16-02-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - ప్రాణేశ్వరుడైన తండ్రి పిల్లలైన మీకు ప్రాణ దానమునిచ్చేందుకు వచ్చారు, ప్రాణ దానము లభించడము అనగా తమోప్రధానము నుండి సతోప్రధానముగా అవ్వడము’’

ప్రశ్న:-
డ్రామాలోని ప్రతి రహస్యాన్ని తెలుసుకున్న కారణముగా ఏ దృశ్యము మీకు కొత్తది కాదు?

జవాబు:-
ఈ సమయములో మొత్తం ప్రపంచములో ఏవైతే హంగామాలు ఉన్నాయో, వినాశన కాలములో విపరీత బుద్ధి కలవారై తమ కులాన్నే అంతము చేసేందుకు అనేక సాధనాలను తయారుచేస్తూ ఉంటారో, ఇది కొత్త విషయమేమీ కాదు ఎందుకంటే ఈ ప్రపంచమైతే మారేదే ఉందని మీకు తెలుసు. మహాభారత యుద్ధము తర్వాతనే మన కొత్త ప్రపంచము వస్తుంది.

పాట:-
ఈ రోజు ఉదయముదయమే ఎవరు వచ్చారు...

ఓంశాంతి
ఉదయముదమయే వచ్చి మురళీని మోగించేదెవరు? ప్రపంచమైతే పూర్తిగా ఘోర అంధకారములో ఉంది. మీరిప్పుడు మురళీని వింటున్నారు. జ్ఞానసాగరుడు, పతిత-పావనుడు, ప్రాణేశ్వరుడైన తండ్రి నుండి వింటున్నారు. వారు ప్రాణాలను రక్షించే ఈశ్వరుడు. ఓ ఈశ్వరా, ఈ దుఃఖము నుండి రక్షించండి అని అంటారు కదా. వారు హద్దు సహాయాన్ని కోరుకుంటారు. ఇప్పుడు పిల్లలైన మీకు అనంతమైన సహాయము లభిస్తుంది ఎందుకంటే వీరు అనంతమైన తండ్రి కదా. ఆత్మ కూడా గుప్తమైనదని మీకు తెలుసు. పిల్లల శరీరము ప్రత్యక్షముగా ఉంది. తండ్రి శ్రీమతము పిల్లల కోసం ఉన్నది. సర్వ శాస్త్రమయి శిరోమణి గీత ప్రసిద్ధమైనది. కేవలం అందులో శ్రీకృష్ణుని పేరును వేసారు. శ్రీమతము అనేది భగవానువాచ అని ఇప్పుడు మీకు తెలుసు. భ్రష్ఠాచారులను శ్రేష్ఠాచారులుగా తయారుచేసేవారు ఒక్క తండ్రే అని - ఇది కూడా మీరు అర్థం చేసుకున్నారు. వారే నరుని నుండి నారాయణునిగా తయారుచేస్తారు. సత్యనారాయణ కథ కూడా ఉంది. అమరకథ అని కూడా అంటూ ఉంటారు. అమరపురికి యజమానులుగా తయారుచేయడమన్నా లేక నరుని నుండి నారాయణునిగా తయారుచేయడమన్నా, విషయము ఒక్కటే. ఇది మృత్యులోకము. భారత్ యే అమరపురిగా ఉండేది. ఇది ఎవ్వరికీ తెలియదు. ఇక్కడే అమరుడైన బాబా పార్వతులకు వినిపించారు. ఒక్క పార్వతి లేక ఒక్క ద్రౌపదియే కాదు. ఈ కథను చాలామంది పిల్లలు వింటున్నారు. శివబాబా బ్రహ్మా ద్వారా వినిపిస్తారు. తండ్రి అంటారు, నేను బ్రహ్మా ద్వారా మధురాతి మధురమైన పిల్లలకు అర్థం చేయిస్తాను.

