16-12-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీరు చదువును చదువుకోవాలి మరియు చదివించాలి, ఇందులో ఆశీర్వాదాల విషయమేమీ లేదు, మీరు అందరికీ చెప్పండి - తండ్రిని స్మృతి చేసినట్లయితే దుఃఖాలన్నీ దూరమైపోతాయి’’

ప్రశ్న:-
మనుష్యులకు ఏయే చింతలు ఉన్నాయి? పిల్లలైన మీకు ఏ చింత లేదు - ఎందుకు?

జవాబు:-
మనుష్యులకు ఈ సమయములో చింతలే చింతలు ఉన్నాయి - బిడ్డ అనారోగ్యము పాలైతే చింత, బిడ్డ మరణిస్తే చింత, ఎవరికైనా బిడ్డ పుట్టకపోతే చింత, ఎవరైనా ధాన్యము ఎక్కువగా పెట్టుకున్నప్పుడు పోలీసులు లేక ఇన్ కమ్ టాక్స్ వారు వస్తే చింత... ఇది ఉన్నదే అశుద్ధ ప్రపంచము, దుఃఖాన్ని ఇచ్చేటటువంటిది. పిల్లలైన మీకు ఏ చింత లేదు, ఎందుకంటే మీకు సద్గురువైన బాబా లభించారు. చింతల నుండి దూరము చేసే స్వామి సద్గురువు... అని అంటారు కూడా. ఇప్పుడు మీరు ఎటువంటి చింత లేనటువంటి ప్రపంచములోకి వెళ్తారు.

పాట:-
నీవు ప్రేమ సాగరుడవు...

