15-07-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీరు ఇప్పుడు భవిష్య 21 జన్మల కొరకు ఇక్కడే చదువుకోవాలి, ముళ్ళ నుండి సుగంధమయమైన పుష్పాలుగా తయారవ్వాలి, దైవీ గుణాలను ధారణ చేయాలి మరియు చేయించాలి’’

ప్రశ్న:-
ఏ పిల్లల బుద్ధి తాళము నంబరువారుగా తెరుచుకుంటూ ఉంటుంది?

జవాబు:-
ఎవరైతే శ్రీమతముపై నడుస్తూ ఉంటారో, పతిత-పావనుడైన తండ్రి స్మృతిలో ఉంటారో, ఎవరి యోగమైతే చదువును చదివించేవారితో జోడింపబడి ఉంటుందో, వారి బుద్ధి తాళము తెరుచుకుంటూ ఉంటుంది. బాబా అంటారు - పిల్లలూ, ఆత్మలమైన మనందరమూ పరస్పరం సోదరులమని, మనము తండ్రి ద్వారా వింటున్నామని అభ్యాసము చేయండి. దేహీ-అభిమానులుగా అయి వినండి మరియు వినిపించండి, అప్పుడు తాళము తెరుచుకుంటూ ఉంటుంది.

ఓంశాంతి
తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు - ఇక్కడ కూర్చున్నప్పుడు కేవలం శివబాబా స్మృతిలోనే ఉండాలని కూడా ఏమీ లేదు, అది కేవలం శాంతిని ఇస్తుంది. మరి సుఖము కూడా కావాలి కదా! మీరు శాంతిలోనూ ఉండాలి మరియు స్వదర్శన చక్రధారులుగా అయి రాజ్యాన్ని కూడా స్మృతి చేయాలి. మీరు నరుని నుండి నారాయణునిగా అనగా మనిషి నుండి దేవతగా తయారయ్యేందుకు పురుషార్థము చేస్తారు. ఇక్కడ ఎవరిలో ఎన్ని దైవీ గుణాలు ఉన్నా కానీ వారిని దేవతలు అని అనరు. దేవతలు స్వర్గములోనే ఉంటారు. ప్రపంచములో మనుష్యులకు స్వర్గము గురించి తెలియదు. కొత్త ప్రపంచాన్ని స్వర్గమని, పాత ప్రపంచాన్ని నరకమని అంటారని పిల్లలైన మీకు తెలుసు. ఇది కూడా భారతవాసులకే తెలుసు. ఏ దేవతలైతే సత్యయుగములో రాజ్యము చేసేవారో వారి చిత్రాలు కూడా భారత్ లోనే ఉన్నాయి. వారు ఆది సనాతన దేవీ-దేవతా ధర్మానికి చెందినవారు. ఆ తర్వాత వారి చిత్రాలను పూజించేందుకని విదేశాలకు తీసుకువెళ్తారు. విదేశాలలో ఎక్కడకు వెళ్ళినా అక్కడ మందిరాలను నిర్మిస్తారు. ప్రతి ఒక్క ధర్మమువారు ఎక్కడికి వెళ్ళినా తమ చిత్రాలనే పూజిస్తూ ఉంటారు. ఏయే గ్రామాలపై విజయాన్ని పొందుతారో అక్కడకు వెళ్ళి చర్చులు మొదలైనవాటిని నిర్మిస్తారు. ప్రతి ఒక్క ధర్మమువారికి పూజించేందుకు తమ-తమ చిత్రాలు ఉన్నాయి. మేమే దేవీ-దేవతలము అని ఇంతకుముందు మీకు కూడా తెలియదు. స్వయాన్ని వేరుగా భావిస్తూ ఆ దేవీ-దేవతలను పూజించేవారు. ఇతర ధర్మాలవారు పూజించినప్పుడు వారికి తెలుసు, మా ధర్మ స్థాపకుడు క్రైస్టు, మేము క్రిస్టియన్లము, బౌద్ధులము అన్న పరిచయము వారికి ఉంది. ఈ హిందువులు తమ ధర్మము గురించి తెలియని కారణముగా తమను తాము హిందువులు అని పిలుచుకుంటారు కానీ దేవతలను పూజిస్తారు. మేము ఆది సనాతన దేవీ-దేవతా ధర్మానికి చెందినవారమని, మేము మా పూర్వీకులను పూజిస్తున్నామని కూడా వారు భావించరు. క్రిస్టియన్లు ఒక్క క్రైస్టును మాత్రమే