12-07-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీరు ఈశ్వరుని సంతానము నుండి రాకుమారులు, రాకుమారీలుగా అవ్వాలి, అందుకే స్మృతి యాత్ర ద్వారా మీ వికర్మలను భస్మం చేసుకోండి’’

ప్రశ్న:-
ఏ ఒక్క విధి ద్వారా మీ దుఃఖాలన్నీ దూరమవుతాయి?

జవాబు:-
ఎప్పుడైతే మీరు మీ దృష్టిని తండ్రి దృష్టితో జోడిస్తారో, అప్పుడు దృష్టి జోడించబడడంతో మీ దుఃఖాలన్నీ దూరమవుతాయి ఎందుకంటే స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయడం ద్వారా అన్ని పాపాలు అంతమవుతాయి. ఇదే మీ స్మృతి యాత్ర. మీరు దేహపు ధర్మాలన్నింటినీ వదిలి తండ్రిని స్మృతి చేస్తారు, తద్వారా ఆత్మ సతోప్రధానముగా అవుతుంది, మీరు సుఖధామానికి యజమానులుగా అవుతారు.

ఓంశాంతి
శివ భగవానువాచ, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ కూర్చోండి. తండ్రి ఆజ్ఞను ఇస్తున్నారు, శివ భగవానువాచ అంటేనే శివబాబా అర్థం చేయిస్తున్నారు - పిల్లలూ, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ కూర్చోండి, ఎందుకంటే మీరందరూ సోదరులు. మీరు ఒకే తండ్రికి పిల్లలు. ఒకే తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి, ఏ విధముగా 5000 సంవత్సరాల క్రితం తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకున్నారో అచ్చంగా అలాగే తీసుకోవాలి. ఆది సనాతన దేవీ-దేవతల రాజధానిలో ఉండేవారు. మీరు సూర్యవంశీయులుగా అనగా విశ్వాధిపతులుగా ఎలా అవ్వగలరు అనేది తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. మీ తండ్రినైన నన్ను స్మృతి చేయండి. ఆత్మలైన మీరందరూ పరస్పరం సోదరులు. ఉన్నతోన్నతుడైన భగవంతుడు ఒక్కరే. ఆ సత్యమైన ఈశ్వరుని పిల్లలైన మీరందరూ ఈశ్వరీయ సంతానము. ఈ విషయాలను తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. వారి శ్రీమతము ఆధారముగా బుద్ధియోగాన్ని జోడించినట్లయితే మీ పాపాలన్నీ అంతమైపోతాయి, అన్ని దుఃఖాలూ దూరమైపోతాయి. తండ్రితో ఎప్పుడైతే మన నేత్రాలు కలుస్తాయో అప్పుడు మన దుఃఖాలన్నీ దూరమైపోతాయి. కనులు కలుపడం యొక్క అర్థాన్ని కూడా వివరిస్తారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి, ఇదే స్మృతి యాత్ర, దీనిని యోగాగ్ని అని కూడా అంటారు. ఈ యోగాగ్ని ద్వారా మీ జన్మజన్మాంతరాల పాపాలేవైతే ఉన్నాయో, అవన్నీ భస్మమైపోతాయి. ఈ ప్రపంచమే దుఃఖధామము. అందరూ నరకవాసులుగా ఉన్నారు. మీరు ఎన్నో పాపాలు చేసారు, దీనిని రావణరాజ్యం అని అంటారు. సత్యయుగాన్ని రామరాజ్యం అని అంటారు. మీరు ఈ విధంగా అర్థం చేయించవచ్చు. ఎంత పెద్ద సభ కూర్చుని ఉన్నా కానీ, భాషణ చేయడానికి ఎటువంటి సంకోచమూ ఉండకూడదు. మీరైతే భగవానువాచ అని అంటూ ఉంటారు. శివ భగవానువాచ - ఆత్మలమైన మనమందరమూ వారి సంతానము, సోదరులము. శ్రీకృష్ణుని సంతానము అని ఇలా ఎవ్వరూ అనరు. అలాగే ఇంతమంది రాణులు కూడా లేరు. శ్రీకృష్ణుని స్వయంవరం ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు అతని పేరే మారిపోతుంది. లక్ష్మీ-నారాయణులకు పిల్లలు ఉన్నారు అని అంటారు. రాధ-శ్రీకృష్ణులే స్వయంవరం తర్వాత లక్ష్మీ-నారాయణులుగా అవుతారు, అప్పుడు ఒక కొడుకు ఉంటాడు, ఆపై వారి వంశము కొనసాగుతుంది. పిల్లలైన మీరు ఇప్పుడు నన్నొక్కరినే స్మృతి చేయాలి. దేహపు సర్వ ధర్మాలనూ వదలండి, తండ్రిని స్మృతి చేయండి, అప్పుడు మీ పాపాలన్నీ అంతమవుతాయి, సతోప్రధానముగా అయి స్వర్గములోకి వెళ్తారు. స్వర్గములో ఎటువంటి దుఃఖమూ ఉండదు. నరకములో అపారమైన దుఃఖాలు ఉన్నాయి, సుఖము యొక్క గుర్తులు కూడా లేవు. ఈ విధంగా యుక్తిగా తెలియజేయాలి. శివ భగవానువాచ - ఓ పిల్లలూ, ఈ సమయంలో ఆత్మలైన మీరు పతితులుగా ఉన్నారు, ఇప్పుడు పావనులుగా ఎలా అవుతారు? నన్ను - ఓ పతిత పావనా రండి! అనే పిలిచారు. పావనులు సత్యయుగములోనే ఉంటారు. పతితులు కలియుగములో ఉంటారు. కలియుగము తర్వాత మళ్ళీ సత్యయుగముగా తప్పకుండా అవ్వనున్నది. కొత్త ప్రపంచ స్థాపన, పాత ప్రపంచ వినాశనం జరుగుతుంది. బ్రహ్మా ద్వారా స్థాపన అన్న గాయనము కూడా ఉంది. బ్రహ్మాకుమార, కుమారీలమైన మనం దత్తత తీసుకోబడ్డ పిల్లలము. బ్రాహ్మణులమైన మనం పిలకవంటి వారము. విరాట రూపము కూడా ఉంది కదా. మొదట బ్రాహ్మణులుగా తప్పకుండా అవ్వవలసి ఉంటుంది. బ్రహ్మా కూడా బ్రాహ్మణుడే. దేవతలు సత్యయుగములో ఉంటారు. సత్యయుగములో సదా సుఖము ఉంటుంది, దుఃఖము యొక్క పేరు కూడా ఉండదు. కలియుగములో అపారమైన దుఃఖము ఉంది, అందరూ దుఃఖితులుగా ఉన్నారు. దుఃఖము లేనివారు ఎవ్వరూ ఉండరు. ఇది రావణరాజ్యము. ఈ రావణుడు భారత్ కు నంబర్ వన్ శత్రువు. ప్రతి ఒక్కరిలోనూ 5 వికారాలు ఉన్నాయి. సత్యయుగములో ఎటువంటి వికారాలూ ఉండవు. అది పవిత్ర గృహస్థ ధర్మము. ఇప్పుడైతే దుఃఖపు పర్వతాలు పైన పడ్డాయి, అవి ఇంకా పడనున్నాయి. ఇన్ని బాంబులు మొదలైనవాటినేవైతే తయారుచేస్తూ ఉంటారో, అవి దాచి ఉంచుకోవడానికైతే కాదు కదా. చాలా రిఫైన్ చేస్తున్నారు, ఆ తర్వాత రిహార్సల్ జరుగుతుంది, ఆపై ఫైనల్ జరుగుతుంది. ఇప్పుడు సమయం చాలా కొద్దిగానే ఉంది, డ్రామా అయితే తన సమయానికి పూర్తవుతుంది కదా.

