20-09-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - పాత భక్తులైన మీకు భక్తి ఫలాన్ని ఇచ్చేందుకు తండ్రి వచ్చారు. భక్తికి ఫలము జ్ఞానము, దీనితోనే మీకు సద్గతి లభిస్తుంది’’

ప్రశ్న:-
కొంతమంది పిల్లలు నడుస్తూ-నడుస్తూ తమ భాగ్యాన్ని తామే షూట్ చేసుకుంటారు (కాల్చేసుకుంటారు), ఎలా?

జవాబు:-
ఒకవేళ తండ్రికి చెందినవారిగా అయి సేవ చేయకపోతే, స్వయంపై మరియు ఇతరులపై దయ చూపించకపోతే, వారు తమ భాగ్యాన్ని తామే షూట్ చేసుకుంటారు అనగా పదభ్రష్టులైపోతారు. బాగా చదువుకుని, యోగములో ఉన్నట్లయితే పదవి కూడా మంచిది లభిస్తుంది. సర్వీసబుల్ పిల్లలకైతే సేవ పట్ల చాలా అభిరుచి ఉండాలి.

పాట:-
ఈ రోజు ఉదయముదయమే ఎవరు వచ్చారు...

ఓంశాంతి
నేను ఆత్మను, అంతేకానీ శరీరము కాదు అని ఆత్మిక పిల్లలు అర్థం చేసుకున్నారు. మరియు పరమపిత పరమాత్మ నుండి ఈ జ్ఞానము ఇప్పుడే లభిస్తుంది. నేను వచ్చాను కావున మీరు స్వయాన్ని ఆత్మగా నిశ్చయము చేసుకోండి అని తండ్రి చెప్తున్నారు. ఆత్మయే శరీరములోకి ప్రవేశిస్తుంది. ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటూ ఉంటుంది. ఆత్మ మారదు, శరీరము మారుతుంది. ఆత్మ అయితే అవినాశీ, కావున స్వయాన్ని ఆత్మగా భావించాలి. ఈ జ్ఞానాన్ని ఎప్పుడూ ఎవ్వరూ ఇవ్వలేరు. తండ్రి పిల్లల పిలుపుపై వచ్చారు. ఇది పురుషోత్తమ సంగమయుగమని కూడా ఎవ్వరికీ తెలియదు. తండ్రి వచ్చి అర్థం చేయిస్తున్నారు, కల్పము యొక్క పురుషోత్తమ సంగమయుగములో నేను రావడం జరుగుతుంది, అప్పుడు మొత్తం విశ్వమంతా పురుషోత్తమముగా అవుతుంది. ఈ సమయములోనైతే విశ్వమంతా కనిష్ఠముగా, పతితముగా ఉంది. ఆ ప్రపంచాన్ని అమరపురి అని అంటారు, ఇది మృత్యులోకము. మృత్యులోకములో ఆసురీ గుణాలు కలిగిన మనుష్యులు ఉంటారు, అమరలోకములో దైవీ గుణాలు కల మనుష్యులు ఉంటారు, అందుకే వారిని దేవతలు అని అంటారు. ఇక్కడ కూడా మంచి స్వభావము కలిగినవారిని, వీరు దేవత వలె ఉన్నారు అని అంటారు. కొంతమంది దైవీ గుణాలు కలిగినవారు ఉంటారు. ఈ సమయములో అందరూ ఆసురీ గుణాలు కల మనుష్యులు, వీరు పంచ వికారాలలో చిక్కుకుని ఉన్నారు, అందుకే - మీరు వచ్చి ఈ దుఃఖము నుండి విడిపించండి అని పాడుతారు. వారు కేవలం ఒక్క సీతను మాత్రమే విడిపించలేదు. భక్తులను సీతలు అని అంటారు, భగవంతుడిని రాముడు అని అంటారు అని బాబా అర్థం చేయించారు. వారు భక్తులకు ఫలాన్ని ఇవ్వడానికి వస్తారు. ఈ అనంతమైన రావణ రాజ్యములో మొత్తం ప్రపంచమంతా చిక్కుకుని ఉంది. వారిని విడిపించి రామ రాజ్యములోకి తీసుకువెళ్తారు. ఇది రఘుపతి రాఘవ రాజా రాముని విషయము కాదు, అతను త్రేతాయుగ రాజు. ఇప్పుడైతే ఆత్మలందరూ తమోప్రధానముగా, శిథిలావస్థలో ఉన్నారు, మెట్లు దిగుతూ-దిగుతూ కిందకు వచ్చేశారు, పూజ్యుల నుండి పూజారులుగా అయిపోయారు. దేవతలు ఎవ్వరినీ పూజించరు, వారు పూజ్యులు. మళ్ళీ వారే వైశ్యులుగా, శూద్రులుగా అయినప్పుడు పూజలు మొదలవుతాయి, వామ మార్గములోకి రావడముతో ఇక పూజారులుగా అవుతారు. పూజారులు దేవతల చిత్రాల ఎదురుగా నమస్కరిస్తారు. ఈ సమయములో ఒక్కరు కూడా పూజ్యులుగా ఉండరు. ఉన్నతోన్నతమైన భగవంతుడు పూజ్యుడు, ఆ తర్వాత సత్యయుగీ దేవతలు పూజ్యులు. ఈ సమయములోనైతే అందరూ పూజారులే. మొట్టమొదట శివుని పూజ జరుగుతుంది, అది అవ్యభిచారి పూజ, అది సతోప్రధానమైన పూజ, ఆ తర్వాత పూజ సతోగా ఉంటుంది, ఆ తర్వాత దేవతల పూజ నుండి కూడా కిందకు దిగి నీటిని, మనుష్యులను, పక్షులను మొదలైనవాటిని పూజించడం ప్రారంభిస్తారు. రోజురోజుకు అనేకులకు పూజ జరగడం మొదలవుతుంది. ఈ రోజుల్లో ధార్మిక కాన్ఫరెన్స్ లు కూడా చాలా జరుగుతూ ఉంటాయి. ఒక్కోసారి ఆది సనాతన ధర్మమువారిది, ఒక్కోసారి జైనులది, ఒక్కోసారి ఆర్యసమాజము వారిది జరుగుతూ ఉంటాయి. అక్కడకు చాలామందిని పిలుస్తారు ఎందుకంటే ప్రతి ఒక్కరూ తమ ధర్మాన్ని ఉన్నతముగానే భావిస్తారు కదా. ప్రతి ధర్మములోనూ ఏదో ఒక విశేష గుణము ఉన్న కారణముగా వారు తమను తాము గొప్పగా భావిస్తారు. జైనులలో కూడా రకరకాల వారుంటారు. 5-7 వెరైటీల వారుంటారు. వారిలో కొంతమంది వివస్త్రగా కూడా ఉంటారు, వివస్త్రగా ఉండడము యొక్క అర్థాన్ని అర్థం చేసుకోరు. భగవానువాచ - వివస్త్రగా ఉండడము అనగా అశరీరిగా వచ్చాము, మళ్ళీ అశరీరిగా అయి వెళ్ళాలి. కానీ వారు వస్త్రాలను తీసేసి వివస్త్రముగా ఉంటారు. వివస్త్రగా ఉండడము గురించి వినిపించిన భగవానువాచ యొక్క అర్థాన్ని అర్థం చేసుకోరు. తండ్రి అంటారు, ఆత్మలైన మీరు ఇక్కడ ఈ శరీరాన్ని ధారణ చేసి పాత్రను అభినయించడానికి వచ్చారు, మళ్ళీ తిరిగి వెళ్ళాలి, ఈ విషయాలను పిల్లలైన మీరు అర్థం చేసుకుంటారు. ఆత్మయే పాత్రను అభినయించేందుకు వస్తుంది, వృక్షము వృద్ధి చెందుతూ ఉంటుంది. కొత్త-కొత్త రకాల ధర్మాలు వెలువడుతూ ఉంటాయి, అందుకే దీనిని వెరైటీ నాటకమని అంటారు. ఇది వెరైటీ ధర్మాల వృక్షము. ప్రతి ఒక్కరివీ అనేక శాఖలు వెలువడుతాయి. మహమ్మద్ అయితే తర్వాత వచ్చారు. మొదట ఇస్లామీయులు వచ్చారు. ముసల్మానుల సంఖ్య చాలా ఉంది, ఆఫ్రికాలో ఎంతమంది షావుకార్లు ఉన్నారు, అక్కడ బంగారము మరియు వజ్రాల గనులు ఉన్నాయి. ఎక్కడైనా చాలా ధనాన్ని చూస్తే, వారిపై దండెత్తి ధనవంతులుగా అవుతారు. క్రిస్టియన్లు కూడా ఎంత ధనవంతులుగా అయ్యారు. భారత్ లో కూడా ధనముంది కానీ అది గుప్తముగా ఉంది. బంగారము మొదలైనవాటిని ఎంతగా