ఓంశాంతి
ఇప్పుడు పిల్లలైన మీరు ఇక్కడ కూర్చున్నారు మరియు ఇప్పుడు మనము పాత్రధారులమని, 84
జన్మల చక్రాన్ని పూర్తి చేసామని కూడా మీకు తెలుసు. ఇది పిల్లలైన మీ స్మృతిలోకి
రావాలి. బాబా మనకు మళ్ళీ రాజ్యాన్ని ప్రాప్తింపజేయడానికి మరియు మనల్ని తమోప్రధానము
నుండి సతోప్రధానముగా తయారుచేయడానికి వచ్చారు అని మీకు తెలుసు. ఈ విషయాలను బాబా తప్ప
ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు. మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు మీరు స్కూల్లో
కూర్చున్నట్లే. బయట ఉన్నప్పుడు స్కూల్లో ఉన్నట్లు కాదు. ఇది ఉన్నతోన్నతమైన ఆత్మిక
స్కూల్ అని మీకు తెలుసు. ఆత్మిక తండ్రి కూర్చుని చదివిస్తారు. చదువైతే పిల్లలకు
గుర్తుకురావాలి కదా. ఇతను కూడా సంతానమే. ఇతనికి మరియు అందరికీ నేర్పించేవారు ఆ
తండ్రియే. మనుష్యమాత్రులందరి ఆత్మలకు తండ్రి వారే. వారు వచ్చి శరీరాన్ని అప్పుగా
తీసుకుని మీకు అర్థం చేయిస్తున్నారు. ప్రతిరోజూ అర్థం చేయిస్తారు. ఇక్కడ
కూర్చున్నప్పుడు బుద్ధిలో స్మృతిలోకి రావాలి - మేము 84 జన్మలు తీసుకున్నాము, మేము
విశ్వాధిపతులుగా ఉండేవారము, దేవీ-దేవతలుగా ఉండేవారము, తర్వాత పునర్జన్మలు తీసుకుంటూ,
తీసుకుంటూ కిందకు వచ్చి పడిపోయాము. భారత్ ఎంత సుసంపన్నముగా ఉండేది. అంతా స్మృతిలోకి
వచ్చింది. ఇదంతా భారత్ యొక్క కథయే, అంతేకాక మనది కూడా. మరి స్వయాన్ని మర్చిపోకండి.
మనము స్వర్గములో రాజ్యము చేసేవారము, తర్వాత మనం 84 జన్మలు తీసుకోవలసి వచ్చింది.
దీనిని రోజంతా స్మృతిలోకి తీసుకురావలసి ఉంటుంది. వ్యాపారాలు మొదలైనవి చేస్తూ చదువైతే
గుర్తుకు రావాలి కదా. మనం విశ్వాధిపతులుగా ఎలా ఉండేవారము, మళ్ళీ మనం ఎలా కిందకు
దిగుతూ వచ్చాము, ఇది చాలా సహజము. కానీ ఈ స్మృతి కూడా ఎవ్వరికీ ఉండదు. ఆత్మ
పవిత్రముగా ఉండని కారణముగా స్మృతి జారిపోతూ ఉంటుంది. మనల్ని భగవంతుడు
చదివిస్తున్నారు, ఈ స్మృతి జారిపోతూ ఉంటుంది. మనం బాబాకు విద్యార్థులము.
స్మృతియాత్రలో ఉండండి అని బాబా చెప్తూ ఉంటారు. బాబా మనల్ని చదివించి ఈ విధంగా
తయారుచేస్తున్నారు. మొత్తం రోజంతా ఇది స్మృతిలోకి వస్తూ ఉండాలి. తండ్రియే స్మృతిని
కలిగిస్తున్నారు. ఇదే భారత్ ఉండేది కదా. మనమే దేవీ-దేవతలుగా ఉండేవారము, ఇప్పుడు
మళ్ళీ అసురులుగా అయ్యాము. ఇంతకుముందు మీ బుద్ధి కూడా ఆసురీగా ఉండేది. ఇప్పుడు తండ్రి
ఈశ్వరీయ బుద్ధిని ఇచ్చారు. అయినా కూడా కొందరి బుద్ధిలో ఇది కూర్చోదు. మర్చిపోతారు.
