24-05-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - అమృతవేళలో మీ ఇతర సంకల్పాలన్నింటినీ లాకప్ చేసి (ఆపు చేసి) ఒక్క తండ్రిని ప్రేమగా స్మృతి చేయండి, తండ్రితో మధురాతి-మధురమైన ఆత్మిక సంభాషణను చేయండి’’

ప్రశ్న:-
పిల్లలైన మీ ప్రతి మాటలో అర్థము ఉంది, అర్థసహితమైన మాటలను ఎవరు మాట్లాడగలరు?

జవాబు:-
ఎవరైతే దేహీ-అభిమానులుగా ఉంటారో, వారే ప్రతి మాటను అర్థసహితముగా మాట్లాడగలరు. తండ్రి మీకు సంగమములో ఏదైతే నేర్పిస్తారో, అది అర్థసహితముగా ఉంటుంది. దేహాభిమానములోకి వచ్చి మనుష్యులు ఏవైతే మాట్లాడుతారో, అవన్నీ అర్థము లేకుండా, అనర్థముగా ఉన్నాయి. వాటి నుండి ఎటువంటి ఫలమూ వెలువడదు, లాభమేమీ ఉండదు’’

పాట:-
నయనహీనునికి మార్గాన్ని చూపించండి ప్రభూ...

