11-11-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - మీరు హృదయపూర్వకముగా బాబా-బాబా అని
అన్నట్లయితే సంతోషములో రోమాలు నిక్కబొడుచుకుంటాయి, సంతోషముగా ఉన్నట్లయితే
మాయాజీతులుగా అవుతారు’’
ప్రశ్న:-
పిల్లలకు ఏ ఒక్క విషయములో శ్రమ అనిపిస్తుంది కానీ సంతోషానికి మరియు స్మృతికి అదే
ఆధారము?
జవాబు:-
ఆత్మాభిమానిగా
అవ్వడములోనే శ్రమ అనిపిస్తుంది కానీ దీని ద్వారానే సంతోషపు పాదరసము పైకి ఎక్కుతుంది,
మధురమైన బాబా గుర్తుకొస్తారు. మాయ మిమ్మల్ని దేహాభిమానములోకి తీసుకొస్తూ ఉంటుంది,
రుస్తమ్ తో రుస్తమ్ అయ్యి యుద్ధము చేస్తుంది, ఇందులో తికమకపడకూడదు. బాబా అంటారు -
పిల్లలూ, మాయా తుఫానులకు భయపడకండి, కేవలం కర్మేంద్రియాలతో ఏ వికర్మలు చేయకండి.
ఓంశాంతి
ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు మరియు శిక్షణను ఇస్తున్నారు,
చదివిస్తున్నారు. చదివించే తండ్రి సదా దేహీ-అభిమానిగా ఉంటారు అని పిల్లలకు తెలుసు.
వారు ఉన్నదే నిరాకారుడు, దేహాన్ని తీసుకోనే తీసుకోరు. వారు పునర్జన్మలలోకి రారు.
తండ్రి అర్థం చేయిస్తున్నారు - పిల్లలైన మీరు నా సమానముగా స్వయాన్ని ఆత్మగా
భావించాలి. నేను పరమపితను. పరమపితకు దేహము ఉండదు. వారిని దేహీ-అభిమాని అని కూడా అనరు.
వారు ఉన్నదే నిరాకారుడు. తండ్రి అంటారు, నాకు నాదంటూ దేహము లేదు. మీకైతే దేహము
లభిస్తూ వచ్చింది. ఇప్పుడు నా సమానముగా దేహము నుండి అతీతముగా అయి స్వయాన్ని ఆత్మగా
భావించండి. ఒకవేళ విశ్వానికి యజమానులుగా అవ్వాలంటే, ఇక వేరే కష్టమైన విషయమేమీ లేదు.
తండ్రి అంటారు, దేహాభిమానాన్ని వదిలి నా సమానముగా అవ్వండి. నేను ఆత్మను, నన్ను బాబా
చదివిస్తున్నారు అని బుద్ధిలో సదా స్మృతి ఉండాలి. తండ్రి అయితే నిరాకారుడు, కావున
మనల్ని ఎలా చదివిస్తారు? అందుకే బాబా ఈ తనువులోకి వచ్చి చదివిస్తారు. గోముఖాన్ని
చూపిస్తారు కదా. ఇప్పుడు గోముఖము నుండైతే గంగ వెలువడదు. మాతను కూడా గోమాత అని అంటారు.
మీరందరూ గోవులు. ఈ (బ్రహ్మా) గోవు కారు. నోటి ద్వారా జ్ఞానము లభిస్తుంది. తండ్రికి
గోవు లేదు కదా - ఎద్దుపైన కూడా స్వారీ చేసినట్లు చూపిస్తారు. వారు శివ-శంకరులు
ఒక్కరే అని అంటారు. శివ-శంకరులు ఒక్కరు కాదని పిల్లలైన మీరిప్పుడు అర్థం
చేసుకున్నారు. శివుడు అయితే ఉన్నతోన్నతమైనవారు, ఆ తర్వాత బ్రహ్మా-విష్ణు-శంకరులు.
బ్రహ్మా సూక్ష్మవతనవాసి. పిల్లలైన మీరు విచార సాగర మంథనము చేసి పాయింట్లు తీసి అర్థం
చేయించవలసి ఉంటుంది, అంతేకాక నిర్భయులుగా కూడా అవ్వాలి. పిల్లలైన మీకే సంతోషము ఉంది.
మేము ఈశ్వరుని విద్యార్థులము, మమ్మల్ని బాబా చదివిస్తున్నారు అని మీరంటారు.
భగవానువాచ కూడా ఉంది - ఓ పిల్లలూ, నేను మిమ్మల్ని రాజులకే రాజులుగా తయారుచేసేందుకు
చదివిస్తాను. ఎక్కడికి వెళ్ళినా, సెంటర్లకు వెళ్ళినా, బాబా మమ్మల్ని
చదివిస్తున్నారని బుద్ధిలో ఉంటుంది. ఏదైతే మనమిప్పుడు సెంటర్లలో వింటామో, ఆ మురళీని
బాబా నడిపిస్తారు. బాబా, బాబా అని అంటూ ఉండండి. ఇది కూడా మీ యాత్రే అవుతుంది. యోగమనే
పదము శోభించదు. మనుష్యులు అమరనాథ్, బద్రీనాథ్ యాత్రలకు కాలినడకన వెళ్తారు. ఇప్పుడు
పిల్లలైన మీరైతే మీ ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడు ఈ అనంతమైన నాటకము పూర్తవుతుందని మీకు
తెలుసు. మనల్ని యోగ్యులుగా తయారుచేసి తీసుకువెళ్ళేందుకు బాబా వచ్చారు. మేము
పతితులమని మీరు స్వయముగా అంటారు. పతితులు ముక్తిని పొందలేరు. తండ్రి అంటారు - ఓ
ఆత్మలూ, మీరు పతితముగా అయ్యారు. వారు శరీరాన్ని పతితముగా భావించి గంగలో స్నానాలు
చేసేందుకు వెళ్తారు. వారు ఆత్మను నిర్లేపిగా భావిస్తారు. తండ్రి అర్థం
చేయిస్తున్నారు - ముఖ్యమైన విషయము ఆత్మకు సంబంధించినది. పాపాత్మ, పుణ్యాత్మ అని
అంటారు కూడా. ఈ పదాలను బాగా గుర్తుంచుకోండి. అర్థం చేసుకోవాలి మరియు అర్థం చేయించాలి.
మీరే భాషణ మొదలైనవి చేయాలి. తండ్రి అయితే పల్లె-పల్లెకు, వీధి-వీధికి వెళ్ళరు. మీరు
ప్రతి ఇంటిలోనూ ఈ చిత్రాలను పెట్టుకోండి. 84 జన్మల చక్రము ఎలా తిరుగుతుంది అనేది
మెట్ల వరుస చిత్రములో చాలా స్పష్టముగా ఉంది. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు -
సతోప్రధానముగా అవ్వండి. మీ ఇంటికి వెళ్ళాలి, పవిత్రముగా అవ్వకుండానైతే ఇంటికి
వెళ్ళరు. ఇదే చింత ఉండాలి. బాబా, మాకు చాలా తుఫాన్లు వస్తున్నాయి, మనసులో చాలా చెడు
ఆలోచనలు వస్తున్నాయి, ఇంతకుముందు ఇలా వచ్చేవి కావు అని చాలా మంది పిల్లలు
వ్రాస్తుంటారు.
తండ్రి అంటారు, మీరు అలా ఆలోచించకండి. ఇంతకుముందు మీరేమీ యుద్ధ మైదానములో లేరు.
ఇప్పుడు మీరు తండ్రి స్మృతిలో ఉంటూ మాయపై విజయము పొందాలి. ఇది పదే-పదే గుర్తు
చేసుకుంటూ ఉండండి. కొంగు ముడి వేసుకోండి. మాతలు కొంగు ముడి వేసుకుంటారు, పురుషులైతే
నోట్ బుక్ లో వ్రాసుకుంటారు. మీ ఈ బ్యాడ్జ్ మంచి చిహ్నము. మనము రాకుమారులుగా అవుతాము,
ఇది నిరుపేదల నుండి రాకుమారులుగా తయారయ్యే గాడ్లీ యూనివర్శిటీ (ఈశ్వరీయ
విశ్వవిద్యాలయము). మీరు రాకుమారులుగా ఉండేవారు కదా. శ్రీకృష్ణుడు విశ్వానికి
రాకుమారునిగా ఉండేవారు. ఇంగ్లాండ్ లో రాకుమారుడిని ప్రిన్స్ ఆఫ్ వేల్స్ అని అంటారు.
