24-06-2025 ప్రాత:మురళి ఓంశాంతి 'బాప్దాదా' 15.12.2005


‘‘మాతేశ్వరిగారి పుణ్య స్మృతి దివసము నాడు ప్రాతః క్లాసులో వినిపించేందుకు మధుర మహావాక్యాలు’’

పాట:- నా ఈ చిన్న ప్రపంచాన్ని చూడండి...

ఈ పాట ఏదో సమయం గురించి పాడినది ఎందుకంటే ఈ సంగమ సమయమే మన బ్రాహ్మణ కులం యొక్క చిన్న ప్రపంచము. మన ఈ పరివారం ఎటువంటిది? ఇది నంబరువారుగా తెలియజేస్తారు. మనం పరమపిత పరమాత్మ శివుని మనవలము, బ్రహ్మా-సరస్వతుల ముఖ సంతానము మరియు విష్ణువు, శంకరులు మన పెద్దనాన్నలు, పరస్పరంలో మనమందరము సోదరీ-సోదరులము. ఇది మన చిన్న ప్రపంచము... ఇంతకుమించి వేరే సంబంధాలను రచించనే లేదు, ఈ సమయానికి ఇన్ని సంబంధాలే చెప్తారు. చూడండి, మన సంబంధం ఎంత పెద్ద అథారిటితో ఉంది! మన తాతగారు శివ్, వారి పేరు ఎంత గొప్పది, వారు మొత్తం మనుష్య సృష్టికి బీజరూపుడు. సర్వాత్మలకు కళ్యాణకారి అయిన కారణంగా వారిని హర హర భోళానాథుడు, శివ మహాదేవుడు అని అంటారు. వారు మొత్తం సృష్టి యొక్క దుఃఖహర్త, సుఖకర్త. వారి ద్వారా మనకు సుఖము, శాంతి, పవిత్రతల పెద్ద హక్కు లభిస్తుంది. శాంతిలోనైతే ఏ కర్మబంధనాల యొక్క లెక్కాచారము ఉండదు. కానీ ఈ రెండూ పవిత్రత ఆధారంపై ఉంటాయి. ఎప్పటివరకైతే తండ్రి పాలన యొక్క పూర్తి వారసత్వాన్ని తీసుకుని తండ్రి నుండి సర్టిఫికెట్ లభించదో, అప్పటివరకు ఆ వారసత్వం లభించజాలదు. చూడండి, బ్రహ్మాపై ఎంత పెద్ద కార్యం ఉంది. అశుద్ధమైన 5 వికారాలతో మలినమైన అపవిత్ర ఆత్మలను పుష్పాలుగా తయారుచేస్తారు. ఈ అలౌకిక కార్యానికి ప్రతిఫలంగా సత్యయుగంలో మొదటి నంబరు శ్రీకృష్ణుని పదవి లభిస్తుంది. ఇప్పుడు చూడండి, ఆ తండ్రితో మీకు ఎటువంటి సంబంధం ఉంది! కావున ఎంత నిశ్చింతగా మరియు సంతోషంగా ఉండాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ తమ హృదయాన్ని ప్రశ్నించుకోండి, మేము పూర్తి రీతిగా వారికి చెందినవారిగా అయ్యామా?

