19-05-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - శ్రీమతమే మిమ్మల్ని శ్రేష్ఠముగా తయారుచేస్తుంది, అందుకే శ్రీమతాన్ని మర్చిపోకండి, మీ మతాన్ని వదిలి ఒక్క తండ్రి మతముపై నడవండి’’

ప్రశ్న:-
పుణ్యాత్మగా అయ్యేందుకు యుక్తి ఏమిటి?

జవాబు:-
పుణ్యాత్మగా అవ్వాలంటే సత్యమైన హృదయముతో ప్రేమగా ఒక్క తండ్రిని స్మృతి చేయండి. 2. కర్మేంద్రియాలతో ఎటువంటి వికర్మలు చేయకండి. అందరికీ మార్గము చూపించండి. ఈ పుణ్యము నేను ఎంత చేస్తున్నాను అని మీ హృదయాన్ని ప్రశ్నించుకోండి. వంద రెట్లు శిక్ష అనుభవించవలసి వచ్చేటువంటి కర్మలేవీ జరగలేదు కదా అని స్వయాన్ని చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నట్లయితే పుణ్యాత్మగా అవుతారు.

ఓంశాంతి
ఆత్మిక తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు, ఇప్పుడు మనము శివబాబా మతముపై నడుస్తున్నాము అనైతే పిల్లలకు తెలుసు. వారిది ఉన్నతోన్నతమైన మతము. ఉన్నతోన్నతుడైన శివబాబా, పిల్లలను శ్రేష్ఠముగా తయారుచేసేందుకు శ్రేష్ఠ మతాన్ని ఏ విధముగా ఇస్తారు అనేది ప్రపంచానికి తెలియదు. ఈ రావణ రాజ్యములో మనుష్యమాత్రులెవ్వరూ మనుష్యులకు శ్రేష్ఠ మతాన్ని ఇవ్వలేరు. మీరు ఇప్పుడు ఈశ్వరీయ మతము వారిగా అవుతున్నారు. ఈ సమయములో పిల్లలైన మీకు పతితము నుండి పావనముగా అయ్యేందుకు ఈశ్వరీయ మతము లభిస్తుంది. మేము విశ్వానికి యజమానులుగా ఉండేవారము అని ఇప్పుడు మీకు తెలిసింది. వీరు (బ్రహ్మా) యజమానిగా ఉండేవారు, కానీ వీరికి కూడా ఇంతకుముందు ఈ విషయము తెలియదు. విశ్వానికి యజమానిగా ఉన్నవారు తర్వాత పూర్తిగా పతితముగా అయిపోతారు. ఈ ఆట చాలా మంచి రీతిలో బుద్ధి ద్వారా అర్థం చేసుకోవాల్సినది. రైట్-రాంగ్ ఏమిటి, ఇందులోనే బుద్ధి యొక్క యుద్ధము నడుస్తుంది. మొత్తం ప్రపంచమంతా రాంగ్. ఒక్క తండ్రి మాత్రమే రైట్, సత్యము వినిపించేవారు. వారు మిమ్మల్ని సత్యఖండానికి యజమానులుగా తయారుచేస్తారు, కావున వారి మతాన్ని తీసుకోవాలి. స్వంత మతముపై నడిచినట్లయితే మోసపోతారు. కానీ ఆ తండ్రి చాలా గుప్తమైనవారు. వారు నిరాకారుడు కూడా. చాలా మంది పిల్లలు నిర్లక్ష్యము చేస్తారు, ఇది దాదా యొక్క మతము అని భావిస్తారు. మాయ శ్రేష్ఠ మతాన్ని తీసుకోనివ్వదు. శ్రీమతముపై నడవాలి కదా. బాబా, మీరు ఏదైతే చెప్తారో, అది మేము తప్పకుండా పాటిస్తాము. కానీ కొంతమంది పాటించరు. నంబరువారు