20-02-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - ఇప్పుడు వికారాలను దానము ఇచ్చినట్లయితే గ్రహణము తొలగిపోతుంది మరియు ఈ తమోప్రధానమైన ప్రపంచము సతోప్రధానముగా అవుతుంది’’

ప్రశ్న:-
పిల్లలైన మీరు ఏ విషయములో ఎప్పుడూ కూడా విసుగు చెందకూడదు?

జవాబు:-
మీరు మీ లైఫ్ తో (జీవితముతో) ఎప్పుడూ కూడా విసుగు చెందకూడదు ఎందుకంటే ఇది వజ్రతుల్యమైన జన్మగా గానం చేయబడింది, దీనిని సంభాళించవలసి ఉంటుంది కూడా, ఆరోగ్యముగా ఉన్నట్లయితే జ్ఞానాన్ని వింటూ ఉంటారు. ఇక్కడ ఎన్ని రోజులైతే జీవిస్తారో, సంపాదన జరుగుతూ ఉంటుంది, లెక్కాచారము సమాప్తమవుతూ ఉంటుంది.

పాట:-
ఓం నమః శివాయ...

ఓంశాంతి
ఈ రోజు గురువారము. పిల్లలైన మీరు సద్గురువారము అని అంటారు, ఎందుకంటే సత్యయుగ స్థాపనను చేసేవారు కూడా ఉన్నారు, వారు సత్య నారాయణుని కథను కూడా ప్రత్యక్షముగా వినిపిస్తున్నారు. నరుని నుండి నారాయణునిగా తయారుచేస్తారు. సర్వుల సద్గతిదాత అని గానం చేస్తారు, అలాగే వారు వృక్షపతి కూడా. ఇది మనుష్య సృష్టి రూపీ వృక్షము, దీనిని కల్పవృక్షము అని అంటారు. కల్ప-కల్పము అనగా 5 వేల సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే విధంగా రిపీట్ అవుతుంది. వృక్షము కూడా రిపీట్ అవుతుంది కదా. పుష్పాలు ఆరు మాసాలు వికసిస్తాయి, ఆ తర్వాత తోటమాలులు వేర్లను తీసేస్తారు, మళ్ళీ నాటుతారు, అప్పుడు మళ్ళీ పుష్పాలు వికసిస్తాయి.

