18-07-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీపై మీరే దయ చూపించుకోండి, తండ్రి ఏ శ్రీమతమునైతే ఇస్తారో దానిపై నడుస్తూ ఉండండి, తండ్రి శ్రీమతము ఏమిటంటే - పిల్లలూ, సమయాన్ని వృధా చేయకండి, సరైన కర్మలను చేయండి’’

ప్రశ్న:-
భాగ్యవంతులైన పిల్లలు ఎవరైతే ఉంటారో, వారి ముఖ్యమైన ధారణ ఏమిటి?

జవాబు:-
భాగ్యవంతులైన పిల్లలు ఉదయముదయమే లేచి తండ్రిని చాలా ప్రేమగా స్మృతి చేస్తారు. బాబాతో మధురాతి మధురమైన మాటలు మాట్లాడుతారు. వారు ఎప్పుడూ తమపై తాము నిర్దయ చూపించుకోరు. వారు పాస్ విత్ ఆనర్ గా అయ్యే పురుషార్థము చేసి స్వయాన్ని రాజ్యాధికారానికి యోగ్యులుగా తయారుచేసుకుంటారు.

ఓంశాంతి
పిల్లలు తండ్రి ఎదురుగా కూర్చున్నారు. వీరు మా అనంతమైన తండ్రి, వీరు మాకు అనంతమైన సుఖాన్ని ఇచ్చేందుకు శ్రీమతాన్ని ఇస్తున్నారు అని పిల్లలకు తెలుసు. వారిని దయార్ద్ర హృదయుడు, ముక్తిప్రదాత... అని అంటూ ఉంటారు. వారిని ఎంతగానో మహిమ చేస్తారు. తండ్రి అంటారు, కేవలం మహిమ విషయమని కాదు, వాస్తవానికి పిల్లలకు డైరెక్షన్లు ఇవ్వడమనేది తండ్రి బాధ్యత, అలా అనంతుడైన తండ్రి కూడా పిల్లలకు డైరెక్షన్లు ఇస్తారు. వారు ఉన్నతోన్నతుడైన తండ్రి కావున వారి మతము కూడా ఉన్నతోన్నతముగానే ఉంటుంది. మతము (డైరెక్షన్లు) తీసుకునేది ఆత్మయే. మంచి లేక చెడు పనులను ఆత్మయే చేస్తుంది. ఈ సమయములో ప్రపంచానికి రావణ మతము లభిస్తుంది. పిల్లలైన మీకు రాముని మతము లభిస్తుంది. రావణుని మతము ద్వారా నిర్దయ కలిగినవారిగా అయి తప్పుడు పనులు చేస్తారు. సరైన మంచి కార్యాలు చేయండి అని తండ్రి డైరెక్షన్లు ఇస్తారు. అన్నింటికన్నా మంచి కార్యము మీపై మీరు దయ చూపించుకోండి. మీకు తెలుసు, ఆత్మ అయిన మనం సతోప్రధానముగా ఉండేవారము, చాలా సుఖవంతముగా ఉండేవారము, మళ్ళీ రావణుని మతము లభించడముతో మేము తమోప్రధానముగా అయిపోయాము. ఇప్పుడు మళ్ళీ తండ్రి డైరెక్షన్లు ఇస్తున్నారు - ఒకటేమో, తండ్రి స్మృతిలో ఉండండి, ఇప్పుడు ఇక మీపై మీరు దయ చూపించుకోండి, ఈ డైరెక్షన్లు ఇస్తున్నారు. తండ్రి దయ చూపించరు, తండ్రి ఇలా-ఇలా చేయండి అని శ్రీమతాన్ని ఇస్తారు. మీపై మీరే దయ చూపించుకోండి. స్వయాన్ని ఆత్మగా భావించండి మరియు మీ పతిత-పావనుడైన తండ్రిని స్మృతి చేయండి, తద్వారా మీరు పావనముగా అయిపోతారు. మీరు పావనముగా ఎలా అవుతారు అని తండ్రి సలహానిస్తారు. తండ్రియే పతితులను పావనముగా తయారుచేసేవారు. వారు శ్రీమతాన్ని ఇస్తారు. ఒకవేళ వారి మతముపై నడవకపోతే మీపై మీరు నిర్దయ చూపించుకున్నట్లు. తండ్రి శ్రీమతాన్ని ఇస్తున్నారు - పిల్లలూ, సమయాన్ని వృధా చేయకండి. మీరు ఒక ఆత్మ అన్న పాఠాన్ని పక్కా చేసుకోండి. శరీర