పురుషార్థమనుసారముగా మతముపై నడుచుకుంటారు, మిగిలినవారు తమ మతాన్ని నడిపిస్తారు. బాబా శ్రేష్ఠ మతాన్ని ఇవ్వడానికి వచ్చారు. ఇటువంటి తండ్రిని ఘడియ-ఘడియ మర్చిపోతారు. మాయ మతాన్ని తీసుకోనివ్వదు. శ్రీమతమైతే చాలా సహజమైనది కదా. మనము తమోప్రధానముగా ఉన్నామని ప్రపంచములోని వారెవ్వరికీ ఈ జ్ఞానము లేదు. నా మతము ప్రసిద్ధమైనది, అదే శ్రీమత్ భగవద్గీత. భగవంతుడు ఇప్పుడు అంటున్నారు - నేను 5 వేల సంవత్సరాల తర్వాత వస్తాను, వచ్చి భారత్ కు శ్రీమతాన్ని ఇచ్చి శ్రేష్ఠాతి శ్రేష్ఠముగా తయారుచేస్తాను. తండ్రి అయితే అప్రమత్తం చేస్తారు, కానీ పిల్లలు శ్రీమతముపై నడవరు. తండ్రి ప్రతిరోజూ అర్థం చేయిస్తూ ఉంటారు - పిల్లలూ, శ్రీమతముపై నడవడము మర్చిపోకండి. ఇది వీరు (బ్రహ్మా) చెప్తున్నది కాదు. ఇది ఆ తండ్రి చెప్తున్నట్లు భావించండి. వారే వీరి ద్వారా మతాన్ని ఇస్తారు. వారే అర్థం చేయిస్తారు. వారు ఆహార-పానీయాలు స్వీకరించరు, నేను అభోక్తను అని అంటారు. పిల్లలైన మీకు శ్రీమతము ఇస్తాను. నంబరు వన్ మతమును ఇస్తున్నారు - ‘నన్ను స్మృతి చేయండి’. ఏ వికర్మలు చేయకండి. మీ హృదయాన్ని ప్రశ్నించుకోండి - నేను ఎంత పాపము చేసాను? అందరి పాపాల కుండ నిండి ఉంది అనైతే మీకు తెలుసు. ఈ సమయములో అందరూ రాంగ్ మార్గములో ఉన్నారు. మీకు ఇప్పుడు తండ్రి ద్వారా రైట్ మార్గము లభించింది. మీ బుద్ధిలో మొత్తం జ్ఞానమంతా ఉంది. గీతలో ఏ జ్ఞానమైతే ఉండాలో, అది లేదు. ఆ గీత ఏమీ తండ్రి ద్వారా తయారుచేయబడినది కాదు. ఇది కూడా భక్తి మార్గములో నిశ్చితమై ఉంది. భగవంతుడు వచ్చి భక్తి ఫలాన్ని ఇస్తారని అంటారు. జ్ఞానము ద్వారా సద్గతి లభిస్తుందని పిల్లలకు అర్థం చేయించడం జరిగింది. సద్గతి కూడా అందరికీ లభిస్తుంది, అలాగే దుర్గతి కూడా అందరికీ లభిస్తుంది. ఈ ప్రపంచమే తమోప్రధానమైనది. సతోప్రధానమైనవారు ఎవరూ లేరు. పునర్జన్మలు తీసుకుంటూ-తీసుకుంటూ ఇప్పుడు చివరికి వచ్చేసారు. ఇప్పుడు మృత్యువు అందరి తలపై నిలబడి ఉంది. ఇది భారత్ కు సంబంధించిన విషయమే. గీత కూడా దేవీ-దేవతా ధర్మము యొక్క శాస్త్రము. కావున మీరు ఇతర ధర్మాలలోకి వెళ్ళడం వలన లాభమేముంది. ప్రతి ఒక్కరూ తమ-తమ ఖురాన్, బైబిల్ మొదలైనవాటినే చదువుతారు. వారికి తమ ధర్మము గురించి తెలుసు. ఒక్క భారతవాసులు మాత్రమే ఇతర ధర్మాలన్నింటిలోకి వెళ్ళిపోతారు. మిగిలినవారందరూ తమ-తమ ధర్మాలలో పక్కాగా ఉన్నారు. ప్రతి