ఈ విధంగా ఆలోచించాలి, పరమాత్మ తండ్రి వచ్చారంటే మనం వారి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి. విద్యార్థి పని ఏమిటంటే, సంపూర్ణ పురుషార్థం చేసి స్కాలర్షిప్ తీసుకోవడము, మరి మనం మొదటి నంబరు లాటరీని ఎందుకు గెలుచుకోకూడదు! అదేమిటంటే, విజయమాలలో కూర్చబడడము. మిగిలినవారు రెండు లడ్డూలు పట్టుకుని కూర్చున్నారు, ఇక్కడి హద్దు సుఖాన్ని కూడా తీసుకుంటాను మరియు అక్కడ వైకుంఠంలో కూడా ఎంతో కొంత సుఖాన్ని అయితే తీసుకుంటానులే అని. ఇలా ఆలోచించేవారిని మధ్యమ మరియు కనిష్ఠ పురుషార్థులు అని అంటారు, అంతేకానీ సర్వోత్తమ పురుషార్థీ అని అనరు. తండ్రి ఇవ్వడంలో వెనుకాడనప్పుడు, తీసుకునేవారు ఎందుకు అలా చేస్తారు? అందుకే గురునానక్ అన్నారు, పరమాత్మ అయితే దాత, సమర్థుడు కానీ ఆత్మలకు తీసుకునే శక్తి కూడా లేదు, ఇచ్చేవారు ఇస్తారు కానీ తీసుకునేవారు అలసిపోతారు అన్న నానుడి ఉంది. మేము కూడా ఈ పదవి పొందాలని ఎందుకు కోరుకోకూడదు అని మీ మనసులో ఆలోచన వస్తూ ఉండవచ్చు. కానీ, బాబా ఎంత శ్రమ చేస్తున్నారో చూడండి, అయినా కూడా మాయ ఎన్ని విఘ్నాలను వేస్తుంది, ఎందుకు? ఇప్పుడు మాయా రాజ్యం సమాప్తమవ్వనున్నది. ఇప్పుడు మాయ మొత్తం సారాన్ని తీసేసింది, అప్పుడే పరమాత్మ వస్తారు. వారిలో అన్ని రసాలు ఇమిడి ఉన్నాయి, వారి నుండి సర్వ సంబంధాల రసము లభిస్తుంది, అందుకే త్వమేవ మాతాశ్చ పితా... మొదలైన ఈ మహిమ ఆ పరమాత్మ గురించే గాయనం చేయబడింది, కావున ఇటువంటి సంబంధం ఏర్పడిన ఈ సమయానిదే బలిహారము.

పరమాత్మతో ఎంతటి సంపూర్ణ సంబంధాన్ని జోడించాలంటే, దానితో 21 జన్మల కోసం సుఖం ప్రాప్తించాలి, ఇది పురుషార్థం యొక్క సిద్ధి. కానీ 21 జన్మలు అన్న మాటను విని చల్లబడిపోకండి. 21 జన్మల కోసం ఇంతగా ఈ సమయంలో పురుషార్థం చేసినా కూడా, మళ్ళీ 21 జన్మల తర్వాత పడిపోయేదే ఉంది అన్నట్లయితే సిద్ధి ఏమైనట్లు? అని ఇలా ఆలోచించకండి. కానీ డ్రామాలో ఆత్మలకు ఎంతటి సర్వోత్తమ సిద్ధి నిశ్చితమై ఉందో, అదైతే లభిస్తుంది కదా! తండ్రి వచ్చి మనల్ని సంపూర్ణ స్థితికి చేరుస్తారు, కానీ పిల్లలైన మనం బాబాను మర్చిపోయినట్లయితే తప్పకుండా పడిపోతాము, ఇందులో తండ్రి దోషమేమీ లేదు. ఇప్పుడు ఏదైనా లోటు ఉంది అంటే - సత్య-త్రేతాయుగాలలో పిల్లలైన మన సుఖమంతా ఈ జన్మ యొక్క పురుషార్థంపై ఆధారపడి ఉంటుంది, మరి అటువంటప్పుడు సంపూర్ణ పురుషార్థం చేసి మన సర్వోత్తమ పాత్రను ఎందుకు అభినయించకూడదు! పురుషార్థం చేసి ఆ వారసత్వాన్ని ఎందుకు తీసుకోకూడదు. మనిషి సదా సుఖం కోసమే పురుషార్థం చేస్తాడు. సుఖ-దుఃఖాలకు అతీతంగా అయ్యేందుకు ఎవరూ పురుషార్థం చేయరు, డ్రామా అంతిమంలో పరమాత్మ వచ్చి ఆత్మలందరికీ శిక్షలు ఇచ్చి పవిత్రంగా చేసి, పాత్ర నుండి విముక్తులుగా చేస్తారు. ఇది పరమాత్ముని కార్యము. వారు తమ నిశ్చిత సమయానికి తమంతట తామే వచ్చి తెలియజేస్తారు. ఇప్పుడు, ఆత్మలు మళ్ళీ పాత్రలోకి రావాల్సే ఉంటుంది అన్నప్పుడు, మరి సర్వోత్తమ పాత్రను ఎందుకు అభినయించకూడదు.

