17-04-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - ఈ ఆత్మిక హాస్పిటల్ మిమ్మల్ని
అర్ధకల్పము కొరకు నిరోగులుగా తయారుచేస్తుంది, ఇక్కడ మీరు దేహీ-అభిమానులుగా అయి
కూర్చోండి’’
ప్రశ్న:-
వ్యాపార
వ్యవహారాలు మొదలైనవి చేసుకుంటూ కూడా ఏ డైరెక్షన్ బుద్ధిలో గుర్తుండాలి?
జవాబు:-
తండ్రి
డైరెక్షన్ ఏమిటంటే - మీరు ఏ సాకార రూపాన్ని లేక ఆకార రూపాన్ని స్మృతి చేయకండి, ఒక్క
తండ్రి స్మృతే ఉన్నట్లయితే వికర్మలు వినాశనమవుతాయి. ఈ విషయములో ఎవరూ కూడా తీరిక లేదు
అని చెప్పడానికి అవకాశము లేదు. అన్నీ చేసుకుంటూ కూడా స్మృతిలో ఉండవచ్చు.
ఓంశాంతి
మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలకు తండ్రి యొక్క గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్
చెప్పిన తర్వాత, తండ్రిని స్మృతి చేయండి అని పిల్లలకు చెప్తారు. ఓ పతిత-పావనా, మీరు
వచ్చి పావనముగా తయారుచేయండి అని పిలుస్తారు కూడా, ఇక్కడ తండ్రి మొట్టమొదటే చెప్తారు
- ఆత్మిక తండ్రిని స్మృతి చేయండి. ఆత్మిక తండ్రి అయితే అందరికీ ఒక్కరే. తండ్రిని
ఎప్పుడూ సర్వవ్యాపిగా భావించరు. కావున పిల్లలూ - ఎంత వీలైతే అంత మొట్టమొదట తండ్రిని
స్మృతి చేయండి, ఒక్క తండ్రిని తప్ప ఏ సాకార రూపము కలవారిని లేక ఆకార రూపము కలవారిని
స్మృతి చేయకండి. ఇది చాలా సహజము కదా. మనుష్యులు - మేము బిజీగా ఉంటాము, తీరిక ఉండదు
అని అంటారు. కానీ దీని కొరకైతే సదా తీరిక ఉంటుంది. తండ్రి యుక్తిని
తెలియజేస్తున్నారు - తండ్రిని స్మృతి చేయడము ద్వారానే మన పాపాలు భస్మమవుతాయని కూడా
మీకు తెలుసు. ముఖ్యమైన విషయము ఇదే. వ్యాపార వ్యవహారాలు మొదలైనవాటికి వద్దని చెప్పరు.
అవన్నీ చేసుకుంటూ కేవలం తండ్రిని స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి. మేము
పతితులము అనైతే అర్థం చేసుకుంటారు, సాధు-సన్యాసులు, ఋషులు, మునులు మొదలైనవారందరూ
సాధన చేస్తారు. సాధన అనేది భగవంతుడిని కలుసుకునేందుకే చేయడం జరుగుతుంది.
ఎప్పటివరకైతే వారి పరిచయము ఉండదో అప్పటివరకూ వారిని కలుసుకోలేరు. తండ్రి పరిచయము
ప్రపంచములో ఎవరికీ లేదు అని మీకు తెలుసు. దేహ పరిచయమైతే అందరికీ తెలుసు. పెద్ద
వస్తువు యొక్క పరిచయము వెంటనే తెలుస్తుంది. ఆత్మ పరిచయాన్ని అయితే ఎప్పుడైతే తండ్రి
వస్తారో, అప్పుడే అర్థం చేయిస్తారు. ఆత్మ మరియు శరీరము, రెండూ వేర్వేరు వస్తువులు.
