10-05-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - జ్ఞాన పాయింట్లను స్మృతిలో ఉంచుకున్నట్లయితే సంతోషము ఉంటుంది, మీరు ఇప్పుడు స్వర్గము యొక్క గేట్ వద్ద నిలబడి ఉన్నారు, బాబా ముక్తి-జీవన్ముక్తుల మార్గాన్ని చూపిస్తున్నారు’’

ప్రశ్న:-
తమ రిజిస్టర్ ను సరిగ్గా ఉంచుకునేందుకు ఏ అటెన్షన్ ను తప్పకుండా ఉంచాలి?

జవాబు:-
మనసా-వాచా-కర్మణా ఎవ్వరికీ దుఃఖమైతే ఇవ్వలేదు కదా అన్న అటెన్షన్ ఉండాలి. తమ స్వభావము చాలా ఫస్ట్ క్లాస్ గా, మధురముగా ఉండాలి. మాయ ముక్కు-చెవులు పట్టుకుని, ఎవరికైనా దుఃఖాన్ని కలిగించేటువంటి కర్మలేవీ చేయించకూడదు. ఒకవేళ దుఃఖము ఇచ్చినట్లయితే చాలా పశ్చాత్తాపపడవలసి వస్తుంది. రిజిస్టర్ పాడైపోతుంది.

పాట:-
నయనహీనునికి మార్గాన్ని చూపించండి ప్రభూ...

ఓంశాంతి
తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. చాలా సహజమైన మార్గము గురించి తెలియజేస్తున్నారు, అయినా కానీ పిల్లలు ఇబ్బందులు ఎదుర్కుంటూ ఉంటారు. ఇక్కడ కూర్చున్నప్పుడు ఏమని భావిస్తారంటే - మమ్మల్ని తండ్రి చదివిస్తున్నారు, శాంతిధామానికి వెళ్ళేందుకు దారిని తెలియజేస్తున్నారు. ఇది చాలా సహజము. తండ్రి అంటారు, రాత్రింబవళ్ళు ఎంత వీలైతే అంత స్మృతిలో ఉండండి. ఆ భక్తి మార్గపు యాత్రను కాలినడకన చేస్తారు. ఎన్నో ఎదురుదెబ్బలు తినవలసి వస్తుంది. ఇక్కడ మీరు కూర్చుని కూడా స్మృతియాత్రలో ఉన్నారు. తండ్రి ఇది కూడా అర్థం చేయించారు - దైవీ గుణాలను ధారణ చేయాలి, ఆసురీ అవగుణాలను సమాప్తము చేస్తూ వెళ్ళండి. ఏ విధమైన ఆసురీ కర్మలు చేయకండి, దాని వలన వికర్మలు తయారవుతాయి. తండ్రి వచ్చిందే పిల్లలైన మిమ్మల్ని సదా సుఖవంతులుగా తయారుచేయడానికి. చక్రవర్తి కొడుకు తన తండ్రిని మరియు రాజ్యాన్ని చూసుకుని సంతోషిస్తాడు కదా. కానీ రాజ్యము ఉన్నా సరే శారీరక రోగాలు మొదలైనవైతే ఉంటూనే ఉంటాయి. ఇక్కడ పిల్లలైన మీకు నిశ్చయము ఉంది - శివబాబా వచ్చి ఉన్నారు, వారు మనల్ని చదివిస్తున్నారు, ఆ తర్వాత మనము స్వర్గములోకి వెళ్ళి రాజ్యము చేస్తాము కానీ అక్కడ ఏ విధమైన దుఃఖము ఉండదు. మీ బుద్ధిలో రచయిత మరియు రచనల ఆదిమధ్యాంత జ్ఞానము ఉంది. ఈ జ్ఞానము ఇతర మనుష్యమాత్రులెవ్వరి బుద్ధిలోనూ లేదు. ఇంతకుముందు