మనుష్య సృష్టి సుఖవంతంగా ఎలా తయారవుతుంది అన్నది మనుష్య సృష్టిని సుఖవంతముగా తయారుచేసే తండ్రికి తెలుసు. ఎప్పటివరకైతే ఆత్మలు స్వచ్ఛంగా అవ్వవో అప్పటివరకు ప్రపంచము సుఖవంతంగా అవ్వదు, అందుకే వారు వచ్చి మొట్టమొదట ఆత్మలనే స్వచ్ఛంగా తయారుచేస్తారు. ఇప్పుడు ఆత్మకు అపవిత్రత (అస్వచ్ఛత) అంటుకుని ఉంది. మొదట ఆ అపవిత్రతను తొలగించాలి. అప్పుడు ఆత్మ బలము ద్వారా ప్రతి వస్తువులోని తమోప్రధానత పరివర్తన అయ్యి సతోప్రధానంగా అవుతుంది, అందరూ బంగారు యుగములోకి వస్తారని దీనినే అంటారు, కనుక ఈ తత్వాలు మొదలైనవన్నీ బంగారుయుగ స్థితిలోకి వచ్చేస్తాయి. కానీ మొదట ఆత్మ యొక్క స్థితి మారుతుంది. కనుక ఆత్మలను మార్చేవారు అనగా ఆత్మలను పవిత్రంగా తయారుచేసే ఆథారిటీ వారే అవుతారు. ఇప్పుడు ప్రపంచము పరివర్తన అవుతూ ఉందని మీరు చూస్తున్నారు కదా. మొదట స్వయాన్ని మార్చుకోవాలి, ఎప్పుడైతే మనము స్వయాన్ని మార్చుకుంటామో అప్పుడు దాని ఆధారముతో ప్రపంచము మారుతుంది. ఒకవేళ ఇప్పటికీ మనలో మార్పు రాలేదంటే, స్వయాన్నే మార్చుకోలేదంటే ఇక ప్రపంచము ఎలా మారుతుంది, అందుకే ప్రతిరోజూ స్వయాన్ని చెక్ చేసుకోండి. ఏ విధంగా లెక్కాపత్రము చూసుకునేవారు తమ ఖాతాలో ఈరోజు ఎంత జమ అయింది అని రాత్రి చూసుకుంటారు కదా. అందరూ తమ లెక్కల ఖాతాను పెట్టుకుంటారు. కనుక ఇక్కడ కూడా రోజంతటిలో నాకు ఎంత లాభము వచ్చింది, ఎంత నష్టపోయాను అని తమ లెక్కాపత్రం పెట్టుకోవాలి. ఒకవేళ ఎక్కువగా నష్టపోయి ఉంటే మరుసటి రోజు మళ్ళీ జాగ్రత్తపడాలి. ఈ విధంగా మనం అటెన్షన్ పెట్టినట్లయితే మనము లాభంలోకి వెళ్తూ-వెళ్తూ మన పొజిషన్ ను అందుకోగలము. కనుక ఈ విధంగా చెక్ చేసుకుంటూ స్వయం మారాను అన్నది అనుభవం చేయాలి. అంతేగాని మేమైతే దేవతలుగా అవుతాము, కాని తర్వాత అవుతాము, ఇప్పుడు ఎలా ఉన్నామో అలా బాగానే ఉన్నాము... అని