మొట్టమొదట శివబాబా జ్ఞానము ఉండాలి. ఏదైనా భాషణ మొదలైనవి ప్రారంభించేటప్పుడు ఎల్లప్పుడూ మొట్టమొదట శివాయ నమః ...అని అనాలి ఎందుకంటే, శివబాబా మహిమ ఏదైతే ఉందో అది ఇంకెవ్వరికీ ఉండదు. శివ జయంతియే వజ్రతుల్యమైనది. శ్రీకృష్ణుని చరిత్ర మొదలైనవేవీ లేవు. సత్యయుగములోనైతే చిన్న పిల్లలు కూడా సతోప్రధానముగానే ఉంటారు. పిల్లలలో ఎటువంటి చంచలత్వము మొదలైనవి ఉండవు. శ్రీకృష్ణుడి విషయములో - వెన్న తినేవాడని, అది-ఇది చేసేవాడని చూపిస్తారు. ఇది మహిమకు బదులుగా ఇంకా గ్లాని చేయడమే. ఎంత సంతోషంగా ఈశ్వరుడు సర్వవ్యాపి, నీలోనూ ఉన్నాడు, నాలోనూ ఉన్నాడు అని అనేస్తారు! ఇది చాలా పెద్ద గ్లాని కానీ తమోప్రధాన మనుష్యులు ఈ విషయాలను అర్థం చేసుకోలేరు. కావున మొట్టమొదట తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి - వారు నిరాకారుడైన తండ్రి, వారి పేరే కళ్యాణకారీ శివ, వారు సర్వుల సద్గతిదాత. ఆ నిరాకారుడైన తండ్రి సుఖసాగరుడు, శాంతిసాగరుడు. మరి ఇప్పుడు ఇన్ని దుఃఖాలు ఎందుకు వచ్చాయి? ఎందుకంటే ఇది రావణరాజ్యము. రావణుడు అందరి శత్రువు, అతడిని హతమారుస్తారు కూడా, కానీ అతను చనిపోడు. ఇక్కడ ఏదో ఒక్క దుఃఖము కాదు, అపారమైన దుఃఖము ఉంది. సత్యయుగములో అపారమైన సుఖము ఉంటుంది. 5000 సంవత్సరాల క్రితం అనంతమైన తండ్రికి పిల్లలుగా అయ్యారు మరియు ఈ వారసత్వాన్ని తండ్రి నుండి తీసుకున్నారు. శివబాబా తప్పకుండా వస్తారు, వారు వచ్చి ఏదో ఒకటైతే చేస్తారు కదా. వారు ఏక్యురేట్ గా చేస్తారు, కావుననే వారి మహిమ గానం చేయబడుతుంది. శివరాత్రి అని కూడా అంటారు, ఆ తర్వాత శ్రీకృష్ణుని రాత్రి ఉంటుంది. ఇప్పుడు శివరాత్రిని మరియు శ్రీకృష్ణుని రాత్రిని కూడా అర్థం చేసుకోవాలి. శివుడు అనంతమైన రాత్రిలోనే వస్తారు. శ్రీకృష్ణుని జన్మ అమృతవేళలో జరుగుతుంది, అంతేకానీ రాత్రివేళలో కాదు. శివుని రాత్రిని జరుపుకుంటారు కానీ, వారి తిథి-తారీఖు ఏమీ లేదు. శ్రీకృష్ణుని జన్మ అమృతవేళలో జరుగుతుంది. అమృతవేళ అన్నింటికన్నా శుభముహూర్తంగా భావించడం జరుగుతుంది. వారు శ్రీకృష్ణుని జన్మను రాత్రి 12 గంటలకు జరుపుకుంటారు, కానీ అది ప్రభాతవేళ ఏమీ కాదు. ఉదయం 2-3 గంటల సమయమును ప్రభాతవేళ అని అంటారు, ఆ సమయంలో స్మరణ కూడా చేయగలుగుతారు. రాత్రి 12 గంటలకు వికారాల్లో నుండి లేచి ఎవ్వరూ భగవంతుడి నామజపం చేయరు, అలా ఏమాత్రమూ చేయరు. రాత్రి 12 గంటలను అమృతవేళ అని అనరు. ఆ సమయములో మనుష్యులు పతితముగా, అశుద్ధముగా అవుతారు. వాయుమండలమంతా అశుద్ధముగా ఉంటుంది. ఉదయం రెండున్నర గంటలకు ఎవ్వరూ లేవరు. 3-4 గంటల సమయం అమృతవేళ. ఆ సమయంలో మనుష్యులు లేచి భక్తిని చేస్తారు, ఆ సమయాన్ని మనుష్యులు తయారుచేసారు, కానీ వాస్తవానికి అలా సమయమేదీ లేదు. కావున మీరు శ్రీకృష్ణుని జన్మవేళను కనుక్కోవచ్చు. శివుని వేళను ఏమాత్రమూ కనుక్కోలేరు. ఇదైతే వారు స్వయమే వచ్చి అర్థం చేయిస్తారు. కావున మొట్టమొదట శివబాబా మహిమను తెలియజేయాలి. పాటను చివరిలో కాదు, మొదటే వినిపించాలి. శివబాబా అందరికన్నా మధురమైన బాబా, వారి ద్వారా అనంతమైన వారసత్వము లభిస్తుంది. నేటికి 5000 సంవత్సరాల క్రితం ఈ శ్రీకృష్ణుడు సత్యయుగపు మొదటి యువరాజుగా ఉండేవారు. అక్కడ అపారమైన సుఖము ఉండేది. ఈనాటికీ స్వర్గ గాయనమును చేస్తూ ఉంటారు. ఎవరైనా మరణిస్తే ఫలానావారు స్వర్గస్థులయ్యారు అని అంటారు. అరే, ఇప్పుడైతే ఇది నరకము, స్వర్గమున్నట్లయితే స్వర్గములో పునర్జన్మలను తీసుకోగలుగుతారు.