ఓంశాంతి
మధురాతి మధురమైన పిల్లలు పాట విన్నారు, పిల్లలకు దీని అర్థము కూడా తెలుసు. మనము కూడా మాస్టర్ ప్రేమ సాగరులుగా అవ్వాలి. ఆత్మలందరూ పరస్పరము సోదరులు. తండ్రి సోదరులైన మీకు చెప్తున్నారు - ఏ విధముగా నేను ప్రేమ సాగరుడనో, అదే విధముగా మీరు కూడా చాలా ప్రేమగా నడుచుకోవాలి. దేవతలలో చాలా ప్రేమ ఉంటుంది, వారిని ఎంతగా ప్రేమిస్తారు, వారికి భోగ్ సమర్పిస్తారు. ఇప్పుడు మీరు పవిత్రముగా అవ్వాలి, ఇది పెద్ద విషయమేమీ కాదు. ఇది చాలా ఛీ-ఛీ ప్రపంచము. ప్రతి విషయము గురించి చింత ఉంటుంది, దుఃఖము వెనుక దుఃఖమే ఉంది. దీనిని దుఃఖధామము అని అంటారు. పోలీసులు లేక ఇన్ కమ్ టాక్స్ వారు వస్తారు, మనుష్యులకు ఎంతగా దుఃఖము కలుగుతుందో ఇక అడగకండి! ఎవరైనా ధాన్యము ఎక్కువ పెట్టుకున్నప్పుడు, పోలీసులు వస్తే, పాలిపోయినట్లుగా అయిపోతారు. ఇది ఎంత అశుద్ధమైన ప్రపంచము. నరకము కదా. స్వర్గాన్ని తలచుకుంటారు కూడా. నరకము తర్వాత స్వర్గము, స్వర్గము తర్వాత నరకము - ఈ చక్రము తిరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు తండ్రి స్వర్గవాసులుగా చేయడానికి వచ్చారని పిల్లలకు తెలుసు. నరకవాసుల నుండి స్వర్గవాసులుగా తయారుచేస్తారు. అక్కడ వికారాలే ఉండవు ఎందుకంటే రావణుడే ఉండడు. అది ఉన్నదే సంపూర్ణ నిర్వికారీ శివాలయము. ఇది వేశ్యాలయము. ఇప్పుడు కొంచెం ఆగండి, ఈ ప్రపంచములో దుఃఖముందా లేక సుఖముందా అన్నది అందరికీ తెలిసిపోతుంది. కొద్దిగా భూకంపాలు మొదలైనవి వచ్చాయంటే మనుష్యుల పరిస్థితి ఎలా అయిపోతుంది. సత్యయుగములో కొద్దిగా కూడా చింతించే విషయము ఉండదు. ఇక్కడైతే చాలా చింతలు ఉన్నాయి - బిడ్డ అనారోగ్యముపాలైతే చింత, బిడ్డ మరణిస్తే చింత, చింతలే చింతలు ఉన్నాయి. చింతల నుండి దూరము చేసేవారు స్వామి సద్గురువు... అందరి స్వామి ఒక్కరే కదా. మీరు శివబాబా ఎదురుగా కూర్చున్నారు. ఈ బ్రహ్మా గురువు కారు. వీరు భాగ్యశాలి రథము. తండ్రి ఈ భాగ్యశాలి రథము ద్వారా మిమ్మల్ని చదివిస్తారు. వారు జ్ఞానసాగరుడు. మీకు కూడా మొత్తం జ్ఞానము లభించింది. మీకు తెలియనటువంటి దేవతలు లేరు. సత్యము మరియు అసత్యము మధ్యన వ్యత్యాసాన్ని మీరు గుర్తించగలరు. ప్రపంచములోనివారికెవ్వరికీ తెలియదు. సత్య ఖండము ఉండేది, ఇప్పుడు అసత్య ఖండము ఉంది. సత్య ఖండాన్ని ఎప్పుడు మరియు ఎవరు స్థాపన చేసారు అనేది ఎవ్వరికీ తెలియదు. ఇది అజ్ఞానము యొక్క అంధకారమయమైన రాత్రి. తండ్రి వచ్చి ప్రకాశాన్ని ఇస్తారు. మీరు ఇచ్చే గతి, మీరు చూపే మార్గము మీకే తెలుసు అని పాడుతారు కూడా. ఉన్నతోన్నతమైనవారు వారొక్కరే, మిగిలినవారంతా రచన. వారు రచయిత, అనంతమైన తండ్రి. ఇక్కడ ఉండేవారు హద్దు తండ్రి, 2-4 పిల్లలను రచిస్తారు. కొడుకు పుట్టకపోతే చింత కలుగుతుంది. అక్కడైతే ఇటువంటి విషయము ఉండదు. ఆయుష్మాన్ భవ, ధనవాన్ భవ... అక్కడ మీరు ఇలానే ఉంటారు. మీరేమీ ఆశీర్వాదాలు ఇవ్వరు. ఇది చదువు కదా. మీరు టీచర్లు. శివబాబాను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయని మీరు కేవలం ఇదే చెప్తారు. ఇది కూడా శిక్షణే కదా. దీనిని సహజ యోగము లేక స్మృతి అని అంటారు. ఆత్మ అవినాశీ అయినది, శరీరము వినాశీ అయినది. తండ్రి అంటారు, నేను కూడా అవినాశీ అయినవాడిని. మీరు వచ్చి పతితులైన మమ్మల్ని పావనముగా చేయండి అని నన్ను పిలుస్తారు. ఆత్మయే ఇలా పిలుస్తుంది కదా. పతితాత్మ, మహానాత్మ అని అంటారు. పవిత్రత ఉంటే సుఖ-శాంతులు కూడా ఉంటాయి.

