ఓంశాంతి
పాటలోని మొదటి వాక్యములో కొంత అర్థము ఉంది, మిగిలిన పాట దేనికీ ఉపయోగపడదు. ఉదాహరణకు
గీతలో ఉన్న భగవానువాచ అయిన - మన్మనాభవ, మధ్యాజీభవ అనే పదాలు సరైనవి. దీనినే పిండిలో
ఉప్పంత అని అంటారు. ఇప్పుడు భగవంతుడు అని ఎవరిని అంటారు అనేది పిల్లలు మంచి రీతిలో
తెలుసుకున్నారు. భగవంతుడు అని శివబాబాను అంటారు. శివబాబా వచ్చి శివాలయాన్ని
రచిస్తారు. ఎక్కడికి వస్తారు? వేశ్యాలయములోకి. వారు స్వయంగా వచ్చి - ఓ
మధురాతి-మధురమైన ప్రియమైన, చాలా కాలం దూరమైన తర్వాత కలిసిన ఆత్మిక పిల్లలూ అని
అంటారు. వినేది అయితే ఆత్మయే కదా. మీకు తెలుసు - ఆత్మ అయిన మనము అవినాశీ. ఈ దేహము
వినాశీ. ఆత్మ అయిన మనము ఇప్పుడు మన పరమపిత పరమాత్మ నుండి మహావాక్యాలు వింటున్నాము.
మహావాక్యాలు ఒక్క పరమపిత పరమాత్మునివే, అవి మహాన్ పురుషులుగా, పురుషోత్తములుగా
తయారుచేస్తాయి. ఇకపోతే మహాత్ములు, గురువులు మొదలైనవారు ఎవరైతే ఉన్నారో, వారివి
మహావాక్యాలేమీ కావు. శివోహమ్ అని అంటారు కదా, అది కూడా సరైన వాక్యము కాదు. ఇప్పుడు
మీరు తండ్రి నుండి మహావాక్యాలను విని పుష్పాలుగా తయారవుతారు. ముళ్ళకు మరియు
పుష్పాలకు మధ్యన ఎంత తేడా ఉంది. ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు - మనకు మనుష్యులెవరూ
వినిపించడం లేదు. వీరిలో శివబాబా విరాజమానమై ఉన్నారు, వారు కూడా ఆత్మయే, కానీ వారిని
పరమ ఆత్మ అని అంటారు. ఇప్పుడు పతిత ఆత్మలు - ఓ పరమాత్మా రండి, మీరు వచ్చి మమ్మల్ని
పావనముగా తయారుచేయండి అని పిలుస్తున్నారు. వారు పరమపిత, ఉన్నతోన్నతముగా
తయారుచేసేవారు. మీరు పురుషోత్తములుగా అనగా పురుషులందరిలోనూ ఉత్తమ పురుషులుగా అవుతారు.
వారు దేవతలు. పరమపిత అనే పదము చాలా మధురమైనది. సర్వవ్యాపి అని అంటే ఆ మధురత రాదు.
మీలో కూడా ప్రేమగా లోలోపల స్మృతి చేసేవారు చాలా కొద్దిమందే ఉన్నారు. ఆ
స్త్రీ-పురుషులైతే ఒకరినొకరు స్థూలముగా తలచుకుంటూ ఉంటారు. ఇక్కడ ఆత్మలు పరమాత్మను
చాలా ప్రేమగా తలచుకోవాలి. భక్తి మార్గములో అంత ప్రేమగా పూజ చేయలేరు. ఆ ప్రేమ ఉండదు.
వారి గురించి తెలియనే తెలియకపోతే ఇక ప్రేమ ఎలా ఉంటుంది. ఇప్పుడు పిల్లలైన మీకు చాలా
ప్రేమ ఉంది. ఆత్మ ‘నా బాబా’ అని అంటుంది. ఆత్మలు పరస్పరం సోదరులు కదా. బాబా నాకు తన
పరిచయాన్ని ఇచ్చారు అని సోదరులు ప్రతి ఒక్కరూ అంటారు. కానీ దానిని ప్రేమ అని అనరు.
