25-06-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - తండ్రి మీకు కొత్త ప్రపంచం కొరకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు, అందుకే ఈ పాత ప్రపంచపు వినాశనం కూడా తప్పకుండా జరగనున్నది’’

ప్రశ్న:-
మనుష్యులకు ఏ ఒక్క మంచి అలవాటు ఉంది? కానీ ఆ అలవాటు ద్వారా కూడా ప్రాప్తి ఏమీ కలుగదు?

జవాబు:-
మనుష్యులలో భగవంతుడిని స్మృతి చేయడం అన్నది అలవాటుగా అయిపోయింది. ఎప్పుడైనా ఏదైనా విషయం జరిగితే వెంటనే - ఓ భగవంతుడా! అని అంటారు. వారి ఎదురుగా శివలింగం వస్తుంది, కానీ యథార్థమైన పరిచయం లేని కారణంగా ప్రాప్తి కలుగదు. అంతేకాక సుఖ-దుఃఖాలన్నీ వారే ఇస్తారు అని అనేస్తారు. పిల్లలైన మీరు ఇప్పుడు అలా అనరు.

ఓంశాంతి
తండ్రిని రచయిత అని అంటారు, వారు దేనికి రచయిత? కొత్త ప్రపంచానికి రచయిత. కొత్త ప్రపంచాన్ని స్వర్గము లేక సుఖధామము అని అంటారు. ఈ పేర్లతో పిలుస్తారు కానీ ఏమీ అర్థం చేసుకోరు. శ్రీకృష్ణుని మందిరాన్ని కూడా సుఖధామము అని అంటారు. వాస్తవానికి అది చిన్న మందిరము, కానీ శ్రీకృష్ణుడైతే విశ్వాధిపతి. కనుక అనంతమైన అధిపతిని హద్దులోని అధిపతిగా చేసేసినట్లు అవుతుంది. శ్రీకృష్ణుడి యొక్క చిన్న మందిరాన్ని సుఖధామము అని అంటారు. వాస్తవానికి శ్రీకృష్ణుడు విశ్వాధిపతిగా ఉండేవారు అన్న విషయము బుద్ధిలోకి రాదు, అతడు భారత్ లోనే ఉండేవాడు. మీకు కూడా ఇంతకుముందు ఏమీ తెలియదు. తండ్రికైతే అన్నీ తెలుసు, వారికి సృష్టి ఆదిమధ్యాంతాల గురించి తెలుసు. ప్రపంచంలో - బ్రహ్మా, విష్ణు, శంకరులు ఎవరు అన్నది కూడా ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు పిల్లలైన మీకు అది తెలుసు. శివుడు అయితే ఉన్నతోన్నతుడైన భగవంతుడు, అచ్ఛా, మరి ప్రజాపిత బ్రహ్మా ఎక్కడి నుండి వచ్చారు? అతను కూడా మానవుడే కదా. ప్రజాపిత బ్రహ్మా అయితే తప్పకుండా ఇక్కడే కావాలి కదా, అతని ద్వారా బ్రాహ్మణులు జన్మిస్తారు. ప్రజాపిత అంటేనే ముఖము ద్వారా దత్తత తీసుకునేవారు, మీరు ముఖవంశావళులు. తండ్రి ఏ విధముగా బ్రహ్మాను తనవారిగా చేసుకుని ముఖవంశావళిగా తయారుచేసారు అనేది మీకు తెలుసు. వీరిలోకి ప్రవేశించారు కూడా మరియు ఇతను నా కొడుకు అని కూడా అన్నారు. బ్రహ్మా అన్న పేరు ఎలా వచ్చింది, వారు ఎలా జన్మించారు అన్నది మీకు తెలుసు, ఇది ఇంకెవ్వరికీ తెలియదు. పరమపిత పరమాత్మ ఉన్నతోన్నతుడు అని కేవలం మహిమను గానం చేస్తారు కానీ వారు ఉన్నతోన్నతుడైన