21-06-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీకు ఈ స్మృతి కలిగింది, మేము ఇప్పుడు 84 జన్మల చక్రాన్ని పూర్తి చేసాము, ఇప్పుడు మా ఇల్లు అయిన శాంతిధామానికి వెళ్తాము, ఇంటికి వెళ్ళేందుకు ఇంకా కొద్ది సమయము మాత్రమే ఉంది’’

ప్రశ్న:-
ఏ పిల్లలకైతే ఇంటికి వెళ్ళాలనే స్మృతి ఉంటుందో, వారి గుర్తులు ఏమిటి?

జవాబు:-
వారు ఈ పాత ప్రపంచాన్ని చూస్తూ కూడా చూడరు. వారికి అనంతమైన వైరాగ్యము ఉంటుంది, వ్యాపార-వ్యవహారాల్లో ఉంటూ కూడా తేలికగా ఉంటారు. అక్కడి, ఇక్కడి వ్యర్థమైన విషయాల్లో తమ సమయాన్ని వృధా చేసుకోరు. స్వయాన్ని ఈ ప్రపంచములో అతిథిగా భావిస్తారు.

ఓంశాంతి
మనం కొద్ది సమయం కొరకు ఈ పాత ప్రపంచము యొక్క అతిథులము అని కేవలం సంగమయుగ బ్రాహ్మణులైన మీకే తెలుసు. మీ నిజమైన ఇల్లు శాంతిధామము. మనుష్యులు మనస్సుకు శాంతి లభించాలని ఆ ఇంటినే ఎంతగానో తలచుకుంటూ ఉంటారు. కానీ మనస్సు ఏమిటి, శాంతి ఏమిటి, అది మనకు ఎక్కడి నుండి లభిస్తుంది, ఏమీ తెలియదు. ఇప్పుడు మన ఇంటికి వెళ్ళేందుకు ఇంకా కొద్ది సమయమే ఉందని మీకు తెలుసు. మొత్తం ప్రపంచములోని మనుష్యమాత్రులందరూ నంబరువారుగా అక్కడకు వెళ్తారు. అది శాంతిధామము మరియు ఇది దుఃఖధామము. ఇది స్మృతి చేయడమైతే సహజమే కదా. వృద్ధులైనా, యువత అయినా ఇదైతే స్మృతి చేయగలరు కదా. ఇందులో మొత్తం సృష్టి జ్ఞానమంతా వచ్చేస్తుంది. మొత్తం విస్తారమంతా బుద్ధిలోకి వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు సంగమయుగములో కూర్చుని ఉన్నారు. మేము డ్రామా ప్లాన్ అనుసారముగా శాంతిధామానికి వెళ్తున్నాము అన్నది బుద్ధిలో ఉంటుంది. ఇది బుద్ధిలో ఉండడం ద్వారా మీకు సంతోషము కలుగుతుంది, స్మృతి ఉంటుంది. మనకు మన 84 జన్మల స్మృతి కలిగింది. ఆ భక్తి మార్గము వేరు. ఇవి జ్ఞాన మార్గపు విషయాలు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - మధురమైన పిల్లలూ, ఇప్పుడు మీ ఇల్లు గుర్తుకు వస్తోందా? మీరు ఎంతగా వింటూ ఉంటారు, ఎన్నో విషయాలను వింటూ ఉంటారు. ముఖ్యమైన ఒక్క విషయము ఏమిటంటే - ఇప్పుడు మనం శాంతిధామానికి వెళ్తాము, ఆ తర్వాత సుఖధామములోకి వెళ్తాము. తండ్రి పావన ప్రపంచములోకి తీసుకువెళ్ళేందుకే వచ్చారు. సుఖధామములో కూడా ఆత్మలు సుఖము మరియు శాంతిలో ఉంటారు. శాంతిధామములో కేవలం శాంతి ఉంటుంది. ఇక్కడైతే ఎన్నో హంగామాలు ఉన్నాయి కదా. ఇక్కడ మధుబన్ నుండి మీరు మీ ఇంటికి వెళ్తే మీ బుద్ధి పరచింతనా విషయాల వైపుకు, మీ వ్యాపార వ్యవహారాల వైపుకు వెళ్ళిపోతుంది. ఇక్కడైతే ఆ జంజాటాలేవీ ఉండవు. మీకు తెలుసు, ఆత్మలమైన మనం శాంతిధామ నివాసులము. ఇక్కడ మనం పాత్రధారులుగా అయ్యాము. మనం పాత్రధారులుగా ఎలా అవుతాము అనేది ఇంకెవ్వరికీ తెలియదు! పిల్లలైన మిమ్మల్నే తండ్రి వచ్చి చదివిస్తారు, కోట్లాదిమందిలో ఏ ఒక్కరో చదువుకుంటారు. అందరూ చదువుకోరు. మీరు ఇప్పుడు ఎంత వివేకవంతులుగా అవుతారు. ఇంతకుముందు వివేకహీనులుగా ఉండేవారు. ఇప్పుడు చూడండి, గొడవలు-కొట్లాటలు మొదలైనవి ఎన్ని ఉన్నాయి, వీటిని ఏమంటారు? మనమంతా పరస్పరం సోదరులము, అది మర్చిపోయారు. సోదరులు ఎక్కడైనా హతమార్చుకుంటారా? ఒకవేళ ఎక్కడైనా హతమార్చుకున్నా అది ఆస్తి కోసమే అలా చేస్తారు. మనమందరమూ ఒక్క తండ్రి పిల్లలము, పరస్పరం సోదరులము అని ఇప్పుడు మీకు తెలుసు. మీరు ప్రాక్టికల్ గా అర్థం చేసుకుంటారు. ఆత్మలైన మనల్ని బాబా వచ్చి చదివిస్తారు. 5000 సంవత్సరాల క్రితం వలె మనల్ని చదివిస్తారు ఎందుకంటే వారు జ్ఞానసాగరుడు. ఈ చదువు గురించి ఇంకెవ్వరికీ తెలియదు. తండ్రియే స్వర్గ రచయిత అని కూడా పిల్లలైన మీకే తెలుసు. వారిని సృష్టిని రచించేవారు అని అనరు. సృష్టి అయితే అనాది అయినదే. వారిని స్వర్గాన్ని రచించేవారు అని అంటారు. అక్కడ ఇంకే ఖండమూ ఉండేది కాదు. ఇక్కడైతే ఎన్నో ఖండాలు ఉన్నాయి. ఒకే ధర్మము, ఒకే ఖండము ఉన్న సమయము ఒకప్పుడు ఉండేది. ఆ తర్వాత ఇక వెరైటీ ధర్మాలు వచ్చాయి.