అవి హద్దు విషయాలు. రాధా-కృష్ణులైతే చాలా ప్రసిద్ధమైనవారు. వారు స్వర్గములో రాకుమార,
రాకుమారీగా ఉండేవారు కదా, అందుకే వారిని అందరూ ప్రేమిస్తారు. శ్రీకృష్ణుడినైతే చాలా
ప్రేమిస్తారు. వాస్తవానికి ఇద్దరినీ ప్రేమించాలి. మొదటైతే రాధను ప్రేమించాలి. కానీ
కొడుకులపై ఎక్కువ ప్రేమ ఉంటుంది ఎందుకంటే వారు వారసులుగా అవుతారు. స్త్రీకి కూడా పతి
పట్ల ప్రేమ ఉంటుంది. వీరు నీ గురువు, ఈశ్వరుడు అని పతి కోసమే అంటారు. స్త్రీ కోసం
అలా చెప్పరు. సత్యయుగములోనైతే మాతలకు మహిమ ఉంటుంది. మొదట లక్ష్మి, ఆ తర్వాత
నారాయణుడు. అంబను ఎంత గౌరవిస్తారు. వారు బ్రహ్మాకు పుత్రిక. బ్రహ్మాకు అంత మహిమ లేదు.
బ్రహ్మా మందిరము అజ్మేర్ లో ఉంది. అక్కడ మేళాలు మొదలైనవి జరుగుతాయి. అంబ మందిరాలలో
కూడా మేళాలు జరుగుతాయి. వాస్తవానికి ఈ మేళాలన్నీ మైల పరచడం కోసమే ఉన్నాయి. మీ ఈ మేళా
స్వచ్ఛముగా తయారయ్యేందుకు ఉంది. స్వచ్ఛముగా తయారయ్యేందుకు మీరు స్వచ్ఛమైన తండ్రిని
స్మృతి చేయాలి. నీటి ద్వారా పాపాలేవీ అంతమవ్వవు. గీతలో కూడా భగవానువాచ - మన్మనాభవ
అని ఉంది. మొదట్లో మరియు చివర్లో ఈ పదముంది. మొట్టమొదట మనమే భక్తిని ప్రారంభించామని
పిల్లలైన మీకు తెలుసు. మొదట సతోప్రధాన భక్తి ఉంటుంది, ఆ తర్వాత సతో-రజో-తమో భక్తి
అవుతుంది. ఇప్పుడు చూడండి, మట్టి, రాళ్ళు మొదలైనవాటన్నిటికీ భక్తి చేస్తున్నారు.
ఇదంతా అంధవిశ్వాసము. ఈ సమయములో మీరు సంగమములో కూర్చున్నారు. ఇది తలకిందులుగా ఉన్న
వృక్షము కదా. పైన బీజము ఉన్నారు. తండ్రి అంటారు, ఈ మనుష్య సృష్టికి బీజము, రచయిత
నేనే. ఇప్పుడు కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు. అంటు కడతారు కదా. వృక్షములోని
పాత ఆకులు రాలిపోతాయి. కొత్త-కొత్త ఆకులు వస్తుంటాయి. ఇప్పుడు తండ్రి దేవీ-దేవతా
ధర్మాన్ని స్థాపన చేస్తున్నారు. మిక్స్ అయిపోయిన ఆకులు చాలా ఉన్నాయి. స్వయాన్ని
హిందువులుగా చెప్పుకుంటారు. వాస్తవానికి హిందువులు అంటే ఆది సనాతన దేవీ-దేవతా
ధర్మానికి చెందినవారు. వాస్తవానికి హిందుస్థాన్ పేరు భారత్, అక్కడ దేవతలు
నివసించేవారు. ఇంకే దేశము పేరూ మారదు, దీని పేరును మార్చేశారు. హిందుస్థాన్అని
అనేస్తారు. బౌద్ధులు, మాది జపానీయ లేక చైనీయ ధర్మము అని అనరు. వారు తమ ధర్మాన్ని
బౌద్ధ ధర్మమనే అంటారు. మీలో ఎవ్వరూ కూడా తమను తాము ఆది సనాతన దేవీ-దేవతా ధర్మానికి
