21-02-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - పాస్ విత్ ఆనర్ గా అవ్వాలంటే బుద్ధియోగము కొద్దిగా కూడా ఎటువైపుకూ భ్రమించకూడదు, ఒక్క తండ్రి స్మృతే ఉండాలి, దేహాన్ని స్మృతి చేసేవారు ఉన్నత పదవిని పొందలేరు’’

ప్రశ్న:-
అన్నింటికంటే ఉన్నతమైన గమ్యము ఏది?

జవాబు:-
ఆత్మ జీవిస్తూ మరణించి ఒక్క తండ్రికి చెందినవానిగా అవ్వాలి, ఇంకెవ్వరూ గుర్తుకురాకూడదు, దేహాభిమానము పూర్తిగా తొలగిపోవాలి - ఇదే ఉన్నతమైన గమ్యము. నిరంతర దేహీ-అభిమాన అవస్థ తయారవ్వాలి - ఇదే పెద్ద గమ్యము. దీని ద్వారానే కర్మాతీత అవస్థను పొందుతారు.

పాట:-
నీవు ప్రేమ సాగరుడవు...

ఓంశాంతి
వాస్తవానికి ఈ పాట కూడా తప్పే. ప్రేమకు బదులుగా జ్ఞానసాగరుడు అని ఉండాలి. ప్రేమ విషయములో లోటా వంటిది ఏదీ ఉండదు. గంగాజలము మొదలైనవాటి విషయములో లోటా అనేది ఉంటుంది. కావున ఇది భక్తి మార్గపు మహిమ. ఇది తప్పు మరియు అది కరక్టు. తండ్రి మొట్టమొదట అయితే జ్ఞానసాగరుడు. పిల్లల్లో కొద్దిగా జ్ఞానము ఉన్నా చాలా ఉన్నత పదవిని ప్రాప్తి చేసుకుంటారు. ఈ సమయములో మనము చైతన్య దిల్వాడా మందిరము వంటి వారమని పిల్లలకు తెలుసు. అది జడమైన దిల్వాడా మందిరము మరియు ఇది చైతన్యమైన దిల్వాడా మందిరము. ఇది కూడా అద్భుతము కదా. జడమైన స్మృతిచిహ్నము ఎక్కడైతే ఉందో, అక్కడకు చైతన్యమైన మీరు వచ్చి కూర్చున్నారు. కానీ మనుష్యుల ఇదేమీ అర్థం చేసుకోరు. ఇది తప్పకుండా గాడ్-ఫాదర్లీ యూనివర్శిటీ అని, ఇక్కడ భగవంతుడు చదివిస్తారని మున్ముందు అర్థం చేసుకుంటారు. దీనికంటే పెద్ద యూనివర్శిటీ ఇంకేదీ ఉండదు. అలాగే ఇది చైతన్యమైన దిల్వాడా మందిరమని కూడా మున్ముందు అర్థం చేసుకుంటారు. ఈ దిల్వాడా మందిరము మీ ఏక్యురేట్ స్మృతిచిహ్నము. పైన సూర్యవంశీ, చంద్రవంశీయులు ఉన్నారు, కింద ఆది దేవ్, ఆది దేవి మరియు పిల్లలు కూర్చుని ఉన్నారు. వీరి పేరు బ్రహ్మా. సరస్వతి బ్రహ్మాకు పుత్రిక. ప్రజాపిత బ్రహ్మా ఉన్నారంటే తప్పకుండా గోప-గోపికలు కూడా ఉంటారు కదా. అవి జడచిత్రాలు. ఎవరైతే ఒకప్పుడు ఉండి వెళ్ళారో వారి చిత్రాలు తర్వాత తయారయ్యాయి. ఎవరైనా చనిపోతే వెంటనే వారి చిత్రాన్ని తయారుచేసేస్తారు, కానీ వారి పొజిషన్, జీవితచరిత్ర గురించైతే