తండ్రి ఎంతగా నషా ఎక్కిస్తారు. మీరు మళ్ళీ దేవతలుగా అవుతారు కావున ఆ నషా ఉండాలి కదా.
మనము మన రాజ్యాన్ని తీసుకుంటున్నాము. మనము మన రాజ్యము చేస్తాము. కొందరికైతే అస్సలు
నషా ఎక్కదు. జ్ఞానామృతము జీర్ణమే అవ్వదు. ఎవరికైతే నషా ఎక్కి ఉంటుందో, వారికి ఎవరి
కళ్యాణమునైనా చేయడం తప్ప వేరే ఏ విషయమూ మాట్లాడడం మంచిగా అనిపించదు. పుష్పాలను
తయారుచేసే సేవలోనే నిమగ్నులై ఉంటారు. మనము ముందు పుష్పాలుగా ఉండేవారము, తర్వాత మాయ
ముళ్ళలా చేసేసింది. ఇప్పుడు మళ్ళీ పుష్పాలులా అవుతాము. ఇలాంటి విషయాలను మీతో మీరు
మాట్లాడుకోవాలి. ఈ నషాలో ఉంటూ మీరు ఎవరికైనా అర్థం చేయిస్తే వెంటనే ఎవరికైనా బాణము
తగులుతుంది. భారత్ అల్లా యొక్క పూలతోటగా ఉండేది. ఇప్పుడు పతితముగా అయిపోయింది. మనమే
మొత్తము విశ్వానికి అధిపతులుగా ఉండేవారము, అది ఎంత గొప్ప విషయము! ఇప్పుడు మళ్ళీ మనము
ఎలా అయిపోయాము! ఎంతగా పడిపోయాము. ఇది మన ఉన్నతి మరియు పతనముకు సంబంధించిన నాటకము. ఈ
కథను తండ్రి కూర్చుని వినిపిస్తారు. అది అసత్యమైన కథ. ఇది సత్యమైన కథ. వారు
సత్యనారాయణుడి కథను వినిపిస్తారు, వారు ఎలా ఎక్కారు మరియు మళ్ళీ ఎలా పడిపోయారు అనేది
వారు అర్థం చేసుకోరు. ఈ తండ్రి సత్యమైన సత్యనారాయణుడి కథను వినిపించారు. రాజ్యాన్ని
ఎలా పోగొట్టుకున్నారు, ఇదంతా తమపైనే ఆధారపడి ఉంది. తాము ఇప్పుడు తండ్రి నుండి
రాజ్యాన్ని ఎలా తీసుకుంటున్నారు అనేది ఆత్మకు ఇప్పుడు తెలిసింది. ఇక్కడ తండ్రి
అడిగినప్పుడు - అవును, నషా ఉంది అని అంటారు, మళ్ళీ బయటకు వెళ్ళడముతో ఏ మాత్రమూ నషా
ఉండదు. పిల్లలు స్వయము అర్థం చేసుకుంటారు. చేతులైతే ఎత్తుతారు కానీ నడవడిక ఎలా
ఉందంటే, ఇక నషా ఉండలేదు. ఫీలింగ్ అయితే కలుగుతుంది కదా.
