20-05-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - పిల్లలైన మీతో అవినాశీ సంపాదనను చేయించేందుకు బాబా వచ్చారు, ఇప్పుడు మీరు జ్ఞాన రత్నాల సంపాదనను ఎంతగా చేసుకోవాలనుకుంటే అంతగా చేసుకోవచ్చు’’

ప్రశ్న:-
ఆసురీ సంస్కారాలను పరివర్తన చేసి దైవీ సంస్కారాలుగా చేసేందుకు ఏ విశేషమైన పురుషార్థము కావాలి?

జవాబు:-
సంస్కారాలను పరివర్తన చేసుకునేందుకు ఎంత వీలైతే అంత దేహీ-అభిమానులుగా ఉండే అభ్యాసము చేయండి. దేహాభిమానములోకి రావడము వలనే ఆసురీ సంస్కారాలు తయారవుతాయి. తండ్రి ఆసురీ సంస్కారాలను దైవీ సంస్కారాలుగా తయారుచేసేందుకు వచ్చారు. మొదట నేను దేహీ ఆత్మను, తర్వాత ఈ శరీరము అని పురుషార్థము చేయండి.

పాట:-
నీవు నిదురించి రాత్రిని పోగొట్టుకున్నావు...

ఓంశాంతి
ఈ పాటను పిల్లలు చాలా సార్లు విన్నారు. ఈ సమయాన్ని పోగొట్టుకోకండి అని ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి సావధానపరుస్తూ ఉంటారు. ఈ సమయములో చాలా గొప్ప సంపాదన చేసుకోవాలి. సంపాదన చేయించేందుకే తండ్రి వచ్చి ఉన్నారు. సంపాదన కూడా అనంతమైనది, ఎవరు ఎంత సంపాదన చేసుకోవాలనుకుంటే అంత చేసుకోవచ్చు. ఇది అవినాశీ జ్ఞాన రత్నాలతో జోలిని నింపుకునే సంపాదన. ఇది భవిష్యత్తు కొరకు. అది భక్తి, ఇది జ్ఞానము. ఎప్పుడైతే రావణ రాజ్యము ప్రారంభమవుతుందో, అప్పుడు భక్తి మొదలవుతుందని మనుష్యులకు తెలియదు. మళ్ళీ ఎప్పుడైతే తండ్రి వచ్చి రామ రాజ్యాన్ని స్థాపన చేస్తారో, అప్పుడు జ్ఞానము మొదలవుతుంది. జ్ఞానము కొత్త ప్రపంచము కొరకు, భక్తి పాత ప్రపంచము కొరకు. ఇప్పుడు తండ్రి అంటారు - మొదట స్వయాన్ని దేహీగా (ఆత్మగా) భావించాలి. మొదట, నేను ఆత్మను, ఆ తర్వాత శరీరము అని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. కానీ డ్రామా ప్లాను అనుసారముగా మనుష్యులందరూ రాంగ్ అయిపోయారు అందుకే - మొదట నేను దేహము, తర్వాత దేహీని అని వారు తప్పుగా అర్థం చేసుకున్నారు. తండ్రి అంటారు - ఇది వినాశీ. దీనిని మీరు తీసుకుంటారు మళ్ళీ వదిలేస్తారు. సంస్కారాలు ఆత్మలో ఉంటాయి. దేహాభిమానములోకి రావడం వలన సంస్కారాలు ఆసురీగా అయిపోతాయి. మళ్ళీ ఆసురీ సంస్కారాలను దైవీ సంస్కారాలుగా తయారుచేసేందుకు తండ్రికి రావలసి వస్తుంది. ఈ రచన అంతా ఆ ఒక్క రచయిత అయిన తండ్రిదే. వారిని అందరూ ఫాదర్ (తండ్రి) అని అంటారు. లౌకిక తండ్రిని కూడా ఫాదర్ అనే పిలుస్తారు. బాబా మరియు మమ్మా, ఈ రెండు పదాలు చాలా మధురమైనవి. రచయిత అని తండ్రినే అంటారు. వారు మొదట తల్లిని దత్తత తీసుకుంటారు, తర్వాత రచనను రచిస్తారు. అనంతమైన తండ్రి కూడా అంటారు - నేను వచ్చి వీరిలోకి ప్రవేశిస్తాను, వీరి పేరు ప్రసిద్ధమైనది. వీరిని భగీరథుడు అని కూడా