నిర్వహణార్థము వ్యాపారాలు మొదలైనవి చేయండి, కానీ సమయాన్ని కేటాయించి యుక్తిని రచించండి. పని చేస్తూ ఆత్మ బుద్ధి తండ్రి వైపు ఉండాలి. ఉదాహరణకు ప్రేయసీ, ప్రియులు కూడా తమ పనులు తాము చేసుకుంటారు కదా, అయినా ఇరువురూ ఒకరిపై ఒకరు ప్రేమను కలిగి ఉంటారు. కానీ ఇక్కడ అలా లేదు. మీరు భక్తి మార్గములో కూడా స్మృతి చేస్తారు. కొందరు - ఎలా స్మృతి చేయాలి, స్మృతి చేయడానికి ఆత్మ మరియు పరమాత్మల రూపము ఏమిటి అని అడుగుతారు. ఎందుకంటే, భక్తి మార్గములో పరమాత్మ నామ-రూపాలకు అతీతుడు అని గానం చేయబడుతుంది, కానీ వాస్తవానికి అలా కాదు. భృకుటి మధ్యలో ఆత్మ నక్షత్ర సమానముగా ఉంటుంది అని కూడా అంటారు, మరి అలాంటప్పుడు ఆత్మ ఏమిటి అని ఎందుకు అంటారు? ఆత్మను చూడలేరు, అది తెలుసుకునే విషయము. ఆత్మను తెలుసుకోవడం జరుగుతుంది, అలాగే పరమాత్మను కూడా తెలుసుకోవడం జరుగుతుంది. ఆత్మ అతి సూక్ష్మమైనది. ఆత్మ మిణుగురు పురుగు కన్నా సూక్ష్మముగా ఉంటుంది. అది శరీరము నుండి ఎలా వెళ్ళిపోతుంది అనేది తెలియను కూడా తెలియదు. ఆత్మ ఉంది అని సాక్షాత్కారమవుతుంది. ఆత్మ సాక్షాత్కారము జరిగినంత మాత్రాన ఏమవుతుంది. అది నక్షత్రము వలె సూక్ష్మమైనది. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. ఏ విధంగా ఆత్మ ఉందో అలాగే పరమాత్మ కూడా ఆత్మయే, కానీ పరమాత్మను సుప్రీమ్ సోల్ అని అంటారు. వారు జనన-మరణాలలోకి రారు. ఆత్మ జనన-మరణ రహితముగా ఉన్నప్పుడు ఆత్మను సుప్రీమ్ అని అంటారు. ఇకపోతే ముక్తిధామములోకి అయితే అందరూ పవిత్రముగా అయ్యే వెళ్ళాలి. అందులో కూడా హీరో, హీరోయిన్ పాత్రలు కలవారు నంబరువారుగా ఉన్నారు. ఆత్మలు నంబరువారుగా ఉన్నాయి కదా. నాటకములో కూడా కొందరు ఎక్కువ జీతము కలవారు, కొందరు తక్కువ జీతము కలవారు ఉంటారు. లక్ష్మీ-నారాయణుల ఆత్మలను మనుష్య ఆత్మలలో సుప్రీమ్ ఆత్మలు అని అంటారు. పవిత్రముగా అయితే అందరూ అవుతారు, కానీ నంబరువారుగా పాత్రలు ఉంటాయి. కొందరు మహారాజులుగా, కొందరు దాసీలుగా, కొందరు ప్రజలుగా ఉంటారు. మీరు పాత్రధారులు. ఇంతమంది దేవతలందరూ నంబరువారుగా ఉన్నారని మీకు తెలుసు. మంచి పురుషార్థము చేస్తే ఉన్నతమైన ఆత్మగా అవుతారు, ఉన్నత పదవిని పొందుతారు. మీరు 84 జన్మలను ఎలా తీసుకున్నారు అన్న స్మృతి మీకు కలిగింది. ఇప్పుడు తండ్రి వద్దకు వెళ్ళాలి. పిల్లలకు ఈ సంతోషము కూడా ఉంది, అలాగే నషా కూడా ఉంది. మేము నరుని నుండి నారాయణునిగా, విశ్వాధిపతిగా అవుతాము అని అందరూ అంటారు. మరి అటువంటి పురుషార్థము చేయాల్సి ఉంటుంది. పురుషార్థానుసారముగా, నంబరువారుగా పదవిని పొందుతారు. అందరికీ నంబరువారు పాత్ర లభించింది. ఈ డ్రామా తయారై, తయారుచేయబడినది.

