ఓంశాంతి
ఆత్మిక పిల్లలకు అనగా ఆత్మలకు ఇది చెప్తున్నారు ఎందుకంటే రూహ్ లేక ఆత్మ చెవుల ద్వారా
వింటుంది. ధారణ ఆత్మలోనే జరుగుతుంది. తండ్రి ఆత్మలో కూడా జ్ఞానము నిండి ఉంది.
పిల్లలు ఈ జన్మలో ఆత్మాభిమానులుగా అవ్వాలి. భక్తి మార్గములోని 63 జన్మలు అనగా
ద్వాపరయుగము నుండి మీరు దేహాభిమానములో ఉంటారు. ఆత్మ అంటే ఏమిటి అన్నది తెలియదు.
ఆత్మ తప్పకుండా ఉంటుంది. ఆత్మయే శరీరములోకి ప్రవేశిస్తుంది. దుఃఖము కూడా ఆత్మకే
కలుగుతుంది. పతిత ఆత్మ, పావన ఆత్మ అని కూడా అంటారు. పతిత పరమాత్మ అని ఎప్పుడూ
వినలేదు. ఒకవేళ అందరిలోనూ పరమాత్మ ఉన్నట్లయితే, పతిత పరమాత్మ అయిపోతారు. కనుక
ముఖ్యమైన విషయము ఆత్మాభిమానులుగా అవ్వడము. ఆత్మ ఎంత చిన్నది, అందులో ఏ విధముగా
పాత్ర నిండి ఉంది అన్నది ఎవ్వరికీ తెలియదు. మీరైతే కొత్త విషయాలను వింటున్నారు. ఈ
స్మృతియాత్రను కూడా తండ్రియే నేర్పిస్తారు, ఇంకెవ్వరూ నేర్పించలేరు. శ్రమ కూడా
ఇందులోనే ఉంది. ఘడియ-ఘడియ స్వయాన్ని ఆత్మగా భావించాలి. చూడండి, ఈ ఎమర్జెన్సీ లైట్
బ్యాటరీ ద్వారా నడుస్తుంది, దీనిని మళ్ళీ చార్జ్ చేస్తారు. తండ్రియే అందరికన్నా
గొప్ప శక్తి. ఆత్మలు ఎంతమంది ఉన్నారు. అందరూ ఆ శక్తి నుండి నింపుకోవాలి. తండ్రి
సర్వశక్తివంతుడు. ఆత్మలైన మనకు వారితో యోగము లేకపోతే బ్యాటరీ చార్జ్ ఎలా అవుతుంది?
డిస్చార్జ్ అవ్వడానికి మొత్తం కల్పము పడుతుంది. ఇప్పుడు మళ్ళీ బ్యాటరీని చార్జ్
చేసుకోవలసి ఉంటుంది. మా బ్యాటరీ డిస్చార్జ్ అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ చార్జ్
చేసుకోవాలి అని పిల్లలు భావిస్తారు. ఎలా? నాతో యోగము జోడించండి అని బాబా
చెప్తున్నారు. ఇది చాలా సహజముగా అర్థం చేసుకునే విషయము. తండ్రి చెప్తున్నారు, నాతో
బుద్ధియోగము జోడించినట్లయితే ఆత్మ అయిన మీలో శక్తి నిండి సతోప్రధానముగా అయిపోతారు.
చదువు అంటేనే సంపాదన. స్మృతి ద్వారా మీరు పావనముగా అవుతారు, ఆయుష్షు పెరుగుతుంది,
బ్యాటరీ చార్జ్ అవుతుంది. నేను తండ్రిని ఎంతగా స్మృతి చేస్తున్నాను అని ప్రతి ఒక్కరూ
స్వయాన్ని చూసుకోవాలి. తండ్రిని మర్చిపోవడము వలనే బ్యాటరీ డిస్చార్జ్ అవుతుంది.
ఎవ్వరికీ సత్యమైన కనెక్షన్ లేదు. పిల్లలైన మీకు మాత్రమే సత్యమైన కనెక్షన్ ఉంది.
తండ్రిని స్మృతి చేయకుండా జ్యోతి ఎలా వెలుగుతుంది? జ్ఞానము కూడా ఒక్క తండ్రి మాత్రమే
ఇస్తారు.