ఎవరి నుండైతే ఏదో ఒకటి లభిస్తుందో, వారిపై ప్రేమ ఉంటుంది. తండ్రిపై పిల్లలకు ప్రేమ
ఉంటుంది ఎందుకంటే తండ్రి నుండి వారసత్వము లభిస్తుంది. ఎంత ఎక్కువ వారసత్వమో, అంతగా
పిల్లలకు ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఒకవేళ తండ్రి వద్ద ఆస్తి ఏమీ లేకపోతే, తాతగారి వద్ద
ఉంటే, ఇక తండ్రిపై అంత ప్రేమ ఉండదు, అప్పుడు తాతగారిపై ప్రేమ ఉంటుంది. వారి నుండి
ధనం లభిస్తుంది అని భావిస్తారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నది అనంతమైన తండ్రి. మనల్ని తండ్రి
చదివిస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు. ఇది ఎంత సంతోషకరమైన విషయము. భగవంతుడు మన
తండ్రి, ఆ రచయిత అయిన తండ్రి గురించి ఎవ్వరికీ తెలియదు. తెలియని కారణముగా, ఇక
స్వయాన్నే తండ్రి అని చెప్పుకుంటారు. ఉదాహరణకు పిల్లలను - మీ తండ్రి ఎవరు అని
అడిగితే, ఇక చివరికి, నేనే అని అంటారు. ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు - ఆ
తండ్రులందరికీ తండ్రి తప్పకుండా ఉన్నారు. కానీ ఇప్పుడు మనకు ఏ అనంతమైన తండ్రి అయితే
లభించారో, వారికి తండ్రి ఎవరూ లేరు. వీరే ఉన్నతోన్నతమైన తండ్రి. కావున పిల్లలకు
లోలోపల సంతోషముండాలి. ఆ యాత్రలకు వెళ్ళినప్పుడు అక్కడ అంత సంతోషము ఉండదు ఎందుకంటే
ప్రాప్తి ఏమీ లేదు. కేవలం దర్శనము చేసుకునేందుకు వెళ్తారు. అనవసరముగా ఎన్ని
ఎదురుదెబ్బలు తింటారు. ఒకటేమో ఈ నుదురు అరిగిపోయింది మరియు రెండవది ధనము కూడా
తరిగిపోతుంది. ఎంతో ధనాన్ని ఖర్చు చేస్తారు, కానీ ప్రాప్తి ఏమీ లేదు. భక్తి
మార్గములో ఒకవేళ సంపాదన ఉన్నట్లయితే ఇప్పటికి భారతవాసులు ఎంతో షావుకార్లుగా
అయ్యేవారు. ఈ మందిరాలు మొదలైనవి నిర్మించడానికి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారు. మీ
సోమనాథ మందిరము ఒకటే ఉండేది కాదు. రాజులందరి వద్ద మందిరాలు ఉండేవి. మీకు ఎంత ధనము
ఇచ్చాను - 5 వేల సంవత్సరాల క్రితం మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా చేసాను. ఒక్క
తండ్రియే ఈ విధంగా అంటారు. నేటికి 5 వేల సంవత్సరాల క్రితం మీకు రాజయోగాన్ని
నేర్పించి ఈ విధముగా తయారుచేసాను. ఇప్పుడు మీరు ఎలా అయిపోయారు. బుద్ధిలోకి రావాలి
కదా. మనము ఎంత ఉన్నతముగా ఉండేవారము, పునర్జన్మలు తీసుకుంటూ-తీసుకుంటూ ఒక్కసారిగా
కిందకు వచ్చి పడిపోయాము. గవ్వలా అయిపోయాము. ఇప్పుడు మళ్ళీ మనం బాబా వద్దకు వెళ్తాము.
