20-07-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మాయా రావణుడి సాంగత్యములోకి వచ్చి మీరు భ్రమించడం మొదలుపెట్టారు, పవిత్రమైన మొక్కలు అపవిత్రముగా అయ్యాయి, ఇప్పుడు మళ్ళీ పవిత్రముగా అవ్వండి’’

ప్రశ్న:-
పిల్లలు ప్రతి ఒక్కరికీ తమపై తమకు ఏ ఆశ్చర్యము కలుగుతుంది? తండ్రికి పిల్లల విషయములో ఏ ఆశ్చర్యము కలుగుతుంది?

జవాబు:-
పిల్లలకు ఏం ఆశ్చర్యమనిపిస్తుందంటే - మేము ఎలా ఉండేవారము, ఎవరి పిల్లలుగా ఉండేవారము, ఎటువంటి తండ్రి వారసత్వము మాకు లభించింది, ఆ తండ్రినే మేము మరచిపోయామే! రావణుడు వచ్చాడు, ఎంతటి పొగమంచు వచ్చేసిందంటే ఇక దానితో రచయిత మరియు రచన, అంతటినీ మర్చిపోయాము. తండ్రికి పిల్లల విషయములో ఏం ఆశ్చర్యమనిపిస్తుందంటే - ఏ పిల్లలనైతే నేను ఇంత ఉన్నతముగా తయారుచేసానో, రాజ్యభాగ్యాన్ని ఇచ్చానో, ఆ పిల్లలే నన్ను గ్లాని చేయడం మొదలుపెట్టారు. రావణుడి సాంగత్యములోకి వచ్చి అంతా పోగొట్టుకున్నారు.

ఓంశాంతి
ఏమి ఆలోచిస్తున్నారు? నంబరువారు పురుషార్థానుసారముగా ప్రతి ఒక్కరి జీవాత్మ ఇప్పుడు తనను చూసి తానే ఆశ్చర్యపోతోంది - మేము ఎలా ఉండేవారము, ఎవరి పిల్లలుగా ఉండేవారము, తప్పకుండా తండ్రి నుండి వారసత్వము లభించింది, మళ్ళీ ఎలా మేము మర్చిపోయాము! మనము సతోప్రధాన ప్రపంచములో మొత్తం విశ్వానికి యజమానులుగా ఉండేవారము, చాలా సుఖంగా ఉండేవారము. ఆ తర్వాత మనము మెట్లు దిగాము. రావణుడు వచ్చాడు, దానితో ఎంతటి పొగమంచు వచ్చేసిందంటే ఇక రచయితను మరియు రచనను మర్చిపోయాము. పొగమంచులో మనుష్యులు దారి మొదలైనవి మర్చిపోతారు కదా. అలాగే మనం కూడా - మన ఇల్లు ఎక్కడ ఉంది, మనం ఎక్కడి నివాసులము అనేది మర్చిపోయాము. ఇప్పుడు బాబా చూస్తున్నారు - నా పిల్లలు ఎవరికైతే నేను నేటికి 5000 సంవత్సరాల క్రితం రాజ్యభాగ్యాన్ని ఇచ్చి వెళ్ళానో, ఎవరైతే ఎంతో ఆనందములో, సుఖములో ఉండేవారో, వారు ఉన్న ఆ భూమిపై ఇప్పుడు ఏమైపోయింది! ఎలా రావణుని రాజ్యములోకి వచ్చేసారు! పరాయి రాజ్యములోనైతే తప్పకుండా దుఃఖమే లభిస్తుంది. మీరు ఎంతగా భ్రమించారు! అంధవిశ్వాసముతో తండ్రిని వెతుకుతూ వచ్చారు కానీ వారు ఎక్కడ లభించారు. ఎవరినైతే రాయి-రప్పల్లో వేసేసారో, వారు ఎలా లభించగలరు. అర్ధకల్పం మీరు భ్రమిస్తూ, భ్రమిస్తూ అలసిపోయారు. మీ అజ్ఞానము కారణముగానే రావణ రాజ్యములో మీరు ఎంత దుఃఖాన్ని పొందారు. భారత్ భక్తి మార్గములో ఎంత నిరుపేదగా అయ్యింది. తండ్రి పిల్లల వైపుకు చూస్తే - వీరు భక్తి మార్గములో ఎంతగా భ్రమించారు అన్న ఆలోచన కలుగుతుంది. అర్ధకల్పం భక్తి చేసారు, దేని కోసము? భగవంతుడిని కలుసుకునేందుకు. భక్తి తర్వాతనే భగవంతుడు ఫలాన్ని ఇస్తారు. ఏమిస్తారు? అది ఎవ్వరికీ తెలియదు, పూర్తిగా తెలివితక్కువవారిగా అయిపోయారు. ఈ విషయాలన్నీ బుద్ధిలోకి రావాలి - మనం ఎలా ఉండేవారము, మళ్ళీ ఎలా రాజ్యము చేసేవారము, మళ్ళీ ఎలా మెట్లు దిగుతూ, దిగుతూ రావణుని సంకెళ్ళలో చిక్కుకుపోతూ వచ్చాము. అపారమైన దుఃఖాలు ఉండేవి. మొట్టమొదట మీరు అపారమైన సుఖములో ఉండేవారు. మన రాజ్యములో ఎంత సుఖము ఉండేది, మళ్ళీ పరాయి రాజ్యములో ఎంత దుఃఖాన్ని పొందాము అని మనస్సులోకి రావాలి. ఆంగ్లేయుల రాజ్యములో మేము దుఃఖాన్ని పొందాము అని వారు భావిస్తారు. ఇప్పుడు మీరు కూర్చొన్నారు. మేము ఎవరము? ఎవరి సంతానము? అన్న ఆలోచన లోపల రావాలి. తండ్రి మనకు మొత్తం విశ్వము యొక్క రాజ్యాన్ని ఇచ్చారు, మళ్ళీ మనం ఏ విధంగా ఈ రావణ రాజ్యంలో చిక్కుకుపోయాము, ఎన్ని దుఃఖాలను చూసాము, ఎన్ని అశుద్ధమైన పనులు చేసాము? సృష్టి రోజురోజుకు కిందకు దిగజారుతూనే వచ్చింది. మనుష్యుల సంస్కారాలు రోజురోజుకు వికారీగానే అవుతూ వచ్చాయి. కావున పిల్లలకు ఇవి స్మృతిలోకి రావాలి. తండ్రి చూస్తుంటారు - వీరు పవిత్రమైన మొక్కలుగా ఉండేవారు, ఎవరికైతే రాజ్య భాగ్యాన్ని ఇచ్చానో వారు మళ్ళీ నా కర్తవ్యాన్నే మర్చిపోయారు. ఇప్పుడు మీరు మళ్ళీ తమోప్రధానము నుండి సతోప్రధానముగా అవ్వాలనుకుంటే తండ్రినైన నన్ను స్మృతి చేయండి, అప్పుడు అన్ని పాపాలూ అంతమైపోతాయి. కానీ స్మృతి కూడా చేయలేరు. బాబా, మేము మర్చిపోతున్నాము అని ఘడియ, ఘడియ అంటారు. అరే, మీరు స్మృతి చేయకపోతే పాపాలు ఎలా అంతమవుతాయి? ఒకటేమో, మీరు వికారాలలో పడి పతితులుగా అయ్యారు, ఇంకొకటి తండ్రిని గ్లాని చేయడం మొదలుపెట్టారు. మాయ సాంగత్యములో మీరు ఎంతగా దిగజారిపోయారంటే, ఇక ఎవరైతే మిమ్మల్ని ఆకాశములోకి ఎక్కించారో వారిని రాయి-రప్పల్లో పడేశారు. మాయ సాంగత్యములో మీరు ఇటువంటి పనులు చేసారు! బుద్ధిలోకి అయితే రావాలి కదా. పూర్తిగా రాతిబుద్ధి కలవారిగా అయితే అవ్వకూడదు. నేను ఫస్ట్ క్లాస్ పాయింట్లను మీకు వినిపిస్తాను అని తండ్రి ప్రతిరోజూ చెప్తూ ఉంటారు.