ఆత్మాభిమానులుగా తప్పకుండా అవ్వాలని తండ్రి పిల్లలకు అర్థం చేయించారు. తండ్రియే అలా తయారుచేయగలరు. ప్రపంచములో ఆత్మ జ్ఞానము తెలిసిన మనుష్యమాత్రులు ఒక్కరు కూడా లేరు. ఆత్మ జ్ఞానమే లేనప్పుడు పరమాత్మ జ్ఞానము ఎలా ఉంటుంది. ఆత్మనైన నేనే పరమాత్మ అని అంటారు. ప్రపంచమంతా ఎంత పెద్ద పొరపాటులో చిక్కుకుని ఉంది. పూర్తిగా రాతి బుద్ధి కలవారిగా ఉన్నారు. విదేశీయులు కూడా తక్కువ రాతిబుద్ధి కలవారిగా లేరు, మేము ఈ బాంబులు మొదలైనవి ఏవైతే తయారుచేస్తున్నామో, ఇవి స్వయాన్నే కాక మొత్తం ప్రపంచమంతటినీ అంతము చేయడానికి తయారుచేస్తున్నామని వారి బుద్ధిలోకి రాదు. ఈ సమయములో బుద్ధి దేనికీ పనికి రాకుండా ఉంది. తమ వినాశనము కోసమే అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పిల్లలైన మీకిది కొత్త విషయమేమీ కాదు. డ్రామానుసారముగా వారి పాత్ర కూడా ఉందని మీకు తెలుసు. డ్రామా బంధనములో బంధింపబడి ఉన్నారు. రాతిబుద్ధి కలవారు కాకపోతే ఇటువంటి పనులు చేస్తారా? మొత్తం కులాన్నంతా వినాశనము చేస్తున్నారు. అసలు వారు ఏమి చేస్తున్నారు, ఆశ్చర్యముగా ఉంది కదా. ఈ రోజు అలా కూర్చుని ఉండగా బాగానే ఉంటుంది, రేపు మిలట్రీ వారు డిస్టర్బ్ అయితే ప్రెసిడెంటును కూడా హతమార్చేస్తారు. ఇటువంటి సంగఠనలు జరుగుతూ ఉంటాయి. ఎవ్వరినీ సహించరు, శక్తివంతులు కదా. ఈనాటి ప్రపంచములో చాలా హంగామాలు ఉన్నాయి, రాతిబుద్ధి కలవారు కూడా అనేకమంది ఉన్నారు. వినాశన కాలములో ఎవరైతే తండ్రి పట్ల విపరీత బుద్ధి కలవారిగా ఉన్నారో, వారు వినాశనమవుతారని అంటూ ఉంటారని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు ఈ ప్రపంచము మారనున్నది. మహాభారత యుద్ధము తప్పకుండా జరిగిందని కూడా మీకు తెలుసు. తండ్రి రాజయోగాన్ని నేర్పించారు. శాస్త్రాలలోనైతే మొత్తం వినాశనమైందని చూపించారు. కానీ మొత్తం వినాశనము అవ్వదు, అలా అయితే ప్రళయము జరిగిపోతుంది, అప్పుడు మనుష్యులు ఎవ్వరూ ఉండరు, కేవలం పంచ తత్వాలు మాత్రమే మిగిలి ఉంటాయి. కానీ అలా జరగజాలదు. ప్రళయము జరిగిపోతే ఇక మనుష్యులు ఎక్కడ నుండి వస్తారు. సాగరములో రావి ఆకుపై శ్రీకృష్ణుడు బొటనవేలును చప్పరిస్తూ వచ్చినట్లుగా చూపిస్తారు. ఒక బాలుడు ఆ విధముగా ఎలా రాగలడు? శాస్త్రాలలో ఎటువంటి విషయాలను వ్రాసేశారంటే, ఇక అడగకండి. ఇప్పుడు కుమారీలైన మీ ద్వారా ఈ విద్వాంసులకు, భీష్మపితామహులు మొదలైనవారికి కూడా జ్ఞాన బాణాలు తగులుతాయి. వారు కూడా మున్ముందు వస్తారు. ఎంతెంతగా మీరు సేవలో ఫోర్సును నింపుతూ ఉంటారో, తండ్రి పరిచయాన్ని అందరికీ ఇస్తూ ఉంటారో, అంతగా మీ ప్రభావము పెరుగుతుంది. అయితే, విఘ్నాలు కూడా కలుగుతాయి. ఆసురీ సాంప్రదాయము వారు ఈ జ్ఞాన యజ్ఞములో ఎన్నో విఘ్నాలను కలిగిస్తారని కూడా అంటూ ఉంటారు. పాపం రాతిబుద్ధి కల మనుష్యులకు ఇది ఏమిటి అన్నది ఏ మాత్రము తెలియదు. వీరి జ్ఞానమే అతీతమైనదని అంటారు. ఇవి కొత్త ప్రపంచము కోసం కొత్త విషయాలని కూడా మీకు తెలుసు.