ఆత్మ ఒక నక్షత్రము వంటిది మరియు చాలా సూక్ష్మమైనది. దానిని ఎవరూ చూడలేరు. ఇక్కడికి
వచ్చి కూర్చున్నప్పుడు దేహీ-అభిమానులుగా అయి కూర్చోవాలి. అర్ధకల్పము కొరకు సదా
ఆరోగ్యవంతులుగా అయ్యేందుకు ఇది కూడా ఒక హాస్పిటల్ కదా. ఆత్మ అయితే అవినాశీ, అది
ఎప్పుడూ వినాశనము అవ్వదు. పాత్ర అంతా ఆత్మకు సంబంధించినదే. ఆత్మ అంటుంది, నేను
ఎప్పుడూ వినాశనమవ్వను. ఇన్ని ఆత్మలన్నీ అవినాశీ అయినవి. శరీరము వినాశీ. ఆత్మ అయిన
మనము అవినాశీ అని ఇప్పుడు మీ బుద్ధిలో కూర్చుని ఉంది. మనము 84 జన్మలు తీసుకుంటాము,
ఇది డ్రామా. ఇందులో ధర్మ స్థాపకులు ఎవరెవరు ఎప్పుడెప్పుడు వస్తారు, ఎన్ని జన్మలు
తీసుకుంటూ ఉండవచ్చు, ఇది మీకు తెలుసు. 84 జన్మలు అని ఏదైతే అంటూ ఉంటారో, అవి
తప్పకుండా ఏదో ఒక ధర్మానికి చెందినవారికే ఉంటాయి. అన్ని ధర్మాల వారికి ఉండవు. అన్ని
ధర్మాలు కలిసి ఒకేసారి రావు. మనము కూర్చుని ఇతర ధర్మాల లెక్కలను ఎందుకు వేయాలి?
ఫలానా-ఫలానా సమయములో ధర్మ స్థాపన చేయడానికి వస్తారని మీకు తెలుసు. తర్వాత వారి
వృద్ధి జరుగుతుంది. అందరూ సతోప్రధానము నుండి తమోప్రధానముగా అవ్వవలసిందే. ప్రపంచము
ఎప్పుడైతే తమోప్రధానముగా అవుతుందో, అప్పుడు మళ్ళీ తండ్రి వచ్చి సతోప్రధానమైన
సత్యయుగాన్ని తయారుచేస్తారు. ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు - భారతవాసులమైన మనమే
మళ్ళీ కొత్త ప్రపంచములోకి వచ్చి రాజ్యము చేస్తాము, అప్పుడు ఇతర ధర్మాలేవీ అక్కడ
ఉండవు. పిల్లలైన మీలో కూడా ఎవరైతే ఉన్నత పదవిని తీసుకునేది ఉందో, వారే ఎక్కువగా
స్మృతిలో ఉండేందుకు పురుషార్థము చేస్తారు మరియు - బాబా, నేను ఇంత సమయము స్మృతిలో
ఉంటున్నాను అని వారు సమాచారము కూడా వ్రాస్తారు. కొందరైతే సిగ్గు కారణముగా పూర్తి
సమాచారాన్ని ఇవ్వరు. బాబా ఏమంటారో అని భావిస్తారు. కానీ తెలియడమైతే తెలుస్తుంది కదా.
స్కూల్ లో టీచర్లు విద్యార్థులతో - మీరు ఒకవేళ చదవకపోతే ఫెయిల్ అయిపోతారు అని
చెప్తారు కదా. లౌకిక తల్లిదండ్రులు కూడా పిల్లల చదువును బట్టి అర్థం చేసుకుంటారు.
ఇది చాలా పెద్ద స్కూల్. ఇక్కడైతే నంబరువారుగా కూర్చోబెట్టడం జరగదు. కానీ
నంబరువారుగానే ఉంటారు కదా అని బుద్ధి ద్వారా అర్థం చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు
బాబా మంచి-మంచి పిల్లలను ఎక్కడికైనా పంపిస్తారు, వారు మళ్ళీ వెళ్ళిపోతే అక్కడివారు
- మాకు మహారథి కావాలి అని వ్రాస్తారు, అంటే వారు మా కంటే తెలివైనవారు, ప్రసిద్ధి
చెందినవారు అని తప్పకుండా భావిస్తున్నారు. నంబరువారుగానైతే ఉంటారు కదా. ప్రదర్శనీకి
కూడా అనేక రకాల వారు వస్తారు కావున వారిని గమనించేందుకు గైడ్స్ కూడా నిలబడి ఉండాలి.
