13-05-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - అనేకమంది దేహధారుల నుండి ప్రీతిని తొలగించి ఒక్క విదేహీ తండ్రిని స్మృతి చేసినట్లయితే మీ అన్ని ఇంద్రియాలు శీతలమైపోతాయి’’

ప్రశ్న:-
దైవీ కులానికి చెందిన ఆత్మలు ఎవరైతే ఉన్నారో, వారి గుర్తులు ఏమిటి?

జవాబు:-
1. దైవీ కులానికి చెందిన ఆత్మలకు ఈ పాత ప్రపంచము పట్ల సహజముగానే వైరాగ్యము ఉంటుంది. 2. వారి బుద్ధి అనంతములో ఉంటుంది. శివాలయములోకి వెళ్ళేందుకు వారు పావనమైన పుష్పముగా తయారయ్యే పురుషార్థము చేస్తారు. 3. ఎటువంటి ఆసురీ నడవడికను నడవరు. 4. ఆసురీ కర్మలేవీ జరగలేదు కదా అని తమ లెక్కాపత్రాన్ని చూసుకుంటారు. వారు తండ్రికి సత్యమే వినిపిస్తారు, ఏదీ దాచిపెట్టరు.

పాట:-
వారు మా నుండి వేరు కారు...

ఓంశాంతి
ఇప్పుడు ఇవి అనంతమైన విషయాలు. హద్దులోని విషయాలన్నీ తొలగిపోతాయి. ప్రపంచములోనైతే అనేకులను స్మృతి చేయడం జరుగుతుంది, అనేకమంది దేహధారుల పట్ల ప్రీతి ఉంది. విదేహీ ఒక్కరే, వారిని పరమపిత పరమాత్మ శివ అని పిలవడం జరుగుతుంది. మీరు ఇప్పుడు వారితోనే బుద్ధి యోగాన్ని జోడించాలి. ఏ దేహధారినీ స్మృతి చేయకూడదు. బ్రాహ్మణులు మొదలైనవారికి తినిపించడము, ఇవన్నీ కలియుగపు ఆచార-వ్యవహారాలు. అక్కడి ఆచార-వ్యవహారాలు మరియు ఇక్కడి ఆచార-వ్యవహారాలు పూర్తిగా వేరు. ఇక్కడ ఏ దేహధారినీ స్మృతి చేయకూడదు. ఎప్పటివరకైతే ఆ అవస్థ రాదో, అప్పటివరకు పురుషార్థము నడుస్తూ ఉంటుంది. తండ్రి అంటారు - ఎంత వీలైతే అంత ఈ పాత ప్రపంచములో ఎవరైతే ఇంతకుముందు ఉండి వెళ్ళిపోయారో మరియు ఎవరైతే ఇప్పుడు ఉన్నారో, వారందరినీ మర్చిపోవాలి. ఎవరికి ఏం అర్థం చేయించాలి అన్నదే మొత్తం రోజంతా బుద్ధిలో నడవాలి. మీరు వచ్చి ప్రపంచము యొక్క భూత, భవిష్యత్, వర్తమానాల గురించి అర్థం చేసుకోండి అని అందరికీ చెప్పాలి, వీటి గురించి ఎవరికీ తెలియదు. భూతకాలము అనగా ఎప్పటినుండి ప్రారంభమయ్యింది అని. వర్తమానము అనగా ప్రస్తుతం ఏం జరుగుతుంది అని. ప్రారంభమయ్యింది సత్యయుగము నుండి. కావున సత్యయుగము నుండి మొదలుకుని ఇప్పటివరకు ఏం జరిగింది మరియు భవిష్యత్తులో ఏం జరగనున్నది - ఇది ప్రపంచానికి ఏ మాత్రమూ తెలియదు. ఇది పిల్లలైన మీకు తెలుసు, అందుకే చిత్రాలు మొదలైనవి తయారుచేస్తారు. ఇది చాలా పెద్ద అనంతమైన నాటకము. అసత్యమైన హద్దులోని నాటకాలనైతే ఎన్నో తయారుచేస్తారు. కథ తయారుచేసేవారు వేరే ఉంటారు మరియు నాటకానికి సంబంధించిన సీన్, సీనరీలను (దృశ్యాలను) తయారుచేసేవారు వేరే ఉంటారు. ఈ రహస్యాలన్నీ ఇప్పుడు మీ బుద్ధిలో ఉన్నాయి. ఇప్పుడు ఏవైతే చూస్తారో అవేవీ ఉండవు. వినాశనమైపోతాయి. మీరు సత్యయుగీ కొత్త ప్రపంచము యొక్క సీన్, సీనరీలను (దృశ్యాలను) చాలా