తండ్రి అంటారు, ఈ రాజయోగాన్ని మీకు ఇంకెవ్వరూ నేర్పించలేరు. జ్ఞానాన్ని మరియు యోగాన్ని తండ్రియే నేర్పిస్తున్నారు. సద్గతిదాత ఒక్క తండ్రి మాత్రమే, వారే పతిత-పావనుడు, కనుక తప్పకుండా పతితులకే జ్ఞానాన్ని ఇస్తారు కదా. మనము పారసబుద్ధి కలవారిగా అయి పారసనాథులుగా అవుతున్నామని పిల్లలైన మీకు తెలుసు. మనుష్యులు ఎన్ని మందిరాలను నిర్మించారు. కానీ వారు ఎవరు, ఏమి చేసి వెళ్ళారు అనేది కొంచెము కూడా అర్థం చేసుకోరు. పారసనాథుని మందిరము కూడా ఉంది కానీ వారి గురించి ఎవ్వరికీ తెలియదు. భారత్ పారసపురిగా ఉండేది, అక్కడ బంగారము మరియు వజ్ర-వైఢూర్యాల మహళ్ళు ఉండేవి. ఇది నిన్నటి విషయము. వారు కేవలం ఒక్క సత్యయుగానికే లక్షల సంవత్సరాలని అంటారు. కానీ మొత్తం డ్రామా అంతా 5 వేల సంవత్సరాలేనని తండ్రి అంటారు. అందుకే, నేటి భారత్ ఎలా ఉంది! నిన్నటి భారత్ ఎలా ఉండేది! అని అంటారు. లక్షల సంవత్సరాల విషయమైతే ఎవ్వరికీ గుర్తు ఉండదు. పిల్లలైన మీకిప్పుడు స్మృతి లభించింది. బాబా ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత వచ్చి మాకు స్మృతినిప్పిస్తున్నారని మీకు తెలుసు. పిల్లలైన మీరు స్వర్గానికి యజమానులుగా ఉండేవారు. ఇది 5 వేల సంవత్సరాల నాటి విషయము. ఈ లక్ష్మీ-నారాయణుల రాజ్యము ఎప్పుడు ఉండేది? ఎన్ని సంవత్సరాలు అయ్యింది? అని ఎవరినైనా అడిగినట్లయితే, లక్షల సంవత్సరాలని అంటారు. ఇది 5 వేల సంవత్సరాల విషయమని మీరు అర్థం చేయించగలరు. క్రైస్టుకు ఇంత సమయము ముందు స్వర్గముండేదని అంటారు కూడా. తండ్రి భారత్ లోనే వస్తారు. ఇది కూడా పిల్లలకు అర్థం చేయించారు - బాబా జయంతిని జరుపుకుంటున్నారంటే వారు తప్పకుండా ఏదో చేయడానికి వచ్చి ఉంటారు. వారు పతిత-పావనుడు కనుక తప్పకుండా వారు వచ్చి పావనముగా తయారుచేసి ఉంటారు. వారు జ్ఞానసాగరుడు కనుక తప్పకుండా జ్ఞానాన్ని ఇస్తారు కదా. యోగములో కూర్చోండి, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి, ఇది జ్ఞానము కదా. వాళ్ళు హఠయోగులు. మఠం వేసుకుని కూర్చుంటారు. ఏమేమో చేస్తూ ఉంటారు. మాతలైన మీరైతే ఆ విధముగా చేయలేరు. వాళ్ళలా కూర్చోలేరు కూడా. తండ్రి అంటారు, మధురమైన పిల్లలూ, మీరు అవేవీ చేయవలసిన అవసరము లేదు. స్కూల్లో విద్యార్థులు నియమానుసారముగా కూర్చుంటారు కదా. తండ్రి అయితే అది కూడా చెప్పరు. ఎలా కావాలంటే అలా కూర్చోండి. అచ్ఛా, కూర్చొని అలసిపోతే పడుకోండి. బాబా ఏ విషయములోనూ వద్దనరు. ఇది పూర్తిగా సహజముగా అర్థం చేసుకోవలసిన విషయము. ఇందులో ఎటువంటి కష్టము లేదు. ఎంత అనారోగ్యము ఉన్నా సరే, మీరు వింటూ-వింటూ, శివబాబా స్మృతిలో ఉంటూ-ఉంటూ ప్రాణాలు తనువు నుండి వెళ్ళిపోవచ్చునేమో తెలియదు. గంగా తీరములో ఉండాలి, గంగా జలము నోటిలో ఉండాలి, అప్పుడు ప్రాణము తనువు నుండి వెళ్ళిపోవాలి అని అంటూ ఉంటారు కదా. అవన్నీ భక్తి మార్గము యొక్క విషయాలు. వాస్తవానికి ఇది జ్ఞానామృతము యొక్క విషయము. నిజంగా ప్రాణాలను అలాగే వదలనున్నామని మీకు తెలుసు.

