13-02-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - తండ్రి ఎవరో, ఎలా ఉన్నారో, వారిని అలా యథార్థ రీతిలో తెలుసుకుని స్మృతి చేయడము, ఇదే ముఖ్యమైన విషయము, మనుష్యులకు ఈ విషయాన్ని చాలా యుక్తిగా అర్థం చేయించాలి’’

ప్రశ్న:-
మొత్తం విశ్వము కొరకు ఉన్న ఏ చదువును మీరు ఇక్కడ మాత్రమే చదువుకుంటారు?

జవాబు:-
మొత్తం విశ్వము కొరకు ఉన్న చదువేమిటంటే - మీరందరూ ఆత్మలు. ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేసినట్లయితే పావనముగా అవుతారు. మొత్తం విశ్వానికి తండ్రి ఎవరైతే ఉన్నారో, వారు ఒక్కసారి మాత్రమే వస్తారు, అందరినీ పావనముగా తయారుచేసేందుకు వస్తారు. వారే రచయిత మరియు రచన యొక్క జ్ఞానాన్ని ఇస్తారు, అందుకే వాస్తవానికి ఇది ఒక్కటే యూనివర్సిటీ, ఈ విషయాన్ని పిల్లలు స్పష్టము చేసి అర్థం చేయించాలి.