ఇప్పుడు ఇదైతే పిల్లలకు తెలుసు - తండ్రి యొక్క జయంతిని కూడా అర్ధకల్పము జరుపుతారు, అర్ధకల్పము మర్చిపోతారు. భక్తి మార్గములో అర్ధకల్పము తలచుకుంటారు. బాబా ఎప్పుడు వచ్చి గార్డెన్ ఆఫ్ ఫ్లవర్స్ (పూలతోటను) స్థాపన చేస్తారు? దశలైతే ఎన్నో ఉంటాయి కదా. బృహస్పతి దశ కూడా ఉంటుంది, దిగే కళ యొక్క దశలు కూడా ఉంటాయి. ఈ సమయములో భారత్ పై రాహువు యొక్క గ్రహణము కూర్చుని ఉంది. చంద్రునికి కూడా గ్రహణము పట్టినప్పుడు - దానము ఇచ్చినట్లయితే గ్రహణము తొలగిపోతుంది అని అంటారు. ఇప్పుడు తండ్రి కూడా అంటారు - ఈ 5 వికారాలను దానము ఇచ్చినట్లయితే గ్రహణము తొలగిపోతుంది. ఇప్పుడు మొత్తం సృష్టి అంతటిపై గ్రహణము పట్టి ఉంది, పంచ తత్వాలపై కూడా గ్రహణము పట్టి ఉంది ఎందుకంటే తమోప్రధానముగా ఉన్నాయి. ప్రతి వస్తువు కొత్తదిగా, మళ్ళీ పాతదిగా తప్పకుండా అవుతుంది. కొత్తదానిని సతోప్రధానమని, పాతదానిని తమోప్రధానమని అంటారు. చిన్న పిల్లలను కూడా సతోప్రధానులని, మహాత్ముల కంటే కూడా ఉన్నతమైనవారని భావిస్తారు, ఎందుకంటే వారిలో 5 వికారాలు ఉండవు. భక్తినైతే సన్యాసులు కూడా చిన్నతనములో చేస్తారు. ఏ విధంగా రామతీర్థుడు శ్రీకృష్ణుడి పూజారిగా ఉండేవారు, ఆ తర్వాత ఎప్పుడైతే సన్యాసము తీసుకున్నారో ఇక పూజ సమాప్తమైపోయింది. సృష్టిపై కూడా పవిత్రత కావాలి కదా. భారత్ మొదట అన్నింటికంటే పవిత్రముగా ఉండేది, ఆ తర్వాత ఎప్పుడైతే దేవతలు వామ మార్గములోకి వెళ్తారో, ఇక అప్పుడు భూకంపాలు మొదలైనవాటిలో స్వర్గము యొక్క సామాగ్రి అంతా, బంగారు మహళ్ళు మొదలైనవన్నీ సమాప్తమైపోతాయి, మళ్ళీ కొత్తగా తయారవ్వడం ప్రారంభమవుతుంది. వినాశనము తప్పకుండా జరుగుతుంది. రావణ రాజ్యము ప్రారంభమైనప్పుడు ఉపద్రవాలు జరుగుతాయి, ఈ సమయములో అందరూ పతితులుగా ఉన్నారు. సత్యయుగములో దేవతలు రాజ్యము చేస్తారు. అసురులకు మరియు దేవతలకు మధ్యన యుద్ధాన్ని చూపించారు, కానీ దేవతలైతే సత్యయుగములో ఉంటారు. అక్కడ యుద్ధము ఎలా జరగగలదు. సంగమములో దేవతలు ఉండనే ఉండరు. మీ పేరే పాండవులు. పాండవులకు, కౌరవులకు మధ్యన కూడా యుద్ధము జరగదు. ఇవన్నీ ప్రగల్భాలు. ఇది ఎంత పెద్ద వృక్షము. ఎన్ని లెక్కలేనన్ని ఆకులు ఉన్నాయి, వాటి లెక్కను ఎవ్వరూ లెక్కించలేరు. సంగమములోనైతే దేవతలు ఉండరు. తండ్రి కూర్చుని ఆత్మలకు అర్థం చేయిస్తారు, ఆత్మయే విని తల ఊపుతుంది. మనము ఆత్మలము, బాబా మనల్ని చదివిస్తున్నారు, ఇది పక్కా చేసుకోవాలి. తండ్రి మనల్ని పతితుల నుండి పావనులుగా తయారుచేస్తారు. ఆత్మలోనే మంచి లేక చెడు సంస్కారాలు ఉంటాయి కదా. ఆత్మ ఇంద్రియాల ద్వారా - మమ్మల్ని బాబా చదివిస్తున్నారు అని అంటుంది. తండ్రి అంటారు, నాకు కూడా ఇంద్రియాలు కావాలి, వాటి ద్వారా అర్థం చేయిస్తాను. ఆత్మకు సంతోషము కలుగుతుంది. బాబా మనకు వినిపించడానికి ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత వస్తారు. మీరైతే ఎదురుగా కూర్చున్నారు కదా. మధుబన్ కే మహిమ ఉంది. ఆత్మల తండ్రి అయితే వారు కదా, అందరూ వారినే పిలుస్తారు. మీకు ఇక్కడ సమ్ముఖముగా కూర్చోవడంలో ఆనందము కలుగుతుంది. కానీ అందరూ అయితే ఇక్కడ ఉండలేరు. తమ వ్యాపార-వ్యవహారాలు, సేవ మొదలైనవి కూడా చూసుకోవాలి. ఆత్మలు సాగరుని వద్దకు వస్తాయి, ధారణ చేసి వెళ్ళి ఇతరులకు వినిపించాలి. లేకపోతే ఇతరుల కళ్యాణమును ఎలా చేస్తారు? యోగ స్వరూప మరియు జ్ఞాన స్వరూప ఆత్మలకు - మేము వెళ్ళి ఇతరులకు కూడా అర్థం చేయించాలి అని అభిరుచి ఉంటుంది. ఇప్పుడు శివజయంతిని జరుపుకుంటారు కదా. భగవానువాచ ఉంది. భగవానువాచ అని శ్రీకృష్ణుడి కొరకు అనలేరు, అతను దైవీ గుణాలు కల మానవుడు. దేవతా ధర్మము అని అంటారు. ఇప్పుడు దేవీ-దేవతా ధర్మము లేదని, అది స్థాపన అవుతూ ఉంది అని ఇప్పుడు పిల్లలు అర్థం చేసుకున్నారు. మేము ఇప్పుడు దేవీ-దేవతా ధర్మానికి చెందినవారమని ఇప్పుడు మీరు అనరు. అలా కాదు. ఇప్పుడు మీరు బ్రాహ్మణ ధర్మానికి చెందినవారు, దేవీ-దేవతా ధర్మానికి చెందినవారిగా అవుతూ ఉన్నారు. దేవతల యొక్క నీడ కూడా ఈ పతిత సృష్టిపై పడదు, ఇక్కడకు దేవతలు రాలేరు. మీ కొరకు కొత్త ప్రపంచము కావాలి. లక్ష్మికి కూడా పూజ చేసేటప్పుడు ఇంటిని ఎంత శుభ్రము చేస్తారు. ఇప్పుడు ఈ సృష్టి కూడా ఎంతగా శుభ్రమవ్వాలి. మొత్తం పాత ప్రపంచమంతా సమాప్తమయ్యేది ఉంది. లక్ష్మి నుండి మనుష్యులు ధనాన్ని మాత్రమే యాచిస్తారు. లక్ష్మి పెద్దవారా లేక జగదంబ పెద్దవారా? (అంబ) అంబ యొక్క మందిరాలు కూడా ఎన్నో ఉన్నాయి. మనుష్యులకు ఏమీ తెలియదు. మీరు అర్థం చేసుకున్నారు - లక్ష్మి అయితే స్వర్గానికి యజమాని మరియు జగదాంబ ఎవరినైతే సరస్వతి అని కూడా అంటారో, ఆ జగదంబయే మళ్ళీ ఈ లక్ష్మిగా అవుతారు. మీ పదవి ఉన్నతమైనది, దేవతల పదవి తక్కువ. ఉన్నతోన్నతమైనదైతే బ్రాహ్మణుల పిలక కదా. మీరు అందరికన్నా ఉన్నతమైనవారు. సరస్వతి, జగదాంబ అని మీ మహిమ ఉంది - దాని ద్వారా ఏమి లభిస్తుంది? సృష్టి యొక్క రాజ్యాధికారము. అక్కడ మీరు ధనవంతులుగా అవుతారు, విశ్వరాజ్యము లభిస్తుంది. మళ్ళీ పేదవారిగా అవుతారు, భక్తి మార్గము ప్రారంభమవుతుంది. మళ్ళీ లక్ష్మిని గుర్తు చేసుకుంటారు. ప్రతి సంవత్సరము లక్ష్మికి పూజ కూడా జరుగుతుంది. లక్ష్మిని ప్రతి సంవత్సరము పిలుస్తారు, జగదంబను ఎవ్వరూ ప్రతి సంవత్సరము పిలవరు. జగదంబకు కూడా సదా పూజ జరుగుతూనే ఉంటుంది, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు అంబ యొక్క మందిరానికి వెళ్ళవచ్చు. ఇక్కడ కూడా ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు జగదాంబను కలుసుకోవచ్చు. మీరు కూడా జగదాంబలే కదా. మీరు అందరికీ విశ్వానికి యజమానులుగా అయ్యే మార్గాన్ని తెలియజేస్తారు. జగదాంబ వద్దకు వెళ్ళి అన్నింటినీ యాచిస్తారు. లక్ష్మి నుండి కేవలం ధనాన్ని మాత్రమే యాచిస్తారు. జగదాంబ ఎదురుగానైతే అన్ని కోరికలు పెట్టుకుంటారు, కావున అన్నింటికన్నా ఉన్నతమైన పదవి మీది ఇప్పుడు ఉంది, ఈ సమయములో తండ్రి వద్దకు వచ్చి పిల్లలుగా అయ్యారు. తండ్రి వారసత్వాన్ని ఇస్తారు.