వెరైటీ ధర్మాలు ఎలా వస్తాయి అనేది ఇప్పుడు బుద్ధిలో కూర్చుంటుంది. మొట్టమొదటిది ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము, సనాతన ధర్మము అని కూడా ఇక్కడే అంటారు. కానీ దాని అర్థమేమీ తెలుసుకోరు. మీరందరూ ఆది సనాతన దేవీ-దేవతా ధర్మానికి చెందినవారే, కేవలం పతితముగా అయిపోయారు, సతోప్రధానుల నుండి సతో-రజో-తమోగా అవుతూ వచ్చారు. మేము ఆది సనాతన దేవీ-దేవతా ధర్మానికి చెందినవారము, మేము చాలా పవిత్రముగా ఉండేవారము, ఇప్పుడు పతితముగా అయ్యాము అని మీరు అర్థం చేసుకున్నారు. మీరు తండ్రి నుండి పవిత్ర ప్రపంచానికి అధిపతులుగా అయ్యే వారసత్వాన్ని తీసుకున్నారు. మేము మొదట పవిత్ర గృహస్థ ధర్మానికి చెందినవారిగా ఉండేవారము, ఇప్పుడు డ్రామా ప్లాన్ అనుసారముగా రావణ రాజ్యములో మేము పతిత ప్రవృత్తి మార్గానికి చెందినవారిగా అయిపోయాము అని మీరు భావిస్తారు. ఓ పతిత-పావనా, మమ్మల్ని సుఖధామములోకి తీసుకువెళ్ళండి అని మీరే పిలుస్తారు. ఇది నిన్నటి విషయమే. నిన్న మీరు పవిత్రముగా ఉండేవారు, ఈ రోజు అపవిత్రముగా అయి పిలుస్తున్నారు. ఆత్మ పతితముగా అయిపోయింది. బాబా, మీరు వచ్చి మమ్మల్ని మళ్ళీ పావనముగా తయారుచేయండి అని ఆత్మ పిలుస్తుంది. తండ్రి అంటారు, ఇప్పుడు ఈ అంతిమ జన్మ పవిత్రముగా అయినట్లయితే ఇక మీరు 21 జన్మల కొరకు చాలా సుఖవంతులుగా అయిపోతారు. బాబా అయితే చాలా మంచి విషయాలను వినిపిస్తారు, చెడు విషయాలను వదిలేలా చేస్తారు ఎందుకంటే మీరు దేవతలుగా ఉండేవారు కదా, ఇప్పుడు మళ్ళీ అలా అవ్వాలి. పవిత్రముగా అవ్వండి. ఇది ఎంత సహజము. ఈ సంపాదన చాలా భారీ అయినది. శివబాబా వచ్చారని, వారు ప్రతి 5000 సంవత్సరాల తర్వాత వస్తారని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. పాత ప్రపంచము నుండి కొత్త ప్రపంచముగా తప్పకుండా అవుతుంది. ఇది ఇంకెవ్వరూ చెప్పలేరు. శాస్త్రాలలో కలియుగ ఆయువును చాలా ఎక్కువగా చూపించారు. ఇదంతా డ్రామాలో రచింపబడి ఉంది.