జ్ఞానము పగలు, భక్తి రాత్రి అని మీకు తెలుసు. ఆ తర్వాత రాత్రి పట్ల వైరాగ్యము
కలుగుతుంది, మళ్ళీ పగలు ప్రారంభమవుతుంది. తండ్రి చెప్తున్నారు, రాత్రిని మర్చిపోండి,
ఇప్పుడు పగలును స్మృతి చేయండి. స్వర్గము పగలు, నరకము రాత్రి. పిల్లలైన మీరిప్పుడు
చైతన్యములో ఉన్నారు, ఈ శరీరమైతే వినాశీ. ఇది మట్టితో తయారవుతుంది, మట్టిలోనే
కలిసిపోతుంది. ఆత్మ అయితే అవినాశీ కదా. కాకపోతే బ్యాటరీ డిస్చార్జ్ అయిపోతుంది.
ఇప్పుడు మీరు ఎంత వివేకవంతులుగా అవుతున్నారు. మీ బుద్ధి ఇంటి వైపుకు వెళ్ళిపోతుంది.
మనము అక్కడ నుండి వచ్చాము. ఇక్కడ సూక్ష్మవతనము గురించి అయితే తెలుసుకున్నారు. అక్కడ
విష్ణువుకు నాలుగు భుజాలను చూపిస్తారు. ఇక్కడైతే నాలుగు భుజాలుండవు.
బ్రహ్మా-సరస్వతులే మళ్ళీ లక్ష్మీ-నారాయణులుగా అవుతారని, అందుకే విష్ణువుకు నాలుగు
భుజాలను చూపించారని ఎవ్వరి బుద్ధిలోనూ ఉండదు. తండ్రి తప్ప ఇంకెవ్వరూ అర్థం
చేయించలేరు. ఆత్మలోనే సంస్కారాలు నిండుతాయి. ఆత్మయే తమోప్రధానము నుండి మళ్ళీ
సతోప్రధానముగా అవుతుంది. ఆత్మలే తండ్రిని పిలుస్తాయి - ఓ బాబా, మేము డిస్చార్జ్
అయిపోయాము, ఇప్పుడు మీరు రండి, మేము చార్జ్ అవ్వాలి. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు,
ఎంతగా స్మృతి చేస్తారో, అంతగా శక్తి వస్తుంది. తండ్రి పట్ల చాలా ప్రేమ ఉండాలి. బాబా,
మేము మీకు చెందినవారము, మీతోపాటే ఇంటికి వస్తాము. పుట్టినింటి నుండి అత్తవారింటివారు
తీసుకువెళ్తారు కదా. ఇక్కడ మీకు అలంకరణ చేయించేందుకు ఇద్దరు తండ్రులు లభించారు.
అలంకరణ కూడా బాగుండాలి అనగా సర్వగుణ సంపన్నులుగా అవ్వాలి. స్వయాన్ని
ప్రశ్నించుకోవాలి, నాలో ఎటువంటి అవగుణాలైతే లేవు కదా? మనసులో తుఫానులు వచ్చినా కానీ,
కర్మణా ద్వారా ఏమీ చేయడం లేదు కదా? ఎవ్వరికీ దుఃఖమునివ్వడం లేదు కదా? తండ్రి
దుఃఖహర్త, సుఖకర్త. మనము కూడా అందరికీ సుఖము యొక్క మార్గాన్ని తెలియజేస్తాము. బాబా
చాలా యుక్తులను తెలియజేస్తూ ఉంటారు. మీరు సైన్యము. మీ పేరే ప్రజాపిత
బ్రహ్మాకుమార-కుమారీలు. లోపలకు ఎవరు వచ్చినా, వారిని మొట్టమొదట ఇలా అడగండి - ఎక్కడి
నుండి వచ్చారు? ఎవరి వద్దకు వచ్చారు? అని. మేము బి.కె.ల వద్దకు వచ్చాము అని వారు
చెప్తారు. అచ్ఛా, అయితే బ్రహ్మా ఎవరు, ప్రజాపిత బ్రహ్మా పేరును ఎప్పుడైనా విన్నారా
అని అడగాలి. అవును, ప్రజాపితకు మీరు కూడా పిల్లలే. అందరూ ప్రజాయే కదా. వారు మీ
తండ్రి, కాకపోతే మీకు ఆ విషయము తెలియదు. బ్రహ్మా కూడా తప్పకుండా ఎవరో ఒకరికి
సంతానమవుతారు కదా. వారి తండ్రికేమీ ఇలాంటి శరీరము ఉండదు. బ్రహ్మా-విష్ణు-శంకరులు, ఈ
ముగ్గరిపైన శివబాబా ఉన్నారు. వారు ముగ్గురి రచయిత కనుక త్రిమూర్తి శివ అని అంటారు.
