11-06-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - ఇప్పుడు మీరు అనంతమైన పవిత్రతను ధారణ చేయాలి, అనంతమైన పవిత్రత అనగా ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ గుర్తుకు రాకూడదు’’

ప్రశ్న:-
తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునే ముందు చేసిన పురుషార్థానికి మరియు తీసుకున్న తర్వాత ఉండే స్థితికి మధ్యన తేడా ఏమిటి?

జవాబు:-
ఎప్పుడైతే మీరు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటారో, అప్పుడు దేహ సంబంధాలన్నింటినీ వదిలి ఒక్క తండ్రినే స్మృతి చేసే పురుషార్థం చేస్తారు మరియు ఎప్పుడైతే వారసత్వం లభిస్తుందో, అప్పుడిక తండ్రినే మర్చిపోతారు. ఇప్పుడు వారసత్వము తీసుకోవాలి కావున ఎవరితోనూ కొత్త సంబంధాన్ని జోడించకూడదు. లేకపోతే మర్చిపోవడం కష్టమవుతుంది. అన్నింటినీ మరచి ఒక్కరినే స్మృతి చేయండి, అప్పుడు వారసత్వం లభిస్తుంది.

పాట:-
ఈ సమయం వెళ్ళిపోతుంది...

ఓంశాంతి
మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలకు తండ్రి అర్థం చేయిస్తున్నారు - జ్ఞానులు మరియు అజ్ఞానులు అని ఎవరెవరిని అంటారు, ఇది కేవలం బ్రాహ్మణులైన మీకు మాత్రమే తెలుసు. జ్ఞానమంటే చదువు, దీని ద్వారా మనం ఆత్మలమని, వారు పరమపిత పరమాత్మ అని మీరు తెలుసుకున్నారు. మీరు ఎప్పుడైతే అక్కడి నుండి మధుబన్ కు వస్తారో, అప్పుడు తప్పకుండా స్వయాన్ని ఆత్మగా భావిస్తారు. మేము మా తండ్రి వద్దకు వెళ్తున్నాము అని భావిస్తారు. బాబా అని శివబాబాను అంటారు, శివబాబా ప్రజాపిత బ్రహ్మా తనువులో ఉన్నారు. వారు కూడా తండ్రే అవుతారు. మీరు ఇంటి నుండి బయలుదేరినప్పుడు, మేము బాప్ దాదా వద్దకు వెళ్తున్నాము అని భావిస్తారు. మీరు ఉత్తరంలో కూడా ‘బాప్ దాదా’ అని వ్రాస్తారు, శివబాబా మరియు బ్రహ్మాదాదా. మనం బాబా వద్దకు వెళ్తాము. బాబా కల్పకల్పము మనల్ని కలుస్తారు. బాబా అనంతముగా పవిత్రముగా చేసి మనకు అనంతమైన వారసత్వాన్ని అందిస్తారు. పవిత్రతలో హద్దు మరియు అనంతము ఉన్నాయి. మీరు అనంతమైన పవిత్రముగా, సతోప్రధానముగా అయ్యేందుకు పురుషార్థం చేస్తారు. నంబరువారుగా తప్పకుండా ఉంటారు. అనంతమైన పవిత్రము అనగా ఒక్క అనంతమైన తండ్రి తప్ప ఇంకెవ్వరి స్మృతి రాకూడదు. ఆ బాబా చాలా మధురమైనవారు. వారు ఉన్నతోన్నతుడైన భగవంతుడు మరియు అనంతమైన తండ్రి. వారు అందరికీ తండ్రి. వారిని పిల్లలైన మీరే గుర్తించారు. అనంతమైన తండ్రి సదా భారత్ లోనే వస్తారు. వారు వచ్చి అనంతమైన సన్యాసాన్ని చేయిస్తారు. సన్యాసము కూడా ముఖ్యమైనదే కదా, దానిని