ఓంశాంతి
ఈ పాటలు మొదలైనవన్నీ భక్తి మార్గానికి చెందినవి. మీకు పాటల యొక్క అవసరము లేదు. అలాగే ఇక్కడ ఎటువంటి కష్టతరమైన విషయమూ లేదు. భక్తి మార్గములోనైతే ఎంతో కష్టము ఉంది. ఎన్ని అచార-వ్యవహారాలు కొనసాగుతూ ఉంటాయి - బ్రాహ్మణులకు తినిపించడము, అది చేయడము, ఇది చేయడము, తీర్థయాత్రలు మొదలైన విషయాలలో ఎన్నో చేయవలసి ఉంటుంది. ఇక్కడకు వచ్చాక అన్ని కష్టాల నుండి విడిపిస్తారు. ఇందులో ఏమీ చేయవలసిన అవసరము లేదు. నోటితో శివ-శివ అని అనకూడదు. ఇది నియమము కాదు, దీని ద్వారా ఫలమేమీ లభించదు. తండ్రి అంటారు - నేను ఆత్మను అని లోలోపల భావించాలి. నన్ను స్మృతి చేయండి అని తండ్రి అన్నారు, అంతర్ముఖులుగా అయి తండ్రినే స్మృతి చేయాలి, తద్వారా మీ పాపాలు భస్మమవుతాయి అని తండ్రి ప్రతిజ్ఞ చేస్తారు. ఇది యోగాగ్ని, దీని ద్వారా మీ వికర్మలు వినాశనమవుతాయి, మళ్ళీ మీరు తిరిగి వెళ్ళిపోతారు. చరిత్ర రిపీట్ అవుతుంది. ఇవన్నీ మీతో మీరు మాట్లాడుకునేందుకు యుక్తులు. మీతో మీరు ఆత్మిక సంభాషణ చేసుకుంటూ ఉండండి. తండ్రి అంటారు - నేను కల్ప-కల్పమూ మీకు ఈ యుక్తిని తెలియజేస్తాను. మెల్లమెల్లగా ఈ వృక్షము వృద్ధి చెందుతుందని కూడా మీకు తెలుసు. మాయా తుఫాన్లు కూడా ఈ సమయములోనే ఉన్నాయి, ఈ సమయములోనే నేను వచ్చి పిల్లలైన మిమ్మల్ని మాయ బంధనాల నుండి విడిపిస్తాను. సత్యయుగంలో ఎటువంటి బంధనము ఉండదు. ఈ పురుషోత్తమ యుగము కూడా ఇప్పుడు మీకు అర్థసహితముగా బుద్ధిలో ఉంది. ఇక్కడ ప్రతి విషయము అర్థసహితముగా ఉంటుంది. దేహాభిమానులు ఏవైతే మాట్లాడుతారో అదంతా అనర్థమే. దేహీ-అభిమానులు ఏదైతే మాట్లాడుతారో, అది అర్థసహితముగా ఉంటుంది. దాని నుండి ఫలము వెలువడుతుంది. ఇప్పుడు భక్తి మార్గములో ఎంత కష్టము కలుగుతుంది. తీర్థయాత్రలు చేయడము, ఇది చేయడము, అది చేయడము - ఇవన్నీ భగవంతుని వద్దకు చేరుకునేందుకు మార్గాలు అని వారు భావిస్తారు. కానీ ఒక్కరు కూడా తిరిగి వెళ్ళలేరని పిల్లలు ఇప్పుడు అర్థం చేసుకున్నారు. మొదటి నంబరులో విశ్వాధిపతులుగా ఉన్న లక్ష్మీ-నారాయణులే 84 జన్మలు తీసుకుంటారని చెప్తున్నప్పుడు, మరి ఇతరులు ఎలా విముక్తులవ్వగలరు. అందరూ చక్రములోకి వస్తారు. మరి కృష్ణుడు సదా అలాగే నిలిచి ఉంటారని వారి గురించి ఎలా చెప్పగలరు. అయితే, కృష్ణుని నామ-రూపాలు లేవు, కానీ ఆ ఆత్మ ఏదో ఒక రూపములోనైతే ఉంది. ఈ విషయాలన్నింటినీ తండ్రి వచ్చి పిల్లలకు అర్థం చేయించారు. ఇది చదువు. విద్యార్థి జీవితములో అటెన్షన్ పెట్టాలి. ప్రతిరోజూ మీ చార్టు వ్రాసేందుకు సమయము ఫిక్స్ చేసుకోండి. వ్యాపారులకు ఎన్నో బంధనాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు బంధనాలు ఉండవు. వారు తమ పని పూర్తి చేస్తే సరిపోతుంది. వ్యాపారస్తుల వద్దకు ఎప్పుడైనా కస్టమర్లు వస్తే మరి సప్లయి (పంపిణీ) చేయవలసి ఉంటుంది. బుద్ధియోగము బయటకు వెళ్ళిపోతుంది. కావున ప్రయత్నించి సమయము తీయాలి. అమృతవేళ సమయము మంచిది. ఆ సమయములో బయటి ఆలోచనలను లాకప్ (ఆపు) చేయాలి, ఏ ఆలోచనా రాకూడదు. తండ్రి స్మృతే ఉండాలి. బాబా జ్ఞానసాగరుడు, పతిత-పావనుడు అని తండ్రి మహిమను వ్రాయాలి. బాబా మనల్ని విశ్వాధిపతులుగా తయారుచేస్తారు, వారి శ్రీమతముపై నడవాలి. మీకు అన్నింటికన్నా మంచి మతము లభిస్తుంది - మన్మనాభవ. ఇంకెవ్వరూ ఈ విధంగా చెప్పలేరు. తమోప్రధానము నుండి సతోప్రధానముగా అయ్యే ఈ మతము కల్ప-కల్పమూ లభిస్తుంది. కేవలం నన్నొక్కరినే స్మృతి చేయండి అని తండ్రి అంటారు. దీనిని వశీకరణ మంత్రము అని అంటారు, అర్థసహితముగా స్మృతి చేయడం ద్వారానే సంతోషము కలుగుతుంది.