ఇప్పుడు తండ్రి మీకు శ్రేష్ఠ మతాన్ని ఇస్తారు. ఎలాగైనా సరే తండ్రిని స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి, తద్వారా మీరు తమోప్రధానము నుండి సతోప్రధానముగా అవుతారు. పాపాల భారమైతే శిరస్సుపై ఎంతగానో ఉంది. దానిని ఎలాగైనా సరే ఇక్కడ అంతము చేయాలి, అప్పుడే ఆత్మ పవిత్రముగా అవుతుంది. తమోప్రధానముగా కూడా ఆత్మ అయిన మీరే అయ్యారు, కావున సతోప్రధానముగా కూడా ఆత్మ అయిన మీరే అవ్వాలి. ఈ సమయములో ఎక్కువగా భారత్ యే దివాలా అయ్యింది. ఈ ఆట కూడా భారత్ కు సంబంధించినదే. మిగిలినవారంతా కేవలం ధర్మ స్థాపన చేసేందుకే వస్తారు. పునర్జన్మలు తీసుకుంటూ, తీసుకుంటూ చివరిలో అందరూ తమోప్రధానముగా అవుతారు. స్వర్గాధిపతులుగా మీరే అవుతారు. భారత్ చాలా ఉన్నతమైన దేశముగా ఉండేదని మీకు తెలుసు. ఇప్పుడు ఎంత నిరుపేదగా ఉంది, పేదవారికే అందరూ సహాయము చేస్తారు. ప్రతి విషయములోనూ భిక్షము యాచిస్తూనే ఉంటారు. ఇంతకుముందైతే ఎంతో ధాన్యము ఇక్కడి నుండి వెళ్తూ ఉండేది. ఇప్పుడు నిరుపేదగా అయ్యారు కావున మళ్ళీ రిటర్న్ సర్వీస్ జరుగుతోంది. ఏదైతే తీసుకువెళ్ళారో అది ఇప్పుడు అప్పుగా లభిస్తోంది. శ్రీకృష్ణుడు మరియు క్రిస్టియన్, రాశి ఒక్కటే. క్రిస్టియన్లే భారత్ ను మింగేసారు, ఇప్పుడు మళ్ళీ డ్రామానుసారముగా వారు పరస్పరం కొట్లాడుకుంటారు, వెన్న పిల్లలైన మీకు లభిస్తుంది. శ్రీకృష్ణుడి నోటిలో వెన్న ఉండేది అని కాదు, ఈ విధంగా శాస్త్రాలలో వ్రాసారు. మొత్తం ప్రపంచమంతా శ్రీకృష్ణుని చేతిలోకి వస్తుంది. మొత్తం విశ్వానికి మీరు అధిపతులుగా అవుతారు. మనం విశ్వానికి అధిపతులుగా అవుతామని పిల్లలైన మీకు తెలుసు కావున మీకు ఎంత సంతోషము ఉండాలి. మీ అడుగడుగులోనూ పదమాలు ఉన్నాయి. కేవలం ఒక్క లక్ష్మీ-నారాయణుల రాజ్యమే ఉండేది కాదు, వంశావళి ఉండేది కదా. యథా రాజా రాణి తథా ప్రజా, అందరి అడుగులలో పదమాలు ఉంటాయి. అక్కడైతే లెక్కలేనంత ధనము ఉంటుంది. ధనము కొరకు ఎవరూ పాపాలు మొదలైనవి చేయరు, అపారమైన ధనము ఉంటుంది. అల్లా అవల్దీన్ ఆటను కూడా చూపిస్తారు కదా. అల్లా అనగా మొదటి ధర్మాన్ని స్థాపన చేసేవారు అనగా దేవీ-దేవతా ధర్మాన్ని స్థాపన చేసేవారు, వారు క్షణములో జీవన్ముక్తిని ఇస్తారు, క్షణములో సాక్షాత్కారము జరుగుతుంది, అపారమైన ఖజానాను చూపిస్తారు. మీరా సాక్షాత్కారములో శ్రీకృష్ణునితో కలిసి నాట్యము చేసేవారు. అది భక్తి మార్గము. ఇక్కడ భక్తి మార్గపు విషయము లేదు. మీరైతే వైకుంఠములోకి ప్రాక్టికల్ గా వెళ్ళి రాజ్యభాగ్యాన్ని పొందుతారు. భక్తి మార్గములో కేవలం సాక్షాత్కారము జరుగుతుంది. ఈ సమయములో పిల్లలైన మీకు లక్ష్యము-ఉద్దేశ్యము యొక్క సాక్షాత్కారము జరుగుతుంది. మనం ఆ విధంగా అవుతామని మీకు తెలుసు. పిల్లలు మర్చిపోతారు, అందుకే వారికి బ్యాడ్జీలు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనం అనంతమైన తండ్రికి పిల్లలుగా అయ్యాము, మరి ఎంతటి సంతోషము ఉండాలి. ఇది ఘడియ, ఘడియ పక్కా చేసుకోవాలి, కానీ మాయ అపోజిషన్ వైపు ఉంది కావున ఆ సంతోషము కూడా దూరమైపోతుంది. తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే - బాబా మమ్మల్ని విశ్వాధిపతులుగా తయారుచేస్తున్నారు అన్న నషా ఉంటుంది, మళ్ళీ మాయ మరపింపజేస్తుంది కావున ఏదో ఒక వికర్మ జరుగుతుంది. మనం 84 జన్మలు తీసుకున్నామని పిల్లలైన మీకు స్మృతి కలిగింది, ఇంకెవ్వరూ 84 జన్మలు తీసుకోరు. ఎంతగా మనం స్మృతి చేస్తామో అంతగా ఉన్నత పదవిని పొందుతామని కూడా అర్థం చేసుకోవాలి, అలాగే మీ సమానముగా కూడా తయారుచేయాలి, ప్రజలను తయారుచేసుకోవాలి. దానము ఇంటి నుండి ప్రారంభమవుతుంది. తీర్థయాత్రలకు కూడా మొదట స్వయం వెళ్తారు, ఆ తర్వాత మిత్ర-సంబంధీకులు మొదలైనవారిని కూడా తమతో పాటు తీసుకువెళ్తారు. కావున మీరు కూడా ప్రేమగా అందరికీ అర్థం చేయించండి. అందరూ అర్థం చేసుకోరు. ఒకే ఇంట్లో తండ్రి అర్థం చేసుకుంటే కొడుకు అర్థం చేసుకోడు. పాత ప్రపంచముపై మనసు పెట్టుకోకండి అని తల్లిదండ్రులు పిల్లలకు ఎంతగా చెప్పినా కానీ వారు వినరు, విసిగించేస్తారు. ఇక్కడికి సంబంధించిన అంటు ఎవరైతే ఉంటారో, వారే వచ్చి మళ్ళీ అర్థం చేసుకుంటారు. ఈ ధర్మ స్థాపన ఎలా జరుగుతుందో చూడండి. ఇతర ధర్మాలలో ఇలా అంటుకట్టడమనేది ఉండదు. వారు పై నుండి వస్తారు. వారి అనుచరులు కూడా పై నుండి వస్తూ ఉంటారు. ఇక్కడైతే స్థాపన చేస్తారు, ఆ తర్వాత అందరినీ పావనముగా తయారుచేసి తీసుకువెళ్తారు, అందుకే వారిని సద్గురువు, ముక్తిప్రదాత అని అంటారు. సత్యమైన గురువు ఒక్కరే. మనుష్యులు ఎప్పుడూ ఎవరి సద్గతినీ చేయరు. సద్గతిదాత ఒక్కరే, వారినే సద్గురువు అని అంటారు. భారత్ ను సత్యఖండముగా కూడా వారే తయారుచేస్తారు. రావణుడు అసత్యఖండముగా తయారుచేస్తాడు. తండ్రిని గురించి కూడా అసత్యము చెప్తారు, దేవతలను గురించి కూడా అసత్యము చెప్తారు. అందుకే తండ్రి అంటారు, చెడు వినకండి... దీనిని వేశ్యాలయము అని అంటారు. సత్యయుగము శివాలయము. మనుష్యులు ఇది అర్థం చేసుకోరు. వారు