07-05-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - నిశ్చయము జ్ఞాన-యోగాలతో కూర్చుంటుంది, అంతేకానీ సాక్షాత్కారాలతో కాదు. సాక్షాత్కారాలు డ్రామాలో నిశ్చయించబడి ఉన్నాయి, అంతేకానీ వాటి వలన ఎవరి కళ్యాణము జరగదు’’

ప్రశ్న:-
తండ్రి ఏ శక్తిని చూపించరు, కానీ వారి వద్ద ఇంద్రజాలము తప్పకుండా ఉంది?

జవాబు:-
భగవంతుడు శక్తివంతుడని, వారు మరణించినవారిని కూడా బ్రతికించగలరని మనుష్యులు భావిస్తారు, కానీ బాబా అంటారు - ఈ శక్తిని నేను చూపించను. ఇకపోతే ఎవరైనా నవవిధ భక్తి చేస్తే, వారికి సాక్షాత్కారము చేయిస్తాను. ఇది కూడా డ్రామాలో నిశ్చయించబడి ఉంది. సాక్షాత్కారాలు చేయించే ఇంద్రజాలము తండ్రి వద్ద ఉంది, అందుకే చాలా మంది పిల్లలకు ఇంట్లో కూర్చుని ఉండగా కూడా బ్రహ్మా లేక శ్రీకృష్ణుని సాక్షాత్కారము జరుగుతుంది.

పాట:-
నా మనసు అనే ద్వారము వద్దకు ఎవరు వచ్చారు...

ఓంశాంతి
ఇది పిల్లల యొక్క అనుభవముతో కూడిన పాట. సత్సంగాలైతే ఎన్నో ఉన్నాయి, ముఖ్యముగా భారత్ లోనైతే అనేక సత్సంగాలు ఉన్నాయి, అనేక మత-మతాంతరాలు ఉన్నాయి, వాస్తవానికి అవేవీ సత్సంగాలు కావు. సత్సంగము ఒక్కటే ఉంటుంది. ఇకపోతే మీరు అక్కడ ఎవరైనా విద్వాంసులు, ఆచార్యులు, పండితుల ముఖాన్ని చూస్తే, బుద్ధి వారి వైపుకు వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ ఇది అద్భుతమైన విషయము. ఈ సత్సంగము ఒక్కసారే ఈ సంగమయుగములో జరుగుతుంది. ఇది పూర్తిగా కొత్త విషయము, ఆ అనంతమైన తండ్రికి శరీరమైతే ఏమీ లేదు. నేను మీ నిరాకార శివబాబాను అని వారు అంటారు. మీరు ఇతర సత్సంగాలకు వెళ్ళినప్పుడు శరీరాలనే చూస్తారు. శాస్త్రాలను కంఠస్థము చేసి వినిపిస్తారు, అనేక రకాల శాస్త్రాలు ఉన్నాయి, వాటినైతే మీరు జన్మ-జన్మాంతరాలుగా వింటూ వచ్చారు. ఇప్పుడు ఇది కొత్త విషయము. బుద్ధి ద్వారా ఆత్మ తెలుసుకుంటుంది. తండ్రి అంటారు - చాలా కాలం దూరమైన తర్వాత కలిసిన ఓ నా పిల్లలూ, ఓ నా సాలిగ్రామాలూ! 5000 సంవత్సరాల క్రితం ఈ శరీరము ద్వారా బాబా చదివించారని పిల్లలైన మీకు తెలుసు. మీ బుద్ధి పూర్తిగా దూరంగా వెళ్ళిపోతుంది. కావున బాబా వచ్చారు. బాబా అన్న పదము ఎంత మధురమైనది. వారు తల్లి-తండ్రి. ఇది ఎవరైనా వింటే, అసలు వీరి తల్లి-తండ్రి ఎవరు అనేది తెలియదు అని అంటారు. తప్పకుండా వారు సాక్షాత్కారాలు చేయించినా అందులో కూడా వారు తికమకపడతారు. ఒక్కోసారి బ్రహ్మాను, ఒక్కోసారి కృష్ణుడిని చూస్తారు. అప్పుడు ఇదేమిటి అని ఆలోచిస్తూ ఉంటారు. బ్రహ్మా యొక్క సాక్షాత్కారము కూడా చాలామందికి ఇంట్లో కూర్చుని ఉండగానే జరుగుతుంది. ఇప్పుడు బ్రహ్మాకు అయితే ఎప్పుడూ ఎవరూ పూజలు చేయరు. శ్రీకృష్ణుడు మొదలైనవారికైతే పూజలు చేస్తారు. బ్రహ్మా గురించి అయితే ఎవరికీ తెలియను కూడా తెలియక పోవచ్చు. ప్రజాపిత బ్రహ్మా ఇప్పుడు వచ్చారు, ఇతను ప్రజాపిత. తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు - మొత్తము ప్రపంచమంతా పతితముగా ఉంది కావున తప్పకుండా ఇతను కూడా అనేక జన్మల అంతిమములో పతితముగా ఉన్నట్లు. ఎవ్వరూ పావనముగా లేరు, అందుకే కుంభమేళాకు, హరిద్వార్ లో గంగా సాగరముల మేళాకు వెళ్తారు, అక్కడ స్నానము చేయడముతో పావనముగా అవుతారని భావిస్తారు. కానీ ఈ నదులేమీ పతిత-పావని కావు. నదులు సాగరము నుండి వెలువడతాయి. వాస్తవానికి మీరు జ్ఞాన గంగలు, మహత్వము మీదే. జ్ఞాన గంగలైన మీరు ప్రతి చోట వెలువడుతారు, కానీ వారు బాణము వేయగానే గంగ వెలువడినట్లుగా చూపిస్తారు. బాణము వేసే విషయమేమీ లేదు. ఈ జ్ఞాన గంగలే దేశ-దేశాంతరాలకు వెళ్తారు.

