07-10-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - రకరకాల యుక్తులను ఎదురుగా ఉంచుకుని స్మృతియాత్రలో ఉండండి, ఈ పాత ప్రపంచాన్ని మరచి తమ స్వీట్ హోమ్ ను (మధురమైన ఇంటిని) మరియు కొత్త ప్రపంచాన్ని స్మృతి చేయండి’’

ప్రశ్న:-
మొత్తము కల్పమంతటిలోనూ జరగని ఏ కర్తవ్యము లేక పురుషార్థము ఇప్పుడు మాత్రమే జరుగుతుంది?

జవాబు:-
స్మృతియాత్రలో ఉంటూ ఆత్మను పావనముగా తయారుచేసే పురుషార్థము, మొత్తం ప్రపంచాన్ని పతితము నుండి పావనముగా తయారుచేసే కర్తవ్యము, మొత్తము కల్పములో కేవలం ఈ సంగమ సమయములో మాత్రమే జరుగుతుంది. ఈ కర్తవ్యము ప్రతి కల్పము రిపీట్ అవుతుంది. పిల్లలైన మీరు ఈ అనాది అవినాశీ డ్రామా యొక్క అద్భుతమైన రహస్యము గురించి అర్థం చేసుకున్నారు.

ఓంశాంతి
ఆత్మిక తండ్రి కూర్చుని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తారు, అందుకే ఆత్మిక పిల్లలు దేహీ-అభిమానీ అవస్థలో లేక ఆత్మిక అవస్థలో నిశ్చయబుద్ధి కలవారిగా అయి కూర్చోవాలి మరియు వినాలి. తండ్రి అర్థం చేయించారు - ఈ ఇంద్రియాల ద్వారా ఆత్మనే వింటుంది. ఇది పక్కాగా గుర్తు చేసుకుంటూ ఉండండి. సద్గతి మరియు దుర్గతికి సంబంధించిన ఈ చక్రము అయితే ప్రతి ఒక్కరి బుద్ధిలో ఉండాల్సిందే, ఇందులో జ్ఞానము మరియు భక్తి అంతా వచ్చేస్తుంది. జ్ఞానము మరియు భక్తి, సుఖము మరియు దుఃఖము, పగలు మరియు రాత్రి యొక్క ఆట ఎలా నడుస్తుంది అనేది నడుస్తూ-తిరుగుతూ బుద్ధిలో ఉండాలి. మనము 84 జన్మల పాత్రను అభినయిస్తాము. తండ్రికి స్మృతి ఉంది కావున పిల్లల చేత కూడా స్మృతిలో ఉండే పురుషార్థము చేయిస్తారు, దీని ద్వారా మీ వికర్మలు కూడా వినాశనమవుతాయి మరియు మీరు రాజ్యాన్ని కూడా పొందుతారు. ఈ పాత ప్రపంచము ఇప్పుడిక సమాప్తమవ్వనున్నది అని మీకు తెలుసు. ఏ విధముగా ఇల్లు పాతబడినప్పుడు, కొత్త ఇంటిని నిర్మిస్తూ ఉంటే, ఇప్పుడు మేము కొత్త ఇంటికి వెళ్ళిపోతాము అని లోలోపల నిశ్చయముంటుంది. ఆ తర్వాత ఇల్లు తయారవ్వడానికి ఒక్కోసారి 1-2 సంవత్సరాలు పడుతుంది. ఏ విధముగా కొత్త ఢిల్లీలో గవర్నమెంట్ హౌస్ మొదలైనవి తయారైతే, మేము ట్రాన్స్ఫర్ అయ్యి కొత్త ఢిల్లీకి వెళ్తామని గవర్నమెంట్ తప్పకుండా చెప్తుంది. పిల్లలైన మీకు తెలుసు - ఈ అనంతమైన ప్రపంచమంతా పాతది, ఇప్పుడు కొత్త ప్రపంచములోకి వెళ్ళాలి. ఇలాంటి యుక్తులతో బుద్ధిని