13-06-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - ఈ అనంతమైన ఆటలో ఆత్మా రూపీ యాక్టర్లు అయిన మీరు పాత్రధారులు, మీ నివాస స్థానము - స్వీట్ సైలెన్స్ హోమ్, అక్కడికి ఇప్పుడు వెళ్ళాలి’’

ప్రశ్న:-
డ్రామా ఆటను గురించే ఎవరికైతే యథార్థముగా తెలుసో, వారి నోటి నుండి ఏ మాటలు వెలువడలేవు?

జవాబు:-
ఇది ఇలా జరిగి ఉండకపోతే అలా జరిగి ఉండేది... ఇది జరగకూడదు... - ఇటువంటి మాటలు డ్రామా ఆటను గురించి తెలిసినవారు మాట్లాడరు. పిల్లలైన మీకు తెలుసు - ఈ డ్రామా ఆట పేను వలె తిరుగుతూ ఉంటుంది, ఏదైతే జరుగుతుందో అదంతా డ్రామాలో నిశ్చితమై ఉంది, చింతించవలసిన విషయమేదీ లేదు.

ఓంశాంతి
తండ్రి ఎప్పుడైతే పిల్లలకు తన పరిచయాన్ని ఇస్తారో, అప్పుడు పిల్లలకు స్వయం యొక్క పరిచయం కూడా లభిస్తుంది. పిల్లలందరూ ఎంతో సమయము దేహాభిమానులుగా ఉంటారు. దేహీ-అభిమానులుగా ఉన్నట్లయితే తండ్రి యొక్క యథార్థ పరిచయము తెలిసి ఉండేది. కానీ డ్రామాలో అలా లేదు. భగవంతుడు గాడ్ ఫాదర్ అని, రచయిత అని అంటారు కూడా, కానీ వారి గురించి తెలియదు. శివలింగము యొక్క చిత్రము కూడా ఉంది, కానీ వారు అంత పెద్దగా అయితే ఉండరు. తండ్రి గురించి యథార్థ రీతిగా తెలియని కారణముగా వారిని మర్చిపోతారు. తండ్రి రచయిత కూడా, వారు తప్పకుండా కొత్త ప్రపంచాన్నే రచిస్తారు, కావున తప్పకుండా పిల్లలైన మనకు కొత్త ప్రపంచపు రాజధాని యొక్క వారసత్వము ఉండాలి. స్వర్గము పేరు కూడా భారత్ లో ప్రసిద్ధమైనది, కానీ ఏమీ అర్థం చేసుకోరు. ఫలానావారు మరణించారు, స్వర్గస్థులయ్యారు అని అంటారు. నిజానికి అలా ఎప్పుడైనా జరుగుతుందా. మనమందరమూ తుచ్ఛబుద్ధి కలవారిగా ఉండేవారమని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు, నంబరువారుగా అని అయితే అంటారు కదా. ముఖ్యమైనవారి గురించే అర్థం చేయించవలసి ఉంటుంది. నేను ఇతడిలోకి వస్తాను, అనేక జన్మల అంతిమ శరీరములోకి వస్తాను. ఇతడు నంబర్ వన్. ఇప్పుడు మనం వారి పిల్లలుగా, బ్రాహ్మణులుగా అయ్యామని పిల్లలు అర్థం చేసుకుంటారు. ఇవన్నీ అర్థం చేసుకోవలసిన విషయాలు. తండ్రి ఎంతో కాలంగా అర్థం చేయిస్తూనే ఉంటారు. లేదంటే నిజానికి తండ్రిని గుర్తించడమనేది ఒక్క క్షణకాలపు విషయము. తండ్రి అంటారు, నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమైపోతాయి. నిశ్చయము ఏర్పడిందంటే ఇంకే విషయములోనూ ప్రశ్నలు మొదలైనవి ఉత్పన్నమవ్వలేవు. మీరు శాంతిధామములో ఉన్నప్పుడు పావనముగా ఉండేవారు అని తండ్రి అర్థం చేయించారు. ఈ విషయాలను కూడా మీరే తండ్రి ద్వారా వింటారు. ఇంకెవ్వరూ వీటిని వినిపించలేరు. ఆత్మలమైన మనం ఎక్కడి నివాసులము అనేది మీకు తెలుసు. ఏ విధంగా నాటకములోని పాత్రధారులు - మేము ఇక్కడి నివాసులము అని అంటారో, వస్త్రాలు మార్చుకుని స్టేజి పైకి వచ్చేస్తారో ఇదీ అంతే. ఇప్పుడు మీరు - మేము ఇక్కడి నివాసులము కాము అని భావిస్తారు. ఇది ఒక నాటకశాల. మనం మూలవతన నివాసులము అని ఇప్పుడు బుద్ధిలోకి వచ్చింది, దానిని స్వీట్ సైలెన్స్ హోమ్ అని అంటారు. దానినే అందరూ కోరుకుంటారు ఎందుకంటే ఆత్మ దుఃఖితముగా ఉంది కదా. అందుకే - మేము తిరిగి ఇంటికి ఎలా వెళ్ళాలి అని అంటారు. ఇంటి గురించి తెలియని కారణముగా భ్రమిస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు అలా భ్రమించడం నుండి విముక్తులయ్యారు. ఇది పిల్లలకు తెలిసిపోయింది. ఇప్పుడిక మీరు నిజంగానే ఇంటికి వెళ్ళాలి. ఆత్మనైన నేను ఎంత చిన్న బిందువును. ఇది కూడా ఒక అద్భుతమే, దీనిని సృష్టి అద్భుతము అని అంటారు. ఇంత చిన్నని బిందువులో ఎంతటి పాత్ర నిండి ఉంది. పరమపిత పరమాత్మ ఏ విధంగా పాత్రను అభినయిస్తారు, అది కూడా మీరు తెలుసుకున్నారు. అందరికన్నా ముఖ్యమైన పాత్రధారి వారే, వారు చేసేవారు మరియు చేయించేవారు కదా. ఆత్మలమైన మనం శాంతిధామము నుండి వస్తామని