ఇప్పుడు పిల్లలైన మీరు పాపాల నుండి ముక్తులుగా అయ్యే పురుషార్థము చేస్తారు. ఇంకే పాపాలు జరగకూడదు అన్న ధ్యానము ఉండాలి. దేహాభిమానములోకి రావడం వల్లనే ఇతర వికారాలు కూడా వస్తాయి, వాటి వల్ల పాపం జరుగుతుంది, అందుకే భూతాలను పారద్రోలవలసి ఉంటుంది. ఈ ప్రపంచములోని ఏ వస్తువు పట్ల మోహం ఉండకూడదు. ఈ పాత ప్రపంచము పట్ల వైరాగ్యము ఉండాలి. ఈ పాత ఇంట్లో ఉంటున్నా కానీ బుద్ధి కొత్త ప్రపంచములో ఉంది అన్నది మీరు చూస్తున్నారు. కొత్త ఇంటికి వెళ్ళినప్పుడు కొత్తదానినే చూస్తారు. ఎప్పటివరకైతే ఈ పాత ఇల్లు అంతమవ్వదో అప్పటివరకూ ఈ కనులతో పాతదానిని చూస్తూ కూడా కొత్తదానినే స్మృతి చేయాలి. తర్వాత పశ్చాత్తాపపడవలసి వచ్చే విధమైన పనులేవీ చేయకూడదు. ఈ రోజు ఫలానావారికి దుఃఖము ఇచ్చాను, ఈ పాపం చేశాను, బాబా - ఇది పాపమేనా అని బాబాను అడగవచ్చు. గుటకలు ఎందుకు మింగాలి. వారిని అడగకపోతే గుటకలు మింగుతూనే ఉంటారు. బాబాను అడిగినట్లయితే బాబా వెంటనే తేలికచేసేస్తారు. మీరు చాలా భారీగా ఉన్నారు. పాపాల భారము చాలా భారీ అయినది. 21 జన్మలు మళ్ళీ పాపాల నుండి తేలికైపోతారు. శిరస్సుపై జన్మ-జన్మాంతరాల భారము ఉంది. ఎంతగా స్మృతిలో ఉంటారో, అంతగా తేలికైపోతూ ఉంటారు, మాలిన్యము తొలగిపోతూ ఉంటుంది మరియు సంతోషము పెరిగిపోతూ ఉంటుంది. సత్యయుగములో మీరు చాలా సంతోషముగా ఉండేవారు, ఆ తర్వాత అది తగ్గిపోతూ, తగ్గిపోతూ మీ సంతోషమంతా మాయమైపోతూ వచ్చింది. సత్యయుగము నుండి కలియుగము వరకూ ఈ యాత్రకు 5000 సంవత్సరాలు పట్టింది. స్వర్గము నుండి నరకములోకి వచ్చే యాత్రకు సంబంధించి మనము స్వర్గము నుండి నరకములోకి ఎలా వచ్చాము అనేది ఇప్పుడు తెలిసింది. ఇప్పుడు మళ్ళీ మీరు నరకము నుండి స్వర్గములోకి వెళ్తారు. ఒక్క క్షణములో జీవన్ముక్తి. తండ్రిని గుర్తించారు. తండ్రి వచ్చారు కావున తప్పకుండా మనల్ని స్వర్గములోకి తీసుకువెళ్తారు. కొడుకు పుట్టగానే ఆస్తికి యజమానిగా అవుతాడు. తండ్రికి చెందినవారిగా అయ్యాక ఇక నషా ఎక్కాలి కదా. మరి అది ఎందుకు దిగాలి? మీరైతే పెద్దవారు కదా. అనంతమైన తండ్రికి మీరు పిల్లలు అయ్యారు కావున అనంతమైన రాజధానిపై మీ హక్కు ఉంది, అందుకే అతీంద్రియ సుఖము గురించి అడగాలంటే గోపీవల్లభుని గోప-గోపికలను అడగండి అన్న గాయనము కూడా ఉంది. వల్లభుడు తండ్రియే కదా, వారిని అడగండి. నంబరువారు పురుషార్థానుసారముగానే సంతోషపు పాదరసము పైకెక్కుతుంది. కొందరైతే వెంటనే తమ సమానముగా తయారుచేస్తారు. పిల్లల పనే ఇది. అన్నింటినీ మరపింపజేసి మన రాజధాని స్మృతిని కలిగించాలి.