ఇది హోలియెస్ట్ ఆఫ్ హోలీ (పవిత్రాతి పవిత్రమైన) చర్చి. ఇక్కడికి వికారులకు వచ్చేందుకు అనుమతి లేదు. ఒక కథ కూడా ఉంది కదా - ఇంద్రసభలోకి ఒక దేవకన్య రహస్యముగా ఎవరినో తీసుకువెళ్ళింది, వారికి తెలిసిపోయింది, అప్పుడు రాయిగా అవ్వమని ఆమెకు శాపము లభించింది. ఇక్కడ శాపము మొదలైన విషయాలేవీ లేవు. ఇక్కడైతే జ్ఞాన వర్షము కురుస్తుంది. పతితులెవ్వరూ ఈ హోలీ ప్యాలెస్ (పవిత్రమైన మహల్) లోకి రాకూడదు. ఒకానొక రోజున ఈ హాల్ కూడా చాలా పెద్దదిగా తయారైపోతుంది. ఇది హోలియెస్ట్ ఆఫ్ హోలీ ప్యాలెస్ (పవిత్రాతి పవిత్రమైన మహల్). మీరు కూడా పవిత్రముగా అవుతారు. మనుష్యులు ఏమనుకుంటారంటే - వికారాలు లేకుండా సృష్టి ఎలా నడుస్తుంది? ఇది ఎలా సాధ్యము? వారికి వారి జ్ఞానము ఉంటుంది. దేవతల ఎదురుగా - మీరు సర్వగుణ సంపన్నులు, మేము పాపులము అని అంటారు కూడా. కావున స్వర్గము హోలియెస్ట్ ఆఫ్ హోలీ అయినది (పవిత్రాతి పవిత్రమైనది). అక్కడివారే మళ్ళీ 84 జన్మలు తీసుకున్న తర్వాత హోలియెస్ట్ ఆఫ్ హోలీగా అవుతారు. అది పావన ప్రపంచము, ఇది పతిత ప్రపంచము. కొడుకు పుడితే సంతోషముగా జరుపుకుంటారు, అతడికి అనారోగ్యము చేస్తే ముఖము పాలిపోతుంది, అతడు మరణిస్తే ఇక పూర్తిగా పిచ్చివారిగా అయిపోతారు. ఇటువంటివారు కూడా కొందరు ఉంటారు. బాబా, వీరి కొడుకు మరణించడముతో వీరు పిచ్చివారిలా అయిపోయారు అని చెప్తుంటారు, ఇటువంటివారిని కూడా తీసుకువస్తుంటారు. ఇది దుఃఖపు ప్రపంచము కదా. ఇప్పుడు తండ్రి సుఖపు ప్రపంచములోకి తీసుకువెళ్తారు. కావున శ్రీమతముపై నడవాలి. గుణాలు కూడా చాలా బాగా ఉండాలి. ఎవరు చేస్తే వారు పొందుతారు. దైవీ క్యారెక్టర్లు కూడా కావాలి. స్కూల్ లో రిజిస్టర్ లో క్యారెక్టర్ గురించి కూడా వ్రాస్తారు. కొంతమందైతే బయట ఎదురుదెబ్బలు తింటూ ఉంటారు. తల్లిదండ్రులను చాలా ఇబ్బంది పెడుతుంటారు. ఇప్పుడు తండ్రి శాంతిధామానికి, సుఖధామానికి తీసుకువెళ్తారు. దానిని టవర్ ఆఫ్ సైలెన్స్ అని అంటారు అనగా అది సైలెన్స్ యొక్క శిఖరము, ఎక్కడైతే ఆత్మలు నివసిస్తాయో అది టవర్ ఆఫ్ సైలెన్స్. సూక్ష్మవతనము మూవీ, దానిని కేవలం మీరు సాక్షాత్కారములో చూస్తారు, అంతేకానీ అందులో ఇంకేమీ లేదు. సత్యయుగములో వృద్ధులైనప్పుడు సంతోషముగా శరీరాన్ని వదిలేస్తారు, అది కూడా పిల్లలకు సాక్షాత్కారమైంది. ఇది 84 జన్మల పాత శరీరము. తండ్రి అంటారు, మీరు పావనముగా ఉండేవారు, ఇప్పుడు పతితముగా అయ్యారు. ఇప్పుడు తండ్రి మిమ్మల్ని పావనముగా చేయడానికి వచ్చారు. మీరు నన్ను పిలిచారు కదా. జీవాత్మయే పతితముగా అయ్యింది, మళ్ళీ అదే పావనముగా అవుతుంది. మీరు ఈ దేవీ-దేవతల వంశానికి చెందినవారిగా ఉండేవారు కదా. ఇప్పుడు ఆసురీ వంశానికి చెందినవారిగా అయ్యారు. ఆసురీ వంశానికి మరియు ఈశ్వరీయ వంశానికి లేక దైవీ వంశానికి ఎంత వ్యత్యాసము ఉంది. ఇది మీ బ్రాహ్మణ కులము. వంశావళి అని రాజ్యమున్న చోట అంటారు, అక్కడ రాజ్యముంటుంది. ఇక్కడ రాజ్యము లేదు. గీతలో పాండవులు మరియు కౌరవుల రాజ్యము గురించి వ్రాశారు కానీ అవి అలా లేవు.