పూజిస్తారు. మా ధర్మము ఏది, ఆ ధర్మాన్ని ఎవరు స్థాపించారు మరియు ఎప్పుడు స్థాపించారు అన్నది కూడా భారతవాసులకు తెలియదు. తండ్రి అంటారు, ఈ భారత్ యొక్క ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము ఎప్పుడైతే కనుమరుగైపోతుందో, అప్పుడు నేను దానిని పునః స్థాపన చేయడానికి వస్తాను. ఈ జ్ఞానము ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. ఇంతకుముందు మీకు ఏమీ తెలియదు. ఏమీ తెలియకుండానే భక్తి మార్గములో చిత్రాలను పూజిస్తూ ఉండేవారు. మనము భక్తి మార్గములో లేమని ఇప్పుడు మీకు తెలుసు. ఇప్పుడు బ్రాహ్మణ కులభూషణులైన మీకు మరియు శూద్ర కులమువారికి రాత్రికి, పగలుకు ఉన్నంత తేడా ఉంది. అది కూడా ఈ సమయములోనే మీరు అర్థం చేసుకుంటారు. సత్యయుగములో ఇలా అనుకోరు. ఈ సమయములోనే మీకు జ్ఞానము లభిస్తుంది. తండ్రి ఆత్మలకు జ్ఞానాన్ని ఇస్తారు. పాత ప్రపంచము మరియు కొత్త ప్రపంచము గురించి బ్రాహ్మణులైన మీకు మాత్రమే తెలుసు. పాత ప్రపంచములో అనేకమంది మనుష్యులు ఉన్నారు. ఇక్కడ మనుష్యులు ఎంతగా గొడవపడుతూ, కొట్లాడుకుంటూ ఉంటారు. ఇది ఒక ముళ్ళ అడవి. మీరు కూడా ఒకప్పుడు ముళ్ళలా ఉండేవారని మీకు తెలుసు. ఇప్పుడు బాబా మనల్ని పుష్పాలుగా తయారుచేస్తున్నారు. ముళ్ళు ఈ సుగంధమయమైన పుష్పాలకు నమస్కరిస్తూ ఉంటారు. ఈ రహస్యాన్ని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. మేమే దేవతలుగా ఉండేవారము, ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి సుగంధమయ పుష్పాలుగా (బ్రాహ్మణులుగా) అయ్యాము. ఇది ఒక డ్రామా అని తండ్రి అర్థం చేయించారు. పూర్వము ఈ డ్రామాలు, సినిమాలు మొదలైనవి లేవు. ఇవి కూడా ఇప్పుడే తయారయ్యాయి. ఎందుకు తయారయ్యాయి? ఎందుకంటే బాబా ఉదాహరణలు ఇచ్చేందుకు సహజముగా ఉండాలని ఇవి తయారయ్యాయి. పిల్లలు కూడా అర్థం చేసుకోగలరు. ఈ సైన్స్ ను కూడా పిల్లలైన మీరు నేర్చుకోవాలి కదా. బుద్ధిలో ఈ సైన్స్ యొక్క సంస్కారాలన్నింటినీ తీసుకువెళ్తారు, ఇవి మళ్ళీ అక్కడ ఉపయోగపడతాయి. ప్రపంచము ఒక్కసారిగా ఏమీ అంతమైపోదు. సంస్కారాలను తీసుకువెళ్ళి మళ్ళీ అక్కడ జన్మ తీసుకుంటారు. విమానాలు మొదలైనవి కూడా తయారుచేస్తారు. అక్కడ ఉపయోగపడే వస్తువులు ఏవేవైతే ఉన్నాయో అవి అక్కడ తయారవుతాయి. స్టీమర్లు తయారుచేసేవారు కూడా ఉంటారు కానీ అక్కడ స్టీమర్లు ఉపయోగపడవు. స్టీమర్లు తయారుచేసేవారు ఎవరైనా జ్ఞానము తీసుకున్నా, తీసుకోకపోయినా కానీ వారి ఆ సంస్కారము అక్కడ ఉపయోగపడదు. అక్కడ స్టీమర్లు మొదలైనవాటి అవసరమే ఉండదు. అది డ్రామాలో లేదు. ఆ, విమానాలు, విద్యుత్తు మొదలైనవాటి అవసరము ఉంటుంది. వీటిని అక్కడ ఆవిష్కరిస్తూ ఉంటారు. అక్కడి నుండి పిల్లలు నేర్చుకుని వస్తారు. ఈ విషయాలన్నీ పిల్లలైన మీ బుద్ధిలో ఉన్నాయి.