ఒక్క ధర్మము వారి ముఖకవళికలు మొదలైనవి వేర్వేరుగా ఉంటాయి. తండ్రి స్మృతిని ఇప్పిస్తున్నారు - పిల్లలూ, మీరు మీ దేవీ-దేవతా ధర్మాన్ని మర్చిపోయారు. మీరు స్వర్గములో దేవతలుగా ఉండేవారు, హం సో యొక్క అర్థాన్ని భారతవాసులకు తండ్రి వినిపించారు. అంతేకానీ ఆత్మయే పరమాత్మ అని కాదు. ఈ విషయాలను భక్తి మార్గపు గురువులు తయారుచేస్తారు. గురువులు కూడా కోట్లాదిమంది ఉంటారు. పతియే నీకు గురువు, ఈశ్వరుడు అని స్త్రీకి తన పతి గురించి చెప్తారు. మరి పతియే ఈశ్వరుడైనప్పుడు, మళ్ళీ - ఓ భగవంతుడా, ఓ రామా అని ఎందుకు అంటారు. మనుష్యుల బుద్ధి పూర్తిగా రాతిబుద్ధిలా అయిపోయింది. నేను కూడా ఒకప్పుడు ఇలాగే ఉండేవాడిని అని ఇతను స్వయం కూడా అంటారు. వైకుంఠానికి యజమాని అయిన శ్రీకృష్ణుడు ఎక్కడ, అతడిని పల్లెటూరి బాలుడు అని అనడం ఎక్కడ. వారిని శ్యామసుందరుడు అని అంటారు. కానీ అర్థము తెలియదు. ఇప్పుడు తండ్రి మీకు అర్థం చేయించారు - ఎవరైతే నంబరువన్ సుందరముగా ఉండేవారో, వారే చివరి నంబరులో తమోప్రధానముగా, నల్లగా అయిపోయారు. మీరు అర్థం చేసుకుంటారు - మేము సుందరముగా ఉండేవారము, తర్వాత నల్లగా అయ్యాము, 84 జన్మల చక్రములో తిరిగి ఇప్పుడు నల్లగా ఉన్నవారి నుండి సుందరముగా అయ్యేందుకు, తండ్రి ఒకే మందును ఇస్తున్నారు - నన్ను స్మృతి చేయండి. తద్వారా మీ ఆత్మ పతితము నుండి పావనముగా తయారవుతుంది. మీ జన్మ-జన్మాంతరాల పాపాలు అంతమైపోతాయి.

రావణుడు వచ్చినప్పటి నుండి మీరు కిందికి పడిపోతూ-పడిపోతూ పాపాత్ములుగా అయ్యారు అని మీకు తెలుసు. ఇది ఉన్నదే పాపాత్ముల ప్రపంచము. ఒక్కరు కూడా సుందరముగా లేరు. తండ్రి తప్ప ఇంకెవ్వరూ సుందరముగా తయారుచేయలేరు. మీరు స్వర్గవాసులుగా, సుందరముగా తయారయ్యేందుకు వచ్చారు. ఇప్పుడు నరకవాసులుగా, నల్లగా ఉన్నారు ఎందుకంటే కామ చితిపైకి ఎక్కి నల్లగా అయిపోయారు. తండ్రి అంటారు, కామము మహాశత్రువు. దీనిపై ఎవరైతే విజయాన్ని పొందుతారో, వారే జగజ్జీతులుగా అవుతారు. మొట్టమొదటిది కామము. అటువంటివారినే పతితులు అని అంటారు. క్రోధము కలవారిని పతితులు అని అనరు. మీరు వచ్చి పతితము నుండి పావనముగా తయారుచేయండి అని పిలుస్తారు కూడా. కావున ఇప్పుడు తండ్రి వచ్చారు, వారంటారు - ఈ అంతిమ జన్మలో పావనముగా అవ్వండి. ఏ విధంగా రాత్రి తర్వాత పగలు, పగలు తర్వాత రాత్రి వస్తుందో, అలాగే సంగమయుగము తర్వాత మళ్ళీ సత్యయుగము