ఓంశాంతి
భగవానువాచ - ఇప్పుడు భగవంతుడు ఎవరు అన్నదైతే ఆత్మిక పిల్లలు అర్థం చేసుకున్నారు. భారత్ లో ఎవరికీ యథార్థ రీతిగా తెలియదు. నేను ఎవరినో, ఎలా ఉంటానో అలా నా గురించి యథార్థ రీతిలో ఎవ్వరికీ తెలియదు అని అంటారు కూడా. మీలో కూడా నంబరువారుగా ఉన్నారు. నంబరువారు పురుషార్థానుసారముగా తెలుసు. ఇక్కడ ఉన్నా కానీ యథార్థ రీతిలో తెలియదు. యథార్థ రీతిలో తెలుసుకుని తండ్రిని స్మృతి చేయడము, ఇది చాలా కష్టము. ఇది చాలా సహజము అని పిల్లలు అంటారు కానీ నేను ఎవరైతే ఉన్నానో, నేను నిరంతరమూ తండ్రిని స్మృతి చేయాలి, బుద్ధిలో ఈ యుక్తి ఉంటుంది. ఆత్మనైన నేను చాలా చిన్నగా ఉంటాను. మన బాబా కూడా చిన్న బిందువే. అర్ధకల్పమైతే భగవంతుని పేరును కూడా ఎవ్వరూ తీసుకోరు. దుఃఖములోనే - ఓ భగవంతుడా అని తలచుకుంటారు. ఇప్పుడు భగవంతుడు ఎవరు అన్నదైతే మనుష్యులెవ్వరూ అర్థం చేసుకోరు. ఇప్పుడు మనుష్యులకు ఎలా అర్థం చేయించాలి - దీనిపై విచార సాగర మంథనము నడవాలి. ప్రజాపిత బ్రహ్మాకుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయము అన్న పేరు కూడా వ్రాసి ఉంది. కానీ ఇది ఆత్మిక అనంతమైన తండ్రి యొక్క ఈశ్వరీయ విశ్వవిద్యాలయము అని దీని ద్వారా కూడా అర్థం చేసుకోరు. ఇప్పుడు మరి మనుష్యులు వెంటనే అర్థం చేసుకోగలిగేలా ఏ పేరు పెట్టాలి? ఇది యూనివర్శిటీ అని మనుష్యులకు ఎలా అర్థం చేయించాలి? యూనివర్స్ (విశ్వము) అన్న పదము నుండి యూనివర్శిటీ (విశ్వవిద్యాలయము) అన్న పదము వెలువడింది. యూనివర్స్ అనగా మొత్తం విశ్వము. దానికి యూనివర్శిటీ అన్న పేరు పెట్టారు, అందులో మనుష్యులందరూ చదువుకోవచ్చు. యూనివర్స్ అంతా (విశ్వమంతా) చదువుకునేందుకు యూనివర్శిటీ (విశ్వవిద్యాలయము) ఉంది. ఇప్పుడు వాస్తవానికి విశ్వము కొరకైతే ఒక్క తండ్రియే వస్తారు, వారి విశ్వవిద్యాలయము ఇది ఒక్కటే. లక్ష్యము-ఉద్దేశ్యము కూడా ఒక్కటే. తండ్రియే వచ్చి పూర్తి విశ్వాన్ని పావనముగా తయారుచేస్తారు, యోగము నేర్పిస్తారు. ఇది సర్వ ధర్మాల వారి కొరకు ఉంది. స్వయాన్ని ఆత్మగా భావించండి అని చెప్తారు. మొత్తం విశ్వానికి తండ్రి - నిరాకారుడైన గాడ్ ఫాదర్, మరి దీనికి స్పిరిచ్యువల్ యూనివర్సిటీ ఆఫ్ స్పిరిచ్యువల్ ఇన్ కార్పోరియల్ గాడ్ ఫాదర్ (నిరాకారుడైన ఆత్మిక గాడ్ ఫాదర్ యొక్క ఆత్మిక విశ్వవిద్యాలయము) అన్న పేరు ఎందుకు పెట్టకూడదు. ఇలా ఆలోచించడం జరుగుతుంది కదా. మనుష్యులు ఎలా ఉన్నారంటే మొత్తము విశ్వములో తండ్రి గురించి ఒక్కరికి కూడా తెలియదు. రచయిత గురించి తెలిస్తే రచన గురించి కూడా తెలుస్తుంది. రచయిత ద్వారానే రచన గురించి తెలుసుకోగలరు. తండ్రి పిల్లలకు అన్ని విషయాలు అర్థం చేయిస్తారు. ఇవి ఇంకెవ్వరికీ తెలియవు. ఋషులు-మునులు కూడా తెలియదు-తెలియదు అని అంటూ వచ్చారు. తండ్రి అంటారు, మీకు ఇంతకుముందు ఈ రచయిత మరియు రచన యొక్క జ్ఞానము లేదు. ఇప్పుడు రచయిత అర్థం చేయించారు. తండ్రి అంటారు - మీరు వచ్చి మాకు సుఖ-శాంతులను ఇవ్వండి అని అందరూ నన్ను పిలుస్తారు కూడా ఎందుకంటే ఇప్పుడు దుఃఖము-అశాంతి ఉన్నాయి. వారి పేరే దుఃఖహర్త-సుఖకర్త. వారు ఎవరు? భగవంతుడు. వారు ఎలా దుఃఖాన్ని హరించి సుఖాన్ని ఇస్తారు, ఇది ఎవ్వరికీ తెలియదు. కావున ఎంత స్పష్టము చేసి వ్రాయాలంటే, తద్వారా నిరాకారుడైన గాడ్ ఫాదరే ఈ జ్ఞానాన్ని ఇస్తారు అని మనుష్యులు అర్థం చేసుకోవాలి. ఈ విధంగా విచార సాగర మంథనము చేయాలి. తండ్రి అర్థం చేయిస్తున్నారు, మనుష్యులందరూ రాతిబుద్ధి కలవారిగా ఉన్నారు. ఇప్పుడు మిమ్మల్ని పారసబుద్ధి కలవారిగా తయారుచేస్తున్నారు. వాస్తవానికి ఎవరైతే తక్కువలో తక్కువ 50 కంటే ఎక్కువ మార్కులు పొందుతారో, వారిని పారసబుద్ధి కలవారు అని అంటారు. ఫెయిల్ అయ్యేవారు పారసబుద్ధి కలవారు కాదు. రామునికి బాణాలు ఎందుకు చూపించారు అన్నది కూడా ఎవ్వరూ అర్థం చేసుకోరు. శ్రీకృష్ణుడు అందరినీ హతమార్చారు అని వారికి స్వదర్శన చక్రాన్ని చూపించారు మరియు రామునికి బాణాలు చూపించారు. ఒక ప్రత్యేకమైన పత్రిక వెలువడుతుంది, అందులో - శ్రీకృష్ణుడు ఏ విధంగా స్వదర్శన చక్రముతో అకాసురుడు-బకాసురుడు మొదలైనవారిని హతమార్చారు అన్నది చూపించారు. ఇరువురినీ హింసకులుగా చూపించారు, అంతేకాక డబల్ హింసకులుగా చూపించారు. వారికి కూడా పిల్లలు జన్మించారు కదా అని అంటారు. అరే, వారు ఉన్నదే నిర్వికారీ దేవీ-దేవతలుగా. అక్కడ రావణ రాజ్యము లేనే లేదు. ఈ సమయములో రావణ సాంప్రదాయులు అని అంటారు.