పట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు దిగంబర జైన సభ వారు కాన్ఫరెన్సులు మొదలైనవి చేస్తూ ఉంటారు, ఎందుకంటే ప్రతి ఒక్కరూ తమను తాము గొప్పగా భావిస్తారు కదా. ఈ ధర్మాలన్నీ వృద్ధి చెందుతూ ఉంటాయి, ఏదో ఒక రోజు వినాశనము కూడా జరగనున్నది, ఏమీ అర్థం చేసుకోరు. అన్ని ధర్మాలలో కల్లా ఉన్నతమైనది మీ బ్రాహ్మణ ధర్మమే, దీని గురించి ఎవ్వరికీ తెలియదు. కలియుగీ బ్రాహ్మణులు కూడా చాలామంది ఉన్నారు, కానీ వారు కుఖవంశావళి బ్రాహ్మణులు. ప్రజాపిత బ్రహ్మా యొక్క ముఖవంశావళి బ్రాహ్మణులు అంటే అంతా పరస్పరములో సోదరీ-సోదరులుగా ఉండాలి. ఒకవేళ ఆ బ్రాహ్మణులు స్వయాన్ని బ్రహ్మా సంతానముగా పిలుచుకుంటే, మరి పరస్పరములో సోదరీ-సోదరులుగా ఉన్నట్లు, అటువంటప్పుడు వివాహము కూడా చేసుకోకూడదు. కావున ఆ బ్రాహ్మణులు బ్రహ్మాముఖవంశావళి బ్రాహ్మణులు కారు అని ఋజువు అవుతుంది, వారు కేవలం ఆ పేరు పెట్టుకుంటారు. వాస్తవానికి దేవతల కన్నా ఉన్నతమైనవారు అని బ్రాహ్మణులను అంటారు, బ్రాహ్మణులది పిలక స్థానము కదా. ఈ బ్రాహ్మణులే మనుష్యులను దేవతలుగా తయారుచేస్తారు. వీరిని చదివించేవారు పరమపిత పరమాత్మ, వారు స్వయముగా జ్ఞానసాగరుడు. ఇది ఎవ్వరికీ తెలియదు. తండ్రి వద్దకు వచ్చి బ్రాహ్మణులుగా అయి మళ్ళీ రేపు శూద్రులుగా అయిపోతారు. పాత సంస్కారాలను మార్చుకోవడానికి చాలా కష్టమనిపిస్తుంది. స్వయాన్ని ఆత్మగా నిశ్చయము చేసుకుని తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. ఆత్మిక తండ్రి నుండి ఆత్మిక పిల్లలే వారసత్వాన్ని తీసుకుంటారు. తండ్రిని స్మృతి చేయడములోనే మాయ విఘ్నాలను వేస్తుంది. చేతులు పని వైపు, హృదయము తండ్రి వైపు ఉండాలని తండ్రి చెప్తున్నారు. ఇది చాలా సహజము. ప్రేయసీ-ప్రియులు ఉంటారు కదా, వారు ఒకరినొకరు చూసుకోకుండా ఉండలేరు. బాబా అయితే ప్రియుడే, పిల్లలందరూ ప్రేయసులు, వారు బాబాను స్మృతి చేస్తూ ఉంటారు. ఒక్క తండ్రి మాత్రమే ఎప్పుడూ ఎవ్వరికీ ప్రేయసిగా కారు, ఎందుకంటే వారికన్నా ఉన్నతమైనవారైతే ఎవ్వరూ లేరు. అయితే వారు పిల్లలను మహిమ చేస్తారు, భక్తి మార్గము నుండి మొదలుకొని ప్రియుడినైన నాకు మీరందరూ ప్రేయసులు అని అంటారు. మీరు వచ్చి దుఃఖము నుండి ముక్తులుగా చేసి పావనముగా తయారుచేయండి అని మీరు పిలుస్తారు కూడా. మీరందరూ వధువులు, నేను వరుడిని. మీరందరూ ఆసురీ జైలులో చిక్కుకుని ఉన్నారు, నేను వచ్చి విడిపిస్తాను. ఇందులో చాలా శ్రమ ఉంది, వికారీ దృష్టి మోసము చేస్తుంది, పవిత్రమైన దృష్టి కలవారిగా అవ్వడములో శ్రమ అనిపిస్తుంది. దేవతలవి ఎంత మంచి క్యారెక్టర్స్, ఇప్పుడు అటువంటి దేవతలుగా తయారుచేసేవారు తప్పకుండా కావాలి కదా.