అంటారు. మానవుని చిత్రాన్నే చూపిస్తారు. ఎద్దు మొదలైనవి చూపించరు. భగీరథునిది మానవ శరీరము. తండ్రియే వచ్చి పిల్లలకు తమ పరిచయాన్ని ఇస్తారు. మేము బాప్ దాదా వద్దకు వెళ్తాము అనే మీరు ఎప్పుడూ చెప్పండి. కేవలం బాప్ (తండ్రి) అని అంటే వారు నిరాకారుడు అవుతారు. ఎప్పుడైతే శరీరము విడిచిపెడతారో, అప్పుడే నిరాకార తండ్రి వద్దకు వెళ్ళగలుగుతారు, ఊరికే ఎవరూ వెళ్ళలేరు. ఈ జ్ఞానాన్ని తండ్రియే ఇస్తారు. ఈ జ్ఞానము తండ్రి వద్దనే ఉంది. ఇది అవినాశీ జ్ఞాన రత్నాల ఖజానా. తండ్రి జ్ఞాన రత్నాల సాగరుడు. ఇది నీటికి సంబంధించిన విషయము కాదు. ఇది జ్ఞాన రత్నాల భాండాగారము. వారిలో జ్ఞానము ఉంది. నీటిని జ్ఞానము అని అనరు. ఏ విధంగానైతే మనుష్యులకు బ్యారిస్టర్, డాక్టరుకు సంబంధించిన జ్ఞానము ఉంటుందో, అదే విధంగా ఇది కూడా జ్ఞానము. రచయిత మరియు రచనల ఆదిమధ్యాంతాల జ్ఞానము మాకు తెలియదు అని ఋషులు-మునులు మొదలైనవారు ఈ జ్ఞానము గురించే అనేవారు. అది కేవలం ఒక్క రచయితకు మాత్రమే తెలుసు. వృక్షానికి బీజరూపుడు కూడా వారే. సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానము వారిలో ఉంది. వారు ఎప్పుడైతే వస్తారో, అప్పుడే వినిపిస్తారు. ఇప్పుడు మీకు జ్ఞానము లభించింది కావున మీరు ఈ జ్ఞానముతో దేవతలుగా అవుతారు. జ్ఞానాన్ని పొంది, ఆ తర్వాత ప్రారబ్ధాన్ని పొందుతారు. అక్కడ మళ్ళీ ఈ జ్ఞానము యొక్క అవసరము ఉండదు. అలాగని దేవతలలో ఈ జ్ఞానము లేని కారణంగా వారు అజ్ఞానులు అని కాదు. అలా కాదు, వారు ఈ జ్ఞానముతో పదవిని పొందుతారు. బాబా రండి, మేము పతితుల నుండి పావనులుగా ఎలా అవ్వాలి, అలా అయ్యేందుకు మార్గాన్ని మరియు జ్ఞానాన్ని తెలియజేయండి అని తండ్రిని పిలుస్తూ ఉంటారు ఎందుకంటే వారికి తెలియదు. ఇప్పుడు మీకు తెలుసు, ఆత్మలమైన మనము శాంతిధామము నుండి వచ్చాము. అక్కడ ఆత్మలు శాంతిగా ఉంటారు. ఇక్కడికి పాత్రను అభినయించేందుకు వచ్చారు. ఇది పాత ప్రపంచము అంటే తప్పకుండా ఒకప్పుడు కొత్త ప్రపంచము ఉండేది అని అర్థము. అది ఎప్పుడు ఉండేది, ఎవరు రాజ్యము చేసేవారు అనేది ఎవరికీ తెలియదు. ఇప్పుడు మీరు తండ్రి ద్వారా తెలుసుకున్నారు. తండ్రి జ్ఞానసాగరుడు, సద్గతిదాత. బాబా, మీరు వచ్చి మా దుఃఖాలను హరించండి, సుఖశాంతులను ఇవ్వండి అని వారినే పిలుస్తారు. ఆత్మకు తెలుసు కానీ తమోప్రధానముగా అయిపోయింది, అందుకే మళ్ళీ తండ్రి వచ్చి పరిచయాన్ని ఇస్తున్నారు. మనుష్యులకు ఆత్మ గురించి కానీ పరమాత్మ గురించి కానీ తెలియదు. పరమాత్మ అభిమానిగా అయ్యేందుకు ఆత్మకు జ్ఞానమే లేదు. ఇంతకుముందు మీకు కూడా తెలియదు. ఇప్పుడు జ్ఞానము లభించింది కావున తప్పకుండా ముఖము మనుష్యులది ఉండేది మరియు నడవడిక కోతి వలె ఉండేదని మీరు భావిస్తారు.

