18-12-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - అనంతమైన బాబా పిల్లలైన మిమ్మల్ని జ్ఞానముతో అలంకరించడానికి వచ్చారు, ఉన్నత పదవిని పొందాలంటే సదా అలంకరించబడి ఉండండి’’

ప్రశ్న:-
ఏ పిల్లలను చూసి అనంతమైన తండ్రి చాలా సంతోషిస్తారు?

జవాబు:-
ఏ పిల్లలైతే సేవ కోసం ఎవర్రెడీగా ఉంటారో, అలౌకిక మరియు పారలౌకిక తండ్రులిద్దరినీ పూర్తిగా ఫాలో చేస్తారో, జ్ఞాన-యోగాలతో ఆత్మను అలంకరించుకుంటారో, పతితులను పావనముగా తయారుచేసే సేవను చేస్తారో, ఇటువంటి పిల్లలను చూసి అనంతమైన తండ్రికి చాలా సంతోషము కలుగుతుంది. తండ్రి కోరిక ఏమిటంటే - నా పిల్లలు కృషి చేసి ఉన్నత పదవిని పొందాలి.

ఓంశాంతి
ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు చెప్తున్నారు - మధురాతి-మధురమైన పిల్లలూ, ఏ విధముగా లౌకిక తండ్రికి పిల్లలు ప్రియమనిపిస్తారో, అదే విధముగా అనంతమైన తండ్రికి కూడా అనంతమైన పిల్లలు ప్రియమనిపిస్తారు. తండ్రి పిల్లలకు శిక్షణను ఇస్తారు మరియు పిల్లలు ఉన్నత పదవిని పొందాలని సావధానపరుస్తారు. ఒక తండ్రికి ఇదే కోరిక ఉంటుంది. అదే విధముగా అనంతమైన తండ్రికి కూడా ఇదే కోరిక ఉంటుంది. పిల్లలను జ్ఞానము మరియు యోగము అనే ఆభరణాలతో అలంకరిస్తారు. పిల్లలు ఉన్నత పదవిని పొందాలని ఇద్దరు తండ్రులు మిమ్మల్ని చాలా మంచి రీతిగా అలంకరిస్తారు. అలౌకిక తండ్రి కూడా సంతోషిస్తారు మరియు పారలౌకిక తండ్రి కూడా సంతోషిస్తారు. ఎవరైతే మంచి రీతిలో పురుషార్థము చేస్తారో, వారిని చూసి - వీరు ఫాలో ఫాదర్ చేస్తున్నారు అని అంటూ ఉంటారు కూడా. ఇద్దరినీ ఫాలో చేయాలి. ఒకరు ఆత్మిక తండ్రి, రెండవవారు ఈ అలౌకిక తండ్రి. కావున పురుషార్థము చేసి ఉన్నత పదవిని పొందాలి.

మీరు భట్టీలో ఉన్నప్పుడు అందరికీ కిరీటాల సహితముగా ఫొటోలు తీయడము జరిగింది. తండ్రి అర్థం చేయించారు - ప్రకాశ కిరీటమనేది ఏదీ ఉండదు, అది పవిత్రతకు ఒక గుర్తు, దానిని అందరికీ ఉన్నట్లుగా చూపిస్తారు. అంతేకానీ తెల్లని ప్రకాశ కిరీటమేదో ఉంటుందని కాదు. దీనిని పవిత్రతకు గుర్తుగా అర్థం చేయించడము జరుగుతుంది. మొట్టమొదట మీరు సత్యయుగములో ఉంటారు. మీరే ఉండేవారు కదా. ఆత్మ మరియు పరమాత్మ చాలాకాలము వేరుగా ఉన్నారు అని తండ్రి కూడా అంటారు. పిల్లలైన మీరే మొట్టమొదట వస్తారు, మళ్ళీ మీరే ముందు వెళ్ళాలి. ముక్తిధామము యొక్క గేట్లను కూడా మీరే తెరవాలి. పిల్లలైన మిమ్మల్ని తండ్రి అలంకరిస్తారు. పుట్టినింటిలో వనవాహములో ఉంటారు. ఈ సమయములో మీరు కూడా సాధారణముగా ఉండాలి. గొప్పగానూ ఉండకూడదు, తక్కువగానూ ఉండకూడదు. తండ్రి కూడా అంటారు, నేను సాధారణ తనువులో ప్రవేశిస్తాను. ఏ దేహధారినీ భగవంతుడని అనలేము. మనుష్యులు, మనుష్యులకు సద్గతి ఇవ్వలేరు. సద్గతిని అయితే గురువే ఇస్తారు. మనుష్యులు 60 సంవత్సరాల తర్వాత వానప్రస్థాన్ని చేపడతారు, అప్పుడు గురువును ఆశ్రయిస్తారు. ఆ ఆచారము కూడా ఇప్పటిదే, ఇదే మళ్ళీ భక్తి మార్గములో నడుస్తుంది. ఈ రోజుల్లోనైతే చిన్న పిల్లల చేత కూడా గురువులను ఆశ్రయించేలా చేస్తుంటారు. వారిది వానప్రస్థ అవస్థ కాకపోయినా కానీ మృత్యువు అకస్మాత్తుగా వచ్చేస్తుంది కదా, అందుకే పిల్లల చేత కూడా గురువులను ఆశ్రయించేలా చేస్తారు. తండ్రి అంటారు, మీరందరూ ఆత్మలు, మీకు వారసత్వాన్ని పొందే హక్కు ఉంది. వారేమంటారంటే - గురువు లేకపోతే పదవిని పొందలేరు అంటే బ్రహ్మములో లీనము అవ్వలేరు అని. మీరైతే లీనమయ్యేది లేదు. అవి భక్తి మార్గములోని మాటలు. ఆత్మ అయితే నక్షత్రము వంటిది, అది ఒక బిందువు. తండ్రి కూడా ఒక బిందువే. ఆ బిందువునే జ్ఞానసాగరుడని అంటారు. మీరు కూడా చిన్నని ఆత్మలు. ఆత్మలోనే జ్ఞానమంతా నింపడము జరుగుతుంది. మీరు పూర్తి జ్ఞానాన్ని తీసుకుంటారు. పాస్ విత్ ఆనర్ గా అవుతారు కదా. శివలింగము ఏమీ పెద్దదిగా ఉంటుందని కాదు. ఆత్మ ఎంత పెద్దదిగా ఉంటుందో, పరమ ఆత్మ అంతే పెద్దగా ఉంటారు. ఆత్మ పాత్రను అభినయించేందుకు పరంధామము నుండి వస్తుంది. తండ్రి అంటారు, నేను కూడా అక్కడి నుండే వస్తాను. కానీ నాకు నాదంటూ శరీరము లేదు. నేను రూప్ ను కూడా, బసంత్ ను కూడా. పరమ ఆత్మ రూప్, వారిలో మొత్తము జ్ఞానమంతా నిండి ఉంది. వారు జ్ఞాన వర్షాన్ని కురిపిస్తారు, అప్పుడు మనుష్యులందరూ పాపాత్ముల నుండి పుణ్యాత్ములుగా అవుతారు. తండ్రి గతి, సద్గతి రెండింటినీ ఇస్తారు. మీరు సద్గతిలోకి వెళ్తారు, మిగిలినవారంతా గతిలోకి అనగా తమ ఇంటికి వెళ్తారు. అది స్వీట్ హోమ్. ఆత్మయే ఈ చెవుల ద్వారా వింటుంది. ఇప్పుడు తండ్రి అంటారు, మధురాతి మధురమైన చాలా కాలం తర్వాత కలిసిన పిల్లలూ, తిరిగి వెళ్ళాలి, దాని కోసం పవిత్రముగా తప్పకుండా అవ్వాలి. పవిత్రముగా అవ్వకుండా ఎవ్వరూ తిరిగి వెళ్ళలేరు. నేను అందరినీ తీసుకువెళ్ళడానికి వచ్చాను. ఆత్మలను శివుని ఊరేగింపు అని అంటారు. ఇప్పుడు శివబాబా శివాలయాన్ని స్థాపన చేస్తున్నారు. మళ్ళీ రావణుడు వచ్చి వేశ్యాలయాన్ని స్థాపన చేస్తాడు. వామ మార్గాన్ని వేశ్యాలయమని అంటారు. వివాహము చేసుకుని కూడా పవిత్రముగా ఉండే పిల్లలు బాబా వద్ద చాలామంది ఉన్నారు. సన్యాసులు ఏమంటారంటే, ఇద్దరూ ఈ విధముగా కలిసి ఉండటము అనేది సాధ్యము కాదు అని. కానీ ఇందులో చాలా సంపాదన ఉందని ఇక్కడ అర్థం చేయించడము జరుగుతుంది. పవిత్రముగా ఉన్నట్లయితే 21 జన్మల కొరకు రాజధాని లభిస్తుంది, కావున ఒక్క జన్మ పవిత్రముగా ఉండటమనేది పెద్ద విషయమేమీ కాదు. తండ్రి అంటారు, మీరు కామ చితిపై కూర్చుని పూర్తిగా నల్లగా అయిపోయారు. శ్రీకృష్ణుని కోసం కూడా సుందరమైనవారు మరియు నల్లనివారు, శ్యామసుందరుడని అంటారు. ఈ వివరణ ఈ సమయానికి చెందినదే. కామ చితిపై కూర్చోవడముతో నల్లగా అయిపోయారు, అంతేకాక వారిని పల్లెటూరి పిల్లవాడు అని కూడా అంటారు. నిజముగా అలాగే ఉండేవారు కదా. శ్రీకృష్ణుడు అయితే అలా ఉండరు. వీరి అనేక జన్మల అంతిమములోనే తండ్రి ప్రవేశించి సుందరముగా తయారుచేస్తారు. ఇప్పుడు మీరు ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి. బాబా, మీరు ఎంత మధురమైనవారు, ఎంత మధురమైన వారసత్వాన్ని మీరు ఇస్తారు, మమ్మల్ని మనుష్యుల నుండి దేవతలుగా, మందిరయోగ్యులుగా తయారుచేస్తారు. ఈ విధముగా మీతో మీరు మాట్లాడుకోవాలి. నోటితో ఏమీ అనకూడదు. భక్తి మార్గములో మీరు ప్రియుడిని ఎంతగా స్మృతి చేస్తూ వచ్చారు. ఇప్పుడు మీరు వచ్చి వారిని కలుసుకున్నారు. బాబా, మీరైతే అందరికన్నా మధురమైనవారు, మిమ్మల్ని మేము ఎందుకు స్మృతి చేయము, మిమ్మల్ని ప్రేమసాగరుడు, శాంతిసాగరుడు అని అంటారు, మీరే వారసత్వాన్ని ఇస్తారు, అంతేకానీ ప్రేరణ ద్వారా ఏమీ లభించదు. తండ్రి అయితే సమ్ముఖములోకి వచ్చి పిల్లలైన మిమ్మల్ని చదివిస్తారు. ఇది పాఠశాల కదా. తండ్రి అంటారు, నేను మిమ్మల్ని రాజులకే రాజుగా తయారుచేస్తాను. ఇది రాజయోగము. ఇప్పుడు మీరు మూలవతనము, సూక్ష్మవతనము, స్థూలవతనము గురించి తెలుసుకున్నారు. ఇంత చిన్న ఆత్మ పాత్రనెలా అభినయిస్తుంది. వాస్తవానికి ఇది తయారై, తయారుచేయబడిన డ్రామా. దీనిని అనాది, అవినాశీ వరల్డ్ డ్రామా అని అంటారు. డ్రామా తిరుగుతూనే ఉంటుంది, ఇందులో సంశయము యొక్క విషయమేమీ లేదు. తండ్రి సృష్టి ఆదిమధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయిస్తున్నారు, మీరు స్వదర్శన చక్రధారులు. మీ బుద్ధిలో చక్రమంతా తిరుగుతూ ఉంటుంది, తద్వారా మీ పాపాలు నశిస్తాయి. అంతేకానీ శ్రీకృష్ణుడు స్వదర్శన చక్రాన్ని ఉపయోగించి హింస ఏమీ చేయలేదు. అక్కడైతే యుద్ధము యొక్క హింస ఉండదు, అలాగే కామ ఖడ్గాన్ని ఉపయోగించే హింస ఉండదు. డబల్ అహింసకులుగా ఉంటారు. ఈ సమయములో మీకు పంచ వికారాలతో యుద్ధము నడుస్తుంది. అంతేకానీ ఇంకే యుద్ధము యొక్క విషయము