మనము యోగబలముతో విశ్వ రాజ్యాధికారాన్ని తీసుకుంటాము అన్నప్పుడు మరి యోగబలముతో పిల్లలు జన్మించలేరా అని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. అది ఉన్నదే నిర్వికారీ ప్రపంచము. ఇప్పుడు మీరు శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యారు. ఎంత మంచి రీతిలో అర్థం చేయించాలి, తద్వారా మనుష్యులు వీరి వద్ద పూర్తి జ్ఞానము ఉంది అని భావించాలి. ఈ విషయాన్ని కొద్దిగా అర్థం చేసుకున్నా సరే వీరు బ్రాహ్మణ కులానికి చెందినవారు అని అర్థం చేసుకోవడం జరుగుతుంది. కొందరి విషయములోనైతే - వీరు బ్రాహ్మణ కులానికి చెందినవారు కారు అని వెంటనే అర్థమైపోతుంది. రావడమైతే అనేక రకాలవారు వస్తారు కదా. కావున మీరు స్పిరిచ్యువల్ యూనివర్సిటీ ఆఫ్ స్పిరిచ్యువల్ ఇన్ కార్పోరియల్ గాడ్ ఫాదర్ (నిరాకారుడైన ఆత్మిక గాడ్ ఫాదర్ యొక్క ఆత్మిక విశ్వవిద్యాలయము) అని వ్రాసి చూడండి, ఏమవుతుందో? విచార సాగర మంథనము చేసి పదాలను వెలికి తీయవలసి ఉంటుంది, ఈ విధంగా వ్రాసేందుకు చాలా యుక్తి కావాలి. తద్వారా మనుష్యులు, ఇక్కడ ఈ జ్ఞానాన్ని గాడ్ ఫాదర్ అర్థం చేయిస్తున్నారు మరియు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు అన్నది అర్థం చేసుకుంటారు. ఈ పదాలు కూడా సాధారణమైనవి. ఒక్క క్షణములో జీవన్ముక్తి యొక్క దైవీ స్వరాజ్యము. మనుష్యుల బుద్ధిలో కూర్చునే విధంగా ఇటువంటి పదాలు ఉండాలి. బ్రహ్మా ద్వారా విష్ణుపురి యొక్క స్థాపన జరుగుతుంది. మన్మనాభవ యొక్క అర్థమేమిటంటే - తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి. మీరు బ్రహ్మా ముఖవంశావళి బ్రాహ్మణ కుల భూషణులు, స్వదర్శన చక్రధారులు. ఇప్పుడు వారైతే స్వదర్శన చక్రాన్ని విష్ణువుకు చూపిస్తారు. శ్రీకృష్ణుడికి కూడా నాలుగు భుజాలను చూపిస్తారు. ఇప్పుడు వారికి 4 భుజాలు ఎలా ఉండగలవు? తండ్రి ఎంత బాగా అర్థం చేయిస్తారు. పిల్లలు చాలా విశాలబుద్ధి కలవారిగా, పారసబుద్ధి కలవారిగా అవ్వాలి. సత్యయుగములో యథా రాజా రాణి తథా ప్రజ, అందరినీ పారసబుద్ధి కలవారు అని అంటారు కదా. అది పారస ప్రపంచము, ఇది రాళ్ళ ప్రపంచము. మీకు మనుష్యుల నుండి దేవతలుగా అయ్యే ఈ జ్ఞానము లభిస్తుంది. మీరు మీ రాజ్యాన్ని శ్రీమతము ఆధారముగా మళ్ళీ స్థాపన చేసుకుంటున్నారు. రాజా, మహారాజాగా ఎలా తయారవ్వగలరు అని బాబా మనకు యుక్తిని తెలియజేస్తారు. ఇతరులకు అర్థం చేయించేందుకు మీ బుద్ధిలో ఈ జ్ఞానము నిండుతుంది. సృష్టి చక్రముపై అర్థం చేయించడం కూడా చాలా సహజము. ఈ సమయములో జనాభా సంఖ్య ఎంతగా ఉందో చూడండి! సత్యయుగములో ఎంత కొద్దిమంది ఉంటారు. ఇది సంగమము కదా. బ్రాహ్మణులైతే