07-11-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - ఈ సంగమయుగము సర్వోత్తములుగా తయారయ్యేందుకు శుభ సమయము, ఎందుకంటే ఈ సమయములోనే తండ్రి మీకు నరుని నుండి నారాయణునిగా తయారయ్యే చదువును చదివిస్తారు’’

ప్రశ్న:-
పిల్లలైన మీ వద్దనున్న ఏ జ్ఞానము కారణముగా మీరు ఎటువంటి పరిస్థితిలోనూ ఏడవలేరు?

జవాబు:-
మీ వద్ద తయారై, తయారుచేయబడిన ఈ డ్రామా యొక్క జ్ఞానము ఉంది, ఇందులో ప్రతి ఆత్మకు తన పాత్ర ఉందని మీకు తెలుసు. తండ్రి మనకు సుఖము యొక్క వారసత్వాన్ని ఇస్తున్నారు, కావున మనం ఎలా ఏడవగలము. పార బ్రహ్మములో ఉండేవారిని పొందాలనే చింత ఉండేది, వారు లభించేసారు, ఇంకేమి కావాలి. భాగ్యశాలీ పిల్లలు ఎప్పుడూ ఏడవరు.

ఓంశాంతి
ఆత్మిక తండ్రి కూర్చుని పిల్లలకు ఒక విషయాన్ని అర్థం చేయిస్తున్నారు. చిత్రాలలో కూడా - త్రిమూర్తి శివబాబా పిల్లలకు అర్థం చేయిస్తున్నారు అని వ్రాయాలి. మీరు కూడా ఎవరికైనా అర్థం చేయించేటప్పుడు ఆత్మలైన మీరు - శివబాబా ఇలా చెప్తున్నారు అని అంటారు. బాబా మీకు అర్థం చేయిస్తున్నారు అని ఈ తండ్రి కూడా అంటారు. ఇక్కడ మనుష్యులు, మనుష్యులకు అర్థం చేయించడం లేదు కానీ పరమాత్మ ఆత్మలకు అర్థం చేయిస్తున్నారు లేక ఆత్మ, ఆత్మకు అర్థం చేయిస్తుంది. జ్ఞానసాగరుడు అయితే శివబాబా మాత్రమే మరియు వారు ఆత్మిక తండ్రి. ఈ సమయములో ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నుండి వారసత్వము లభిస్తుంది. దైహిక అహంకారాన్ని ఇక్కడ వదలవలసి ఉంటుంది. ఈ సమయములో మీరు దేహీ-అభిమానులుగా అయి తండ్రిని స్మృతి చేయాలి. కర్మలు కూడా చేయండి, వ్యాపార వ్యవహారాలు మొదలైనవి కూడా చేస్తూ ఉండండి, ఇకపోతే ఎంత సమయము లభిస్తే అంత సమయము స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి. శివబాబా వీరిలో వచ్చి ఉన్నారని మీకు తెలుసు. వారు సత్యమైనవారు, చైతన్యమైనవారు. వారిని సత్ చిత్ ఆనంద స్వరూపుడు అని అంటారు. బ్రహ్మా, విష్ణు, శంకరులకు లేక మనుష్యమాత్రులెవ్వరికీ ఈ మహిమ లేదు. ఉన్నతోన్నతమైన భగవంతుడు ఒక్కరే, వారు సుప్రీమ్ సోల్. ఈ జ్ఞానము కూడా మీకు కేవలం ఈ సమయములోనే ఉంది. ఇది ఇక మళ్ళీ ఎప్పుడూ లభించదు. మిమ్మల్ని ఆత్మాభిమానులుగా తయారుచేసి తండ్రిని స్మృతి చేయించేందుకు ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత తండ్రి వస్తారు, దీని ద్వారా మీరు తమోప్రధానము నుండి సతోప్రధానముగా అవుతారు, ఇంకే ఉపాయమూ లేదు. మనుష్యులు ఓ పతిత-పావనా రండి అని పిలుస్తారు