మనము కొత్త ప్రపంచము కొరకే చదువుకుంటున్నామని మీకు తెలుసు. బాబా మనల్ని భవిష్య 21 జన్మల కొరకు చదివిస్తున్నారు. మనము స్వర్గవాసులుగా అయ్యేందుకు పవిత్రముగా అవుతున్నాము. పూర్వము నరకవాసులుగా ఉండేవారము. ఫలానావారు స్వర్గస్థులయ్యారు అని మనుష్యులు అంటూ ఉంటారు కూడా, కానీ తాము నరకములో ఉన్నామని భావించరు. బుద్ధి తాళము తెరుచుకోదు. పిల్లలైన మీ బుద్ధి తాళము ఇప్పుడు మెల్లమెల్లగా, నంబరువారుగా తెరుచుకుంటూ ఉంటుంది. ఎవరైతే శ్రీమతముపై నడవడం మొదలుపెడతారో మరియు పతిత-పావనుడైన తండ్రిని స్మృతి చేస్తారో వారి తాళమే తెరుచుకుంటుంది. తండ్రి జ్ఞానాన్ని కూడా ఇస్తారు మరియు స్మృతిని కూడా నేర్పిస్తారు. వారు మన టీచర్ కదా. కావున టీచర్ తప్పకుండా చదివిస్తారు. ఎంతగా టీచర్ తో మరియు చదువుతో యోగము ఉంటుందో, అంతగా ఉన్నత పదవిని పొందుతారు. ఆ చదువులోనైతే యోగము తప్పకుండా ఉంటుంది. నన్ను బ్యారిస్టర్ చదివిస్తున్నారు అని వారికి తెలుసు. ఇక్కడ తండ్రి చదివిస్తున్నారు. ఈ విషయాన్ని కూడా మర్చిపోతారు, ఎందుకంటే ఇది కొత్త విషయము కదా. దేహాన్ని స్మృతి చేయడమైతే చాలా సహజము. ఘడియ, ఘడియ దేహము గుర్తుకువస్తూ ఉంటుంది. నేను ఒక ఆత్మను అన్న విషయాన్ని మర్చిపోతారు. ఆత్మలైన మనకు తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఆత్మలమైన మనము పరస్పరం సోదరులము. తాను పరమాత్మ అన్న విషయము తండ్రికి తెలుసు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఇతర ఆత్మలకు కూర్చుని నేర్పించండి అని తండ్రి ఆత్మలకు నేర్పిస్తున్నారు. ఇది ఆత్మ చెవుల ద్వారా వింటుంది, వినిపించేవారు పరమపిత పరమాత్మ. వారిని సుప్రీమ్ ఆత్మ అని అంటారు. మీరు ఎవరికైనా అర్థం చేయించేటప్పుడు మీకు బుద్ధిలో ఏముండాలంటే - ఆత్మనైన నాలో జ్ఞానము ఉంది, నేను ఇది ఆత్మకు వినిపిస్తున్నాను, నేను బాబా నుండి ఏదైతే విన్నానో దానిని ఇతర ఆత్మలకు వినిపిస్తున్నాను. ఇది పూర్తిగా కొత్త విషయము. మీరు ఇతరులను చదివించేటప్పుడు