బాగా చూపించాల్సి ఉంటుంది. ఉదాహరణకు అజ్మీర్ లో బంగారు ద్వారక ఉంది, అందులో నుండి కూడా దృశ్యాలను తీసుకుని కొత్త ప్రపంచాన్ని వేరుగా తయారుచేసి అప్పుడు చూపించండి. ఈ పాత ప్రపంచానికి నిప్పు అంటుకోనున్నది, దీని చిత్రము కూడా ఉంది కదా. మరోవైపు ఈ కొత్త ప్రపంచము ఇమర్జ్ అవుతూ ఉంది. ఈ విధంగా ఆలోచిస్తూ మంచి రీతిలో తయారుచేయాలి. ఈ విషయాలను మీరు అర్థం చేసుకుంటారు. ఈ సమయములో మనుష్యులందరిదీ పూర్తిగా రాతి బుద్ధి వలె ఉంది. మీరు ఎంతగా అర్థం చేయించినా కూడా వారి బుద్ధిలో కూర్చోదు. నాటకాలు చేసేవారు సుందరమైన దృశ్యాలను తయారుచేస్తారు, అలాంటివారు ఎవరి నుండైనా సహాయము తీసుకుని స్వర్గము యొక్క దృశ్యాలను చాలా బాగా తయారుచేయించాలి. వాళ్ళు మంచి ఐడియాలు ఇస్తారు, యుక్తులు చెప్తారు. వారికి అర్థం చేయించి, ఎంత బాగా తయారుచేయాలంటే, మనుష్యులు వచ్చి - తప్పకుండా సత్యయుగములో ఒకటే ధర్మము ఉండేది అని అర్థం చేసుకోవాలి. పిల్లలైన మీలో కూడా ధారణ జరిగేవారు నంబరువారుగా ఉన్నారు. దేహాభిమానము కల బుద్ధిని ఛీ-ఛీ అని అనడం జరుగుతుంది. దేహీ-అభిమానులను పుష్పాలు అని అనడం జరుగుతుంది. ఇప్పుడు మీరు పుష్పాలుగా అవుతారు. దేహాభిమానులుగా ఉండడం వలన ముళ్ళగానే ఉండిపోతారు. పిల్లలైన మీకైతే ఈ పాత ప్రపంచము పట్ల వైరాగ్యము ఉంది. మీది అనంతమైన బుద్ధి, అనంతమైన వైరాగ్యము. మనకు ఈ వేశ్యాలయము పట్ల చాలా అయిష్టము ఉంది. ఇప్పుడు మనము శివాలయానికి వెళ్ళేందుకు పుష్పాలుగా తయారవుతున్నాము. అలా తయారవుతూ, తయారవుతూ ఉండగా కూడా ఒకవేళ ఎవరైనా తప్పుడు నడవడికను నడుచుకున్నట్లయితే, వీరిలో ఇప్పుడు భూతము ప్రవేశించింది అని అనుకోవడం జరుగుతుంది. ఒకే ఇంటిలో పతి హంస వలె తయారవుతుండగా, పత్ని అర్థం చేసుకోకపోతే కష్టమవుతుంది. సహనం చేయవలసి ఉంటుంది. వీరి భాగ్యములో లేదు అని అర్థం చేసుకోవడం జరుగుతుంది. అందరూ దైవీ కులానికి చెందినవారిగా అవ్వరు, ఎవరైతే తయారయ్యేది ఉంటుందో, వారే తయారవుతారు. ఈ-ఈ ఆసురీ గుణాలు ఉన్నాయి అని చాలామంది గురించి తప్పుడు నడవడికకు సంబంధించిన రిపోర్టులు వస్తాయి. అందుకే బాబా రోజు అర్థం చేయిస్తారు - ఈ రోజు నేను ఎటువంటి ఆసురీ కర్మలు చేయలేదు కదా అని మీ లెక్కాపత్రాన్ని చూసుకోండి. బాబా అంటారు - మొత్తం జీవితకాలములో ఏవైతే తప్పులు చేసారో, అవి చెప్పండి. ఏదైనా కఠినమైన పొరపాటు చేసినట్లయితే దాని గురించి సర్జన్ కు చెప్పడానికి సిగ్గుగా అనిపిస్తుంది ఎందుకంటే పరువు పోతుంది కదా. ఆ విషయము చెప్పకపోతే మరి నష్టము కలుగుతుంది. మాయ ఎలా చెంపదెబ్బ వేస్తుందంటే ఇక పూర్తిగా సర్వనాశనము చేసేస్తుంది. మాయ చాలా శక్తివంతమైనది. 5 వికారాలపై విజయము పొందలేకపోతే ఇక తండ్రి కూడా ఏం చేస్తారు.