శివబాబా అంటారు - నేను డ్రామా యొక్క బంధనములో బంధింపబడి ఉన్నాను. అందరి పాత్ర నిశ్చితము చేయబడి ఉంది. నా పాత్ర కూడా నిశ్చితమై ఉంది. భగవంతుడు చాలా శక్తివంతమైనవారని, వారు మరణించినవారిని కూడా తిరిగి బ్రతికించగలరని కొందరు భావిస్తారు. ఇవన్నీ ప్రగల్భాలు. నేను చదివించడానికే వస్తాను. అంతేకానీ శక్తినేం చూపిస్తాను. సాక్షాత్కారాలు జరగడము యొక్క ఇంద్రజాలము కూడా ఉంది. నవవిధ భక్తిని చేసినట్లయితే నేను సాక్షాత్కారము చేయిస్తాను. ఏ విధంగా కాళీ రూపాన్ని చూపిస్తారు, ఆమెపై నూనెతో అభిషేకము చేస్తారు. వాస్తవానికి ఇటువంటి కాళీ ఎవరూ ఉండరు, కానీ కాళీకి నవవిధ భక్తిని ఎంతగానో చేస్తారు. వాస్తవానికి కాళీ అంటే జగదాంబ. కాళీకి ఇటువంటి రూపమైతే లేదు, కానీ నవవిధ భక్తి చేయడం వలన బాబా ఆ భావనకు ప్రతిఫలాన్ని ఇస్తారు. కామచితిపై కూర్చోవడముతో నల్లగా అయ్యారు, ఇప్పుడు జ్ఞానచితిపై కూర్చుని తెల్లగా అవుతారు. ఏ కాళీ అయితే ఇప్పుడు జగదాంబగా అయ్యారో, ఆమె ఎలా సాక్షాత్కారాలు చేయించగలరు. ఆమె అయితే ఇప్పుడు అనేక జన్మల అంతిమములోని అంతిమ జన్మలో ఉన్నారు. దేవతలైతే ఇప్పుడు లేనే లేరు. మరి వారు ఎలా సాక్షాత్కారాలు చేయించగలరు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఈ సాక్షాత్కారాల తాళంచెవి నా చేతిలో ఉంది. అల్పకాలికముగా భావనలను పూర్తి చేసేందుకు సాక్షాత్కారాలు చేయిస్తాను. కానీ వారెవరూ నన్ను వీటి ద్వారా కలుసుకోరు. ఒక్క కాళి ఉదాహరణను ఇస్తున్నాము కానీ ఈ విధంగా - హనుమంతుడు, గణేశుడు మొదలైనవారు ఎందరో ఉన్నారు. సిక్కులు కూడా గురునానక్ కు ఎంతగానో భక్తి చేస్తే వారికి కూడా సాక్షాత్కారము జరుగుతుంది. కానీ వారు కిందకు దిగుతూనే ఉంటారు. బాబా పిల్లలకు చూపిస్తున్నారు - చూడండి, వీరు గురునానక్ కు భక్తి చేస్తున్నారు, కానీ వారికి సాక్షాత్కారము నేను చేయిస్తాను. అతను ఎలా సాక్షాత్కారము చేయించగలరు. అతని వద్ద సాక్షాత్కారాలను చేయించే తాళంచెవి లేదు. ఈ బాబా అంటారు - నాకు వినాశనము, స్థాపన యొక్క సాక్షాత్కారాలు కూడా ఆ బాబాయే చేయించారు, కానీ సాక్షాత్కారాల ద్వారా ఎవరి కళ్యాణమూ జరగదు. ఈ విధంగా ఎంతోమందికి సాక్షాత్కారాలు జరిగేవి కానీ ఈ రోజు వారు లేరు. చాలామంది పిల్లలు - మాకు సాక్షాత్కారము జరిగితే నిశ్చయము కూర్చుంటుంది అని అంటారు. కానీ నిశ్చయము సాక్షాత్కారము ద్వారా ఏర్పడదు. నిశ్చయము జ్ఞాన-యోగాల ద్వారానే కూర్చుంటుంది. 5000 సంవత్సరాల క్రితం కూడా - ఈ సాక్షాత్కారాలను నేను చేయిస్తాను అని నేను చెప్పాను. మీరా కూడా సాక్షాత్కారాలు పొందారు. అలాగని ఆత్మ అక్కడికి వెళ్ళిపోయిందని కాదు. అలా కాదు, కూర్చుని-కూర్చుని ఉండగానే సాక్షాత్కారాలు పొందుతారు. కానీ నన్ను ఎవ్వరూ పొందలేరు.

