావధానపరుస్తారు’’

ప్రశ్న:-
తండ్రి ఏ కాంట్రాక్ట్ ను తీసుకున్నారు?

జవాబు:-
పిల్లల అవగుణాలను తొలగించే కాంట్రాక్ట్ ను ఒక్క తండ్రియే తీసుకున్నారు. పిల్లల లోపాలను తండ్రి విన్నప్పుడు వాటిని తొలగించేందుకు ప్రేమగా అర్థం చేయిస్తారు. ఒకవేళ పిల్లలైన మీకు ఎవరిలోనైనా లోపాలు కనిపించినా కూడా మీరు చట్టాన్ని మీ చేతిలోకి తీసుకోకండి. చట్టాన్ని చేతిలోకి తీసుకోవడము, ఇది కూడా తప్పే.

ఓంశాంతి
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు తండ్రి ద్వారా రిఫ్రెష్ అవ్వడానికి వస్తారు ఎందుకంటే అనంతమైన తండ్రి నుండి అనంతమైన విశ్వ రాజ్యాధికారాన్ని తీసుకోవాలని పిల్లలకు తెలుసు. ఇది ఎప్పుడూ మర్చిపోకూడదు కానీ మర్చిపోతారు. మాయ మరపింపజేస్తుంది. ఒకవేళ మరపింపజేయకపోతే చాలా సంతోషము ఉంటుంది. బాబా అర్థం చేయిస్తున్నారు - పిల్లలూ, ఈ బ్యాడ్జ్ ను పదే-పదే చూస్తూ ఉండండి. చిత్రాలను కూడా చూస్తూ ఉండండి. నడుస్తూ-తిరుగుతూ బ్యాడ్జ్ ను చూస్తూ ఉన్నట్లయితే, తండ్రి స్మృతితో తండ్రి ద్వారా నేను ఇలా తయారవుతున్నాను అని తెలుస్తుంది. దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి. జ్ఞానము లభించే సమయము ఇదే. మధురాతి మధురమైన పిల్లలూ అని తండ్రి అంటారు... వారు రాత్రింబవళ్ళు మధురాతి మధురమైన పిల్లలు అని అంటూనే ఉంటారు. పిల్లలు మధురాతి మధురమైన తండ్రి అని అనలేరు. వాస్తవానికి ఇరువురినీ ఇలా అనాలి. ఇరువురూ మధురమైనవారే కదా. అనంతమైన బాప్ దాదా. కానీ చాలామంది దేహాభిమానులు కేవలం బాబానే మధురాతి మధురమైనవారు అని అంటారు. కొంతమంది పిల్లలైతే కోపములోకి వచ్చి ఒక్కోసారి బాప్ దాదాను కూడా ఏదో ఒకటి అనేస్తారు. ఎప్పుడైనా బాబాను అన్నారంటే దాదాను కూడా అన్నట్లే, విషయము ఒక్కటే అవుతుంది. ఒక్కోసారి బ్రాహ్మణిపై, ఒక్కోసారి పరస్పరములో కోప్పడుతూ ఉంటారు. అనంతమైన తండ్రి కూర్చుని పిల్లలకు శిక్షణను ఇస్తున్నారు. ప్రతి గ్రామములోనూ పిల్లలైతే చాలామంది ఉన్నారు, మీరు కోపగించుకుంటున్నారని మీ రిపోర్ట్ వస్తుంది అని బాబా అందరికీ వ్రాస్తూ ఉంటారు. అనంతమైన తండ్రి దీనిని దేహాభిమానమని అంటారు. తండ్రి అందరికీ చెప్తున్నారు - పిల్లలూ, దేహీ-అభిమానీ భవ. పిల్లలందరూ కింద-మీద అవుతూ ఉంటారు, వారిలో కూడా మాయ ఎవరినైతే సమర్థవంతమైన పహల్వాన్ (వస్తాదు) గా చూస్తుందో, వారితోనే యుద్ధము చేస్తుంది. మహావీర్ అని హనుమంతుడిని చూపించారు, అతడిని కూడా కదిలించేందుకు ప్రయత్నించింది. ఈ సమయములోనే అందరి పరీక్ష తీసుకుంటుంది. అందరికీ మాయతో గెలుపు-ఓటములు జరుగుతూ ఉంటాయి. యుద్ధములో స్మృతి-విస్మృతి, అన్నీ జరుగుతాయి. ఎవరు ఎంతగా స్మృతిలో ఉంటారో, నిరంతరము తండ్రిని స్మృతి చేసే ప్రయత్నము చేస్తారో, వారు మంచి పదవిని పొందగలరు. తండ్రి పిల్లలను చదివించేందుకే వచ్చారు, అది చదివిస్తూ ఉంటారు. శ్రీమతముపై నడుస్తూ ఉండాలి. శ్రీమతముపై నడవడము ద్వారానే శ్రేష్ఠముగా అవుతారు, ఇందులో ఎవరితోనూ డిస్టర్బ్ అయ్యే విషయమేమీ లేదు. డిస్టర్బ్ అవ్వడము అంటే క్రోధము చేయడము. పొరపాట్లు చేస్తే బాబాకు రిపోర్టు చేయాలి. స్వయము ఎవ్వరినీ ఏమీ అనకూడదు, అలా చేస్తే చట్టము చేతిలోకి తీసుకున్నట్లవుతుంది. గవర్నమెంట్ చట్టాన్ని చేతిలోకి తీసుకోనివ్వదు. ఎవరైనా కొడితే వారిని తిరిగి కొట్టరు. రిపోర్టు చేస్తారు, ఆ తర్వాత వారిపై కేస్ నడుస్తుంది. ఇక్కడ కూడా పిల్లలు ఎప్పుడూ ఎదురుచెప్పకూడదు, బాబాకు చెప్పండి. అందరినీ సావధానపరిచేవారు ఒక్క బాబానే. బాబా చాలా మధురమైన యుక్తులను తెలియజేస్తారు. మధురతతో శిక్షణను ఇస్తారు. దేహాభిమానులుగా అయినట్లయితే తమ పదవినే తగ్గించేసుకుంటారు. ఎందుకు నష్టపర్చుకోవాలి. ఎంత వీలైతే అంత బాబాను చాలా ప్రేమగా స్మృతి చేస్తూ ఉండండి. ఏ తండ్రి అయితే విశ్వ రాజ్యాధికారాన్ని ఇస్తారో, ఆ అనంతమైన తండ్రిని చాలా ప్రేమగా స్మృతి చేయండి. కేవలం దైవీ గుణాలను ధారణ చేయాలి. ఎవ్వరినీ నిందించకూడదు. దేవతలు ఎవరినైనా నిందిస్తారా? చాలామంది పిల్లలు నింద చేయకుండా ఉండరు. మీరు తండ్రికి చెప్పండి, అప్పుడు తండ్రి చాలా ప్రేమగా అర్థం చేయిస్తారు! లేదంటే సమయము వృధా అయిపోతుంది. నిందించేందుకు బదులుగా తండ్రిని స్మృతి చేసినట్లయితే చాలా-చాలా లాభముంటుంది. ఎవరితోనూ వాద-వివాదాలు చేయకుండా ఉండడము చాలా మంచిది.

మేము కొత్త ప్రపంచము యొక్క రాజ్యాన్ని స్థాపన చేస్తున్నామని పిల్లలైన మీరు హృదయములో భావిస్తారు. లోలోపల ఎంత నషా ఉండాలి. ముఖ్యమైనవి, స్మృతి మరియు దైవీ గుణాలు. పిల్లలు చక్రాన్ని స్మృతి చేస్తూనే ఉంటారు, అదైతే సహజముగా గుర్తుకువస్తుంది. 84 జన్మల చక్రము కదా. మీకు సృష్టి ఆదిమధ్యాంతాల గురించి, దాని వ్యవధి గురించి తెలుసు కావున ఇతరులకు కూడా చాలా ప్రేమగా పరిచయము ఇవ్వాలి. అనంతమైన తండ్రి మనల్ని విశ్వానికి యజమానులుగా చేస్తున్నారు, రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. వినాశనము కూడా ఎదురుగా నిలబడి ఉంది. వాస్తవానికి ఇది సంగమయుగము, ఇప్పుడు కొత్త ప్రపంచము స్థాపన అవుతోంది మరియు పాత ప్రపంచము సమాప్తమైపోతుంది. తండ్రి పిల్లలను సావధానపరుస్తూ ఉంటారు - స్మరిస్తూ, స్మరిస్తూ సుఖాన్ని పొందండి, తనువు యొక్క కలహ క్లేశాలన్నీ తొలగిపోతాయి... అర్ధకల్పము కోసం