ఇప్పుడు మీరు ఈశ్వరీయ సాంప్రదాయమువారు, ఆ తర్వాత దైవీ సాంప్రదాయమువారిగా అవుతారు. ఈ సమయములో మనోకామనలన్నీ భవిష్యత్తు కొరకు పూర్తవుతాయి. కామనలైతే మనుష్యులకు ఉంటాయి కదా. మీ కామనలన్నీ పూర్తవుతాయి. ఇది ఆసురీ ప్రపంచము. ఎంతమంది పిల్లలకు జన్మనిస్తారో చూడండి. సత్యయుగములో శ్రీకృష్ణుడి జన్మ ఎలా జరుగుతుంది అని పిల్లలైన మీకైతే సాక్షాత్కారము చేయించడం జరుగుతుంది. అక్కడ అన్నీ నియమానుసారముగా జరుగుతాయి, దుఃఖము అనే పేరే ఉండదు. దానిని సుఖధామమని అంటారు. మీరు అనేక సార్లు సుఖములో పాస్ అయ్యారు, అలాగే అనేక సార్లు ఓడిపోయారు మరియు మళ్ళీ విజయాన్ని కూడా పొందారు. మమ్మల్ని తండ్రి చదివిస్తున్నారని ఇప్పుడు స్మృతి వచ్చింది. స్కూల్లో జ్ఞానము చదువుకుంటారు. దానితో పాటు మ్యానర్స్ కూడా నేర్చుకుంటారు కదా. అక్కడ ఎవరూ ఈ లక్ష్మీ-నారాయణుల వంటి మ్యానర్స్ ను నేర్చుకోరు. ఇప్పుడు మీరు దైవీ గుణాలను ధారణ చేస్తారు. సర్వ గుణ సంపన్నులు... అని మహిమ కూడా వారిదే గానం చేస్తారు. కావున ఇప్పుడు మీరు ఈ విధంగా తయారవ్వాలి. పిల్లలైన మీరు మీ ఈ జీవితముతో ఎన్నడూ విసుగు చెందకూడదు, ఎందుకంటే ఇది వజ్రతుల్యమైన జన్మగా గాయనం చేయబడింది. దీనిని సంభాళించవలసి కూడా ఉంటుంది. ఆరోగ్యముగా ఉంటే జ్ఞానము వింటూ ఉంటారు. అనారోగ్యములో కూడా వినవచ్చు. తండ్రిని స్మృతి చేయవచ్చు. ఇక్కడ ఎన్ని రోజులైతే ఉంటారో అంత సుఖముగా ఉంటారు. సంపాదన జరుగుతూ ఉంటుంది, లెక్కాచారము సమాప్తమవుతూ ఉంటుంది. పిల్లలు అంటారు - బాబా, సత్యయుగము ఎప్పుడు వస్తుంది, ఇది చాలా అశుద్ధమైన ప్రపంచముగా ఉంది. తండ్రి అంటారు - అరే, ముందు కర్మాతీత అవస్థనైతే తయారుచేసుకోండి. ఎంత వీలైతే అంత పురుషార్థము చేస్తూ ఉండండి. పిల్లలకు శివబాబాను స్మృతి చేయండి అని నేర్పించాలి, ఇది అవ్యభిచారీ స్మృతి. ఒక్క శివునికే భక్తి చేయడము, అది అవ్యభిచారీ భక్తి, సతోప్రధానమైన భక్తి. ఆ తర్వాత దేవి-దేవతలను స్మృతి చేయడము, అది సతో భక్తి. తండ్రి అంటారు, లేస్తూ కూర్చుంటూ తండ్రినైన నన్ను స్మృతి చేయండి. ఓ పతిత-పావనా, ముక్తిప్రదాతా, మార్గదర్శకుడా... అని పిల్లలే పిలుస్తారు. ఇలా ఆత్మయే అంటుంది కదా.