మా వద్ద ఇన్ని సంవత్సరాల అనుభవం ఉంది, దానిని కేవలం 15 నిమిషాల్లో అయితే అర్థం చేయించలేము కదా, దాని కోసం సమయం కావాలి అని వారికి అర్థం చేయించాలి. మొట్టమొదటైతే ఒక్క క్షణము యొక్క విషయాన్ని వినిపిస్తాము, అనంతమైన తండ్రి ఎవరైతే దుఃఖహర్త, సుఖకర్తగా ఉన్నారో వారి పరిచయాన్ని ఇస్తాము, వారు ఆత్మలైన మనందరికీ తండ్రి. బి.కే.లమైన మేమందరమూ శివబాబా శ్రీమతముపై నడుస్తాము. ఆ తండ్రి చెప్తున్నారు - మీరందరూ పరస్పరం సోదరులు, నేను మీకు తండ్రిని. నేను 5000 సంవత్సరాల క్రితం వచ్చాను, అందుకే శివజయంతిని జరుపుకుంటారు. స్వర్గములో ఏదీ జరుపుకోబడదు. శివజయంతి జరుగుతుంది, దానిని మళ్ళీ భక్తి మార్గములో స్మృతిచిహ్నముగా జరుపుకుంటారు. ఈ గీతా అధ్యాయము నడుస్తోంది. కొత్త ప్రపంచ స్థాపన బ్రహ్మా ద్వారా, పాత ప్రపంచ వినాశనం శంకరుని ద్వారా. ఇప్పుడు ఈ పాత ప్రపంచ వాయుమండలమునైతే మీరు చూస్తున్నారు, ఈ పతిత ప్రపంచ వినాశనం తప్పకుండా జరుగనున్నది, కావుననే పావన ప్రపంచములోకి తీసుకువెళ్ళండి అని అంటారు. అపారమైన దుఃఖాలు ఉన్నాయి - గొడవలు, మృత్యువు, వైధవ్యము, జీవహత్య చేసుకోవడం... ఎన్నో ఉన్నాయి. సత్యయుగములోనైతే అపారమైన సుఖాల రాజ్యం ఉండేది. ఈ లక్ష్యము-ఉద్దేశ్యము యొక్క చిత్రమునైతే తప్పకుండా అక్కడకు తీసుకువెళ్ళాలి. ఈ లక్ష్మీ-నారాయణులు విశ్వాధిపతులుగా ఉండేవారు. వీరు ఏ విధంగా ఈ జన్మను పొందారు, వీరు ఏ కర్మలు చేసిన కారణముగా ఇలా అయ్యారు అని 5000 సంవత్సరాల విషయాన్ని వినిపిస్తాము. కర్మ-అకర్మ-వికర్మల గతులను తండ్రే అర్థం చేయిస్తారు. సత్యయుగములో కర్మలు అకర్మలుగా అవుతాయి. ఇక్కడైతే రావణరాజ్యం ఉన్న కారణముగా కర్మలు వికర్మలుగా అవుతాయి, అందుకే దీనిని పాపాత్ముల ప్రపంచము అని అంటారు. ఇచ్చి-పుచ్చుకోవడాలు కూడా పాపాత్ములతోనే ఉంటాయి. శిశువు కడుపులో ఉండగానే నిశ్చితార్థం చేసేస్తారు, ఎంతటి అశుద్ధమైన దృష్టి ఉంది. ఇక్కడ అంతా వికారీ దృష్టియే ఉంటుంది. సత్యయుగాన్ని నిర్వికారీ దృష్టి కల ప్రపంచం అంటారు. ఇక్కడ కళ్ళు చాలా పాపం చేస్తాయి. అక్కడ అలా పాపాలేవీ చేయరు. సత్యయుగము నుండి మొదలుకుని కలియుగాంతం వరకూ చరిత్ర-భౌగోళము పునరావృతమవుతాయి. దీనిని తెలుసుకోవాలి కదా. దుఃఖధామము, సుఖధామము అని ఎందుకు అంటారు? మొత్తం ఆధారమంతా పతితులుగా మరియు పావనలుగా అవ్వడంలోనే ఉంది, అందుకే తండ్రి అంటారు - కామం మహాశత్రువు, దానిని జయించడం ద్వారా మీరు జగత్ జీతులుగా అవుతారు. అర్ధకల్పం పవిత్ర ప్రపంచము ఉండేది, అందులో శ్రేష్ఠమైన దేవతలు ఉండేవారు. ఇప్పుడు భ్రష్టాచారులుగా ఉన్నారు. ఇది భ్రష్టాచారీ ప్రపంచము అని ఒకవైపు అంటూనే ఉంటారు, మళ్ళీ ఇంకొకవైపు అందరినీ శ్రీ శ్రీ అని అంటూ ఉంటారు, ఏది వస్తే అది అనేస్తూ ఉంటారు. ఇవన్నీ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మృత్యువు ఎదురుగా నిలబడి ఉంది. తండ్రి అంటారు, నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే పాపాలు అంతమవుతాయి, మీరు సతోప్రధానముగా అవుతారు, సుఖధామానికి యజమానులుగా అవుతారు. ఇప్పుడు అంతా దుఃఖమే ఉంది. వారు ఎన్ని కాన్ఫరెన్సులు చేసినా, సమ్మేళనాలు చేసినా దాని వల్ల ఏమీ జరిగేది లేదు. మెట్లు కిందకు దిగుతూనే