చెందినవారము అని చెప్పుకోరు. ఒకవేళ ఎవరైనా అన్నా కూడా, ఆ ధర్మాన్ని ఎప్పుడు మరియు
ఎవరు స్థాపన చేసారు అని అడగండి. వారు ఏమీ చెప్పలేకపోతారు. కల్పము ఆయుష్షును కూడా
చాలా ఎక్కువగా చేసేశారు, దీనినే అజ్ఞానాంధకారమని అంటారు. ఒకటేమో, తమ ధర్మము గురించి
తెలియదు, రెండవది, లక్ష్మీ-నారాయణుల రాజ్యాన్ని చాలా దూరముగా తీసుకువెళ్ళిపోయారు,
అందుకే ఘోర అంధకారమని అంటారు. జ్ఞానము మరియు అజ్ఞానములో ఎంత తేడా ఉంది. జ్ఞానసాగరుడు
ఒక్క శివబాబా మాత్రమే. ఆ సాగరము నుండి ఒక లోటా అంత ఇస్తున్నట్లు. ఒకవేళ ఎవరికైనా,
శివబాబాను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయని కేవలం ఇది మాత్రమే
వినిపిస్తే, ఇది దోసిలి అంత నీరు మాత్రమే అందించినట్లు కదా. కొందరు స్నానము చేస్తారు,
కొందరు కుండ నింపుకుని తీసుకువెళ్తారు. కొందరు చిన్న-చిన్న లోటాలతో తీసుకువెళ్తారు.
ప్రతిరోజూ ఒక్కొక్క చుక్కను కుండలో వేసి దానిని జ్ఞానజలమని భావించి తాగుతారు.
విదేశాలకు కూడా వైష్ణవులు గంగాజలాన్ని కుండలలో నింపుకుని తీసుకువెళ్తారు. మళ్ళీ
తెప్పించుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఈ నీరంతా పర్వతాల నుండే వస్తుంది. పై నుండి కూడా
నీరు కురుస్తుంది. ఈ రోజుల్లో చూడండి, భవనాలు కూడా ఎంత ఎత్తుగా 100 అంతస్తుల వరకు
తయారుచేస్తున్నారు. సత్యయుగములో ఇలా ఉండదు. అక్కడ మీకు ఎంత భూమి లభిస్తుందో, ఇక
అడగకండి. ఇక్కడ నివసించేందుకు కూడా సరిపడా భూమి లేదు, అందుకే ఇన్ని అంతస్తులు
నిర్మిస్తున్నారు. అక్కడైతే ధాన్యము కూడా లెక్కలేనంత పండుతుంది. అమెరికాలో ధాన్యము
ఎక్కువగా ఉంటే కాల్చేస్తారు. ఇది మృత్యులోకము. అది అమరలోకము. అర్ధకల్పము మీరు అక్కడ
సుఖములో ఉంటారు. కాలుడు లోపలికి దూరలేడు. దీనిపై ఒక కథ కూడా ఉంది. ఇది అనంతమైన
విషయము. అనంతమైన విషయాల నుండి మళ్ళీ హద్దు కథలను కూర్చుని తయారుచేసారు. గ్రంథ్ మొదట
ఎంత చిన్నదిగా ఉండేది. ఇప్పుడు దానిని ఎంత పెద్దగా తయారుచేసారు. శివబాబా ఎంత చిన్నగా
ఉంటారు, వారి ప్రతిమను కూడా ఎంత పెద్దదిగా తయారుచేసారు. బుద్ధుడి చిత్రాన్ని,
పాండవుల చిత్రాలను పెద్ద-పెద్దవిగా, పొడవుగా తయారుచేసారు. ఆ విధముగా ఎవ్వరూ ఉండరు.
పిల్లలైన మీరు ఈ లక్ష్యము-ఉద్దేశ్యము యొక్క చిత్రాన్ని ప్రతి ఇంటిలోనూ పెట్టుకోవాలి.