పిల్లలు స్మృతి చేస్తారు. తండ్రి ఇప్పుడు స్మృతిని కలిగిస్తున్నారు - ఓ దుఃఖహర్తా, సుఖకర్తా రండి, వచ్చి దుఃఖము నుండి విడిపించండి, విముక్తులుగా చేయండి, శాంతిధామానికి తీసుకువెళ్ళండి అని మీరు తలచుకుంటూ వచ్చారు. తండ్రి అంటారు, మిమ్మల్ని శాంతిధామానికి తీసుకువెళ్తాను, ఆ తర్వాత సుఖధామములో మీకు తోడుగా ఉండను. ఇప్పుడే మీకు తోడుగా ఉంటాను. ఆత్మలందరినీ ఇంటికి తీసుకువెళ్తాను. ఇప్పుడు చదివించడంలో తోడుగా ఉంటాను మరియు తిరిగి ఇంటికి తీసుకెళ్ళడంలో తోడుగా ఉంటాను. అంతే. నేను నా పరిచయాన్ని పిల్లలైన మీకు మంచి రీతిలో కూర్చుని వినిపిస్తాను. ఎవరెవరు ఎంత పురుషార్థము చేస్తారో, దాని అనుసారముగా మళ్ళీ అక్కడ ప్రారబ్ధాన్ని పొందుతారు. జ్ఞానమైతే తండ్రి ఎంతో ఇస్తారు. ఎంత వీలైతే అంత నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి మరియు ఎగిరేందుకు రెక్కలు లభిస్తాయి. ఆత్మకు ఇటువంటి రెక్కలు ఏమీ ఉండవు. ఆత్మ అయితే ఒక చిన్న బిందువు. ఆత్మలో 84 జన్మల పాత్ర ఎలా ఇమిడి ఉంది అనేది ఎవ్వరికీ తెలియదు. ఎవరికీ ఆత్మ పరిచయము కానీ, పరమాత్మ పరిచయము కానీ లేదు. అందుకే తండ్రి అంటారు - నేను ఎవరినో, ఎలా ఉన్నానో, అలా నన్ను ఎవ్వరూ తెలుసుకోలేరు, నా ద్వారానే నన్ను మరియు నా రచనను తెలుసుకోగలరు. నేనే వచ్చి పిల్లలైన మీకు నా పరిచయాన్ని ఇస్తాను. ఆత్మ అంటే ఏమిటో కూడా అర్థం చేయిస్తాను. దీనినే సోల్ రియలైజేషన్ (ఆత్మానుభూతి) అని అంటారు. ఆత్మ భృకుటి మధ్యలో ఉంటుంది. భృకుటి మధ్యలో ఒక అద్భుతమైన సితార మెరుస్తుంది... అని అంటారు కూడా. కానీ ఆత్మ అంటే ఏమిటి, ఇది అసలు ఎవ్వరికీ తెలియదు. ఎప్పుడైనా ఎవరైనా ఆత్మ సాక్షాత్కారము కావాలి అని అడిగితే, వారికి ఇలా అర్థం చేయించండి - భృకుటి మధ్యలో నక్షత్రము వలె ఉంటుంది అని మీరు అంటారు కదా, మరి ఆ నక్షత్రాన్ని ఏమి చూస్తారు? బొట్టు కూడా ఒక నక్షత్రము వలె పెట్టుకుంటారు. చంద్రునిలో (నెలవంకలో) కూడా నక్షత్రాన్ని చూపిస్తారు. వాస్తవానికి ఆత్మ ఒక నక్షత్రము వంటిది. ఇప్పుడు తండ్రి అర్థం చేయించారు, మీరు జ్ఞాన సితారలు, ఇకపోతే ఆ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అయితే ఈ రంగస్థలానికి ప్రకాశాన్ని ఇచ్చేటటువంటివి. అవి దేవతలేమీ కావు. భక్తి మార్గములో సూర్యుడికి కూడా నీటిని అర్పిస్తారు. భక్తి మార్గములో ఈ బాబా కూడా అన్నీ చేసేవారు. సూర్య దేవతాయ నమః, చంద్ర దేవతాయి నమః అని అంటూ నీటిని అర్పించేవారు. అదంతా భక్తి మార్గము. ఇతనైతే చాలా