వైరాగ్యము అని అంటారు. తండ్రి మొత్తం పాత ఛీ-ఛీ ప్రపంచం పట్ల వైరాగ్యము కలిగిస్తారు. పిల్లలూ, దీని నుండి బుద్ధియోగాన్ని తొలగించండి. దీని పేరే నరకము, దుఃఖధామము. ఎవరైనా మరణిస్తే స్వర్గస్థులయ్యారని అంటారు, అంటే అంతకుముందు నరకంలో ఉన్నట్లే కదా అని వారు కూడా అంటూ ఉంటారు. ఇలా ఏదైతే అంటున్నారో, అది కూడా రాంగ్ అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. స్వర్గవాసులుగా అయ్యేందుకు తండ్రి సరైన విషయాన్ని చెప్తారు. ఇప్పుడే పురుషార్థం చేయవలసి ఉంటుంది. స్వర్గవాసులుగా అయ్యేందుకు కూడా ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ పురుషార్థం చేయించలేరు. 21 జన్మల కొరకు స్వర్గవాసులుగా అయ్యేందుకు ఇప్పుడు మీరు పురుషార్థం చేస్తున్నారు. అలా తయారుచేసేవారు తండ్రి. వారిని హెవెన్లీ గాడ్ ఫాదర్ (స్వర్గ స్థాపకుడైన తండ్రి) అని అంటారు. వారు స్వయంగా వచ్చి అంటారు - పిల్లలూ, నేను మొదట మిమ్మల్ని శాంతిధామానికి తీసుకువెళ్తాను. మీరు యజమానులు కదా. శాంతిధామానికి వెళ్ళి, ఆ తర్వాత పాత్రను అభినయించేందుకు సుఖధామంలోకి వస్తారు. మనం శాంతిధామానికి వెళ్తే అన్ని ధర్మాలవారు శాంతిధామానికి వెళ్తారు. బుద్ధిలో ఈ డ్రామా చక్రమంతా ఉంచుకోవాలి. మనమందరమూ శాంతిధామానికి వెళ్తాము, మళ్ళీ మనమే మొట్టమొదట వచ్చి తండ్రి నుండి వారసత్వాన్ని పొందుతాము. ఎవరి నుండైతే వారసత్వాన్ని పొందవలసి ఉంటుందో, వారిని తప్పకుండా స్మృతి చేయాలి. వారసత్వం లభిస్తే, ఇక తండ్రి స్మృతిని మర్చిపోతామని పిల్లలకు తెలుసు. వారసత్వం చాలా సహజమైన రీతిలో లభిస్తుంది. తండ్రి సమ్ముఖములో అంటారు - మధురమైన పిల్లలూ, మీ దేహపు సంబంధాలేవైతే ఉన్నాయో, వాటన్నింటినీ మర్చిపోండి. ఇప్పుడు ఎటువంటి కొత్త సంబంధాన్ని జోడించకూడదు. ఒకవేళ ఏవైనా సంబంధాలను జోడించినట్లయితే, మళ్ళీ వాటిని మర్చిపోవలసి వస్తుంది. కొడుకు కానీ, కూతురు కానీ జన్మిస్తే, అది కూడా సమస్యే. ఎక్స్ ట్రా గా స్మృతి పెరిగింది కదా. తండ్రి అంటారు - అందరినీ మరచి ఒక్కరినే స్మృతి చేయాలి. వారే మనకు తల్లి, తండ్రి, టీచర్, గురువు సర్వస్వమూ, ఒక్క తండ్రి పిల్లలమైన మనం సోదరీ-సోదరులము. చిన్నాన్న-మామయ్య మొదలైన సంబంధాలేవీ లేవు. సోదరీ-సోదరుల సంబంధము మాత్రమే ఉండే సమయము ఇదొక్కటే. బ్రహ్మా పిల్లలు శివబాబాకు కూడా పిల్లలు, అలాగే మనుమలు-మనుమరాళ్ళు కూడా. ఇది నంబరువారు పురుషార్థానుసారంగా పక్కాగా బుద్ధిలో గుర్తుంటుంది కదా. పిల్లలైన మీరు నడుస్తూ-తిరుగుతూ స్వదర్శన చక్రధారులుగా అవుతారు.