ఇప్పుడు తండ్రి జ్ఞానాన్ని ఇచ్చారు కావున మనము కూడా నాలెడ్జ్ ఫుల్ గా అయ్యాము. రచయిత మరియు రచనల జ్ఞానము లభించినది. మనల్ని భగవంతుడు చదివిస్తున్నారు అని మీకు తెలుసు, మరి ఎంత నషా ఉండాలి. బాబా జ్ఞానసాగరుడు, వారిలో అనంతమైన జ్ఞానము ఉంది. మీరు ఎవరి వద్దకు వెళ్ళినా - సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానము ఏమిటి, కనీసము ఆత్మ అంటే ఏమిటో కూడా తెలియదు. తండ్రిని దుఃఖహర్త సుఖకర్త అంటూ స్మృతి కూడా చేస్తారు, మళ్ళీ ఈశ్వరుడు సర్వవ్యాపి అని అనేస్తారు. తండ్రి అంటారు - డ్రామా అనుసారముగా వారి దోషము కూడా ఏమీ లేదు. మాయ పూర్తిగా తుచ్ఛబుద్ధి కలవారిగా చేస్తుంది. పురుగులకు మురికిలోనే సుఖము అనుభవమవుతుంది. మురికి నుండి బయటకు తీసేందుకు తండ్రి వస్తారు. మనుష్యులు ఊబిలో చిక్కుకుని ఉన్నారు. జ్ఞానము గురించే తెలియనప్పుడు ఏం చేయగలరు. ఊబిలో చిక్కుకుని ఉన్నారు, వారిని బయటకు తీయడము కూడా కష్టమవుతుంది. వారిని సగం-ముప్పావు బయటకు తీసినా కానీ, మళ్ళీ చేయి వదిలించుకుని పడిపోతారు. కొందరు పిల్లలు ఇతరులకు జ్ఞానాన్ని ఇస్తూ-ఇస్తూ స్వయమే మాయ చెంపదెబ్బ తింటారు ఎందుకంటే తండ్రి డైరెక్షన్లకు విరుద్ధముగా కార్యాలు చేస్తారు. ఇతరులను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తూ వారే స్వయము పడిపోతారు, మళ్ళీ వారిని బయటకు తీసేందుకు ఎంత కష్టపడవలసి వస్తుంది ఎందుకంటే వారు మాయతో ఓడిపోతారు. వారిని వారి పాపమే లోలోపల తింటూ ఉంటుంది. ఇది మాయ యొక్క యుద్ధము కదా. ఇప్పుడు మీరు యుద్ధ మైదానములో ఉన్నారు. అవి బాహుబలముతో యుద్ధము చేసే హింసాత్మకమైన సైన్యాలు. మీరు అహింసకులు. మీరు అహింస ద్వారానే రాజ్యాన్ని పొందుతారు. హింస రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి కామ ఖడ్గాన్ని ఉపయోగించడము మరియు రెండవది ఇతరులను కొట్టడము. ఇప్పుడు మీరు డబుల్ అహింసకులుగా అవుతారు. ఈ జ్ఞాన బలము యొక్క యుద్ధము గురించి ఎవరికీ తెలియదు. అహింస అని దేనిని అంటారో ఎవరికీ తెలియదు. భక్తి మార్గపు సామగ్రి ఎంత ఎక్కువ ఉంది. పతిత-పావనా రండి అని పాడుతారు కూడా, కానీ నేను వచ్చి ఏ విధముగా పావనముగా చేస్తాను అనేది ఎవరికీ తెలియదు. గీతలోనే పొరపాటు చేసారు, మనిషిని భగవంతుడు అని అనేసారు. శాస్త్రాలను మనుష్యులే తయారుచేసారు. వాటిని మనుష్యులే చదువుతారు. దేవతలు శాస్త్రాలు చదవాల్సిన అవసరము లేదు. అక్కడ శాస్త్రాలేవీ ఉండవు. జ్ఞానము, భక్తి, తర్వాత వైరాగ్యము. దేని పట్ల వైరాగ్యము? భక్తి పట్ల, పాత ప్రపంచము పట్ల వైరాగ్యము. పాత