స్మృతియాత్రలో నిమగ్నము చేయాలని బాబా యుక్తులను తెలియజేస్తారు. మనము ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి, అందుకే స్వీట్ హోమ్ ను (మధురమైన ఇంటిని) స్మృతి చేయాలి, దీని కొరకు మనుష్యులు కష్టపడుతూ ఉంటారు. ఈ దుఃఖధామము ఇప్పుడు సమాప్తమవ్వనున్నదని కూడా మధురాతి-మధురమైన పిల్లలకు అర్థం చేయించారు. మీరు ఇక్కడే ఉన్నా కానీ ఈ పాత ప్రపంచము ఇష్టమనిపించదు. మనము మళ్ళీ కొత్త ప్రపంచములోకి వెళ్ళాలి. చిత్రాలేవీ ఎదురుగా లేకపోయినా కానీ ఇప్పుడిది పాత ప్రపంచము యొక్క అంతిమమని, ఇప్పుడు మనము కొత్త ప్రపంచములోకి వెళ్తామని మీకు తెలుసు. భక్తి మార్గములోనైతే ఎన్ని లెక్కలేనన్ని చిత్రాలు ఉన్నాయి. వాటితో పోలిస్తే మీవి చాలా తక్కువ ఉన్నాయి. ఇవి మీ జ్ఞాన మార్గపు చిత్రాలు మరియు అవన్నీ భక్తి మార్గానికి చెందినవి. చిత్రాల ఆధారముగానే భక్తి అంతా జరుగుతుంది. ఇప్పుడు మీవైతే రియల్ చిత్రాలు, అందుకే - రైట్ ఏమిటి, రాంగ్ ఏమిటి అనేది మీరు అర్థం చేయించగలరు. బాబాను నాలెడ్జ్ ఫుల్ అని అంటారు. మీకు ఈ జ్ఞానముంది. మనము మొత్తము కల్పములో ఎన్ని జన్మలు తీసుకున్నాము, ఈ చక్రము ఎలా తిరుగుతుంది అనేది మీకు తెలుసు. మీరు నిరంతరము తండ్రి స్మృతిలో ఉండాలి మరియు నిరంతరము ఈ జ్ఞానాన్ని బుద్ధిలో ఉంచుకోవాలి. తండ్రి మీకు రచయిత మరియు రచనల పూర్తి జ్ఞానాన్నిస్తారు. కావున తండ్రి స్మృతి కూడా ఉంటుంది. నేను మీ తండ్రిని, టీచర్ ను, సద్గురువును అని బాబా అర్థం చేయించారు. మీరు కేవలం ఇది అర్థం చేయించండి - తండ్రి అంటున్నారు, మీరు నన్ను పతిత-పావనుడు, ముక్తిదాత, గైడ్ అని అంటారు కదా, మరి నేను ఎక్కడికి గైడ్ ను? శాంతిధామానికి, ముక్తిధామానికి గైడ్ ను. అక్కడి వరకు తండ్రి తీసుకువెళ్ళి వదులుతారు. పిల్లలను చదివించి, నేర్పించి, పుష్పాలుగా తయారుచేసి ఇంటికి తీసుకువెళ్ళి వదులుతారు. తండ్రి తప్ప ఇంకెవ్వరూ తీసుకువెళ్ళలేరు. ఎవరు ఎంత తత్వ జ్ఞానులైనా లేక బ్రహ్మ జ్ఞానులైనా కానీ వారు తీసుకువెళ్ళలేరు. మేము బ్రహ్మ తత్వములో లీనమవుతామని వారు భావిస్తారు. శాంతిధామము మన ఇల్లు అని మీ బుద్ధిలో ఉంది. అక్కడికి వెళ్ళి మళ్ళీ కొత్త ప్రపంచములోకి మనము మొట్టమొదట వస్తాము. వారంతా తర్వాత వస్తారు. అన్ని ధర్మాలు నంబరువారుగా ఎలా వస్తాయి అనేది మీకు తెలుసు. సత్య-త్రేతాయుగాలలో ఎవరి