తెలియదు. వారి ఆక్యుపేషన్ (కర్తవ్యము) గురించి వ్రాయకపోతే ఆ చిత్రము ఎందుకూ పనికిరాదు. వ్రాయడం ద్వారా ఫలానావారు ఈ-ఈ కర్తవ్యాలు చేసారు అని తెలుస్తుంది. ఇప్పుడు ఈ దేవతల మందిరాలేవైతే ఉన్నాయో, వారి కర్తవ్యము, జీవితచరిత్ర గురించి ఎవ్వరికీ తెలియదు. ఉన్నతోన్నతుడైన శివబాబా గురించి ఎవ్వరికీ తెలియదు. ఈ సమయములో పిల్లలైన మీకు అందరి జీవితచరిత్ర గురించి తెలుసు. ఇప్పుడు పూజిస్తున్నవారిలో ముఖ్యముగా ఎవరెవరు ఒకప్పుడు ఉండి వెళ్ళారు? ఉన్నతోన్నతమైనవారు భగవంతుడు. శివరాత్రిని కూడా జరుపుకుంటున్నారంటే తప్పకుండా వారి అవతరణ జరిగింది అని అర్థము, కానీ అది ఎప్పుడు జరిగింది, వారు వచ్చి ఏం చేసారు - ఇది ఎవ్వరికీ తెలియదు. శివునితోపాటు ఉన్నది బ్రహ్మా. ఆది దేవ్ మరియు ఆది దేవి ఎవరు, వారికి ఇన్ని భుజాలు ఎందుకు ఇచ్చారు? ఎందుకంటే వృద్ధి అయితే జరుగుతుంది కదా. ప్రజాపిత బ్రహ్మా ద్వారా ఎంత వృద్ధి జరుగుతుంది. బ్రహ్మానే 100 భుజాలు కలిగినవారు, 1000 భుజాలు కలిగినవారు అని అంటారు. విష్ణువు లేక శంకరుని కొరకు ఇన్ని భుజాలు చెప్పరు. మరి బ్రహ్మా విషయములో ఎందుకు చెప్తారు? వీరంతా ప్రజాపిత బ్రహ్మా యొక్క వంశావళియే కదా. వాస్తవానికి ఇది స్థూల బాహువుల విషయము కాదు. వారు వెయ్యి భుజాలు కలిగిన బ్రహ్మా అని అంటారు కానీ దాని అర్థము అర్థం చేసుకోరు. బ్రహ్మాకు ఎన్ని భుజాలు ఉన్నాయి అనేది ఇప్పుడు మీరు ప్రాక్టికల్ గా చూడండి. ఇవి అనంతమైన భుజాలు. ప్రజాపిత బ్రహ్మాను అందరూ నమ్ముతారు కానీ వారి కర్తవ్యము గురించి తెలియదు. ఆత్మకు బాహువులు ఉండవు, బాహువులు శరీరానికి ఉంటాయి. ఇన్ని కోట్ల మంది సోదరులు ఉంటే, వారి భుజాలు ఎన్ని అయినట్లు? కానీ మొదట ఎవరైనా పూర్తి రీతిలో జ్ఞానాన్ని అర్థం చేసుకుంటే, అప్పుడు తర్వాత ఈ విషయాలను వినిపించాలి. మొట్టమొదటి ముఖ్యమైన విషయము ఒకటే - నన్ను స్మృతి చేయండి మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి అని తండ్రి అంటారు. అంతేకాక వారిని జ్ఞానసాగరుడు అని కూడా అంటూ ఉంటారు. ఎన్ని లెక్కలేనన్ని పాయింట్లు వినిపిస్తారు. ఇన్ని పాయింట్లన్నీ అయితే గుర్తుండవు. సారము బుద్ధిలో ఉండిపోతుంది. అంతిమములో - మన్మనాభవ అనేది సారము అవుతుంది.