అవ్యభిచారీ స్మృతి ఉండాలి అని తండ్రి అంటారు. ఏ విధంగా భక్తిలో ఒక్క శివుని పూజ అవ్యభిచారిగా ఉంటుంది, అదే మళ్ళీ వ్యభిచారిగా అవ్వడముతో అనేకుల భక్తిని చేస్తారు. మొదట అద్వైత భక్తి ఉండేది, ఒక్కరి భక్తినే చేసేవారు. జ్ఞానము కూడా ఆ ఒక్కరిదే వినాలి. పిల్లలైన మీరు ఎవరి భక్తినైతే చేసేవారో, వారు స్వయంగా మీకు అర్థం చేయిస్తున్నారు - మధురాతి-మధురమైన పిల్లలూ, ఇప్పుడు నేను వచ్చాను, ఈ భక్తి మార్గము ఇప్పుడు పూర్తయింది. మీరే మొట్టమొదట ఒక్క శివబాబా మందిరాన్ని నిర్మించారు. ఆ సమయములో మీరు అవ్యభిచారీ భక్తులుగా ఉండేవారు, అందుకే ఎంతో సుఖముగా ఉండేవారు, ఆ తర్వాత వ్యభిచారీ భక్తులుగా అవ్వడముతో ద్వైతములోకి వచ్చేసారు, అప్పుడు కాస్త దుఃఖము కలుగుతుంది. అందరికీ సుఖాన్ని ఇచ్చేవారు ఒక్క తండ్రే కదా. తండ్రి అంటారు - నేను వచ్చి పిల్లలైన మీకు మంత్రము ఇస్తాను. మంత్రము కూడా ఒక్కరిదే వినండి, ఇక్కడ దేహధారులెవ్వరూ లేరు. ఇక్కడికి మీరు బాప్ దాదా వద్దకు వస్తారు. శివబాబా కన్నా ఉన్నతమైనవారు ఇంకెవరూ లేరు. స్మృతి కూడా అందరూ వారినే చేస్తారు. భారత్ యే స్వర్గముగా ఉండేది, లక్ష్మీ-నారాయణుల రాజ్యము ఉండేది. వారిని ఆ విధంగా ఎవరు తయారుచేశారు? వారినే మీరు మళ్ళీ పూజిస్తారు. మహాలక్ష్మి ఎవరు, మహాలక్ష్మి పూర్వ జన్మ ఎలా ఉండేది అనేది ఎవరికీ తెలియదు! వారు జగదాంబ అని పిల్లలైన మీకు తెలుసు. మీరందరూ మాతలు, వందే మాతరం. మొత్తం జగత్తుపై మీరు మీ అధికారాన్ని ప్రాప్తి చేసుకుంటారు. భారతమాత అన్నది కేవలం ఒక్కరి పేరే కాదు. మీరందరూ యోగబలము ద్వారా శివుడి నుండి శక్తి తీసుకుంటారు. శక్తి తీసుకోవడములో మాయ జోక్యం చేసుకుంటుంది. యుద్ధములో ఎవరైనా దెబ్బ కొడితే ధైర్యవంతులుగా అయ్యి పోరాడాలి. ఎవరో దెబ్బ కొడితే మీరు అందులో చిక్కుకుపోవడము కాదు, ఇది మాయ యొక్క యుద్ధము. అంతేకానీ కౌరవులు మరియు పాండవులకు మధ్యన యుద్ధము లేదు, కౌరవులకు పరస్పరమే యుద్ధము జరుగుతుంది. మనుష్యులు గొడవపడినప్పుడు ఒకటి-రెండు గజాల భూమి కోసము ప్రాణాలు తీసుకుంటారు. ఇదంతా డ్రామాగా తయారై ఉందని తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు. రామ రాజ్యము, రావణ రాజ్యము. మనము రామ రాజ్యములోకి వెళ్తామని, అక్కడ అపారమైన సుఖము ఉండేదని పిల్లలైన మీకు ఇప్పుడు ఈ జ్ఞానము ఉంది. దాని పేరే సుఖధామము, అక్కడ దుఃఖము యొక్క నామ-రూపాలు ఉండవు. ఇప్పుడు ఇటువంటి రాజ్యాన్ని ఇచ్చేందుకు తండ్రి వచ్చారు కావున పిల్లలు ఎంత పురుషార్థము