శరీరము పట్ల వైరాగ్యము. తండ్రి అంటారు, ఈ కళ్ళ ద్వారా ఏదైతే చూస్తున్నారో, అది ఉండదు. మొత్తము ఈ ఛీ-ఛీ ప్రపంచము పట్ల వైరాగ్యము. ఆ కొత్త ప్రపంచాన్ని మీరు దివ్యదృష్టి ద్వారా సాక్షాత్కారము చేస్తారు. మీరు చదువుకునేదే కొత్త ప్రపంచము కోసము. ఈ చదువు ఈ జన్మ కోసము కాదు. మిగిలిన చదువులు ఏవైతే ఉంటాయో, అవి ఆ సమయములో ఆ జన్మ కొరకే ఉంటాయి. ఇప్పుడు ఇది సంగమము కావున మీరు ఏదైతే చదువుతారో, దానికి ప్రారబ్ధము మీకు కొత్త ప్రపంచములో లభిస్తుంది. అనంతమైన తండ్రి నుండి మీకు ఎంత గొప్ప ప్రారబ్ధము మీకు లభిస్తుంది! అనంతమైన తండ్రి ద్వారా అనంతమైన సుఖము యొక్క ప్రాప్తి లభిస్తుంది. కావున పిల్లలు పూర్తిగా పురుషార్థము చేసి శ్రీమతముపై నడవాలి. తండ్రి శ్రేష్ఠాతి శ్రేష్ఠమైనవారు. వారి ద్వారా మీరు శ్రేష్ఠముగా తయారవుతారు. వారు సదా శ్రేష్ఠముగా ఉంటారు. వారు మిమ్మల్ని శ్రేష్ఠముగా తయారుచేస్తారు. 84 జన్మలు తీసుకుంటూ-తీసుకుంటూ మీరు భ్రష్టముగా తయారవుతారు. తండ్రి అంటారు - నేను జనన-మరణాలలోకి రాను. నేను ఇప్పుడు భాగ్యశాలి రథములోనే ప్రవేశిస్తాను, వారిని పిల్లలైన మీరు గుర్తించారు. ఇప్పుడు మీ వృక్షము చిన్నదిగా ఉంది. వృక్షానికి తుఫానులు కూడా వస్తాయి కదా. ఆకులు రాలిపోతూ ఉంటాయి. ఎన్నో పుష్పాలు వస్తాయి, మళ్ళీ తుఫాను వచ్చినట్లయితే అవి పడిపోతాయి. కొన్నింటికి మంచి-మంచి ఫలాలు వస్తాయి, కానీ మాయా తుఫాన్లు రావడంతో అవి పడిపోతాయి. మాయా తుఫాన్లు చాలా తీవ్రంగా ఉంటాయి. అటువైపు బాహుబలము, ఇటువైపు యోగబలము అనగా స్మృతి బలము. మీరు స్మృతి అన్న పదాన్ని పక్కా చేసుకోండి. వారు యోగము-యోగము అన్న పదము ఉపయోగిస్తూ ఉంటారు. మీరు చేసేది స్మృతి. మీరు నడుస్తూ-తిరుగుతూ తండ్రిని స్మృతి చేస్తారు, దీనిని యోగము అని అనరు. యోగము అన్న పదము సన్యాసులకు సంబంధించినది, అది చాలా ప్రసిద్ధమైనది. వారు అనేక రకాల యోగాలను నేర్పిస్తారు. తండ్రి ఎంత సహజముగా తెలియజేస్తారు - లేస్తూ-కూర్చుంటూ, నడుస్తూ-తిరుగుతూ తండ్రిని స్మృతి చేయండి. మీరు అర్ధకల్పపు ప్రేయసులు. మీరు నన్ను స్మృతి చేస్తూ వచ్చారు. ఇప్పుడు నేను వచ్చాను. ఆత్మ గురించి ఎవరికీ తెలియదు అందుకే తండ్రి వచ్చి రియలైజ్ (అనుభూతి) చేయిస్తారు. ఇవి కూడా అర్థం చేసుకోవలసిన చాలా సూక్ష్మమైన విషయాలు. ఆత్మ అతి సూక్ష్మమైనది మరియు అవినాశీ. ఆత్మ వినాశనము అవ్వదు, అలాగే ఆత్మలో నిండిన పాత్ర కూడా వినాశనమవ్వదు. ఈ విషయాలను మందబుద్ధి కలవారు కష్టముగా అర్థం చేసుకుంటారు. శాస్త్రాలలో కూడా ఈ విషయాలు లేవు.