పైన ఒక్క శివబాబా ఉంటారు, ఆ తర్వాత ఈ ముగ్గురు ఉంటారు. వంశవృక్షము ఉంటుంది కదా.
బ్రహ్మాకు తండ్రి తప్పకుండా భగవంతుడే అవుతారు. వారు ఆత్మలకు తండ్రి. అచ్ఛా, మరి
బ్రహ్మా ఎక్కడ నుండి వచ్చారు. తండ్రి చెప్తున్నారు, నేను వీరిలోకి ప్రవేశించి,
వీరికి బ్రహ్మా అని పేరు పెడతాను. పిల్లలైన మీకు పేర్లు పెట్టాను, అలాగే వీరికి కూడా
బ్రహ్మా అన్న పేరు పెట్టాను. బాబా అంటారు, ఇది నా దివ్యమైన, అలౌకిక జన్మ. పిల్లలైన
మిమ్మల్ని దత్తత తీసుకుంటాను. అయితే వీరిలోకి ప్రవేశించి మీకు వినిపిస్తాను, అందుకే
వీరు బాప్ దాదా అయ్యారు. ఎవరిలోనైతే ప్రవేశించానో వారి ఆత్మ ఉంటుంది కదా, ఆ ఆత్మ
ప్రక్కన వచ్చి కూర్చుంటాను. ఇక్కడ చాలా చోట్ల రెండు ఆత్మల పాత్ర నడుస్తుంది. ఆత్మను
పిలిచినప్పుడు ఆత్మ వచ్చి ఎక్కడ కూర్చుంటుంది. తప్పకుండా బ్రాహ్మణుడి ఆత్మ ప్రక్కనే
వచ్చి కూర్చుంటుంది. ఇక్కడ కూడా రెండు ఆత్మలు ఉన్నాయి - బాప్ మరియు దాదా. తన జన్మల
గురించి తనకు తెలియదు అని బాబా వీరి కోసమే చెప్తారు. మీకు మీ జన్మల గురించి తెలియదు
అని మీకు కూడా తండ్రి చెప్తున్నారు. కల్ప-కల్పము 84 జన్మల చక్రములో తిరిగాము, మళ్ళీ
తిరిగి వెళ్తాము అని ఇప్పుడు స్మృతి కలిగింది. ఇది సంగమయుగము. ఇప్పుడు ట్రాన్స్ఫర్
అవుతారు. యోగముతో మీరు సతోప్రధానముగా అవుతారు, బ్యాటరీ చార్జ్ అవుతుంది. ఆ తర్వాత
సత్యయుగములోకి వస్తారు. బుద్ధిలో మొత్తం చక్రము తిరుగుతూ ఉంటుంది. విస్తారములోకైతే
వెళ్ళలేరు. వృక్షానికి కూడా ఒక ఆయుష్షు ఉంటుంది, ఆ తర్వాత అది ఎండిపోతుంది. ఇక్కడ
కూడా మనుష్యులందరూ ఎండిపోయినట్లుగా ఉన్నారు. అందరూ ఒకరికొకరు దుఃఖమునిచ్చుకుంటూ
ఉంటారు. ఇప్పుడు అందరి శరీరాలు సమాప్తమైపోతాయి. ఆత్మలు మాత్రము వెళ్ళిపోతాయి. ఈ
జ్ఞానాన్ని తండ్రి తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు. తండ్రియే విశ్వరాజ్యాధికారాన్ని ఇస్తారు,
వారిని ఎంతగా స్మృతి చేయాలి. స్మృతిలో ఉండకపోవడం వలన మాయ యొక్క చెంపదెబ్బ తగులుతుంది.