తొలగిపోతాయి. తండ్రి సుఖధామాన్ని స్థాపన చేస్తారు. మాయా రావణుడు తిరిగి దుఃఖధామాన్ని స్థాపన చేస్తాడు. ఇది కూడా పిల్లలైన మీకు నంబరువారు పురుషార్థానుసారముగా తెలుసు. తండ్రికి పిల్లల పట్ల ఎంత ప్రేమ ఉంటుంది. తండ్రికి మొదటి నుండి ప్రేమ ఉంది. తండ్రికి తెలుసు. ఏ పిల్లలైతే కామచితిపై నల్లగా అయిపోయారో, వారిని తెల్లగా చేయడానికి వెళ్తాను అని నాకు తెలుసు. తండ్రి అయితే నాలెడ్జ్ ఫుల్, పిల్లలు నెమ్మదిగా-నెమ్మదిగా జ్ఞానము తీసుకుంటారు. మాయ మళ్ళీ మరపింపజేస్తుంది. సంతోషము కలగనివ్వదు. పిల్లలకైతే రోజురోజుకూ సంతోషము యొక్క పాదరసము పైకి ఎక్కి ఉండాలి. సత్యయుగములో పాదరసము పైకి ఎక్కి ఉండేది. ఇప్పుడు మళ్ళీ స్మృతియాత్ర ద్వారా ఎక్కించుకోవాలి. అది నెమ్మదిగా-నెమ్మదిగా ఎక్కుతుంది. గెలుపు-ఓటములు పొందుతూ, పొందుతూ నంబరువారు పురుషార్థానుసారముగా కల్పక్రితము వలె మళ్ళీ తమ పదవిని పొందుతారు. ఇకపోతే కల్ప-కల్పము ఎంత సమయమైతే పడుతుందో, అంతే సమయము పడుతుంది. ఎవరైతే కల్ప-కల్పము పాస్ అవుతూ ఉంటారో, వారే ఇప్పుడు కూడా పాస్ అవుతారు. బాప్ దాదా సాక్షీగా అయి పిల్లల అవస్థను చూస్తారు మరియు అర్థం చేయిస్తూ ఉంటారు, బయట సెంటర్లు మొదలైనవాటిలో ఉన్నప్పుడు అంతగా రిఫ్రెష్ అవ్వరు. సెంటరుకు వచ్చి మళ్ళీ బయట వాయుమండలములోకి వెళ్ళిపోతారు, అందుకే పిల్లలు రిఫ్రెష్ అవ్వడము కోసం ఇక్కడకు వస్తారు. పరివార సహితముగా అందరికీ ప్రియస్మృతులను ఇవ్వండి అని తండ్రి వ్రాస్తారు కూడా. వారు హద్దులోని తండ్రి, వీరు అనంతమైన తండ్రి. బాబా మరియు దాదా, ఇరువురికీ చాలా ప్రేమ ఉంది ఎందుకంటే వారు కల్ప-కల్పము ప్రియమైన సేవ చేస్తారు మరియు చాలా ప్రేమగా చేస్తారు. లోలోపల దయ కలుగుతుంది. చదువుకోకపోతే లేదా మంచి నడవడికను నడవకపోతే, శ్రీమతముపై నడవకపోతే - వీరు తక్కువ పదవిని పొందుతారని దయ కలుగుతుంది. అప్పుడు బాబా ఏం చేయగలరు! అక్కడ ఉండడానికి మరియు ఇక్కడ ఉండడానికి చాలా తేడా ఉంది. కానీ అందరూ అయితే ఇక్కడ ఉండలేరు. పిల్లలు వృద్ధి చెందుతూ ఉంటారు. ఏర్పాట్లు కూడా చేస్తూ ఉంటారు. ఈ ఆబూ అన్నింటికన్నా గొప్ప తీర్థ స్థానమని తండ్రి కూడా అర్థం చేయించారు. తండ్రి అంటారు - నేను ఇక్కడికే వచ్చి మొత్తం సృష్టిని, పంచ తత్వాల సహితముగా అన్నింటినీ పవిత్రముగా తయారుచేస్తాను. ఎంత సేవ ఉంది. ఒక్క తండ్రి మాత్రమే వచ్చి సర్వులకు సద్గతినిస్తారు. ఇది కూడా అనేకసార్లు చేసారు. ఇది తెలిసి ఉంటూ కూడా మళ్ళీ మర్చిపోతారు - అందుకే తండ్రి అంటారు, మాయ చాలా శక్తివంతమైనది. అర్ధకల్పము దీని రాజ్యము నడుస్తుంది. మాయ ఓడిస్తుంది, తండ్రి మళ్ళీ నిలబెడతారు. బాబా, మేము పడిపోయామని చాలామంది వ్రాస్తారు. అచ్ఛా, ఇక మళ్ళీ ఎప్పుడూ పడకండి అని బాబా అంటారు. అయినా పడిపోతారు. పడిపోతారు, ఇక ఎక్కడమే ఆపేస్తారు. ఎంత దెబ్బ తగులుతుంది. అందరికీ తగులుతుంది. మొత్తము ఆధారమంతా చదువుపైనే ఉంది. చదువులో యోగము ఎలాగూ ఉంటుంది, ఫలానావారు నాకు ఇది చదివిస్తున్నారు అని ఉంటుంది. తండ్రి మనల్ని చదివిస్తున్నారని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఇక్కడ మీరు చాలా రిఫ్రెష్ అవుతారు. ఎవరైతే మనల్ని నిందిస్తారో, వారు మన మిత్రులని గాయనము కూడా ఉంది. భగవానువాచ - చాలామంది నన్ను నిందిస్తారు. నేను వచ్చి మిత్రునిగా అవుతాను. ఎంతగా నిందిస్తారు. నేనైతే అందరూ నా పిల్లలేనని భావిస్తాను. నాకు వాళ్ళ పట్ల ఎంత ప్రీతి ఉంది. నిందించడము మంచిది కాదు. ఈ సమయములోనైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. రకరకాల అవస్థలు కలిగిన పిల్లలు ఉన్నారు, అందరూ పురుషార్థము చేస్తూ ఉంటారు. ఏదైనా పొరపాటు జరిగినా కూడా పురుషార్థము చేసి పొరపాట్లు చెయ్యనివారిగా అవ్వాలి. మాయ అందరి చేత పొరపాట్లు చేయిస్తుంది. ఇది బాక్సింగ్ కదా. కొన్ని సార్లు ఎటువంటి దెబ్బ తగులుతుందంటే, ఇక అది పడేస్తుంది. తండ్రి సావధానపరుస్తారు - పిల్లలూ, అలా ఓడిపోతే చేసుకున్న సంపాదనంతా పోతుంది. 5 అంతస్తుల నుండి పడిపోతారు. బాబా, ఇలాంటి పొరపాటు ఇక ఎప్పుడూ జరగదు, ఇప్పుడు క్షమించండి అని అంటారు. బాబా ఏమి క్షమిస్తారు. తండ్రి అయితే పురుషార్థము చేయమని చెప్తారు. మాయ చాలా శక్తివంతమైనదని బాబాకు తెలుసు. చాలా మందిని ఓడిస్తుంది. పొరపాటు గురించి శిక్షణను ఇచ్చి పొరపాటు చేయనివారిగా తయారుచేయడమే టీచర్ పని. ఎవరైనా పొరపాటు చేస్తే, ఇక ఎప్పటికీ వారి ద్వారా ఆ పొరపాటు జరుగుతూ ఉంటుందని కాదు. అలా కాదు, మంచి గుణాల గురించి చెప్పుకుంటూ ఉంటారు. పొరపాట్లు గురించి అలా చెప్పుకోరు. అవినాశీ వైద్యుడు తండ్రి ఒక్కరే. వారు వైద్యము చేస్తారు. పిల్లలైన మీరు చట్టాన్ని మీ చేతుల్లోకి ఎందుకు తీసుకుంటారు? ఎవరిలోనైతే క్రోధము యొక్క అంశము ఉంటుందో, వారు నిందిస్తూనే ఉంటారు. తీర్చిదిద్దడము తండ్రి పని, మీరు తీర్చిదిద్దేవారు కాదు. కొందరిలో క్రోధము యొక్క భూతముంది. స్వయము ఎవరినైనా నిందిస్తున్నారంటే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నట్లు, దీనితో వారు బాగుపడరు. ఇంకా విరోధము ఏర్పడుతుంది. ఉప్పునీరులా అయిపోతారు. పిల్లలందరి కోసం ఒక్క తండ్రి కూర్చుని ఉన్నారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని ఎవరినైనా నిందించడమనేది