రానున్నది. చక్రము తిరుగుతుంది. అంతేకానీ ఆకాశములో లేక పాతాళములో ప్రపంచమేమీ లేదు. సృష్టి అయితే ఇదే. సత్యయుగము, త్రేతాయుగము... ఇక్కడే ఉన్నాయి. వృక్షము కూడా ఒక్కటే, ఇతర వృక్షాలేవీ ఉండవు. అనేక ప్రపంచాలు ఉన్నాయి అని ఏదైతే చెప్తారో, అవన్నీ ప్రగల్భాలు. తండ్రి అంటారు - ఇవన్నీ భక్తి మార్గపు విషయాలు. ఇప్పుడు తండ్రి సత్యమైన విషయాన్ని వినిపిస్తారు. ఇప్పుడు మీ లోలోపల చూసుకోండి - నేను ఎంతవరకు శ్రీమతముపై నడుస్తూ సతోప్రధానముగా అనగా పుణ్యాత్మగా అవుతున్నాను? సతోప్రధానులను పుణ్యాత్ములు అని, తమోప్రధానులను పాపాత్ములు అని అంటారు. వికారాలలోకి వెళ్ళడము పాపము. తండ్రి అంటారు - ఇప్పుడు పవిత్రముగా అవ్వండి. నా వారిగా అయ్యారు కావున నా శ్రీమతముపై నడవండి. ముఖ్యమైన విషయము ఏమిటంటే - ఏ పాపము చేయకండి. వికారాలలోకి వెళ్ళడమే నంబరువన్ పాపము. ఇక ఇతర పాపాలు కూడా ఎన్నో జరుగుతూ ఉంటాయి. దొంగతనము, మోసము మొదలైనవి ఎన్నో చేస్తుంటారు. అప్పుడు ఎంతోమందిని ప్రభుత్వము పట్టుకుంటుంది కూడా. ఇప్పుడు తండ్రి పిల్లలకు చెప్తున్నారు - మీరు మీ హృదయాన్ని ప్రశ్నించుకోండి, నేను ఏ పాపమూ చేయడం లేదు కదా? ఏదైనా దొంగతనము చేసినా లేక లంచము తీసుకున్నా బాబా అయితే సర్వమూ తెలిసినవారు కదా, వారికి అంతా తెలుసు అని ఈ విధంగా భావించకండి. అలా కాదు, అన్నీ తెలిసినవారు అంటే అర్థము ఇది కాదు. అచ్ఛా, ఎవరైనా దొంగతనము చేస్తే, తండ్రికి తెలుస్తుంది, తర్వాత ఏమిటి? దొంగతనము చేసినదానికి వంద రెట్ల శిక్ష అయితే పడుతుంది. చాలా-చాలా శిక్ష అనుభవిస్తారు. పదవి కూడా భ్రష్టమైపోతుంది. తండ్రి అర్థం చేయిస్తారు - ఇటువంటి పనులు ఏవైనా చేస్తే, శిక్షలు అనుభవించవలసి వస్తుంది. కొందరు ఈశ్వరునికి సంతానముగా అయ్యి దొంగతనము చేస్తారు, ఏ శివబాబా నుండైతే ఇంతటి వారసత్వము లభిస్తుందో, వారి భండారా నుండి దొంగతనము చేస్తారు, ఇది చాలా పెద్ద పాపము. కొందరికి దొంగతనము చేసే అలవాటు ఉంటుంది, వారిని జైలుపక్షులు అని అంటారు. ఇది ఈశ్వరుని ఇల్లు. అంతా ఈశ్వరునిదే కదా. తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునేందుకు ఈశ్వరుని ఇంటికి వస్తారు. కానీ కొందరికి ఇది అలవాటైపోతుంది, దానికి వంద రెట్ల శిక్ష లభిస్తుంది. శిక్షలు కూడా ఎన్నో లభిస్తాయి, ఇక తర్వాత జన్మ-జన్మాంతరాలు అశుద్ధమైన ఇంటికి వెళ్ళి జన్మ తీసుకుంటారు, అంటే మిమ్మల్ని