తమ మతమనుసారముగానే నడుచుకుంటారు. ఎంతగా గొడవలు, కొట్లాటలు జరుగుతూ ఉంటాయి. పిల్లలు తల్లిని, పతి స్త్రీని కొట్టేందుకు కూడా వెనుకాడరు. ఒకరినొకరు హతమార్చుకుంటూ ఉంటారు. తండ్రి వద్ద ఎంతో ధనము ఉంది కానీ అతను ఇవ్వడం లేదు అని కొడుకు గమనిస్తే హతమార్చేందుకు కూడా వెనుకాడడు. ఇది ఎంత అశుద్ధమైన ప్రపంచము. ఇప్పుడు మీరు ఏ విధముగా తయారవుతున్నారు. మీ లక్ష్యము, ఉద్దేశ్యము ఎదురుగా నిలబడి ఉంది. మీరు కేవలం - ఓ పతిత-పావనా, మీరు వచ్చి మమ్మల్ని పావనముగా తయారుచేయండి అని పిలిచేవారు, అంతేకానీ విశ్వాధిపతులుగా తయారుచేయండి అని అనేవారు కారు. గాడ్ ఫాదర్ అయితే స్వర్గాన్ని స్థాపన చేస్తారు, మరి మనం ఆ స్వర్గములో ఎందుకు లేము, ఎందుకంటే రావణుడు తర్వాత మిమ్మల్ని నరకవాసులుగా చేస్తాడు. కల్పము ఆయువు లక్షల సంవత్సరాలు అని అనడం వల్ల మర్చిపోయారు. తండ్రి అంటారు, మీరు స్వర్గాధిపతులుగా ఉండేవారు. ఇప్పుడు మళ్ళీ చక్రము చుట్టి నరకాధిపతులుగా అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ తండ్రి మిమ్మల్ని స్వర్గాధిపతులుగా తయారుచేస్తారు. వారు అంటారు, మధురమైన ఆత్మలూ, పిల్లలూ, తండ్రిని స్మృతి చేయండి, తద్వారా మీరు తమోప్రధానము నుండి సతోప్రధానముగా అవుతారు. తమోప్రధానముగా అవ్వడానికి అర్ధకల్పము పట్టింది, వాస్తవానికి మొత్తం కల్పము పట్టింది అని అనవచ్చు, ఎందుకంటే కళలైతే తగ్గిపోతూ ఉంటాయి. ఈ సమయములో ఎటువంటి కళలూ లేవు. నిర్గుణుడినైన నాలో ఏ గుణమూ లేదు అని అంటారు, దీని అర్థము ఎంత స్పష్టముగా ఉంది. అలాగే ఇక్కడ నిర్గుణ బాలకుల సంస్థ కూడా ఉంది. బాలకులలో ఏ గుణమూ లేదు లేదంటే బాలకులను మహాత్ములకన్నా కూడా ఉన్నతులు అని అంటారు, ఎందుకంటే వారికి వికారాలను గురించి కూడా తెలియదు. మహాత్ములకైతే వికారాలను గురించి తెలుసు. పదాలను కూడా తప్పుగా వాడుతున్నారు. మాయ పూర్తిగా అధర్మయుక్తముగా తయారుచేస్తుంది. గీతను కూడా చదువుతారు. భగవానువాచ, కామము మహాశత్రువు, ఇది ఆదిమధ్యాంతాలు దుఃఖాన్ని ఇస్తుంది అని అంటారు కూడా, అయినా కానీ పవిత్రముగా అవ్వడములో ఎన్ని విఘ్నాలను కలిగిస్తారు. కొడుకు వివాహము చేసుకోకపోతే ఎంతగా డిస్టర్బ్ అవుతారు. తండ్రి అంటారు, పిల్లలైన మీరు శ్రీమతముపై నడవాలి. ఎవరైతే పుష్పాలుగా అయ్యేది లేదో, వారికి మీరు ఎంతగా అర్థం చేయించినా వారు ఎప్పటికీ ఒప్పుకోరు. కొన్ని చోట్ల, మేము వివాహము చేసుకోము అని పిల్లలు అంటే తల్లిదండ్రులు ఎంతగా ఇబ్బంది పెడతారు.