కొద్దిమందే ఉంటారు కదా. బ్రాహ్మణుల యుగమే చిన్ననిది. బ్రాహ్మణుల తర్వాత దేవతలు, ఇక ఆ తర్వాత వృద్ధి చెందుతారు. పిల్లిమొగ్గలాట ఉంటుంది కదా. కావున మెట్ల వరుస చిత్రముతోపాటు విరాట రూపము చిత్రము కూడా ఉంటే అర్థం చేయించడానికి స్పష్టముగా ఉంటుంది. మీ కులానికి చెందినవారు ఎవరైతే ఉంటారో, వారి బుద్ధిలో రచయిత మరియు రచన యొక్క జ్ఞానము సహజముగానే కూర్చుంటుంది. వీరు మన కులానికి చెందినవారా, కాదా అనేది వారి ముఖము ద్వారా కూడా తెలిసిపోతుంది. ఒకవేళ మన కులానికి చెందినవారు కాకపోతే వెర్రివారి వలె వింటారు. ఎవరైతే వివేకవంతులు ఉంటారో వారు శ్రద్ధగా వింటారు. ఒక్కసారి ఎవరికైనా పూర్తిగా బాణము తగిలితే ఇక వస్తూనే ఉంటారు. కొందరు ప్రశ్నలు అడుగుతారు మరియు కొందరెవరైనా మంచి పుష్పాల వంటివారు ఉంటే, వారు రోజూ తమంతట తామే వచ్చి పూర్తిగా అర్థం చేసుకుని వెళ్ళిపోతారు. చిత్రాల ద్వారానైతే ఎవరైనా అర్థం చేసుకోగలరు. ఇక్కడైతే తప్పకుండా దేవీ-దేవతా ధర్మ స్థాపనను తండ్రి చేస్తున్నారు. కొందరు ఏమీ అడగకుండానే తమంతట తామే అర్థం చేసుకుంటూ ఉంటారు. కొందరైతే చాలా ఎక్కువగా అడుగుతూ ఉంటారు కానీ ఏమీ అర్థం చేసుకోరు. అప్పుడిక అర్థం చేయించవలసి ఉంటుంది, గొడవైతే పడకూడదు. అప్పుడు ఈశ్వరుడు మీకు రక్షణ కూడా ఇవ్వరా అని అంటారు! ఇప్పుడు వారు రక్షణను ఎలా ఇస్తారు అనేది మీకు తెలుసు. కర్మల లెక్కాచారాలనైతే ప్రతి ఒక్కరూ తమది తాము తీర్చుకోవాలి. ఆరోగ్యము పాడైపోతే రక్షించండి అని అడిగేవారు ఎంతోమంది ఉన్నారు. తండ్రి అంటారు, నేనైతే పతితులను పావనముగా తయారుచేయడానికి వస్తాను. ఆ వ్యాపారాన్ని మీరు కూడా నేర్చుకోండి. తండ్రి పంచ వికారాలపై విజయాన్ని పొందేలా చేస్తారు కావున అవి ఇంకా తీవ్రముగా ఎదుర్కొంటాయి. వికారాల తుఫాను చాలా తీవ్రముగా వస్తుంది. తండ్రి అంటారు, తండ్రికి చెందినవారిగా అవ్వడముతో ఈ రోగాలన్నీ బయటకు వస్తాయి, తుఫానులు తీవ్రముగా వస్తాయి. ఇది పూర్తి బాక్సింగ్. మంచి-మంచి పహిల్వానులను కూడా ఓడించేస్తుంది. వద్దనుకుంటున్నా కూడా చెడు దృష్టి కలుగుతుంది అని అంటారు, రిజిస్టరు పాడైపోతుంది. చెడు దృష్టి కలవారితో మాట్లాడకూడదు. బాబా అన్ని సెంటర్ల యొక్క పిల్లలకు అర్థం చేయిస్తున్నారు - చెడు దృష్టి కలవారు చాలామంది ఉన్నారు, పేర్లు తీసుకుంటే ఇంకా ద్రోహులుగా అయిపోతారు. స్వయాన్ని సర్వనాశనము చేసుకునేవారు తప్పుడు పనులు చేయడం మొదలుపెడతారు. కామ వికారము ముక్కు పట్టుకుంటుంది. మాయ వదిలిపెట్టదు, చెడు కర్మలు, చెడు దృష్టి, చెడు మాటలు వెలువడతాయి, చెడు నడవడిక తయారవుతుంది, అందుకే చాలా-చాలా జాగ్రత్తగా ఉండాలి.