‘‘మానవ జీవితములో ధర్మము యొక్క ఆవశ్యకత’’ అని కాన్ఫరెన్సులో టాపిక్ పెట్టారు. డ్రామా గురించి తెలియని కారణముగా తికమకలో ఉన్నారు. మీరు తప్ప ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు. క్రిస్టియన్లు లేక బౌద్ధులు మొదలైనవారికి క్రైస్టు, బుద్ధుడు మొదలైనవారు మళ్ళీ ఎప్పుడు వస్తారో తెలియదు! మీరు ఆ లెక్కను వెంటనే చెప్పగలరు. ధర్మము యొక్క ఆవశ్యకత అయితే ఉంది కదా అని మీరు అర్థం చేయించాలి. మొట్టమొదట ఏ ధర్మము ఉండేది, ఆ తర్వాత ఏ ధర్మాలు వచ్చాయి అనేది చెప్పాలి! మన ధర్మము వారు కూడా పూర్తిగా అర్థం చేసుకోరు. యోగము చేయరు. యోగము లేకుండా శక్తి లభించదు, పదును నిండదు. తండ్రిని మాత్రమే ఆల్మైటీ అథారిటీ అని అంటారు. మీరు ఎంత ఆల్మైటీ (సర్వశక్తివంతులు) గా అవుతారు, విశ్వానికి యజమానులుగా అవుతారు. మీ రాజ్యాన్ని ఎవ్వరూ లాక్కోలేరు. ఆ సమయములో వేరే ఏ ఖండాలు ఉండవు. ఇప్పుడు ఎన్ని ఖండాలు ఉన్నాయి. ఈ సృష్టి చక్రము ఎలా తిరుగుతుంది. ఇది 5 వేల సంవత్సరాల చక్రము, అయితే సృష్టి ఎంత పెద్దదిగా ఉంది అనేది ఎవ్వరూ కొలవలేరు. మహా అయితే భూమిని కొలవగలరు కానీ సాగరాన్ని కొలవలేరు. ఆకాశము మరియు సాగరము యొక్క అంతాన్ని ఎవ్వరూ కనుక్కోలేరు. ధర్మము యొక్క ఆవశ్యకత ఎందుకు ఉంది అనేది వారికి అర్థం చేయించాలి! మొత్తం చక్రమంతా ధర్మాలపైనే తయారయ్యింది. ఇది వెరైటీ ధర్మాల వృక్షము, ఈ వృక్షము అంధుల ఎదురుగా అద్దము వంటిది.