తండ్రి చెప్తున్నారు - ఏ విషయముపై సంశయము ఉన్నా కానీ బ్రాహ్మణీలు (టీచర్లు) ఎవరైతే ఉన్నారో వారిని అడగండి. కుమార్తెలు కూడా నంబరువారుగా ఉన్నారు, నదులు కూడా నంబరువారుగా ఉంటాయి అనైతే తెలుసు. కొన్ని కాలువలు కూడా ఉన్నాయి, అందులో చాలా అశుద్ధమైన, దుర్గంధభరితమైన నీరు ఉంటుంది. అక్కడకు కూడా శ్రద్ధా భావముతో మనుష్యులు వెళ్తారు. అది భక్తిలోని అంధవిశ్వాసము. ఎప్పుడూ కూడా ఎవరిచేత భక్తిని వదిలింపజేయకూడదు. ఎప్పుడైతే జ్ఞానములోకి వచ్చేస్తారో అప్పుడు భక్తిని వారంతట వారే వదిలేస్తారు. బాబా కూడా నారాయణుని భక్తునిగా ఉండేవారు, చిత్రములో లక్ష్మీ దాసీగా అయి నారాయణుడి కాళ్ళను వత్తుతున్నట్లు చూసినప్పుడు, అది వారికి ఏ మాత్రమూ నచ్చలేదు. సత్యయుగములో ఈ విధంగా జరగదు. అప్పుడు నేను - లక్ష్మికి ఈ దాస్యత్వము నుండి విముక్తిని ఇప్పించండి అని ఒక చిత్రకారునికి చెప్పాను. బాబా భక్తునిగా ఉండేవారు, కానీ జ్ఞానము లేదు. వాస్తవానికి అందరూ భక్తులే. మనమైతే బాబా పిల్లలము, యజమానులము. బ్రహ్మాండానికి కూడా యజమానులుగా పిల్లలనే చేస్తారు. మీకు రాజ్యభాగ్యాన్ని ఇస్తాను అని అంటారు. ఇటువంటి బాబాను ఎప్పుడైనా చూసారా? ఆ తండ్రిని పూర్తిగా స్మృతి చేయాలి. వారిని మీరు ఈ కళ్ళతో చూడలేరు. వారితో యోగాన్ని జోడించాలి. స్మృతి మరియు జ్ఞానము కూడా చాలా సహజమైనవి. బీజాన్ని మరియు వృక్షాన్ని తెలుసుకోవాలి. మీరు ఆ నిరాకారీ వృక్షము నుండి సాకారీ వృక్షములోకి వచ్చారు. బాబా సాక్షాత్కారాల రహస్యాన్ని కూడా అర్థం చేయించారు. అలాగే వృక్షము యొక్క రహస్యాన్ని కూడా అర్థం చేయించారు. కర్మ-అకర్మ-వికర్మల యొక్క గతిని కూడా బాబా అర్థం చేయించారు. తండ్రి, టీచరు, గురువు ముగ్గురి నుండి శిక్షణ లభిస్తుంది. ఇప్పుడు బాబా చెప్తున్నారు - నేను మీకు ఎటువంటి శిక్షణను ఇస్తానంటే, ఎటువంటి కర్మలను నేర్పిస్తానంటే, ఇక మీరు 21 జన్మల కొరకు సదా సుఖవంతులుగా అవుతారు. టీచరు శిక్షణను ఇస్తారు కదా. గురువులు కూడా పవిత్రతకు సంబంధించిన శిక్షణను ఇస్తారు మరియు కథలను వినిపిస్తారు. కానీ ధారణ ఏ మాత్రమూ జరగదు. ఇక్కడైతే తండ్రి అంటారు - అంతిమ స్మృతిని బట్టి మరుసటి జన్మ ఆధారపడి ఉంటుంది. మనుష్యులు మరణించేటప్పుడు కూడా - రామ-రామ అని అన్నట్లయితే బుద్ధి అటువైపుకు వెళ్ళిపోతుంది అని చెప్తారు. ఇప్పుడు తండ్రి అంటారు - మీకు సాకారునితో యోగము తెగిపోయింది. ఇప్పుడు నేను మీకు చాలా మంచి కర్మలను నేర్పిస్తాను. శ్రీకృష్ణుని చిత్రాన్ని చూడండి, పాత ప్రపంచాన్ని కాలదన్ని కొత్త ప్రపంచములోకి వస్తారు. మీరు కూడా పాత ప్రపంచాన్ని కాలదన్ని కొత్త ప్రపంచములోకి వెళ్తారు. కావున నరకము వైపు మీ కాళ్ళు ఉన్నాయి, స్వర్గము వైపు ముఖము ఉంది. స్మశానములోకి వెళ్ళేటప్పుడు కూడా శవం యొక్క ముఖాన్ని అటువైపుకు తిప్పుతారు. కాళ్ళను బయట వైపుకు తిప్పుతారు. కావున ఈ చిత్రాన్ని కూడా అలాగే తయారుచేసారు.