బొంబాయిలో మీటింగ్ జరిగింది కదా, అక్కడ ఇలా చెప్పవచ్చు - తండ్రి చెప్తున్నారు, ఓ భారత వాసుల్లారా, మీకు నేను రాజ్యభాగాన్ని ఇచ్చాను, దేవతలైన మీరు స్వర్గములో ఉండేవారు, మళ్ళీ మీరు రావణ రాజ్యములోకి ఎలా వచ్చారు, ఇది కూడా డ్రామాలోని పాత్ర. మీరు రచయిత మరియు రచనల ఆదిమధ్యాంతాలను అర్థం చేసుకున్నట్లయితే ఉన్నత పదవిని పొందగలుగుతారు. మరియు నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి. ఇక్కడ అందరూ కూర్చునే ఉన్నా, ఒక్కొక్కరి బుద్ధి ఒక్కొక్క వైపుకు వెళ్తుంది. బుద్ధిలోకి రావాలి - మేము ఎక్కడ ఉండేవారము, ఇప్పుడు మేము పరాయి రాజ్యములోకి వచ్చి పడ్డాము కావున ఎంత దుఃఖితులుగా అయ్యాము, మేము శివాలయములో చాలా సుఖంగా ఉండేవారము. ఇప్పుడు తండ్రి వేశ్యాలయము నుండి బయటకు తీయడానికి వచ్చారు, అయినా కానీ బయటకు రారు. తండ్రి అంటారు, మీరు శివాలయములోకి వెళ్ళాక ఇక అక్కడ ఈ విషము లభించదు, ఇక్కడి అశుద్ధమైన అన్నపానాదులు అక్కడ లభించవు. వీరు విశ్వాధిపతులుగా ఉండేవారు కదా, మరి వారేమయ్యారు? వీరు మళ్ళీ తమ రాజ్య భాగ్యాన్ని తీసుకుంటున్నారు. ఇది ఎంత సహజము. తండ్రి అర్థం చేయిస్తున్నారు - అందరూ సేవాధారులుగా అవ్వరు. నంబరువారుగా 5000 సంవత్సరాల క్రితం చేసినట్లుగా రాజధానిని స్థాపన చేయాలి. సతోప్రధానముగా అవ్వాలి, ఇది తమోప్రధానమైన పాత ప్రపంచము అని తండ్రి అంటారు. ఇది ఖచ్చితముగా ఎప్పుడైతే పాతబడుతుందో అప్పుడే తండ్రి వస్తారు కదా. తండ్రి తప్ప దీనిని ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు. భగవంతుడు ఈ రథము ద్వారా మనల్ని చదివిస్తున్నారు, ఇది గుర్తున్నా సరే బుద్ధిలో జ్ఞానము ఉంటుంది. ఆ తర్వాత ఇతరులకు తెలియజేసి మీ సమానముగా కూడా తయారుచేయాలి. తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఇంతకుముందైతే మీవి క్రిమినల్ క్యారెక్టర్స్ వలె ఉండేవి, అవి కష్టం మీద బాగుపడతాయి. కళ్ళ యొక్క వికారీతనము తొలగదు. ఒకటేమో కామము యొక్క వికారీతనము, అది కష్టం మీద తొలగుతుంది, దానితోపాటు 5 వికారాలు ఉన్నాయి. క్రోధము యొక్క వికారీతనము కూడా ఎంతగా ఉంది. ఉన్నట్టుండి భూతము వచ్చేస్తుంది. అది కూడా వికారీతనమే. నిర్వికారీ దృష్టి కలవారిగానైతే అవ్వలేదు. ఫలితం ఏమవుతుంది? 100 రెట్లు పాపం పెరిగిపోతుంది. ఘడియ-ఘడియ క్రోధం చేస్తూ ఉంటారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - మీరు ఇప్పుడు రావణ రాజ్యములోనైతే లేరు కదా. మీరైతే ఈశ్వరుని వద్ద కూర్చున్నారు. కావున ఈ వికారాల నుండి విముక్తులయ్యేందుకు ప్రతిజ్ఞ చేయాలి. తండ్రి అంటున్నారు - ఇప్పుడు నన్ను స్మృతి చేయండి, క్రోధం చేయకండి. పంచ వికారాలు మిమ్మల్ని అర్ధకల్పం కిందకు దిగజారుస్తూనే వచ్చాయి. అందరికన్నా ఉన్నతమైనవారిగా కూడా మీరే ఉండేవారు, అందరికన్నా ఎక్కువగా పడిపోయింది కూడా మీరే. ఈ 5 భూతాలూ మిమ్మల్ని పడేసాయి. ఇప్పుడు శివాలయములోకి వెళ్ళేందుకు ఈ వికారాలను తొలగించాలి. ఈ వేశ్యాలయము నుండి మనస్సును తొలగిస్తూ ఉండండి. తండ్రిని స్మృతి చేసినట్లయితే అంతమతిని బట్టి గతి ఏర్పడుతుంది, మీరు ఇంటికి చేరుకుంటారు. ఇంకెవ్వరూ ఈ దారిని తెలియజేయలేరు. భగవానువాచ - నేను సర్వవ్యాపినని నేను ఎప్పుడూ చెప్పలేదు, నేనైతే రాజయోగాన్ని నేర్పించాను మరియు మిమ్మల్ని విశ్వాధిపతులుగా తయారుచేస్తాను అని చెప్పాను, అక్కడైతే ఈ జ్ఞానం యొక్క అవసరమే ఉండదు. మనుష్యుల నుండి దేవతలుగా అయిపోతారు, మీరు వారసత్వాన్ని పొందుతారు. ఇందులో హఠయోగము మొదలైనవాటి విషయమే లేదు. స్వయాన్ని ఆత్మగా భావించండి, స్వయాన్ని శరీరముగా ఎందుకు భావిస్తున్నారు. శరీరముగా భావించడం ద్వారా ఇక జ్ఞానాన్ని తీసుకోలేరు. ఇది కూడా డ్రామా రాత. మేము రావణ రాజ్యములో ఉండేవారము, ఇప్పుడు రామ రాజ్యములోకి వెళ్ళేందుకు పురుషార్థము చేస్తున్నాము అని మీరు భావిస్తారు. ఇప్పుడు మనం పురుషోత్తమ సంగమయుగవాసులము.