ఆ బాబా మనల్ని విశ్వానికి యజమానులుగా తయారుచేస్తారు. ఈ ఒక్క యాత్ర ద్వారానే ఆత్మలకు
తండ్రి లభిస్తారు, కావున లోలోపల ఆ ప్రేమ ఉండాలి. పిల్లలైన మీరు ఇక్కడికి
వచ్చినప్పుడు, బుద్ధిలో ఈ విషయము ఉండాలి - మేము ఆ తండ్రి వద్దకు వెళ్తున్నాము, వారి
నుండి మాకు మళ్ళీ విశ్వరాజ్యము లభిస్తుంది. ఆ తండ్రి మనకు శిక్షణను ఇస్తున్నారు -
పిల్లలూ, దైవీ గుణాలను ధారణ చేయండి. సర్వశక్తివంతుడైన, పతితపావనుడైన తండ్రినైన నన్ను
స్మృతి చేయండి. నేను కల్ప-కల్పము వచ్చి - నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే వికర్మలు
వినాశనమవుతాయి అని చెప్తాను. మేము అనంతమైన తండ్రి వద్దకు వచ్చాము అని మనసులో
అనిపించాలి. తండ్రి అంటారు - నేను గుప్తముమైనవాడిని. ఆత్మ అంటుంది - నేనూ
గుప్తమమైనవాడిని. మనము శివబాబా వద్దకు, బ్రహ్మాదాదా వద్దకు వెళ్తున్నాము అని మీరు
భావిస్తారు. ఎవరైతే కంబైండుగా ఉన్నారో వారిని కలుసుకోవడానికి మనము వెళ్తున్నాము,
వారి ద్వారా మనము విశ్వానికి యజమానులుగా అవుతాము. లోలోపల ఎంతటి అనంతమైన సంతోషము
ఉండాలి. మధుబన్ కు వచ్చేందుకు ఇంటి నుండి బయలుదేరినప్పుడు లోలోపల ఆనందముతో
పులకరించిపోవాలి. తండ్రి మనల్ని చదివించడానికి వచ్చారు, మనకు దైవీ గుణాలను ధారణ
చేసేందుకు యుక్తిని తెలియజేస్తున్నారు. ఇంటి నుండి బయలుదేరుతున్నప్పుడే లోలోపల ఈ
సంతోషము ఉండాలి. ఉదాహరణకు కన్య తన పతిని కలుసుకున్నప్పుడు ఆభరణాలు మొదలైనవి
ధరిస్తుంది కావున ఆమె ముఖము వికసిస్తుంది. అక్కడ ముఖము దుఃఖము పొందబోతున్నందుకు
వికసిస్తుంది. మీ ముఖము సదా సుఖము పొందబోతున్నందుకు వికసిస్తుంది. మరి ఇటువంటి
తండ్రి వద్దకు వచ్చేటప్పుడు ఎంత సంతోషము ఉండాలి. ఇప్పుడు మనకు అనంతమైన తండ్రి
లభించారు. సత్యయుగములోకి వెళ్ళిన తర్వాత ఇక డిగ్రీ తగ్గిపోతుంది. ఇప్పుడు
బ్రాహ్మణులైన మీరు ఈశ్వరీయ సంతానము. భగవంతుడు కూర్చుని చదివిస్తున్నారు. వారు మన
తండ్రి కూడా, టీచరు కూడా, వారు చదివిస్తారు, పావనముగా తయారుచేసి తమతోపాటు
తీసుకువెళ్తారు కూడా. ఆత్మ అయిన మనము ఇప్పుడు ఈ ఛీ-ఛీ రావణ రాజ్యము నుండి
విముక్తులుగా అవుతాము. లోలోపల అపారమైన సంతోషము ఉండాలి - తండ్రి విశ్వానికి
యజమానులుగా తయారుచేస్తున్నప్పుడు, చదువును ఎంత బాగా చదువుకోవాలి. విద్యార్థులు మంచి
రీతిలో చదివితే, మంచి మార్కులతో పాస్ అవుతారు. పిల్లలు అంటారు - బాబా, మేము శ్రీ
నారాయణునిగా అవుతాము. ఇది సత్యనారాయణుని కథ అనగా నరుడి నుండి నారాయణుడిగా అయ్యే కథ.