మధురాతి మధురమైన పిల్లలైన మీకు ఇప్పుడు అర్థమైంది. ఆత్మలు ఏమీ కొత్తగా వెలువడి శరీరములోకి ప్రవేశించవు. అలా కాదు. ఆత్మలన్నీ స్వీట్ హోమ్ లో ఉంటాయి. అక్కడి నుండి పాత్రను అభినయించేందుకు వస్తాయి. అందరూ పాత్రను అభినయించాలి. ఇది ఒక ఆట. ఈ సూర్య, చంద్ర, నక్షత్రాలు ఏమిటి! ఇవన్నీ దీపాలు, వీటి కింద రాత్రి మరియు పగలు ఆట కొనసాగుతుంది. కొందరు సూర్య దేవతాయ నమః, చంద్ర దేవతాయ నమః అని అంటారు, కానీ వాస్తవానికి అవి దేవతలేమీ కావు. ఈ ఆటను గురించి ఎవ్వరికీ తెలియదు. సూర్యచంద్రాదులను కూడా దేవతలు అని అనేస్తారు. వాస్తవానికి ఇవి మొత్తం విశ్వ నాటకము కొరకు దీపాల వంటివి. మనం స్వీట్ సైలెన్స్ హోమ్ యొక్క వాసులము. ఇక్కడ మనం పాత్రను అభినయిస్తున్నాము, ఈ చక్రము పేను వలె తిరుగుతూ ఉంటుంది, ఏదైతే జరుగుతుందో అదంతా డ్రామాలో నిశ్చితమై ఉంది. ఇలా జరిగి ఉండకపోతే అలా జరిగి ఉండేది అని అనకూడదు. ఇది డ్రామా కదా. ఉదాహరణకు మీ మమ్మా ఉండేవారు, ఆమె వెళ్ళిపోతారు అన్నది ఆలోచన కూడా లేదు కదా. అచ్ఛా, ఆమె శరీరము వదిలారు, అది డ్రామా. ఇప్పుడు ఆమె తన కొత్త పాత్రను అభినయిస్తున్నారు. చింతించవలసిన విషయమేమీ లేదు. మేము నటులము అని ఇక్కడ పిల్లలైన మీ అందరి బుద్ధిలోనూ ఉంది. ఇది గెలుపు, ఓటముల ఆట. ఈ గెలుపు, ఓటముల ఆట మాయపై ఆధారితమై ఉంది. మాయతో ఓడిపోతే ఓటమి మరియు మాయపై గెలిస్తే గెలుపు. ఇలా అందరూ గానం చేస్తారు కానీ బుద్ధిలో జ్ఞానము కొద్దిగా కూడా లేదు. మాయ ఏమిటి అనేది మీకు తెలుసు. ఇక్కడ ఉన్నది రావణుడు, అతడినే మాయ అని అంటారు. ధనాన్ని సంపద అని అంటారు. ధనాన్ని మాయ అని అనరు. ఫలానా వారి వద్ద ఎంతో ధనము ఉంది, కావున వారికి మాయ నషా ఎంతో ఉంది అని మనుష్యులు అంటూ ఉంటారు. కానీ మాయ యొక్క నషా ఏమైనా ఉంటుందా! మాయను అయితే మనము జయించేందుకు ప్రయత్నిస్తాము. ఇక్కడ ఏ విషయములోనూ సంశయం ఉత్పన్నమవ్వకూడదు. అపరిపక్వ అవస్థ ఉన్న కారణముగానే సంశయం ఉత్పన్నమవుతుంది. ఇప్పుడు ఇది భగవానువాచ - ఎవరి కోసము? ఆత్మల కోసము. భగవంతుడు అంటే తప్పకుండా శివుడే, వారు ఆత్మలతో మాట్లాడుతారు. శ్రీకృష్ణుడైతే దేహధారి, వారు ఆత్మలతో ఎలా మాట్లాడుతారు. మీకు దేహధారి ఎవరూ జ్ఞానాన్ని వినిపించడం లేదు. తండ్రికైతే దేహము లేదు. మిగిలినవారందరికీ దేహము ఉంది. ఎవరినైతే పూజిస్తారో వారిని స్మృతి చేయడం సహజమే. బ్రహ్మా, విష్ణు, శంకరులను దేవతలు అని అంటారు. శివుడిని భగవంతుడు అని అంటారు. ఉన్నతోన్నతుడు భగవంతుడు, వారికి దేహము లేదు. మూలవతనములో ఆత్మలు ఉన్నప్పుడు మీకు దేహము ఉండేదా? లేదు కదా. అది మీకు తెలుసు. ఆత్మలైన మీరే ఉండేవారు. ఈ బాబా కూడా ఆత్మయే, కేవలం వారు పరమ ఆత్మ, వారి పాత్ర మహిమ చేయబడింది. వీరు పాత్రను అభినయించి వెళ్ళారు, అందుకే పూజ జరుగుతుంది. కానీ 5000 సంవత్సరాల క్రితం కూడా పరమపిత పరమాత్మ అయిన రచయిత వచ్చారు అన్నది తెలిసిన మానవమాత్రులు ఒక్కరు కూడా లేరు, వారే స్వర్గ స్థాపకుడైన గాడ్ ఫాదర్. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత కల్పము యొక్క సంగమములో వారు వస్తారు, కానీ కల్పము యొక్క ఆయువును పెద్దగా చేసెయ్యడంతో అందరూ మర్చిపోయారు. పిల్లలైన మీకు తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. బాబా, మేము మిమ్మల్ని కల్ప-కల్పమూ కలుసుకుంటాము మరియు మీ నుండి వారసత్వాన్ని తీసుకుంటాము అని మీరు స్వయం అంటారు. మళ్ళీ ఎలా పోగొట్టుకుంటారో అది బుద్ధిలో ఉంది. అనేక రకాల జ్ఞానము ఉంది కానీ జ్ఞానసాగరుడు అని భగవంతుడినే అంటారు. వినాశనం తప్పకుండా జరుగుతుంది అని కూడా ఇప్పుడు అందరూ భావిస్తారు. ఇంతకుముందు కూడా వినాశనం జరిగింది కానీ అది ఎలా జరిగింది అనేది ఎవ్వరికీ తెలియదు. శాస్త్రాలలో అయితే వినాశనం గురించి ఏమేమో వ్రాసేసారు. పాండవులు మరియు కౌరవులకు మధ్యన యుద్ధం ఎలా జరగగలదు!