జ్ఞానసాగరుడు అని శ్రీకృష్ణుడిని అనరు. వారు రచన. రచయిత ఒక్క తండ్రి మాత్రమే. తండ్రియే అందరికీ వారసత్వాన్ని ఇస్తారు, ఇంటికి తీసుకువెళ్తారు. తండ్రి మరియు ఆత్మల ఇల్లు సైలెన్స్ హోమ్. విష్ణుపురిని తండ్రి ఇల్లు అని అనరు. ఇల్లు మూలవతనము, అక్కడ ఆత్మలు ఉంటారు. ఈ విషయాలన్నింటినీ తెలివైన పిల్లలే ధారణ చేయగలుగుతారు. ఇంతటి జ్ఞానమంతా ఎవ్వరి బుద్ధిలోనూ గుర్తుండదు. అలాగే ఇన్ని కాగితాలను కూడా వ్రాయలేరు. ఈ మురళీలు కూడా అన్నింటినీ పోగు చేస్తూ వెళ్తే ఈ మొత్తం హాల్ కంటే కూడా ఎక్కువ అయిపోతాయి. ఆ చదువులో కూడా ఎన్ని ఎక్కువ పుస్తకాలు ఉంటాయి. పరీక్షలు పాస్ అయిన తర్వాత ఇక సారము బుద్ధిలో కూర్చుండిపోతుంది. బ్యారిస్టరీ పరీక్షను పాస్ అయితే ఒక్క జన్మ కొరకు అల్పకాలికమైన సుఖము లభిస్తుంది. అది వినాశీ సంపాదన. మీ చేత ఈ తండ్రి భవిష్యత్తు కొరకు అవినాశీ సంపాదనను చేయిస్తారు. మిగిలిన గురువులు, పండితులు మొదలైనవారంతా వినాశీ సంపాదనను చేయిస్తారు. వినాశనానికి దగ్గరవుతున్న కొలదీ వారి సంపాదన తగ్గిపోతూ ఉంటుంది. సంపాదన పెరుగుతూ ఉంటుంది కదా అని మీరు అంటారు కానీ కాదు. ఇదంతా అంతమైపోనున్నది. పూర్వము రాజులు మొదలైనవారి సంపాదన నడుస్తూ ఉండేది. ఇప్పుడు మరి వారు కూడా లేరు. మీ సంపాదన అయితే ఎంత సమయము నడుస్తుంది! ఇది తయారై, తయారుచేయబడిన డ్రామా అని మీకు తెలుసు, ఇది ప్రపంచములో ఇంకెవ్వరికీ తెలియదు. ధారణ జరిగేవారు మీలో కూడా నంబరువారుగా ఉన్నారు. కొందరైతే అసలేమీ అర్థం చేయించలేకపోతారు. కొందరేమో, మేము మిత్ర-సంబంధీకులు మొదలైనవారికి అర్థం చేయిస్తాము అని అంటారు కానీ అది కూడా అల్పకాలికమైనదే కదా. ఇతరులకు ప్రదర్శనీ మొదలైనవి ఎందుకు అర్థం చేయించరు? పూర్తి ధారణ లేదు. స్వయం విషయములో నాకు అన్నీ తెలుసు అని అనుకోకూడదు కదా. సేవా అభిరుచి ఉన్నట్లయితే ఎవరైతే బాగా అర్థం చేయిస్తారో వారిది వినాలి. తండ్రి ఉన్నత పదవిని ప్రాప్తి చేయించేందుకు వచ్చారు కావున పురుషార్థము చేయాలి కదా. కానీ భాగ్యములో లేకపోతే శ్రీమతాన్ని కూడా అంగీకరించరు, అప్పుడిక పదవి భ్రష్టమైపోతుంది. డ్రామా ప్లాన్ అనుసారముగా రాజధాని స్థాపన అవుతోంది. అందులో అన్ని రకాలవారూ కావాలి కదా. కొందరు మంచి ప్రజలుగా అవుతారని, కొందరు అంతకంటే తక్కువవారిగా అవుతారని పిల్లలు అర్థం చేసుకోగలరు. తండ్రి అంటారు, నేను మీకు రాజయోగాన్ని నేర్పించేందుకు వచ్చాను. దిల్వాడా మందిరములో రాజుల చిత్రాలు ఉన్నాయి కదా. ఎవరైతే పూజ్యులుగా అవుతారో, వారే మళ్ళీ పూజారులుగా అవుతారు. రాజు-రాణుల పదవి అయితే ఉన్నతమైనది కదా. మళ్ళీ వామ మార్గములోకి వచ్చినప్పుడు కూడా రాజులు మరియు పెద్ద-పెద్ద షావుకారులు ఉంటారు. జగన్నాథుని మందిరములో అందరికీ కిరీటము చూపించారు. ప్రజలకైతే కిరీటము ఉండదు. కిరీటము కల రాజులను కూడా వికారాలతో చూపించారు. సుఖము, సంపద అయితే స్వర్గములోనివారికి ఎంతో ఉంటుంది. సంపద కాస్త ఎక్కువ తక్కువ అయితే అవుతుంది. వజ్రాల మహళ్ళకు మరియు వెండి మహళ్ళకు మధ్యన తేడా అయితే ఉంటుంది. కావున తండ్రి పిల్లలకు చెప్తారు - మంచి పురుషార్థము చేసి ఉన్నత పదవిని పొందండి. రాజులకు సుఖము ఎక్కువగా ఉంటుంది, అక్కడ అందరూ సుఖముగా ఉంటారు. ఏ విధంగా ఇక్కడ అందరికీ దుఃఖము ఉంది, అనారోగ్యము మొదలైనవి అందరికీ ఉంటూ ఉంటాయి. అక్కడ సుఖమే సుఖము ఉంటుంది, కానీ పదవులైతే నంబరువారుగా ఉంటాయి. తండ్రి ఎల్లప్పుడూ చెప్తూ ఉంటారు - పురుషార్థము చేస్తూ ఉండండి, సోమరులుగా అవ్వకండి. డ్రామానుసారముగా వీరి సద్గతి ఈ విధంగా ఇంతే జరుగుతుంది అని పురుషార్థము ద్వారా అర్థం చేసుకోవడం జరుగుతుంది.