లేదు. ఇప్పుడు తండ్రి ఉన్నతోన్నతమైనవారు, ఆ తర్వాత ఉన్నతోన్నతమైన వారసత్వము ఈ లక్ష్మీ-నారాయణులది, వీరి వలె ఉన్నతముగా తయారవ్వాలి. ఎంతగా మీరు పురుషార్థము చేస్తారో, అంతగా ఉన్నత పదవిని పొందుతారు. కల్ప-కల్పము మీకు ఈ చదువే ఉంటుంది. ఇప్పుడు మంచి పురుషార్థము చేస్తే, అది కల్ప-కల్పము చేస్తూ ఉంటారు. ఆత్మిక చదువు ద్వారా ఎంతైతే ఉన్నతమైన పదవి లభిస్తుందో, దైహిక చదువు ద్వారా అంత లభించదు. ఉన్నతోన్నతమైనవారిగా ఈ లక్ష్మీ-నారాయణులు అవుతారు. వాస్తవానికి వీరు కూడా మనుష్యులే కానీ వీరు దైవీ గుణాలను ధారణ చేస్తారు కావున వీరిని దేవతలు అని అంటారు. అంతేకానీ 8-10 భుజాల వారంటూ ఎవ్వరూ ఉండరు. భక్తిలో సాక్షాత్కారము కలిగితే చాలా ఏడుస్తారు, దుఃఖములోకి వచ్చి చాలా కన్నీరు కారుస్తారు. ఇక్కడైతే తండ్రి అంటారు, కన్నీరు వస్తే ఫెయిల్. తల్లి మరణించినా హల్వా తినండి... ఈ రోజుల్లోనైతే బొంబాయిలో కూడా ఎవరికైనా అనారోగ్యము చేస్తే లేక ఎవరైనా మరణిస్తే, వారు - శాంతినివ్వమని బి.కె.లను పిలుస్తారు. అప్పుడు మీరు ఈ విధముగా అర్థం చేయిస్తారు - ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంది, ఇందులో మీదేమి పోతుంది, ఏడవడము వలన లాభమేముంది. వీరిని మృత్యువు కబళించిందని అంటారు. అటువంటిదేమీ ఉండదు. ఆత్మ తనంతట తానే ఒక శరీరాన్ని వదిలి వెళ్ళిపోతుంది. తన సమయానికి శరీరాన్ని వదిలి పారిపోతుంది. అంతేకానీ మృత్యువు అనే వస్తువేదీ ఉండదు. సత్యయుగములో గర్భము మహల్ వలె ఉంటుంది, అందులో శిక్షలు అనేవేమీ ఉండవు. అక్కడ మీ కర్మలు అకర్మలుగా అవుతాయి. వికర్మలు జరిగేందుకు అసలు మాయే ఉండదు. మీరు వికర్మాజీతులుగా అవుతారు. మొట్టమొదట వికర్మాజీత్ కాలము నడుస్తుంది, ఆ తర్వాత భక్తి మార్గము ప్రారంభమైనప్పుడు రాజా విక్రముని కాలము మొదలవుతుంది. ఈ సమయములో ఏ వికర్మలనైతే చేసారో, వాటిపై విజయము పొందుతారు, వికర్మాజీత్ అన్న పేరు పెట్టడము జరుగుతుంది. మళ్ళీ ద్వాపరములో విక్రమ రాజుగా అవుతారు, వికర్మలు చేస్తూ ఉంటారు. సూదిపై ఒకవేళ తుప్పు పట్టి ఉంటే అయస్కాంతము ఆకర్షించదు. ఎంతగా పాపాల తుప్పు తొలగిపోతూ ఉంటుందో, అంతగా అయస్కాంతము ఆకర్షిస్తుంది. తండ్రి అయితే పూర్తిగా పవిత్రమైనవారు. మిమ్మల్ని కూడా యోగబలము ద్వారా పవిత్రముగా తయారుచేస్తారు. ఏ విధముగా లౌకిక తండ్రి కూడా పిల్లలను చూసి సంతోషిస్తారు కదా, అదే విధముగా అనంతమైన తండ్రి కూడా పిల్లల సేవ చూసి సంతోషిస్తారు. పిల్లలు చాలా కష్టపడుతున్నారు కూడా. సేవ కోసమైతే సదా ఎవర్రెడీగా