దేహీ-అభిమానులుగా అయి చదివించడం లేదు, ఈ విషయాన్ని మర్చిపోతున్నారు. ఇదే గమ్యము కదా. బుద్ధిలో గుర్తుండాలి - ఆత్మనైన నేను అవినాశీ, ఆత్మనైన నేను ఈ కర్మేంద్రియాల ద్వారా పాత్రను అభినయిస్తున్నాను. ఆత్మలైన మీరు శూద్ర కులములో ఉండేవారు, ఇప్పుడు బ్రాహ్మణ కులములో ఉన్నారు, ఆ తర్వాత దేవతా కులములోకి వెళ్తారు, అక్కడ శరీరము కూడా పవిత్రమైనదే లభిస్తుంది. ఆత్మలమైన మనము సోదరులము. తండ్రి పిల్లలను చదివిస్తున్నారు. పిల్లలు అంటారు - మేము పరస్పరం సోదరులము, నేను నా సోదరుడిని చదివిస్తున్నాను. ఆత్మకే అర్థం చేయిస్తారు. ఆత్మ శరీరము ద్వారా వింటుంది. ఇవి చాలా సూక్ష్మమైన విషయాలు. ఇవి స్మృతిలోకి రావు. అర్ధకల్పము మీరు దేహాభిమానములో ఉన్నారు. ఈ సమయములో మీరు దేహీ-అభిమానులుగా అయి ఉండాలి. స్వయాన్ని ఆత్మగా నిశ్చయము చేసుకోవాలి, ఆత్మగా నిశ్చయము చేసుకుని కూర్చోండి, ఆత్మగా నిశ్చయము చేసుకుని వినండి. పరమపిత పరమాత్మయే వినిపిస్తున్నారు, అందుకే కదా - ఆత్మ మరియు పరమాత్మ చాలాకాలము దూరముగా ఉన్నారు అని అంటారు. ఆ పరంధామములో అయితే చదివించను. ఇక్కడికే వచ్చి చదివిస్తాను. ఇతర ఆత్మలందరికీ తమ-తమ శరీరాలు ఉన్నాయి. ఈ తండ్రి అయితే సుప్రీమ్ ఆత్మ, వారికి తమ శరీరము లేదు. వారి ఆత్మకు ఉన్న పేరే శివ. ఈ శరీరము నాది కాదని మీకు తెలుసు. నేను సుప్రీమ్ ఆత్మను. నా మహిమ వేరు. ప్రతి ఒక్కరి మహిమ ఎవరిది వారిది ఉంటుంది కదా. పరమపిత పరమాత్మ బ్రహ్మా ద్వారా స్థాపన చేస్తారు అన్న గాయనము కూడా ఉంది కదా. వారు జ్ఞానసాగరుడు, మనుష్య సృష్టికి బీజరూపుడు. వారు సత్యమైనవారు, చైతన్యమైనవారు, వారు ఆనందము మరియు సుఖ-శాంతుల సాగరుడు. ఇది తండ్రి మహిమ. పిల్లలకు తమ తండ్రి ఆస్తిని గురించి తెలిసి ఉంటుంది కదా - మా తండ్రి వద్ద ఈ కార్ఖానా ఉంది, ఈ మిల్లు ఉంది అని, ఆ నషా ఉంటుంది కదా. పిల్లలే ఆ ఆస్తికి వారసులుగా అవుతారు. ఈ ఆస్తి ఒకే ఒక్కసారి లభిస్తుంది. తండ్రి వద్ద ఏ ఆస్తి ఉంది అనేది మీరు విన్నారు.