చేయాలి. నేను ఘడియ-ఘడియ చెప్తాను - పిల్లలూ, అలసిపోకండి, శివబాబాను స్మృతి చేస్తూ ఉండండి. వారు కూడా బిందువే, ఆత్మలమైన మనము కూడా బిందువే, ఇక్కడికి పాత్రను అభినయించేందుకు వచ్చాము, ఇప్పుడు పాత్ర పూర్తయింది. ఇప్పుడు తండ్రి అంటారు - నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి. వికర్మలు ఆత్మకే అంటుకుంటాయి కదా. శరీరాలైతే ఇక్కడ సమాప్తమైపోతాయి. కొందరు మనుష్యులు ఏవైనా పాప కర్మలు చేస్తే తమ శరీరాన్నే సమాప్తము చేసుకుంటారు. కానీ దీని వలన పాపమేమీ తొలగదు. పాపాత్మ అని అంటారు. సాధు-సన్యాసులు మొదలైనవారు అయితే - ఆత్మ నిర్లేపి, ఆత్మయే పరమాత్మ అని అంటారు. అనేక మతాలు ఉన్నాయి. ఇప్పుడు మీకు ఒకే శ్రీమతము లభిస్తుంది. తండ్రి మీకు జ్ఞానమనే మూడవ నేత్రాన్ని ఇచ్చారు. ఆత్మకే అన్ని విషయాలు తెలుసు. ఇంతకుముందు ఈశ్వరుని గురించి ఏమీ తెలిసేది కాదు. సృష్టి చక్రము ఎలా తిరుగుతుంది, ఆత్మ ఎంత చిన్ననిది అని మొట్టమొదట ఆత్మ యొక్క రియలైజేషన్ చేయిస్తారు. ఆత్మ చాలా సూక్ష్మమైనది, ఆత్మ సాక్షాత్కారము జరుగుతుంది, అవన్నీ భక్తి మార్గపు విషయాలు. జ్ఞాన విషయాలను తండ్రి మాత్రమే అర్థం చేయిస్తారు. వారు కూడా భృకుటి మధ్యలో పక్కనే వచ్చి కూర్చుంటారు. వీరు కూడా వెంటనే అర్థం చేసుకుంటారు. ఇవన్నీ కొత్త విషయాలు, వీటిని తండ్రే కూర్చుని అర్థం చేయిస్తారు. వీటిని పక్కాగా గుర్తుంచుకోండి, మర్చిపోకండి. తండ్రిని ఎంతగా స్మృతి చేస్తారో, అంతగా వికర్మలు వినాశనమవుతాయి. వికర్మలు వినాశనమవ్వడంపైనే మీ భవిష్యత్తు ఆధారపడి ఉంది. పిల్లలైన మీతోపాటు భారత ఖండము కూడా అన్నింటికన్నా సౌభాగ్యశాలి, ఇంతటి సౌభాగ్యశాలిగా వేరే ఏ ఖండమూ లేదు. ఇక్కడికి తండ్రి వస్తారు. భారత్ యే స్వర్గముగా ఉండేది, దానిని అల్లాహ్ యొక్క పుష్పాలతోట అని అంటారు. తండ్రి మళ్ళీ భారత్ ను పుష్పాలతోటగా తయారుచేస్తున్నారని మీకు తెలుసు, అక్కడికి వెళ్ళేందుకే మనం చదువుతాము. సాక్షాత్కారాలు కూడా జరుగుతాయి, ఇది అదే మహాభారత యుద్ధమని కూడా తెలుసు, ఇటువంటి యుద్ధము మళ్ళీ ఎప్పుడూ జరగదు. పిల్లలైన మీ కొరకు కొత్త ప్రపంచము కూడా తప్పకుండా కావాలి. కొత్త ప్రపంచము ఉండేది కదా, భారత్ స్వర్గముగా ఉండేది. నేటికి 5 వేల సంవత్సరాలయ్యింది, లక్షల సంవత్సరాల విషయమైతే కాదు. లక్షల సంవత్సరాలైతే మనుష్యులు లెక్కలేనంతమంది అయిపోతారు. జనాభా ఇప్పుడు అంతగా లేనప్పుడు లక్షల సంవత్సరాలు ఎలా ఉండగలదు అన్నది కూడా మనుష్యుల బుద్ధిలో కూర్చోదు.