మమ్మా, బాబా మరియు పిల్లలైన మీరు - మీరైతే మమ్మా-బాబా యొక్క సింహాసనముపై కూర్చునే విధంగా వారిని ఫాలో చేయాల్సి ఉంటుంది. రాజు పిల్లలు యువరాజులు, యువరాణులుగా పిలవబడతారు కదా. మేము భవిష్యత్తులో యువరాజులు, యువరాణులుగా అవుతాము అని మీకు తెలుసు. మీకు ఇటువంటి కర్మలను నేర్పించే తండ్రి, టీచర్, గురువు ఎవరైనా ఉంటారా! మీరు సదా కాలము కొరకు సుఖవంతులుగా అవుతారు. ఇది శివబాబా ఇచ్చే వరము, వారు ఆశీర్వదిస్తున్నారు. అంతేకానీ మనపై వారి కృప ఉంది అన్నట్లు కాదు. కేవలం అలా అన్నంతమాత్రాన ఏమీ జరగదు. మీరు నేర్చుకోవలసి ఉంటుంది. కేవలం ఆశీర్వాదాల ద్వారా మీరు అలా తయారైపోరు. వారు ఇచ్చే డైరెక్షన్లపై నడవాలి. జ్ఞాన-యోగాలను ధారణ చేయాలి. తండ్రి అర్థం చేయిస్తున్నారు - నోటితో రామ-రామ అని అనడం వలన కూడా శబ్దము వస్తుంది. మీరైతే వాణి నుండి అతీతముగా వెళ్ళిపోవాలి, మౌనముగా ఉండాలి. నాటకాలు కూడా మంచి-మంచివి వెలువడుతూ ఉంటాయి. చదువుకోనివారిని అవివేకులు అని అంటారు. బాబా అంటారు, ఇప్పుడు అందరినీ మర్చిపోయి మీరు పూర్తిగా అవివేకులుగా అయిపోండి. నేను మీకు ఏ డైరెక్షన్లనైతే ఇస్తానో, దానిపై నడవండి. పరంధామములో ఆత్మలైన మీరందరూ శరీరాలు లేకుండా ఉంటారు, తర్వాత ఇక్కడకు వచ్చి శరీరాలను తీసుకుంటారు, అప్పుడు జీవాత్మలుగా పిలవబడతారు. నేను ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటాను అని ఆత్మ అంటుంది. తండ్రి అంటారు, నేను మీకు ఫస్ట్ క్లాస్ కర్మలను నేర్పిస్తాను. టీచర్ చదివిస్తారు, ఇందులో శక్తి యొక్క విషయమేముంది. సాక్షాత్కారాలు చేయిస్తారు, దీనిని ఇంద్రజాలము అని అంటారు. మనుష్యుల నుండి దేవతలుగా చేయడము - ఇటువంటి ఇంద్రజాలము ఇంకెవ్వరూ చేయలేరు. బాబా వ్యాపారి కూడా, పాతవాటిని తీసుకుని కొత్తవాటిని ఇస్తారు. దీనిని పాత లోహపు పాత్ర అని అంటారు. దీనికి ఎటువంటి విలువ లేదు. ఈ రోజుల్లో చూడండి, రాగితో కూడా పైసలు తయారవ్వడం లేదు. అక్కడైతే బంగారు నాణాలు ఉంటాయి. అద్భుతము కదా. ఎలా ఉండేది ఎలా అయిపోయింది!