ఉంటారు. తండ్రి తమ కార్యాన్ని తమ పిల్లల ద్వారా చేస్తున్నారు. పతిత-పావనా రండి అని మీరు పిలిచారు, కావున నేను నా సమయానుసారముగా ఇప్పుడు వచ్చాను. యదా యదాహి ధర్మస్య... దీని అర్థము గురించి కూడా తెలియదు. వారు పిలుస్తున్నారంటే తప్పకుండా వారు స్వయం పతితులుగా ఉన్నారు. తండ్రి అంటారు, రావణుడు మిమ్మల్ని పతితులుగా చేసాడు, ఇప్పుడు నేను పావనులుగా చేయడానికి వచ్చాను. అది పావన ప్రపంచముగా ఉండేది. ఇప్పుడు పతిత ప్రపంచముగా ఉంది. పంచ వికారాలైతే అందరిలోనూ ఉన్నాయి, ఇక్కడ అపారమైన దుఃఖము ఉంది. అన్ని వైపులా అశాంతియే అశాంతి ఉంది. ఎప్పుడైతే మీరు పూర్తిగా తమోప్రధానముగా, పాపాత్ములుగా అయిపోతారో, అప్పుడు నేను వస్తాను. ఎవరైతే నన్ను సర్వవ్యాపి అని నా అపకారము చేస్తారో అటువంటివారికి కూడా నేను ఉపకారము చేయడానికి వస్తాను. ఇటువంటి పతిత రావణ ప్రపంచములోకి, పతిత శరీరములోకి రండి అని మీరు నాకు ఆహ్వానాన్ని ఇస్తారు. నాకు కూడా రథమైతే కావాలి కదా. పావన రథమైతే అవసరం లేదు. రావణరాజ్యంలో పతితులే ఉంటారు, పావనులు ఎవ్వరూ లేరు, అందరూ వికారాల ద్వారానే జన్మిస్తారు. ఇది వికారీ ప్రపంచము, అది నిర్వికారీ ప్రపంచము. ఇప్పుడు మీరు తమోప్రధానము నుండి సతోప్రధానముగా ఎలా అవుతారు? పతిత-పావనుడినైతే నేనే. నాతో యోగాన్ని జోడించండి, భారత్ యొక్క ప్రాచీన రాజయోగము ఇదే. రావడము కూడా తప్పకుండా గృహస్థ మార్గములోకే వస్తారు. వారు ఎంత అద్భుత రీతిలో వస్తారు. వీరు తండ్రి కూడా మరియు తల్లి కూడా, ఎందుకంటే అమృతం వెలువడేందుకు గోముఖం కావాలి. కావున వీరు మాత, పిత, అంతేకాక మాతలను సంభాళించేందుకు సరస్వతిని ముఖ్యురాలిగా ఉంచారు. వారిని జగదాంబ అని అంటారు. కాళీ మాత అని అంటారు, కానీ అటువంటి నల్లని శరీరముతో ఏమైనా ఉంటారా! శ్రీకృష్ణుడిని నల్లగా చేసేసారు ఎందుకంటే కామచితిపైకి ఎక్కి నల్లగా అయిపోయారు. శ్రీకృష్ణుడే నల్లగా, మళ్ళీ తెల్లగా అవుతారు. ఈ విషయాలన్నింటినీ అర్థం చేసుకునేందుకు కూడా సమయం కావాలి. కోట్లాదిమందిలో ఏ కొందరిలోనో, ఆ కొందరిలో కూడా ఏ కొందరి బుద్ధిలోనో ఇది కూర్చుంటుంది ఎందుకంటే అందరిలోనూ పంచ వికారాలు ప్రవేశించి ఉన్నాయి. మీరు ఈ విషయాన్ని సభలో కూడా అర్థం చేయించవచ్చు ఎందుకంటే చెప్పే హక్కు ఎవరికైనా ఉంది, అటువంటి అవకాశాన్ని తీసుకోవాలి. అఫీషియల్ సభలో మధ్యలో ఎవ్వరూ ప్రశ్నలు మొదలైనవి అడగరు, వినడం ఇష్టం లేకపోతే శాంతిగా వెళ్ళిపోండి, శబ్దం చేయకండి. ఇలా-ఇలా కూర్చొని అర్థం చేయించండి. ఇప్పుడైతే అపారమైన దుఃఖము ఉంది. దుఃఖపు పర్వతాలు పడనున్నాయి. మాకు తండ్రి గురించి, వారి రచన గురించి తెలుసు, మీకైతే ఎవరి వృత్తి గురించి తెలియదు. తండ్రి భారత్ ను ప్యారడైజ్ గా ఎప్పుడు మరియు ఎలా తయారుచేసారో, అది మీకు తెలియదు, మీరు వస్తే మేము అర్థం చేయిస్తాము. 84 జన్మలు ఎలా తీసుకుంటారో చెప్తాము. 7 రోజుల కోర్సును తీసుకున్నట్లయితే మిమ్మల్ని 21 జన్మల వరకూ పాపాత్ముల నుండి పుణ్యాత్ములుగా చేస్తాము. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. కర్మ-అకర్మ-వికర్మల గుహ్య గతి గురించి తండ్రి ఏదైతే అర్థం చేయించారో, దానిని బుద్ధిలో ఉంచుకొని పాపాత్ములతో ఇప్పుడు ఇచ్చిపుచ్చుకోవడాలు చేయకూడదు.