మీరు స్వర్గాధిపతులుగా ఉండేవారు. ఇప్పుడు ఇది కలియుగ పాత ప్రపంచము, ఆ తర్వాత కొత్త ప్రపంచము ఉంటుంది. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత తండ్రి భారత్ లోకే వస్తారని ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. వారి జయంతిని కూడా జరుపుకుంటారు. తండ్రి వచ్చి మనకు రాజధానిని ఇచ్చి వెళ్తారని, ఇక అప్పుడు స్మృతి చేయవలసిన అవసరమే ఉండదని మీకు తెలుసు, మళ్ళీ ఎప్పుడైతే భక్తి ప్రారంభమవుతుందో అప్పుడు స్మృతి చేస్తారు. ఆత్మ వారు ఇచ్చిన ఖజానాను అనుభవించింది, కావుననే బాబా, మీరు మళ్ళీ వచ్చి మమ్మల్ని శాంతిధామానికి, సుఖధామానికి తీసుకువెళ్ళండి అని అంటుంది. వారు మన తండ్రి కూడా, టీచర్ కూడా, గురువు కూడా అని ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. ఇది సృష్టి ఆదిమధ్యాంతాల చక్రము. 84 జన్మల జ్ఞానము మీ బుద్ధిలో ఉంది. లెక్కలేనన్ని సార్లు మీరు 84 జన్మలు తీసుకున్నారు మరియు తీసుకుంటూనే ఉంటారు. ఇవి ఎప్పుడూ అంతమవ్వవు. మీ బుద్ధిలోనే ఈ చక్రము ఉంది. స్వదర్శన చక్రము ఘడియ, ఘడియ గుర్తుకు రావాలి. ఇదే మన్మనాభవ, ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో అంతగా పాపాలు భస్మమవుతాయి.