తండ్రి అన్నది ఎవరి బుద్ధిలోకి రాదు. ఆత్మలైన మనందరికీ వారు తండ్రి. వారు కూడా బిందురూపుడే, వారిలో సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానము అంతా ఉంది. ఈ జ్ఞానము కూడా మీకు ఇప్పుడే లభిస్తుంది. ఇంతకుముందు కొద్దిగా కూడా ఈ జ్ఞానము ఉండేది కాదు. మనుష్యులు కేవలం బ్రహ్మా, విష్ణు, శంకరులు అని అంటూ ఉంటారు కానీ వారికేమీ తెలియదు. కావున వారికే అర్థం చేయించాలి. ఇప్పుడు మీరు వివేకవంతులుగా అయ్యారు. తండ్రి జ్ఞానసాగరుడని, వారు మనకు జ్ఞానాన్ని వినిపిస్తున్నారని, చదివిస్తున్నారని మీకు తెలుసు. ఈ రాజయోగము సత్యయుగ కొత్త ప్రపంచం కొరకు ఉంది కావున తప్పకుండా పాత ప్రపంచ వినాశనం జరగాలి. దానికోసమే ఈ మహాభారత యుద్ధము ఉంది. అర్ధకల్పము నుండి మొదలుకుని మీరు భక్తి మార్గపు శాస్త్రాలను చదువుతూ వచ్చారు. ఇప్పుడైతే తండ్రి నుండి డైరెక్ట్ గా వింటున్నారు. తండ్రి కూర్చుని శాస్త్రాలేమీ వినిపించరు. జప-తపాదులు చేయడం, శాస్త్రాలు మొదలైనవి చదవడం, ఇదంతా భక్తి. ఇప్పుడు భక్తులకు భక్తికి ఫలము కావాలి ఎందుకంటే వారు భగవంతుడిని కలుసుకునేందుకే కష్టపడతారు. కానీ జ్ఞానము ద్వారానే సద్గతి లభిస్తుంది. జ్ఞానము మరియు భక్తి, రెండూ కలిసి నడవవు. ఇప్పుడు ఉన్నది భక్తి రాజ్యము. అందరూ భక్తులే. అందరి ముఖము నుండి ఓ గాడ్ ఫాదర్ అన్న పదము తప్పకుండా వెలువడుతుంది. ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు - నేను ఒక చిన్న బిందువును, నన్నే జ్ఞానసాగరుడు అని అంటారు, బిందువైన నాలో మొత్తం జ్ఞానమంతా నిండి ఉంది అని తండ్రి తమ పరిచయాన్ని ఇచ్చారు. ఆత్మలోనే జ్ఞానము ఉంటుంది. వారిని పరమపిత పరమాత్మ అని అంటారని ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. వారు పరమ ఆత్మ అనగా అందరికన్నా ఉన్నతోన్నతుడు పతిత-పావనుడైన తండ్రియే పరమ ఆత్మ కదా. మనుష్యులు - ఓ భగవంతుడా అని అంటే వారికి శివలింగమే గుర్తుకువస్తుంది. అది యథార్థ రీతిగా గుర్తుకురాదు. భగవంతుడిని స్మృతి చేయడం అనేది ఒక అలవాటుగా అయిపోయింది. భగవంతుడే సుఖ-దుఃఖాలను ఇస్తారు అని అంటారు, ఇప్పుడు పిల్లలైన మీరు అలా అనరు. తండ్రి అయితే సుఖదాత అని మీకు తెలుసు. సత్యయుగములో సుఖధామము ఉండేది. అక్కడ దుఃఖము అన్న మాటే ఉండేది కాదు. కలియుగములో ఉన్నదే దుఃఖము, ఇక్కడ సుఖము అన్న మాటే ఉండదు. ఉన్నతోన్నతమైనవారు భగవంతుడు, వారు సర్వాత్మలకూ తండ్రి. ఆత్మలకు తండ్రి కూడా