గృహస్థములో ఉండండి, ఇంతమంది ఇక్కడ ఎలా ఉండగలరు. బ్రాహ్మణులుగా అయి అందరూ ఇక్కడ బ్రహ్మా వద్ద కూడా ఉండలేరు. మీ ఇళ్ళల్లోనే ఉండాలి మరియు బుద్ధి ద్వారా - మేము శూద్రులము కాము, బ్రాహ్మణులము అని భావించాలి. బ్రాహ్మణుల పిలక ఎంత చిన్ననిది. కావున గృహస్థములో ఉంటూ, శరీర నిర్వహణ కొరకు వ్యాపారాలు మొదలైనవి చేసుకుంటూ, కేవలం తండ్రిని స్మృతి చేయండి. మనం ఎలా ఉండేవారము, ఇప్పుడు మనం పరాయి రాజ్యములో కూర్చున్నాము. మనం ఎంత దుఃఖితులుగా ఉండేవారము. ఇప్పుడు బాబా మనల్ని మళ్ళీ తీసుకువెళ్తారు కావున గృహస్థ వ్యవహారములో ఉంటూ ఆ అవస్థను తయారుచేసుకోవాలి. మొదట్లో ఎన్ని పెద్ద-పెద్ద వృక్షాలు వచ్చాయి, అందులో కొన్ని ఉన్నాయి, మిగిలినవి వెళ్ళిపోయాయి. మేము మా రాజ్యములో ఉండేవారము, ఇప్పుడు ఎక్కడకు వచ్చి పడ్డాము అని మీ బుద్ధిలో ఉంది. మళ్ళీ మన రాజ్యములోకి వెళ్తాము. బాబా, ఫలానావారు చాలా బాగా రెగ్యులర్ గా ఉండేవారు, ఇప్పుడు రావడం లేదు అని మీరు వ్రాస్తారు. రావడం లేదంటే వికారాల్లో పడిపోయారు. ఇక జ్ఞాన ధారణ జరగదు. ఉన్నతికి బదులుగా పడిపోతూ-పడిపోతూ పైసకు కొరగాని పదవిని పొందుతారు. రాజు ఎక్కడ, నీచ పదవి ఎక్కడ! సుఖమైతే అక్కడ ఉండనే ఉంటుంది కానీ ఉన్నత పదవిని పొందేందుకు పురుషార్థం చేయడం జరుగుతుంది. ఉన్నత పదవిని ఎవరు పొందగలరు? ఇదైతే అందరూ అర్థం చేసుకోగలరు, ఇప్పుడు అందరూ పురుషార్థం చేస్తున్నారు. భోపాల్ యొక్క రాజు మహేంద్ర కూడా పురుషార్థం చేస్తున్నారు. ఆ రాజులైతే పైసకు కొరగానివారు. వీరైతే సూర్యవంశీ రాజధానిలోకి వెళ్ళనున్నారు. పురుషార్థము ఎలా ఉండాలంటే, దాని ద్వారా విజయమాలలోకి వెళ్ళగలగాలి. తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు - మీ హృదయములో చెక్ చేసుకుంటూ ఉండండి - నా కళ్ళు ఎక్కడా వికారీగా అవ్వడం లేదు కదా? ఒకవేళ అవి నిర్వికారిగా అయినట్లయితే ఇంకేమి కావాలి. వికారాలలోకి వెళ్ళకపోయినా సరే కళ్ళు ఎంతో కొంత మోసగిస్తూనే ఉంటాయి. నెంబర్ వన్ కామము, వికారీ దృష్టి చాలా చెడ్డది, అందుకే క్రిమినల్ ఐ, సివిల్ ఐ (వికారీ దృష్టి, నిర్వికారీ దృష్టి) అన్న పేరు ఉంది. అనంతమైన తండ్రికి పిల్లలు గురించి తెలుసు కదా - వీరు ఎటువంటి కర్మలు చేస్తున్నారు, ఎంత సేవను చేస్తున్నారు, ఫలానా వారి వికారీ దృష్టి ఇంకా పోలేదు... అని ఇప్పటివరకూ ఇటువంటి గుప్తమైన సమాచారాలు వస్తూ ఉంటాయి. మున్ముందు ఇంకా ఏక్యురేట్ గా వ్రాస్తారు. స్వయమూ ఫీల్ అవుతారు - మేము ఇంతకాలమూ అబద్ధాలు చెప్తూ ఇంకా పడిపోతూనే వచ్చాము, జ్ఞానము పూర్తిగా బుద్ధిలో కూర్చోలేదు, ఈ కారణము వలనే మా అవస్థ తయారవ్వలేదు, తండ్రి నుండి మేము దాచేవారము అని ఫీల్ అవుతారు. ఇలా ఎంతోమంది దాస్తూ ఉంటారు. సర్జన్ వద్ద పంచ వికారాల రోగాన్ని దాచకూడదు. మా బుద్ధి ఇటువైపుకు వెళ్తుంది, శివబాబా వైపుకు వెళ్ళడం లేదు అని నిజము చెప్పాలి. అలా చెప్పకపోతే అది వృద్ధి చెందుతూ ఉంటుంది. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు - పిల్లలూ, దేహీ-అభిమానులుగా అవ్వండి, స్వయాన్ని ఆత్మగా భావించండి. ఆత్మలు పరస్పరం సోదరులు. మీరు పూజ్యులుగా ఉన్నప్పుడు ఎంత సుఖవంతులుగా ఉండేవారు. ఇప్పుడు మీరు పూజారులుగా, దుఃఖితులుగా అయ్యారు. మీకు ఏమయ్యింది! అందరూ ఏమంటారంటే - ఈ గృహస్థ ఆశ్రమము పరంపరగా కొనసాగుతూ వచ్చింది, సీతా-రాములకు పిల్లలు లేరా ఏమిటి! కానీ అక్కడ పిల్లలు వికారాల ద్వారా జన్మించరు. అరే, అది సంపూర్ణ నిర్వికారీ ప్రపంచము. అక్కడ భ్రష్టాచారము ద్వారా జన్మ జరగదు, అక్కడ వికారాలు ఉండేవి కావు. అక్కడ ఈ రావణ రాజ్యమే ఉండదు, అది రామ రాజ్యము. అక్కడకు రావణుడు ఎక్కడ నుండి వచ్చాడు. మనుష్యుల బుద్ధి పూర్తిగా నష్టములోకి వెళ్ళిపోయింది. అలా ఎవరు చేసారు? నేను మిమ్మల్ని సతోప్రధానముగా తయారుచేసాను, మీ నావను తీరానికి చేర్చాను, మళ్ళీ మిమ్మల్ని తమోప్రధానముగా ఎవరు చేసారు? రావణుడు. ఇది కూడా మీరు మర్చిపోయారు. ఇదైతే పరంపరగా నడుస్తూ వస్తుంది అని అంటారు. అరే, పరంపర అన్నది కూడా ఎప్పటి నుండి? ఏదైనా లెక్క అయితే చెప్పండి. ఏమీ అర్థం చేసుకోరు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - మీకు ఎంతటి రాజ్య భాగ్యాన్ని ఇచ్చి వెళ్ళాను. భారతవాసులైన మీరు చాలా సంతోషముగా ఉండేవారు, అప్పుడు ఇంకెవ్వరూ ఉండేవారు కారు. క్రిస్టియన్లు కూడా ప్యారడైజ్ ఉండేది అని అంటారు, దేవతల చిత్రాలు కూడా ఉన్నాయి, వాటికన్నా పాత వస్తువు ఇంకేదీ లేదు. అతి పాతవారు ఈ లక్ష్మీ-నారాయణులు లేక వారి వస్తువులు. అందరికన్నా పాతవారు శ్రీకృష్ణుడు, అలాగే అందరికన్నా కొత్తవారు కూడా శ్రీకృష్ణుడే. పాతవారు అని ఎందుకు అంటారు? ఎందుకంటే అది గతించిపోయింది కదా. మీరే తెల్లగా ఉండేవారు, మళ్ళీ నల్లగా అయ్యారు. నల్లని కృష్ణుడిని చూసి కూడా ఎంతో సంతోషిస్తారు. ఊయలలో కూడా నల్లవాడినే ఊపుతారు. అతను ఎప్పుడు తెల్లగా ఉండేవారో వారికేమి తెలుసు. కృష్ణుడిని ఎంతగా ప్రేమిస్తారు! మరి రాధ ఏమి చేసారు?