పిల్లలైన మీరు ఈ సమయంలో చైతన్యమైన లైట్ హౌస్ లు, మీకు ఒక కంటిలో ముక్తిధామము, ఇంకొక కంటిలో జీవన్ముక్తిధామము ఉన్నాయి. ఆ లైట్ హౌస్లు జడమైనవి, మీరు చైతన్యమైనవారు. మీకు జ్ఞానమనే నేత్రము లభించింది. మీరు జ్ఞానవంతులుగా అయి అందరికీ మార్గాన్ని చూపిస్తారు. తండ్రి కూడా మిమ్మల్ని చదివిస్తున్నారు. మీకు తెలుసు - ఇది దుఃఖధామము. ఇప్పుడు మనం సంగమములో ఉన్నాము. మిగిలిన ప్రపంచమంతా కలియుగంలో ఉంది. సంగమములో తండ్రి పిల్లలతో కూర్చొని మాట్లాడుతారు మరియు పిల్లలే ఇక్కడకు వస్తారు. కొందరు - బాబా, ఫలానావారిని తీసుకురావాలా? వారు మంచివారు, గుణాలను గ్రహిస్తారు, బాణం తగులుతుందేమో అని ఈ విధంగా వ్రాస్తారు. వారి కళ్యాణం కూడా జరుగవచ్చు అని బాబాకు కూడా దయ కలుగుతుంది. ఇది పురుషోత్తమ సంగమయుగమని పిల్లలైన మీకు తెలుసు. ఈ సమయములోనే మీరు పురుషోత్తములుగా అవుతారు. కలియుగంలో అందరూ కనిష్ట పురుషులు, వారు ఉత్తమ పురుషులైన లక్ష్మీ-నారాయణులకు నమస్కరిస్తారు. సత్యయుగంలో ఎవరూ ఎవరికీ నమస్కరించరు. ఇక్కడికి చెందిన ఈ విషయాలేవీ అక్కడ ఉండవు. తండ్రి అర్థం చేయిస్తారు - మంచి రీతిలో తండ్రి స్మృతిలో ఉంటూ సేవ చేసినట్లయితే మున్ముందు మీకు సాక్షాత్కారాలు కూడా జరుగుతూ ఉంటాయి. మీరు ఎవరి యొక్క భక్తి మొదలైనవి చేయరు. మిమ్మల్ని తండ్రి కేవలం చదివిస్తారు. ఇంట్లో కూర్చునే వాటంతటవే సాక్షాత్కారాలు మొదలైనవి జరుగుతూ ఉంటాయి. చాలా మందికి బ్రహ్మా సాక్షాత్కారం జరుగుతుంది, వారి సాక్షాత్కారం కొరకు ఎవరూ పురుషార్థం చేయరు. అనంతమైన తండ్రి వీరి ద్వారా సాక్షాత్కారం చేయిస్తారు. భక్తి మార్గములో ఎవరు ఎవరిపైన ఎటువంటి భావనను పెట్టుకుంటారో, దాని అనుసారంగా సాక్షాత్కారం జరుగుతుంది. ఇప్పుడు మీ భావన అందరికన్నా ఉన్నతోన్నతుడైన తండ్రి పైన ఉంది. కావున శ్రమ లేకుండా తండ్రి సాక్షాత్కారాలు చేయిస్తూ ఉంటారు. ప్రారంభంలో ఎంతగా ధ్యానంలోకి వెళ్ళేవారు, తమకు తామే పరస్పరం కూర్చొని ధ్యానంలోకి వెళ్ళిపోయేవారు. వారు భక్తి ఏమైనా చేసారా. పిల్లలు ఎప్పుడైనా భక్తి చేస్తారా? పదండి వైకుంఠానికి వెళ్దాము, అనేది ఒక ఆటగా అయ్యింది. ఒకరినొకరు చూసుకుంటూ అలా