25-07-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - పిల్లిమొగ్గల ఆటను గుర్తుంచుకోండి, ఈ ఆటలో మొత్తం చక్రము యొక్క, బ్రహ్మా మరియు బ్రాహ్మణుల యొక్క రహస్యము ఇమిడి ఉంది’’

ప్రశ్న:-
సంగమయుగములో తండ్రి నుండి ఏ వారసత్వము పిల్లలందరికీ ప్రాప్తిస్తుంది?

జవాబు:-
ఈశ్వరీయ బుద్ధి యొక్క వారసత్వము. ఈశ్వరునిలో ఏ గుణాలైతే ఉన్నాయో వాటిని మనకు వారసత్వముగా ఇస్తారు. మన బుద్ధి వజ్రతుల్యముగా, పారసము వలె అవుతోంది. ఇప్పుడు మనం బ్రాహ్మణులుగా అయి తండ్రి నుండి చాలా భారీ ఖజానాను తీసుకుంటున్నాము, సర్వ గుణాలతో మన జోలెను నింపుకుంటున్నాము.

ఓంశాంతి
ఈ రోజు సద్గురువారము, బృహస్పతి వారము. రోజులలో కూడా కొన్ని ఉత్తమ దినాలు ఉంటాయి. బృహస్పతి వారమును ఉన్నతమైనది అని అంటారు కదా. బృహస్పతి వారము నాడు అనగా వృక్షపతి వారము నాడు స్కూల్లో లేక కాలేజీలో కూర్చుంటారు. ఈ మనుష్య సృష్టి రూపీ వృక్షానికి బీజరూపుడు తండ్రి అని మరియు వారు ఆకాలమూర్తి అని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. అకాలమూర్తి అయిన తండ్రికి అకాలమూర్తులైన పిల్లలు. ఇది ఎంత సహజము. కేవలం స్మృతియే కష్టమైనది. స్మృతి ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి, మీరు పతితుల నుండి పావనులుగా అవుతారు. పిల్లలైన మీపై అవినాశీ అయిన అనంతమైన దశ ఉంది అని తండ్రి అర్థం చేయిస్తారు. ఒకటేమో, హద్దులోని దశ ఉంటుంది మరియు ఇంకొకటి అనంతమైన దశ ఉంటుంది. తండ్రి వృక్షపతి. వృక్షము నుండి మొట్టమొదట బ్రాహ్మణులు వెలువడ్డారు. వృక్షపతినైన నేను సత్ చిత్ ఆనంద స్వరూపుడను అని తండ్రి చెప్తారు. ఆ తర్వాత జ్ఞానసాగరుడు, శాంతిసాగరుడు... అన్న మహిమను గానం చేస్తారు. సత్యయుగములో దేవీ-దేవతలందరూ శాంతి, పవిత్రతల సాగరులని మీకు తెలుసు. భారత్ సుఖ-శాంతి, పవిత్రతల సాగరముగా ఉండేదని, దీనినే విశ్వములో శాంతి అని అంటారని మీకు తెలుసు. మీరు బ్రాహ్మణులు. వాస్తవానికి మీరు కూడా అకాలమూర్తులే, ప్రతీ ఆత్మా తన సింహాసనముపై విరాజమానమై ఉంది. ఇవన్నీ చైతన్యమైన అకాల సింహాసనములు. భృకుటి మధ్యలో అకాలమూర్తి అయిన ఆత్మ విరాజమానమై ఉంది, దానిని సితార అని కూడా అంటారు. వృక్షపతి అయిన బీజరూపుడను జ్ఞానసాగరుడు అని అంటారు, కావున తప్పకుండా వారు రావలసి ఉంటుంది. మొట్టమొదట బ్రాహ్మణులు కావాలి, వారు ప్రజాపిత బ్రహ్మాకు దత్తత తీసుకోబడిన పిల్లలు. కావున తప్పకుండా మమ్మా కూడా కావాలి. పిల్లలైన మీకు చాలా