అన్నింటికన్నా పెద్ద దెబ్బ వికారాలది. యుద్ధ మైదానములో బ్రాహ్మణులైన మీరే ఉన్నారు
కదా, కావున మీకే తుఫానులు వస్తాయి. కానీ ఎటువంటి వికర్మలు చేయకూడదు. వికర్మలు
చేసినట్లయితే ఓడిపోతారు. ఇలా చేయాల్సి వస్తుంది అని బాబాను అడుగుతారు. పిల్లలు
విసిగిస్తే కోపము వస్తుందని అంటారు. పిల్లలను బాగా సంభాళించకపోతే పాడైపోతారు.
ప్రయత్నించి కొట్టకుండా ఉండండి. శ్రీకృష్ణుడి విషయములో కూడా అతడిని రోకలికి
బంధించినట్లుగా చూపిస్తారు కదా. తాడుతో కట్టేయండి, భోజనము పెట్టకండి. ఏడ్చి-ఏడ్చి
ఆఖరికి, సరే ఇకపై చేయను అని అంటారు. కానీ పిల్లలు కాబట్టి మళ్ళీ చేస్తారు, శిక్షణ
ఇవ్వాలి. బాబా కూడా పిల్లలకు శిక్షణనిస్తారు - పిల్లలూ, ఎప్పుడూ వికారాలలోకి
వెళ్ళకండి, కుల-కళంకితులుగా అవ్వకండి. లౌకికములో కూడా ఎవరైనా కుపుత్రులైన పిల్లలుంటే
అప్పుడు తల్లి-తండ్రులు - నల్ల ముఖము ఎందుకు చేసుకుంటున్నావు, కులానికి కళంకము
తీసుకొస్తున్నావు అని అంటారు. ఓటమి-గెలుపు, గెలుపు-ఓటమి జరుగుతూ-జరుగుతూ ఆఖరికి
గెలుస్తారు. ఇది సత్యము యొక్క నావ, తుఫానులు చాలా వస్తాయి ఎందుకంటే కృత్రిమమైనవి
చాలా వెలువడ్డాయి. కొంతమంది స్వయాన్ని భగవంతుడిగా చెప్పుకుంటారు, కొందరు ఇంకేదో
చెప్పుకుంటారు. రిద్ధి-సిద్ధులను కూడా చాలా చూపిస్తారు. సాక్షాత్కారాలు కూడా
చేయిస్తారు. సర్వులకు సద్గతినిచ్చేందుకే తండ్రి వస్తారు. ఇక తర్వాత ఈ అడవి ఉండదు,
అడవిలో ఉండేవారూ ఉండరు. ఇప్పుడు మీరు సంగమయుగములో ఉన్నారు, ఈ పాత ప్రపంచము
శ్మశానవాటికగా అయ్యిందని మీకు తెలుసు. మరణించేవారి పట్ల ఎవ్వరూ మనసు పెట్టుకోరు, ఈ
ప్రపంచము ఇక త్వరలో సమాప్తమైపోతుంది, వినాశనము ఇక త్వరలో జరిగిపోతుంది. కొత్త
ప్రపంచము పాతదిగా అయినప్పుడే తండ్రి వస్తారు. తండ్రిని బాగా స్మృతి చేసినట్లయితే
బ్యాటరీ చార్జ్ అవుతుంది. వాణి అయితే చాలా బాగా నడిపిస్తారు కానీ స్మృతి యొక్క పదును
లేకపోతే ఆ శక్తి ఉండదు. పదును గల ఖడ్గముగా ఉండదు. తండ్రి చెప్తున్నారు, ఇది కొత్త
విషయమేమీ కాదు. 5 వేల సంవత్సరాల క్రితము కూడా వచ్చారు. ఇంతకుముందు ఎప్పుడైనా కలిసారా
అని తండ్రి అడుగుతారు. అప్పుడు కల్పక్రితం కలిసామని చెప్తారు. డ్రామా దానంతట అదే
పురుషార్థము చేయిస్తుందని కొంతమంది అంటారు. అచ్ఛా, ఇప్పుడు డ్రామా పురుషార్థము
చేయిస్తూ ఉంది కదా, కనుక చేయండి. ఒకేచోట అలా కూర్చుండిపోకూడదు. ఎవరైతే కల్పక్రితము
పురుషార్థము చేసారో, వారు చేస్తారు. ఇప్పటివరకూ ఇంకా రాని వారు వచ్చేది ఉంది. ఎవరైతే
నడుస్తూ-నడుస్తూ పారిపోయారో, వివాహము చేసుకున్నారో, వారికి కూడా డ్రామాలో పాత్ర
ఉన్నట్లయితే మళ్ళీ వచ్చి పురుషార్థము చేస్తారు, ఇంకెక్కడికి వెళ్తారు. తండ్రి వద్దనే
అందరూ తోక ఆడించాల్సి ఉంటుంది. భీష్మపితామహులు మొదలైనవారు కూడా చివర్లో వస్తారని
వ్రాయబడి ఉంది. ఇప్పుడైతే ఎంత అహంకారము ఉంది, తర్వాత వారి అహంకారము సమాప్తమైపోతుంది.