పిల్లలైన మీరు పరంధామము నుండి వస్తారు. నన్ను విడిచిపెట్టి వెళ్తారు. తండ్రి అంటారు, నేనైతే పిల్లలైన మిమ్మల్ని నాతో పాటు తీసుకువెళ్తాను, నేను వచ్చింది పిల్లలైన మిమ్మల్ని ఇంటికి తీసుకువెళ్ళడానికి. మీకు మీ ఇంటి గురించీ తెలియదు, ఆత్మ గురించీ తెలియదు. మాయ పూర్తిగా మీ రెక్కలను తెంచేసింది, అందుకే ఆత్మ ఎగరలేదు, ఎందుకంటే తమోప్రధానముగా ఉంది. ఎప్పటివరకైతే సతోప్రధానముగా అవ్వరో, అప్పటివరకు శాంతిధామానికి ఎలా వెళ్ళగలరు. డ్రామా ప్లాన్ అనుసారముగా అందరూ తమోప్రధానముగా అవ్వాల్సిందేనని కూడా మీకు తెలుసు. ఈ సమయములో మొత్తం వృక్షమంతా పూర్తిగా తమోప్రధానముగా శిథిలావస్థలో ఉంది. ఆత్మలందరూ తమోప్రధానముగా ఉన్నారని పిల్లలకు తెలుసు. కొత్త ప్రపంచములో సతోప్రధానముగా ఉంటారు. ఇక్కడ ఎవ్వరికీ సతోప్రధాన అవస్థ ఉండదు. ఇక్కడ ఆత్మ పవిత్రముగా అయిపోతే ఇక ఇక్కడ నిలవదు, ఒక్కసారిగా పారిపోతుంది. అందరూ భక్తి చేసేది ముక్తి కోసము లేదా శాంతిధామానికి వెళ్ళడం కోసము. కానీ ఎవ్వరూ తిరిగి వెళ్ళలేరు. నియమము అలా లేదు. ధారణ చేయడము కోసమని తండ్రి ఈ రహస్యాలన్నింటినీ కూర్చుని అర్థం చేయిస్తున్నారు, అయినా ముఖ్యమైన విషయము - తండ్రిని స్మృతి చేయడము, స్వదర్శన చక్రధారులుగా అవ్వడము. బీజాన్ని స్మృతి చేసినట్లయితే మొత్తం వృక్షమంతా బుద్ధిలోకి వచ్చేస్తుంది. వృక్షము మొదట చిన్నదిగా ఉంటుంది, ఆ తర్వాత పెద్దదిగా అవుతూ ఉంటుంది. అనేక ధర్మాలు ఉన్నాయి కదా. మీరు ఒక్క సెకండులో తెలుసుకుంటారు. ప్రపంచములో ఎవ్వరికీ తెలియదు. మనుష్య సృష్టికి బీజరూపుడైన వారొక్కరే అందరికీ తండ్రి. తండ్రి ఎప్పుడూ సర్వవ్యాపి కాలేరు. ఇది చాలా పెద్ద పొరపాటు. మనుష్యులను ఎప్పుడూ భగవంతుడని అనరని మీరు అర్థం చేయిస్తారు కూడా. తండ్రి పిల్లలకు అన్ని విషయాలను సహజము చేసి అర్థం చేయిస్తారు, ఇక తర్వాత ఎవరి భాగ్యములో ఉంటే వారు, ఎవరికి నిశ్చయముంటే వారు తప్పకుండా తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటారు. నిశ్చయము లేకపోతే వారు ఎప్పటికీ అర్థం చేసుకోరు. భాగ్యమే లేకపోతే ఇక పురుషార్థము కూడా ఏమి చేస్తారు. భాగ్యములో లేకపోతే వారు ఏమీ అర్థం కానట్లుగానే కూర్చుంటారు. తండ్రి అనంతమైన వారసత్వాన్ని ఇవ్వడానికి వచ్చారని ఈ మాత్రము కూడా నిశ్చయము లేదు. ఎవరైనా కొత్త వ్యక్తి మెడికల్ కాలేజిలోకి వెళ్ళి కూర్చుంటే ఏమి అర్థం చేసుకుంటారు? ఏమీ అర్థం కాదు. ఇక్కడకు కూడా అలాగే వచ్చి కూర్చుంటారు. ఈ అవినాశీ జ్ఞానము వినాశనమవ్వదు.