మాలో ఈ జ్ఞానము లేదు, తండ్రి గురించి అప్పుడు మాకు తెలియదు అని పిల్లలైన మీరు కూడా ఇప్పుడు భావిస్తారు. మనుష్యులు భక్తిని చాలా ఉత్తమముగా భావిస్తారు, అనేక రకాల భక్తిని చేస్తారు. అందులో ఉన్నవన్నీ స్థూలమైన విషయాలే, సూక్ష్మమైన విషయాలేవీ లేవు. ఇప్పుడు అమరనాథ్ యాత్రకు స్థూలముగానే వెళ్తారు కదా. అక్కడ కూడా ఆ లింగమే ఉంది. తాము ఎవరి వద్దకు వెళ్తున్నారు అనేది మనుష్యులకు ఏ మాత్రమూ తెలియదు. ఇప్పుడు పిల్లలైన మీరు ఎదురుదెబ్బలు తినేందుకు ఎక్కడికీ వెళ్ళరు. మనము కొత్త ప్రపంచము కొరకే చదువుతున్నామని మీకు తెలుసు. అక్కడ ఈ వేద-శాస్త్రాలు మొదలైనవేవీ ఉండవు. సత్యయుగములో భక్తి ఉండదు. అక్కడ ఉండేదే సుఖము. ఎక్కడైతే భక్తి ఉంటుందో, అక్కడ దుఃఖము ఉంటుంది. ఈ సృష్టి చక్ర చిత్రము చాలా బాగుంది. స్వర్గము యొక్క గేట్ ఇందులో చాలా స్పష్టముగా ఉంది. ఇది బుద్ధిలో ఉండాలి. ఇప్పుడు మనము స్వర్గము యొక్క గేట్ వద్ద కూర్చున్నాము. ఎంతో సంతోషము ఉండాలి. జ్ఞాన పాయింట్లను గుర్తు చేసుకుంటూ పిల్లలైన మీరు చాలా సంతోషముగా ఉండవచ్చు. ఇప్పుడు మనము స్వర్గము యొక్క గేట్ వద్దకు వెళ్తున్నామని మీకు తెలుసు. అక్కడ చాలా తక్కువమంది మనుష్యులు ఉంటారు. ఇక్కడ ఎంతమంది మనుష్యులు ఉన్నారు. ఎన్ని ఎదురుదెబ్బలు తింటూ ఉంటారు. దానపుణ్యాలు చేయడము, సాధువుల వెనుక భ్రమించడము ఎంతగా జరుగుతుంది, అయినా కానీ - ఓ ప్రభు, నయనహీనుడికి దారి చూపించండి... అని పిలుస్తూ ఉంటారు. ఎల్లప్పుడూ ముక్తి మరియు జీవన్ముక్తుల మార్గమును తెలుసుకోవాలనే కోరుకుంటారు. ఇది పాత దుఃఖమయ ప్రపంచము, ఇది కూడా మీకే తెలుసు. దీని గురించి మనుష్యులకు తెలియనే తెలియదు. కలియుగ ఆయువును వేల సంవత్సరాలు అని అంటారు, మరి పాపం వారు అంధకారములో ఉన్నట్లు కదా. తప్పకుండా మన బాబా మనకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు అన్న విషయము తెలిసినవారు మీలో కూడా నంబరువారుగానే ఉన్నారు. బ్యారిస్టరీ యోగము, ఇంజనీరింగ్ యోగము ఉంటాయి కదా. చదువుకునేవారికి చదివించే టీచర్ స్మృతే ఉంటుంది. బ్యారిస్టరీ జ్ఞానము ద్వారా మనుష్యులు బ్యారిస్టరులుగా అవుతారు. ఇది రాజయోగము. మన బుద్ధియోగము పరమపిత పరమాత్మతో జోడించబడి ఉంది. ఇందులో