పిల్లలైన మీరు ప్రదర్శనీ మొదలైనవి పెట్టినప్పుడు ఎటువంటి యుక్తిని రచించండి అంటే ఎవరైనా కూడా సహజముగా అర్థం చేసుకోగలగాలి. ఈ గీతా జ్ఞానాన్ని స్వయంగా తండ్రి చదివిస్తున్నారు, ఇందులో శాస్త్రాలు మొదలైనవాటి విషయమేమీ లేదు. ఇది చదువు. గీతా పుస్తకమైతే ఇక్కడ లేదు. ఇక్కడ తండ్రి చదివిస్తారు. పుస్తకాన్ని ఏమైనా చేతిలోకి తీసుకుంటారా. మరి ఈ గీత అనే పేరు ఎక్కడి నుండి వచ్చింది? ఈ ధర్మ శాస్త్రాలన్నీ తర్వాతే తయారవుతాయి. అనేక మఠాలు, మార్గాలు ఎన్ని ఉన్నాయి. అందరికీ తమ-తమ శాస్త్రాలు ఉన్నాయి. కొమ్మలు-రెమ్మలు ఏవైతే ఉన్నాయో, చిన్న-చిన్న మఠాలు-మార్గాలు ఏవైతే ఉన్నాయో, వాటికి కూడా తమ, తమ శాస్త్రాలు మొదలైనవి ఉన్నాయి. కావున అవన్నీ పిల్ల జల్ల అయినట్లు. వాటి ద్వారానైతే ముక్తి లభించదు. సర్వ శాస్త్రమయి శిరోమణిగా గీత మహిమ చేయబడింది. గీతా జ్ఞానాన్ని వినిపించేవారు కూడా ఉంటారు కదా. ఈ జ్ఞానాన్ని తండ్రియే వచ్చి ఇస్తారు. శాస్త్రాలు మొదలైనవేమైనా చేతిలో ఉన్నాయా. నేను కూడా శాస్త్రాలను చదవలేదు, మీకు కూడా చదివించను. అక్కడ వారు నేర్చుకుంటారు, నేర్పిస్తారు. ఇక్కడ శాస్త్రాల విషయమేమీ లేదు. తండ్రి ఉన్నదే నాలెడ్జ్ ఫుల్. నేను మీకు సర్వ వేద-శాస్త్రాల సారాన్ని తెలియజేస్తాను. ముఖ్యమైనవి 4 ధర్మాల యొక్క 4 ధర్మ శాస్త్రాలు. బ్రాహ్మణ ధర్మానికి సంబంధించిన పుస్తకము ఏదైనా ఉందా? ఇవి ఎంతగా అర్థం చేసుకోవలసిన విషయాలు. వీటన్నింటినీ తండ్రి కూర్చుని విస్తారముగా అర్థం చేయిస్తారు. మనుష్యులందరూ రాతిబుద్ధి కలవారిగా ఉన్నారు, అందుకే ఇంతటి నిరుపేదలుగా అయ్యారు. దేవతలు బంగారుయుగములో ఉండేవారు, అక్కడ బంగారు మహళ్ళు తయారయ్యేవి, బంగారు గనులు ఉండేవి. ఇప్పుడైతే సత్యమైన బంగారము లేదు. మొత్తం కథ అంతా భారత్ గురించే ఉంది. దేవీ-దేవతలైన మీరు పారసబుద్ధి కలవారిగా ఉండేవారు, విశ్వముపై రాజ్యము చేసేవారు. మనము స్వర్గానికి యజమానులుగా ఉండేవారమని, మళ్ళీ నరకానికి యజమానులుగా అయ్యామని ఇప్పుడు స్మృతి కలిగింది. ఇప్పుడు మళ్ళీ పారసబుద్ధి కలవారిగా అవుతాము. ఈ జ్ఞానము పిల్లలైన మీ బుద్ధిలో ఉంది, దీనిని మళ్ళీ ఇతరులకు అర్థం చేయించాలి. డ్రామానుసారముగా పాత్ర నడుస్తూ ఉంటుంది, సమయమేదైతే గడుస్తూ ఉందో, అది ఏక్యురేట్ గా గడుస్తుంది, అయినా కానీ పురుషార్థమైతే చేయిస్తారు కదా. ఏ పిల్లలకైతే - స్వయంగా భగవంతుడే మమ్మల్ని స్వర్గానికి యజమానులుగా తయారుచేయడానికి పురుషార్థము చేయిస్తున్నారు అన్న నషా ఉందో, వారి ముఖము చాలా ఫస్ట్ క్లాస్ గా, సంతోషముగా ఉంటుంది. తండ్రి రావడము కూడా పిల్లలకు ప్రారబ్ధము కొరకు పురుషార్థము చేయించడానికే వస్తారు. ఇది కూడా మీకే తెలుసు, ప్రపంచములోని వారికెవ్వరికీ తెలియదు. స్వర్గానికి యజమానులుగా తయారుచేయడానికి భగవంతుడు పురుషార్థము చేయిస్తున్నారు కావున సంతోషము ఉండాలి. ముఖము చాలా ఫస్ట్ క్లాస్ గా, సంతోషముగా ఉండాలి. తండ్రి స్మృతితో మీరు సదా హర్షితముగా ఉంటారు. తండ్రిని మర్చిపోవడము వలనే వాడిపోతారు. తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయడము వలన సంతోషము కలుగుతుంది. ప్రతి ఒక్కరి సేవ ద్వారా అర్థం చేసుకోవడం జరుగుతుంది. తండ్రికి పిల్లల యొక్క సుగంధమైతే వస్తుంది కదా. సుపుత్రులైన పిల్లల నుండి సుగంధము వెలువడుతుంది, కుపుత్రుల నుండి దుర్గంధము వెలువడుతుంది. తోటలో సుగంధమయమైన పుష్పాలను తీసుకునేందుకే మనసు కలుగుతుంది. జిల్లేడును ఎవరు తీసుకుంటారు! తండ్రిని యథార్థ రీతిగా స్మృతి చేయడము ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. మాయా బాక్సింగ్ లో ఓడిపోకూడదు. అటెన్షన్ ఉండాలి - ఎప్పుడూ నోటి నుండి చెడు మాటలు రాకూడదు, చెడు దృష్టి, చెడు నడవడిక ఉండకూడదు, చెడు కర్మలు జరగకూడదు.