నేటికి 5 వేల సంవత్సరాల క్రితం మనం విశ్వముపై రాజ్యం చేసేవారమని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు, అప్పుడు ఇతర ఖండాలు లేవు, అవన్నీ తర్వాత వస్తాయి. పిల్లలైన మీ బుద్ధిలో ఈ విషయాలన్నీ ఉన్నాయి, ఇంకెవరి బుద్ధిలోనూ అసలు లేవు. ఇది నిజమే, మనకంటే ముందు తప్పకుండా ఏదో ధర్మము ఉండేది అని మీరు కొద్దిగా సూచన ఇచ్చినా అర్థం చేసుకుంటారు. ఒక్క ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము ఉండేదని, అది కనుమరుగైపోయిందని ఇప్పుడు మీరు అర్థం చేయించవచ్చు. ఎవ్వరూ తమను తాము దేవతా ధర్మమువారిగా పిలుచుకోలేరు. మేము ఆది సనాతన దేవీ-దేవతా ధర్మానికి చెందినవారమని ఎవరూ భావించనే భావించరు. మరి ఆ ధర్మము ఏమైంది? హిందూ ధర్మము ఎక్కడి నుండి వచ్చింది? ఎవరికీ ఈ విషయాలలో ఆలోచన నడవదు. పిల్లలైన మీరు అర్థం చేయించవచ్చు - తండ్రి జ్ఞానసాగరుడు, జ్ఞానము యొక్క అథారిటీ, కావున వారు తప్పకుండా వచ్చి జ్ఞానాన్ని వినిపించి ఉంటారు. జ్ఞానము ద్వారానే సద్గతి జరుగుతుంది. ఇందులో ప్రేరణ యొక్క విషయమేమీ లేదు. తండ్రి అంటారు - ఇప్పుడు ఏ విధంగానైతే వచ్చానో, అలాగే కల్ప-కల్పమూ వస్తాను. కల్పము తర్వాత కూడా వచ్చి మళ్ళీ పిల్లలందరినీ కలుస్తాను. మీరు కూడా ఇలా చక్రములో తిరుగుతారు. రాజ్యాన్ని తీసుకుంటారు, మళ్ళీ పోగొట్టుకుంటారు. ఇది అనంతమైన నాటకము, మీరందరూ పాత్రధారులు. ఆత్మ పాత్రధారి అయ్యి ఉండి తనకు క్రియేటర్, డైరెక్టర్, ముఖ్యమైన యాక్టర్ గురించి తెలియకపోతే ఇక దేనికి ఉపయోగపడతారు. ఆత్మ ఏ విధంగా శరీరాన్ని ధారణ చేస్తుంది మరియు పాత్రను అభినయిస్తుంది అనేది పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ తిరిగి వెళ్ళాలి. ఇప్పుడు ఇది ఈ పాత ప్రపంచము యొక్క అంతిమము. ఇది ఎంత సహజమైన విషయము. తండ్రి ఎలా గుప్తముగా కూర్చుని ఉన్నారు అనేది పిల్లలైన మీకే తెలుసు. రజాయిలో రచయితను చూసాము (పాత శరీరములో శివబాబా ప్రవేశించడాన్ని చూసాము). ఇప్పుడు చూసాము అన్నా లేక తెలుసుకున్నాము అన్నా విషయము ఒకటే. ఆత్మను చూడగలరు కానీ దాని వలన లాభమేమీ లేదు. అది ఎవరికీ అర్థం కాదు. నవవిధ భక్తిలో ఎన్నో సాక్షాత్కారాలు పొందుతారు, ఇంతకుముందు పిల్లలైన మీరు కూడా ఎన్ని సాక్షాత్కారాలు పొందేవారు, ఎన్నో ప్రోగ్రామ్లు వచ్చేవి, మళ్ళీ చివర్లో ఈ ఆటను మీరు చూస్తారు. ఇప్పుడు తండ్రి అంటారు - చదువుకుని తెలివైనవారిగా అవ్వండి. ఒకవేళ చదవకపోతే రిజల్టు వెలువడినప్పుడు ముఖము కిందకి దిగిపోతుంది, అప్పుడు - మేము ఎంత సమయాన్ని వృధా చేశాము అని భావిస్తారు. ఎంతెంతగా తండ్రి స్మృతిలో ఉంటారో, అంతగా స్మృతి బలము ద్వారా పాపాలు తొలుగుతాయి. ఎంతగా తండ్రి స్మృతిలో ఉంటారో, అంతగా సంతోషపు పాదరసము పైకి ఎక్కుతుంది.