తండ్రి అంటారు, నేను మీకు నంబర్ వన్ కర్మలను నేర్పిస్తాను. మన్మనాభవగా అయిపోండి. ఆ తర్వాత చదువు, దాని ద్వారా స్వర్గములోని యువరాజులుగా అవుతారు. ఇప్పుడు దేవతా ధర్మమేదైతే కనుమరుగైపోయిందో, అది మళ్ళీ స్థాపన అవుతుంది. మనుష్యులు మీ ఈ కొత్త విషయాలను విని ఆశ్చర్యపోతారు. స్త్రీ-పురుషులు ఇరువురూ కలిసి ఉంటూ పవిత్రముగా ఉండడమనేది ఎలా జరగగలదు అని అంటారు! బాబా అయితే అంటారు, మీరు కలిసే ఉండండి, లేకపోతే ఎలా తెలుస్తుంది, మధ్యలో జ్ఞాన ఖడ్గాన్ని పెట్టుకోవాలి, అంతటి సాహసాన్ని చూపించాలి. పరీక్ష జరుగుతుంది. కావున మనుష్యులు ఈ విషయాలను విని ఆశ్చర్యపోతారు, ఎందుకంటే శాస్త్రాలలో ఇటువంటి విషయాలు లేవు. ఇక్కడైతే ప్రాక్టికల్ గా కష్టపడవలసి ఉంటుంది. గాంధర్వ వివాహము యొక్క విషయము ఇక్కడిదే. ఇప్పుడు మీరు పవిత్రముగా అవుతారు. కావున తండ్రి అంటారు, సాహసాన్ని చూపించండి. సన్యాసుల ఎదురుగా ఋజువును చూపించాలి. సమర్థుడైన బాబాయే మొత్తము ప్రపంచమంతటినీ పావనముగా తయారుచేస్తారు. తండ్రి అంటారు, మీరు కలిసే ఉండండి, కానీ కేవలం వివస్త్రగా అవ్వకూడదు. ఇవన్నీ యుక్తులు. చాలా గొప్ప ప్రాప్తి ఉంటుంది, కేవలం ఒక్క జన్మ బాబా ఇచ్చే డైరెక్షన్లపై పవిత్రముగా ఉండాలి. యోగము మరియు జ్ఞానము ద్వారా 21 జన్మల కొరకు సదా ఆరోగ్యవంతులుగా అవుతారు. ఇందులో శ్రమ ఉంది కదా. మీరు శక్తి సైన్యము. మాయపై విజయాన్ని పొంది జగత్ జీతులుగా అవుతారు. అందరూ అలా అవ్వరు కదా. ఏ పిల్లలైతే పురుషార్థము చేస్తారో వారే ఉన్నత పదవిని పొందుతారు. మీరు భారత్ నే పవిత్రముగా తయారుచేసి, తిరిగి భారత్ పైనే రాజ్యము చేస్తారు. యుద్ధము ద్వారా ఎప్పుడూ సృష్టి రాజ్యాధికారము లభించదు. ఇది విచిత్రము కదా. ఈ సమయములో అందరూ పరస్పరం కొట్లాడుకుని అంతమైపోతారు. వెన్న భారత్ కే లభిస్తుంది. అది ఇప్పించేవారు వందే మాతరం. మెజారిటీ మాతలది. ఇప్పుడు తండ్రి అంటారు, జన్మ-జన్మాంతరాలూ మీరు గురువులను ఆశ్రయిస్తూ వచ్చారు, శాస్త్రాలను చదువుతూ వచ్చారు. ఇప్పుడు నేను మీకు అర్థం చేయిస్తున్నాను - రైట్ ఏమిటి అనేది మీకు మీరే నిర్ణయించండి. సత్యయుగము ధర్మయుక్తమైన ప్రపంచము. మాయ అధర్మయుక్తముగా తయారుచేస్తుంది. ఇప్పుడు భారతవాసులు అధార్మికముగా అయిపోయారు. ధర్మము లేదు, కావున శక్తి కూడా లేదు. అధార్మికముగా, అధర్మయుక్తముగా, న్యాయవిరుద్ధముగా, దివాలాకోరుగా అయిపోయారు. వీరు అనంతమైన తండ్రి, అందుకే వీరు అనంతమైన విషయాలను అర్థం చేయిస్తారు. వారేమంటున్నారంటే, మళ్ళీ మిమ్మల్నే ధార్మికముగా మరియు అతి శక్తివంతముగా తయారుచేస్తాను. స్వర్గాన్ని తయారుచేయడమనేది శక్తివంతమైనవారి పని. కానీ వారు గుప్తము. వీరు గుప్తమైన యోధులు. తండ్రికి ప్లిలలపై ఎంతో ప్రేమ ఉంటుంది. తమ డైరెక్షన్లు ఇస్తారు. తండ్రి డైరెక్షన్లు, టీచర్ డైరెక్షన్లు, గురువు డైరెక్షన్లు, కంసాలి డైరెక్షన్లు , చాకలి డైరెక్షన్లు... ఇందులో అందరి డైరెక్షన్లు వచ్చేస్తాయి. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఈ ఒక్క అంతిమ జన్మలో తండ్రి డైరెక్షన్లపై నడుస్తూ, గృహస్థములో ఉంటూ, పవిత్రముగా ఉండాలి. ఇందులో సాహసాన్ని చూపించాలి.