రిసీవ్ చేసుకునేవారికి, ఆ వచ్చినవారు ఎటువంటి వ్యక్తి అనేది తెలుస్తుంది. కావున
వాళ్ళు - ఆ వచ్చిన వారికి మీరు అర్థం చేయించండి అని అక్కడివారికి సూచన ఇవ్వాలి.
ఇక్కడ ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్, అందరూ ఉన్నారని మీరు కూడా అర్థం
చేసుకోగలరు. ప్రదర్శనీలోనైతే అందరి సేవా చేయవలసిందే. ఎవరైనా పెద్ద వ్యక్తి
ఉన్నట్లయితే తప్పకుండా ఆ పెద్ద వ్యక్తికి అందరూ మర్యాద చేస్తారు. ఇది నియమము. తండ్రి
లేక టీచర్ పిల్లలను క్లాసులో మహిమ చేస్తారు, ఇది కూడా అన్నింటికంటే గొప్ప పాలన.
పేరును ప్రఖ్యాతము చేసే పిల్లలను మహిమ చేయడం జరుగుతుంది మరియు మర్యాద చేయడం
జరుగుతుంది. ఫలానావారు ధనవంతుడు, ధార్మిక మనస్తత్వము కలవారు, ఇది కూడా మర్యాద చేయడమే
కదా. ఇప్పుడు మీకు ఉన్నతోన్నతమైనవారు భగవంతుడు అన్న విషయము తెలుసు. వారు
ఉన్నతోన్నతమైనవారు అని తప్పకుండా అంటారు కూడా, కానీ వారి జీవిత చరిత్రను గురించి
చెప్పమని అడిగితే, వారు సర్వవ్యాపి అని అంటారు. ఒక్కసారిగా విలువ తగ్గించేస్తారు.
అందరికన్నా ఉన్నతోన్నతమైనవారు భగవంతుడని, వారు మూలవతనవాసి అని ఇప్పుడు మీరు అర్థం
చేయించవచ్చు. సూక్ష్మవతనములో దేవతలు ఉంటారు. ఇక్కడ మనుష్యులు ఉంటారు. కావున
ఉన్నతోన్నతమైన భగవంతుడు ఆ నిరాకారుడు.
ఇప్పుడు మీకు తెలుసు - వజ్ర సమానముగా ఉన్న మనమే మళ్ళీ గవ్వ సమానముగా అయిపోయాము,
భగవంతుడినైతే మన కంటే కూడా తక్కువగా చూపించాము. వారిని గుర్తించనే గుర్తించరు.
భారతవాసులైన మీకే వారి పరిచయము లభిస్తుంది. మళ్ళీ తర్వాత ఆ పరిచయము తగ్గిపోతుంది.
ఇప్పుడు మీరు తండ్రి పరిచయాన్ని అందరికీ ఇస్తూ వెళ్తారు. అనేకులకు తండ్రి పరిచయము
లభిస్తుంది. మీ ముఖ్యమైన చిత్రాలు ఈ త్రిమూర్తి, సృష్టిచక్రము, కల్పవృక్షము. వీటిలో
ఎంత ప్రకాశము ఉంది. ఈ లక్ష్మీ-నారాయణులు సత్యయుగానికి యజమానులు అని ఎవరైనా అంటారు.
అచ్ఛా, మరి సత్యయుగము కంటే ముందు ఏముండేది? ఇది కూడా ఇప్పుడు మీకు తెలుసు. ఇప్పుడు
ఉన్నది కలియుగ అంతిమము, అది కూడా ప్రజలపై ప్రజల రాజ్యము. ఇప్పుడు రాజ్యాలైతే లేవు.