భగవంతుడిని ఎందుకు స్మృతి చేస్తారు అనేది మనుష్యులకు తెలియదు. నీవే తల్లివి-తండ్రివి... అని అంటారు కానీ దాని అర్థము తెలియదు. ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. వారు జ్ఞానసాగరుడు, పతిత-పావనుడు, వారినే స్మృతి చేయాలి అని మీరు శివుని చిత్రముపై అర్థం చేయించవచ్చు. అపారమైన సుఖము యొక్క మార్గాన్ని చూపించేందుకు ఆ తండ్రే వచ్చారని పిల్లలకు తెలుసు. ఇది చదువు. ఇందులో ఎవరెంత పురుషార్థము చేస్తే, అంత ఉన్నత పదవిని పొందుతారు. వీరి సింహాసనము ఎప్పటినుండో అలా కొనసాగుతూ రావడానికి వీరు సాధు-సన్యాసి ఏమీ కాదు. ఇది శివబాబా సింహాసనము. వీరు వెళ్ళిపోతే ఇంకెవరో సింహాసనముపై కూర్చుంటారని కాదు. తండ్రి అయితే అందరినీ తమతో పాటు తీసుకువెళ్తారు. చాలా మంది పిల్లలు వ్యర్థమైన ఆలోచనలలో తమ సమయాన్ని వృధా చేసుకుంటారు. చాలా ధనాన్ని పోగు చేసుకోవాలి, పిల్లలు-మనుమలు తింటారు, తర్వాత ఉపయోగపడుతుంది, బ్యాంకు లాకర్లో జమ చేసుకోవాలి, పిల్లలు మొదలైనవారు తింటూ ఉంటారు అని ఈ విధంగా ఆలోచిస్తారు. కానీ గవర్నమెంట్ ఎవరినీ విడిచిపెట్టదు, అందుకే దాని గురించి ఎక్కువగా ఆలోచించకుండా మీ భవిష్య సంపాదనలో నిమగ్నమైపోవాలి. ఇప్పుడు పిల్లలు పురుషార్థము చేయాలి. డ్రామాలో ఉంటే చేస్తాము అని కాదు. పురుషార్థము లేకుండా ఆహారము కూడా లభించదు, కానీ ఎవరి భాగ్యములోనైనా లేకపోతే ఇటువంటి ఆలోచనలే వస్తుంటాయి. భాగ్యములోనే లేకపోతే ఇక ఈశ్వరీయ పురుషార్థము కూడా ఏం చేస్తారు. ఎవరి భాగ్యములో ఉంటే, వారు మంచి రీతిలో ధారణ చేస్తారు మరియు చేయిస్తారు. తండ్రి మీకు టీచర్ కూడా, గురువు కూడా, కావున వారిని స్మృతి చేయాలి. అందరికన్నా ప్రియమైనవారు తండ్రి, టీచర్ మరియు గురువు. వారిని స్మృతి చేయాలి. బాబా ఎన్నో యుక్తులను తెలియజేస్తారు. మీరు సాధు-సన్యాసులు మొదలైనవారికి కూడా ఆహ్వానము ఇవ్వవచ్చు. అచ్ఛా.