ఆ ఆసత్యమైన కథలను జన్మజన్మాంతరాలుగా వింటూ వచ్చారు. ఇప్పుడు తండ్రి ద్వారా ఒకే
ఒక్కసారి మీరు సత్యాతి-సత్యమైన కథను వింటారు. ఇదే మళ్ళీ భక్తి మార్గములో
కొనసాగుతుంది. శివబాబా జన్మ తీసుకున్నారు, వారి జయంతిని ప్రతి సంవత్సరమూ జరుపుకుంటూ
వచ్చారు. కానీ వారు ఎప్పుడు వచ్చారు, ఏమి చేసారు, అసలేమీ తెలియదు. అచ్ఛా, కృష్ణ
జయంతిని జరుపుకుంటారు, వారు కూడా ఎప్పుడు వచ్చారు, ఎలా వచ్చారు, అసలేమీ తెలియదు.
కంసపురిలోకి వస్తారు అని అంటారు, కానీ వారు పతిత ప్రపంచములో ఎలా జన్మ తీసుకుంటారు!
మేము అనంతమైన తండ్రి వద్దకు వెళ్తున్నాము అని పిల్లలకు ఎంత సంతోషము ఉండాలి. అనుభవాలు
కూడా వినిపిస్తారు కదా - బాబా వచ్చారు అన్న విషయములో మాకు ఫలానా వారి ద్వారా బాణం
తగిలింది, ఇక ఆ రోజు నుండి మేము తండ్రినే స్మృతి చేస్తున్నాము అని అంటారు.
ఇది మీరు అత్యంత గొప్ప తండ్రి వద్దకు వచ్చే యాత్ర. బాబా అయితే చైతన్యమైనవారు,
వారు పిల్లల వద్దకు వెళ్తారు కూడా. అవి స్థూలమైన యాత్రలు. ఇక్కడైతే తండ్రి
చైతన్యముగా ఉన్నారు. ఏ విధంగా ఆత్మ అయిన మనము మాట్లాడుతామో, అదే విధంగా పరమాత్మ
తండ్రి కూడా శరీరము ద్వారా మాట్లాడుతారు. ఈ చదువు భవిష్య 21 జన్మల శరీర నిర్వహణ
కొరకు. ఆ చదువు కేవలము ఈ జన్మ కొరకు మాత్రమే. మరి ఇప్పుడు ఏ చదువును చదవాలి లేక ఏ
వ్యాపారాన్ని చేయాలి? తండ్రి అంటారు - రెండూ చేయండి. సన్యాసుల వలె ఇళ్ళు-వాకిళ్ళను
వదిలి అడవులలోకి వెళ్ళకూడదు. ఇది ప్రవృత్తి మార్గము కదా. ఈ చదువు ఇరువురి కోసము ఉంది.
అందరూ చదవరు కూడా. కొందరు బాగా చదువుతారు, కొందరు తక్కువగా చదువుతారు. కొందరికి
ఒక్కసారిగా బాణము తగులుతుంది. కొందరు వెర్రివాని వలె మాట్లాడుతూ ఉంటారు. కొందరేమో -
సరే, మేము అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తాము అని అంటారు. కొందరేమో - ఇవి ఏకాంతములో
అర్థం చేసుకునే విషయాలు అని అంటారు, మళ్ళీ మాయమైపోతారు. కొందరికి జ్ఞాన బాణము
తగలగానే వెంటనే వచ్చి అర్థం చేసుకుంటారు. కొందరేమో, మాకు తీరిక లేదు అని అంటారు,
అనగా వారికి బాణము తగలలేదు అని అర్థం చేసుకోండి. చూడండి, బాబాకు బాణము తగలగానే
వెంటనే అన్నీ వదిలేశారు కదా! నాకు విశ్వరాజ్యాధికారము లభిస్తున్నప్పుడు దాని ముందు
ఇవన్నీ ఎంత అని భావించారు. నేను అయితే తండ్రి నుండి రాజ్యాధికారము తీసుకోవాలి.