భక్తి చేసారు. నంబర్ వన్ పూజ్యులైన వీరు మళ్ళీ నంబర్ వన్ పూజారిగా అయ్యారు. నంబర్లు అయితే లెక్కిస్తారు కదా. రుద్రమాలలో కూడా నంబరులైతే ఉన్నాయి కదా. భక్తి కూడా అందరికంటే ఎక్కువ ఇతనే చేసారు. ఇప్పుడు తండ్రి అంటారు, చిన్నా పెద్ద అందరిదీ వానప్రస్థ అవస్థ. ఇప్పుడు నేను అందరినీ తీసుకువెళ్తాను, ఇక మళ్ళీ ఇక్కడికి రానే రాను. ఇకపోతే శాస్త్రాలలో - ప్రళయము జరిగిందని, అంతా జలమయమైపోయిందని, అప్పుడు సాగరములో రావి ఆకుపై శ్రీకృష్ణుడు తేలుతూ వచ్చారని... ఏదైతే చూపించారో, ఆ విషయములో తండ్రి అర్థం చేయిస్తున్నారు, వాస్తవానికి అక్కడ ఆ సాగరానికి సంబంధించిన విషయమేమీ లేదు. అక్కడైతే గర్భ మహలు ఉంటుంది, అందులో పిల్లలు చాలా సుఖముగా ఉంటారు. ఇక్కడ గర్భ జైలు అని అంటారు. తమ పాపాల శిక్ష గర్భములో లభిస్తుంది. అయినా కూడా తండ్రి అంటారు, మన్మనాభవ, నన్ను స్మృతి చేయండి. ప్రదర్శనీలో కొందరు అడుగుతారు - మెట్ల వరుస చిత్రములో ఇతర ధర్మాలేవీ ఎందుకు చూపించలేదు అని. మీరు చెప్పండి - ఇతర ధర్మాల వారివి 84 జన్మలు ఉండవు. కల్పవృక్షములో అన్ని ధర్మాలనూ చూపించారు, దాని ద్వారా మీరు ఎన్ని జన్మలు తీసుకుని ఉంటారు అనేది లెక్క వేసుకోండి. మనమైతే మెట్ల వరుసలో 84 జన్మలను చూపించాలి, మిగిలినవన్నీ చక్రములోనూ మరియు కల్పవృక్షములోనూ చూపించాము. వీటిలో అన్ని విషయాలను అర్థం చేయించారు. లండన్ ఎక్కడ ఉంది, ఫలానా పట్టణము ఎక్కడ ఉంది అనేది మ్యాప్ చూడగానే బుద్ధిలోకి వచ్చేస్తుంది కదా. తండ్రి ఎంత సహజము చేసి అర్థం చేయిస్తారు. 84 జన్మల చక్రము ఇలా తిరుగుతుంది అని అందరికీ అర్థం చేయించండి. ఇప్పుడు తమోప్రధానము నుండి సతోప్రధానముగా అవ్వాలంటే అనంతమైన తండ్రిని స్మృతి చేయండి, అప్పుడు మీరు పావనముగా అవుతారు మరియు పావనముగా అయి పావన ప్రపంచములోకి వెళ్ళిపోతారు. ఇందులో కష్టమైన విషయమేమీ లేదు. ఎంత సమయము లభిస్తే అంత సమయము తండ్రిని స్మృతి చేయండి, తద్వారా అది పక్కా అలవాటుగా అయిపోతుంది. తండ్రి స్మృతిలో మీరు ఢిల్లీ వరకూ నడుస్తూ వెళ్ళినా అలసట కలగదు. సత్యమైన స్మృతి ఉంటే దేహ భానము తొలగిపోతుంది, అప్పుడిక అలసట కలగదు. చివరిలో వచ్చేవారు స్మృతిలో ఇంకా తీవ్రముగా ముందుకు వెళ్తారు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ఒక్క తండ్రి యొక్క అవ్యభిచారీ స్మృతిలో ఉంటూ దేహ భానాన్ని సమాప్తము చేయాలి. తమ కర్మాతీత అవస్థను తయారుచేసుకునేందుకు పురుషార్థము చేయాలి. ఈ శరీరములో ఉంటూ అవినాశీ సంపాదనను జమ చేసుకోవాలి.