అనుకోకూడదు. ఇప్పటి నుండే ఆ దేవతా సంస్కారాలను తయారుచేసుకోవాలి. ఇప్పటివరకు 5 వికారాలకు వశమై ఏ సంస్కారాలైతే నడిచాయో, ఆ వికారాల నుండి మేము దూరమవుతూ ఉన్నామా అని ఇప్పుడు చూసుకోవాలి. మాలో క్రోధము మొదలైనవి ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతున్నాయా? లోభము మరియు మోహము మొదలైన వికారీ సంస్కారాలన్నీ పరివర్తన అవుతూ ఉన్నాయా? ఒకవేళ (సంస్కారాలు) మారుతూ ఉన్నాయి, తొలగిపోతూ ఉన్నాయి అంటే మనము మారుతున్నామని భావించండి. ఒకవేళ తొలగడం లేదంటే ఇప్పుడింకా మేము మారలేదు అని భావించండి. కనుక మారాను అన్న ఆ తేడా అనుభవమవ్వాలి, స్వయంలో మార్పు రావాలి. అంతేకానీ రోజంతా వికారీ ఖాతాలలోనే నడుస్తూ, మేము చాలా బాగా దాన-పుణ్యాలు చేశాము, చాలు అని అనుకోకూడదు. మన కర్మల ఖాతా ఏదైతే నడుస్తుందో, అందులో మనము జాగ్రత్తగా ఉండాలి. మనం ఏదైతే చేస్తున్నామో అందులో ఏ వికారానికైనా వశమై మన వికర్మల ఖాతానైతే తయారుచేసుకోవడం లేదు కదా? ఇందులో తమను తాము సంభాళించుకోవాలి. ఈ మొత్తం లెక్కాపత్రాన్ని పెట్టుకోవాలి మరియు రాత్రి నిద్రించే ముందు, ఈ రోజంతా ఎలా గడిచింది అని 10-15 నిముషాలు స్వయాన్ని పరిశీలించుకోవాలి. కొంతమందైతే నోట్ చేసుకుంటారు కూడా ఎందుకంటే వెనుకటి పాపాల భారం ఏదైతే తలపై ఉందో, దానిని కూడా తొలగించుకోవాలి, అందుకొరకు తండ్రి ఆజ్ఞ ఏమిటంటే - నన్ను స్మృతి చేయండి, మరి నేను ఎంత సమయం స్మృతి కోసం కేటాయించాను? ఎందుకంటే ఇలా చార్టు పెట్టుకున్నట్లయితే మరుసటి రోజు జాగ్రత్తగా ఉంటారు. ఇలా జాగ్రత్తగా ఉంటూ-ఉంటూ జాగ్రత్త పడతాము, ఇక మన కర్మలు మంచిగా ఉంటూ ఉంటాయి మరియు మళ్ళీ అటువంటి పాపం ఏదీ జరగదు. మరి పాపాల నుండే కదా రక్షించుకోవాలి. అచ్ఛా - మధురాతి-మధురమైన పిల్లలకు మధురమైన తల్లి ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్.