మీరే నష్టపరచుకున్నట్లు కదా. అసలు ఏ మాత్రము స్మృతిలో ఉండనివారు కూడా ఎంతోమంది ఉన్నారు, వారు అసలేమీ వినరు. వారి బుద్ధిలో దొంగతనము మొదలైన ఆలోచనలే నడుస్తూ ఉంటాయి. ఇటువంటివారు అనేక సత్సంగాలకు వెళ్తుంటారు. చెప్పులు దొంగతనము చేస్తారు, వారి వ్యాపారమే ఇది. ఎక్కడ సత్సంగాలు జరిగితే అక్కడికి వెళ్ళి చెప్పులు దొంగతనం చేస్తుంటారు. ప్రపంచము పూర్తిగా అశుద్ధముగా ఉంది. ఇది ఈశ్వరుని ఇల్లు. దొంగతనము చేసే అలవాటు చాలా చెడ్డది. ఒక్క పైసా తీసినా, లక్ష రూపాయలు తీసినా దొంగతనము దొంగతనమే అవుతుంది అని అంటూ ఉంటారు. స్వయాన్ని లోలోపల ప్రశ్నించుకోవాలి - నేనెంత పుణ్యాత్మగా అయ్యాను? ఎంత తండ్రిని స్మృతి చేస్తున్నాను? ఎంత నేను స్వదర్శన చక్రధారిగా అయ్యాను? ఎంత సమయము ఈశ్వరీయ సేవలో ఉంటున్నాను? ఎన్ని పాపాలు తొలగిపోతూ ఉన్నాయి? మీ లెక్కాపత్రాన్ని ప్రతిరోజు చూసుకోండి. ఎంత పుణ్యము చేసాను, ఎంత సమయము యోగములో ఉన్నాను? ఎంతమందికి మార్గము చూపించాను? వ్యాపార-వ్యవహారాలు మొదలైనవి చేసుకోండి. మీరు కర్మయోగులు. కర్మలు తప్పకుండా చేయండి. బాబా ఈ బ్యాడ్జీలు తయారుచేయిస్తూ ఉంటారు. మంచి-మంచివారికి వీటిపై అర్థం చేయించండి. ఈ మహాభారత యుద్ధము ద్వారానే స్వర్గ ద్వారాలు తెరుచుకుంటున్నాయి. శ్రీకృష్ణుని చిత్రము కింద వ్రాసిన వివరణ చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంది. కానీ పిల్లలు ఇంకా అంత విశాలబుద్ధి కలవారిగా అవ్వలేదు. కాస్త ధనము లభించేసరికి నాట్యము చేయడం మొదలుపెడతారు. ఎవరి వద్దనైనా ఎక్కువ ధనము ఉంటే, మా అంతటివారు ఇంకెవ్వరూ లేరు అని భావిస్తారు. ఏ పిల్లలకైతే తండ్రి అంటే లెక్కలేదో, వారికి తండ్రి ఏవైతే ఇన్ని అవినాశీ జ్ఞాన రత్నాల ఖజానాను ఇస్తున్నారో, దాని పట్ల కూడా గౌరవము ఉండదు. బాబా ఒకటి చెప్తే, వారు ఇంకొకటి చేస్తారు. లెక్కచేయని కారణముగా ఎంతో పాపము చేస్తూ ఉంటారు, శ్రీమతముపై నడవరు. ఇక కింద పడిపోతారు. తండ్రి అంటారు - ఇది కూడా డ్రామా. వారి భాగ్యములో లేదు. బాబాకైతే తెలుసు కదా. చాలా పాపము చేస్తారు, ఒకవేళ తండ్రి మనల్ని చదివిస్తున్నారు అన్న నిశ్చయము ఉన్నట్లయితే సంతోషముండాలి. భవిష్య కొత్త ప్రపంచములో మనము యువరాజులుగా-యువరాణులుగా అవుతాము అని మీకు తెలుసు, మరి ఎంత సంతోషము ఉండాలి. కానీ పిల్లలైతే ఇప్పటికీ కూడా వాడిపోతూ ఉంటారు. ఆ అవస్థ స్థిరముగా ఉండదు.