ఆత్మలైన మీరైతే అమరులు, మీరు ఎప్పుడూ మృత్యువును పొందరు. ప్రేమ సాగరులుగా కూడా అవుతారు. ఈ లక్ష్మీ-నారాయణులు ప్రేమ సాగరులు, వారు ఎప్పుడూ కొట్లాడటము, గొడవపడటము చేయరు. ఇక్కడైతే ఎంతగా కొట్లాడుతూ, గొడవపడుతూ ఉంటారో చూడండి. ప్రేమలో ఇంకా ఎక్కువ అలజడే కలుగుతుంది. తండ్రి వచ్చి వికారాలను సమాప్తము చేయిస్తే ఎంతగా దెబ్బలు పడుతుంటాయి. తండ్రి అంటారు - పిల్లలూ, పావనముగా అవ్వండి, తద్వారా పావన ప్రపంచానికి యజమానులుగా అవుతారు. కామము మహాశత్రువు, అందుకే బాబా వద్దకు వచ్చినప్పుడు బాబా అంటారు, మీరు ఏ వికర్మలనైతే చేసారో అవి చెప్పేసినట్లయితే తేలిక అయిపోతారు, అందులోనూ ముఖ్యమైనది వికారాలకు సంబంధించిన విషయము. తండ్రి పిల్లల కళ్యాణము కొరకే ఈ విషయాలను అడుగుతారు. ఓ పతిత-పావనా రండి అని తండ్రినే పిలుస్తారు ఎందుకంటే పతితులు అని వికారాలలోకి వెళ్ళేవారినే అంటారు. ఈ ప్రపంచము కూడా పతితమైనదే, మనుష్యులు కూడా పతితమైనవారే, పంచ తత్వాలు కూడా పతితమైనవే. అక్కడ మీ కొరకు తత్వాలు కూడా పవిత్రమైనవి కావాలి. ఈ ఆసురీ పృథ్విపై దేవతల నీడ కూడా పడలేదు. లక్ష్మిని ఆహ్వానిస్తారు కానీ ఆమె ఇక్కడకు రాలేరు. ఈ పంచ తత్వాలు కూడా మారవలసి ఉంటుంది. సత్యయుగము కొత్త ప్రపంచము, ఇది పాత ప్రపంచము. ఇప్పుడు ఇది ఈ పాత ప్రపంచము అంతమయ్యే సమయము. ఇప్పుడింకా 40 వేల సంవత్సరాలు మిగిలి ఉన్నాయని మనుష్యులు భావిస్తారు. అసలు కల్పమే 5000 సం.లు అయినప్పుడు ఇక ఈ ఒక్క కలియుగమే 40,000 సం.లు ఎలా ఉంటుంది. ఎంతటి అజ్ఞాన అంధకారము! జ్ఞానము లేదు. భక్తి అనేది బ్రాహ్మణుల రాత్రి. జ్ఞానము అనేది బ్రహ్మా మరియు బ్రాహ్మణుల పగలు, ఆ సమయము ఇప్పుడు ప్రాక్టికల్ గా జరుగుతోంది. మెట్ల వరుస చిత్రములో ఇది చాలా స్పష్టముగా చూపించబడింది. కొత్త ప్రపంచము మరియు పాత ప్రపంచము సగము, సగము ఉంటాయి. కొత్త ప్రపంచానికి ఎక్కువ సమయము, పాత ప్రపంచానికి తక్కువ సమయము ఇవ్వడం జరగదు. అలా ఉండదు. రెండూ సగం-సగం ఉంటాయి. వాటిని నాలుగు భాగాలుగా కూడా చేయవచ్చు. సగం సమయము లేకపోతే నాలుగు భాగాలుగా చేయడం కూడా కష్టమవుతుంది. స్వస్తికములో కూడా 4 భాగాలను చూపిస్తారు. మేము శుభ కార్యము ప్రారంభిస్తున్నాము అని భావిస్తారు. ఈ పాత ప్రపంచము వినాశనము కాబోతోందని ఇప్పుడు పిల్లలు భావిస్తారు. మనము కొత్త ప్రపంచము కొరకు చదువుకుంటున్నాము. మనము కొత్త ప్రపంచము కొరకు నరుడి నుండి నారాయణుడిగా తయారవుతున్నాము. శ్రీకృష్ణుడు కూడా కొత్త ప్రపంచానికి చెందినవారే. శ్రీకృష్ణునికి గాయనము ఉంది, అతడిని మహాత్మ అని అంటారు ఎందుకంటే అతడు చిన్న బాలుడు. చిన్న పిల్లలు ప్రియముగా ఉంటారు. చిన్న పిల్లలను ఎంతగా ప్రేమిస్తారో