కూడా, కానీ దాని అర్థాన్ని అర్థం చేసుకోరు. పతిత-పావన సీతారామ అని అన్నా కరక్టే. మీరందరూ సీతలు లేక భక్తురాళ్ళు. వారు ఒక్కరే రాముడు, భగవంతుడు, భక్తులైన మీకు భగవంతుని ద్వారా ఫలము కావాలి. ముక్తి మరియు జీవన్ముక్తి - ఇదే ఫలము. ముక్తి-జీవన్ముక్తుల దాత ఆ తండ్రి ఒక్కరే. డ్రామాలో ఉన్నతోన్నతమైన పాత్ర కలవారు కూడా ఉంటారు, అలాగే తక్కువ పాత్ర కలవారు కూడా ఉంటారు. ఇది అనంతమైన డ్రామా, దీనిని ఇంకెవ్వరూ అర్థం చేసుకోలేరు. మీరు ఈ సమయములో తమోప్రధాన కనిష్ఠుల నుండి సతోప్రధాన పురుషోత్తములుగా అవుతున్నారు. సతోప్రధానమైన వారినే సర్వోత్తములని అంటారు. ఈ సమయములో మీరు సర్వోత్తములు కారు. తండ్రి మిమ్మల్ని సర్వోత్తములుగా చేస్తారు. ఈ డ్రామా చక్రము ఎలా తిరుగుతూ ఉంటుంది అన్నదాని గురించి ఎవ్వరికీ తెలియదు. కలియుగము, సంగమయుగము, ఆ తర్వాత సత్యయుగము వస్తుంది. పాతదానిని కొత్తదిగా ఎవరు తయారుచేస్తారు? తండ్రి తప్ప ఇంకెవ్వరూ తయారుచేయలేరు. తండ్రియే సంగమములో వచ్చి చదివిస్తారు. తండ్రి సత్యయుగములోనూ రారు, కలియుగములోనూ రారు. తండ్రి అంటారు, నా పాత్రయే సంగమయుగములో ఉంది, అందుకే సంగమయుగాన్ని కళ్యాణకారి యుగమని అంటారు. తండ్రి వచ్చి పిల్లలైన మిమ్మల్ని నరుని నుండి నారాయణునిగా తయారుచేసే ఈ సమయము శుభకరమైనది, చాలా ఉన్నతమైన శుభ సమయము సంగమయుగము. అక్కడ మనుష్యులు మనుష్యులుగానే ఉంటారు కానీ దైవీ గుణాలు కలవారిగా అవుతారు, దానిని ఆది సనాతన దేవీ-దేవతా ధర్మమని అంటారు. తండ్రి అంటారు, నేను ఈ ధర్మాన్ని స్థాపన చేస్తాను, దీని కోసం పవిత్రముగా తప్పకుండా అవ్వవలసి ఉంటుంది. పతిత-పావనుడు ఒక్క తండ్రి మాత్రమే. మిగిలిన వారందరూ వధువులు, భక్తురాళ్ళు. పతిత-పావన సీతారామ్ అని అనడం కూడా కరక్టే. కానీ తర్వాత మళ్ళీ రఘుపతి రాఘవ రాజా రామ్ ఏదైతే అంటారో, అది రాంగ్ అవుతుంది. మనుష్యులు అర్థం తెలియకుండా ఏది తోస్తే అది అంటూ ఉంటారు, అదే జపం చేస్తూ ఉంటారు. చంద్రవంశీ ధర్మము కూడా ఇప్పుడు స్థాపనవుతుందని మీకు తెలుసు. తండ్రి వచ్చి బ్రాహ్మణ కులాన్ని స్థాపన చేస్తారు, దీనిని వంశము అని అనరు. ఇది పరివారము, ఇక్కడ పాండవులకు గాని, కౌరవులకు గాని రాజ్యము ఉండదు. ఎవరైతే గీతను చదివి ఉంటారో, వారికి ఈ విషయాలు త్వరగా అర్థమవుతాయి. ఇది కూడా గీతయే. ఎవరు వినిపిస్తారు? భగవంతుడు. పిల్లలైన మీరు మొట్టమొదట గీతా భగవానుడు ఎవరు అన్న వివరణను ఇవ్వాలి. వారు శ్రీకృష్ణ భగవానువాచ అని అంటారు. వాస్తవానికి శ్రీకృష్ణుడైతే