తండ్రి పిల్లలకు స్మృతిని కలిగిస్తున్నారు - పిల్లలూ, మీకు నేను రాజ్యాన్ని
ఇచ్చాను, మీరు మళ్ళీ పోగొట్టుకున్నారు. మీరు కిందకు దిగుతూ వచ్చారు ఎందుకంటే ఇది
పైకి ఎక్కే మరియు కిందకు దిగే నాటకము. ఈ రోజు రాజుగా ఉంటారు, రేపు మళ్ళీ వారిని
దించేస్తారు. వార్తాపత్రికలలో ఇటువంటి విషయాలు ఎన్నో వస్తాయి. వాటికి జవాబు
ఇచ్చినట్లయితే ఎంతోకొంత అర్థం చేసుకుంటారు. ఇది నాటకము, ఇది గుర్తున్నా సరే సదా
సంతోషము ఉంటుంది. బుద్ధిలో ఉంది కదా - నేటికి 5000 సంవత్సరాల క్రితం శివబాబా వచ్చారు,
వారు వచ్చి రాజయోగాన్ని నేర్పించారు, యుద్ధము జరిగింది. ఇప్పుడు ఈ రైట్
విషయాలన్నింటినీ తండ్రి వినిపిస్తారు. ఇది పురుషోత్తమ యుగము. కలియుగము తర్వాత ఈ
పురుషోత్తమ యుగము వస్తుంది. కలియుగాన్ని పురుషోత్తమ యుగము అని అనరు. అలాగే
సత్యయుగాన్ని కూడా అనరు. ఆసురీ సాంప్రదాయము మరియు దైవీ సాంప్రదాయము అని అంటారు, ఆ
రెండింటికీ మధ్యన ఉన్నది ఈ సంగమయుగము. ఇప్పుడు పాత ప్రపంచము నుండి కొత్త ప్రపంచముగా
అవుతుంది. కొత్తదాని నుండి పాతగా అవ్వడానికి మొత్తము చక్రమంతా పడుతుంది. ఇప్పుడు ఇది
సంగమయుగము. సత్యయుగములో దేవీ-దేవతల రాజ్యము ఉండేది. ఇప్పుడు అది లేదు. మిగిలిన అనేక
ధర్మాలు వచ్చేసాయి. ఇది మీ బుద్ధిలో ఉంటుంది. 6-8 నెలలు, 12 నెలలు చదువుకుని మళ్ళీ
పడిపోయేవారు ఎందరో ఉన్నారు. ఫెయిల్ అయిపోతారు. పవిత్రముగా అవుతారు కానీ ఒకవేళ
చదువుకోకపోతే చిక్కుకుపోతారు. కేవలం పవిత్రత ఒక్కటే ఉన్నా ఉపయోగపడదు. ఎంతోమంది
సన్యాసులు కూడా సన్యాస ధర్మాన్ని వదిలి వెళ్ళి గృహస్థులుగా అయిపోతారు, వివాహము
చేసేసుకుంటారు. కావున ఇప్పుడు తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు - మీరు స్కూల్లో
కూర్చున్నారు. మనము మన రాజ్యాన్ని ఎలా పోగొట్టుకున్నాము, ఎన్ని జన్మలు తీసుకున్నాము
అన్నది స్మృతిలో ఉంది. ఇప్పుడు మళ్ళీ తండ్రి చెప్తున్నారు - విశ్వాధిపతులుగా అవ్వండి.
పావనముగా తప్పకుండా అవ్వాలి. ఎంత ఎక్కువ స్మృతి చేస్తారో, అంత పవిత్రముగా అవుతూ
ఉంటారు, ఎందుకంటే బంగారములో మాలిన్యము కలిస్తే అది ఎలా పోతుంది? పిల్లలైన మీ
బుద్ధిలో ఉంది - ఆత్మ అయిన మనము సతోప్రధానముగా ఉండేవారము, 24 క్యారెట్ల బంగారముగా
ఉండేవారము, తర్వాత పడిపోతూ, పడిపోతూ ఇటువంటి పరిస్థితి ఏర్పడింది, మనం ఎలా అయిపోయాము!
తండ్రి ఎప్పుడూ - నేను ఎలా ఉండేవాడిని అని అనరు! మనుష్యులైన మీరే - మేము దేవతలుగా
ఉండేవారము అని అంటారు. భారత్ కు మహిమ అయితే ఉంది కదా. భారత్ లోకి ఎవరు వస్తారు, ఏ
జ్ఞానాన్ని ఇస్తారు, ఇది ఎవ్వరికీ తెలియదు. ముక్తిప్రదాత ఎప్పుడు వస్తారు అనేది
తెలిసి ఉండాలి కదా. భారత్ ప్రాచీనమైనదిగా మహిమ చేయబడుతుంది, కావున తప్పకుండా భారత్
లోనే పునః అవతరణ జరుగుతూ ఉండవచ్చు మరియు జయంతి కూడా భారత్ లో జరుపుకోబడుతుంది.
తప్పకుండా తండ్రి ఇక్కడికే వస్తారు. భగీరథుడు అని అంటారు కూడా. కావున తప్పకుండా
మనుష్య శరీరములోకే వచ్చి ఉంటారు కదా. మరి గుర్రపు బండిని కూడా చూపించారు. ఎంత తేడా
ఉంది. శ్రీకృష్ణుడిని మరియు ఆ రథాన్ని చూపించారు. నా గురించి ఎవ్వరికీ తెలియదు. బాబా
ఈ రథములోకి వస్తారని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు, వీరినే భాగ్యశాలి రథము అని
అంటారు. బ్రహ్మా నుండి విష్ణువు అనేది చిత్రములో ఎంత స్పష్టముగా ఉంది. త్రిమూర్తి
పైన శివుడు ఉన్నారు, ఈ శివుని పరిచయాన్ని ఎవరు ఇచ్చారు. బాబాయే తయారుచేయించారు కదా.