పిల్లలైన మీరు తండ్రిని స్మృతి చేయడానికి చాలా కృషి చేయవలసి వస్తుంది. జ్ఞానమైతే చాలా సహజము. వినాశకాలే ప్రీతి బుద్ధి మరియు విపరీత బుద్ధి అని స్మృతి గురించే అనడం జరుగుతుంది. స్మృతి బాగుంటే ప్రీతి బుద్ధి అని అంటారు. ప్రీతి కూడా అవ్యభిచారిగా ఉండాలి. నేను బాబాను ఎంత స్మృతి చేస్తున్నాను అని స్వయాన్ని ప్రశ్నించుకోవాలి. బాబాతో ప్రీతిని జోడిస్తూ-జోడిస్తూ ఎప్పుడైతే కర్మాతీత అవస్థ ఏర్పడుతుందో, అప్పుడు ఈ శరీరాన్ని విడిచిపెడతాము మరియు యుద్ధము జరుగుతుంది అని అర్థం చేసుకుంటారు. ఎంతగా తండ్రి పట్ల ప్రీతి ఉంటుందో, అంతగా తమోప్రధానము నుండి సతోప్రధానముగా అవుతారు. పరీక్ష ఒకేసారి ఉంటుంది కదా. ఎప్పుడైతే సమయము పూర్తవుతుందో, అందరి బుద్ధి ప్రీతి బుద్ధిగా అవుతుందో, ఆ సమయములో వినాశనము జరుగుతుంది. అప్పటివరకూ గొడవలు మొదలైనవి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మృత్యువు ఎదురుగా ఉందని, ఎవరో ప్రేరేపిస్తున్నారు, మా ద్వారా బాంబులు తయారుచేయిస్తున్నారు అని విదేశాల వారు కూడా భావిస్తారు. కానీ ఏం చేయగలరు. డ్రామాలో నిశ్చయించబడి ఉంది కదా. వారి యొక్క విజ్ఞాన బలముతోనే వారి కులానికి మృత్యువును తీసుకొస్తారు. పావన ప్రపంచములోకి తీసుకువెళ్ళండి అని పిల్లలు అంటారు, మరి శరీరాలను ఏమైనా తీసుకువెళ్తారా. తండ్రి కాలుడికే కాలుడు కదా. ఈ విషయాలు ఎవరికీ తెలియవు. వేటగానికి వేట, వేటకు మృత్యువు అని అంటూ ఉంటారు కదా. వినాశనము ఆగిపోవాలి, శాంతి ఏర్పడాలి అని వారంటారు. అరే, వినాశనం జరగకుండా సుఖశాంతులు ఎలా స్థాపనవుతాయి, అందుకే చక్రము గురించి తప్పకుండా అర్థం చేయించాలి. ఇప్పుడు స్వర్గ ద్వారాలు తెరుచుకుంటున్నాయి. గేట్ వే టు శాంతిధామ్-సుఖధామ్ (శాంతిధామమునకు మరియు సుఖధామమునకు ద్వారము) అన్నదానిపై కూడా ఒక పుస్తకాన్ని ముద్రించండి అని బాబా అన్నారు. దీని అర్థాన్ని కూడా వారు అర్థం చేసుకోరు. వాస్తవానికి ఇది చాలా సహజము, కానీ కోట్లలో ఏ ఒక్కరో అర్థం చేసుకుంటారు. మీరు ప్రదర్శనీలు మొదలైనవాటిలో ఎప్పుడూ నిరాశపడకూడదు. ప్రజలైతే తయారవుతారు కదా. గమ్యము పెద్దది, ఇందులో శ్రమించవలసి ఉంటుంది. స్మృతిలోనే శ్రమ ఉంటుంది. అందులో చాలా మంది ఫెయిల్ అవుతారు. స్మృతి కూడా అవ్యభిచారిగా ఉండాలి. మాయ ఘడియ-ఘడియ మరపింపజేస్తుంది. శ్రమించకుండా ఎవరూ విశ్వానికి యజమానులుగా అవ్వలేరు. పూర్తి పురుషార్థము చేయాలి - మేము సుఖధామానికి యజమానులుగా ఉండేవారము. అనేక సార్లు చక్రములో తిరిగాము. ఇప్పుడు తండ్రిని స్మృతి చేయాలి. మాయ చాలా విఘ్నాలను కలిగిస్తుంది. బాబా వద్దకు సేవా సమాచారాలు కూడా వస్తాయి. ఈ రోజు విద్వాంసుల మండలి వారికి అర్థం చేయించాము, ఈ రోజు ఇది చేసాము... అని. డ్రామానుసారముగా మాతల పేరు ప్రసిద్ధమవ్వాలి. మాతలను ముందుంచాలి అన్న ఆలోచనను పిల్లలైన మీరు కలిగి ఉండాలి. ఇది చైతన్య దిల్వాడా మందిరము. మీరు చైతన్యముగా తయారవుతారు, తర్వాత మీరు రాజ్యము చేస్తూ ఉంటారు. భక్తి మార్గపు మందిరాలు మొదలైనవేవీ ఉండవు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఒక్క తండ్రిపై అవ్యభిచారీ ప్రీతిని ఉంచుతూ-ఉంచుతూ కర్మాతీత అవస్థను పొందాలి. ఈ పాత దేహము మరియు పాత ప్రపంచము పట్ల అనంతమైన వైరాగ్యము ఉండాలి.

2. ఏ కర్తవ్యము కూడా తండ్రి డైరెక్షన్లకు విరుద్ధముగా చేయకూడదు. యుద్ధ మైదానములో ఎప్పుడూ ఓడిపోకూడదు. డబుల్ అహింసకులుగా అవ్వాలి.

వరదానము:-
శుభభావనతో సేవ చేసే తండ్రి సమానమైన అపకారులపై కూడా ఉపకారీ భవ

ఏ విధంగా తండ్రి అపకారులపై ఉపకారము చేస్తారో, అలా మీ ఎదురుగా ఎటువంటి ఆత్మ ఉన్నా కానీ మీ దయార్ద్ర వృత్తి ద్వారా, శుభభావన ద్వారా వారిని పరివర్తన చేయండి - ఇదే సత్యమైన సేవ. ఏ విధంగా సైన్స్ వారు ఇసుకలో కూడా పంటలు పండిస్తారో, అలా సైలెన్స్ శక్తితో దయార్ద్రహృదయులుగా అయి అపకారులపై కూడా ఉపకారము చేసి ధరణిని పరివర్తన చేయండి. స్వ పరివర్తన ద్వారా, శుభభావన ద్వారా ఎటువంటి ఆత్మ అయినా పరివర్తన అయిపోతుంది, ఎందుకంటే శుభభావన తప్పకుండా సఫలతను ప్రాప్తింపజేయిస్తుంది.

స్లోగన్:-
జ్ఞాన స్మరణ చేయడమే సదా హర్షితంగా ఉండేందుకు ఆధారము.

అవ్యక్త సూచనలు - ఆత్మిక రాయల్టీని మరియు పవిత్రత యొక్క పర్సనాలిటీని ధారణ చెయ్యండి

బ్రాహ్మణులైన మీ వంటి ఆత్మిక పర్సనాలిటీ మొత్తము కల్పములో మరెవ్వరికీ లేదు ఎందుకంటే మీ అందరి పర్సనాలిటీని తయారుచేసేవారు స్వయంగా ఉన్నతోన్నతమైన పరమాత్మ. మీ యొక్క అతి పెద్ద పర్సనాలిటీ - స్వప్నము మరియు సంకల్పములో కూడా సంపూర్ణ పవిత్రత. ఈ పవిత్రతతోపాటు ముఖము మరియు నడవడికలో ఆత్మికతతో కూడిన పర్సనాలిటీ కూడా ఉంది - మీ ఈ పర్సనాలిటీలో సదా స్థితులై ఉన్నట్లయితే సేవ స్వతహాగానే జరుగుతుంది.