తండ్రి అంటారు - నేను దయార్ద్ర హృదయుడిని కూడా, అలాగే కాలుడికే కాలుడిని కూడా. పతిత-పావనా, మీరు వచ్చి పావనముగా తయారుచేయండి అని నన్ను పిలుస్తారు కూడా. ఈ రెండూ నా పేర్లే కదా. నేను దయార్ద్ర హృదయునిగా మరియు కాలుడికే కాలుడిగా ఎలా ఉన్నాను, ఆ పాత్రను ఇప్పుడు అభినయిస్తున్నాను. నేను ముళ్ళను పుష్పాలుగా తయారుచేస్తాను కావున మీ బుద్ధిలో ఆ సంతోషము ఉంది. అమరనాథుడైన తండ్రి అంటారు, మీరందరూ పార్వతులు. ఇప్పుడు మీరు నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీరు అమరపురిలోకి వెళ్ళిపోతారు. అంతేకాక మీ పాపాలు నాశనమైపోతాయి. ఆ యాత్రలు చేయడం ద్వారా మీ పాపాలు నాశనము అవ్వవు. అవి భక్తి మార్గానికి సంబంధించిన యాత్రలు. ఇక్కడ ఖర్చులు ఎలా చూసుకుంటారు అని పిల్లల్ని ఈ ప్రశ్న కూడా అడుగుతుంటారు. కానీ పిల్లలెవరూ మేము ఈ విధంగా సమాధానము ఇచ్చాము అని బాబాకు సమాచారము ఇవ్వరు. ఇంతమంది పిల్లలందరూ బ్రహ్మాకు సంతానమైన బ్రాహ్మణులు కావున మనమే మన ఖర్చులు చూసుకుంటాము కదా. రాజ్యమును కూడా శ్రీమతము ఆధారముగా మనమే మన కొరకు స్థాపన చేసుకుంటున్నాము. రాజ్యము కూడా మనమే చేస్తాము. రాజయోగాన్ని మనము నేర్చుకుంటున్నాము కావున ఖర్చులు కూడా మనమే చూసుకుంటాము. శివబాబా అయితే అవినాశీ జ్ఞాన రత్నాలను దానము ఇస్తారు, వాటి ద్వారా మనము రాజులకే రాజులుగా అవుతాము. ఏ పిల్లలైతే చదువుకుంటారో, వారే ఖర్చులు చూసుకుంటారు కదా. వారికి ఇలా అర్థం చేయించాలి - మేమే మా ఖర్చులు చూసుకుంటాము, మేము ఎవరినీ యాచించము లేక విరాళాలు తీసుకోము. కాకపోతే పిల్లలు ఈ విధంగా ప్రశ్నిస్తున్నారు అన్నంతవరకు మాత్రమే వ్రాస్తారు. అందుకే బాబా అన్నారు, ఎవరెవరైతే రోజంతటిలో సేవ చేస్తారో, వారు సాయంత్రము లెక్కాపత్రము తెలియజేయాలి. అంతా మళ్ళీ ఒకసారి చూసి ఫాలో అప్ చేయాలి. రావడమైతే ఎంతోమంది వస్తారు. వారంతా ప్రజలుగా అవుతారు. ఉన్నత పదవిని పొందేవారు చాలా తక్కువమంది ఉంటారు. రాజులు కొద్దిమందే ఉంటారు, షావుకారులుగా కూడా కొద్దిమందే అవుతారు. కానీ పేదవారు చాలామంది ఉంటారు. ఇక్కడ కూడా అలాగే ఉంటుంది, దైవీ ప్రపంచములో కూడా అలాగే ఉంటుంది. రాజ్యము స్థాపన అవుతుంది, అందులో నంబరువారుగా అందరూ కావాలి. తండ్రి వచ్చి రాజయోగాన్ని నేర్పించి ఆది సనాతన దైవీ రాజధానిని స్థాపన చేయిస్తారు. దైవీ ధర్మము యొక్క రాజధాని ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు లేదు. తండ్రి అంటారు, నేను అది మళ్ళీ స్థాపన చేస్తాను. ఎవరికైనా అర్థం చేయించేందుకు చిత్రాలు కూడా అటువంటివే కావాలి. బాబా మురళిని వింటారు, దాని అనుసారముగా చిత్రాలను తయారుచేస్తారు. రోజురోజుకు చిత్రాలలో కరెక్షన్లు అయితే జరుగుతూ ఉంటాయి. అలాగే మీరు మీ అవస్థను కూడా చూసుకుంటూ ఉండండి - ఎంతగా సరిదిద్దబడుతూ ఉంది. తండ్రి వచ్చి మురికి నుండి బయటకు తీస్తారు. ఎవరు ఎంతగా అనేకులను మురికి నుండి బయటకు తీసే సేవ చేస్తారో, అంతగా ఉన్నత పదవిని పొందుతారు. పిల్లలైన మీరైతే పూర్తిగా క్షీరఖండము వలె (పాలు, పంచదార వలె) కలిసి-మెలిసి ఉండాలి. బాబా మిమ్మల్ని సత్యయుగము కంటే కూడా ఇక్కడ ఉన్నతముగా తయారుచేస్తారు. తండ్రియైన ఈశ్వరుడు చదివిస్తున్నప్పుడు, మరి వారికి వారు చదివిస్తున్న చదువుతో కలిగిన ప్రభావాన్ని చూపించాలి, అప్పుడు ఇక బాబా కూడా బలిహారమైపోతారు. ఇప్పుడు ఇక నేను భారత్ ను స్వర్గముగా తయారుచేసే వ్యాపారమే చేస్తాను అని మనస్సులో రావాలి. ఈ ఉద్యోగాలు మొదలైనవి అయితే చేస్తూనే ఉంటారు, కానీ ముందు మీ ఉన్నతినైతే చేసుకోండి. నిజానికి ఇది చాలా సహజము. మనుష్యులు అన్నీ చేయగలుగుతారు. గృహస్థ వ్యవహారములో ఉంటూ రాజ్య పదవిని పొందాలి, అందుకే రోజూ మీ లెక్కాపత్రాన్ని చూసుకోండి. రోజంతటి లాభాన్ని, నష్టాన్ని చూసుకోండి. లెక్కాపత్రాన్ని చూసుకోకపోతే బాగవ్వడము చాలా కష్టము. కానీ బాబా చెప్తుంది వినరు. ప్రతిరోజు చూసుకోవాలి - నేను ఎవ్వరికీ దుఃఖము ఇవ్వలేదు కదా. పదవి చాలా ఉన్నతమైనది, అపారమైన సంపాదన ఉంది. లేదంటే తర్వాత ఏడవాల్సి ఉంటుంది. రేస్ లు జరుగుతుంటాయి కదా, కొందరు లక్షల రూపాయలు సంపాదించుకుంటారు, కొందరు బికారులుగానే మిగిలిపోతారు.