బాబా ఈ బ్రహ్మా యొక్క రథములోకి వచ్చారని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. బ్రహ్మా
నుండి విష్ణువు, విష్ణువు నుండి బ్రహ్మా. 84 జన్మల తర్వాత విష్ణువు నుండి బ్రహ్మాగా
అవ్వడము ఎక్కడ, బ్రహ్మా నుండి విష్ణువుగా ఒక్క క్షణములో అవ్వడము ఎక్కడ - ఇది కూడా
పిల్లలకు అర్థం చేయించారు. ఇవి బుద్ధిలో ధారణ చేయవలసిన అద్భుతమైన విషయాలు కదా.
మొట్టమొదట తండ్రి పరిచయాన్ని అర్థం చేయించవలసి ఉంటుంది. భారత్ తప్పకుండా స్వర్గముగా
ఉండేది. స్వర్గ స్థాపకుడైన తండ్రే స్వర్గాన్ని తయారుచేసి ఉంటారు. ఈ చిత్రము చాలా
ఫస్ట్ క్లాస్ అయినది. అర్థం చేయించే అభిరుచి ఉంటుంది కదా. తండ్రికి కూడా అభిరుచి
ఉంది. మీరు సెంటర్లలో కూడా ఈ విధంగా అర్థం చేయిస్తూ ఉంటారు. ఇక్కడైతే డైరెక్ట్
తండ్రి ఉన్నారు. తండ్రి కూర్చుని ఆత్మలకు అర్థం చేయిస్తారు. ఆత్మలు అర్థం
చేయించినదానికి మరియు తండ్రి అర్థం చేయించినదానికి తేడా అయితే తప్పకుండా ఉంటుంది.
అందుకే వినడం కోసం ఇక్కడకు సమ్ముఖములోకి వస్తారు. తండ్రియే ఘడియ-ఘడియ పిల్లలూ,
పిల్లలూ అని అంటారు. తండ్రి ప్రభావము ఎంతగా ఉంటుందో, సోదరుల ప్రభావము అంతగా ఉండదు.
ఇక్కడ మీరు తండ్రి సమ్ముఖములో కూర్చున్నారు. ఆత్మలు మరియు పరమాత్మ కలుసుకుంటారు
కావున దీనిని మేళా అని అంటారు. తండ్రి సమ్ముఖముగా కూర్చుని అర్థం చేయిస్తారు కావున
చాలా నషా ఎక్కుతుంది. అనంతమైన తండ్రి చెప్తూ ఉంటే మరి మేము వారు చెప్పేది
అంగీకరించమా అని భావిస్తారు! తండ్రి అంటారు, నేను మిమ్మల్ని స్వర్గములోకి పంపించాను,
మీరు 84 జన్మలు తీసుకుంటూ, తీసుకుంటూ పతితముగా అయ్యారు, మరి మళ్ళీ మీరు పావనముగా
అవ్వరా! ఆత్మలకు చెప్తున్నారు. బాబా నిజమే చెప్తున్నారు అని కొందరు భావిస్తారు,
మరికొందరైతే - బాబా, మేము పవిత్రముగా ఎందుకవ్వము అని అంటారు!
తండ్రి అంటారు, నన్ను స్మృతి చేసినట్లయితే మీ పాపాలు అంతమైపోతాయి. మీరు సత్యమైన
బంగారముగా అయిపోతారు. నేను అందరికీ పతిత-పావనుడినైన తండ్రిని, కావున తండ్రి అర్థం
చేయించినదానికి మరియు ఆత్మలు (పిల్లలు) అర్థం చేయించినదానికి ఎంత తేడా ఉంటుంది.