మనము చదువుకొని ఇలా తయారవుతున్నాము. కావున ఏడవకూడదు. ఎవరైతే ఏడుస్తారో వారు
పోగొట్టుకుంటారు. దేహాభిమానములోకి వచ్చేస్తారు. పిల్లలైన మీరు ఆత్మాభిమానులుగా
అవ్వాలి, ఇందులోనే శ్రమ అనిపిస్తుంది. ఆత్మాభిమానులుగా అవ్వడము ద్వారానే సంతోషము
యొక్క పాదరసము పైకి ఎక్కుతుంది. మధురమైన బాబా గుర్తుకొస్తారు. బాబా నుండి మనము
స్వర్గ వారసత్వాన్ని తీసుకుంటున్నాము. బాబా మనల్ని ఈ భాగ్యశాలి రథములోకి వచ్చి
చదివిస్తున్నారు. రాత్రింబవళ్ళు బాబా-బాబా అని స్మృతి చేస్తూ ఉండండి. మీరు
అర్ధకల్పము యొక్క ప్రేయసులు. భక్తులు భగవంతుడిని స్మృతి చేస్తారు. భక్తులు అనేకమంది
ఉన్నారు. జ్ఞానములో అందరూ ఒక్క తండ్రినే స్మృతి చేస్తారు. వారే అందరికీ తండ్రి.
జ్ఞానసాగరుడైన తండ్రి మనల్ని చదివిస్తున్నారు, పిల్లలైన మీకైతే రోమాలు
నిక్కబొడుచుకోవాలి. మాయా తుఫానులైతే తప్పకుండా వస్తాయి. బాబా అంటారు - అందరికన్నా
ఎక్కువ తుఫానులైతే నాకు వస్తాయి ఎందుకంటే అందరికన్నా ముందు నేను ఉన్నాను. నా వద్దకు
వస్తాయి కావుననే పిల్లల వద్దకు ఎన్ని వస్తూ ఉండవచ్చు అనేది అర్థం చేసుకుంటాను.
పిల్లలు తికమకపడుతూ ఉండవచ్చు. అనేక రకాల తుఫానులు వస్తుంటాయి, అజ్ఞానకాలములో కూడా
ఎప్పుడూ రానటువంటి తుఫానులు కూడా వస్తాయి. ముందు నా వద్దకే అవి రావాలి, లేదంటే నేను
పిల్లలకు ఎలా అర్థం చేయిస్తాను. వీరు ఫ్రంట్ లో ఉన్నారు. వీరు రుస్తమ్ కనుక మాయ కూడా
రుస్తమ్ తో రుస్తమ్ అయ్యి యుద్ధము చేస్తుంది. మల్లయుద్ధములో అందరూ ఒకేలా ఉండరు.
ఫస్ట్, సెకండ్, థర్డ్ గ్రేడ్లు ఉంటాయి. బాబా వద్దకు అందరికన్నా ఎక్కువ తుఫానులు
వస్తాయి, అందుకే బాబా అంటారు - ఈ తుఫానులకు భయపడకండి. కేవలం కర్మేంద్రియాలతో ఎటువంటి
వికర్మలు చేయకండి. కొంతమంది ఏమంటారంటే, జ్ఞానములోకి వచ్చిన తర్వాతే ఎందుకిలా
జరుగుతుంది, దీనికన్నా జ్ఞానము తీసుకోకపోతేనే బాగుండేది, ఇటువంటి సంకల్పాలు వచ్చేవి
కావు. అరే, ఇది యుద్ధము కదా. పత్ని ఎదురుగా ఉన్నా కూడా పవిత్రమైన దృష్టి ఉండాలి,
మేము శివబాబా పిల్లలము, పరస్పరము సోదరులమని భావించాలి, ఆ తర్వాత ప్రజాపిత బ్రహ్మాకు
సంతానముగా అవ్వడముతో సోదరీ-సోదరులుగా అయ్యాము. ఇక వికారాలు ఎక్కడ నుండి వస్తాయి.