ఇప్పుడు మీది ఈశ్వరీయ రేస్, ఇందులో స్థూలంగా పరిగెత్తవలసినదేమీ లేదు. కేవలం బుద్ధి ద్వారా ప్రియమైన తండ్రిని స్మృతి చేయాలి. ఏదైనా తప్పు జరిగితే - బాబా, మా ద్వారా ఈ తప్పు జరిగింది, కర్మేంద్రియాల ద్వారా ఈ తప్పు చేసాము అని బాబాకు వెంటనే వినిపించాలి. బాబా అంటారు, రైట్-రాంగ్ లను (తప్పొప్పులను) ఆలోచించే బుద్ధి అయితే లభించింది కావున ఇప్పుడు ఇక తప్పుడు పనులు చేయకూడదు. తప్పు పని చేసారంటే - బాబా, తప్పు చేసాము, క్షమించండి అని పశ్చాత్తాపపడాలి ఎందుకంటే బాబా ఇప్పుడు వినడం కోసం ఇక్కడ కూర్చున్నారు. ఏదైనా తప్పు పని జరిగితే వెంటనే - బాబా, ఈ తప్పు పని జరిగింది అని చెప్పండి లేక వ్రాయండి, అప్పుడు మీ తప్పులో సగం మన్నించడం జరుగుతుంది. అలాగని నేను కృప చూపిస్తానని కాదు, కొద్దిగా కూడా క్షమించడం లేక కృప చూపించడం జరగదు. అందరూ తమను తాము తీర్చిదిద్దుకోవాలి. తండ్రి స్మృతి ద్వారా వికర్మలు వినాశనమవుతాయి. గతంలో చేసినవి కూడా యోగబలముతో కట్ అవుతూ ఉంటాయి. తండ్రికి చెందినవారిగా అయి మళ్ళీ తండ్రిని నిందింపజేయకండి. సద్గురువుకు నింద తీసుకొచ్చేవారికి ఉన్నత పదవి లభించదు. మీకు చాలా ఉన్నతమైన పదవి లభిస్తుంది. ఇతర గురువుల వద్ద రాజ్య పదవి ఏమీ లేదు. ఇక్కడ మీకు లక్ష్యము-ఉద్దేశ్యము ఉంది. భక్తి మార్గములో లక్ష్యము-ఉద్దేశ్యము ఏమీ ఉండదు. ఒకవేళ ఉన్నా కూడా అల్పకాలికమైనదే ఉంటుంది. 21 జన్మల సుఖమెక్కడ, పైసకు విలువ చేసే కొద్దిపాటి సుఖము ఎక్కడ. ధనము ద్వారా సుఖము లభిస్తుంది అనేమీ కాదు. దాని వల్ల దుఃఖము కూడా ఎంతగా కలుగుతుంది. అచ్ఛా - ఒకవేళ ఎవరైనా హాస్పిటల్ నిర్మిస్తే మరుసటి జన్మలో రోగాలు తక్కువగా ఉంటాయి, అంతేకానీ దాని వల్ల చదువు ఎక్కువ వస్తుందనో, ధనము ఎక్కువ లభిస్తుందనో కాదు. దాని కోసమైతే మిగిలినవన్నీ చేయాలి. ఎవరైనా ధర్మశాలను నిర్మిస్తే మరుసటి జన్మలో మహల్ లభిస్తుంది, అంతేకానీ వారు ఆరోగ్యముగా ఉంటారనేమీ కాదు. అలా కాదు. తండ్రి ఎన్ని విషయాలను అర్థం చేయిస్తున్నారు. కొందరు బాగా అర్థం చేసుకుని ఇతరులకు అర్థం చేయిస్తారు, కొందరు అసలు అర్థమే చేసుకోరు. ప్రతి రోజు లెక్కాపత్రము చూసుకోండి - ఈ రోజు ఏ పాపము చేసాను, ఈ రోజు ఈ విషయములో ఫెయిల్ అయ్యాను. అప్పుడు బాబా - ఇటువంటి పనులు చేయకూడదు అని సలహా ఇస్తారు. మనము ఇప్పుడు స్వర్గములోకి వెళ్తాము అని మనకు తెలుసు. కానీ పిల్లలకు సంతోషము యొక్క పాదరసము పైకి ఎక్కడం లేదు. బాబాకు ఎంత సంతోషము ఉంది - నేను వృద్ధునిగా ఉన్నాను, ఈ శరీరాన్ని వదిలి నేను యువరాజుగా అవ్వబోతున్నాను అని. మీరు కూడా చదువుకుంటున్నారు కావున సంతోషము యొక్క పాదరసము పైకి ఎక్కాలి. కానీ తండ్రిని స్మృతే చేయడం లేదు. తండ్రి ఎంత సహజముగా అర్థం చేయిస్తున్నారు. అక్కడ ఇంగ్లీష్ మొదలైనవి చదవాలంటే ఎంత కష్టపడవలసి వస్తుంది. అందులో చాలా కష్టము ఉంటుంది. ఇది చాలా సహజము. ఈ ఆత్మిక చదువు ద్వారా మీరు శీతలముగా అయిపోతారు. ఇందులో కేవలం తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే మీ ఇంద్రియాలన్నీ పూర్తిగా శీతలమైపోతాయి. శరీరము అనేది మీకు ఉంది కదా. శివబాబాకు అయితే తనదంటూ శరీరము లేదు. ఇంద్రియాలు శ్రీకృష్ణునికి ఉన్నాయి. అతని ఇంద్రియాలైతే శీతలముగానే ఉంటాయి, అందుకే అతని పేరు పెట్టేసారు. మరి ఇప్పుడు అతని సాంగత్యము ఎలా చేయాలి. అతను సత్యయుగములోనే ఉంటారు. అతని ఇంద్రియాలను కూడా అంత శీతలముగా ఎవరు తయారుచేసారు? ఇది మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు. కావున ఇప్పుడు పిల్లలైన మీరు కూడా ఇంతగా ధారణ చేయాలి. ఏ మాత్రమూ గొడవపడకూడదు, కొట్లాడకూడదు. సత్యమే మాట్లాడాలి. అబద్దాలు మాట్లాడితే సర్వనాశనమైపోతుంది.