రాజ్యము ఉంటుంది, వారి ధర్మశాస్త్రము ఏమిటి. సూర్యవంశీ-చంద్రవంశీయులకు ఒక్క శాస్త్రమే ఉంది. కానీ ఆ గీత సత్యమైనదేమీ కాదు ఎందుకంటే మీకు ఏదైతే జ్ఞానము లభిస్తుందో, అది ఇక్కడే సమాప్తమైపోతుంది. అక్కడ ఏ శాస్త్రమూ ఉండదు. ద్వాపరము నుండి ఏయే ధర్మాలైతే వస్తాయో, వాటికి సంబంధించిన శాస్త్రాలు ఉన్నాయి, అవి కొనసాగుతూ వస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఏక ధర్మ స్థాపన జరుగుతుంది కావున మిగిలినవన్నీ వినాశనమవ్వనున్నాయి. ఒకే రాజ్యము, ఒకే ధర్మము, ఒకే భాష, ఒకే మతము ఉండాలని అంటూ ఉంటారు. అది కేవలం ఒక్కరి ద్వారా మాత్రమే స్థాపనవ్వగలదు. పిల్లలైన మీ బుద్ధిలో సత్యయుగము నుండి మొదలుకొని కలియుగాంతము వరకు పూర్తి జ్ఞానము ఉంది. తండ్రి అంటారు - ఇప్పుడు పావనముగా అయ్యేందుకు పురుషార్థము చేయండి. మీరు పతితులుగా అవ్వడానికి అర్ధకల్పము పట్టింది. వాస్తవానికి పూర్తి కల్పమనే చెప్పాలి. ఈ స్మృతియాత్రనైతే మీరు ఇప్పుడే నేర్చుకుంటారు. అక్కడ ఇది ఉండదు. దేవతలు పతితుల నుండి పావనులుగా అయ్యే పురుషార్థము చేయరు. వారు ముందే రాజయోగాన్ని నేర్చుకుని ఇక్కడి నుండే పావనముగా అయి వెళ్తారు. దానిని సుఖధామము అని అంటారు. మొత్తము కల్పములో కేవలం ఇప్పుడు మాత్రమే మనం స్మృతియాత్ర చేసే పురుషార్థము చేస్తామని మీకు తెలుసు. పతిత ప్రపంచాన్ని పావనముగా తయారుచేసేందుకని ఈ పురుషార్థము, ఈ కర్తవ్యము ఏదైతే నడుస్తుందో, ఇది మళ్ళీ కల్పము తర్వాత రిపీట్ అవుతుంది. చక్రములోనైతే తప్పకుండా తిరుగుతారు కదా. ఇది నాటకమని, ఆత్మలందరూ పాత్రధారులని, వారిలో అవినాశీ పాత్ర నిండి ఉందని మీ బుద్ధిలో అన్ని విషయాలు ఉన్నాయి. ఇది ఆ డ్రామా వలె నడుస్తూ ఉంటుంది. కానీ ఆ ఫిల్మ్ అరిగిపోయి పాతదిగా అయిపోతుంది. ఇది అవినాశీ. ఇది కూడా అద్భుతము, ఎంత చిన్న ఆత్మలో మొత్తం పాత్ర అంతా నిండి ఉంది. తండ్రి మీకు ఎన్ని గుహ్యాతి-గుహ్యమైన సూక్ష్మ విషయాలను అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు ఎవరైనా ఇవి విన్నారంటే, వీరు చాలా అద్భుతమైన విషయాలను అర్థం చేయిస్తున్నారు అని అంటారు. ఆత్మ అంటే ఏమిటి అనేది ఇప్పుడు అర్థం చేసుకున్నారు. శరీరము గురించైతే అందరికీ తెలుసు. డాక్టర్లు అయితే మనుష్యుల గుండెను కూడా బయటికి తీసి మళ్ళీ అమరుస్తారు, కానీ ఆత్మ గురించి ఎవరికీ తెలియదు. ఆత్మ పతితము నుండి పావనముగా ఎలా అవుతుంది అనేది కూడా ఎవ్వరికీ తెలియదు. పతిత ఆత్మ, పావన ఆత్మ, మహాన్ ఆత్మ అని అంటారు కదా. ఓ పతిత-పావనా, మీరు వచ్చి నన్ను పావనముగా చేయండి అని అందరూ పిలుస్తారు కూడా. కానీ ఆత్మ పావనముగా ఎలా అవుతుంది - దాని కొరకు అవినాశీ సర్జన్ కావాలి. ఎవరైతే పునర్జన్మ రహితుడో, ఆత్మ వారినే పిలుస్తుంది. ఆత్మను పవిత్రముగా తయారుచేసే ఔషధము వారి వద్ద మాత్రమే ఉంది. కావున, భగవంతుడు చదివిస్తున్నారు అని పిల్లలైన మీకు సంతోషముతో రోమాలు నిక్కబొడుచుకోవాలి, వారు తప్పకుండా మిమ్మల్ని భగవాన్-భగవతీలుగా తయారుచేస్తారు. భక్తి మార్గములో ఈ లక్ష్మీ-నారాయణులను భగవాన్-భగవతీ అనే అంటారు. కావున యథా రాజా రాణి తథా ప్రజా ఉంటారు కదా. బాబా తమ సమానముగా పవిత్రముగా కూడా తయారుచేస్తారు. వారు జ్ఞానసాగరులుగా కూడా తయారుచేస్తారు మరియు తమ కన్నా కూడా గొప్పగా, విశ్వానికి యజమానులుగా తయారుచేస్తారు. పవిత్రత, అపవిత్రతల సంపూర్ణ పాత్రను మీరు అభినయించవలసి ఉంటుంది. బాబా ఆది సనాతన దేవీ-దేవతా ధర్మాన్ని మళ్ళీ స్థాపన చేసేందుకు వచ్చారని మీకు తెలుసు. ఈ ధర్మము కనుమరుగైపోయిందని దీని గురించే చెప్తారు. దీనిని మర్రి వృక్షముతోనే పోలుస్తారు. ఎన్నో శాఖలు వెలువడుతాయి కానీ కాండము ఉండదు. ఇక్కడ కూడా అనేక ధర్మాలనే శాఖలు వెలువడ్డాయి, పునాది అయిన దేవతా ధర్మము లేదు. అది కనుమరుగైపోయింది. తండ్రి అంటారు, ఆ ధర్మము ఉంది కానీ ఆ ధర్మము పేరును మార్చేసారు. పవిత్రముగా లేని కారణముగా తమను తాము దేవతలు అని చెప్పుకోలేరు. అలా లేరు కావుననే తండ్రి వచ్చి రచనను రచిస్తారు కదా. మనము పవిత్రమైన దేవతలుగా ఉండేవారమని, ఇప్పుడు పతితులుగా అయ్యామని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ప్రతి వస్తువు ఇలాగే అవుతుంది. పిల్లలైన మీరు ఇది మర్చిపోకూడదు. మొదటి ముఖ్యమైన గమ్యము తండ్రిని స్మృతి చేయడము, దీని ద్వారానే పావనముగా అవ్వాలి. మమ్మల్ని పావనముగా చేయండి అని అందరూ అంటారు. మమ్మల్ని రాజా-రాణులుగా చేయండి అని అడగరు. కనుక పిల్లలైన మీకు చాలా నషా ఉండాలి. మనమైతే భగవంతుని పిల్లలమని మీకు తెలుసు. ఇప్పుడు మనకు తప్పకుండా వారసత్వము లభించాలి. కల్ప-కల్పము ఈ పాత్రను అభినయించాము. వృక్షము వృద్ధి చెందుతూనే ఉంటుంది. ఇవి సద్గతి యొక్క చిత్రాలని బాబా చిత్రాలపై కూడా