ఇప్పుడు బ్రాహ్మణులైన మీరు సంగమయుగములో ఉన్నారు. బ్రాహ్మణులది యుద్ధమేమీ ఉండదు. తండ్రి అంటారు, నా పిల్లలైన మీరు అహింసాయుతులు, డబుల్ అహింసకులు. ఇప్పుడు మీరు నిర్వికారులుగా అవుతున్నారు. మీరే తండ్రి నుండి కల్ప-కల్పమూ వారసత్వాన్ని తీసుకుంటారు. ఇందులో కష్టముతో కూడిన విషయమేదీ లేదు. జ్ఞానము చాలా సహజమైనది. 84 జన్మల చక్రము మీ బుద్ధిలో ఉంది. ఇప్పుడు నాటకము పూర్తవుతుంది, ఇంకా కొద్ది సమయమే ఉంది. షావుకారులకు కూడా ధాన్యము, నీరు లభించని సమయము ఇప్పుడు రాబోతుందని మీకు తెలుసు. దీనిని దుఃఖపు పర్వతాలు అని అంటారు, ఇది రక్తసిక్తమైన ఆట కదా. ఇంతమంది ఉన్నారు, అందరూ అంతమైపోతారు. ఎవరైనా తప్పు చేస్తే వారికి దండన లభిస్తుంది. కానీ వీరంతా ఏం తప్పు చేసారు? కేవలం ఒకే తప్పు చేసారు - తండ్రిని మర్చిపోయారు. మీరైతే తండ్రి నుండి రాజ్యాన్ని తీసుకుంటున్నారు. మిగిలిన మనుష్యులందరూ ఇక మేము మరణించబోతున్నాము అని భావిస్తారు. మహాభారత యుద్ధము కొద్దిగా ప్రారంభమైనా ఇక మరణిస్తారు. మీరైతే జీవిస్తారు కదా. మీరు ట్రాన్స్ఫర్ అయ్యి అమరలోకములోకి వెళ్తారు, ఈ చదువు యొక్క శక్తితో వెళ్తారు. చదువును సంపాదనకు ఆధారము అంటారు. శాస్త్రాల చదువు కూడా ఉంది, దాని ద్వారా కూడా సంపాదన జరుగుతుంది. కానీ ఆ చదువు భక్తి యొక్క చదువు. ఇప్పుడు తండ్రి అంటారు, నేను మిమ్మల్ని ఈ లక్ష్మీ-నారాయణుల వెల తయారుచేస్తాను. మీరు ఇప్పుడు స్వచ్ఛమైన బుద్ధి కలవారిగా అవుతారు. మేము ఉన్నతోన్నతులుగా అవుతాము, మళ్ళీ పునర్జన్మలు తీసుకుంటూ, తీసుకుంటూ కిందకు దిగుతాము అని మీకు తెలుసు. కొత్త నుండి పాతగా అవుతుంది. మెట్లు తప్పకుండా దిగవలసే ఉంటుంది కదా. ఇప్పుడు సృష్టిది కూడా దిగే కళ. పైకి ఎక్కే కళలో ఉన్నప్పుడు ఈ దేవతల రాజ్యము ఉండేది, స్వర్గము ఉండేది. ఇప్పుడు నరకము ఉంది. ఇప్పుడు మీరు మళ్ళీ స్వర్గవాసులుగా అయ్యేందుకు పురుషార్థము చేస్తున్నారు. బాబా, బాబా అని అంటూ ఉంటారు.