ఉన్నారు అన్నది ఎవ్వరికీ తెలియదు. మేమందరమూ సోదరులము అని అంటారు కూడా, మరి తప్పకుండా అందరూ ఒక్క తండ్రి పిల్లలే అవుతారు కదా. కొందరేమో - వారు సర్వవ్యాపి, నీలోనూ ఉన్నారు, నాలోనూ ఉన్నారు అని అనేస్తారు... అరే, నీవైతే ఒక ఆత్మవు, ఇది నీ శరీరము, ఇక మూడవది ఎలా ఉండగలదు! ఆత్మను పరమాత్మ అని అనరు కదా. జీవాత్మ అని అంటారే కానీ జీవ పరమాత్మ అని అనరు. మరి పరమాత్మ సర్వవ్యాపి ఎలా అవ్వగలరు! తండ్రి సర్వవ్యాపి అయినట్లయితే ఇక అందరూ తండ్రులే అయిపోతారు. తండ్రికి తండ్రి నుండి వారసత్వం లభించదు కదా. తండ్రి నుండైతే కొడుకే వారసత్వము తీసుకుంటాడు. అందరూ తండ్రులు ఎలా అవ్వగలరు. ఇంత చిన్న విషయం కూడా ఎవ్వరికీ అర్థం కాదు. అందుకే తండ్రి అంటారు - పిల్లలూ, నేను నేటికి 5000 సంవత్సరాల క్రితం మిమ్మల్ని ఎంతో వివేకవంతులుగా తయారుచేసాను, మీరు సదా ఆరోగ్యవంతులుగా, సంపన్నులుగా, వివేకవంతులుగా ఉండేవారు. వీరికన్నా ఎక్కువ వివేకవంతులుగా ఎవ్వరూ ఉండరు. ఇప్పుడు మీకు ఏ వివేకమైతే లభిస్తుందో అది మళ్ళీ అక్కడ ఉండదు. అక్కడ - మేము మళ్ళీ పడిపోతాము అన్నది తెలియదు. అది తెలిసినట్లయితే ఇక సుఖము యొక్క అనుభూతియే ఉండదు. ఈ జ్ఞానము మళ్ళీ కనుమరుగైపోతుంది. ఈ డ్రామా జ్ఞానము ఇప్పుడు కేవలం మీ బుద్ధిలోనే ఉంది. బ్రాహ్మణులే అధికారులుగా ఉంటారు. ఇప్పుడు మనము బ్రాహ్మణ వర్ణానికి చెందినవారము అని మీ బుద్ధిలో ఉంది. బ్రాహ్మణులకే తండ్రి జ్ఞానాన్ని వినిపిస్తారు. బ్రాహ్మణులు మళ్ళీ అందరికీ వినిపిస్తారు. భగవంతుడు వచ్చి స్వర్గ స్థాపనను చేసారని, రాజయోగాన్ని నేర్పించారని గాయనము కూడా ఉంది. చూడండి, శ్రీకృష్ణుని జయంతిని జరుపుతారు, శ్రీకృష్ణుడు వైకుంఠాధిపతిగా ఉండేవారని భావిస్తారు, కానీ అతను విశ్వాధిపతిగా ఉండేవారు అన్నది బుద్ధిలోకి రాదు. అతని రాజ్యమున్నప్పుడు ఇంకే ధర్మమూ ఉండేది కాదు. మొత్తం విశ్వముపై అతని రాజ్యమే ఉండేది మరియు అది యమునా నదీ తీరములో ఉండేది. ఇప్పుడు మీకు ఈ విషయాలను ఎవరు అర్థం చేయిస్తున్నారు? భగవానువాచ. వారు ఏ వేద-శాస్త్రాలు మొదలైనవాటినైతే వినిపిస్తారో అవన్నీ భక్తి మార్గానికి చెందినవి. ఇక్కడైతే స్వయంగా భగవంతుడే మీకు వినిపిస్తున్నారు. మనము పురుషోత్తములుగా అవుతున్నామని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. మనము శాంతిధామ నివాసులమని మరియు మనము వచ్చి 21 జన్మల ప్రారబ్ధాన్ని అనుభవిస్తామని మీకే బుద్ధిలో ఉంది.