మీరు ఎప్పుడైతే కర్మాతీత అవస్థకు సమీపముగా చేరుకుంటారో, అప్పుడు ఇక మీ ద్వారా ఎటువంటి వికర్మలూ జరగవు. ఇప్పుడు కొద్ది-కొద్దిగా వికర్మలు జరుగుతుంటాయి. సంపూర్ణ కర్మాతీత అవస్థ ఇప్పుడు ఇంకా తయారవ్వలేదు. ఈ బాబా కూడా మీతోపాటు ఒక విద్యార్థియే. చదివించేవారు శివబాబాయే. ఇతనిలోకి ప్రవేశిస్తారు, కానీ ఇతను కూడా విద్యార్థియే. ఇవన్నీ కొత్త-కొత్త విషయాలు. ఇప్పుడు కేవలం మీరు తండ్రిని మరియు సృష్టి చక్రాన్ని స్మృతి చేయండి. అది భక్తి మార్గము, ఇది జ్ఞాన మార్గము. రాత్రికి, పగలుకు ఉన్న తేడా ఉంది! అక్కడ గంటలు, చిడతలు మొదలైనవి ఎన్నో మ్రోగిస్తూ ఉంటారు. ఇక్కడ కేవలం స్మృతిలో ఉండాలి. ఆత్మ అయితే అమరమైనది, అకాల సింహాసనము కూడా ఉంది. అకాలమూర్తి కేవలం ఒక్క తండ్రియే అని కాదు. మీరు కూడా అకాలమూర్తులే. అకాలమూర్తి అయిన ఆత్మకు ఈ భృకుటి సింహాసనము. తప్పకుండా భృకుటిలోనే కూర్చుంటుంది. కడుపులో అయితే కూర్చోదు కదా. అకాలమూర్తి ఆత్మ అయిన మన సింహాసనము ఎక్కడ ఉంది అనేది ఇప్పుడు మీకు తెలుసు. ఈ భృకుటి మధ్యలో మన సింహాసనము ఉంది. అమృత్సర్ లో అకాల సింహాసనము ఉంది కదా. దాని అర్థము ఏ మాత్రమూ తెలియదు. అకాలమూర్తి అన్న మహిమను కూడా గానం చేస్తారు. వారి అకాల సింహాసనము ఏది అనేది ఎవ్వరికీ తెలియదు. ఆ సింహాసనము ఇదే అని ఇప్పుడు మీకు తెలిసింది, దీనిపై కూర్చుని వినిపిస్తారు. ఆత్మ అవినాశీ, శరీరము వినాశీ. ఆత్మకు ఇది అకాల సింహాసనము. ఈ అకాల సింహాసనము సదా ఉంటుంది. ఇది మీరు అర్థం చేసుకుంటారు. దీనికి వారు ఆ అకాల సింహాసనాన్ని తయారుచేసి దానికి ఆ పేరు పెట్టారు. వాస్తవానికి అకాల ఆత్మ అయితే ఇక్కడ కూర్చుని ఉంది. పిల్లలైన మీ బుద్ధిలో అర్థముంది. ఏక్ ఓంకార్... అన్నదాని అర్థాన్ని మీరు అర్థం చేసుకుంటారు. మనుష్యులు మందిరాలలోకి వెళ్ళి అచ్యుతం, కేశవం... అని అంటారు. అర్థమేమీ తెలియదు. అలాగే మహిమ చేస్తూ ఉంటారు. అచ్యుతం, కేశవం, రామ నారాయణం... అని అంటారు. ఇప్పుడు రాముడెక్కడ, నారాయణుడెక్కడ. తండ్రి అంటారు, అవన్నీ భక్తి మార్గానికి చెందినవి. జ్ఞానమైతే చాలా సింపుల్. వేరే ఏ విషయాన్ని అయినా అడిగేకంటే ముందు తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయాలి, ఈ కృషి ఎవ్వరూ చేయలేకపోతున్నారు. మర్చిపోతూ ఉంటారు. మాయ ఇలా చేస్తుంది, భగవంతుడు అలా చేస్తారు అంటూ ఒక నాటకము కూడా ఉంది. మీరు తండ్రిని స్మృతి చేస్తారు, మాయ మిమ్మల్ని ఇంకా తుఫానులలోకి తీసుకువెళ్తుంది. రుస్తుమ్ తో రుస్తుమ్ అయి పోరాడాలి అన్నది మాయ యొక్క ఆజ్ఞ. మీరందరూ యుద్ధ మైదానములో ఉన్నారు. ఇందులో ఏయే రకమైన యోధులు ఉన్నారు అనేది మీకు తెలుసు. కొందరు చాలా బలహీనముగా ఉన్నారు, కొందరు మధ్యస్థంగా బలహీనముగా ఉన్నారు, కొందరైతే చాలా చురుకైనవారిగా ఉన్నారు. అందరూ మాయతో యుద్ధము చేసేవారే. అంతా గుప్తముగా, అండర్ గ్రౌండ్ గా ఉంది. వారు కూడా అండర్ గ్రౌండ్ బాంబులను ట్రయల్ చేస్తూ ఉంటారు. ఇది కూడా పిల్లలైన మీకు తెలుసు, తమ మృత్యువు కొరకే వారు అన్నీ చేస్తున్నారు. మీరు పూర్తిగా శాంతిలో కూర్చున్నారు, వారిది సైన్స్ బలము. ప్రకృతి వైపరీత్యాలు కూడా ఎన్నో ఉన్నాయి. అవైతే ఎవరి వంశములోనూ ఉండవు. ఇప్పుడైతే కృత్రిమ వర్షాల కొరకు కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. కృత్రిమ వర్షాలు కురిస్తే ధాన్యము ఎక్కువగా పండుతుందని భావిస్తారు. ఎన్ని వర్షాలు కురిసినా సరే ప్రకృతి వైపరీత్యాలు అయితే తప్పకుండా జరగనున్నాయని పిల్లలైన మీకు తెలుసు. కుండపోతగా వర్షము కురిస్తే అప్పుడు ఏం చేయగలరు? వాటినే ప్రకృతి వైపరీత్యాలు అని అంటారు. సత్యయుగములో అవి ఉండవు. అవి ఇక్కడ ఉంటాయి, అవి వినాశనములో సహాయము చేస్తాయి.