ఒకవేళ ఎవరైనా కొత్తవారు వస్తే, వారిలో కూడా ఎవరైతే ఇక్కడికి చెందిన పుష్పాలు ఉంటారో,
వారికి టచ్ అవుతుంది. వీరు నిజమే చెప్తున్నారు అని భావిస్తారు. ఎవరైతే ఇక్కడివారు
కారో వారు అర్థం చేసుకోరు. మీరు పావనముగా అవ్వండి అని ఆత్మలమైన మన తండ్రి
చెప్తున్నారు అని మీరు కూడా అర్థం చేయించండి. మనుష్యులు పావనముగా అయ్యేందుకు గంగా
స్నానాలు చేస్తారు, గురువుల వద్దకు వెళ్తారు. కానీ పతిత-పావనుడు అయితే తండ్రియే.
తండ్రి ఆత్మలకు చెప్తున్నారు - మీరు ఎంత పతితముగా అయిపోయారు, అందుకే మీరు వచ్చి
పావనముగా తయారుచేయండి అని ఆత్మ తలచుకుంటూ ఉంటుంది. తండ్రి అంటారు, నేను కల్ప-కల్పమూ
వస్తాను, ఈ అంతిమ జన్మలో పవిత్రముగా అవ్వండి అని పిల్లలైన మీకు చెప్తాను. ఈ రావణ
రాజ్యము అంతమవ్వనున్నది. పావనముగా అవ్వడమే ముఖ్యమైన విషయము. స్వర్గములో విషము ఉండదు.
ఎవరైనా వస్తే వారికి అర్థం చేయించండి - స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైన నన్ను
స్మృతి చేసినట్లయితే పావనముగా అవుతారు, మాలిన్యము తొలగిపోతుంది అని తండ్రి
చెప్తున్నారు. మన్మనాభవ అన్న పదము గుర్తుంది కదా. తండ్రి నిరాకారుడు, ఆత్మ అయిన మనము
కూడా నిరాకారియే. ఏ విధంగా మనము శరీరము ద్వారా వింటామో, అలా తండ్రి కూడా ఈ
శరీరములోకి వచ్చి అర్థం చేయిస్తారు. లేకపోతే నన్నొక్కరినే స్మృతి చేయండి అని వారు
ఎలా చెప్తారు. దేహపు సర్వ సంబంధాలనూ వదలండి. వారు తప్పకుండా ఇక్కడకు వస్తారు,
బ్రహ్మాలోకి ప్రవేశిస్తారు. ప్రజాపిత ఇప్పుడు ప్రాక్టికల్ గా ఉన్నారు, ఇతని ద్వారా
మనకు తండ్రి ఈ విధంగా చెప్తున్నారు. మనము అనంతమైన తండ్రి చెప్పేదే వింటాము. వారు
చెప్తున్నారు - పావనముగా అవ్వండి, పతితత్వాన్ని వదలండి, పాత దేహపు అభిమానాన్ని
వదలండి. నన్ను స్మృతి చేసినట్లయితే అంతిమ స్మృతిని బట్టి మరుసటి జన్మను పొందుతారు.
మీరు లక్ష్మీ-నారాయణుల వలె అయిపోతారు.
తండ్రి నుండి విముఖులుగా చేసే ముఖ్యమైన అవగుణము - ఇతరుల గురించి పరచింతన చేయడం,
చెడు విషయాలను వినడము మరియు వినిపించడము. తండ్రి డైరెక్షన్ ఏమిటంటే - మీరు చెడు
విషయాలను వినకూడదు. వీరి విషయాలను వారికి, వారి విషయాలను వీరికి వినిపించడము, ఈ
చాడీలు చెప్పే కపటము పిల్లలైన మీలో ఉండకూడదు. ఈ సమయములో ప్రపంచములో అందరూ విపరీత
బుద్ధి కలవారే కదా. రాముని గురించి తప్ప వేరే ఏ విషయాలనైనా వినిపించడము అంటే అది
చాడీలు చెప్పే కపటము వంటిదే. ఇప్పుడు తండ్రి అంటారు, మనసులు పాడు చేసే కథలు చెప్పడము
ఆపండి. ఓ సీతల్లారా, మీరు ఒక్క రామునితో యోగాన్ని జోడించండి అని మీరు ఆత్మలందరికీ
చెప్పండి. మీరు సందేశకులు. తండ్రి నన్ను స్మృతి చేయండి అని చెప్తున్నారు అన్న ఈ