మీరైతే ఆత్మిక పిల్లలు. తండ్రి అంటారు - మధురమైన పిల్లలూ, చాలా-చాలా మధురముగా అవ్వండి, ప్రేమ సాగరులుగా అవ్వండి. దేహాభిమానము కారణముగానే ప్రేమ సాగరులుగా అవ్వరు, అందుకే తర్వాత చాలా శిక్షలు అనుభవించవలసి ఉంటుంది. అప్పుడిక, శిక్షలు అనుభవించిన తర్వాత ఒక చిన్న రొట్టె ముక్క లభించినట్లు ఉంటుంది. స్వర్గములోకైతే వెళ్తారు కానీ చాలా శిక్షలు అనుభవించిన తర్వాత. శిక్షలు ఎలా లభిస్తాయి అనేది కూడా పిల్లలైన మీరు సాక్షాత్కారములో చూసారు. బాబా అయితే అర్థం చేయిస్తున్నారు, చాలా ప్రేమగా నడుచుకోండి లేకపోతే క్రోధము యొక్క అంశము వస్తుంది. మమ్మల్ని నరకము నుండి బయటకు తీసి స్వర్గములోకి తీసుకువెళ్ళే తండ్రి లభించారు అని కృతజ్ఞతలు తెలపండి. శిక్షలు అనుభవించడమంటే అది చాలా చెడ్డ విషయము. సత్యయుగములో ప్రేమ రాజధాని ఉంటుందని మీకు తెలుసు. ప్రేమ తప్ప ఇంకేదీ ఉండదు. ఇక్కడైతే చిన్న విషయానికే ముఖము మారిపోతుంది. తండ్రి అంటారు, నేను పతిత ప్రపంచములోకి వచ్చాను, నన్ను ఆహ్వానించడము కూడా పతిత ప్రపంచములోకి ఆహ్వానిస్తారు. తండ్రి మాత్రము అందరికీ అమృతము తాగమని ఆహ్వానము ఇస్తారు. విషము మరియు అమృతము గురించి ఒక పుస్తకము వెలువడింది. పుస్తకము వ్రాసినవారికి బహుమతి లభించింది, వారు ప్రసిద్ధమైనవారు. ఏమి వ్రాశారో చూడాలి. తండ్రి అయితే అంటారు, మీకు జ్ఞానామృతాన్ని తాగిస్తాను, మీరు మళ్ళీ విషము ఎందుకు తింటారు. రక్షా బంధనము కూడా ఈ సమయానికి సంబంధించిన స్మృతిచిహ్నము కదా. తండ్రి అందరికీ చెప్తున్నారు - పవిత్రముగా అవుతామని ప్రతిజ్ఞ చేయండి, ఇది అంతిమ జన్మ. పవిత్రముగా అయినట్లయితే, యోగములో ఉన్నట్లయితే పాపాలు నశిస్తాయి. తమ హృదయాన్ని ప్రశ్నించుకోవాలి - నేను స్మృతిలో ఉంటున్నానా లేదా? ఇంట్లో పిల్లలను గుర్తు చేసుకుని సంతోషపడతారు కదా. పత్ని తన పతిని గుర్తు చేసుకుని సంతోషిస్తుంది కదా. వీరు ఎవరు? భగవానువాచ, వీరు నిరాకారుడు. తండ్రి అంటారు, నేను వీరి (శ్రీకృష్ణుడి) 84వ జన్మ తర్వాత మళ్ళీ వీరిని స్వర్గానికి యజమానిగా తయారుచేస్తాను. ఇప్పుడు వృక్షము చిన్నది. మాయా తుఫానులు చాలా వస్తాయి. ఇవన్నీ చాలా గుప్తమైన విషయాలు. తండ్రి అయితే అంటారు - పిల్లలూ, స్మృతియాత్రలో ఉండండి మరియు పవిత్రముగా ఉండండి. ఇక్కడే పూర్తి రాజధాని స్థాపనవ్వనున్నది. గీతలో యుద్ధాన్ని చూపిస్తారు. పాండవులు పర్వతాలపై కరిగి మరణించారు. అంతే, ఫలితమేమీ లేదు.