బాబా అర్థం చేయించారు - వినాశనానికి ముందు రిహార్సల్స్ కూడా జరుగుతాయి. వైపరీత్యాలు కూడా జరుగుతాయి. భారత్ ను బలహీనము చేస్తూ ఉంటారు. తండ్రి స్వయంగా అంటారు - ఇవన్నీ జరగవలసిందే. లేదంటే వినాశనము ఎలా జరుగుతుంది. మంచు వర్షము కురుస్తుంది, అప్పుడు పంటపొలాలు మొదలైనవాటి పరిస్థితి ఏమవుతుంది. లక్షలాది మంది చనిపోతూ ఉంటారు, కానీ దాని గురించి ఏమీ తెలియజేయరు. తండ్రి ముఖ్యమైన విషయాన్ని అర్థం చేయిస్తున్నారు - నేను తండ్రిని ఎంత స్మృతి చేస్తున్నాను అని స్వయాన్ని లోలోపల చెక్ చేసుకుంటూ ఉండండి. బాబా, మీరు చాలా మధురమైనవారు, మీది అద్భుతము. మీ ఆజ్ఞ ఉంది - నన్ను స్మృతి చేసినట్లయితే 21 జన్మల కొరకు ఎప్పుడూ రోగులుగా అవ్వరు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేసినట్లయితే నేను గ్యారంటీ ఇస్తాను. ఈ విధంగా తండ్రి సమ్ముఖముగా మీకు చెప్తున్నారు, మీరు మళ్ళీ ఇతరులకు వినిపిస్తారు. తండ్రి అంటారు - తండ్రినైన నన్ను స్మృతి చేయండి, చాలా ప్రేమించండి. పతితుల నుండి పావనులుగా అయ్యేందుకు మీకు ఎంత సహజమైన మార్గాన్ని తెలియజేస్తాను. మేము చాలా పాపాత్ములము అని కొందరు అంటారు. అచ్ఛా, మరి అటువంటి పాపాలు చేయకండి, నన్ను స్మృతి చేస్తూ ఉన్నట్లయితే జన్మ-జన్మాంతరాల పాపాలు ఏవైతే ఉన్నాయో, అవి ఈ స్మృతి ద్వారా భస్మమవుతూ ఉంటాయి. స్మృతియే ముఖ్యమైన విషయము. దీనిని సహజమైన స్మృతి అంటారు, యోగము అన్న పదాన్ని కూడా తీసేయండి. సన్యాసుల హఠయోగాలైతే రకరకాలుగా ఉన్నాయి. వారు అనేక రకాలుగా నేర్పిస్తారు. ఈ బాబా అయితే ఎంతోమంది గురువులను ఆశ్రయించారు కదా. ఇప్పుడు అనంతమైన తండ్రి చెప్తున్నారు - వారందరినీ వదిలివేయండి. వారందరినీ కూడా నేనే ఉద్ధరించాలి. ఇలా అనేటువంటి శక్తి ఇంకెవ్వరికీ లేదు. తండ్రియే అన్నారు - ఈ సాధువుల ఉద్ధరణను కూడా నేనే చేస్తాను. మరి వారు గురువులు ఎలా అవ్వగలరు. కావున ముఖ్యమైన ఒక విషయాన్ని తండ్రి అర్థం చేయిస్తున్నారు - మీ హృదయాన్ని ప్రశ్నించుకోండి, నేను పాపాలేవీ చేయడం లేదు కదా? ఎవరికీ దుఃఖాన్ని అయితే ఇవ్వడము లేదు కదా? ఇందులో ఎలాంటి కష్టము లేదు. లోలోపల చెక్ చేసుకోవాలి - రోజంతటిలో ఎన్ని పాపాలు చేసాను? ఎంత స్మృతి చేసాను? స్మృతి ద్వారానే పాపాలు భస్మమవుతాయి. ప్రయత్నము చేయాలి. ఇది చాలా శ్రమతో కూడుకున్న పని. జ్ఞానాన్ని ఇచ్చేవారు ఒక్క తండ్రియే. తండ్రియే ముక్తి-జీవన్ముక్తుల మార్గాన్ని తెలియజేస్తారు. అచ్ఛా.