సందేశీ తనువు ద్వారా సరస్వతి తల్లితో అవ్యక్త ప్రభువు యొక్కమిలనము మరియు సంభాషణ

బేటీ శ్రీ రాధే, చూడు, నీ వద్దకు ఎవరు విచ్చేసారు? ఎంత పెద్ద శక్తి నీతో మాట్లాడుతున్నారు! నేను విచ్చేసిన రహస్యము ద్వారా నీవు నీ గురించి కూడా తెలుసుకోగలవు. విచ్చేసిన తండ్రి యొక్క పొజిషన్ తో పాటు స్వయం యొక్క పొజిషన్ మరియు పదవిని కూడా తెలుసుకోగలవు.

హే రాధే బేటీ, నీవు నా సత్తాను చూడాలనుకుంటున్నావా! నేను తలచుకుంటే ఒక్క క్షణములో వినాశనము చేయించగలను. కానీ అలా చేయను ఎందుకంటే విరాట చిత్రం అనుసారంగా ఏయే కర్తవ్యాలు ఎవరెవరి ద్వారా జరగాలో, అవి తప్పకుండా జరుగుతాయి. అవ్యక్త ప్రభువు, అనాది నియమ నిబంధనల గురించి తెలిసినవారే అనాది నియమాల గురించి వచ్చి చెప్తారు. ఈ పూర్తి సృష్టి యొక్క అనాది ఆట స్టేజీపై ప్లే అవుతుంది. ప్రాక్టికల్ గా ప్లే అవ్వడంలో సమయం పడుతుంది. ఒకవేళ ఇన్ని సంవత్సరాల ఆటను ఒక్క క్షణములో సమాప్తం చేస్తే ఇక ఆట ఏమి జరిగినట్లు! ఏయే ఇబ్బందులు ఎలా-ఎలా చూడాలో మరియు సహనం చేయాలో, అవి అలాగే, అవే గమ్మత్తైన రహస్యాలతో రిపీట్ అవుతాయి. ఇది చిత్ర-విచిత్రమైన రిపిటీషన్, దీనిని చూసి ఓ ప్రియమైన మమ రాధే, నీవు మరియు నేను చూసి ఎంత హర్షిస్తాము.

ఈ విరాట డ్రామాలోని అన్ని పాత్రలు పరీక్షలు తీసుకునేవే తయారయ్యాయి. ఈ ఆటను నడిపించేవారు ఒకవేళ తలచుకుంటే ఒక్క క్షణములో ఈ డ్రామాను డ్రాప్ చేసి పూర్తిగా కొత్తది ప్రారంభించవచ్చు, కానీ అలా చేయరు ఎందుకంటే ఈశ్వరునికి కూడా ఈ సాధారణ రీతిలోనే కర్తవ్యాన్ని చేయవలసి ఉంటుంది. స్వయంగా సర్వశక్తివంతుడైన నిరాకార ఈశ్వరుడు సాకారంలో ఉన్నారు కానీ సాధారణ వేషంలో ఉన్నారు! ఇది భూల్ భులయ్యా ఆట (బయటకు వచ్చే దారి తెలియని ఆట), దీనిని ఎవరు తెలుసుకుంటారో వారే జానీ జానన్ హార్ (సర్వము తెలిసినవారు) గా అవుతారు.

బేటీ శ్రీ రాధే, సహనం చేయవలసిన ఈ మార్గాన్ని కూడా ప్రియమైన పిల్లలు నిర్ణయించుకోవాలి. నేను తలచుకుంటే నా పిల్లల కొరకు దీనిని సహజ మార్గంగా చేయగలను ఎందుకంటే సాక్షాత్కారం చేయించే తాళంచెవి నా చేతిలో ఉంది. ఎవరైనా ధనవంతుడైన భక్తునికి ఎవరైనా దేవత యొక్క సాక్షాత్కారం చేయిస్తే, అతడు తన సంపూర్ణ ధనాన్ని యజ్ఞంలో స్వాహా చేసేలా చేయగలను, ఎందుకంటే ఈశ్వరుడు ధనవంతులకే ధనవంతుడు. కానీ నీ తండ్రి ఏమి కోరుకుంటారంటే - నిరుపేదలైన తన ప్రియమైన పిల్లలను రాకుమారులుగా, రాకుమారీలుగా తయారుచేయాలి, అందుకే మీరు ఇదంతా సహనం చేసిన తర్వాతనే రాకుమారులుగా, రాకుమారీలుగా అవుతారు. ఇది సహనం చేసే మార్గాన్ని పిల్లలు తప్పకుండా నిర్ణయించుకోవాలి, ఎందుకంటే సహనం చేయడమనేది ఈశ్వరీయ మరియు దైవీ గుణము, ఇందులో సంతోషం ఇమిడి ఉంది. ఈ గుణంతో ఈశ్వరీయ సుఖం అనుభవము అవుతుంది. సహనం చేస్తూ కూడా మీరు ఎంతటి ఆనందాన్ని జరుపుకుంటారు, ఇదే గుహ్యమైన జ్ఞానము. ఇటువంటి అనాసక్త యోగులే స్థిరమైన సుఖాన్ని పొందుతారు.