తండ్రి అంటున్నారు - మీరు ఇక్కడ సత్యమైనవారి సాంగత్యములో కూర్చున్నారు, బయటకు చెడు సాంగత్యములోకి వెళ్ళడంతో మళ్ళీ మర్చిపోతారు. మాయ చాలా ప్రబలమైనది, ఏనుగును మొసలి మింగేస్తుంది. ఇప్పటికి ఇప్పుడు వెళ్ళిపోయేవారు కూడా ఉన్నారు. కొద్దిగా తమ అహంకారము వచ్చినా ఇంకా సర్వనాశనం చేసుకుంటారు. అనంతమైన తండ్రి అయితే అర్థం చేయిస్తూనే ఉంటారు. ఇందులో బాధపడకూడదు. బాబా ఇలా ఎందుకు అన్నారు, మా పరువు పోయింది! అని అనుకోకూడదు. అరే, పరువు అయితే రావణ రాజ్యములోనే పోయింది కదా. దేహాభిమానములోకి రావడం వలన స్వయాన్ని స్వయమే నష్టపరచుకుంటారు, పదవి భ్రష్టమైపోతుంది. క్రోధము, లోభము కూడా అశుద్ధ దృష్టియే. కళ్ళతో ఏదైనా వస్తువును చూసినప్పుడే లోభము కలుగుతుంది.