ఇది కూడా తండ్రి అర్థం చేయించారు - రాజధాని స్థాపనవుతుంది కదా, కావున నౌకర్లు, ప్రజలు, ప్రజలకు కూడా నౌకర్లు, అందరూ కావాలి కదా, కనుక అలాంటివారు కూడా వస్తారు. కొంతమందికైతే చాలా మంచి రీతిలో అర్థమైపోతుంది. అభిప్రాయాలు కూడా వ్రాస్తారు కదా. మున్ముందు కొద్దిగా ఎక్కేందుకు ప్రయత్నిస్తారు. కానీ ఆ సమయములో కష్టము, ఎందుకంటే ఆ సమయములోనైతే చాలా హంగామా జరుగుతుంది. రోజురోజుకు తుఫానులు పెరిగిపోతూ ఉంటాయి. ఇన్ని సెంటర్లు ఉన్నాయి. మంచి రీతిలో అర్థం చేసుకుంటారు కూడా. బ్రహ్మా ద్వారా స్థాపన అని కూడా వ్రాసి ఉంది. వినాశనాన్ని కూడా ఎదురుగా చూస్తూ ఉంటారు. వినాశనమైతే జరగవలసిందే. జనాభా తగ్గాలని గవర్నమెంట్ అంటుంది కానీ ఇందులో వారు ఏమి చేయగలరు? వృక్షము యొక్క వృద్ధి అయితే జరిగేదే ఉంది. ఎప్పటివరకైతే తండ్రి ఇక్కడ ఉంటారో, అప్పటివరకు అన్ని ధర్మాల ఆత్మలు ఇక్కడ ఉండవలసిందే. వెళ్ళే సమయము వచ్చినప్పుడు ఆత్మలు రావడము ఆగిపోతుంది. ఇప్పుడైతే అందరూ రావాల్సిందే. కానీ ఈ విషయాలను ఎవ్వరూ అర్థం చేసుకోరు. ఇది రావణ రాజ్యమని, మాకు రామ రాజ్యము కావాలని బాపూజీ కూడా అనేవారు. ఫలానావారు స్వర్గస్థులయ్యారని అంటారు, మరి దాని అర్థం ఇది నరకమని కదా. మనుష్యులు ఈ మాత్రము కూడా అర్థం చేసుకోరు. స్వర్గవాసులుగా అయితే మంచిదే కదా. అంటే తప్పకుండా అప్పటివరకు నరకవాసులుగానే ఉన్నట్లు. బాబా అర్థం చేయిస్తున్నారు - మనుష్యుల ముఖాలు మనుష్యుల వలె ఉన్నాయి కానీ లక్షణాలు కోతుల వలె ఉన్నాయి. పతిత-పావన సీతారామ అని అందరూ పాడుతూ ఉంటారు. మనము పతితులము, పావనముగా తయారుచేసేవారు తండ్రి. వారంతా భక్తి మార్గము యొక్క సీతలు, బాబా రాముడు. ఇది ఎవరికైనా నేరుగా చెప్తే అంగీకరించరు. రాముడినే పిలుస్తారు. ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి మూడవ నేత్రాన్ని ఇచ్చారు. మీరు వేరే ప్రపంచానికి చెందినవారిలా అయిపోయారు. పాత ప్రపంచములో ఏమేమి చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. పిల్లలైన మీరు తెలివిహీనుల నుండి తెలివైనవారిగా అయ్యారు. రావణుడు మిమ్మల్ని ఎంత తెలివిహీనులుగా చేసాడు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఈ సమయములో మనుష్యులందరూ తమోప్రధానముగా అయిపోయారు, అందుకే తండ్రి వచ్చి సతోప్రధానముగా చేస్తారు.