సంతోషము యొక్క పాదరసము పూర్తిగా పైకి ఎక్కిపోవాలి. చాలా మధురముగా తయారవ్వాలి. స్వభావము చాలా ఫస్ట్ క్లాస్ గా ఉండాలి. ఎవ్వరికీ దుఃఖము కలగకూడదు. ఎవరికీ దుఃఖము ఇవ్వకూడదు అని కోరుకుంటారు కూడా. అయినా కానీ మాయ ముక్కు, చెవులు పట్టుకుని పొరపాటు చేయించేస్తుంది. అప్పుడు, నేను అనవసరముగా వారికి దుఃఖమునిచ్చానే అని లోలోపల పశ్చాత్తాపపడతారు. కానీ అప్పటికి రిజిస్టరులోనైతే మచ్చ పడిపోయింది కదా. మనసా, వాచా, కర్మణా ఎవ్వరికీ దుఃఖమునివ్వకూడదు అని ఈ విధమైన ప్రయత్నము చేస్తూ ఉండాలి. తండ్రి మనల్ని ఈ విధముగా దేవతలుగా తయారుచేసేందుకే వస్తారు. దేవతలు ఎప్పుడైనా ఎవరికైనా దుఃఖమునిస్తారా! లౌకిక టీచరు కూడా చదివిస్తారు, అంతేకానీ దుఃఖమునైతే ఇవ్వరు కదా. అయితే, ఒకవేళ పిల్లలు చదవకపోతే ఏదో ఒక శిక్ష ఇస్తారు. ఈ రోజుల్లో పిల్లలను కొట్టడానికి కూడా అనుమతి ఇవ్వడం లేదు. మీరు ఆత్మిక టీచర్లు, మీ పని చదివించడము మరియు దానితో పాటు మ్యానర్స్ నేర్పించడము. బాగా చదువుకుంటే ఉన్నత పదవిని పొందుతారు. చదువుకోకపోతే స్వయమే ఫెయిల్ అవుతారు. ఈ తండ్రి కూడా రోజూ వచ్చి చదివిస్తారు, మ్యానర్స్ ను నేర్పిస్తారు. నేర్పించేందుకు ప్రదర్శనీ మొదలైనవి ఏర్పాటు చేస్తారు. అందరూ ప్రదర్శనీలు మరియు ప్రొజెక్టర్లు కావాలని అంటారు. ప్రొజెక్టర్లు కూడా కొన్ని వేలలో తీసుకుంటారు. ప్రతి విషయాన్ని తండ్రి చాలా సహజము చేసి అర్థం చేయిస్తారు. అమరనాథ్ లో కూడా సేవ చేయడము సహజమే. జ్ఞానము మరియు భక్తి అంటే ఏమిటి అనేది మీరు చిత్రాలపై కూడా అర్థం చేయించవచ్చు. జ్ఞానము ఇటువైపు, భక్తి అటువైపు. జ్ఞానము ద్వారా స్వర్గము, భక్తి ద్వారా నరకము, ఇది చాలా స్పష్టముగా ఉంది. పిల్లలైన మీరు ఇప్పుడు ఏదైతే చదువుతున్నారో, ఇది చాలా సహజము. ఇతరులను బాగా చదివిస్తారు కూడా, కానీ స్మృతియాత్ర ఎక్కడ చేస్తున్నారు. ఇదంతా బుద్ధి విషయము. మనము తండ్రిని స్మృతి చేయాలి, ఇందులోనే మాయ ఇబ్బంది పెడుతుంది. ఒక్కసారిగా యోగాన్ని తెంచేస్తుంది. తండ్రి అంటారు, మీరందరూ యోగములో చాలా బలహీనముగా ఉన్నారు. మంచి-మంచి మహారథులు కూడా చాలా బలహీనముగా ఉన్నారు. వీరిలో ఈ జ్ఞానము చాలా బాగుంది, అందుకే వీరు మహారథులు అని భావిస్తారు. కానీ బాబా