మనం ఎప్పుడైతే సత్యయుగములో ఉంటామో, అప్పుడు యమునా నది తీరములో బంగారు మహళ్ళు ఉంటాయని మీ బుద్ధిలో ఉంది. అక్కడ మనం చాలా కొద్దిమందిమే ఉంటాము. కల్ప-కల్పమూ ఇలా జరుగుతూ ఉంటుంది. మొదట కొద్దిమందే ఉంటారు, ఆ తర్వాత వృక్షము వృద్ధి చెందుతుంది. అక్కడ ఎటువంటి అశుద్ధమైన వస్తువు ఉండనే ఉండదు. ఇక్కడ చూడండి, పక్షులు కూడా పాడు చేస్తూ ఉంటాయి, అక్కడ అశుద్ధత అన్న మాటే ఉండదు, దానిని స్వర్గము అని అంటారు. మేము దేవతలుగా అవుతున్నాము అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు కావున లోలోపల ఎంతటి సంతోషము ఉండాలి. మాయా రూపీ జిన్ను భూతము నుండి రక్షించుకునేందుకు తండ్రి చెప్తున్నారు, పిల్లలైన మీరు ఈ ఆత్మిక వ్యాపారములో నిమగ్నమైపోండి. మన్మనాభవ, అంతే, ఇందులోనే మీరు జిన్నులా అయిపోండి. జిన్ను భూతము యొక్క ఉదాహరణను ఇస్తారు కదా. నాకు పని ఇవ్వు అని అంటుంది. అలాగే ఇప్పుడు బాబా కూడా పని ఇస్తారు. లేకపోతే మాయ తినేస్తుంది. తండ్రికి పూర్తి సహాయకులుగా అవ్వాలి. తండ్రి ఒక్కరే ఒంటరిగా చేయరు కదా. తండ్రి అయితే రాజ్యము కూడా చేయరు. మీరు సేవ చేస్తారు, రాజ్యము కూడా మీ కొరకే ఉంది. తండ్రి అంటారు, నేను కూడా మగధ దేశములో వస్తాను. మాయ కూడా మొసలి వంటిది, అది ఎంతమంది మహారథులను మింగి తినేస్తుంది. ఇవన్నీ శత్రువులు. ఏ విధంగా కప్పకు పాము శత్రువో అలా మీకు మాయ శత్రువని మీకు తెలుసు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. స్వయాన్ని పాపాల నుండి ముక్తులుగా చేసుకునే పురుషార్థము చేయాలి, దేహాభిమానములోకి ఎప్పుడూ రాకూడదు. ఈ ప్రపంచములోని ఏ వస్తువు పట్ల మోహము పెట్టుకోకూడదు.