మీరు ఇప్పుడు బయటకు సేవకు వెళ్తున్నారు, మెల్లమెల్లగా మీ వృద్ధి జరుగుతూ ఉంటుంది. తుఫాను వస్తే చాలా ఆకులు రాలిపోతాయి కూడా కదా. ఇతర ధర్మాలలో తుఫాను రావడము అనే విషయమేమీ ఉండదు. వారైతే పై నుండి రావాల్సిందే. ఇక్కడ మీ స్థాపన చాలా అద్భుతమైనది. మొట్టమొదటి భక్తులు ఎవరైతే ఉన్నారో, వారికే భగవంతుడు వచ్చి - తమ ఇంటికి తీసుకువెళ్ళే ఫలాన్ని ఇవ్వాలి. ఆత్మలమైన మమ్మల్ని మా ఇంటికి తీసుకువెళ్ళండి అని పిలుస్తారు కూడా. తండ్రి స్వర్గము యొక్క రాజ్యభాగ్యాన్ని కూడా ఇస్తారని ఎవ్వరికీ తెలియదు. సన్యాసులైతే సుఖాన్ని అసలు అంగీకరించరు. వారు మోక్షము పొందాలని కోరుకుంటారు. మోక్షాన్ని వారసత్వము అనరు. స్వయంగా శివబాబా కూడా పాత్రను అభినయించాల్సి వస్తుంది అన్నప్పుడు మరి ఇంకెవరినైనా మోక్షములో ఎలా ఉంచగలరు. బ్రహ్మాకుమార-బ్రహ్మాకుమారీలైన మీకు మీ ధర్మము మరియు అన్ని ధర్మాల గురించి తెలుసు. మీకు దయ కలగాలి. చక్రము యొక్క రహస్యాన్ని అర్థం చేయించాలి. మీ ధర్మ స్థాపకులు వారి సమయానికి మళ్ళీ వస్తారు అని చెప్పండి. అర్థం చేయించేవారు కూడా తెలివైనవారై ఉండాలి. ప్రతి ఒక్కరూ సతోప్రధానము నుండి సతో-రజో-తమోలోకి రావాల్సిందేనని మీరు అర్థం చేయించవచ్చు. ఇప్పుడు ఇది రావణ రాజ్యము. మీది సత్యమైన గీత, దీనిని తండ్రి వినిపిస్తున్నారు. భగవంతుడు అని నిరాకారుడినే అంటారు. ఆత్మ నిరాకారుడైన గాడ్ ఫాదర్ ను పిలుస్తుంది. అక్కడ ఆత్మలైన మీరు ఉంటారు. మిమ్మల్ని పరమాత్మ అని అనరు. పరమాత్మ అయితే ఒక్కరే, వారు ఉన్నతోన్నతమైన భగవంతుడు, మిగిలిన ఆత్మలందరూ వారి పిల్లలు. సర్వుల సద్గతిదాత ఒక్కరే, ఆ తర్వాత ఉన్నది దేవతలు. వారిలో కూడా నంబర్ వన్ శ్రీకృష్ణుడు, ఎందుకంటే వారి ఆత్మ మరియు శరీరము రెండూ పవిత్రముగా ఉంటాయి. మీరు సంగమయుగవాసులు. మీ జీవితము అమూల్యమైనది. దేవతల జీవితము అమూల్యమైనది కాదు, బ్రాహ్మణుల జీవితము అమూల్యమైనది. తండ్రి మిమ్మల్ని పిల్లలుగా చేసుకుని మీపై ఎంత కృషి చేస్తారు. దేవతలు ఇంత శ్రమ చేయరు. దేవతలు పిల్లలను చదివించేందుకు స్కూలుకు పంపిస్తారు. ఇక్కడ తండ్రి కూర్చుని మిమ్మల్ని చదివిస్తున్నారు. వారు తండ్రి, టీచరు, గురువు, ముగ్గురూ వారే. కనుక వారి పట్ల ఎంత గౌరవముండాలి. సర్వీసబుల్ పిల్లలకు సేవ పట్ల చాలా అభిరుచి ఉండాలి. మంచి తెలివైనవారు, సేవలో నిమగ్నమై ఉన్నవారు చాలా కొద్దిమంది మాత్రమే ఉన్నారు. హ్యాండ్స్ అయితే కావాలి కదా. ఎవరికైతే యుద్ధ మైదానములోకి వెళ్ళడం నేర్పిస్తారో, వారిని ఉద్యోగము మొదలైనవాటన్నిటి నుండి ఫ్రీ చేసేస్తారు. వాళ్ళ దగ్గర లిస్టు ఉంటుంది. మేము మైదానములోకి వెళ్ళము అని మిలట్రీని ఎవ్వరూ తిరస్కరించలేరు. వారికి డ్రిల్ నేర్పించి, అవసరమైనప్పుడు పిలుస్తారు. తిరస్కరించేవారి మీద కేసు పెడతారు. ఇక్కడైతే అటువంటి విషయము లేదు. ఇక్కడ ఎవరైతే బాగా సేవ చేయరో, వారు పదభ్రష్టులైపోతారు. సేవ చేయడం లేదు అంటే తమను తామే షూట్ చేసుకుంటున్నట్లు. వారు పదభ్రష్టులైపోతారు. తమ భాగ్యాన్ని షూట్ చేసుకుంటారు. బాగా చదువుకుని, యోగములో ఉన్నట్లయితే మంచి పదవి లభిస్తుంది. మీపై మీరు దయ చూపించుకోవాల్సి ఉంటుంది. మీపై మీరు దయ చూపించుకుంటే ఇతరులపై కూడా చూపించగలరు. తండ్రి అన్ని రకాల వివరణను ఇస్తూ ఉంటారు. ఈ ప్రపంచ నాటకము ఎలా నడుస్తుంది, రాజధాని కూడా స్థాపన అవుతుంది. ఈ విషయాలు ప్రపంచానికి తెలియవు. ఇప్పుడు ఆహ్వానాలైతే అందుతూ ఉంటాయి. 5-10 నిముషాలలో ఏమి అర్థం చేయించగలరు. ఒకటి-రెండు గంటలు ఇస్తే అర్థం చేయించగలుగుతాము. డ్రామా గురించైతే ఏ మాత్రము తెలియదు. అన్ని చోట్ల మంచి-మంచి పాయింట్లు వ్రాయాలి, కానీ పిల్లలు మర్చిపోతారు. తండ్రి రచయిత కూడా, పిల్లలైన మిమ్మల్ని రచిస్తారు. వారు మిమ్మల్ని తమవారిగా చేసుకున్నారు, డైరెక్టర్ గా అయి డైరెక్షన్లు కూడా ఇస్తారు. శ్రీమతాన్ని ఇస్తారు మరియు పాత్రను కూడా అభినయిస్తారు. వారు జ్ఞానాన్ని వినిపిస్తారు. ఇది కూడా వారి ఉన్నతోన్నతమైన కార్యము కదా. డ్రామా యొక్క క్రియేటర్, డైరెక్టర్ మరియు ముఖ్యమైన యాక్టర్ గురించి తెలియకపోతే మరి వారిని ఏమంటారు? అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఈ అమూల్యమైన జీవితములో చదివించే టీచర్ పట్ల చాలా-చాలా గౌరవము ఉంచాలి, చదువులో చాలా తెలివైనవారిగా అయి సేవలో నిమగ్నమవ్వాలి. మీపై మీరే దయ చూపించుకోవాలి.