వెళ్ళిపోయేవారు, ఏదైతే గతించిందో అది మళ్ళీ రిపీట్ అవుతుంది. మీకు తెలుసు - మనమే ఈ ధర్మానికి చెందినవారిగా ఉండేవారము. సత్యయుగంలో మొట్టమొదట ఈ ధర్మము ఉంది, ఇందులో ఎంతో సుఖము ఉంది. తర్వాత నెమ్మది-నెమ్మదిగా కళలు తగ్గుతూ ఉంటాయి. కొత్త ఇంట్లో ఏ సుఖమైతే ఉంటుందో, అది పాత ఇంట్లో ఉండదు. కొద్ది సమయం తర్వాత ఆ ఆడంబరము అంతా తగ్గిపోతుంది. స్వర్గానికి మరియు నరకానికి ఎంతో తేడా ఉంది కదా. స్వర్గమెక్కడ, ఈ నరకమెక్కడ! మీరు సంతోషంగా ఉంటారు, తండ్రి స్మృతి కూడా పక్కాగా నిలుస్తుందని కూడా మీకు తెలుసు. నేను ఆత్మను అన్నది మర్చిపోయినట్లయితే దేహాభిమానంలోకి వచ్చేస్తారు. ఇక్కడ కూర్చున్నప్పుడు కూడా ప్రయత్నించి స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోండి. అప్పుడు తండ్రి స్మృతి కూడా ఉంటుంది. దేహంలోకి రావడంతో దేహపు సంబంధాలన్నీ గుర్తుకువస్తాయి. ఇది ఒక నియమము. నాకు ఒక్కరు తప్ప ఇంకెవ్వరూ లేరు, బాబా, మేము బలిహారమవుతాము అని మీరు అంటూ ఉంటారు కూడా. ఇప్పుడిది ఆ సమయమే, ఒక్కరినే స్మృతి చేయాలి. కళ్ళతో ఎవరినైనా చూడండి, తిరగండి, విహరించండి కానీ ఆత్మ కేవలం తండ్రిని స్మృతి చేయాలి. శరీర నిర్వహణార్థము కర్మలు కూడా చేయాలి. కానీ, చేతులతో పని చేస్తూ, హృదయం ప్రియుని వైపు ఉండాలి, ఆత్మ తన ప్రియుడినే స్మృతి చేయాలి. ఎవరికైనా తన స్నేహితునితో ప్రీతి ఏర్పడితే ఇక వారి స్మృతి నిలిచిపోతుంది. మళ్ళీ ఆ బంధం తెగడము ఎంతో కష్టమవుతుంది. బాబా, ఇది ఏమిటి అని అడుగుతారు. అరే, మీరు నామరూపాలలో ఎందుకు చిక్కుకుంటారు. ఒకటేమో, మీరు దేహాభిమానులుగా అవుతారు మరియు ఇంకొకటి, గతము యొక్క లెక్కాచారాలేవైతే ఉన్నాయో, అవి మోసము చేస్తాయి. తండ్రి అంటారు - ఈ కళ్ళతో ఏదైతే చూస్తున్నారో, వాటి వైపుకు బుద్ధి వెళ్ళకూడదు. మిమ్మల్ని శివబాబా చదివిస్తున్నారని మీ బుద్ధిలో ఉండాలి. ఇక్కడ కూర్చున్నప్పటికీ తండ్రిని ఎప్పుడూ స్మృతి చేయని పిల్లలు కూడా ఎంతోమంది ఉన్నారు. కొందరు ఇక్కడ కూర్చున్నా కూడా స్మృతిలో ఉండలేరు. కావున - నేను శివబాబాను ఎంతగా స్మృతి చేశాను అని స్వయాన్ని చూసుకోవాలి. లేకపోతే చార్టులో నష్టం కలుగుతుంది.

భగవంతుడు అంటారు - మధురమైన పిల్లలూ, నన్ను స్మృతి చేయండి. మీ వద్ద నోట్ చేసుకోండి, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు స్మృతిలో కూర్చోండి. భోజనం చేసి అలా తిరిగి వచ్చి 10-15 నిమిషాలు వచ్చి స్మృతిలో కూర్చుండిపోండి, ఎందుకంటే ఇక్కడ వ్యాపార-వ్యవహారాలేవీ లేవు. అయినా ఏ పనులనైతే వదిలి వచ్చారో, అవి కొందరి బుద్ధిలోకి వస్తూ ఉంటాయి. ఇది చాలా గొప్ప గమ్యము, అందుకే బాబా అంటారు - స్వయాన్ని చెక్ చేసుకోండి. ఇది మీ అతి విలువైన సమయము. భక్తి మార్గములో మీరు ఎంత సమయాన్ని వృధా చేసారు. రోజురోజుకూ పడిపోతూనే ఉంటారు. శ్రీకృష్ణుని సాక్షాత్కారం జరిగితే ఎంతో సంతోషం కలుగుతుంది. కానీ, దాని ద్వారా ఏమీ లభించదు. తండ్రి వారసత్వము ఒక్కసారి మాత్రమే లభిస్తుంది. ఇప్పుడు తండ్రి అంటారు - నా స్మృతిలో ఉన్నట్లయితే మీ జన్మజన్మాంతరాల పాపాలు తొలగిపోతాయి. ఏ పిల్లలైతే స్మృతిలో ఉంటూ తమ వికర్మలను వినాశనం చేసుకొని కర్మాతీత అవస్థను పొందుతారో, వారికే స్వర్గము యొక్క పాస్ పోర్ట్ లభిస్తుంది. లేకపోతే ఎన్నో శిక్షలను అనుభవించవలసి వస్తుంది. బాబా ఈ సలహాను కూడా ఇస్తారు, మీ కిరీటము మరియు సింహాసనము యొక్క ఫొటోను మీ పాకెట్ లో పెట్టుకున్నట్లయితే, స్మృతి నిలుస్తుంది. వీరి ద్వారా మేము ఇలా అవుతాము. ఎంతగా చూస్తారో అంతగా స్మృతి చేస్తారు. ఇక దాని పైనే మోహం ఏర్పడుతుంది. మేము ఇలా నరుని నుండి నారాయణుడిలా అవుతున్నాము అని చిత్రాన్ని చూసి సంతోషం కలుగుతుంది. శివబాబా గుర్తుకువస్తారు. ఇవన్నీ పురుషార్థము యొక్క యుక్తులు. సత్యనారాయణుని కథను వినడం ద్వారా ఏమవుతుంది అని మీరు ఎవరినైనా అడగండి. మా బాబా మాకు సత్యనారాయణుని కథను వినిపిస్తున్నారు. 84 జన్మలు ఎలా తీసుకున్నారు అన్న లెక్క కూడా కావాలి కదా. అందరూ 84 జన్మలు తీసుకోరు. ప్రపంచానికి ఏమీ తెలియదు. కేవలం అలా నోటితో అంటారు - దీనిని థియరీ అని అంటారు. ఇక్కడ మీదంతా ప్రాక్టికల్ గా ఉంటుంది. ఇప్పుడు ఏవైతే జరుగుతున్నాయో, అవే మళ్ళీ భక్తి మార్గములో పుస్తకాలుగా తయారవుతాయి. మీరు స్వదర్శన చక్రధారులుగా అయి విష్ణుపురిలోకి వస్తారు. ఇది కొత్త విషయము. రావణ రాజ్యము అసత్య ఖండము, మళ్ళీ రామరాజ్యము సత్యఖండము వస్తుంది. చిత్రాలలో చాలా స్పష్టంగా ఉంది. ఇప్పుడు ఇది పాత ప్రపంచము యొక్క అంతిమము, 5 వేల సంవత్సరాల క్రితము కూడా వినాశనము జరిగింది. సైన్స్ వారు ఎవరైతే ఉన్నారో, వారికి - ఎవరో వారిని ప్రేరేపిస్తున్నారని, అందుకే వారు ఇవన్నీ చేస్తున్నారని ఆలోచన కలుగుతుంది. మేము ఇవి తయారుచేస్తే వీటి ద్వారా అందరూ అంతమైపోతారని కూడా అర్థమవుతుంది. కానీ పరవశులై ఉన్నారు, భయం ఉంది. ఇంట్లో కూర్చుని ఒక్క బాంబు వేస్తే అంతటినీ అంతం చేయగలము అని వారు భావిస్తారు. ఏరోప్లేన్లు, పెట్రోలు మొదలైన వాటి అవసరం కూడా ఉండదు. వినాశనమైతే తప్పకుండా జరగవలసిందే. కొత్త ప్రపంచం సత్యయుగంగా ఉండేది, క్రైస్టుకు 3 వేల సంవత్సరాల క్రితం స్వర్గం ఉండేది, ఇప్పుడు మళ్ళీ స్వర్గము యొక్క స్థాపన జరుగుతుంది. మున్ముందు మీరు అర్థం చేసుకుంటారు. స్థాపన తప్పకుండా జరగనున్నదని మీకు తెలుసు. ఇందులో కొద్దిగా కూడా సంశయం లేదు.