ఇప్పుడు పిల్లలైన మీకు సృష్టి ఆదిమధ్యాంతాల గురించి తెలుసు. తండ్రి జ్ఞాన సాగరుడు కదా. వారు సుప్రీమ్ సోల్. ఆత్మ రూపమేమిటి, ఇది కూడా ఎవ్వరికీ తెలియదు. మీ బుద్ధిలో ఆ బిందువు ఉన్నారు. మీలో కూడా యథార్థ రీతిగా ఎవరూ అర్థం చేసుకోరు. కావున బిందువును ఎలా స్మృతి చేయాలని అంటారు. అసలేమీ అర్థం చేసుకోరు. అయినా తండ్రి అంటారు, కొద్దిగా విన్నా కూడా జ్ఞానము వినాశనమవ్వదు. జ్ఞానములోకి వచ్చి మళ్ళీ వెళ్ళిపోతారు, కానీ కొద్దిగా విన్నా కూడా స్వర్గములోకి తప్పకుండా వస్తారు. ఎవరైతే ఎక్కువ వింటారో, ధారణ చేస్తారో, వారు రాజ్యములోకి వచ్చేస్తారు. కొద్దిగా వినేవారు ప్రజలలోకి వస్తారు. రాజధానిలోనైతే రాజు, రాణి మొదలైనవారందరూ ఉంటారు కదా. అక్కడ మంత్రులు ఉండరు. ఇక్కడ వికారీ రాజులు మంత్రులను పెట్టుకోవలసి ఉంటుంది. తండ్రి మీ బుద్ధిని చాలా విశాల బుద్ధిగా తయారుచేస్తారు. అక్కడ మంత్రుల అవసరమే ఉండదు. పులి-మేక కలిసి నీరు తాగుతాయి. కావున తండ్రి అర్థం చేయిస్తున్నారు - మీరు కూడా ఉప్పునీరుగా అవ్వకండి, క్షీరఖండములా అవ్వండి. పాలు మరియు చక్కెర, రెండూ మంచి వస్తువులే కదా. అభిప్రాయ భేదాలు మొదలైనవేవీ పెట్టుకోకండి. ఇక్కడైతే మనుష్యులు ఎంతగా కొట్లాడుకుంటారు, గొడవపడతారు. ఇది ఉన్నదే రౌరవ నరకము. నరకములో మునకలు వేస్తూ ఉంటారు. తండ్రి వచ్చి బయటకు తీస్తారు. బయటకు వస్తూ-వస్తూ మళ్ళీ చిక్కుకుపోతారు. కొంతమందైతే ఇతరులను బయటకు తీయడానికని వెళ్తారు కానీ అప్పుడు స్వయము కూడా బయటకు వెళ్ళిపోతారు. ప్రారంభములో చాలామందిని మాయా రూపీ మొసలి పట్టేసుకుంది. ఒక్కసారిగా పూర్తిగా మింగేసింది. కొద్దిగా కూడా గుర్తులు లేవు. కొంతమందివి గుర్తులు ఉన్నాయి, వారు మళ్ళీ తిరిగి వస్తారు. కొంతమంది పూర్తిగా సమాప్తమైపోయారు. ఇక్కడ ప్రాక్టికల్ గా అంతా జరుగుతూ ఉంది. మీరు చరిత్ర వింటే ఆశ్చర్యపోతారు. మీరు ప్రేమించండి లేక తిరస్కరించండి, మేము మీ గడప నుండి బయటకు వెళ్ళము... అని గాయనముంది. బాబా అయితే ఎప్పుడూ నోటితో కూడా ఇలా ఏమీ అనరు. ఎంత ప్రేమగా చదివిస్తారు. లక్ష్యము-ఉద్దేశ్యము ఎదురుగా నిలబడి ఉంది. ఉన్నతోన్నతమైన తండ్రి ఈ విధముగా (విష్ణువుగా) తయారుచేస్తారు. ఆ విష్ణువే మళ్ళీ బ్రహ్మాగా అవుతారు. క్షణములో జీవన్ముక్తి లభించింది, మళ్ళీ 84 జన్మలు తీసుకుని ఇలా అయ్యారు. తతత్వమ్. మీ ఫొటోలు కూడా తీసేవారు కదా. మీరు బ్రహ్మా సంతానమైన బ్రాహ్మణులు. ప్రస్తుతము మీకు కిరీటము లేదు, అది భవిష్యత్తులో లభించనున్నది, అందుకే మీ ఈ ఫోటో కూడా ఉంచారు. తండ్రి వచ్చి పిల్లలను డబుల్ కిరీటధారులుగా తయారుచేస్తారు. తప్పకుండా పూర్వము మాలో పంచ వికారాలు ఉండేవని మీకు అనిపిస్తుంది (నారదుని ఉదాహరణ). భక్తులుగా కూడా మొట్టమొదట మీరే అయ్యారు. ఇప్పుడు తండ్రి ఎంత ఉన్నతముగా తయారుచేస్తారు. పూర్తిగా పతితుల నుండి పావనులుగా చేస్తారు. తండ్రి ఏమీ తీసుకోరు. శివబాబా ఏం తీసుకుంటారు! మీరు శివబాబా భండారీలో వేస్తారు. నేనైతే ట్రస్టీని. ఇచ్చి-పుచ్చుకునే లెక్క అంతా శివబాబాతోనే ఉంది. నేను చదువుకుంటాను, చదివిస్తాను. ఎవరైతే తన వద్ద ఉన్నదే అంతా ఇచ్చేసారో, వారు మళ్ళీ ఏమి తీసుకుంటారు. ఏ వస్తువు పట్ల మమకారము ఉండదు. ఫలానావారు స్వర్గస్థులయ్యారని పాడుతారు కూడా. మరి వారికి నరకము యొక్క అన్నపానాదులు మొదలైనవి ఎందుకు తినిపిస్తారు. అది అజ్ఞానము కదా. నరకములో ఉంటే పునర్జన్మ కూడా నరకములోనే ఉంటుంది కదా. ఇప్పుడు మీరు అమరలోకములోకి వెళ్తారు. ఇది పిల్లిమొగ్గల ఆట. బ్రాహ్మణులైన మీరు పిలక వంటి వారు, ఆ తర్వాత దేవతలుగా, క్షత్రియులుగా అవుతారు, అందుకే తండ్రి అర్థం చేయిస్తున్నారు, చాలా మధురముగా అవ్వండి. అయినా కానీ బాగుపడకపోతే, ఇక వారి భాగ్యము అని అంటారు. తమను తామే నష్టపరచుకుంటారు. బాగుపడనే బాగుపడకపోతే, ఇక ఈశ్వరుడు చెప్పే పురుషార్థము కూడా ఏమి చేస్తారు.