ఇప్పుడైతే పరీక్షల సమయం సమీపంగా వచ్చింది, పిల్లలు ప్రతి ఒక్కరూ రాబోయే పరీక్షలను ముందుగానే ఎదురుగా పెట్టుకుని ఆ అభ్యాసంలో నడుచుకోవాలి. పిల్లలకు ఆహార-పానీయాలు మొదలైన లభించకపోయినా కానీ స్వయం నిశ్చింత చక్రవర్తులుగా ఉండాలి. ఇటువంటి సుందరమైన అవస్థను బహుకాలం నుండి ధారణ చేసుకోవాలి, ఒకవేళ ఎవరైనా - సమయం వచ్చినప్పుడు జరిగిపోతుందిలే అని భావించి కూర్చుంటే, అది స్వయాన్ని మోసం చేసుకున్నట్లే, అందుకే ముందు నుండే అప్రమత్తంగా ఉండాలి.

నా అతి ప్రియమైన పిల్లలు స్మృతిలోనైతే కూర్చుంటున్నారు కానీ ఇప్పటి వరకు ఆ లైట్ యొక్క ప్రకాశము నా వతనము వరకు చేరుకోవడం లేదు. ప్రతి ఒక్కరూ లైట్ స్వరూపంగా అయి ఉపస్థితులైనప్పుడు వారి యోగం యొక్క ప్రకాశము నా వతనం వరకు చేరుకుంటుంది, అప్పుడే వారందరి యొక్క సంపూర్ణ లైట్ వారిలోకి ప్రవేశిస్తుంది. ఆ సమయంలోనే శక్తుల మహిమ వెలువడుతుంది. కావున ప్రతి ఒక్కరూ తమ నిశ్చయంలో స్థిరంగా ఉండాలి, ఆ నిశ్చయాన్ని ఒకవేళ నేను తొలగించాలని చూసినా కూడా అది తొలగకూడదు.

హే శిరోమణి శక్తి రాధే, శక్తులు జ్ఞాన నేష్ట బలంలో మరియు నోటితో జ్ఞాన మురళిని వాయించడంలో సిద్ధముగా ఉండాలి. మీరు మీ ఏకరస ఈశ్వరీయ దృష్టితో ప్రతి ఒక్కరినీ తృప్తపరిచి, మీ మధుర వీణ ద్వారా - నేను ఎవరు, నా తండ్రి ఎవరు, బ్రహ్మాలో భగవంతుడు ఎలా ప్రత్యక్షమయ్యారు, ఈ అంతిమ సమయంలో అసురీ ప్రపంచాన్ని సమాప్తం చేసి తమ నిజ దేశమైన దైవీ ప్రపంచానికి ఎలా తీసుకువెళ్తారు అన్న అవగాహనను కల్పించాలి.

హే రాధే బేటీ, ఎప్పుడైతే ప్రతి ఒక్కరి అవస్థ దీపము యొక్క ప్రకాశము వలె స్థిరంగా ఉంటుందో, అప్పుడు సూక్ష్మమైన అంతః ప్రేరణలను గుర్తించి తమ కార్యాన్ని సంపూర్ణ రీతిలో పూర్తి చేయగలరు. ఎంతగా జ్ఞానము అనుసారంగా అవస్థ ఉంటుందో, అంతగానే ప్రేరణలను గుర్తించగలరు. ఎంతగా ఆ అవస్థలో నిరంతరం ఉంటారో, అంతగా సంపూర్ణ ప్రేరణలు టచ్ అవుతాయి.