ఈ డ్రామా కల్పక్రితము వలె తిరుగుతూ ఉంటుంది. డ్రామా తప్పకుండా పురుషార్థం చేయిస్తుంది. అలాగని డ్రామాలో ఏది ఉంటే అది... అని భావించడం కాదు. పురుషార్థం గొప్పదా లేక ప్రారబ్ధం గొప్పదా అని అడుగుతారు. పురుషార్థమే గొప్పది ఎందుకంటే పురుషార్థము ద్వారానే ప్రారబ్ధం లభిస్తుంది. పురుషార్థం చేయకుండా ఎప్పుడూ ఎవరూ ఉండలేరు. మీరు పురుషార్థం చేస్తున్నారు కదా. పిల్లలు ఎక్కడెక్కడి నుండో వస్తారు, పురుషార్థం చేస్తారు. బాబా, మేము మర్చిపోతున్నాము అని అంటారు. అరే, నన్ను స్మృతి చేయండి అని శివబాబా మీకు చెప్తున్నారు, ఇలా వారు ఎవరికి చెప్పారు? ఆత్మనైన నాకు చెప్పారు. తండ్రి ఆత్మలతోనే మాట్లాడుతారు. శివబాబాయే పతిత-పావనుడు, ఈ ఆత్మ కూడా వారి నుండే వింటుంది. అనంతమైన తండ్రి మనల్ని విశ్వాధిపతులుగా తయారుచేస్తున్నారని పిల్లలైన మీకు నిశ్చయముండాలి. వారు ఉన్నతోన్నతమైన, ప్రియాతి ప్రియమైన తండ్రి. భక్తి మార్గములో వారినే స్మృతి చేసేవారు, మీ గతి, మతి అతీతము అని కూడా గానం చేస్తారు. అంటే వారు తప్పకుండా సలహాను ఇచ్చారు. ఇంతమంది మనుష్య మాత్రులందరూ తిరిగి ఇంటికి వెళ్తారని ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. ఎంతమంది ఆత్మలు ఉన్నారో ఆలోచించండి, అందరి వంశవృక్షము ఉంది. ఆత్మలందరూ నంబరువారుగా వెళ్ళి కూర్చుంటారు. క్లాసు ట్రాన్స్ఫర్ అయితే నంబరువారుగా కూర్చుంటారు కదా. మీరు కూడా నంబరువారుగా వెళ్తారు. చిన్న బిందువైన ఆత్మ నంబరువారుగా వెళ్ళి కూర్చుంటుంది, మళ్ళీ పాత్రను అభినయించేందుకు నంబరువారుగా వస్తుంది. ఇది రుద్రమాల. తండ్రి అంటారు - నా మాల ఇన్ని కోట్ల ఆత్మలది. పైన పుష్పమైన నేను ఉన్నాను, మళ్ళీ పాత్రను అభినయించేందుకు అందరూ ఇక్కడికే వస్తారు. ఈ డ్రామా తయారుచేయబడి ఉంది. ఇది తయారై తయారుచేయబడిన డ్రామా అని కూడా అంటారు. ఈ డ్రామా ఎలా నడుస్తుంది అనేది మీకు తెలుసు. అందరికీ ఈ విషయాన్ని చెప్పండి - స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి, అప్పుడు మీరు వెళ్ళిపోతారు. ఇందులోనే శ్రమ ఉంది. అందరికీ మార్గాన్ని చూపించాలి, ఇది మీ బాధ్యత. మీరు ఏ దేహధారులలోనూ చిక్కుకునేలా చేయరు. తండ్రి అంటారు - నన్ను స్మృతి చేసినట్లయితే పాపాలు భస్మమవుతాయి. తండ్రి ఏ డైరెక్షన్ ను అయితే ఇస్తారో, అది చేయవలసి ఉంటుంది. ఇందులో అడగవలసినది ఏముంది. ఏదేమైనా చేసి స్మృతి తప్పకుండా చేయండి, ఇందులో బాబా ఏమి కృప చూపిస్తారు. స్మృతి మీరు చేయాలి, వారసత్వాన్ని మీరు తీసుకోవాలి. తండ్రి స్వర్గ రచయిత కావున తప్పకుండా స్వర్గ వారసత్వము లభిస్తుంది. ఈ వృక్షం పాతబడిపోయిందని ఇప్పుడు మీకు తెలుసు, అందుకే ఈ పాత ప్రపంచం పట్ల మీకు వైరాగ్యం ఉంది. దీనిని అనంతమైన వైరాగ్యము అని అంటారు. ఆ హఠయోగులది హద్దు వైరాగ్యము. వారు అనంతమైన వైరాగ్యాన్ని నేర్పించలేరు. అనంతమైన వైరాగ్యము కలవారు హద్దు వైరాగ్యాన్ని ఎలా నేర్పిస్తారు. చాలా కాలం దూరమై తర్వాత కలిసిన పిల్లలు అని ఇప్పుడు తండ్రి అంటారు, మీరు కూడా - ఎంతో కాలం దూరమై తర్వాత కలిసిన బాబా అని అంటారు. 63 జన్మలుగా తండ్రిని స్మృతి చేసారు, ఇక మాకు ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ లేరు. అచ్ఛా.