ఇప్పుడు తండ్రి అంటారు, ఆ వ్యాపారాలు మొదలైనవి కూడా చూసుకోండి, కానీ ఒక వారం రోజులు
ఇది బాగా అర్థం చేసుకోండి. గృహస్థ వ్యవహారము కూడా సంభాళించాలి, రచన యొక్క పాలన కూడా
చేయాలి. ఆ సన్యాసులైతే రచనను రచించి, తర్వాత పారిపోతారు. బాబా అంటారు, మీరు రచించారు
అంటే మరి బాగా సంభాళించండి. ఒకవేళ పత్ని, పిల్లలూ మీరు చెప్పే విషయాలను అంగీకరిస్తే
వారు సుపుత్రులు, ఒకవేళ అర్థం చేసుకోకపోతే వారు కుపుత్రులు. సుపుత్రులు ఎవరు మరియు
కుపుత్రులు ఎవరు అనేది తెలిసిపోతుంది కదా. తండ్రి అంటారు, మీరు శ్రీమతముపై
నడిచినట్లయితే శ్రేష్ఠముగా అవుతారు, లేదంటే వారసత్వము లభించదు. పవిత్రముగా అయి,
సుపుత్రులుగా అయి తండ్రి పేరును ప్రఖ్యాతి చేయండి. బాణము తగిలిందంటే - ఇప్పుడిక మేము
సత్యమైన సంపాదనలోనే నిమగ్నమవుతాము అని అంటారు. తండ్రి శివాలయములోకి
తీసుకువెళ్ళేందుకు వచ్చారు. మరి శివాలయములోకి వెళ్ళేందుకు యోగ్యులుగా అవ్వాలి.
ఇందులోనే శ్రమ ఉంది. మీరు చెప్పండి - ఇప్పుడు శివబాబాను స్మృతి చేయండి, మృత్యువు
ఎదురుగా నిలబడి ఉంది. వారి కళ్యాణము కూడా చేయాలి కదా. ఇప్పుడు స్మృతి చేసినట్లయితే
వికర్మలు వినాశనమవుతాయి అని వారికి చెప్పండి. పుట్టినిల్లు మరియు మెట్టినిల్లును
ఉద్ధరించడమే కుమార్తెలైన మీ పని. మీకు వారి నుండి పిలుపు వస్తే, వారిని ఉద్ధరించడం
మీ బాధ్యత. దయార్ద్ర హృదయులుగా అవ్వాలి. పతితులైన, తమోప్రధానమైన మనుష్యులకు
సతోప్రధానముగా తయారయ్యే మార్గము తెలియజేయాలి. ప్రతి వస్తువు కొత్తది నుండి పాతదిగా
తప్పకుండా అవుతుందని మీకు తెలుసు. నరకములో అందరూ పతితాత్మలే ఉన్నారు, అందుకే
పావనముగా అయ్యేందుకని గంగలో స్నానము చేయడానికి వెళ్తారు. మొట్టమొదట మేము పతితముగా
ఉన్నాము, కావుననే ఇక పావనముగా అవ్వాలి అన్నది అర్థం చేసుకోవాలి. తండ్రి ఆత్మలకు
చెప్తున్నారు, నన్ను స్మృతి చేసినట్లయితే మీ పాపాలు నశించిపోతాయి. సాధు-సన్యాసులు
మొదలైనవారు ఎవరైతే ఉన్నారో, వారందరికీ - నన్ను స్మృతి చేయండి అని తండ్రి
చెప్తున్నారు అన్న నా సందేశాన్ని అందించండి. ఈ యోగాగ్నితో అనగా స్మృతి యాత్రతో మీలో
ఉన్న మలినాలు తొలగిపోతాయి. మీరు పవిత్రముగా అయి నా వద్దకు వచ్చేస్తారు. నేను
మిమ్మల్నందరినీ నాతో పాటు తీసుకువెళ్తాను. తేలు వెళ్తూ-వెళ్తూ దారి మధ్యలో ఏదైనా
మెత్తని వస్తువు తగిలితే కొండెముతో కుడుతుంది. రాయిని కొండెముతో కుడితే
ఉపయోగమేముంటుంది! అలా మీరు కూడా తండ్రి పరిచయాన్ని ఇవ్వండి. తన భక్తులు ఎక్కడ ఉంటారు
అన్నది కూడా తండ్రి అర్థం చేయించారు. శివుని మందిరాలలో, కృష్ణుని మందిరాలలో,
లక్ష్మీ-నారాయణుల మందిరాలలో. భక్తులు నా భక్తి చేస్తూ ఉంటారు. వాస్తవానికి వారూ నా
పిల్లలే కదా. నా నుండి రాజ్యాన్ని తీసుకున్నారు, ఇప్పుడు పూజ్యుల నుండి పూజారులుగా
అయిపోయారు. దేవతలకు భక్తులు ఉన్నారు కదా. నంబర్ వన్ భక్తి శివుని యొక్క అవ్యభిచారీ
భక్తి. ఆ తర్వాత కిందికి దిగుతూ-దిగుతూ ఇప్పుడిక భూతపూజలు చేయడం మొదలుపెట్టారు.