సత్యయుగములో ఉంటారు. వారిలో ఉన్న ఆత్మ అయితే అవినాశీ. శరీరము పేరే మారుతుంది. ఆత్మ పేరు ఎప్పుడూ మారదు. శ్రీకృష్ణుని ఆత్మ యొక్క శరీరము సత్యయుగములోనే ఉంటుంది. నంబరువన్ లోకి వారే వెళ్తారు. లక్ష్మీ-నారాయణులలో నంబర్ వన్, ఆ తర్వాత సెకెండ్, థర్డ్ ఉంటారు. మరి వారి మార్కులు కూడా అంత తక్కువగానే ఉంటాయి. ఇక్కడ మాల తయారవుతుంది కదా. రుండ మాల కూడా ఉంటుంది మరియు రుద్ర మాల కూడా ఉంటుందని తండ్రి అర్థం చేయించారు. విష్ణువు మెడలో రుండ మాలను చూపిస్తారు. పిల్లలైన మీరు నంబరువారుగా విష్ణుపురికి యజమానులుగా అవుతారు. కనుక మీరు విష్ణువు మెడలోని హారము వలె అవుతారు. మొట్టమొదట శివుని మెడలోని హారముగా అవుతారు, దానిని రుద్రమాల అని అంటారు, దానిని జపిస్తారు. మాలను పూజించడం జరగదు, స్మరించడం జరుగుతుంది. ఎవరైతే విష్ణుపురి యొక్క రాజధానిలోకి నంబరువారుగా వస్తారో, వారే మాలలో మణులుగా అవుతారు. మాలలో మొట్టమొదట పుష్పము ఉంటుంది, ఆ తర్వాత జంటపూసలు ఉంటాయి. ప్రవృత్తి మార్గము కదా. ప్రవృత్తి మార్గము బ్రహ్మా, సరస్వతి మరియు పిల్లలతో ప్రారంభమవుతుంది. వీరే మళ్ళీ దేవతలుగా అవుతారు. లక్ష్మీ-నారాయణులు ఫస్ట్. ఆ పైన ఉన్న పుష్పము శివబాబా. మాలను తిప్పుతూ-తిప్పుతూ చివర్లో పుష్పాన్ని కళ్ళకద్దుకుంటారు. శివబాబా పుష్పము, వారు పునర్జన్మలలోకి రారు, వీరిలోకి ప్రవేశిస్తారు. వారే మీకు అర్థం చేయిస్తారు. వీరి ఆత్మ వీరిదే. ఈ ఆత్మ తన శరీర నిర్వహణ చేసుకుంటారు. వారి పని కేవలం జ్ఞానాన్ని ఇవ్వడము. ఉదాహరణకు ఎవరికైనా పత్ని లేక తండ్రి మొదలైనవారు మరణిస్తే, వారి ఆత్మను బ్రాహ్మణుల తనువులోకి పిలుస్తారు. ఒకప్పుడు వచ్చేవారు, అయితే ఆ వచ్చేవారు ఏమీ శరీరాన్ని వదిలి రారు. డ్రామాలో ఇది మొదటి నుండే నిశ్చితమై ఉంది. అదంతా భక్తి మార్గము. ఆ ఆత్మ అయితే వెళ్ళిపోయింది, వెళ్ళి వేరే శరీరాన్ని తీసుకుంది. పిల్లలైన మీకు ఇప్పుడు ఈ జ్ఞానమంతా లభిస్తుంది కావున ఎవరైనా మరణించినా కానీ మీకు చింత ఉండదు. తల్లి మరణించినా కూడా హల్వా తినండి (శాంత బెహన్ వలె). ఆమె వెళ్ళి వారికి అర్థం చేయించారు - ‘మీరెందుకు ఏడుస్తున్నారు, ఆ ఆత్మ వెళ్ళి వేరే శరీరాన్ని తీసుకుంది, ఏడవడం వల్ల తిరిగి రారు. భాగ్యశాలులు ఏడవరు’. ఇలా అక్కడ అందరి చేత ఏడవడం మాన్పించి వాళ్ళకు అర్థం చేయించడం మొదలుపెట్టారు. ఇలా చాలా మంది కుమార్తెలు వెళ్ళి అర్థం చేయిస్తుంటారు - ‘ఇప్పుడు ఇక ఏడవకండి. అసత్యపు బ్రాహ్మణులకు తినిపించవద్దు. మేము