అంతగా పెద్దవారిని ప్రేమించరు, ఎందుకంటే పిల్లలది సతోప్రధాన అవస్థ, వారిలో వికారాల దుర్గంధము ఉండదు. వయస్సు పెరిగిన తర్వాత వికారాల దుర్గంధము ఏర్పడుతుంది. పిల్లలకు ఎప్పుడూ చెడు దృష్టి ఉండదు. ఈ కళ్ళే మోసము చేస్తుంటాయి, అందుకే కళ్ళను తీసేసినట్లుగా ఉదాహరణను చూపిస్తారు. వాస్తవానికి ఇలా చేయవలసిన అవసరమేమీ లేదు. అలా కళ్ళను ఎవ్వరూ తీసుకోరు. ఈ సమయములో బాబా జ్ఞాన విషయాలను అర్థం చేయిస్తున్నారు. మీకు ఇప్పుడు జ్ఞానమనే మూడవ నేత్రము లభించింది. ఆత్మకు ఆధ్యాత్మిక జ్ఞానము లభించింది. ఆత్మలోనే జ్ఞానము ఉంది. నాలో జ్ఞానము ఉందని తండ్రి అంటారు. ఆత్మను నిర్లేపి అని అనలేరు. ఆత్మయే ఒక శరీరము వదిలి ఇంకొకటి ధరిస్తుంది. ఆత్మ అవినాశీ, నిజానికి అది ఎంత చిన్నది. అందులో 84 జన్మల పాత్ర ఉంది. ఇంకెవ్వరూ ఇటువంటి విషయాన్ని చెప్పలేరు. వారు కేవలం నిర్లేపి అని అనేస్తారు, అందుకే తండ్రి అంటారు, మొదట ఆత్మను రియలైజ్ అవ్వండి. జంతువులు ఎక్కడకు వెళ్తాయి అని కొందరు అడుగుతారు. అరే, జంతువుల విషయాన్ని వదిలిపెట్టండి, ముందుగా ఆత్మను రియలైజ్ అవ్వండి. ఆత్మనైన నేను ఎలా ఉన్నాను, అసలు నేను ఏమిటి...? తండ్రి అంటారు, అసలు స్వయాన్ని ఆత్మగానే అర్థం చేసుకోకపోతే ఇక నన్నేమి అర్థం చేసుకోగలరు. ఈ సూక్ష్మమైన విషయాలన్నీ పిల్లలైన మీ బుద్ధిలో ఉన్నాయి. ఆత్మలో 84 జన్మల పాత్ర ఉంది, అది అభినయిస్తూ ఉంటుంది. కొందరు అంటారు, డ్రామాలో రచింపబడి ఉంటే మరి మేము పురుషార్థము ఎందుకు చేయాలి! అరే, పురుషార్థము లేకపోతే నీరు కూడా లభించదు. డ్రామానుసారముగా అన్నీ వాటంతటవే లభిస్తాయని కాదు. కర్మలైతే తప్పకుండా చేయవలసిందే. మంచి లేక చెడు కర్మలు ఉంటాయి. ఇది బుద్ధి ద్వారా అర్థం చేసుకోవచ్చు. తండ్రి అంటారు, ఇది రావణ రాజ్యము, ఇందులో మీ కర్మలు వికర్మలుగా అవుతాయి. అక్కడ వికర్మలు జరిగేందుకు అసలు రావణ రాజ్యమే లేదు. నేనే మీకు కర్మ, అకర్మ, వికర్మల గతులను అర్థం చేయిస్తాను. అక్కడ మీ కర్మలు అకర్మలుగా అవుతాయి, రావణ రాజ్యములో కర్మలు వికర్మలుగా అవుతాయి. గీతను చదివేవారు కూడా ఎప్పుడూ వీటి అర్థాన్ని వివరించరు, వారు కేవలం చదివి వినిపిస్తూ ఉంటారు, సంస్కృతములో శ్లోకాన్ని వినిపించి, ఆ తర్వాత హిందీలో అర్థం చెప్తారు. తండ్రి అంటారు, కొన్ని పదాలు సరియైనవే. భగవానువాచ అని అంటారే కానీ భగవంతుడు అని ఎవరిని అంటారు అనేది ఎవ్వరికీ తెలియదు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. అనంతమైన తండ్రి ఆస్తికి ఆత్మనైన నేను యజమానిని. ఏ విధంగా తండ్రి శాంతి, పవిత్రత, ఆనందముల సాగరుడో అదే విధంగా ఆత్మనైన నేను మాస్టర్ సాగరుడను, ఇదే నషాలో ఉండాలి.