బాగా అర్థం చేయిస్తారు. పిల్లిమొగ్గల ఆటను ఆడుతారు కదా. దాని అర్థమును కూడా వివరించారు. బీజరూపుడైన శివబాబా ఉన్నారు, ఆ తర్వాత బ్రహ్మా ఉన్నారు, బ్రహ్మా ద్వారా బ్రాహ్మణులు రచింపబడ్డారు. ఈ సమయములో మేము బ్రాహ్మణులము, మళ్ళీ మేమే దేవతలుగా... అవుతాము అని మీరు అంటారు. ఇంతకుముందు మనం శూద్ర బుద్ధి కలవారిగా ఉండేవారము. ఇప్పుడు తండ్రి మళ్ళీ పురుషోత్తమ బుద్ధి కలవారిగా తయారుచేస్తారు. వజ్రతుల్యమైన పారసబుద్ధిని తయారుచేస్తారు. ఈ పిల్లిమొగ్గల ఆట యొక్క రహస్యాన్ని కూడా అర్థం చేయిస్తారు. శివబాబా కూడా ఉన్నారు, ప్రజాపిత బ్రహ్మా మరియు దత్తత తీసుకోబడిన పిల్లలు ముందు కూర్చున్నారు. ఇప్పుడు మీరు ఎంత విశాలబుద్ధి కలవారిగా అయ్యారు. బ్రాహ్మణుల నుండి మళ్ళీ దేవతలుగా అవుతారు. ఇప్పుడు మీరు ఈశ్వరీయ బుద్ధి కలవారిగా అవుతారు. ఈశ్వరునిలో ఏ గుణాలైతే ఉన్నాయో అవి మీకు వారసత్వ రూపములో లభిస్తాయి. అర్థం చేయించే సమయములో ఇది మర్చిపోకండి. తండ్రి జ్ఞానసాగరుడు, నెంబర్ వన్, వారిని జ్ఞానేశ్వరుడు అని అంటారు, వారు జ్ఞానాన్ని వినిపించే ఈశ్వరుడు. జ్ఞానము ద్వారా సద్గతి లభిస్తుంది. జ్ఞానము మరియు యోగము ద్వారా పతితులను పావనులుగా తయారుచేస్తారు. భారత్ యొక్క ప్రాచీన రాజయోగము ప్రసిద్ధమైనది ఎందుకంటే దాని ద్వారా ఇనుప యుగము నుండి బంగారు యుగముగా అయ్యింది. యోగము రెండు రకాలుగా ఉంటుంది - అది హఠయోగము మరియు ఇది రాజయోగము అని అర్థం చేయించడం జరిగింది. అది హద్దులోనిది, ఇది అనంతమైనది. వారు హద్దు సన్యాసులు, మీరు అనంతమైన సన్యాసులు. వారు ఇళ్ళు-వాకిళ్ళను వదిలేస్తారు, మీరు మొత్తం ప్రపంచమంతటినీ సన్యాసము చేస్తారు. ఇప్పుడు మీరు ప్రజాపిత బ్రహ్మాకు సంతానము, ఇది చిన్నని కొత్త వృక్షము. ఇది పాతది నుండి కొత్తదిగా అవుతుందని మీకు తెలుసు, దీని అంటు కట్టబడుతోంది. తప్పకుండా మనము పిల్లిమొగ్గల ఆటను ఆడతాము. మనమే బ్రాహ్మణులుగా, మళ్ళీ మనమే దేవతలుగా అవుతాము. ఈ ‘మేమే’ అన్న పదాన్ని తప్పకుండా ఉంచాలి. కేవలం మేము అని అనడం కాదు, హంసో (మేమే) శూద్రులుగా ఉండేవారము, మళ్ళీ మేమే బ్రాహ్మణులుగా అయ్యాము.... ఈ పిల్లిమొగ్గల ఆటను ఏమాత్రం మర్చిపోకూడదు. ఇది చాలా సహజము. తాము 84 జన్మలు ఎలా తీసుకుంటారు, మెట్లు ఎలా దిగారు, మళ్ళీ బ్రాహ్మణులుగా అయి మెట్లు ఎలా ఎక్కుతారు అనేది చిన్న-చిన్న పిల్లలు కూడా అర్థం చేయించవచ్చు. బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతారు.