2. జ్ఞాన స్వరూప ఆత్మగా అయి ఇతరుల సేవను చేయాలి. తండ్రి నుండి ఏదైతే విన్నారో, దానిని ధారణ చేసి ఇతరులకు వినిపించాలి. పంచ వికారాలను దానము చేసి రాహు గ్రహణము నుండి ముక్తులుగా అవ్వాలి.

వరదానము:-
ఏకమతము మరియు ఏకరస అవస్థ ద్వారా ధరణిని ఫలదాయకముగా చేసే ధైర్యవాన్ భవ

ఎప్పుడైతే పిల్లలైన మీరు ధైర్యవంతులుగా అయి సంగఠనలో ఏకమతముతో మరియు ఏకరస అవస్థలో ఉంటారో లేక ఒకే కార్యములో నిమగ్నమైపోతారో అప్పుడు స్వయము కూడా సదా ప్రఫుల్లితముగా ఉంటారు మరియు ధరణిని కూడా ఫలదాయకముగా తయారుచేస్తారు. ఏ విధంగా ఈ రోజుల్లో సైన్స్ ద్వారా ఇప్పుడిప్పుడే బీజము వేయడము మరియు ఇప్పుడిప్పుడే ఫలము లభించడము అన్నట్లు ఉంటుందో, అదే విధంగా సైలెన్స్ బలముతో సహజముగా మరియు తీవ్రగతితో ప్రత్యక్షతను చూస్తారు. ఎప్పుడైతే స్వయం నిర్విఘ్నులుగా, ఒక్క తండ్రి లగనములో నిమగ్నమై ఉంటారో, ఏకమతముతో మరియు ఏకరసముగా ఉంటారో, అప్పుడు ఇతర ఆత్మలు కూడా స్వతహాగా సహయోగులుగా అవుతారు మరియు ధరణి ఫలదాయకముగా అవుతుంది.

స్లోగన్:-
ఎవరైతే అభిమానాన్ని గౌరవముగా భావిస్తారో, వారు నిర్మానచిత్తులుగా ఉండలేరు.

అవ్యక్త సూచనలు:- ఏకాంతప్రియులుగా అవ్వండి, ఏకతను మరియు ఏకాగ్రతను అలవరచుకోండి

ఏకాంతవాసి మరియు రమణీకత! రెండు పదాలకు మధ్యన ఎంతో వ్యత్యాసము ఉంది, కానీ సంపూర్ణతలో రెండింటి సమానత ఉండాలి, ఎంతగా ఏకాంతవాసినో అంతగానే దానితోపాటు రమణీకత కూడా ఉండాలి. ఏకాంతములో రమణీకత మాయమైపోకూడదు. రెండూ సమానముగా మరియు కలిసి-కలిసి ఉండాలి. ఇప్పుడిప్పుడే ఏకాంతవాసీ, ఇప్పుడిప్పుడే రమణీకము, ఎంత గంభీరతనో అంతే కలుపుగోలుగా కూడా ఉండాలి. కలుపుగోలుగా ఉండడము అనగా సర్వుల సంస్కారాలు మరియు స్వభావాలతో కలిసిపోయేవారు.