తండ్రి వచ్చి తమ తోటలో ఏయే రకాల పుష్పాలు ఉన్నాయో చూస్తారు. ఇక్కడి నుండి వెళ్ళి మళ్ళీ ఆ తోటలోని పుష్పాలను చూస్తారు. శివబాబాకు పుష్పాలను కూడా తప్పకుండా అర్పిస్తారు. వారు నిరాకారుడు, చైతన్య పుష్పము. మీరు ఇప్పుడు పురుషార్థము చేసి ఇటువంటి పుష్పముగా అవుతారు. బాబా అంటారు - మధురాతి మధురమైన పిల్లలూ, ఏదైతే గతించిందో దానిని డ్రామాగా భావించండి, దాని గురించి ఆలోచించకండి. ఎంతగా కష్టపడతాము, కానీ ఏమీ జరగడం లేదు, ఎవ్వరూ నిలవడం లేదు అని అంటారు. అరే, ప్రజలు కూడా కావాలి కదా. కొద్దిగా విన్నా, వారు ప్రజలుగా అయిపోతారు. ప్రజలైతే చాలా మంది తయారవ్వనున్నారు. జ్ఞానము ఎప్పుడూ వినాశనమవ్వదు. వీరు శివబాబా అని ఒక్కసారి విన్నా చాలు, ప్రజల్లోకి వచ్చేస్తారు. మేము ఏ రాజ్యములోనైతే ఉండేవారమో, దానిని ఇప్పుడు మళ్ళీ పొందుతున్నాము అన్న స్మృతి మీకు లోపల ఉండాలి, దాని కోసం పూర్తి పురుషార్థము చేయాలి, పూర్తిగా ఏక్యురేట్ సేవ జరుగుతోంది. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. శివాలయములోకి వెళ్ళేందుకు ఈ వికారాలను తొలగించాలి. ఈ వేశ్యాలయము నుండి మనుసును తొలగించుకుంటూ వెళ్ళాలి. శూద్రుల సాంగత్యము నుండి పక్కకు తప్పుకోవాలి.