తండ్రి అంటారు - పిల్లలైన మీరు మీ సేవను కూడా చేసుకుంటూ ఉండండి, కేవలం ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి - తండ్రిని స్మృతి చేయండి. తమోప్రధానము నుండి సతోప్రధానముగా అయ్యే మార్గాన్ని ఇంకెవ్వరూ చెప్పలేరు. సర్వుల ఆత్మిక సర్జన్ వారొక్కరే. వారే వచ్చి ఆత్మలకు ఇంజెక్షన్ వేస్తారు ఎందుకంటే ఆత్మయే తమోప్రధానముగా అయ్యింది. తండ్రిని అవినాశీ సర్జన్ అని అంటారు. ఇప్పుడు ఆత్మ సతోప్రధానము నుండి తమోప్రధానముగా అయ్యింది, దానికి ఇంజెక్షన్ కావాలి. తండ్రి అంటారు - పిల్లలూ, మీరు స్వయాన్ని ఆత్మగా నిశ్చయము చేసుకోండి మరియు మీ తండ్రిని స్మృతి చేయండి. బుద్ధియోగాన్ని పైన మధురమైన ఇంటితో జోడించండి. మనము స్వీట్ సైలెన్స్ హోమ్ కు వెళ్ళాలి. నిర్వాణధామాన్ని స్వీట్ హోమ్ అని అంటారు. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఈ పాత ప్రపంచము వినాశనమయ్యే ఉంది, అందుకే దీని నుండి స్వయాన్ని వేరుగా భావించాలి. వృక్షము యొక్క వృద్ధితో పాటుగా, విఘ్నాల రూపీ తుఫానులు ఏవైతే వస్తాయో, వాటికి భయపడకూడదు, వాటిని దాటేయాలి.

2. ఆత్మను సతోప్రధానముగా తయారుచేసుకునేందుకు స్వయానికి జ్ఞాన-యోగాల ఇంజెక్షన్ ను ఇచ్చుకోవాలి. తమ బుద్ధియోగాన్ని స్వీట్ హోమ్ తో జోడించాలి.

వరదానము:-
‘‘మొదట మీరు’’ అన్న పాఠము ద్వారా కిరీటధారులుగా అయ్యే చతుర సుజన భవ (తెలివైనవారిగా కండి)

ఏ విధముగా బాప్ దాదా స్వయాన్ని వినమ్రుడినైన సేవకుడిని అని చెప్పుకుంటారు, అలా సేవకుడిని అని అనడము ద్వారా కిరీటధారిగా స్వతహాగానే అయిపోతారు. అదే విధముగా పిల్లలైన మీరు కూడా స్వయము నమ్రచిత్తులుగా అయి ఇతరులకు శ్రేష్ఠమైన సీటును ఇవ్వండి. ఇతరులను సీటుపై కూర్చోబెట్టినట్లయితే వారు స్వయము దిగిపోయి మిమ్మల్ని స్వతహాగానే కూర్చోబెడతారు. ఒకవేళ మీరు కూర్చునే ప్రయత్నము చేసినట్లయితే వారు కూర్చోనివ్వరు, అందుకే కూర్చోబెట్టడమే కూర్చోవడము. కావున ‘‘మొదట మీరు’’ అన్న పాఠాన్ని పక్కా చేసుకోండి, అప్పుడిక సంస్కారాలు కూడా సహజముగానే కలుస్తాయి, కిరీటధారులుగా కూడా అవుతారు, ఇదే చతుర సుజనులుగా (తెలివైనవారిగా) అయ్యేందుకు విధానము, ఇందులో శ్రమ కూడా లేదు, ప్రాప్తి కూడా అధికముగా ఉంది.

స్లోగన్:-
అవ్యక్త స్థితిని అనుభవం చేసుకునేందుకు అంతర్ముఖులుగా, ఏకాంతవాసులుగా అవ్వండి.

అవ్యక్త సూచనలు - ఏకత మరియు విశ్వాసము యొక్క విశేషతల ద్వారా సఫలతా సంపన్నులుగా అవ్వండి

ఇప్పటివరకు వేర్వేరు పుష్పాలు తమ-తమ రంగులను చూపిస్తున్నారు, కానీ ఎప్పుడైతే పుష్పగుచ్ఛము రూపములో మీ సుగంధాన్ని వ్యాపింపజేస్తారో, శక్తి దళము ప్రత్యక్షమవుతుందో, అప్పుడు ఈ సంగఠన యొక్క శక్తి పరమాత్మ ప్రత్యక్షతకు నిమిత్తము అవుతుంది. ఇప్పుడు ఒక్కొక్కరు వేర్వేరుగా ఉన్న కారణముగా శ్రమ ఎక్కువగా చెయ్యాల్సి వస్తుంది కానీ ఎప్పుడైతే సంగఠన ఏకమతము కలదిగా అవుతుందో అప్పుడు శ్రమ తక్కువ, సఫలత ఎక్కువగా ఉంటుంది.