ఓహో! బేటీ రాధే, నా స్వరూపాన్ని చూడండి, నా పిల్లలు నా స్వరూపాన్ని చూడలేకపోతున్నారా. అఖండ జ్యోతి తత్వం నుండి నేను వచ్చి సాక్షాత్తూ ప్రవేశించి మాట్లాడుతాను, నా ద్వారానే ఈ సాక్షాత్కారాలన్నీ జరుగుతాయి ఎందుకంటే నేనే అన్నింటికీ మూల సమూహాన్ని. చూడండి, ప్రకృతి మధ్యలో జ్ఞాన ప్రకాశము మెరుస్తుంది. పిల్లలు కేవలం ఇలా చింతన చేయాలి - ఆహా! ఎవరినైతే మొత్తం ప్రపంచమంతా పిలుస్తుందో, వారు స్వయం సర్వశక్తివంతుడైన ఈశ్వరుడు, యజ్ఞంలో పిల్లలమైన మా సమ్ముఖంలోకి వచ్చారు. వారి శీతలమైన ఒడిలో కూర్చుంటే హృదయము శాంతిస్తుంది. రచనను రచించినవారు లభించారు అన్నప్పుడు, వారిని వదిలి వారి రచనలోకి ఎందుకు వెళ్ళాలి! ఉన్నతోన్నతమైన అథారిటీ, సర్వ శక్తులకు వారు స్వయంగా యజమాని, వారి నుండి సర్వ శక్తులు వెలువడ్డాయి, ఈ అవగాహన ఉన్నప్పుడు వారి ఒడిని విడిచిపెట్టడం అసంభవం అవుతుంది. ది క్రియేటర్ (సృష్టికర్త) యొక్క పరిచయం లభించినప్పుడు నేను ఎవరు అన్నది అర్థమవుతుంది! శిరోమణి రాధే, అర్థమయిందా. అచ్ఛా.

వరదానము:-
సదా అతీంద్రియ సుఖపు ఊయలలో ఊగే సంగమయుగము యొక్క సర్వ అలౌకిక ప్రాప్తులతో సంపన్న భవ

ఏ పిల్లలైతే అలౌకిక ప్రాప్తులతో సదా సంపన్నులుగా ఉన్నారో, వారు అతీంద్రియ సుఖవు ఊయలలో ఊగుతూ ఉంటారు. ఏ విధంగానైతే ప్రియమైన పిల్లలను ఊయలలో ఊపుతారో, అలా సర్వ ప్రాప్తి సంపన్నులైన బ్రాహ్మణుల ఊయల ఆతీంద్రియ సుఖపు ఊయల. ఈ ఊయలలో సదా ఊగుతూ ఉండండి. ఎప్పుడూ దేహాభిమానములోకి రాకండి. ఎవరైతే ఊయల నుండి దిగి భూమి పైన పాదాలను మోపుతారో, వారు మురికిగా అయిపోతారు. ఉన్నతోన్నతుడైన తండ్రి యొక్క స్వచ్ఛమైన పిల్లలు సదా అతీంద్రియ సుఖపు ఊయలలో ఊగుతూ ఉంటారు, మట్టిలో కాలు పెట్టలేరు.

స్లోగన్:-
‘‘నేను త్యాగిని’’ ఈ అభిమానము యొక్క త్యాగమే సత్యమైన త్యాగము.

అవ్యక్త ప్రేరణలు - ఆత్మిక స్థితిలో ఉండే అభ్యాసము చెయ్యండి, అంతర్ముఖులుగా అవ్వండి

ఎప్పుడైతే స్వయాన్ని అకాలమూర్త ఆత్మగా భావిస్తారో, అప్పుడు అకాల మరణము నుండి, కరువు నుండి, సర్వ సమస్యల నుండి రక్షింపబడగలరు. మానసిక చింతలను, మానసిక పరిస్థితులను తొలగించుకునేందుకు ఒకే సాధనము - మీ ఈ పాత శరీర భానమును తొలగించుకోవటము. దేహ అభిమానమును తొలగించటం ద్వారా అన్ని పరిస్థితులు తొలగిపోతాయి.