2. డ్రామా అంటూ పురుషార్థాన్ని వదలకూడదు, కర్మలు తప్పకుండా చేయాలి. కర్మ, అకర్మ, వికర్మల గతులను అర్థం చేసుకుని సదా శ్రేష్ఠ కర్మలనే చేయాలి.

వరదానము:-
సమయము యొక్క మహత్వాన్ని తెలుసుకుని స్వయాన్ని సంపన్నము చేసుకునే విశ్వానికి ఆధారమూర్తులుగా కండి

మొత్తము కల్పము కొరకు సంపాదన చేసుకునే సమయము, శ్రేష్ఠ కర్మల రూపీ బీజాలను నాటే సమయము, 5000 సంవత్సరాల సంస్కారాల రికార్డును నింపుకునే సమయము, విశ్వ కళ్యాణము మరియు విశ్వ పరివర్తన యొక్క సమయము ఇప్పుడు నడుస్తోంది. ఒకవేళ సమయము యొక్క జ్ఞానము తెలిసినవారు కూడా వర్తమాన సమయాన్ని వ్యర్థము చేసుకుంటే లేక రాబోయే సమయములో చూసుకుందాములే అని అనుకుంటే, స్వయం యొక్క పురుషార్థము సమయముపై ఆధారపడినట్లు అవుతుంది. కానీ విశ్వము యొక్క ఆధారమూర్త ఆత్మలు ఏ రకమైన ఆధారముపైనా నడవరు. వారు ఒకే ఒక్క అవినాశీ ఆధారముపై కలియుగీ పతిత ప్రపంచము నుండి పక్కకు తప్పుకుని స్వయాన్ని సంపన్నముగా తయారుచేసుకునేందుకు పురుషార్థము చేస్తారు.

స్లోగన్:-
స్వయాన్ని సంపన్నము చేసుకున్నట్లయితే విశాల కార్యములో స్వతహాగా సహయోగిగా అవుతారు.

అవ్యక్త సూచనలు - సంకల్పాల శక్తిని జమ చేసుకుని శ్రేష్ఠ సేవకు నిమిత్తులుగా అవ్వండి

వర్తమాన సమయము యొక్క పురుషార్థములో ప్రతి సంకల్పాన్ని శక్తిశాలిగా చేసుకోవాలి. సంకల్పమే జీవితము యొక్క శ్రేష్ఠ ఖజానా. ఏ విధంగా ఖజానా నుండి ఏది కావాలంటే అది, ఎంత కావాలంటే అంత ప్రాప్తి చేసుకోవచ్చో, అలానే శ్రేష్ఠ సంకల్పాల ద్వారా సదాకాలికమైన శ్రేష్ఠ ప్రారబ్ధాన్ని పొందగలరు. దీని కొరకు ఒక చిన్న స్లోగన్ ను గుర్తు పెట్టుకోండి - ఏదైనా సరే ఆలోచించి, అర్థం చేసుకుని చేయండి మరియు మాట్లాడండి, అప్పుడు సదాకాలము కొరకు శ్రేష్ఠ జీవితాన్ని తయారుచేసుకోగలరు.