తండ్రి అంటారు, నేను ఆత్మలతో మాట్లాడుతున్నాను. అవినాశీ ఆత్మలకు అవినాశీ తండ్రి అయిన పరమాత్మ జ్ఞానాన్ని ఇస్తున్నారు. ఆత్మ చెవుల ద్వారా వింటుంది. అనంతమైన తండ్రి ఈ జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. మిమ్మల్ని మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేస్తారు. మార్గాన్ని చూపించే సుప్రీమ్ పండా కూర్చుని ఉన్నారు. శ్రీమతము చెప్తుంది - పవిత్రముగా అవ్వండి, నన్ను స్మృతి చేసినట్లయితే మీ పాపాలు భస్మమైపోతాయి. మీరే సతోప్రధానముగా ఉండేవారు. 84 జన్మలు కూడా మీరే తీసుకున్నారు. తండ్రి వీరికే అర్థం చేయిస్తున్నారు - మీరు సతోప్రధానము నుండి ఇప్పుడు తమోప్రధానముగా అయ్యారు, ఇప్పుడు మళ్ళీ నన్ను స్మృతి చేయండి. దీనిని యోగాగ్ని అని అంటారు. ఈ జ్ఞానము కూడా ఇప్పుడు మీకు ఉంది. సత్యయుగములో నన్ను ఎవ్వరూ స్మృతి చేయరు. ఈ సమయములోనే నేను చెప్తాను - నన్ను స్మృతి చేసినట్లయితే మీ పాపాలు నశిస్తాయి, ఇంకే మార్గమూ లేదు. ఇది స్కూల్ కదా. దీనిని విశ్వ విద్యాలయము, వరల్డ్ యూనివర్శిటీ అని అంటారు. రచయిత మరియు రచనల ఆదిమధ్యాంతాల జ్ఞానము ఇంకెవ్వరికీ తెలియదు. శివబాబా అంటారు, ఈ లక్ష్మీ-నారాయణులలో కూడా ఈ జ్ఞానము లేదు, అది ప్రారబ్ధము కదా. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ప్రేమ యొక్క రాజధానిలోకి వెళ్ళాలి, దాని కోసం పరస్పరము క్షీరఖండముగా అయి ఉండాలి. ఎప్పుడూ కూడా ఉప్పునీరులా అయి అభిప్రాయ భేదాలలోకి రాకూడదు. స్వయాన్ని స్వయమే తీర్చిదిద్దుకోవాలి.