పిల్లలైన మీకు తండ్రి ఆల్ రౌండ్ అన్ని విషయాలను అర్థం చేయిస్తారు. చిత్రాలు కూడా మంచి-మంచివి తయారుచేసినట్లయితే అవి అందరి వద్దకు వెళ్తాయి. మంచివేవైనా చూస్తే అందరూ - వెళ్ళి చూద్దాము పదండి అని అంటారు. అక్కడ అర్థం చేయించేవారు కూడా తెలివైనవారిగా ఉండాలి. సేవ చేయడం కూడా నేర్చుకోవాలి. తమ సమానముగా తయారుచేసే మంచి బ్రాహ్మణీలు కూడా కావాలి. ఏ బ్రాహ్మణి అయితే తన సమానముగా మేనేజర్ గా తయారుచేస్తుందో, ఆమెను మంచి బ్రాహ్మణీ అని అంటారు. ఆమె పదవి కూడా ఉన్నతమైనది పొందుతారు. బేబీ బుద్ధి (చిన్న పిల్లల వంటి బుద్ధి) కూడా ఉండకూడదు. లేదంటే ఎత్తుకుపోతారు. రావణ సాంప్రదాయము కదా. ఎటువంటి బ్రాహ్మణీని తయారుచేయండి అంటే, ఆమె తర్వాత సెంటరును సంభాళించగలగాలి. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. తండ్రికి తాను చదివిస్తున్న చదువుతో కలిగిన ప్రభావాన్ని మీరు చూపించాలి. భారత్ ను స్వర్గముగా తయారుచేసే వ్యాపారములో నిమగ్నమైపోవాలి. మొదట మీ ఉన్నతి గురించి ఆలోచించాలి. క్షీరఖండము వలె ఉండాలి.