ఓ గాడ్ ఫాదర్ అని పిలుస్తూ ఉంటారు, కానీ అర్థం చేసుకోని విషయమేమిటంటే - వారు ఆత్మలకు తండ్రి, వారు ఉన్నతోన్నతమైనవారు, మరి వారి పిల్లలమైన మనము దుఃఖితులుగా ఎందుకు ఉన్నాము? కానీ దుఃఖితులుగా కూడా అవ్వవలసిందేనని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. ఇది సుఖ-దుఃఖాల ఆట కదా. గెలుపులో సుఖము ఉంది, ఓటమిలో దుఃఖము ఉంది. తండ్రి రాజ్యాన్ని ఇచ్చారు, దానిని రావణుడు లాక్కున్నాడు. తండ్రి నుండి మనకు స్వర్గ వారసత్వము లభిస్తూ ఉంటుంది అని ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. తండ్రి వచ్చి ఉన్నారు, ఇప్పుడు కేవలం తండ్రిని స్మృతి చేయాలి, అప్పుడు పాపాలు అంతమైపోతాయి. శిరస్సుపై జన్మజన్మాంతరాల భారము ఉంది కదా. ఇది ఇప్పుడు మీకు తెలుసు. మీరు ఏమీ చాలా దుఃఖితులుగా అవ్వరు. పిండిలో ఉప్పులా కొంత సుఖము కూడా ఉంది. దానిని కాకిరెట్టతో సమానమైన సుఖము అని అంటారు. సర్వుల సద్గతిదాత ఒక్క తండ్రియేనని మీకు తెలుసు. జగత్తుకు గురువు కూడా ఆ ఒక్కరే. వానప్రస్థావస్థలో గురువును ఆశ్రయించడం జరుగుతుంది. కానీ ఇప్పుడైతే చిన్న పిల్లల చేత కూడా గురువును ఆశ్రయించేలా చేస్తారు. అతడు ఒకవేళ మరణిస్తే సద్గతిని పొందుతాడు కదా అని భావించి అలా చేస్తారు. తండ్రి అంటారు, వాస్తవానికి ఎవ్వరినీ గురువు అని అనలేరు. గురువు అంటే సద్గతిని ఇచ్చేవారు. సద్గతిదాత అయితే ఒక్కరే. ఇకపోతే క్రైస్టు, బుద్ధుడు మొదలైనవారెవ్వరూ గురువులు కారు. వారు వచ్చినప్పుడు ఏమైనా అందరికీ సద్గతి లభిస్తుందా! క్రైస్టు వచ్చారు, వారు వెనుక ఆ ధర్మానికి చెందినవారందరూ రావడం మొదలుపెట్టారు. వారు వారందరినీ కిందకు తీసుకువచ్చేందుకు నిమిత్తము అయినప్పుడు, మరి వారిని గురువు అని ఎలా అనగలరు. పతిత-పావనుడు అని ఒక్క తండ్రినే అంటారు, వారు అందరినీ తిరిగి తీసుకువెళ్ళనున్నారు. వారు స్థాపన కూడా చేస్తారు, ఎందుకంటే స్థాపన చేయకుండా కేవలం అందరినీ తీసుకువెళ్ళినట్లయితే అది ప్రళయమైపోతుంది. కానీ ప్రళయము జరగదు. సర్వశాస్త్రమయి శిరోమణిగా శ్రీమద్భగవద్గీత గానం చేయబడింది. యదా యదాహి... అన్న గాయనము ఉంది. భారత్ లోకే తండ్రి వస్తారు. స్వర్గ రాజ్యాధికారాన్ని ఇచ్చేవారు తండ్రియే, వారిని కూడా సర్వవ్యాపి అని అనేస్తారు. కొత్త ప్రపంచములో మొత్తం విశ్వముపై మన ఒక్కరి రాజ్యమే ఉంటుందని ఇప్పుడు పిల్లలైన మీకు ఎంతో సంతోషము ఉంది. ఆ రాజ్యాన్ని ఎవ్వరూ దోచుకోలేరు. ఇక్కడైతే