పెద్ద తప్పు. అందరిలోనూ ఏవో ఒక లోపాలు ఉంటాయి. అందరూ సంపూర్ణముగా అయితే అవ్వలేదు. కొందరిలో ఒక అవగుణముంటుంది, కొందరిలో ఇంకొకటి ఉంటుంది. వాటన్నింటినీ తొలగించే కాంట్రాక్టును తండ్రి తీసుకున్నారు. ఇది మీ పని కాదు. పిల్లల లోపాలను తండ్రి విన్నప్పుడు వాటిని తొలగించేందుకు ప్రేమగా అర్థం చేయించడము జరుగుతుంది. ఇంతవరకు ఎవ్వరూ సంపూర్ణము కాలేదు. అందరూ శ్రీమతమనుసారముగా తీర్చిదిద్దబడుతున్నారు. సంపూర్ణముగానైతే అంతిమములో అవుతారు. ఈ సమయములో అందరూ పురుషార్థులే. బాబా సదా స్థిరముగా ఉంటారు. పిల్లలకు ప్రేమగా శిక్షణనిస్తూ ఉంటారు. శిక్షణనివ్వడము తండ్రి పని. ఇక ఆ తర్వాత దానిపై నడవడము, నడవకపోవడము అనేది వారి భాగ్యము. పదవి ఎంతగా తగ్గిపోతుంది. శ్రీమతముపై నడవని కారణముగా అలాంటి, ఇలాంటి పనులేమైనా చేసారంటే పద భ్రష్టులైపోతారు. మేము ఈ పొరపాటు చేసామని లోలోపల మనసు తింటుంది. మనము చాలా కష్టపడవలసి ఉంటుంది. ఎవరిలోనైనా అవగుణము ఉంటే దానిని తండ్రికి వినిపించాలి. అన్ని చోట్లా వినిపించడమంటే, అది దేహాభిమానము. తండ్రిని స్మృతి చేయరు. అవ్యభిచారీగా అవ్వాలి కదా. ఆ ఒక్కరికే వినిపించినట్లయితే వారు వెంటనే తీర్చిదిద్దబడుతారు. తీర్చిదిద్దేవారు ఒక్క తండ్రి మాత్రమే. మిగిలినవారంతా తీర్చిదిద్దబడనివారే. కానీ మాయ ఎటువంటిదంటే అది తలను తిప్పేస్తుంది. తండ్రి ముఖాన్ని ఒక వైపుకు తిప్పుతారు, మాయ మళ్ళీ తన వైపుకు తిప్పేసుకుంటుంది. తండ్రి అందరినీ తీర్చిదిద్ది మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేయడానికే వచ్చారు, ఇకపోతే ఎవరి పేరునైనా అన్ని చోట్లా పాడు చేయడమనేది నియమ విరుద్ధము. మీరు శివబాబాను స్మృతి చేయండి. జడ్జిమెంట్ కూడా వారి వద్దనే జరుగుతుంది కదా. కర్మల ఫలాన్ని కూడా తండ్రే ఇస్తారు. డ్రామాలో ఉన్నా కానీ ఎవరో ఒకరి పేరునైతే తీసుకోవడము జరుగుతుంది కదా. తండ్రి అయితే పిల్లలకు అన్ని విషయాలను అర్థం చేయిస్తూ ఉంటారు. మీరు ఎంత భాగ్యశాలులు. ఎంతమంది అతిథులు వస్తారు. ఎవరి వద్దకైతే చాలామంది అతిథులు వస్తారో, వారు సంతోషముగా ఉంటారు. వీరు పిల్లలు కూడా, అతిథులు కూడా. టీచర్ బుద్ధిలోనైతే ఇదే ఉంటుంది - నేను పిల్లలను వీరి వలె సర్వగుణ సంపన్నులుగా తయారుచేయాలి అని. డ్రామా ప్లాన్ అనుసారముగా ఈ కాంట్రాక్టును తండ్రి తీసుకున్నారు. పిల్లలు మురళిని కూడా ఎప్పుడూ మిస్ చేయకూడదు. మురళి గురించే కదా గాయనముంది - ఒక్క మురళిని మిస్ చేసినా కూడా స్కూల్ కు ఆబ్సెంట్ అయినట్లే. ఇది అనంతమైన తండ్రి యొక్క స్కూల్, ఇందులోనైతే ఒక్క రోజు కూడా మిస్ చేయకూడదు. తండ్రి వచ్చి