2. ఫస్ట్ క్లాస్ సుగంధభరితమైన పుష్పము వలె అవ్వాలి. స్వయముగా భగవంతుడు మమ్మల్ని చదివిస్తున్నారు అన్న నషా ఉండాలి. తండ్రి స్మృతిలో ఉంటూ సదా హర్షితముగా ఉండాలి, ఎప్పుడూ వాడిపోకూడదు.

వరదానము:-
ఛాలెంజ్ మరియు ప్రాక్టికల్ యొక్క సమానత ద్వారా స్వయాన్ని పాపాల నుండి సురక్షితముగా ఉంచుకునే విశ్వ సేవాధారీ భవ

పిల్లలైన మీరు ఏదైతే ఛాలెంజ్ చేస్తారో, ఆ ఛాలెంజ్ కు మరియు ప్రాక్టికల్ జీవితానికి సమానత ఉండాలి, లేదంటే పుణ్యాత్మగా అయ్యేందుకు బదులుగా భారము కల ఆత్మగా అయిపోతారు. ఈ పాప-పుణ్యాల గతిని తెలుసుకుని స్వయాన్ని సురక్షితముగా ఉంచుకోండి ఎందుకంటే సంకల్పములో కూడా ఏ రకమైన వికారము యొక్క బలహీనత అయినా, వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన భావన, ద్వేషము లేక ఈర్ష్య యొక్క భావన అయినా పాపపు ఖాతాను పెంచుతుంది, అందుకే పుణ్యాత్మ భవ అనే వరదానము ద్వారా స్వయాన్ని సురక్షితముగా ఉంచుకుని విశ్వ సేవాధారులుగా అవ్వండి. సంగఠిత రూపములో ఏకమతమును, ఏకరస స్థితిని అనుభవం చేయించండి.

స్లోగన్:-
పవిత్రతా దీపాన్ని నలువైపులా వెలిగించినట్లయితే తండ్రిని సహజముగా చూడగలుగుతారు.

అవ్యక్త సూచనలు: ఏకాంతప్రియులుగా అవ్వండి, ఏకతను మరియు ఏకాగ్రతను అలవరచుకోండి

ప్రత్యక్షత జెండాను ఎగురవేసే కంటే ముందు కేవలం రెండు పదాలను ప్రతి కర్మలోకి తీసుకురండి. ఒకటి సర్వ సంబంధాలు, సంపర్కాలలో పరస్పరం ఏకత. అనేక సంస్కారాలు ఉన్నప్పటికీ, అనేకతలో ఏకత మరియు దృఢత, ఇదే సఫలతకు సాధనము. ఒక్కోసారి ఏకత కదిలిపోతుంది. వీరు చేస్తే నేను చేస్తాను... ఇలా కాదు. మీ స్లోగన్- స్వ పరివర్తనతో విశ్వ పరివర్తన, అంతేకానీ విశ్వ పరివర్తనతో స్వ పరివర్తన కాదు.