ఎంత తేడా ఉంది. సత్యయుగ ఆదిలో రాజులు ఉండేవారు మరియు ఇప్పుడు కలియుగములో కూడా రాజులు
ఉన్నారు. ఇక్కడ ఎవరూ పావనముగా లేరు కానీ కొందరు ధనము ఇచ్చి అయినా సరే ఆ టైటిల్ ను
తీసుకుంటారు. మహారాజులైతే ఎవరూ లేరు, కానీ ఆ టైటిల్ ను కొనుక్కుంటారు. ఉదాహరణకు
పటియాలా మహారాజు, జోధ్ పూర్ మహారాజు, బికానేర్ మహారాజు... అంటూ పేర్లు అయితే
తీసుకుంటారు కదా. మహారాజు అన్న పేరు అవినాశీగా నడుస్తూ ఉంటుంది. మొదట పవిత్ర
మహారాజులు ఉండేవారు, ఇప్పుడు అపవిత్రమైనవారు ఉన్నారు. రాజు, మహారాజు అన్న పదాలు
కొనసాగుతూ వస్తాయి. ఈ లక్ష్మీ-నారాయణుల గురించి - వీరు సత్యయుగానికి యజమానులుగా
ఉండేవారు అని అంటారు, మరి రాజ్యాన్ని ఎవరు తీసుకున్నారు? రాజ్య స్థాపన ఎలా
జరుగుతుంది అనేది ఇప్పుడు మీకు తెలుసు. తండ్రి అంటారు, నేను మిమ్మల్ని 21 జన్మల
కొరకు ఇప్పుడు చదివిస్తున్నాను. వాళ్ళు అయితే చదువుకుని ఈ జన్మలోనే బ్యారిస్టర్
మెదలైనవారిగా అవుతారు. మీరు ఇప్పుడు చదువుకుని భవిష్యత్తులో మహారాజులుగా,
మహారాణులుగా అవుతారు. డ్రామా ప్లాన్ అనుసారముగా కొత్త ప్రపంచ స్థాపన జరుగుతోంది.
ఇప్పుడు ఇది పాత ప్రపంచము. ఎంత మంచి-మంచి పెద్ద మహళ్ళు ఉన్నా కానీ, వజ్ర-వైఢూర్యాలతో
కూడిన మహళ్ళను తయారుచేసే శక్తి అయితే ఎవ్వరికీ లేదు. సత్యయుగములో అన్నీ
వజ్ర-వైఢూర్యాలతో కూడిన మహళ్ళను తయారుచేస్తారు కదా. అవి తయారుచేయడానికి పెద్ద
సమయమేమీ పట్టదు. ఇక్కడ కూడా భూకంపాలు మొదలైనవి వస్తే ఎంతోమంది కార్మికులను పెడతారు,
ఒకటి-రెండు సంవత్సరాలలో మొత్తము నగరాన్ని అంతా నిలబెట్టేస్తారు. కొత్త ఢిల్లీని
తయారుచేయడానికి మహా అయితే 8-10 సంవత్సరాలు పట్టింది కానీ ఇక్కడి కార్మికులకు మరియు
అక్కడి కార్మికులకు తేడా అయితే ఉంటుంది కదా. ఈ రోజుల్లోనైతే కొత్త-కొత్త ఆవిష్కరణలను
కూడా కనుక్కుంటూ ఉంటారు. ఇళ్ళు తయారుచేసే సైన్సు కూడా చాలా అభివృద్ధి చెందుతుంది,
అన్నీ సిద్ధంగా లభిస్తాయి, వెంటనే ఫ్లాట్ తయారైపోతుంది. చాలా త్వరత్వరగా తయారవుతాయి.
కావున ఇవన్నీ అక్కడ ఉపయోగపడతాయి కదా. ఇవన్నీ తోడుగా వస్తాయి. సంస్కారాలైతే ఉంటాయి
కదా. ఈ సైన్స్ సంస్కారాలు కూడా తోడుగా వస్తాయి. ఇప్పుడు తండ్రి పిల్లలకు అర్థం
చేయిస్తూ ఉంటారు - పావనముగా తయారవ్వాలంటే తండ్రిని స్మృతి చేయండి. తండ్రి కూడా గుడ్
మార్నింగ్ చెప్పి, తర్వాత శిక్షణ ఇస్తారు. పిల్లలూ, తండ్రి స్మృతిలో కూర్చున్నారా?
నడుస్తూ, తిరుగుతూ తండ్రిని స్మృతి చేయండి ఎందుకంటే జన్మ-జన్మాంతరాల భారము తలపై ఉంది.