2. ఏదైనా తప్పు జరిగితే తండ్రి నుండి క్షమాపణలు వేడుకుని స్వయాన్ని స్వయమే తీర్చిదిద్దుకోవాలి. తండ్రి కృప చూపించరు, తండ్రి స్మృతి ద్వారా వికర్మలను కట్ చేసుకోవాలి, తండ్రిని నిందింపజేసే పనులేవీ చేయకూడదు.

వరదానము:-
నాలెడ్జ్ ఫుల్ యొక్క విశేషత ద్వారా సంస్కారాల ఘర్షణ నుండి సురక్షితముగా ఉండే కమలపుష్ప సమాన అతీతముగా మరియు సాక్షీ భవ

సంస్కారాలు అనేవి అంతిమము వరకు కొందరివి దాసీ సంస్కారాలుగానే ఉంటాయి, కొందరివి రాజా సంస్కారాలుగా ఉంటాయి. సంస్కారాలు మారాలి అని దాని కోసం ఎదురుచూడకండి, కానీ నాపై ఎవ్వరి ప్రభావము పడకూడదు, ఎందుకంటే ఒకటేమో ప్రతి ఒక్కరి సంస్కారాలు భిన్నముగా ఉంటాయి, మరొకటి అవి మాయ రూపములో కూడా వస్తాయి, అందుకే ఏ విషయం యొక్క నిర్ణయమైనా మర్యాద రేఖ లోపల ఉంటూ చేయండి. భిన్న-భిన్న సంస్కారాలు ఉన్నా కూడా ఘర్షణ జరగకూడదు, దాని కోసం నాలెడ్జ్ ఫుల్ గా అయి కమలపుష్ప సమానముగా అతీతముగా మరియు సాక్షీగా ఉండండి.

స్లోగన్:-
హఠముతో లేక శ్రమతో చేసేందుకు బదులుగా రమణీకతతో పురుషార్థము చేయండి.

అవ్యక్త సూచనలు - ఆత్మిక రాయల్టీని మరియు పవిత్రత యొక్క పర్సనాలిటీని ధారణ చేయండి

పవిత్రత సుఖ-శాంతుల జనని. ఎక్కడైతే పవిత్రత ఉంటుందో అక్కడికి దుఃఖము, అశాంతి రాలేవు. కావున చెక్ చేసుకోండి - సదా సుఖము అనే పానుపుపై ప్రశాంతముగా అనగా శాంత స్వరూపములో విరాజమానమై ఉంటున్నారా? లోలోపల ఎందుకు, ఏమిటి, ఎలా అనే అలజడి ఉంటుందా లేక ఈ అలజడి నుండి దూరముగా సుఖ స్వరూప స్థితి ఉంటుందా?