ఉండాలి. పిల్లలైన మీరు పతితులను పావనముగా చేసే ఈశ్వరీయ మిషన్. ఇప్పుడు మీరు ఈశ్వరీయ సంతానము, అనంతమైన తండ్రి ఉన్నారు మరియు మీరంతా సోదరీ-సోదరులు. అంతే, ఇంకే సంబంధమూ లేదు. ముక్తిధామములో తండ్రి మరియు ఆత్మా సోదరులైన మీరు ఉంటారు, ఆ తర్వాత మీరు సత్యయుగములోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక కొడుకు, ఒక కూతురు ఉంటారు, అంతే. ఇక్కడైతే చాలా సంబంధాలు ఉంటాయి - చిన్నాన్న, పెదనాన్న, మామయ్య మొదలైనవి.

మూలవతనము అంటేనే స్వీట్ హోమ్, ముక్తిధామము. దాని కోసం మనుష్యులు ఎన్ని యజ్ఞ-తపాదులు మొదలైనవి చేస్తారు కానీ తిరిగి ఎవ్వరూ వెళ్ళలేరు. వ్యర్థమైన మాటలు చాలా చెప్తూ ఉంటారు. సర్వుల సద్గతిదాత అయితే ఒక్కరే. ఇతరులెవ్వరూ కాదు. ఇప్పుడు మీరు సంగమయుగములో ఉన్నారు. ఇక్కడైతే అనేకమంది మనుష్యులు ఉన్నారు. సత్యయుగములోనైతే చాలా కొద్దిమందే ఉంటారు. స్థాపన, ఆ తర్వాత వినాశనము జరుగుతుంది. ఇప్పుడు అనేక ధర్మాలు ఉన్న కారణముగా ఎన్ని గొడవలు ఉన్నాయి. మీరు 100 శాతము సంపన్నముగా ఉండేవారు. మళ్ళీ 84 జన్మల తర్వాత 100 శాతము దివాలా తీసేసారు. ఇప్పుడు తండ్రి వచ్చి అందరినీ మేలుకొలుపుతారు. ఇప్పుడు ఇక మేలుకోండి, సత్యయుగము వస్తోంది. సత్యమైన తండ్రే మీకు 21 జన్మల వారసత్వాన్ని ఇస్తారు. భారత్ యే సత్య ఖండముగా అవుతుంది. తండ్రి సత్యఖండముగా తయారుచేస్తారు, మరి మళ్ళీ అసత్య ఖండముగా ఎవరు తయారుచేస్తారు? పంచ వికారాల రూపీ రావణుడు. రావణుడిది ఎంత పెద్ద దిష్టి బొమ్మను తయారుచేస్తారు, ఆ తర్వాత దానిని కాల్చేస్తారు ఎందుకంటే అతడు నంబరువన్ శత్రువు. మనుష్యులకు రావణ రాజ్యము ఎప్పటినుండి ప్రారంభమయ్యింది అనేది తెలియదు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - అర్ధకల్పము రామ రాజ్యము, అర్ధకల్పము రావణ రాజ్యము. అంతేకానీ హతమార్చేందుకు రావణుడు ఏమీ మనిషి కాదు. ఈ సమయములో మొత్తం ప్రపంచముపై రావణ రాజ్యము ఉంది, తండ్రి వచ్చి రామ రాజ్యాన్ని స్థాపన చేస్తారు, ఆ తర్వాత జయజయకారాలు జరుగుతాయి. అక్కడ సదా సంతోషము ఉంటుంది. అది ఉన్నదే సుఖధామము. దీనిని పురుషోత్తమ సంగమయుగమని అంటారు. తండ్రి అంటారు, ఈ పురుషార్థముతో మీరు ఈ విధముగా తయారవ్వబోతున్నారు. మీ చిత్రాలను కూడా తయారుచేసారు, చాలామంది వచ్చారు, ఆ తర్వాత విన్నారు, వినిపించారు, మళ్ళీ పారిపోయారు. తండ్రి వచ్చి పిల్లలైన మీకు చాలా ప్రేమగా అర్థం చేయిస్తారు. తండ్రి, టీచర్ ప్రేమిస్తారు, గురువు కూడా ప్రేమిస్తారు. సద్గురువును నిందింపజేసేవారు ఉన్నత పదవిని