తండ్రి అంటారు, నేను జ్ఞాన యజ్ఞాన్ని రచించినప్పుడు అనేక రకాల విఘ్నాలు వస్తాయి. మూడడుగుల నేలను కూడా ఇవ్వరు. మీరు కేవలం తండ్రి డైరెక్షన్ అనుసారముగా స్మృతి చేసి పవిత్రముగా అవుతారు, ఇంకే కష్టమూ లేదు. కేవలం స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. ఏ విధంగా ఆత్మలైన మీరు ఈ శరీరములో అవతరిస్తారో, అలాగే తండ్రి కూడా అవతరించారు. మరి కూర్మావతారము, మత్స్యావతారము ఎలా సాధ్యము. ఎంతగా నిందిస్తున్నారు! రాయి, రాయిలోనూ భగవంతుడు ఉన్నారు అని అంటారు. తండ్రి అంటారు, నన్ను మరియు దేవతలను గ్లాని చేస్తారు. నేను రావలసి ఉంటుంది, నేను వచ్చి పిల్లలైన మీకు మళ్ళీ వారసత్వాన్ని ఇస్తాను. నేను వారసత్వాన్ని ఇస్తాను, రావణుడు శాపము ఇస్తాడు. ఇది ఒక ఆట. ఎవరైతే శ్రీమతముపై నడవరో వారి భాగ్యము అంత ఉన్నతముగా లేదు అని అర్థం చేసుకోవడం జరుగుతుంది. భాగ్యవంతులు ఉదయముదయమే లేచి స్మృతి చేస్తారు, బాబాతో మాట్లాడుతారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి. సంతోషము యొక్క పాదరసము కూడా పైకెక్కుతుంది. ఎవరైతే పాస్ విత్ ఆనర్ గా అవుతారో, వారే రాజ్యాధికారానికి యోగ్యులుగా అవ్వగలరు. కేవలం ఒక్క లక్ష్మీ-నారాయణులే రాజ్యము చేయరు, వారి వంశము ఉంటుంది. ఇప్పుడు తండ్రి అంటున్నారు, మీరు ఎంత స్వచ్ఛబుద్ధి కలవారిగా అవుతున్నారు. దీనినే సత్సంగము అని అంటారు. సత్సంగము ఒక్కటే ఉంటుంది. తండ్రి సత్యాతి సత్యమైన జ్ఞానాన్ని ఇచ్చి సత్యఖండానికి అధిపతులుగా తయారుచేస్తారు. కల్పపు సంగమయుగములోనే సత్యమైన సాంగత్యము లభిస్తుంది. స్వర్గములో ఎటువంటి సత్సంగము ఉండదు.