సత్యమైన బ్రాహ్మణులను తీసుకువస్తాము’ అని. అప్పుడు వాళ్ళు జ్ఞానము వినడం మొదలుపెడతారు. వీరు సరైన విషయమే చెప్తున్నారని భావిస్తారు. జ్ఞానము వింటూ-వింటూ శాంతిగా అయిపోతారు. కొందరు 7 రోజుల కోసం భాగవతము మొదలైనవి పెట్టుకుంటారు, అయినా కానీ మనుష్యుల దుఃఖము దూరమవ్వదు. ఈ కుమార్తెలైతే అందరి దుఃఖాన్ని దూరము చేస్తారు. ఏడ్వవలసిన అవసరము లేదని మీరు అర్థం చేసుకుంటారు. ఇది తయారై, తయారుచేయబడిన డ్రామా. ప్రతి ఒక్కరూ తమ పాత్రను అభినయించాలి. ఎటువంటి పరిస్థితిలోనూ ఏడవకూడదు. అనంతమైన తండ్రి-టీచర్-గురువు లభించారు, వారి కోసమే మీరు ఎంతగానో కష్టపడుతూ ఉండేవారు. పార బ్రహ్మములో ఉండే పరమపిత పరమాత్మ లభించారు, ఇంకేమి కావాలి. తండ్రి సుఖము యొక్క వారసత్వాన్నే ఇస్తారు. మీరు తండ్రిని మర్చిపోయినప్పుడు ఏడ్వవలసి వస్తుంది. తండ్రిని స్మృతి చేసినట్లయితే సంతోషము కలుగుతుంది. ఓహో! మేము విశ్వానికి యజమానులుగా అవుతాము, ఇక తర్వాత 21 తరాల వరకు ఎప్పుడూ ఏడవము. 21 తరాలంటే పూర్తి వృద్ధాప్యము వరకు ఉంటారు, అకాల మృత్యువులు ఉండవు, కావున లోలోపల ఎంత గుప్తమైన సంతోషముండాలి.

మనము మాయపై విజయము పొంది జగత్ జీతులుగా అవుతామని మీకు తెలుసు. ఆయుధాలు మొదలైనవాటి విషయమేమీ లేదు. మీరు శివశక్తులు. మీ వద్ద జ్ఞాన ఖడ్గము, జ్ఞాన బాణాలు ఉన్నాయి. కానీ వారు భక్తి మార్గములో దేవీలకు స్థూల బాణాలు, ఖడ్గము మొదలైనవి చూపించారు. తండ్రి అంటారు, జ్ఞాన ఖడ్గముతో వికారాలను జయించాలి, అంతేకానీ దేవీలు ఏమీ హింస చేయరు. ఇదంతా భక్తి మార్గము. సాధు-సన్యాసులు మొదలైనవారు నివృత్తి మార్గము వారు, వారు ప్రవృత్తి మార్గాన్ని అసలు అంగీకరించరు. మీరైతే మొత్తం పాత ప్రపంచాన్ని, పాత శరీరాన్ని సన్యసిస్తారు. ఇప్పుడు తండ్రిని స్మృతి చేసినట్లయితే ఆత్మ పవిత్రముగా అవుతుంది. జ్ఞానము యొక్క సంస్కారాలను తీసుకువెళ్తారు. దాని అనుసారముగా కొత్త ప్రపంచములో జన్మ తీసుకుంటారు. ఒకవేళ ఇక్కడ జన్మించినా కూడా, ఏదైనా మంచి ఇంటిలో, రాజు వద్ద లేక ధార్మిక ఇంటిలోకి ఆ సంస్కారాలను తీసుకువెళ్తారు. అందరికీ ప్రియమనిపిస్తారు. వీరైతే దేవీ అని అంటారు. శ్రీకృష్ణుని మహిమను ఎంతగా పాడుతారు. బాల్యములో వెన్న దొంగలించారని, కుండలు పగులకొట్టారని, అలా, ఇలా చేశారని చూపిస్తారు..... ఎన్ని కళంకాలు మోపారు. అచ్ఛా, మరి శ్రీకృష్ణుడిని నల్లగా ఎందుకు చూపించారు? అక్కడైతే శ్రీకృష్ణుడు తెల్లగా ఉంటారు కదా. ఆ తర్వాత శరీరము మారుతూ ఉంటుంది, పేరు కూడా మారుతూ ఉంటుంది. శ్రీకృష్ణుడు సత్యయుగపు మొదటి రాకుమారుడు, వారిని ఎందుకు నల్లగా చూపించారు? ఇది ఎప్పుడూ ఎవ్వరూ చెప్పలేరు. వారిని నల్లగా చూపించేందుకు అక్కడ సర్పాలు మొదలైనవేవీ ఉండవు. ఇక్కడ విషము ఎక్కితే నల్లగా అయిపోతారు. అక్కడైతే అటువంటి విషయమేదీ ఉండదు. మీరు ఇప్పుడు దైవీ సాంప్రదాయులుగా అవ్వబోతున్నారు. ఈ బ్రాహ్మణ సాంప్రదాయము గురించి ఎవ్వరికీ తెలియదు. మొట్టమొదట తండ్రి బ్రహ్మా ద్వారా బ్రాహ్మణులను దత్తత తీసుకుంటారు. ప్రజాపిత ఉన్నారంటే వారి ప్రజలు కూడా లెక్కలేనంత మంది ఉన్నారు. బ్రహ్మా యొక్క పుత్రిక సరస్వతి అని అంటారు. వారు పత్ని కాదు. ఇది ఎవ్వరికీ తెలియదు. ప్రజాపిత బ్రహ్మాది ముఖవంశావళి. పత్ని అనే మాటే లేదు. వీరిలోకి తండ్రి ప్రవేశించి - మీరు నా పిల్లలు అని అంటారు. నేను వీరికి బ్రహ్మా అన్న పేరును పెట్టాను. ఎవరెవరైతే పిల్లలుగా అయ్యారో, అందరి పేర్లు మార్చాను. పిల్లలైన మీరు ఇప్పుడు మాయపై విజయము పొందుతారు, దీనినే గెలుపు-ఓటముల ఆట అని అంటారు. తండ్రి ఎంతటి సులువైన వ్యాపారము చేయిస్తారు. అయినా మాయ ఓడిస్తే పారిపోతారు. 5 వికారాల రూపీ మాయ ఓడిస్తుంది. ఎవరిలోనైతే 5 వికారాలు ఉన్నాయో, వారినే ఆసురీ సాంప్రదాయులు అని అంటారు. మందిరాలలో దేవీల ఎదురుగా కూడా వెళ్ళి - మీరు సర్వగుణ సంపన్నులు... అని మహిమను పాడుతారు. తండ్రి పిల్లలైన మీకు అర్థం చేయిస్తున్నారు, మీరే పూజ్య దేవతలుగా ఉండేవారు, మళ్ళీ 63 జన్మలు పూజారులుగా అయ్యారు, ఇప్పుడు మళ్ళీ పూజ్యులుగా అవుతారు. తండ్రి పూజ్యులుగా తయారుచేస్తారు, రావణుడు పూజారులుగా తయారుచేస్తాడు. ఈ విషయాలేవీ శాస్త్రాలలో లేవు. తండ్రి ఏమీ శాస్త్రాలు చదవలేదు. వారు ఉన్నదే జ్ఞానసాగరుడిగా. వారు వరల్డ్ ఆల్మైటీ అథారిటీ. ఆల్మైటీ అనగా సర్వశక్తివంతుడు. తండ్రి అంటారు, వేద-శాస్త్రాలు మొదలైనవాటన్నిటి గురించి నాకు తెలుసు. అదంతా భక్తి మార్గపు సామగ్రి. నాకు ఈ విషయాలన్నిటి గురించి తెలుసు. ద్వాపరము నుండే మీరు పూజారులుగా అవుతారు. సత్య, త్రేతాయుగాలలోనైతే పూజలు ఉండవు. అది పూజ్య వంశము. ఆ తర్వాత పూజారుల వంశము ఉంటుంది. ఈ సమయములో అందరూ పూజారులు. ఈ విషయాల గురించి ఎవ్వరికీ తెలియదు. తండ్రియే వచ్చి 84 జన్మల కథను తెలియజేస్తారు. పూజ్యులు, పూజారులు అయిన మీపైనే ఈ ఆటంతా నడుస్తుంది. హిందూ ధర్మమని అంటారు. వాస్తవానికైతే భారత్ లో ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము ఉండేది, అంతేకానీ హిందూ ధర్మము కాదు. ఎన్ని