అర్థం చేయించారు. మీరు ఒట్టి నోటితో కూడా అర్థం చేయిస్తారు, చిత్రాలతో కూడా అర్థం చేయిస్తారు. మీ ఈ చిత్రాలలో సృష్టి ఆదిమధ్యాంతాల రహస్యము వచ్చేస్తుంది. సేవ చేసే పిల్లలు ఎవరైతే ఉన్నారో, వారు తమ సమానముగా తయారుచేస్తూ ఉంటారు. చదువుకుని చదివించే ప్రయత్నము చేయాలి. ఎంత ఎక్కువగా చదువుకుంటారో, అంత ఉన్నత పదవిని పొందుతారు. తండ్రి అంటారు, నేను పురుషార్థము అయితే చేయిస్తాను కానీ భాగ్యము కూడా ఉండాలి కదా. ప్రతి ఒక్కరూ డ్రామా అనుసారముగా పురుషార్థము చేస్తూ ఉంటారు. డ్రామా రహస్యాన్ని కూడా తండ్రి అర్థం చేయించారు. తండ్రి, తండ్రి కూడా, టీచరు కూడా, అలాగే తమతోపాటు తీసుకువెళ్ళే సత్యాతి-సత్యమైన సద్గురువు కూడా. ఆ తండ్రి అకాలమూర్తి. ఇది ఆత్మ యొక్క సింహాసనము కదా, దీని ద్వారా ఈ పాత్రను అభినయిస్తుంది. కనుక తండ్రికి కూడా పాత్రను అభినయించేందుకు, సద్గతినిచ్చేందుకు సింహాసనము కావాలి కదా. తండ్రి అంటారు, నేను సాధారణ తనువులోకే రావలసి ఉంటుంది. ఏ ఆర్భాటము కలిగి ఉండను. ఆ గురువుల ఫాలోవర్స్ అయితే గురువుల కొరకు బంగారు సింహాసనము, మహళ్ళు మొదలైనవి తయారుచేస్తారు. మీరు ఏమి తయారుచేస్తారు? మీరు పిల్లలు కూడా, విద్యార్థులు కూడా. మరి మీరు వారి కోసం ఏమి చేస్తారు? ఎక్కడ తయారుచేస్తారు? వీరైతే సాధారణముగా ఉన్నారు కదా.

వేశ్యలకు సేవ చేయమని పిల్లలకు ఇది కూడా అర్థం చేయిస్తూ ఉంటారు. పేదవారిని కూడా ఉద్ధరించాలి. పిల్లలు ప్రయత్నము కూడా చేస్తారు, బనారస్ కు కూడా వెళ్ళారు. వారిని మీరు మేల్కొలిపితే, వాహ్ బి.కె.లు అద్భుతము చేస్తున్నారు, వేశ్యలకు కూడా ఈ జ్ఞానాన్ని ఇస్తున్నారు అని అంటారు. ఇప్పుడు మీరు ఈ వ్యాపారాన్ని వదిలి శివాలయానికి యజమానులుగా అవ్వండి, ఈ జ్ఞానాన్ని నేర్చుకుని ఇతరులకు నేర్పించండి అని వారికి కూడా అర్థం చేయించాలి. వేశ్యలు కూడా ఇతరులకు నేర్పించగలరు. నేర్చుకుని తెలివైనవారిగా అయితే తమ ఆఫీసర్లకు కూడా అర్థం చేయిస్తారు. హాలులో చిత్రాలు మొదలైనవి పెట్టుకుని కూర్చుని అర్థం చేయించినట్లయితే అందరూ - వాహ్, వేశ్యలను శివాలయవాసులుగా చేసేందుకు ఈ బి.కె.