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. స్వర్గంలోకి వెళ్ళే పాస్ పోర్టును తీసుకునేందుకు తండ్రి స్మృతితో మీ వికర్మలను వినాశనం చేసుకుని కర్మాతీత అవస్థను తయారుచేసుకోవాలి. శిక్షల నుండి రక్షించుకునేందుకు పురుషార్థం చేయాలి.

2. జ్ఞానవంతులుగా అయి అందరికీ మార్గాన్ని చూపించాలి, చైతన్యమైన లైట్ హౌస్ గా అవ్వాలి. ఒక కంటిలో శాంతిధామము, ఇంకొక కంటిలో సుఖధామము ఉండాలి. ఈ దుఃఖధామాన్ని మర్చిపోవాలి.

వరదానము:-
ప్రతి ఆత్మను ఉన్నతంలోకి తీసుకువెళ్ళాలి అనే భావనతో గౌరవాన్ని ఇచ్చే శుభచింతక భవ

ప్రతి ఆత్మ పట్ల శ్రేష్ఠ భావనను అనగా ఉన్నతంలోకి తీసుకువెళ్ళాలి లేక ముందుకు తీసుకువెళ్ళాలి అన్న భావనను ఉంచటము అనగా శుభ చింతకులుగా అవ్వటము. తమ శుభ వృత్తి ద్వారా, శుభ చింతక స్థితి ద్వారా ఇతరుల అవగుణాలను కూడా పరివర్తన చెయ్యటము, ఎవరివైనా బలహీలతలు లేక అవగుణాలను తమ బలహీనతలుగా భావించి, వర్ణన చేయడానికి బదులుగా లేక వ్యాపింపజేసేందుకు బదులుగా ఇముడ్చుకోవటము మరియు పరివర్తన చెయ్యటము - ఇదే గౌరవము. పెద్ద విషయాన్ని చిన్నదిగా చెయ్యటము, నిరాశకు లోనైన వారిని శక్తివంతులుగా చెయ్యటము, వారి సాంగత్యపు రంగులోకి రాకుండా ఉండటము, సదా వారిని కూడా ఉల్లాస-ఉత్సాహాలలోకి తీసుకురావటము - ఇదే గౌరవము. ఇలా గౌరవాన్ని ఇచ్చేవారే శుభచింతకులు.

స్లోగన్:-
త్యాగము యొక్క భాగ్యాన్ని సమాప్తము చేసేవి పాత స్వభావ-సంస్కారాలు, అందుకే వాటిని కూడా త్యాగము చెయ్యండి.

అవ్యక్త ప్రేరణలు - ఆత్మిక స్థితిలో ఉండే అభ్యాసము చెయ్యండి, అంతర్ముఖులుగా అవ్వండి

ఏ విధంగా బ్రహ్మాబాబా ఏకాంత ప్రియులైన కారణముగా సదా అంతర్ముఖులుగా ఉన్నారు, నేను ఆత్మను, నేను ఆత్మను... అన్న ఈ పాఠాన్ని పక్కా చేసుకున్నారు, దీని కారణంగా వారు స్వయము కూడా సదా శాంతి మరియు సుఖ సాగరములో ఇమిడి ఉండేవారు మరియు ఇతర ఆత్మలకు కూడా తమ శుద్ధ సంకల్పాలు మరియు వైబ్రేషన్ల ద్వారా, వృత్తి మరియు మాటల ద్వారా, సంపర్కము ద్వారా శాంతి మరియు సుఖపు అనుభూతిని చేయిస్తూ ఉండేవారు, అదే విధంగా ఫాలో ఫాదర్ చెయ్యండి.