మీరు కూడా ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత పాత్రను అభినయిస్తారు, రాజ్యము తీసుకుంటారు,
పోగొట్టుకుంటారు. రోజురోజుకు సెంటర్లు పెరుగుతూ ఉంటాయి. సత్యయుగములో దేవీ-దేవతా
ధర్మము ఉండేది కావున వారిని పూజిస్తారు అని విశేషముగా దేవీ-దేవతల పూజారులైన
భారతవాసులకు అర్థం చేయించాలి. క్రిస్టియన్లు క్రైస్టును మహిమ చేస్తారు, మనము ఆది
సనాతన దేవీ-దేవతా ధర్మాన్ని మహిమ చేస్తాము. దీనిని స్థాపించిందెవరు. వారు కృష్ణుడు
స్థాపించారని భావిస్తారు కావున వారిని పూజిస్తూ ఉంటారు. మీలో కూడా నంబరువారుగా
ఉన్నారు. ఒక్కొక్కరూ ఒక్కోలా కృషి చేస్తారు. గోవర్ధన పర్వతాన్ని చిటికిన వేలితో
ఎత్తినట్లుగా చూపిస్తారు కదా.
ఇప్పుడిది పాత ప్రపంచము, అన్ని వస్తువుల నుండి శక్తి పోయింది. బంగారము కూడా గనుల
నుండి వెలువడడం లేదు. అదే స్వర్గములోనైతే బంగారు భవనాలు తయారవుతాయి. ఇప్పుడైతే
గవర్నమెంట్ విసిగిపోతుంది ఎందుకంటే అప్పు చెల్లించవలసి వస్తుంది. అక్కడైతే అపారమైన
ధనము ఉంటుంది. గోడలకు కూడా వజ్ర-వైఢూర్యాలు పొదగబడి ఉంటాయి. వజ్రాలను పొదగడం పట్ల
అభిరుచి ఉంటుంది. అక్కడ ధనము యొక్క లోటు ఉండదు. అపారమైన ఖజానా ఉంటుంది.
అల్లాహ్-అవల్దీన్ యొక్క నాటకాన్ని చూపిస్తారు. దీపాన్ని రుద్దగానే భవనాలు వస్తాయి.
ఇక్కడ కూడా దివ్యదృష్టి లభించడముతో స్వర్గములోకి వెళ్ళిపోతారు. అక్కడ
రాకుమార-రాకుమారీల వద్ద మురళీ మొదలైన వస్తువులన్నీ వజ్రాలతో కూడినవి ఉంటాయి.
ఇక్కడెవరైనా అటువంటి వస్తువులు ధరించి కూర్చున్నట్లయితే దోచుకుని వెళ్ళిపోతారు.
కత్తితో పొడిచి అయినా తీసుకువెళ్ళిపోతారు. అక్కడ ఇలాంటి విషయాలు ఉండవు. ఈ ప్రపంచమే
చాలా పాతదిగా, అశుద్ధముగా ఉంది. ఈ లక్ష్మీ-నారాయణుల ప్రపంచమైతే వాహ్-వాహ్ గా ఉండేది.