2. శ్రీమతముపై మీ బుద్ధియోగాన్ని ఒక్క తండ్రితో జోడించాలి. సతోప్రధానముగా అయ్యే పురుషార్థాన్ని చేయాలి. దుఃఖధామాన్ని సుఖధామముగా తయారుచేయడానికి పతితుల నుండి పావనులుగా అయ్యే పురుషార్థము చేయాలి. అశుద్ధ దృష్టిని పరివర్తన చేయాలి.

వరదానము:-

నాలెడ్జ్ ఫుల్ గా అయ్యి వ్యర్థ ప్రశ్నలన్నింటినీ యజ్ఞములో స్వాహా చేసే నిర్విఘ్న భవ

ఏదైనా విఘ్నం వచ్చినప్పుడు ఏమిటి-ఎందుకు అనే అనేక ప్రశ్నలలోకి వెళ్ళిపోతారు, ప్రశ్నచిత్తులుగా అవ్వటము అనగా వ్యాకులత చెందటము. నాలెడ్జ్ ఫుల్ గా అయ్యి యజ్ఞములో వ్యర్థ ప్రశ్నలన్నింటినీ స్వాహా చేసినట్లయితే మీ సమయమూ మిగులుతుంది మరియు ఇతరుల సమయం కూడా మిగులుతుంది, దీని వలన సహజంగానే నిర్విఘ్నంగా అవుతారు. నిశ్చయము మరియు విజయము జన్మ సిద్ధ అధికారములు - ఈ నషాలో ఉన్నట్లయితే ఎప్పుడూ కూడా వ్యాకులపడరు.

స్లోగన్:-

సదా ఉత్సాహములో ఉండటము మరియు ఇతరులకు ఉత్సాహాన్ని కలిగించటము - ఇదే మీ వృత్తి.