ఇప్పుడు బ్రాహ్మణులుగా అయి చాలా భారీ ఖజానాను తీసుకుంటున్నారు. జోలెను నింపుకుంటున్నారు. జ్ఞానసాగరుడు అని శంకరుడిని అనడం జరగదు, వారు జోలెను నింపరు. చిత్రకారులు దానిని అలా చిత్రీకరించారు. శంకరుని విషయమే లేదు. ఈ విష్ణువు మరియు బ్రహ్మా ఇక్కడివారు. లక్ష్మీ-నారాయణుల యుగళ రూపాన్ని పైన చూపించారు. ఇది వీరికి (బ్రహ్మాకు) అంతిమ జన్మ. మొట్టమొదట వీరు విష్ణువుగా ఉండేవారు, మళ్ళీ 84 జన్మల తరువాత ఈ బ్రహ్మాగా అయ్యారు. వీరికి నేను బ్రహ్మా అన్న పేరును పెట్టాను, అందరి పేర్లూ మార్చేసాను ఎందుకంటే సన్యాసం తీసుకున్నారు కదా. శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యారు కావున పేరు మార్చారు. తండ్రి చాలా రమణీకమైన పేర్లు పెట్టారు. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు, వృక్షపతి ఈ రథములో కూర్చున్నారని మీరు చూస్తారు. ఇది వారి అకాల సింహాసనము, అలాగే వీరిది కూడా. ఈ సింహాసనాన్ని వారు అద్దెకు తీసుకుంటారు. వారికి తమ సింహాసనమైతే ఏదీ లభించదు. తండ్రి అంటారు, నేను ఈ రథముపై విరాజమానమవుతాను, పరిచయాన్ని ఇస్తాను. నేను మీ తండ్రిని, కేవలం నేను జనన-మరణాలలోకి రాను, మీరు వస్తారు. ఒకవేళ నేను కూడా వస్తే మిమ్మల్ని తమోప్రధానుల నుండి సతోప్రధానులుగా ఎవరు తయారుచేస్తారు? అలా తయారుచేసేవారు కావాలి కదా, కావుననే నాకు ఇటువంటి పాత్ర ఉంది. ఓ పతితపావనా, రండి అని నన్ను పిలుస్తారు కూడా. నిరాకారుడైన శివబాబాను ఆత్మలు పిలుస్తారు ఎందుకంటే ఆత్మలకు దుఃఖము ఉంది. భారతవాసీ ఆత్మలు తమను వచ్చి పతితుల నుండి పావనులుగా చేయమని విశేషంగా పిలుస్తారు. సత్యయుగములో మీరు చాలా పవిత్రముగా, సుఖముగా ఉండేవారు, ఎప్పుడూ పిలిచేవారు కాదు. కావున తండ్రి స్వయంగా అంటున్నారు, మిమ్మల్ని సుఖవంతులుగా చేసి నేను మళ్ళీ వానప్రస్థములో కూర్చుంటాను, అక్కడ నా అవసరమే ఉండదు. భక్తి మార్గములో నా పాత్ర ఉంది, మళ్ళీ అర్ధకల్పం వరకూ నా పాత్ర ఉండదు. ఇదైతే చాలా సహజము. ఇందులో ఎవరి ప్రశ్న ఉత్పన్నమవ్వదు. దుఃఖములో అందరూ స్మరిస్తారు, సుఖములో ఎవ్వరూ స్మరించరు... అన్న గాయనం కూడా ఉంది. సత్య, త్రేతా యుగాలలో భక్తి మార్గము ఉండనే ఉండదు, దానిని జ్ఞాన మార్గము అని కూడా అనరు. జ్ఞానము సంగమములోనే లభిస్తుంది, దాని ద్వారా మీరు 21 జన్మలు ప్రారబ్ధాన్ని పొందుతారు. నంబరువారుగా పాస్ అవుతారు. ఫెయిల్ కూడా అవుతారు. మీ ఈ యుద్ధము కొనసాగుతోంది. ఏ రథములోనైతే తండ్రి విరాజమానమై ఉన్నారో వారు విజయాన్ని పొందుతారని మీకు తెలుసు. అలాగే అనన్యులైన పిల్లలు కూడా విజయాన్ని పొందుతారు, ఉదాహరణకు కుమార్కా ఉన్నారు, ఫలానా వారు ఉన్నారు, వారు తప్పకుండా విజయాన్ని పొందుతారు. వారు అనేకులను తమ సమానంగా తయారుచేస్తారు. కావున పిల్లలు ఇది పిల్లిమొగ్గల ఆట అని బుద్ధిలో ఉంచుకోవాలి. చిన్నపిల్లలు కూడా ఇది అర్థం చేసుకోగలరు, అందుకే పిల్లలకు కూడా నేర్పించండి అని బాబా అంటారు. వారికి కూడా తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునే హక్కు ఉంది. ఇది పెద్ద విషయమేమీ కాదు. ఈ జ్ఞానాన్ని కొద్దిగా తెలుసుకున్నా సరే, ఇది ఎప్పుడూ వినాశనమవ్వదు, స్వర్గములోకైతే తప్పకుండా వస్తారు. క్రైస్టు ద్వారా స్థాపించబడిన క్రిస్టియన్ ధర్మం ఎంత పెద్దగా ఉంది. ఈ దేవీ-దేవతా ధర్మమైతే అన్నింటికన్నా మొదటిది మరియు పెద్దది. ఇది రెండు యుగాలు కొనసాగుతుంది కావున వారి సంఖ్య కూడా తప్పకుండా ఎక్కువగా ఉండాలి. కానీ హిందువులు అని పిలుచుకున్నారు. 33 కోట్ల మంది దేవతలు అని అంటారు కూడా. మరి హిందువులు అని ఎందుకు అంటున్నారు! మాయ బుద్ధిని పూర్తిగా హతమార్చేసింది కావున ఇటువంటి పరిస్థితి ఏర్పడింది. తండ్రి అంటారు, మాయను జయించడం కష్టమైన విషయమేమీ కాదు, మీరు ప్రతి కల్పము విజయాన్ని పొందుతారు. మీరు సైన్యము కదా. ఈ వికారాల రూపీ రావణుడిపై విజయాన్ని ప్రాప్తింపజేసేందుకు తండ్రి లభించారు.