2. ఏదైతే గతించిందో దానిని డ్రామాగా భావిస్తూ ఏమీ ఆలోచించకూడదు. అహంకారములోకి ఎప్పుడూ రాకూడదు. ఎప్పుడైనా శిక్షణ లభిస్తే బాధపడకూడదు.

వరదానము:-

సంతోషాల ఖజానాతో సంపన్నంగా అయి దుఃఖిత ఆత్మలకు సంతోషము యొక్క దానాన్ని ఇచ్చే పుణ్య ఆత్మా భవ

ఈ సమయములో ప్రపంచములో అన్నివేళలా దుఃఖము ఉంది మరియు మీ వద్ద అన్నివేళలా సంతోషము ఉంది. కావున దుఃఖిత ఆత్మలకు సంతోషాన్ని ఇవ్వడం - ఇది అన్నింటికన్నా అతి పెద్ద పుణ్యము. ప్రపంచములోనివారు సంతోషం కోసం ఎంత సమయాన్ని, సంపదను ఖర్చు చేస్తారు మరియు మీకు సహజముగా అవినాశీ సంతోషము యొక్క ఖజానా లభించింది. ఇప్పుడు కేవలం ఏదైతే లభించిందో దానిని పంచుతూ వెళ్ళండి. పంచడము అనగా పెరగడము. మీ సంబంధములోకి ఎవరు వచ్చినా, వారు ఏం అనుభవం చేయాలంటే - వీరికి ఏదో శ్రేష్ఠ ప్రాప్తి లభించింది, అందుకే వీరికి సంతోషము ఉంది అని.

స్లోగన్:-

అనుభవీ ఆత్మ ఎప్పుడూ ఏ విషయములోనూ మోసపోలేరు, వారు సదా విజయులుగా ఉంటారు.