మీ సద్గతి కొరకు శ్రీమతముపై నడవాలి. టీచరు డైరెక్షన్లపై విద్యార్థి నడవకపోతే ఇక ఎందుకూ పనికిరాడు. అందరూ నంబరువారు పురుషార్థానుసారముగా ఉన్నారు. ఒకవేళ ఎవరైనా, మేము ఇది చేయలేము అని అంటే, ఇక మిగిలినవి ఏం నేర్చుకుంటారు! నేర్చుకుని తెలివైనవారిగా అవ్వాలి, తద్వారా వీరు చాలా బాగా అర్థం చేయిస్తారు అని అందరూ అనాలి. కానీ ఆత్మ జీవిస్తూ మరణించి ఒక్క తండ్రికి చెందినదిగా అవ్వాలి, ఇంకెవ్వరూ గుర్తు రాకూడదు, దేహాభిమానము తొలగిపోవాలి - ఇది ఉన్నతమైన గమ్యము. అంతా మర్చిపోవాలి. పూర్తి దేహీ-అభిమాని అవస్థ తయారవ్వాలి - ఇది ఉన్నతమైన గమ్యము. అక్కడ ఆత్మలు అశరీరిగానే ఉంటాయి, తర్వాత ఇక్కడికి వచ్చి దేహాన్ని ధారణ చేస్తాయి. ఇప్పుడు మళ్ళీ ఈ దేహములో ఉంటూ స్వయాన్ని అశరీరిగా భావించాలి. ఇది చాలా ఎక్కువ శ్రమతో కూడుకున్నది. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ కర్మాతీత అవస్థలో ఉండాలి. సర్పానికి కూడా తెలివి ఉంది కదా - పాత కుబుసాన్ని వదిలేస్తుంది. మరి మీరు దేహాభిమానము నుండి ఎంతగా బయటపడాలి. మూలవతనములోనైతే మీరు ఉన్నదే దేహీ-అభిమానులుగా. ఇక్కడ దేహములో ఉంటూ స్వయాన్ని ఆత్మగా భావించాలి. దేహాభిమానము తెగిపోవాలి. ఇది ఎంత పెద్ద పరీక్ష. భగవంతునికే స్వయముగా వచ్చి చదివించవలసి ఉంటుంది. దేహపు సర్వ సంబంధాలను వదిలి నా వారిగా అవ్వండి, స్వయాన్ని నిరాకార ఆత్మలుగా భావించండి అని ఇంకెవ్వరూ అనలేరు. ఏ వస్తువు యొక్క భానమూ ఉండకూడదు. మాయ ఇతరుల దేహాలలో చాలా చిక్కుకునేలా చేస్తుంది. అందుకే బాబా అంటారు, ఈ సాకారుడిని కూడా స్మృతి చేయవద్దు అని. బాబా అంటారు, మీరైతే మీ దేహాన్ని కూడా మర్చిపోవాలి, ఒక్క తండ్రినే స్మృతి చేయాలి. ఇందులో ఎంతో శ్రమ ఉంది. మాయ మంచి-మంచి పిల్లలను కూడా నామ-రూపాలలో వేలాడదీస్తుంది. ఈ అలవాటు చాలా చెడ్డది. శరీరాన్ని స్మృతి చేయడము - ఇది భూతాల స్మృతి అయినట్లు. నేను ఒక్క శివబాబానే స్మృతి చేయండి అని చెప్తుంటే, మీరు 5 భూతాలను స్మృతి చేస్తూ ఉంటారు. దేహముపై ఏమాత్రమూ మోహము ఉండకూడదు. బ్రాహ్మణి నుండి కూడా నేర్చుకోవాలే కానీ, వారి నామ-రూపాలకు వేలాడకూడదు. దేహీ-అభిమానిగా