అంటారు, వారు గుర్రపు స్వారీవారు మరియు పాదచారులు. మహారథులు ఎవరంటే, ఎవరైతే స్మృతిలో ఉంటారో వారు. లేస్తూ-కూర్చుంటూ స్మృతిలో ఉన్నట్లయితే వికర్మలు వినాశనమవుతాయి, పావనముగా అవుతారు. లేకపోతే శిక్షలు కూడా అనుభవించవలసి ఉంటుంది మరియు పదవి కూడా భ్రష్టమైపోతుంది, అందుకే మీ చార్టు పెట్టుకున్నట్లయితే మీకు తెలుస్తుంది. బాబా స్వయం చెప్తున్నారు, నేను కూడా పురుషార్థము చేస్తాను. ఘడియ-ఘడియ బుద్ధి ఇతర వైపులకు వెళ్ళిపోతూ ఉంటుంది. బాబాకైతే ఎన్నో చింతలు ఉంటాయి కదా. మీరు వేగముగా వెళ్ళగలుగుతారు. దానితోపాటు మీ నడవడికను కూడా తీర్చిదిద్దుకోవాలి. పవిత్రముగా అయి మళ్ళీ వికారాలలోకి వెళ్ళినట్లయితే చేసుకున్న సంపాదనంతా సమాప్తమైపోతుంది. ఎవరి పైనైనా క్రోధము చేసినట్లయితే, ఉప్పునీరులా అయినట్లయితే అసురులుగా అయిపోతారు. అనేక రకాల మాయ వస్తూ ఉంటుంది. ఎవ్వరూ సంపూర్ణమవ్వలేదు. బాబా పురుషార్థము చేయిస్తూ ఉంటారు. కుమారీలకైతే ఇది చాలా సహజము, ఈ విషయములో కేవలము స్వయం దృఢముగా ఉండాలి. ఆంతరిక సత్యత కావాలి. ఒకవేళ లోలోపల ఎవరి పైనైనా మనసు కలిగి ఉంటే ఇక నడవలేరు. కుమారీలు మరియు మాతలు అయితే భారత్ ను స్వర్గముగా తయారుచేసే సేవలో నిమగ్నమైపోవాలి. ఇందులో శ్రమించవలసి ఉంటుంది. కష్టపడకుండా ఏదీ లభించదు. మీకు 21 జన్మల కొరకు రాజ్యము లభిస్తుంటే, మరి ఎంతగా కష్టపడాలి. ఈ చదువులో పక్కాగా అయ్యేంతవరకు ఆ చదువును కూడా బాబా చదువుకోనిస్తారు, ఎందుకంటే మళ్ళీ ఈ రెండు లోకాలలో ఎటూ చెందనివారిగా అవ్వకూడదు. ఎవరి నామ-రూపాల్లోనైనా చిక్కుకుని వేలాడుతూ ఉంటే అంతమైపోతారు.

అదృష్టవంతులైన పిల్లలే శరీర భానాన్ని మరచి స్వయాన్ని అశరీరిగా భావిస్తూ తండ్రిని స్మృతి చేసే పురుషార్థము చేస్తారు. తండ్రి ప్రతిరోజూ అర్థం చేయిస్తూ ఉంటారు - పిల్లలూ, మీరు శరీర భానాన్ని వదిలేయండి. అశరీరీ ఆత్మలైన మనము ఇప్పుడు ఇంటికి వెళ్తాము, ఈ శరీరాన్ని ఇక్కడే వదిలేయాలి. ఎప్పుడైతే నిరంతరము తండ్రి స్మృతిలో ఉంటూ కర్మాతీతముగా అవుతారో, అప్పుడే శరీరాన్ని వదులుతారు. ఇది బుద్ధికి సంబంధించిన విషయము. కానీ ఎవరి భాగ్యములోనైనా లేకపోతే ఇక పురుషార్థము ఏం చేస్తారు. బుద్ధిలో ఉండాలి - నేను అశరీరిగా వచ్చాను, ఆ తర్వాత సుఖపు కర్మ సంబంధములో బంధించబడ్డాను, మళ్ళీ తర్వాత రావణ రాజ్యములో వికారీ బంధనాలలో చిక్కుకున్నాను. ఇప్పుడు మళ్ళీ తండ్రి అంటారు, అశరీరిగా అయి వెళ్ళాలి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్ను స్మృతి చేయండి. ఆత్మయే పతితముగా అయ్యింది. ఓ పతిత- పావనా రండి అని ఆత్మ అంటుంది. ఇప్పుడు మీకు పతితుల నుండి పావనులుగా అయ్యే యుక్తిని కూడా తెలియజేస్తూ ఉంటారు. ఆత్మ ఉన్నదే అవినాశీ. ఆత్మ అయిన నీవు ఇక్కడకు ఈ శరీరములోకి పాత్రను అభినయించడానికి వచ్చావు. ఇది కూడా ఇప్పుడు తండ్రి అర్థం చేయించారు. ఎవరికైతే కల్పపూర్వము అర్థం చేయించారో, వారే వస్తూ ఉంటారు. ఇప్పుడు తండ్రి అంటారు, కలియుగీ సంబంధాలను మర్చిపోండి. ఇప్పుడు ఇక తిరిగి వెళ్ళాలి, ఈ ప్రపంచమే సమాప్తమవ్వనున్నది. ఇందులో సారము ఏ మాత్రము లేదు, అందుకే ఎదురుదెబ్బలు తింటూ ఉంటారు. భగవంతుడిని కలుసుకునేందుకని భక్తి చేస్తారు. భక్తి చాలా మంచిదని, చాలా భక్తి చేసినట్లయితే భగవంతుడు లభిస్తారు మరియు సద్గతిలోకి తీసుకువెళ్తారని భావిస్తారు. ఇప్పుడు మీ భక్తి పూర్తి అవుతుంది. మీ నోటి నుండి ‘ఓ రామా’, ‘ఓ భగవంతుడా’ అనే ఈ భక్తికి సంబంధించిన పదాలు కూడా వెలువడకూడదు. ఇవన్నీ సమాప్తమైపోవాలి. తండ్రి కేవలం - నన్నొక్కరినే స్మృతి చేయండి అని అంటారు. ఈ ప్రపంచమే తమోప్రధానమైనది. సతోప్రధానమైనవారు సత్యయుగములో ఉంటారు. సత్యయుగము ఎక్కే కళ, ఆ తర్వాత దిగే కళ ఉంటుంది. త్రేతాను కూడా వాస్తవానికి స్వర్గము అని అనరు. స్వర్గము అని కేవలం సత్యయుగాన్ని మాత్రమే అనడం జరుగుతుంది. పిల్లలైన మీ బుద్ధిలో ఆదిమధ్యాంతాల జ్ఞానము ఉంది. ఆది అనగా ప్రారంభము, మధ్యమము అంటే సగము, ఆ తర్వాత అంతిమము. మధ్యలో రావణ రాజ్యము ప్రారంభమవుతుంది. తండ్రి భారత్ లోకే వస్తారు. భారత్ యే పతితముగా మరియు పావనముగా అవుతుంది. 84 జన్మలు కూడా భారతవాసులే తీసుకుంటారు. ఇక మిగిలిన ధర్మాలవారు నంబరువారుగా వస్తారు. వృక్షము వృద్ధి పొందుతూ ఉంటుంది, తిరిగి ఆ సమయములోనే వస్తారు. ఈ విషయాలు ఇంకెవ్వరి బుద్ధిలోనూ ఉండవు. మీలో కూడా అందరూ ధారణ చేయలేరు. ఈ 84 జన్మల చక్రము బుద్ధిలో ఉన్నా సరే సంతోషము ఉంటుంది. ఇప్పుడు బాబా మనల్ని తీసుకువెళ్ళేందుకు వచ్చి