2. మిమ్మల్ని మీరు సరిదిద్దుకునేందుకు పవిత్రమైన దృష్టి కలవారిగా అవ్వాలి. మీ క్యారెక్టర్ ను సరిదిద్దుకోవాలి. మనుష్యులను దేవతలుగా తయారుచేసే సేవ చేయాలి.

వరదానము:-
ఆత్మిక డ్రిల్ యొక్క అభ్యాసము ద్వారా ఫైనల్ పేపరులో పాస్ అయ్యే సదా శక్తిశాలీ భవ

ఏ విధముగా వర్తమాన సమయమనుసారముగా శరీరము యొక్క సర్వ రోగాలు నయమవ్వడానికి వ్యాయామము నేర్పిస్తారో, అలా ఆత్మను సదా శక్తిశాలిగా చేసుకునేందుకు ఆత్మిక ఎక్సర్సైజ్ యొక్క అభ్యాసము కావాలి. నలువైపులా ఎంత అలజడితో కూడుకున్న వాతావరణము ఉన్నా కానీ, శబ్దములో ఉంటూ శబ్దము నుండి అతీతముగా ఉండే స్థితి యొక్క అభ్యాసము చేయండి. మనసును ఎక్కడ మరియు ఎంత సమయము స్థితి చేయాలనుకుంటే అంత సమయము దానిని అక్కడ స్థితి చేయండి - అప్పుడు శక్తిశాలిగా అయి ఫైనల్ పేపర్లో పాస్ అవ్వగలుగుతారు.

స్లోగన్:-
తమ వికారీ స్వభావ, సంస్కారాలను మరియు కర్మలను సమర్పణ చేయడమే సమర్పితమవ్వడము.

అవ్యక్త ప్రేరణలు - ఇప్పుడు లగనము అనే అగ్నిని ప్రజ్వలితము చేసి యోగాన్ని జ్వాలా రూపముగా చేయండి

ఎప్పటివరకైతే మీ స్మృతి జ్వాలా రూపముగా అవ్వదో, అప్పటివరకు ఈ వినాశ జ్వాల కూడా సంపూర్ణ జ్వాలా రూపాన్ని అందుకోదు. అది భగ్గుమంటుంది, మళ్ళీ శీతలమైపోతుంది, ఎందుకంటే జ్వాలా మూర్తులు మరియు ప్రేరకులైన ఆధారమూర్త ఆత్మలు ఇప్పుడింకా స్వయమే సదా జ్వాలా రూపముగా అవ్వలేదు. ఇప్పుడు జ్వాలా రూపముగా అయ్యే దృఢ సంకల్పాన్ని తీసుకోండి మరియు సంగఠిత రూపములో మనసు-బుద్ధి యొక్క ఏకాగ్రత ద్వారా శక్తిశాలి యోగము యొక్క వైబ్రేషన్లను నలువైపులా వ్యాపింపజేయండి.