అవ్వడములోనే శ్రమ ఉంది. బాబా వద్దకు చార్టు ఎంతోమంది పిల్లలు పంపిస్తారు కానీ బాబా దానిని విశ్వసించరు. కొందరు, మేము శివబాబాను తప్ప ఇంకెవ్వరినీ స్మృతి చేయము అని అంటారు కానీ బాబాకు తెలుసు, పైస అంత కూడా స్మృతి చేయరు. స్మృతిలో ఎంతో కష్టపడవలసి ఉంటుంది. ఎక్కడో ఒక చోట చిక్కుకుపోతారు. దేహధారులను స్మృతి చేయడము, ఇది 5 భూతాలను స్మృతి చేయడము వంటిది. దీనిని భూతపూజ అని అంటారు. భూతాలను స్మృతి చేస్తారు. ఇక్కడైతే మీరు ఒక్క శివబాబానే స్మృతి చేయాలి. ఇక్కడ పూజ విషయమేమీ లేదు. భక్తి యొక్క నామ-రూపాలే మాయమైపోతాయి, ఇక విగ్రహాలను ఏం స్మృతి చేయాలి. అవి కూడా మట్టితో తయారైనవే. తండ్రి అంటారు, ఇదంతా కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని పూజారుల నుండి పూజ్యులుగా తయారుచేస్తాను. ఒక్క తండ్రిని తప్ప ఇంకే శరీరాన్నీ స్మృతి చేయకూడదు. ఆత్మ ఎప్పుడైతే పావనముగా అయిపోతుందో, అప్పుడు శరీరము కూడా పావనమైనది లభిస్తుంది. ఇప్పుడైతే ఈ శరీరము పావనముగా లేదు. మొదట ఎప్పుడైతే ఆత్మ సతోప్రధానము నుండి సతో, రజో, తమోలోకి వస్తుందో అప్పుడు శరీరము కూడా దాని అనుసారముగానే లభిస్తుంది. ఇప్పుడు మీ ఆత్మ పావనముగా అవుతూ ఉంటుంది కానీ శరీరము అప్పుడే పావనముగా అవ్వదు. ఇవి అర్థం చేసుకోవలసిన విషయాలు. ఈ పాయింట్లు కూడా ఎవరైతే బాగా అర్థం చేసుకుని అర్థం చేయిస్తూ ఉంటారో వారి బుద్ధిలోనే కూర్చుంటాయి. సతోప్రధానముగా అవ్వాల్సింది ఆత్మయే. తండ్రిని స్మృతి చేయడమే చాలా శ్రమతో కూడుకున్నది. కొందరికైతే అసలు ఏ మాత్రము స్మృతి ఉండదు. పాస్ విత్ హానర్ గా అవ్వాలంటే బుద్ధియోగము కొద్దిగా కూడా ఎటువైపుకూ భ్రమించకూడదు. ఒక్క తండ్రి స్మృతి మాత్రమే ఉండాలి. కానీ పిల్లల బుద్ధియోగము భ్రమిస్తూ ఉంటుంది. ఎంతగా ఎంతోమందిని తమ సమానముగా తయారుచేస్తారో, అంతే పదవి లభిస్తుంది. దేహాన్ని స్మృతి చేసేవారు ఎప్పుడూ ఉన్నత పదవిని పొందలేరు. ఇక్కడైతే పాస్ విత్ హానర్ అవ్వాలి. కష్టపడకుండా ఈ పదవి ఎలా లభిస్తుంది! దేహాన్ని స్మృతి చేసేవారు ఏ పురుషార్థమూ చేయలేరు. తండ్రి అంటారు, పురుషార్థము చేసేవారిని ఫాలో చేయండి. ఇది కూడా పురుషార్థమే కదా.