బ్రాహ్మణులు ఉన్నతమైన పిలక వంటివారు. వారే తర్వాత దేవతలుగా అవుతారు. కనుక మనము
పరస్పరము సోదరీ-సోదరులము. మనము ఒక్క తండ్రి పిల్లలము, కుమార-కుమారీలము. ఒకవేళ ఇద్దరూ
కుమార-కుమారీలుగా ఉండకపోతే ఇక గొడవలవుతాయి. అబలలపై అత్యాచారాలు జరుగుతాయి. నా పత్ని
పూతన వలె ఉందని పురుషులు కూడా వ్రాస్తారు. ఇందులో చాలా శ్రమ ఉంది. యవ్వనములో
ఉన్నవారికైతే చాలా శ్రమ కలుగుతుంది మరియు ఎవరైతే గంధర్వ వివాహము చేసుకుని కలిసి
ఉంటారో, వారిదైతే అద్భుతము. వారికి చాలా ఉన్నతమైన పదవి లభిస్తుంది కానీ అటువంటి
అవస్థను ధారణ చేసి జ్ఞానములో చురుకుగా అయినప్పుడు లభిస్తుంది. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. మాయ తుఫానులకు భయపడకూడదు మరియు తికమకపడకూడదు. కేవలం కర్మేంద్రియాలతో ఏ
వికర్మలు జరగకుండా అటెన్షన్ ఉంచాలి. జ్ఞానసాగరుడైన బాబా మమ్మల్ని చదివిస్తున్నారు -
ఈ సంతోషములో ఉండాలి.
2. సతోప్రధానముగా అయ్యేందుకు ఆత్మాభిమానులుగా అయ్యే శ్రమ చేయాలి, జ్ఞానాన్ని
విచార సాగర మంథనము చేయాలి, స్మృతియాత్రలో ఉండాలి.
వరదానము:-
శుభ చింతన ద్వారా జ్ఞాన సాగరునిలో ఇమిడిపోయే అతీంద్రియ సుఖము
యొక్క అనుభవీ భవ
ఏ విధముగా సాగరములో ఉండే జీవజంతువులు సాగరము లోపల ఉంటాయి,
అంతేకానీ బయటకు రావాలని కోరుకోవు, చేప కూడా నీటి లోపల ఉంటుంది, సాగరము లేక నీరే
దానికి ప్రపంచము, అదే విధముగా పిల్లలైన మీరు కూడా శుభ చింతన ద్వారా జ్ఞాన సాగరుడైన
తండ్రిలో సదా ఇమిడిపోయి ఉండండి. ఎప్పటివరకైతే సాగరములో ఇమిడిపోయి ఉండటాన్ని అనుభవము
చేయరో, అప్పటివరకు అతీంద్రియ సుఖమనే ఊయలలో ఊగుతున్నట్లుగా, సదా హర్షితముగా
ఉంటున్నట్లుగా అనుభవము చేయలేకపోతారు. దీని కోసం స్వయాన్ని ఏకాంతవాసులుగా చేసుకోండి
అనగా సర్వ ఆకర్షణల వైబ్రేషన్ల నుండి అంతర్ముఖులుగా అవ్వండి.
స్లోగన్:-
మీ
ముఖాన్ని నడుస్తూ-తిరుగుతూ ఉన్న ఎటువంటి మ్యూజియమ్ లా తయారుచేసుకోండి అంటే, అందులో
బిందువైన బాబా కనిపించాలి.
అవ్యక్త సూచనలు -
అశరీరి మరియు విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచండి
స్వయాన్ని శరీర బంధనము
నుండి అతీతముగా చేసుకునేందుకు అవతారముగా భావించండి. నేను అవతారాన్ని, ఈ స్మృతిలో
ఉంటూ శరీరాన్ని ఆధారముగా తీసుకుని కర్మలు చెయ్యండి. కానీ ‘నేను చేస్తున్నాను’ అన్న
భానము నుండి అతీతమై కర్మలు చెయ్యండి. నేను చేసాను, నేను చేస్తాను... ఈ సంకల్పాన్ని
కూడా సమర్పితము చెయ్యండి, అప్పుడిక కర్మ బంధనాలలో బంధింపబడరు. దేహములో ఉంటూ కూడా
విదేహీ అవస్థను అనుభవము చేస్తారు.
| | | |