అనంతమైన తండ్రి అయిన శివబాబా మనల్ని చదివిస్తున్నారు అని పిల్లలైన మీరు లోలోపల సంతోషముతో పులకరించిపోవాలి. వారు జ్ఞానసాగరుడు, వారికి సృష్టి ఆదిమధ్యాంతాల గురించి తెలుసు. అటువంటి బాబా మన కోసం వచ్చారు కావున సంతోషంలో పులకరింపు కలుగుతుంది. బాబా, మేము మిమ్మల్ని మా వారసునిగా చేసుకున్నాము అని బాబాతో అంటారు. తండ్రి పిల్లలపై బలిహారమవుతారు. పిల్లలు అంటారు - భగవంతుడా, మీరు ఎప్పుడైతే వస్తారో, అప్పుడు మేము మీపై బలిహారమవుతాము అనగా మిమ్మల్ని మా సంతానముగా చేసుకుంటాము. వీరు కూడా తన పిల్లలనే వారసులుగా చేసుకుంటారు. బాబాను వారసునిగా ఎలా చేసుకుంటారు. ఇది కూడా గుహ్యమైన విషయమే. మీ సర్వస్వాన్ని ఎక్స్ఛేంజ్ చేసుకోవాలి - ఇది బుద్ధితో చేయవలసిన పని. పేదవారైతే వెంటనే ఎక్స్ఛేంజ్ చేసుకుంటారు. షావుకార్లు కష్టం మీద చేస్తారు. ఎప్పటివరకైతే జ్ఞానాన్ని పూర్తిగా తీసుకోరో అప్పటివరకూ అంతటి ధైర్యము ఉండదు. పేదవారైతే వెంటనే అంటారు - బాబా, మేము మిమ్మల్నే వారసునిగా చేసుకుంటాము, కానీ మా వద్ద అసలు ఏమి ఉన్నదని? వారసునిగా చేసుకుని, మళ్ళీ తమ శరీర నిర్వహణను కూడా చేసుకోవాలి. కేవలం ట్రస్టీగా భావిస్తూ ఉండాలి. యుక్తులైతే ఎన్నో వినిపిస్తూ ఉంటారు. తండ్రి అయితే గమనిస్తూ ఉంటారు - ఏ పాప కర్మలలోనూ ధనాన్ని పాడు చేయడం లేదు కదా, మనుష్యులను పుణ్యాత్ములుగా తయారుచేయడంలో ధనాన్ని వినియోగిస్తున్నారా? సేవను కూడా విధిపూర్వకముగా చేస్తున్నారా? ఇదంతా పూర్తిగా పరిశీలిస్తారు, ఆ తర్వాత అన్ని సలహాలు ఇస్తారు. ఇతను కూడా వ్యాపారములో ఈశ్వరార్థము కొంత తీసేవారు కదా. అది ఇండైరెక్ట్ గా జరిగేది. ఇప్పుడు తండ్రి డైరెక్ట్ గా వచ్చారు. మనము ఏదైతే చేస్తున్నామో, దాని ఫలాన్ని ఈశ్వరుడు మరుసటి జన్మలో ఇస్తారని మనుష్యులు భావిస్తారు. ఎవరైనా పేదవారిగా, దుఃఖితులుగా ఉంటే వారు చేసుకున్న కర్మలే అలా ఉన్నాయి అని భావిస్తారు. మంచి కర్మలు చేసి ఉంటే సుఖంగా ఉంటారు. తండ్రి పిల్లలైన మీకు కర్మల గతి గురించి అర్థం చేయిస్తారు. రావణ రాజ్యములో మీ కర్మలన్నీ వికర్మలే అవుతాయి. సత్యయుగము మరియు త్రేతాలో రావణుడే ఉండడు, అందుకే అక్కడ ఏ కర్మ వికర్మగా అవ్వదు. ఇక్కడ ఏ మంచి కర్మలనైతే చేస్తారో, వాటికి అల్పకాలికముగా సుఖము లభిస్తుంది. అయినా ఏదో ఒక రోగము, గొడవ అయితే ఉంటూనే ఉంటుంది, ఎందుకంటే ఇక్కడున్నది అల్పకాలికమైన సుఖము. ఇప్పుడు తండ్రి అంటున్నారు, ఇక ఈ రావణ రాజ్యమే అంతమైపోనున్నది. రామ రాజ్య స్థాపనను శివబాబా చేస్తున్నారు.