లు నిమిత్తముగా అయ్యారు అని అంటారు. పిల్లలకు సేవ కోసం ఆలోచనలు నడుస్తూ ఉండాలి. మీపై చాలా బాధ్యత ఉంది. అహల్యలు, కుబ్జలు, ఆదివాసి స్త్రీలు, వేశ్యలు, వీరందరి ఉద్ధరణ చేయాలి. సాధువులను కూడా ఉద్ధరించారు అనే గాయనము కూడా ఉంది. సాధువుల ఉద్ధరణ చివర్లో జరుగుతుందనైతే మీరు అర్థం చేసుకుంటారు. ఇప్పుడే వారు మీ వారిగా అయిపోతే, ఇక భక్తి మార్గమంతా సమాప్తమైపోతుంది. పెద్ద విప్లవము జరుగుతుంది. అలా జరిగితే సన్యాసులు తమ ఆశ్రమాలను వదిలేస్తారు, ఇక మేము ఓడిపోయామని అంటారు. ఇది చివర్లో జరుగుతుంది. ఈ-ఈ విధముగా చేయండి అని బాబా డైరెక్షన్లు ఇస్తూ ఉంటారు. బాబా అయితే బయటకు ఎక్కడికీ వెళ్ళలేరు. పిల్లల వద్దకు వెళ్ళి నేర్చుకోమని బాబా చెప్తారు. అర్థం చేయించేందుకు యుక్తులనైతే పిల్లలందరికీ చెప్తూ ఉంటారు. మనుష్యుల నోటి నుండి వాహ్-వాహ్ అని వెలువడేలా అటువంటి కార్యాన్ని చేసి చూపించండి. శక్తులలో జ్ఞాన బాణాలను భగవంతుడు నింపారు అనే గాయనము కూడా ఉంది. ఇవి జ్ఞాన బాణాలు. ఈ బాణాలు మిమ్మల్ని ఈ ప్రపంచము నుండి ఆ ప్రపంచానికి తీసుకువెళ్తాయని మీకు తెలుసు. కనుక పిల్లలైన మీరు చాలా విశాలబుద్ధి కలవారిగా అవ్వాలి. ఒక్కచోట మీ పేరు ప్రసిద్ధమైనా గవర్నమెంట్ కు తెలుస్తుంది, అప్పుడు చాలా ప్రభావము వెలువడుతుంది. ఒక చోట నుండే ఎవరైనా 5 - 7 మంది మంచి ఆఫీసర్లు వెలువడితే, అది వార్తాపత్రికలలో వేయడం మొదలుపెడతారు. ఈ బి.కె.లు వేశ్యల చేత కూడా ఆ వ్యాపారాన్ని వదిలింపజేసి, శివాలయానికి యజమానులుగా చేస్తారని అంటారు. వాహ్-వాహ్ అని ఎంతగానో అంటారు. వారు ధనము మొదలైనవన్నీ తీసుకువస్తారు. మీరు ధనాన్ని ఏం చేస్తారు! మీరు పెద్ద-పెద్ద సెంటర్లను తెరుస్తారు. ధనముతో చిత్రాలు మొదలైనవి తయారుచేయవలసి ఉంటుంది. మనుష్యులు చూసి చాలా ఆశ్చర్యపోతారు. మొట్టమొదట మీకు ప్రైజ్ ఇవ్వాలని అంటారు. గవర్నమెంట్ హౌస్ కు కూడా మీ చిత్రాలను తీసుకువెళ్తారు. వీటిని చాలా ఇష్టపడతారు. మనుష్యులను దేవతలుగా ఎలా తయారుచేయాలి అని హృదయములో కోరిక ఉండాలి. ఎవరైతే కల్పక్రితము తీసుకున్నారో వారే తీసుకుంటారని మీకు తెలుసు. ఇంత ధనము మొదలైనవన్నీ వదలేయడం కష్టమవుతుంది. బాబా అన్నారు, నాకు నా ఇల్లు, వాకిలి, మిత్ర-సంబంధీకులు మొదలైనవేవీ లేవు, నాకు ఏమి గర్తుకొస్తుంది, తండ్రి మరియు పిల్లలైన మీరు తప్ప ఇంకేమీ గుర్తు రాదు. అంతా ఎక్స్ చేంజ్ చేసేశాను. ఇక బుద్ధి ఎక్కడకి వెళ్తుంది. బాబాకు రథాన్ని ఇచ్చాను. మీరు ఎలా చదువుకుంటున్నారో, నేనూ అలాగే చదువుకుంటున్నాను. కేవలం రథాన్ని బాబాకు లోన్ గా ఇచ్చాను.