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. తండ్రి అవినాశీ జ్ఞాన రత్నాల ఖజానాను ఏదైతే ఇస్తారో, దాని పట్ల గౌరవము ఉండాలి. నిర్లక్ష్యులుగా అయి పాప కర్మలు చేయకూడదు. ఒకవేళ భగవంతుడు మమ్మల్ని చదివిస్తున్నారు అన్న నిశ్చయము ఉన్నట్లయితే అపారమైన సంతోషములో ఉండాలి.

2. ఈశ్వరుని ఇంట్లో ఎప్పుడూ దొంగతనము మొదలైనవి చేయాలి అనే ఆలోచన రాకూడదు. ఈ అలవాటు చాలా చెడ్డది. ఒక్క పైసా తీసినా, లక్ష రూపాయలు తీసినా దొంగతనము దొంగతనమే అవుతుంది అని అంటారు. నేను ఎంత పుణ్యాత్మగా అయ్యాను అని స్వయాన్ని లోలోపల ప్రశ్నించుకోవాలి.

వరదానము:-
నిర్బల, నిరాశకులోనైన, అసమర్థ ఆత్మలకు ఎక్స్ ట్రా బలాన్ని ఇచ్చే ఆత్మిక దయార్ద్రహృదయ భవ

ఎవరైతే ఆత్మిక దయార్ద్రహృదయులైన పిల్లలు ఉంటారో - వారు మహాదానులుగా అయి పూర్తిగా హోప్ లెస్ కేస్ లో (ఆశలేని కేస్) ఆశను ఉత్పన్నము చేస్తారు. నిర్బలులను శక్తివంతులుగా చేస్తారు. దానము సదా పేదవారికి, ఆధారము లేనివారికి ఇవ్వడము జరుగుతుంది. కావున ఎవరైతే నిర్బల, నిరాశకు లోనైన, అసమర్థులైన ప్రజా క్వాలిటీ ఆత్మలు ఉన్నారో, వారి పట్ల ఆత్మిక దయార్ద్రహృదయులుగా అయి మహాదానులుగా అవ్వండి. పరస్పరం ఒకరి పట్ల ఒకరు మహాదానులుగా అవ్వడము కాదు. పరస్పరం మీరు సహయోగీ సహచరులు, సోదరులు, తోటి పురుషార్థులు, కావున మీరు సహయోగాన్ని అందించుకోండి, దానము కాదు.

స్లోగన్:-
సదా ఒక్క తండ్రి యొక్క శ్రేష్ఠ సాంగత్యములో ఉన్నట్లయితే ఇంకెవ్వరి సాంగత్యపు రంగు ప్రభావము చూపలేదు.

అవ్యక్త సూచనలు - ఆత్మిక రాయల్టీని మరియు పవిత్రత యొక్క పర్సనాలిటీని ధారణ చెయ్యండి

పవిత్రతతోపాటుగా ముఖము మరియు నడవడికలో ఆత్మికతతో కూడిన పర్సనాలిటీని ధారణ చేసి, ఈ ఉన్నతమైన పర్సనాలిటీ యొక్క ఆత్మిక నషాలో ఉండండి. మీ ఆత్మిక పర్సనాలిటీని స్మృతిలో ఉంచుకుని సదా ప్రసన్నచిత్తులుగా ఉన్నట్లయితే అన్ని ప్రశ్నలు సమాప్తమవుతాయి. అశాంతి మరియు అలజడిలో ఉన్న ఆత్మలు మీ ప్రసన్నతతో కూడిన దృష్టితో ప్రసన్నులవుతారు.