చిన్న-చిన్న ముక్కల కోసం పరస్పరం ఎంతగా కొట్లాడుకుంటూ ఉంటారు. మీకైతే ఆనందముగా ఉంది. సంతోషములో గంతులు వేయాలి. కల్ప-కల్పమూ తండ్రి నుండి మనం వారసత్వాన్ని తీసుకుంటాము కావున ఎంతటి సంతోషము ఉండాలి. నన్ను స్మృతి చేయండి అని తండ్రి అంటారు, అయినా మర్చిపోతారు. బాబా, యోగము తెగిపోతుంది అని అంటారు. బాబా అన్నారు, యోగము అన్న పదాన్ని తీసేయండి. అది శాస్త్రాల పదము. తండ్రి అంటారు, నన్ను స్మృతి చేయండి. యోగము అన్నది భక్తి మార్గపు పదము. తండ్రి నుండి స్వర్గ రాజ్యాధికారము లభిస్తుంది, మీరు వారిని స్మృతి చేయకపోతే వికర్మలు ఎలా వినాశనమవుతాయి, రాజ్యము ఎలా లభిస్తుంది? స్మృతి చేయకపోతే పదవి కూడా తగ్గిపోతుంది, శిక్షలు కూడా అనుభవిస్తారు. ఆ తెలివి కూడా లేదు. అంతటి అవివేకులుగా అయిపోయారు. నేను కల్ప-కల్పమూ మీకు చెప్తాను - నన్నొక్కరినే స్మృతి చేయండి, జీవిస్తూనే ఈ ప్రపంచము నుండి మరణించండి. తండ్రి స్మృతి ద్వారా మీ వికర్మలు వినాశనమవుతాయి మరియు మీరు విజయమాలలోని మణులుగా అవుతారు. ఇది ఎంత సహజము. ఉన్నతోన్నతుడైన శివబాబా మరియు బ్రహ్మా - ఇరువురూ హైయ్యెస్ట్ (ఉన్నతోన్నతమైనవారు). వారు పారలౌకికమైనవారు అయితే వీరు అలౌకికమైనవారు. ఎంతో సాధారణమైన టీచర్. ఆ టీచర్లు అయితే శిక్ష విధిస్తారు. కానీ ఈ టీచర్ అయితే ముద్దు చేస్తూ ఉంటారు. వీరు అంటారు - మధురమైన పిల్లలూ, తండ్రిని స్మృతి చేయండి, సతోప్రధానముగా అవ్వాలి. పతిత-పావనుడు ఒక్క తండ్రియే. గురువు కూడా వారే. ఇంకెవ్వరూ గురువు కారు. బుద్ధుడు నిర్వాణము చెందారు అని అంటారు, అవన్నీ ప్రగల్భాలే. ఒక్కరు కూడా తిరిగి వెళ్ళలేరు. అందరికీ డ్రామాలో పాత్ర ఉంది. ఎంతటి విశాలబుద్ధి మరియు సంతోషము ఉండాలి. పై నుండి క్రింద వరకూ మొత్తం జ్ఞానమంతా బుద్ధిలో ఉంది. బ్రాహ్మణులే జ్ఞానము తీసుకుంటారు. శూద్రులలోనూ మరియు దేవతలలోనూ ఈ జ్ఞానము లేదు. ఇక అర్థం చేసుకునేవారు అర్థం చేసుకుంటారు. ఎవరైతే అర్థం చేసుకోరో వారికి మృత్యువే. పదవి కూడా తక్కువైపోతుంది. స్కూల్లో కూడా చదువుకోకపోతే పదవి తక్కువైపోతుంది. అల్ఫ్ అనగా బాబా మరియు బే అనగా రాజ్యాధికార వారసత్వము. మనం మళ్ళీ మన రాజధానిలోకి వెళ్తున్నాము. ఈ పాత ప్రపంచము అంతమైపోతుంది. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. తండ్రి మనకు ఎటువంటి కొత్త విశ్వము యొక్క రాజ్యాధికారాన్ని ఇస్తారంటే, ఇక దానిని ఎవ్వరూ దోచుకోలేరు - ఈ సంతోషములో గంతులు వేయాలి.