2. శ్రీమతముపై సదా శ్రేష్ఠ కర్మలను చేయాలి. వాణి నుండి అతీతముగా వెళ్ళాలి, ఏదైతే చదివారో లేక విన్నారో, వాటిని మర్చిపోయి తండ్రిని స్మృతి చేయాలి.

వరదానము:-
పరిస్థితులను గుడ్ లక్ (అదృష్టము) గా భావించి తమ నిశ్చయమనే పునాదిని దృఢంగా చేసుకునే అచల్-అడోల్ భవ

ఏ పరిస్థితి వచ్చినా మీరు హై జంప్ చేయండి ఎందుకంటే పరిస్థితులు రావటము కూడా గుడ్ లక్. ఇది నిశ్చయమనే పునాదిని దృఢంగా చేసేందుకు సాధనము. మీరు ఒక్కసారి అంగదుని సమానంగా దృఢంగా అయినట్లయితే ఈ పరీక్షలు కూడా నమస్కరిస్తాయి. ముందు భయంకరమైన రూపములో వస్తాయి, ఆ తర్వాత దాసిగా అయిపోతాయి. మేము మహావీరులము అని ఛాలెంజ్ చెయ్యండి. ఏ విధంగా నీటిపైన గీత నిలవలేదో, అదే విధంగా మాస్టర్ సాగరుడినైన నా పై ఏ పరిస్థితి దాడి చేయలేదు. స్వస్థితిలో ఉన్నట్లయితే స్థిరముగా-దృఢముగా అవుతారు.

స్లోగన్:-
పాత సంవత్సరానికి వీడ్కోలు ఇవ్వడంతో పాటు చేదుతనానికి కూడా వీడ్కోలు ఇవ్వండి.

అవ్యక్త సూచనలు - ఆత్మిక రాయల్టీని మరియు పవిత్రత యొక్క పర్సనాలిటీని ధారణ చెయ్యండి

ఒకవేళ వరదాత మరియు వరదానీ, ఇరువురి సంబంధము సమీపముగా మరియు స్నేహము ఆధారముతో నిరంతరము ఉన్నట్లయితే, మరియు సదా కంబైండ్ రూపములో ఉన్నట్లయితే పవిత్రత యొక్క ఛత్రఛాయ స్వతహాగా ఉంటుంది. ఎక్కడైతే సర్వశక్తివంతుడైన తండ్రి ఉంటారో, అక్కడ అపవిత్రత స్వప్నములో కూడా రాలేదు. ఎప్పుడైతే ఒంటరిగా ఉంటారో, అప్పుడు పవిత్రత యొక్క సౌభాగ్యము దూరమైపోతుంది.