వజ్ర-వైఢూర్యాల భవనాలుండేవి. వారు ఒక్కరే ఉండరు కదా. దానిని స్వర్గము అని అనేవారు.
తప్పకుండా మనము స్వర్గానికి యజమానులుగా ఉండేవారమని మీకు తెలుసు. మనమే ఈ సోమనాథ
మందిరాన్ని నిర్మించాము. మనం ఎలా ఉండేవారము, మళ్ళీ భక్తి మార్గములో మందిరాలు ఎలా
నిర్మించి పూజించాము అని భావిస్తారు. ఆత్మకు తన 84 జన్మల జ్ఞానముంది. ఎన్ని
వజ్ర-వైఢూర్యాలు ఉండేవి, అవన్నీ ఏమయ్యాయి. నెమ్మది-నెమ్మదిగా అన్నీ సమాప్తమైపోతూ
వచ్చాయి. ముసల్మానులు వచ్చారు, ఎంతగా దోచుకుని వెళ్ళారంటే, సమాధులను వజ్రాలతో
అలంకరించుకున్నారు, తాజ్ మహలు మొదలైనవాటిని నిర్మించారు. ఆ తర్వాత బ్రిటీష్
గవర్నమెంట్ అక్కడ నుండి తవ్వుకుని తీసుకువెళ్ళింది. ఇప్పుడైతే ఏమీ లేవు. భారత్
బికారిగా ఉంది, అప్పులే అప్పులు తీసుకుంటూ ఉంటుంది. ధాన్యము, పంచదార మొదలైనవేవీ
లభించటము లేదు. ఇప్పుడు విశ్వము పరివర్తన అవ్వాలి. కానీ దానికంటే ముందు ఆత్మ యొక్క
బ్యాటరీని సతోప్రధానముగా చేసుకునేందుకు చార్జ్ చేసుకోవాలి. తండ్రిని తప్పకుండా
స్మృతి చేయాలి. బుద్ధియోగము తండ్రితో ఉండాలి, వారి నుండే కదా వారసత్వము లభిస్తుంది.
ఇందులోనే మాయతో యుద్ధము జరుగుతుంది. ఇంతకుముందు మీకు ఈ విషయాలు అర్థమయ్యేవి కాదు.
మీరు కూడా ఇతరుల వలె ఉండేవారు. ఇప్పుడు మీరు సంగమయుగానికి చెందినవారు మరియు వారందరూ
కలియుగానికి చెందినవారు. వీరికి ఏది తోస్తే అది చెప్తూ ఉంటారని మనుష్యులు అంటారు.
కానీ అర్థం చేయించే యుక్తులు కూడా ఉంటాయి కదా. నెమ్మది-నెమ్మదిగా మీ వృద్ధి జరుగుతూ
ఉంటుంది. ఇప్పుడు బాబా పెద్ద విశ్వవిద్యాలయాన్ని తెరుస్తున్నారు. ఇందులో అర్థం
చేయించేందుకు చిత్రాలు అయితే కావాలి కదా. మున్ముందు మీ వద్ద ఈ చిత్రాలన్నీ ట్రాన్స్
లైట్ తో తయారవుతాయి, వాటి ద్వారా అర్థం చేయించడం కూడా మీకు సహజమవుతుంది.
మనం తండ్రి స్మృతి మరియు జ్ఞానము ద్వారా మన రాజ్యాన్ని మళ్ళీ స్థాపన
చేసుకుంటున్నామని మీకు తెలుసు. మాయ మధ్యలో చాలా మోసగిస్తుంది. మోసము నుండి
రక్షించుకుంటూ ఉండండి అని తండ్రి చెప్తున్నారు. యుక్తులైతే తెలియజేస్తూ ఉంటారు.
తండ్రిని స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయని మరియు మీరు ఈ
లక్ష్మీ-నారాయణులుగా అవుతారని నోటితో కేవలం ఇదే చెప్పండి. ఈ బ్యాడ్జీలు మొదలైనవాటిని
భగవంతుడే స్వయంగా తయారుచేసారు కావున వీటి పట్ల ఎంత గౌరవము ఉండాలి. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.