విషయాలను అర్థం చేయించవలసి వస్తుంది. ఈ చదువు ఒక్క సెకెండ్ కు సంబంధించినది. అయినా కానీ ఎంత సమయము పడుతుంది. సాగరాన్ని సిరాగా చేసి, అడవినంతా కలముగా చేసినా కూడా ఈ జ్ఞానము అంతమవ్వదు అని అంటారు. అంతిమము వరకు మీకు జ్ఞానాన్ని వినిపిస్తూ ఉంటాను. దీనికి సంబంధించిన పుస్తకాలను మీరు ఎన్ని తయారుచేస్తారు. ప్రారంభములో కూడా బాబా ఉదయముదయమే లేచి వ్రాసేవారు, ఆ తర్వాత మమ్మా వినిపించేవారు, అప్పటి నుండి మొదలుకొని ముద్రించడం జరుగుతుంది. ఎన్ని కాగితాలను ఉపయోగించి ఉంటారు. గీత అయితే చాలా చిన్నది. గీత యొక్క లాకెట్ ను కూడా తయారుచేసుకుంటారు. గీతకు చాలా ప్రభావముంది, కానీ గీతా జ్ఞాన దాతను మర్చిపోయారు. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. జ్ఞాన ఖడ్గముతో వికారాలను జయించాలి. జ్ఞాన సంస్కారాలను నింపుకోవాలి. పాత ప్రపంచాన్ని మరియు పాత శరీరాన్ని సన్యసించాలి.

2. భాగ్యవంతులుగా అవుతున్నామనే సంతోషములో ఉండాలి, ఏ విషయములోనూ చింతించకూడదు. ఎవరైనా శరీరము విడిచిపెట్టినా కూడా దుఃఖము యొక్క కన్నీరు రాకూడదు.

వరదానము:-
కంట్రోలింగ్ పవర్ ద్వారా ఒక్క సెకండ్ యొక్క పరీక్షలో పాస్ అయ్యే పాస్ విత్ ఆనర్ భవ

ఇప్పుడిప్పుడే శరీరములోకి రావాలి మరియు ఇప్పుడిప్పుడే శరీరము నుండి అతీతమై అవ్యక్త స్థితిలో స్థితులవ్వాలి. ఎంతగా హంగామా ఉంటుందో, అంతగా స్వయము యొక్క స్థితి అతి శాంతిగా ఉండాలి. దీని కోసము సర్దుబాటు శక్తి కావాలి. ఒక్క సెకండ్ లో విస్తారము నుండి సారములోకి వెళ్ళిపోవాలి మరియు ఒక్క సెకండ్ లో సారము నుండి విస్తారములోకి రావాలి, ఇటువంటి కంట్రోలింగ్ పవర్ కలవారే విశ్వాన్ని కంట్రోల్ చెయ్యగలరు మరియు ఈ అభ్యాసమే అంతిమములో వచ్చే ఒక్క సెకండ్ యొక్క పరీక్షలో పాస్ విత్ ఆనర్ గా చేస్తుంది.

స్లోగన్:-
వానప్రస్థ స్థితిని అనుభవము చెయ్యండి మరియు చేయించండి, అప్పుడు బాల్యపు ఆటలు సమాప్తమైపోతాయి.

అవ్యక్త సూచనలు - అశరీరి మరియు విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచండి

విదేహీగా అవ్వటములో ‘‘హే అర్జున్’’ గా అవ్వండి. అర్జునుడి విశేషత ఏమిటంటే - సదా బిందువైన బాబా యొక్క స్మృతిలో, స్మృతి స్వరూపునిగా అయ్యి విజయునిగా అయ్యారు. ఇటువంటి నష్టోమోహా స్మృతి స్వరూపులుగా అయ్యే అర్జునుడిగా, సదా గీతా జ్ఞానాన్ని వినే మరియు మననము చేసే అర్జునుడిగా, విదేహీగా, జీవిస్తూ ఉండగా అందరూ మరణించి ఉన్నారు అనే అనంతమైన వైరాగ్య వృత్తి కల అర్జునుడిగా అవ్వండి.