సూర్యవంశములో మొట్టమొదట వచ్చేందుకు మనము పురుషార్థము చేస్తున్నామని మీకు తెలుసు. ఇది నరుని నుండి నారాయణునిగా అయ్యే కథ. మూడవ నేత్రము ఆత్మకు లభిస్తుంది. ఆత్మలమైన మనము చదువుకుని, జ్ఞానాన్ని విని, దేవతలుగా అవుతున్నాము. ఇక తర్వాత రాజులకే రాజులుగా అవుతాము. శివబాబా అంటారు, నేను మిమ్మల్ని ద్వికిరీటధారులుగా తయారుచేస్తాను. డ్రామానుసారముగా, కల్పక్రితము వలె ఇప్పుడు మీ బుద్ధి ఎంతగా తెరుచుకుంది. ఇప్పుడు స్మృతియాత్రలో కూడా ఉండాలి. సృష్టి చక్రాన్ని కూడా స్మృతి చేయాలి. పాత ప్రపంచాన్ని బుద్ధి ద్వారా మర్చిపోవాలి. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఇప్పుడు మన కొరకు కొత్త స్థాపన జరుగుతోందని, ఈ దుఃఖపు పాత ప్రపంచము ఇక సమాప్తమైనట్లేనని బుద్ధిలో ఉండాలి. ఈ ప్రపంచము అసలు ఇష్టమనిపించకూడదు.

2. ఏ విధంగా బాబా తమదంతా ఎక్స్ చేంజ్ చేసారు కావున వారి బుద్ధి ఎక్కడికీ వెళ్ళలేదో, అదే విధముగా ఫాలో ఫాదర్ చేయాలి. మేము మనుష్యులను దేవతలుగా తయారుచేసే సేవ చేయాలి, ఈ వేశ్యాలయాన్ని శివాలయముగా తయారుచేయాలి అని హృదయములో కేవలం ఇదే కోరిక ఉండాలి.

వరదానము:-
దేహాభిమానపు రాయల్ రూపాన్ని కూడా సమాప్తము చేసే సాక్షీ మరియు దృష్టా భవ

ఇతరుల మాటలకు గౌరవాన్ని ఇవ్వకపోవడము, ఖండిచడము - ఇది కూడా దేహాభిమానపు రాయల్ రూపము, అది స్వయాన్ని మరియు ఇతరులను అవమానపరుస్తుంది ఎందుకంటే ఎవరైతే ఖండిస్తారో, వారికి అభిమానము వస్తుంది, మరియు ఎవరి మాటనైతే ఖండిస్తారో, వారికి అవమానము కలుగుతుంది, అందుకే సాక్షీ దృష్టా వరదానాన్ని స్మృతిలో ఉంచుకుని, డ్రామా యొక్క డాలును మరియు డ్రామా పట్టాలపై ప్రతి కర్మను మరియు సంకల్పాన్ని చేస్తూ, ‘నేను’ అనే భావము యొక్క రాయల్ రూపాన్ని కూడా సమాప్తము చేసి ప్రతి ఒక్కరి మాటకు గౌరవాన్ని ఇవ్వండి, స్నేహాన్ని ఇవ్వండి, అప్పుడు వారు సదా కొరకు సహయోగులుగా అవుతారు.

స్లోగన్:-
పరమాత్మ శ్రీమతము రూపీ జలము ఆధారముగా కర్మ రూపీ బీజాన్ని శక్తిశాలిగా చేసుకోండి.

అవ్యక్త సూచనలు - స్వయము కొరకు మరియు సర్వుల కొరకు మనసు ద్వారా యోగ శక్తులను ప్రయోగము చెయ్యండి

ప్రతి సమయము, ప్రతి ఆత్మ పట్ల మనసు స్వతహాగానే శుభ భావన మరియు శుభ కామనల శుద్ధ వైబ్రేషన్లు కలవిగా స్వయానికి మరియు ఇతరులకు అనుభవమవ్వాలి. మనసు ద్వారా నిరంతరము సర్వాత్మల కొరకు ఆశీర్వాదాలు వెలువడుతూ ఉండాలి. మనసు ఎల్లప్పుడూ ఈ సేవలోనే బిజీగా ఉండాలి. ఏ విధముగా వాచా సేవలో బిజీగా ఉండే అనుభవముందో, సేవ లభించకపోతే స్వయము ఖాళీగా ఉన్నట్లు అనుభవము చేస్తారో, అలా నిత్యము వాణితోపాటు మనసా సేవ స్వతహాగా జరుగుతూ ఉండాలి.