చదివిస్తున్నారు, ప్రపంచములో ఇంకెవ్వరికీ ఇది తెలియదు. స్వర్గ స్థాపన ఎలా జరుగుతుంది, ఇది కూడా ఎవ్వరికీ తెలియదు. మీకు అన్నీ తెలుసు. ఈ చదువు చాలా-చాలా అపారమైన సంపాదన చేయిస్తుంది. జన్మ-జన్మాంతరాల కొరకు ఈ చదువు యొక్క ఫలము లభిస్తుంది. వినాశనము యొక్క సంబంధమంతా మీ చదువుతోనే ఉంది. మీ చదువు పూర్తవుతుంది మరియు ఈ యుద్ధము ప్రారంభమవుతుంది. చదువుతూ-చదువుతూ, తండ్రిని స్మృతి చేస్తూ ఎప్పుడైతే మార్కులు తీసుకోవడము పూర్తవుతుందో, పరీక్ష పూర్తవుతుందో, అప్పుడు యుద్ధము ప్రారంభమవుతుంది. మీ చదువు పూర్తయిందంటే యుద్ధము మొదలవుతుంది. ఇది కొత్త ప్రపంచము కోసం పూర్తిగా కొత్త జ్ఞానము, అందుకే మనుష్యులు పాపం తికమకపడతారు. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఎవరిలోని అవగుణాలనైనా చూసి వారిని నిందించకూడదు. అన్ని చోట్లా వారి అవగుణాలను వినిపించకూడదు. మీ మధురతను విడిచిపెట్టకూడదు. క్రోధములోకి వచ్చి ఎవరినీ ఎదిరించకూడదు.

2. అందరినీ తీర్చిదిద్దేవారు ఒక్క తండ్రియే, అందుకే ఒక్క తండ్రికే అంతా వినిపించాలి, అవ్యభిచారిగా అవ్వాలి. మురళిని ఎప్పుడూ మిస్ చేయకూడదు.

వరదానము:-
సదా తోడుగా ఉన్నవారి స్మృతిని మరియు సాక్షీ స్థితిని అనుభవము చేసే శివమయీ శక్తి స్వరూప కంబైండ్ భవ

ఏ విధముగా ఆత్మ మరియు శరీరము రెండూ కలిసి ఉన్నాయో, ఎప్పటివరకైతే ఈ సృష్టిపై పాత్ర ఉంటుందో అప్పటివరకు ఏ విధముగా అవి వేరు కాలేవో, అలాగే శివునికి మరియు శక్తికి, ఇరువురికీ మధ్యన కూడా అంతే లోతైన సంబంధము ఉంది. ఎవరైతే సదా శివమయీ శక్తి స్వరూప స్థితిలో స్థితులై నడుచుకుంటారో, వారి ప్రేమలో, తపనలో మాయ విఘ్నము కలిగించలేదు. వారు సదా తోడు యొక్క స్థితిని మరియు సాక్షీ స్థితిని అనుభవము చేస్తారు. ఎలా అనుభవము అవుతుందంటే, ఎవరో సాకారములో తోడుగా ఉన్నట్లు అనిపిస్తుంది.

స్లోగన్:-
నిర్విఘ్న మరియు ఏకరస స్థితిని అనుభవము చేసేందుకు ఏకాగ్రతను అభ్యాసము చేయండి.

అవ్యక్త ప్రేరణలు - ఈ అవ్యక్తి మాసములో బంధనముక్తులుగా ఉంటూ జీవన్ముక్త స్థితిని అనుభవము చేయండి

వర్తమాన సమయములో స్వయాన్ని - నేను టీచర్ ను, నేను స్టూడెంట్ ను, నేను సేవాధారిని అని ఇలా అనుకునేందుకు బదులుగా అమృతవేళ నుండి ఈ అభ్యాసము చెయ్యండి - శ్రేష్ఠ ఆత్మనైన నేను పై నుండి వచ్చాను, ఈ పాత ప్రపంచములోకి, పాత శరీరములోకి సేవ కోసము వచ్చాను. నేను ఆత్మను - ఈ పాఠాన్ని ఇప్పుడు ఇంకా పక్కా చేసుకోండి. నేను సేవాధారిని అన్న ఈ పాఠము పక్కాగా ఉంది కానీ ఆత్మనైన నేను సేవాధారిని అన్న పాఠాన్ని పక్కా చేసుకున్నట్లయితే జీవన్ముక్తులుగా అయిపోతారు.