శివుని పూజారులకు అర్థం చేయించడం సహజము. ఈ ఆత్మలందరికీ తండ్రి శివబాబాయే. వారు
స్వర్గ వారసత్వాన్ని ఇస్తారు. ఇప్పుడు తండ్రి అంటారు, నన్ను స్మృతి చేసినట్లయితే
వికర్మలు వినాశనమవుతాయి. మేము మీకు సందేశాన్ని ఇస్తున్నాము. ఇప్పుడు తండ్రి
అంటున్నారు, పతిత-పావనుడిని, జ్ఞానసాగరుడిని నేనే. నేను జ్ఞానాన్ని కూడా
వినిపిస్తున్నాను. అలాగే పావనముగా అయ్యేందుకు యోగాన్ని కూడా నేర్పిస్తున్నాను.
బ్రహ్మా తనువు ద్వారా నన్ను స్మృతి చేయండి అన్న సందేశాన్ని ఇస్తున్నాను. మీ 84
జన్మలను గుర్తు చేసుకోండి. మీకు మందిరాలలో మరియు కుంభమేళాలలో భక్తులు దొరుకుతారు.
అక్కడ మీరు - పతితపావని గంగనా లేక పరమాత్మనా అన్నది అర్థం చేయించవచ్చు.
మేము ఎవరి వద్దకు వెళ్తున్నాము! అని పిల్లలైన మీకు ఈ సంతోషము ఉండాలి. వీరు ఎంత
సాధారణముగా ఉన్నారు. నేను ఏ గొప్పతనాన్ని చూపించుకోవాలి! శివబాబా గొప్ప వ్యక్తిగా
కనిపించేందుకు ఏం చేయాలి? సన్యాసుల వస్త్రాలనైతే ధరించలేరు. తండ్రి అంటారు, నేను ఒక
సాధారణ తనువును తీసుకుంటాను. నేనేం చేయాలో మీరే నాకు సలహా ఇవ్వండి. ఈ రథాన్ని ఏం
అలంకరించను? వారు హుస్సేన్ గుర్రాన్ని ఎంతగానో అలంకరించి ఊరేగింపుకు తీసుకువెళ్తారు.
ఇక్కడ శివబాబా రథాన్ని ఒక ఎద్దుగా చూపించారు. ఆ ఎద్దు మస్తకములో గుండ్రముగా ఉన్న
శివుని చిత్రాన్ని చూపిస్తారు. ఇప్పుడు శివబాబా ఎద్దులోకి ఎలా వస్తారు. మరి
మందిరములో ఎద్దును ఎందుకు చూపించారు? దానిని శంకరుని వాహనము అని అంటారు.
సూక్ష్మవతనములో శంకరునికి వాహనము ఉంటుందా ఏమిటి? ఇదంతా భక్తి మార్గము, ఇది డ్రామాలో
నిశ్చితమై ఉంది. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.