పొందలేరు. మీ లక్ష్యము-ఉద్దేశ్యము ఎదురుగా నిలబడి ఉంది. ఆ గురువుల వద్ద లక్ష్యము-ఉద్దేశ్యము ఏమీ ఉండదు. అదేమీ చదువు కాదు, ఇది చదువు. దీనిని యూనివర్శిటీ మరియు హాస్పిటల్ అని అంటారు, దీని ద్వారా మీరు ఎవర్ హెల్దీగా, వెల్దీగా (సదా ఆరోగ్యవంతులుగా, ఐశ్వర్యవంతులుగా) అవుతారు. ఇక్కడ ఉన్నదే అసత్యము. మాయ అసత్యమైనది, శరీరము అసత్యమైనది, ఈ ప్రపంచమే అసత్యమైనది... అని పాడుతారు కూడా. సత్యయుగము సత్యఖండము. అక్కడైతే వజ్ర-వైఢూర్యాల మహళ్ళు ఉంటాయి. సోమనాథ మందిరాన్ని కూడా భక్తి మార్గములో తయారుచేసారు. ఎంత ధనముండేది, దానిని ముసల్మానులు వచ్చి దోచుకున్నారు. పెద్ద-పెద్ద మసీదులను నిర్మించుకున్నారు. తండ్రి మీకు అపారమైన ఖజానాలను ఇస్తారు. ప్రారంభము నుండే మీకు అన్ని సాక్షాత్కారాలు కలిగిస్తూ వచ్చారు. అల్లాహ్ అవల్దీన్ బాబాయే కదా. బాబా మొట్టమొదటి ధర్మాన్ని స్థాపన చేస్తారు. అది దైవీ ధర్మము. ఏ ధర్మమైతే లేదో, అది మళ్ళీ స్థాపనవుతుంది. ప్రాచీన సత్యయుగములో వీరి రాజ్యమే ఉండేదని, వీరిపై ఇంకెవ్వరూ ఉండేవారు కాదని అందరికీ తెలుసు. దైవీ రాజ్యాన్నే ప్యారడైజ్ అని అంటారు. ఇప్పుడు మీకు తెలుసు, ఆ తర్వాత ఇతరులకు తెలియజేయాలి. మాకు తెలియదు అని తర్వాత ఎవ్వరూ ఈ విధముగా ఫిర్యాదు చేయకుండా ఉండేలా అందరికీ ఎలా తెలుస్తుంది. మీరు అందరికీ చెప్తారు, అయినా కానీ తండ్రిని వదిలి వెళ్ళిపోతారు. ఈ చరిత్ర తప్పకుండా రిపీట్ అవుతుంది. బాబా వద్దకు వచ్చినప్పుడు బాబా అడుగుతారు - ఇంతకుముందు ఎప్పుడైనా కలిసారా? అవును బాబా, 5 వేల సంవత్సరాల క్రితము మేము కలవడానికి వచ్చాము, అనంతమైన వారసత్వాన్ని తీసుకోవడానికి వచ్చాము అని అంటారు. కొంతమంది వచ్చి వింటారు, కొంతమందికి బ్రహ్మా యొక్క సాక్షాత్కారమవుతుంది, అప్పుడు అదంతా గుర్తుకొస్తుంది. అప్పుడు వారు ఏమంటారంటే - మేమైతే ఈ రూపాన్నే చూసాము. తండ్రి కూడా పిల్లలను చూసి సంతోషిస్తారు. మీ జోలె అవినాశీ జ్ఞాన రత్నాలతో నిండుతుంది కదా. ఇది చదువు. 7 రోజుల కోర్స్ తీసుకుని ఆ తర్వాత ఎక్కడ ఉన్నా కూడా మురళీ ఆధారముతో నడుచుకోవచ్చు. 7 రోజులలో ఎంత జ్ఞానాన్ని అర్థం చేయిస్తారంటే, ఇక దాని వలన మురళీని అర్థం చేసుకోగలుగుతారు. తండ్రి అయితే పిల్లలకు అన్ని రహస్యాలను మంచి రీతిలో అర్థం చేయిస్తూ ఉంటారు. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ పాపాలను భస్మము చేసుకోవాలి, ఆత్మిక చదువు ద్వారా మీ పదవిని శ్రేష్ఠముగా తయారుచేసుకోవాలి. ఎటువంటి పరిస్థితిలోనూ కన్నీరు కార్చకూడదు.