సందేశాన్ని ఇవ్వండి, చాలు. ఈ విషయము తప్ప మిగిలిన విషయాలన్నీ పరచింతన చేయడమే. తండ్రి
పిల్లలందరికీ - ఈ చాడీలు చెప్పడము ఆపండి అని చెప్తున్నారు. సీతలందరి యోగాన్ని ఒక్క
రామునితో జోడింపజేయండి. ఇదే మీ వృత్తి. ఈ సందేశాన్ని ఇస్తూ ఉండండి, అంతే. తండ్రి
వచ్చి ఉన్నారు, మీరు స్వర్ణిమ యుగములోకి వెళ్ళాలి అని వారు చెప్తున్నారు. ఇప్పుడు ఈ
ఇనుపయుగాన్ని ఇక వదలాలి. మీకు వనవాసము లభించింది, అడవిలో కూర్చున్నారు కదా. వనము అని
అడవినే అంటారు. కన్యకు వివాహము జరిగేటప్పుడు ముందు వనంలో కూర్చుంటుంది, ఆ తర్వాత
మహల్లోకి వెళ్తుంది. మీరు కూడా అడవిలో కూర్చున్నారు. ఇప్పుడు అత్తవారింటికి వెళ్ళాలి,
ఈ పాత దేహాన్ని వదిలేయాలి. ఒక్క తండ్రినే స్మృతి చేయండి. ఎవరికైతే వినాశన కాలములో
ప్రీతి బుద్ధి ఉంటుందో, వారు మహల్లోకి వెళ్తారు. మిగిలిన విపరీత బుద్ధి కలవారిది
వనవాసము. వారు అడవిలో నివాసముంటారు. తండ్రి పిల్లలైన మీకు భిన్న-భిన్న రీతులలో అర్థం
చేయిస్తారు. ఏ తండ్రి నుండైతే ఇంతటి అనంతమైన రాజ్యాధికారాన్ని తీసుకున్నారో, వారినే
మర్చిపోతే ఇక వనవాసములోకి వెళ్ళిపోయినట్లే. వనవాసము మరియు పూలతోటవాసము. తండ్రి పేరే
తోట యజమాని. కానీ ఇది ఎవరి బుద్ధిలోకైనా రావాలి కదా. భారత్ లోనే మన రాజ్యము ఉండేది.
ఇప్పుడు అది లేదు. ఇప్పుడు వనవాసము ఉంది. తర్వాత పూలతోటలోకి వెళ్తారు. మీరు ఇక్కడ
కూర్చున్నా కూడా - మేము అనంతమైన తండ్రి నుండి మా రాజ్యాన్ని తీసుకుంటున్నాము అన్నది
బుద్ధిలో ఉంది. నాతో ప్రీతిని ఉంచండి అని తండ్రి అంటారు, అయినా మళ్ళీ మర్చిపోతారు.
మీ తండ్రినైన నన్ను ఎంతకాలమని మర్చిపోతూ ఉంటారు అని తండ్రి ఫిర్యాదు చేస్తున్నారు.
మరి అలాగైతే స్వర్ణిమ యుగములోకి ఎలా వెళ్తారు. స్వయాన్ని ప్రశ్నించుకోండి - మేము
ఎంత సమయము బాబాను స్మృతి చేస్తున్నాము. మనము స్మృతి అనే అగ్నిలో పడి ఉన్నట్లు
ఉన్నాము, దాని ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి. ఒక్క తండ్రిపై ప్రీతి బుద్ధి కలిగి
ఉండాలి. వారు అందరికన్నా ఫస్ట్ క్లాస్ అయిన ప్రియుడు, వారు మిమ్మల్ని కూడా ఫస్ట్
క్లాస్ వారిగా తయారుచేస్తారు. థర్డ్ క్లాస్ లో మేకల్లా ప్రయాణం చేయడం ఎక్కడ, ఎయిర్
కండిషన్ లో ప్రయాణం చేయడం ఎక్కడ! ఎంత తేడా ఉంది. ఇదంతా విచార సాగర మంథనము చేయాలి,
అప్పుడు మీకు ఆనందము కలుగుతుంది. ఈ బాబా కూడా అంటారు - నేను కూడా బాబాను స్మృతి
చేయడానికి ఎంతగానో కష్టపడతాను, మొత్తము రోజంతా ఆలోచన నడుస్తూ ఉంటుంది. పిల్లలైన మీరు
కూడా ఈ కృషిని చేయాలి. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.