ఈ చక్రము ఎలా తిరుగుతుంది అనేది మీకు తెలుసు. భారత్ యే మళ్ళీ నిరుపేదగా అవుతుంది. భారత్ నేటికి 5000 సంవత్సరాల క్రితం స్వర్గముగా ఉండేది, ఈ లక్ష్మీ-నారాయణుల రాజ్యము ఉండేది. మొదట వీరి సింహాసనమే నడిచేది. శ్రీకృష్ణుడు యువరాజు, మళ్ళీ స్వయంవరం తర్వాత రాజుగా అయ్యారు, శ్రీనారాయణుడు అన్న పేరు వచ్చింది. ఇది కూడా మీరు ఇప్పుడు అర్థం చేసుకుంటారు, కావున ఇది మీకు ఆశ్చర్యం అనిపిస్తుంది. బాబా, మీరు మొత్తం రచయిత మరియు రచన యొక్క జ్ఞానాన్ని వినిపిస్తున్నారు, మీరు మమ్మల్ని ఎంత ఉన్నతముగా చదివిస్తున్నారు, నేను మీపై బలిహారమవుతాను, నేను అయితే ఒక్క తండ్రిని తప్ప ఇంకెవ్వరి స్మృతి చేయకూడదు అని అంటారు. అంతిమం వరకూ చదవాలి కావున తప్పకుండా టీచరును స్మృతి చేయాలి. స్కూల్లో టీచరును స్మృతి చేస్తారు కదా. ఆ స్కూళ్ళలో అయితే ఎంతోమంది టీచర్లు ఉంటారు, ప్రతి ఒక్క క్లాస్ టీచరు వేర్వేరుగా ఉంటారు, ఇక్కడైతే ఒకే టీచర్ ఉన్నారు. వీరు ఎంత ప్రియమైనవారు. తండ్రీ ప్రియమైనవారు, టీచరూ ప్రియమైనవారే... ఇంతకుముందు భక్తి మార్గములో అంధవిశ్వాసముతో స్మృతి చేసేవారు. ఇప్పుడైతే డైరెక్టుగా తండ్రియే చదివిస్తున్నారు కావున ఎంతటి సంతోషము ఉండాలి, అయినా సరే - బాబా, మేము మర్చిపోతున్నాము అని అంటారు. మా బుద్ధి మిమ్మల్ని ఎందుకు స్మృతి చేయడం లేదో తెలియడం లేదు అని అంటారు. ఈశ్వరుడు ఇచ్చే గతి, వారు చూపే మార్గము అతీతమైనవి అని గానం కూడా చేస్తారు. బాబా, గతి మరియు సద్గతికి సంబంధించిన మీ మతము చాలా అద్భుతమైనది అని అంటారు. ఇటువంటి తండ్రిని స్మృతి చేయాలి. పత్ని తన పతి యొక్క గుణగానం చేస్తూ ఉంటుంది కదా. అతను చాలా మంచివారు, ఇది అతని ఆస్తి అంటూ లోలోపల సంతోషము ఉంటుంది కదా. వీరైతే పతులకే పతి, తండ్రులకే తండ్రి. వీరి ద్వారా మనకు ఎంతటి సుఖము లభిస్తుంది. మిగిలినవారందరి నుండి అయితే దుఃఖమే లభిస్తుంది. టీచర్ నుండి సుఖము లభిస్తుంది ఎందుకంటే చదువు ద్వారా సంపాదన కలుగుతుంది. గురువును ఎల్లప్పుడూ వానప్రస్థావస్థలోనే స్వీకరించడం జరుగుతుంది. తండ్రి కూడా అంటారు, నేను వానప్రస్థావస్థలో వచ్చాను, ఇతను కూడా వానప్రస్థియే, నేను కూడా వానప్రస్థినే, అలాగే ఈ నా పిల్లలందరూ కూడా వానప్రస్థులే. తండ్రి, టీచర్ మరియు గురువు, ముగ్గురూ కలిసి ఉన్నారు. తండ్రి టీచరుగా కూడా అవుతారు, అలాగే గురువుగా అయి తమతోపాటు తీసుకువెళ్తారు. ఆ ఒక్క తండ్రికే మహిమ ఉంది, ఈ విషయాలు ఇంకే శాస్త్రాలు మొదలైనవాటిలో లేవు. బాబా ప్రతి విషయాన్ని మంచి రీతిలో అర్థం చేయిస్తారు. ఇంతకన్నా ఉన్నతమైన జ్ఞానము ఇంకేదీ ఉండదు, అలాగే తెలుసుకోవలసిన అవసరమూ ఉండదు. మనం అన్నీ తెలుసుకుని విశ్వాధిపతులుగా అయిపోతాము, అంతకన్నా ఎక్కువ ఏమి చేస్తాము. పిల్లల బుద్ధిలో ఇది ఉన్నట్లయితే, అప్పుడు ఆ సంతోషములో మరియు అదే స్మృతిలో ఉంటారు. పుణ్య ఆత్మలుగా అయ్యేందుకు స్మృతిలో తప్పకుండా ఉండాలి. మీ యోగాన్ని తెంచడమనేది మాయ ధర్మము, యోగములోనే మాయ విఘ్నాలను కలిగిస్తుంది, వారిని మర్చిపోతారు. మాయ తుఫానులు ఎన్నో వస్తాయి. ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. అందరికన్నా ముందు ఇతను ఉన్నారు కావున ఇతనికి అన్నీ అనుభవమవుతాయి. నా వద్దకు ఎప్పుడైతే వస్తారో అప్పుడే అందరికీ అర్థం చేయిస్తాను కదా. ఈ మాయ తుఫానులన్నీ వస్తాయి. బాబా వద్దకు కూడా వస్తాయి, అలాగే మీకు కూడా వస్తాయి. మాయ తుఫానులే రాకుండా, యోగము సదా అలా జోడించబడే ఉన్నట్లయితే ఇక కర్మాతీత అవస్థ ఏర్పడుతుంది. అప్పుడిక మనం ఇక్కడ ఉండలేము. కర్మాతీత అవస్థ ఏర్పడినట్లయితే ఇక అందరూ తిరిగి వెళ్ళిపోతారు. శివుని ఊరేగింపు మహిమ చేయబడింది కదా. శివబాబా వస్తేనే ఆత్మలమైన మనమందరమూ వెళ్తాము. శివబాబా అందరినీ తీసుకువెళ్ళేందుకే వస్తారు. సత్యయుగములో ఇంతమంది ఆత్మలు ఉండరు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. శివబాబాను మీ వారసునిగా చేసుకుని అంతటినీ ఎక్స్ఛేంజ్ చేసుకోవాలి. వారసునిగా చేసుకుని శరీర నిర్వహణ కూడా చేసుకోవాలి, ట్రస్టీగా భావిస్తూ ఉండాలి. ధనాన్ని ఎటువంటి పాపకర్మలోనూ వినయోగించకూడదు.