మెట్లు దిగుతూ-దిగుతూ 84 జన్మలు తీసుకుంటారు. ఇప్పుడు మళ్ళీ ఒక్క జన్మలో ఎక్కే కళ
ఏర్పడుతుంది. ఎంతగా తండ్రిని స్మృతి చేస్తూ ఉంటారో, అంతగా సంతోషము కూడా ఉంటుంది,
శక్తి లభిస్తుంది. చాలామంది పిల్లలను ముందు నంబరులో ఉంచడము జరుగుతుంది, కానీ వారు ఏ
మాత్రమూ స్మృతిలో ఉండరు. జ్ఞానములో చాలా చురుకుగా ఉండి ఉండవచ్చు కానీ స్మృతియాత్ర
లేదు. తండ్రి అయితే పిల్లలను మహిమ చేస్తారు. ఇతను కూడా నంబరువన్ లో ఉన్నారంటే
తప్పకుండా కృషి కూడా చేస్తూ ఉండవచ్చు కదా. మీరు ఎల్లప్పుడూ - శివబాబాయే అర్థం
చేయిస్తున్నారు అని భావించండి, అప్పుడు బుద్ధియోగము అక్కడ జోడించబడి ఉంటుంది. ఇతను
కూడా నేర్చుకుంటూ ఉండవచ్చు కదా. అయినా సరే, బాబాను స్మృతి చేయండి అని చెప్తారు.
ఎవరికైనా అర్థం చేయించేందుకు చిత్రాలు ఉన్నాయి. భగవంతుడు అని నిరాకారుడినే అంటారు.
వారు వచ్చి శరీరాన్ని ధారణ చేస్తారు. ఒక్క భగవంతుని పిల్లలైన ఆత్మలందరూ పరస్పరము
సోదరులు. ఇప్పుడు ఈ శరీరములో విరాజమానమై ఉన్నారు. అందరూ అకాలమూర్తులే. ఇది
అకాలమూర్తి అయిన ఆత్మకు సింహాసనము. అకాల సింహాసనము అంటూ విశేషమైన వస్తువేదీ లేదు.
ఇది అకాలమూర్తి యొక్క సింహాసనము. భృకుటి మధ్యలో ఆత్మ విరాజమానమై ఉంటుంది, దీనినే
వారు అకాల సింహాసనము అని అంటారు. అకాలమూర్తి యొక్క అకాల సింహాసనము. ఆత్మలన్నీ
అకాలమూర్తులు. ఎంత అతి సూక్ష్మముగా ఉంటాయి. తండ్రి అయితే నిరాకారుడు. వారు తమ
సింహాసనాన్ని ఎక్కడి నుండి తెచ్చుకోవాలి. తండ్రి అంటారు, నా సింహాసనము కూడా ఇదే.
నేను వచ్చి ఈ సింహాసనాన్ని అప్పుగా తీసుకుంటాను. బ్రహ్మా యొక్క సాధారణ వృద్ధ తనువులో
అకాల సింహాసనముపై వచ్చి కూర్చుంటాను. సర్వాత్మలకు భృకుటి అనేది సింహాసనము వంటిది అని
ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. మనుష్యుల గురించే మాట్లాడడం జరుగుతుంది, జంతువుల
విషయము కాదు. ముందుగా జంతువుల కంటే కూడా హీనముగా అయిపోయిన మనుష్యులు బాగుపడాలి కదా.
ఎవరైనా జంతువుల గురించి అడిగితే, మీరు చెప్పండి - మొదట స్వయాన్ని అయితే
తీర్చిదిద్దుకోండి. సత్యయుగములోనైతే జంతువులు కూడా చాలా బాగా ఫస్ట్ క్లాస్ గా ఉంటాయి.
అక్కడ చెత్త మొదలైనదేమీ ఉండదు. రాజ్య మహల్లో పావురాలు మొదలైనవాటి చెత్త ఏమైనా ఉంటే
దండించడం జరుగుతుంది. కొద్దిగా కూడా చెత్త ఉండదు. అక్కడ చాలా జాగ్రత్తగా ఉంటారు.
ఎప్పుడూ ఏ జంతువూ లోపలికి దూరిపోకుండా కాపలా కాస్తారు. అక్కడ చాలా శుభ్రత ఉంటుంది.