ఉన్నారు. సత్యాతి, సత్యమైన ప్రియుడు వచ్చి ఉన్నారు. ఎవరినైతే మనము భక్తి మార్గములో ఎంతో స్మృతి చేసేవారమో, వారు ఇప్పుడు ఆత్మలైన మనల్ని తనతోపాటు తిరిగి తీసుకువెళ్ళేందుకు వచ్చారు. శాంతి అని దేనినంటారో కూడా మనుష్యమాత్రులకు తెలియదు. ఆత్మ ఉన్నదే శాంతి స్వరూపము. ఈ ఇంద్రియాలు లభిస్తాయి కావున కర్మలు చేయవలసి ఉంటుంది. శాంతిసాగరుడైన తండ్రి అందరినీ తీసుకువెళ్తారు. అప్పుడే అందరికీ శాంతి లభిస్తుంది. సత్యయుగములో మీకు శాంతి కూడా ఉంది, సుఖము కూడా ఉంది. మిగిలిన ఆత్మలన్నీ శాంతిధామానికి వెళ్ళిపోతాయి. తండ్రినే శాంతిసాగరుడు అని అంటారు. ఈ విషయాన్ని కూడా చాలామంది పిల్లలు మర్చిపోతారు, ఎందుకంటే దేహాభిమానములో ఉంటారు, దేహీ-అభిమానులుగా అవ్వరు. తండ్రి శాంతిని అయితే అందరికీ ఇస్తారు కదా. చిత్రములో సంగమము వద్దకు వెళ్ళి వారికి చూపించండి. ఈ సమయములో అందరూ అశాంతిగా ఉన్నారు. సత్యయుగములోనైతే ఇన్ని ధర్మాలు ఉండనే ఉండవు. అందరూ శాంతిలోకి వెళ్ళిపోతారు. అక్కడ హృదయము నిండుగా శాంతి లభిస్తుంది. మీకు రాజ్యములో శాంతి కూడా ఉంటుంది, సుఖము కూడా ఉంటుంది. సత్యయుగములో పవిత్రత, సుఖము, శాంతి మీకు అన్నీ ఉన్నాయి. స్వీట్ హోమ్ ను ముక్తిధామము అని అంటారు. అక్కడ పతితులు, దుఃఖితులు ఉండరు. సుఖ-దుఃఖాల మాటే ఉండదు. మనుష్యులు శాంతి అర్థాన్ని అర్థం చేసుకోరు. రాణి కంఠహారము యొక్క ఉదాహరణను ఇస్తారు కదా. ఇప్పుడు తండ్రి అంటారు, శాంతి, సుఖము అన్నీ తీసుకోండి. ఆయుష్మాన్ భవ... అక్కడ పిల్లలు కూడా నియమానుసారముగానే జన్మిస్తారు. పిల్లలు జన్మించాలని అక్కడ ఏ పురుషార్థము చేయవలసిన అవసరముండదు. శరీరము వదిలే సమయము ఆసన్నమైనప్పుడు సాక్షాత్కారమవుతుంది మరియు శరీరాన్ని సంతోషముగా వదిలేస్తారు. బాబాకు సంతోషము ఉంటుంది కదా - శరీరాన్ని వదిలి నేను ఈ విధముగా అవుతాను, ఇప్పుడు నేను చదువుకుంటున్నాను. మీరు సత్యయుగములోకి వెళ్తారని మీకు కూడా తెలుసు. సంగమములోనే మీ బుద్ధిలో ఈ విషయము ఉంటుంది. మరి ఎంత సంతోషము ఉండాలి. చదువు ఎంత ఉన్నతముగా ఉంటుందో సంతోషము అంత ఉంటుంది. మనల్ని భగవంతుడు చదివిస్తున్నారు. లక్ష్యము-ఉద్దేశ్యము ఎదురుగా ఉంది కావున ఎంత సంతోషము ఉండాలి. కానీ నడుస్తూ-నడుస్తూ కింద పడిపోతారు.