2. ఇది వానప్రస్థ అవస్థలో ఉండే సమయము, అందుకే వనవాహములో ఉంటూ చాలా సాధారణముగా ఉండాలి. చాలా గొప్పగానూ ఉండకూడదు, చాలా తక్కువగానూ ఉండకూడదు. తిరిగి వెళ్ళేందుకు ఆత్మను సంపూర్ణ పావనముగా తయారుచేసుకోవాలి.

వరదానము:-
సదా మౌల్డ్ అయ్యే (మలుచుకునే) విశేషత ద్వారా సంపర్కములో మరియు సేవలో సఫలురుగా అయ్యే సఫలతామూర్త భవ

ఏ పిల్లలలోనైతే స్వయాన్ని మలుచుకునే విశేషత ఉంటుందో, వారు సహజముగానే స్వర్ణయుగపు స్థితి వరకు చేరుకోగలుగుతారు. ఎటువంటి సమయమో, ఎటువంటి పరిస్థితో, దాని అనుసారముగా తమ ధారణలను ప్రత్యక్షము చేసుకునేందుకు స్వయాన్ని మలుచుకోవలసి ఉంటుంది. అలా మలుచుకోగలిగినవారే రియల్ గోల్డ్ వంటివారు. ఏ విధముగా సాకార బాబాలో ఈ విశేషతను చూసారు - ఎటువంటి సమయమో, ఎటువంటి వ్యక్తియో, దానిని బట్టి అటువంటి రూపాన్ని ధరించేవారు - ఈ విధముగా ఫాలో ఫాదర్ చేసినట్లయితే సేవ మరియు సంపర్కము, అన్నింటిలోనూ సహజముగానే సఫలతామూర్తులుగా అవుతారు.

స్లోగన్:-
ఎక్కడైతే సర్వ శక్తులు ఉంటాయో, అక్కడ నిర్విఘ్న సఫలత తోడుగా ఉంటుంది.

అవ్యక్త ప్రేరణలు - ఇప్పుడు సంపన్నముగా మరియు కర్మాతీతముగా అవ్వాలి అనే ధ్యాసలోనే ఉండండి

ఏ విధముగా సాకారములో వచ్చి వెళ్ళే ప్రాక్టీస్ సహజమైపోయిందో, అదే విధముగా ఆత్మకు తన కర్మాతీత స్థితిలో ఉండే ప్రాక్టీస్ కూడా ఉండాలి. ఇప్పుడిప్పుడే కర్మయోగిగా అయ్యి కర్మలోకి రండి, కర్మ సమాప్తమయ్యాక తిరిగి కర్మాతీత అవస్థలో ఉండండి, ఈ అనుభవము సహజమవుతూ ఉండాలి. కర్మాతీత అవస్థలో ఉండాలి అనే లక్ష్యము సదా ఉండాలి, నిమిత్తమాత్రముగా కర్మ చేయడానికి కర్మయోగిగా అవ్వండి, మళ్ళీ కర్మాతీతముగా అవ్వండి.