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. పురుషార్థము చేసి మీ భవిష్య సంపాదనలో నిమగ్నమైపోవాలి, డ్రామాలో ఉంటే చేస్తాము అని అంటూ పురుషార్థహీనులుగా అవ్వకూడదు.

2. మొత్తం రోజంతటిలో ఏవైనా పాపాలు జరిగినా లేక ఎవరికైనా దుఃఖాన్ని ఇచ్చినా, దానిని నోట్ చేసుకోవాలి. సత్యతతో తండ్రికి వినిపించాలి, స్వచ్ఛమైన హృదయము కలవారిగా అయి ఒక్క తండ్రి స్మృతితో అన్ని లెక్కాచారాలను సమాప్తము చేసుకోవాలి.

వరదానము:-
కిరీటాన్ని మరియు సింహాసనాన్ని సదా నిలిపి ఉంచుకునే నిరంతర స్వతహా యోగీ భవ

వర్తమాన సమయములో తండ్రి ద్వారా పిల్లలందరికీ కిరీటము మరియు సింహాసనము లభిస్తాయి, ఇప్పటి ఈ కిరీటము మరియు సింహాసనము అనేక జన్మల కొరకు కిరీటాన్ని, సింహాసనాన్ని ప్రాప్తింపజేయిస్తాయి. విశ్వకళ్యాణము యొక్క బాధ్యతా కిరీటము మరియు బాప్ దాదా యొక్క హృదయసింహాసనము సదా నిలిచి ఉన్నట్లయితే నిరంతర స్వతహా యోగిగా అయిపోతారు. వారు ఏ రకంగానూ కష్టపడవలసిన అవసరము ఉండదు. ఎందుకంటే, ఒకటేమో - ఈ సంబంధము సమీపమైనది మరియు రెండవది - ఈ ప్రాప్తి తరగనిది. ఎక్కడైతే ప్రాప్తి ఉంటుందో, అక్కడ స్మృతి స్వతహాగా ఉంటుంది.

స్లోగన్:-
ప్లెయిన్ బుద్ధితో ప్లాన్ ను ప్రాక్టికల్ లోకి తీసుకువచ్చినట్లయితే, అందులో సఫలత ఇమిడి ఉంటుంది.

అవ్యక్త సూచనలు - ఆత్మిక రాయల్టీని మరియు పవిత్రత యొక్క పర్సనాలిటీని ధారణ చెయ్యండి

దుఃఖము-అశాంతి అనేవి అపవిత్రత నుండి ఉత్పన్నమవుతాయి. ఎక్కడైతే అపవిత్రత ఉండదో, అక్కడికి దుఃఖము-అశాంతి ఎక్కడి నుండి వస్తాయి. మీరందరూ పతిత-పావనుడైన తండ్రి యొక్క పిల్లలు మాస్టర్పతిత-పావనులు, మరి ఎవరైతే ఇతరులను పతితము నుండి పావనముగా తయారుచేస్తారో, వారు స్వయం పావనముగా ఉండనే ఉంటారు. ఇటువంటి పావనమైన పవిత్ర ఆత్మల వద్ద సుఖము మరియు శాంతి స్వతహాగానే ఉంటాయి. అన్నింటికన్నా అతి పెద్ద మహానత పావనముగా అవ్వడము. నేటికి కూడా ఈ మహానత ఎదురుగానే అందరూ తల వంచుతారు.