2. విజయమాలలోని మణులుగా అయ్యేందుకు జీవిస్తూనే ఈ పాత ప్రపంచము నుండి మరణించాలి. తండ్రి స్మృతి ద్వారా వికర్మలను వినాశనం చేసుకోవాలి.

వరదానము:-
మీ శక్తిశాలి స్థితి ద్వారా సర్వుల శుభ కామనలను పూర్తి చేసే మహాదాని భవ

చివరిలో వచ్చే ఆత్మలు కొద్దిలోనే సంతుష్టులు అవుతారు, ఎందుకంటే వారి పాత్రయే కొద్దిగా పొందే విధముగా ఉంటుంది. ఇటువంటి ఆత్మలకు వారి భావన యొక్క ఫలము లభించాలి, ఎవ్వరూ వంచితులు అవ్వకూడదు. దీని కోసం ఇప్పటి నుండే స్వయములో సర్వ శక్తులను జమ చేసుకోండి. ఎప్పుడైతే మీరు మీ సంపూర్ణ శక్తిశాలి, మహాదాని స్థితిలో స్థితులవుతారో అప్పుడు ఏ ఆత్మనైనా మీ సహయోగముతో, మహాదానమునిచ్చే కర్తవ్యము యొక్క ఆధారముతో శుభ భావన యొక్క స్విచ్ ను ఆన్ చేయడంతోనే, దృష్టి ద్వారా అతీతులుగా చేసేస్తారు.

స్లోగన్:-
సదా ఈశ్వరీయ మర్యాదలపై నడుస్తూ ఉన్నట్లయితే మర్యాదా పురుషోత్తములుగా అయిపోతారు.

అవ్యక్త ప్రేరణలు - ఆత్మిక స్థితిలో ఉండే అభ్యాసము చెయ్యండి, అంతర్ముఖులుగా అవ్వండి

సేవా స్టేజ్ పైకి వెళ్ళినప్పుడు ఎలా అనుభవమవ్వాలంటే - ఈ ఆత్మలు చాలా సమయము నుండి అంతర్ముఖత, ఆత్మికత అనే గుహలో ఉంటూ ఇప్పుడు సేవ కోసమై బయటకు వచ్చారు. తపస్వీ రూపము కనిపించాలి. అనంతమైన వైరాగ్యపు రేఖలు ముఖములో కనిపించాలి. ఎంతగా అతి ఆత్మిక నషానో అంతగానే అతి దయ. ఇప్పుడు ఇది ఇటువంటి సేవ చేసే సమయము.