2. దేహాభిమానాన్ని వదిలి మాస్టర్ ప్రేమ సాగరులుగా అవ్వాలి. తమ దైవీ క్యారెక్టర్ ను తయారుచేసుకోవాలి. చాలా-చాలా మధురముగా ఉంటూ నడుచుకోవాలి.

వరదానము:-
మనసు యొక్క స్వతంత్రత ద్వారా సర్వ ఆత్మలకు శాంతి దానాన్ని ఇచ్చే మనసా మహాదానీ భవ

బంధనములో ఉన్న కుమార్తెలు తనువు ద్వారా బంధనములో ఉన్నా కానీ, మనసుతో ఒకవేళ స్వతంత్రముగా ఉన్నట్లయితే తమ వృత్తి ద్వారా, శుద్ధ సంకల్పాల ద్వారా విశ్వములోని వాయుమండలాన్ని మార్చి వేసే సేవ చేయగలుగుతారు. ఈ రోజుల్లో విశ్వానికి అవసరమైనది మనసు యొక్క శాంతి. కావున మనసు ద్వారా స్వతంత్రముగా ఉన్న ఆత్మ మనసా ద్వారా శాంతి వైబ్రేషన్లను వ్యాపింపజేయగలదు. శాంతి సాగరుడైన బాబా స్మృతిలో ఉండటము ద్వారా ఆటోమేటిక్ గా శాంతి కిరణాలు వ్యాపిస్తాయి. ఈ విధముగా శాంతి దానాన్ని ఇచ్చేవారే మనసా మహాదానులు.

స్లోగన్:-
పురుషార్థము ఎలా చేయండి అంటే దానిని చూసి ఇతర ఆత్మలు కూడా ఫాలో చేయాలి.

అవ్యక్త ప్రేరణలు - ఇప్పుడు సంపన్నముగా మరియు కర్మాతీతముగా అవ్వాలి అనే ధ్యాసలోనే ఉండండి

బ్రాహ్మణులు ప్రతి ఒక్కరు బాబా సమానముగా చైతన్యమైన చిత్రముగా అవ్వండి, లైట్ హౌస్ మరియు మైట్ హౌస్ యొక్క మూర్తిలా అవ్వండి. సంకల్ప శక్తి యొక్క, సైలెన్స్ యొక్క భాషణను తయారుచేయండి మరియు కర్మాతీత స్థితిలో వరదానీ మూర్తి యొక్క పాత్రను అభినయించండి, అప్పుడు సంపూర్ణత సమీపముగా వస్తుంది. అప్పుడు క్షణము కంటే కూడా త్వరగా ఎక్కడైతే కర్తవ్యాన్ని చేయించవలసి ఉంటుందో, అక్కడ వైర్ లెస్ ద్వారా డైరెక్షన్లను ఇవ్వగలుగుతారు. క్షణములో కర్మాతీత స్థితి ఆధారముతో సంకల్పము చేస్తారు మరియు ఎక్కడికి కావాలంటే అక్కడికి ఆ సంకల్పము చేరుకుంటుంది.