2. స్వయంగా జ్ఞానసాగరుడైన బాబా మమ్మల్ని చదివిస్తున్నారు అని లోలోపల సంతోషములో పులకరింపు కలుగుతూ ఉండాలి. పుణ్య ఆత్మలుగా అయ్యేందుకు స్మృతిలో ఉండాలి, మాయ తుఫానులకు భయపడకూడదు.

వరదానము:-
సత్యత ఆధారముపై ఒక్క తండ్రిని ప్రత్యక్షము చేసే, నిర్భయ అథారిటీ స్వరూప భవ

సత్యతయే ప్రత్యక్షతకు ఆధారము. తండ్రిని ప్రత్యక్షము చేయడానికి నిర్భయులుగా మరియు అథారిటీ స్వరూపులుగా అయ్యి మాట్లాడండి, సంకోచముతో కాదు. మన అందరి తండ్రి ఒక్కరే మరియు వారే ఇప్పుడు కార్యము చేస్తున్నారు, ఒక్కరి సంతానమైన మనందరము ఒక్కటే మరియు వారు ఒక్కరే యథార్థము... అని అనేక అభిప్రాయాల వారు ఈ విషయాన్ని ఒప్పుకున్నట్లయితే అప్పుడు విజయ జండా ఎగరవేయబడుతుంది. ఈ సంకల్పముతోనే ముక్తిధామానికి వెళ్తారు మరియు ఎప్పుడైతే తమ-తమ పాత్రను అభినయించటానికి వస్తారో, అప్పుడు గాడ్ ఈజ్ వన్ (భగవంతుడు ఒక్కరే) అన్న ఈ సంస్కారమే మొదటగా ఇమర్జ్ అవుతుంది. ఇదే స్వర్ణయుగపు స్మృతి.

స్లోగన్:-
సహనము చెయ్యటమే స్వయము యొక్క శక్తి రూపాన్ని ప్రత్యక్షము చెయ్యటము.

అవ్యక్త ప్రేరణలు - ఆత్మిక స్థితిలో ఉండే అభ్యాసము చెయ్యండి, అంతర్ముఖులుగా అవ్వండి

ఎలా అయితే ఈ దేహము స్పష్టంగా కనిపిస్తుందో అలా మీ ఆత్మ స్వరూపము స్పష్టంగా కనిపించాలి అనగా అనుభవములోకి రావాలి. మస్తకము అనగా బుద్ధి యొక్క స్మృతి లేక దృష్టి ద్వారా ఆత్మిక స్వరూపము తప్ప ఇంకేదీ కనిపించకూడదు లేక స్మృతిలోకి రాకూడదు. ఇలా నిరంతర తపస్వీలుగా అయినట్లయితే అప్పుడు ప్రతి ఆత్మ పట్ల కళ్యాణకరమైన లేక శుభకరమైన సంకల్పాలు ఉత్పన్నమవుతాయి. ఒకవేళ ఎవరైనా తమ సంస్కార, స్వభావాలకు వశమై మీ పురుషార్థములో పరీక్షకు నిమిత్తులుగా అయినా కానీ వారి పట్ల కూడా సదా కళ్యాణమునకు చెందిన సంకల్పాలే ఉత్పన్నమవ్వాలి.