లక్ష్మీ-నారాయణుల మందిరములో కూడా ఎంత శుభ్రత ఉంటుంది. శంకర, పార్వతుల మందిరములో
పావురాలను కూడా చూపిస్తారు, కావున తప్పకుండా అవి ఆ మందిరాన్ని కూడా పాడు చేస్తూ
ఉండవచ్చు. శాస్త్రాలలోనైతే ఎన్నో కట్టుకథలను వ్రాసేసారు. ఇప్పుడు తండ్రి పిల్లలకు
అర్థం చేయిస్తున్నారు, వారిలో కూడా ధారణ చేయగలిగిన వారు కొద్దిమందే ఉన్నారు.
మిగిలినవారికి ఏమీ అర్థం కాదు. తండ్రి పిల్లలకు ఎంత ప్రేమగా అర్థం చేయిస్తున్నారు -
పిల్లలూ, చాలా-చాలా మధురముగా అవ్వండి. నోటి నుండి సదా రత్నాలే వెలువడుతూ ఉండాలి.
మీరు రూప్ (యోగ స్వరూపులు) మరియు బసంత్ (జ్ఞాన స్వరూపులు). మీ నోటి నుండి రాళ్ళు
వెలువడకూడదు. ఆత్మకే మహిమ ఉంటుంది. నేను ప్రెసిడెంట్ ను, ఫలానాను, అని ఆత్మయే
అంటుంది. ఇది నా శరీరము యొక్క పేరు. అచ్ఛా, మరి ఆత్మలు ఎవరి సంతానము? ఒక్క
పరమాత్ముని సంతానము. కావున తప్పకుండా వారి నుండి వారసత్వము లభిస్తూ ఉండవచ్చు. వారు
మరి సర్వవ్యాపి ఎలా అవ్వగలరు! మాకు కూడా మొదట ఏమీ తెలియదని మీరు అర్థం చేసుకుంటారు.
ఇప్పుడు బుద్ధి ఎంతగా తెరుచుకుంది. మీరు ఏ మందిరములోకి వెళ్ళినా, అవన్నీ అసత్యమైన
చిత్రాలని అర్థమవుతుంది. పది భుజాలు కలిగినవారు, ఏనుగు తొండం కలిగిన వారు, ఇటువంటి
చిత్రాలు ఏమైనా ఉంటాయా? ఇవన్నీ భక్తి మార్గానికి చెందిన సామగ్రి. వాస్తవానికి భక్తి
అనేది ఒక్క శివబాబాకే చేయాలి, వారే సర్వుల సద్గతిదాత. ఈ లక్ష్మీ-నారాయణులు కూడా 84
జన్మలు తీసుకుంటారని మీ బుద్ధిలో ఉంది. మళ్ళీ ఉన్నతోన్నతుడైన తండ్రియే వచ్చి
సర్వులకు సద్గతిని ఇస్తారు. వారికన్నా ఉన్నతమైనవారు ఎవ్వరు లేరు. ఈ జ్ఞానానికి
సంబంధించిన విషయాలను మీలో కూడా నంబరువారుగానే ధారణ చేయగలరు. ధారణ చేయలేకపోతే ఇంక
దేనికి పనికొస్తారు? కొందరైతే అంధులకు చేతికర్రగా అయ్యేందుకు బదులుగా స్వయం అంధులుగా
అయిపోతారు. పాలు ఇవ్వని ఆవును వేరొక స్థలం (బందెలి దొడ్డి) లో ఉంచుతారు. అలాగే వీరు
కూడా జ్ఞానమనే పాలను ఇవ్వలేరు. ఏ పురుషార్థమూ చేయనివారు చాలామంది ఉన్నారు. మేము
ఎవరికైనా కొద్దిగానైనా కళ్యాణము చేయాలి అని కూడా వారు అర్థం చేసుకోరు. తమ భాగ్యము
గురించి ఆలోచనే ఉండదు. ఏది లభిస్తే అదే మంచిది అని భావిస్తారు. అప్పుడు తండ్రి
అంటారు, వీరి భాగ్యములోనే లేదు. తమ సద్గతిని చేసుకునే పురుషార్థమైతే చేయవలసి ఉంటుంది.
దేహీ-అభిమానులుగా అవ్వాలి. తండ్రి ఎంత ఉన్నతోన్నతమైనవారు, అయినా కానీ ఎలాంటి పతిత
ప్రపంచములోకి, పతిత శరీరములోకి వచ్చారో చూడండి. వారిని పిలిచేదే పతిత ప్రపంచములోకి.