ఇది చాలా విచిత్రమైన జ్ఞానము. ప్రపంచములో ఇది ఎవ్వరికీ తెలియదు. ఆత్మ ఎలా పరివర్తన చెందుతుంది అనేది ఎవరి బుద్ధిలోనూ కూర్చోదు. ఇదంతా గుప్తమైన శ్రమ. బాబా కూడా గుప్తమైనవారు. మీరు రాజ్యాన్ని ఎలా పొందుతారు, యుద్ధాలు, గొడవలు ఏమీ లేవు. ఇది జ్ఞానము మరియు యోగము విషయమే. మనము ఎవరితోనూ యుద్ధము చేయము. ఇక్కడ ఆత్మను పవిత్రముగా తయారుచేసుకునేందుకు కృషి చేయాలి. ఆత్మ ఎంతెంతగా పతితముగా అవుతూ ఉంటుందో అప్పుడు శరీరము కూడా పతితమైనది తీసుకుంటుంది, మళ్ళీ ఆత్మ పావనముగా అయి వెళ్ళాలి, ఇందులో చాలా శ్రమ ఉంది. ఎవరెవరు పురుషార్థము చేస్తున్నారు అనేది బాబా అర్థం చేసుకోగలరు! ఇది శివబాబా భండారము. శివబాబా భండారములో మీరు సేవ చేస్తున్నారు. సేవ చేయకపోతే వెళ్ళి చాలా చిన్న పదవిని పొందుతారు. తండ్రి వద్దకు సేవ చేయడానికి వచ్చారు కానీ సేవ చేయకపోతే ఏం పదవి లభిస్తుంది! ఇక్కడ రాజధాని స్థాపన అవుతోంది, ఇందులో నౌకర్లు మొదలైనవారంతా తయారవుతారు కదా. ఇప్పుడు మీరు రావణుడిపై విజయము పొందుతారు, అంతేకానీ వేరే ఏ యుద్ధమూ లేదు. ఇది అర్థం చేయించడం జరుగుతుంది, ఇది ఎంత గుప్తమైన విషయము. యోగబలము ద్వారా విశ్వ రాజ్యాధికారాన్ని మీరు తీసుకుంటారు. మనము మన శాంతిధామములో ఉండేవారమని మీకు తెలుసు. పిల్లలైన మీకు అనంతమైన ఇల్లే గుర్తుంది. ఇక్కడకు మనము పాత్రను అభినయించేందుకు వచ్చాము, మళ్ళీ మన ఇంటికి వెళ్తాము. ఆత్మ ఎలా వెళ్తుంది అనేది కూడా ఎవ్వరూ అర్థం చేసుకోరు. డ్రామా ప్లాన్ అనుసారముగా ఆత్మలు రావాల్సిందే. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ఏ దేహధారి పట్ల మోహము పెట్టుకోకూడదు. శరీరాన్ని స్మృతి చేయడము కూడా భూతాలను స్మృతి చేయడము వంటిదే, అందుకే ఎవరి నామ-రూపాలలోనూ వేలాడకూడదు. తమ దేహాన్ని కూడా మర్చిపోవాలి.