2. మాయా రూపీ జిన్ను భూతము నుండి రక్షించుకునేందుకు బుద్ధిని ఆత్మిక వ్యాపారములో బిజీగా ఉంచుకోవాలి. తండ్రికి పూర్తి సహాయకులుగా అవ్వాలి.

వరదానము:-
సర్వ ఖజానాలను సమయానికి ఉపయోగించి నిరంతర సంతోషాన్ని అనుభవము చేసే భాగ్యవాన్ ఆత్మా భవ

బాప్ దాదా ద్వారా బ్రాహ్మణ జన్మ లభించటముతోనే మొత్తము రోజంతటి కోసము అనేక శ్రేష్ఠమైన సంతోషపు ఖజానాలు ప్రాప్తిస్తాయి. అందుకే, మీ పేరు ద్వారానే ఇప్పటికీ అనేక మంది భక్తులు అల్పకాలికమైన సంతోషములోకి వస్తుంటారు, మీ జడ చిత్రాలను చూసి సంతోషములో నాట్యము చేయడం మొదలుపెడతారు. అలా మీరందరూ అదృష్టవంతులు, ఎన్నో ఖజానాలు లభించాయి, కానీ కేవలం వాటిని సమయానికి ఉపయోగించండి. తాళమును సదా ఎదురుగా ఉంచుకోండి అనగా సదా స్మృతిలో ఉంచుకోండి మరియు స్మృతిని స్వరూపములోకి తీసుకురండి, అప్పుడు నిరంతర సంతోషము యొక్క అనుభవము కలుగుతూ ఉంటుంది.

స్లోగన్:-
తండ్రి యొక్క శ్రేష్ఠ ఆశల దీపాన్ని వెలిగించేవారే కుల దీపకులు.

అవ్యక్త ప్రేరణలు - ఆత్మిక స్థితిలో ఉండే అభ్యాసము చెయ్యండి, అంతర్ముఖులుగా అవ్వండి

ఆత్మిక స్థితిలో ఉంటూ బాహ్యముఖతను విడిచిపెట్టినట్లయితే శ్రమ నుండి విముక్తులవుతారు మరియు అనుభవాల సాగరములో ఇమిడిపోతారు. ఒకటి, రెండు అనుభవాలు కాదు, లెక్కలేనన్ని ఉంటాయి. ఒకటి, రెండు అనుభవాలను పొంది అనుభవాలు అనే చెరువులో స్నానము చెయ్యకండి. సాగరుని పిల్లలు అనుభవాల సాగరములో ఇమిడిపోండి.