కుమారీలు ఎప్పుడైతే మైదానములోకి వస్తారో అప్పుడే మీ సేవ వృద్ధి పొందుతుంది. తండ్రి అంటారు, పరస్పరము ఉప్పునీరులా అవ్వకండి. పులి, మేక రెండూ ఒకే చోట కలిసి నీరు తాగే ప్రపంచములోకి మనం వెళ్తున్నామని మీకు తెలుసు, అక్కడైతే ప్రతి వస్తువును చూడడంతోనే హృదయము సంతోషపడిపోతుంది. దాని పేరే స్వర్గము. కనుక కుమారీలు లౌకిక తల్లిదండ్రులకు చెప్పాలి - ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాము. పవిత్రముగా అయితే తప్పకుండా అవ్వాలి. తండ్రి అంటారు, కామము మహాశత్రువు. ఇప్పుడు నేను యోగినిగా అయ్యాను, అందుకే నేను పతితముగా అవ్వలేను. ఇలా మాట్లాడేందుకు దృఢత మరియు ధైర్యము కావాలి. ఇటువంటి కుమారీలు ఎప్పుడైతే వెలువడుతారో, అప్పుడు సేవ ఎంత త్వరగా జరుగుతుందో చూడండి. కానీ నష్టోమోహులుగా ఉండాలి. ఒక్కసారి మరణిస్తే ఇక వారి స్మృతి ఎందుకు రావాలి? కానీ చాలామందికి తమ ఇల్లు, తమ పిల్లలు మొదలైనవారు గుర్తుకొస్తూ ఉంటారు. మరి తండ్రితో యోగము ఎలా జోడించబడుతుంది. ఇక్కడ - మేము బాబాకు చెందినవారము అన్న విషయమే బుద్ధిలో ఉండాలి. ఈ పాత ప్రపంచము ఇక వినాశనమైపోతున్నట్లే. తండ్రి అంటారు, నన్ను స్మృతి చేయండి. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. తమ భాగ్యాన్ని ఉన్నతముగా తయారుచేసుకునేందుకు ఎంత వీలైతే అంత - అశరీరిగా అయ్యే అభ్యాసము చేయాలి. శరీర భానాన్ని పూర్తిగా మర్చిపోవాలి, ఎవరి నామ-రూపాలూ గుర్తుకు రాకూడదు - ఈ విషయములో కృషి చేయాలి.

2. తమ నడవడిక యొక్క చార్ట్ ను పెట్టుకోవాలి - ఎప్పుడూ కూడా ఆసురీ నడవడిక నడవకూడదు. హృదయము యొక్క సత్యతతో నష్టోమోహులుగా అయి భారత్ ను స్వర్గముగా తయారుచేసే సేవలో నిమగ్నమవ్వాలి.

వరదానము:-
మాయ యొక్క రాయల్ రూపపు బంధనాల నుండి ముక్తులుగా, విశ్వజీత్, జగత్ జీత్ భవ

నా పురుషార్థము, నా ఇన్వెన్షన్, నా సేవ, నా టచింగ్, నా గుణాలు బాగుంటాయి, నా నిర్ణయ శక్తి చాలా బాగుంటుంది, ఈ నాది అన్న భావమే మాయ యొక్క రాయల్ రూపము. మాయ ఎటువంటి ఇంద్రజాలపు మంత్రము వేస్తుందంటే - అది ‘నీది’ అన్నదానిని కూడా ‘నాది’ లోకి మార్చేస్తుంది, అందుకే ఇప్పుడు ఇటువంటి అనేక బంధనాల నుండి ముక్తులుగా అయి ఒక్క తండ్రి సంబంధములోకి వచ్చినట్లయితే మాయాజీతులుగా అవుతారు. మాయాజీతులే ప్రకృతిజీతులుగా, విశ్వజీతులుగా మరియు జగత్ జీతులుగా అవుతారు. అటువంటివారే ఒక్క క్షణము యొక్క అశరీరి భవ అన్న డైరెక్షన్ ను సహజముగా మరియు స్వతహాగా కార్యములోకి తీసుకురాగలరు.

స్లోగన్:-
ఎవరైతే ఎవరి నెగెటివ్ ను అయినా పాజిటివ్ లోకి మారుస్తారో, వారే విశ్వ పరివర్తకులు.

అవ్యక్త సూచనలు: ఆత్మిక రాయల్టీని మరియు పవిత్రత యొక్క పర్సనాలిటీని ధారణ చెయ్యండి

మీ స్వ-స్వరూపము పవిత్రత, స్వధర్మము అనగా ఆత్మ యొక్క మొదటి ధారణ పవిత్రత. స్వదేశము పవిత్ర దేశము. స్వరాజ్యము పవిత్ర రాజ్యము. స్వయము యొక్క స్మృతి చిహ్నము పరమ పవిత్ర పూజ్య స్వరూపము. కర్మేంద్రియాల అనాది స్వభావము సుకర్మలు, కేవలం ఇదే సదా స్మృతిలో ఉంచుకున్నట్లయితే శ్రమ నుండి మరియు హఠము నుండి విముక్తులవుతారు. పవిత్రతను వరదానము రూపములో ధారణ చేస్తారు.