ఇప్పుడు మీరు ఆత్మిక సాల్వేషన్ ఆర్మీ. మీరు విశ్వ నావను ఆవలి తీరానికి చేరుస్తారు. మిమ్మల్ని విముక్తులను చేసేవారు, మీకు శ్రీమతాన్ని ఇచ్చేవారు తండ్రియే. మీ మహిమ చాలా భారీ మహిమ. తండ్రి మహిమ, భారత్ మహిమ అపారమైనది. అలాగే పిల్లలైన మీ మహిమ కూడా అపారమైనది. మీరు బ్రహ్మాండానికి మరియు విశ్వానికి కూడా అధిపతులుగా అవుతారు. నేనైతే కేవలం బ్రహ్మాండానికే అధిపతిని. పూజ కూడా మీకు డబుల్ జరుగుతుంది. డబుల్ పూజ జరిగేందుకు నేను దేవతగా అవ్వను. మీలో కూడా నంబరువారుగా అర్థం చేసుకుంటారు మరియు సంతోషము చెంది పురుషార్థము చేస్తారు. చదువులో ఎంత తేడా ఉంది. సత్యయుగములో లక్ష్మీ-నారాయణుల రాజ్యము కొనసాగుతుంది, అక్కడ మంత్రులు ఉండరు. ఏ లక్ష్మీ-నారాయణులనైతే భగవతి, భగవానులు అని అంటారో, వారు మంత్రుల సలహా తీసుకుంటారా! ఎప్పుడైతే పతిత రాజులుగా అవుతారో అప్పుడు మళ్ళీ మంత్రులు మొదలైనవారిని నియమించుకుంటారు. ఇప్పుడు ఇది ప్రజలపై ప్రజల రాజ్యము. పిల్లలైన మీకు ఈ పాత ప్రపంచము పట్ల వైరాగ్యము ఉంది. జ్ఞానము, భక్తి, వైరాగ్యము - జ్ఞానాన్ని కేవలం ఆత్మిక తండ్రి మాత్రమే నేర్పిస్తారు, దీనిని ఇంకెవ్వరూ నేర్పించలేరు. ఒక్క తండ్రియే పతిత-పావనుడు, సర్వుల సద్గతిదాత. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. తండ్రి స్మృతితో పాటు తమ సమానంగా తయారుచేసే సేవను కూడా చేయాలి. దానము ఇంటి నుండే ప్రారంభమవుతుంది... అందరికీ ప్రేమగా అర్థం చేయించాలి.

2. ఈ పాత ప్రపంచము పట్ల అనంతమైన వైరాగులుగా అవ్వాలి. చెడు వినకండి, చెడు చూడకండి... మనం ఆ అనంతమైన తండ్రికి పిల్లలము, వారు మనకు అపారమైన ఖజానాను ఇస్తారు అన్న ఈ సంతోషములోనే ఉండాలి.

వరదానము:-
ప్రతి సంకల్పము, మాట మరియు కర్మను ఫలదాయకముగా చేసుకునే ఆత్మిక ప్రభావశాలి భవ

ఎప్పుడు ఎవరి సంపర్కములోకి వచ్చినా సరే, వారి పట్ల మనసులోని భావన అనేది స్నేహము, సహయోగము మరియు కళ్యాణముతో కూడినదిగా ఉండాలి, ప్రభావశాలిగా ఉండాలి. ప్రతి మాట ఎవరికైనా ధైర్యాన్ని, ఉల్లాసాన్ని కలిగించే విధంగా ప్రభావశాలిగా ఉండాలి. సాధారణ సంభాషణలో సమయము పోకూడదు. అలాగే ప్రతి కర్మ కూడా ఫలదాయకముగా ఉండాలి, స్వయం కోసమైనా లేక ఇతరుల కోసమైనా ప్రతి కర్మ ఫలదాయకముగా ఉండాలి. పరస్పరం కూడా ప్రతి రూపములో ప్రభావశాలిగా అవ్వండి, సేవలో ఆత్మిక ప్రభావశాలిగా అవ్వండి, అప్పుడు తండ్రిని ప్రత్యక్షము చేసేందుకు నిమిత్తులుగా అవ్వగలరు.

స్లోగన్:-
ఎటువంటి శుభచింతక మణులుగా అవ్వండి అంటే మీ కిరణాలు విశ్వాన్ని ప్రకాశితము చేస్తూ ఉండాలి.

అవ్యక్త సూచనలు - సంకల్పాల శక్తిని జమ చేసుకుని శ్రేష్ఠమైన సేవకు నిమిత్తులుగా అవ్వండి

సమయమనుసారముగా శీతలతా శక్తి ద్వారా ప్రతి పరిస్థితిలో తమ సంకల్పాల వేగాన్ని మరియు మాటలను శీతలముగా మరియు ఓర్పు కలవిగా చేసుకోండి. ఒకవేళ సంకల్పాల వేగము ఎక్కువగా ఉన్నట్లయితే చాలా సమయము వ్యర్థమైపోతుంది, కంట్రోల్ చేయలేకపోతారు, అందుకే శీతలతా శక్తిని ధారణ చేసినట్లయితే వ్యర్థము నుండి రక్షింపబడతారు. ఎందుకు, ఏమిటి, ఇలా కాదు అలా అన్న ఈ వ్యర్థము యొక్క తీవ్రవేగము నుండి విముక్తులవుతారు.