2. భవిష్యత్తు కొరకు అవినాశీ సంపాదనను జమ చేసుకోవాలి. తెలివైనవారిగా అయి జ్ఞాన పాయింట్లను బుద్ధిలో ధారణ చేయాలి. తండ్రి ఏదైతే అర్థం చేయించారో, దానిని అర్థం చేసుకుని ఇతరులకు వినిపించాలి.

వరదానము:-
కల్ప-కల్పపు విజయము యొక్క స్మృతి ఆధారముగా మాయా శత్రువును ఆహ్వానించే మహావీర్ విజయీ భవ

మహావీరులైన విజయీ పిల్లలు పేపర్ ను చూసి భయపడరు ఎందుకంటే త్రికాలదర్శులైన కారణముగా వారికి - మేము కల్ప-కల్పపు విజయులము అని తెలుసు. మహావీరులు ఎప్పుడూ కూడా ఈ విధంగా అనలేరు - బాబా, మా వద్దకు మాయను పంపించకండి, కృప చూపించండి, ఆశీర్వదించండి, శక్తిని ఇవ్వండి, ఏమి చేయను, ఏదైనా మార్గాన్ని చూపించండి... ఇది కూడా బలహీనతయే. మహావీరులు అయితే శత్రువును ఆహ్వానిస్తారు - నీవు రా మరియు మేము విజయులుగా అవుతాము అని.

స్లోగన్:-
సమయము యొక్క సూచన ఏమిటంటే - సమానముగా అవ్వండి, సంపన్నముగా అవ్వండి.

అవ్యక్త సూచనలు - ఏకాంతప్రియులుగా అవ్వండి, ఏకతను మరియు ఏకాగ్రతను అలవరచుకోండి

ఏ సిద్ధి కొరకైనా ఒకటేమో ఏకాంతము, రెండవది ఏకాగ్రత, ఈ రెండింటి విధి ద్వారా సిద్ధిని పొందుతారు. ఏ విధంగా మీ స్మృతిచిహ్న చిత్రాల ద్వారా సిద్ధిని ప్రాప్తి చేసుకునేవారు విశేషముగా రెండు విషయాలలో విధిని అనుసరిస్తారు - ఏకాంతవాసి మరియు ఏకాగ్రత. ఈ విధినే మీరు కూడా సాకారములో అలవరచుకోండి. ఏకాగ్రత తక్కువైన కారణముగానే దృఢ నిశ్చయము లోపిస్తుంది. ఏకాంతవాసిగా తక్కువగా ఉన్న కారణముగానే సాధారణ సంకల్పాలు బీజాన్ని బలహీనపరుస్తాయి, అందుకే ఈ విధి ద్వారా సిద్ధి స్వరూపులుగా అవ్వండి.