ఎప్పుడైతే రావణుడు పూర్తిగా భ్రష్టం చేసేస్తాడో, అప్పుడు తండ్రి వచ్చి శ్రేష్ఠముగా
తయారుచేస్తారు. ఎవరైతే మంచి పురుషార్థము చేస్తారో వారు రాజు-రాణులుగా అవుతారు,
ఎవరైతే పురుషార్థము చేయరో వారు నిరుపేదలుగా అవుతారు. భాగ్యములో లేకపోతే పురుషార్థము
కూడా చేయలేరు. కొందరైతే చాలా మంచి భాగ్యాన్ని తయారుచేసుకుంటారు. నేను ఏ సేవ
చేస్తున్నాను అని ప్రతి ఒక్కరూ స్వయాన్ని చూసుకోగలరు. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. రూప్ (యోగ స్వరూపులు) మరియు బసంత్ (జ్ఞాన స్వరూపులు) గా అయి సదా నోటి నుండి
రత్నాలే వెలువడేలా ఉండాలి, చాలా-చాలా మధురముగా అవ్వాలి. ఎపుడూ కూడా రాళ్ళను (కఠినమైన
మాటలను) వెలువడనివ్వకూడదు.
2. జ్ఞానము మరియు యోగములో చురుకుగా అయ్యి తమ మరియు ఇతరుల కళ్యాణము చేయాలి. తమ
ఉన్నతమైన భాగ్యాన్ని తయారుచేసుకునే పురుషార్థము చేయాలి. అంధులకు చేతికర్రగా అవ్వాలి.
వరదానము:-
మూడు స్మృతుల స్వరూపము యొక్క తిలకాన్ని ధారణ చేసే సంపూర్ణ
విజయీ భవ
స్వయము యొక్క స్మృతి, తండ్రి యొక్క స్మృతి మరియు డ్రామా
జ్ఞానము యొక్క స్మృతి - ఈ మూడు స్మృతులలోనే మొత్తము జ్ఞానము యొక్క విస్తారమంతా ఇమిడి
ఉంది. జ్ఞానమనే వృక్షానికి సంబంధించినవి ఈ మూడు స్మృతులు. ఏ విధంగా వృక్షానికి మొదటి
బీజము ఉంటుంది, ఆ బీజము ద్వారా రెండు ఆకులు వెలువడుతాయి, ఆ తర్వాత వృక్షము
విస్తారమవుతుంది, అలాగే ముఖ్యమైనది బీజరూపుడైన తండ్రి యొక్క స్మృతి, ఆ తర్వాత రెండు
ఆకులు అనగా ఆత్మ మరియు డ్రామా యొక్క పూర్తి జ్ఞానము. ఈ మూడు స్మృతులను ధారణ చేసేవారు
స్మృతి భవ మరియు సంపూర్ణ విజయీ భవ యొక్క వరదానులుగా అవుతారు.
స్లోగన్:-
ప్రాప్తులను సదా ఎదురుగా పెట్టుకున్నట్లయితే బలహీనతలు సహజముగా సమాప్తమైపోతాయి.
అవ్యక్త సూచనలు -
‘‘కంబైండ్ రూపపు స్మృతి ద్వారా సదా విజయులుగా అవ్వండి’’
సంగమయుగములో బ్రహ్మాకుమార-బ్రహ్మాకుమారీలు ఒంటరిగా అవ్వలేరు. కేవలము తండ్రి తోడు
యొక్క అనుభవాన్ని, కంబైండ్ రూపము యొక్క అనుభవాన్ని ఇమర్జ్ చేసుకోండి. తండ్రి అయితే
ఎలాగూ నా వారే, తోడుగా ఉండనే ఉన్నారు అని కాదు. అలా కాదు, తోడు యొక్క ప్రాక్టికల్
అనుభవము ఇమర్జ్ అవ్వాలి. అప్పుడు ఈ మాయ దాడి, దాడిలా జరగదు, మాయ ఓడిపోతుంది.
ఏమైపోయింది... అని మాత్రము భయపడకండి, ధైర్యము ఉంచండి. తండ్రి తోడును స్మృతిలో
పెట్టుకున్నట్లయితే విజయము మీ జన్మసిద్ధ అధికారము.
| | |