మీపై ఇప్పుడు బృహస్పతి దశ ఉంది. భారత్ పైనే ఈ దశ వస్తుంది. ఇప్పుడు అందరిపైనా రాహువు దశ ఉంది. వృక్షపతి అయిన తండ్రి వస్తారు కావున తప్పకుండా భారత్ పై బృహస్పతి దశ కూర్చుంటుంది. ఇందులో అన్నీ వచ్చేస్తాయి. మనకు నిరోగి శరీరము లభిస్తుందని పిల్లలైన మీకు తెలుసు. అక్కడ మృత్యువు అన్న మాటే ఉండదు. అది అమరలోకము కదా. అక్కడ ఫలానావారు మరణించారు అని అనరు. మరణము అన్న మాటే ఉండదు, ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటారు. శరీరాన్ని తీసుకోవడంలో మరియు వదలడంలో సంతోషమే ఉంటుంది. దుఃఖము అన్న మాటే ఉండదు. మీపై ఇప్పుడు బృహస్పతి దశ ఉంది. అందరిపైనా బృహస్పతి దశ కూర్చోలేదు. స్కూల్లో కూడా కొందరు పాస్ అవుతారు, కొందరు ఫెయిల్ అవుతారు. ఇది కూడా పాఠశాలయే. మేము రాజయోగాన్ని నేర్చుకుంటాము అని మీరు అంటారు, నేర్పించేది ఎవరు? అనంతమైన తండ్రి. కావున ఎంత సంతోషం ఉండాలి, ఇందులో ఇంకే విషయమూ లేదు. పవిత్రతయే ముఖ్యమైన విషయము. ఓ పిల్లలూ! దేహ సహితంగా దేహపు సర్వ సంబంధాలను వదిలి నన్నొక్కరినే స్మృతి చేయండి అని వ్రాయబడి ఉంది కూడా. ఇవి గీతలోని పదాలు. ఈ గీత అధ్యాయము నడుస్తోంది. అందులో కూడా మనుష్యులు కలగాపులగం చేసేసారు. పిండిలో ఏదో కాస్త ఉప్పు అంత ఉంది. విషయము ఎంత సహజమైనది, దీనిని చిన్న పిల్లలు కూడా అర్థం చేసుకోగలరు. అయినా కానీ ఎందుకు మర్చిపోతారు? బాబా, మీరు వచ్చినట్లయితే మేము మీవారిగానే అవుతాము, మాకు ఇంకెవ్వరూ లేరు, మేము మీకు చెందినవారిగా అయి మీ నుండి వారసత్వాన్ని తీసుకుంటాము అని భక్తి మార్గములో కూడా అనేవారు. వారసత్వాన్ని తీసుకునేందుకే తండ్రికి చెందినవారిగా అవుతారు. దత్తత అవుతారు. తండ్రి నుండి తమకు ఏమి లభిస్తుందో వారికి తెలుసు. మీరు కూడా దత్తత తీసుకోబడ్డారు. మనము తండ్రి నుండి విశ్వ రాజ్యాధికారాన్ని, అనంతమైన వారసత్వాన్ని తీసుకుంటాము అని మీకు తెలుసు. ఇంకెవ్వరిలోనూ మమకారాన్ని ఉంచరు. ఎవరికైనా లౌకిక తండ్రి ఉన్నా, వారి వద్ద ఏముంటుంది. ఎక్కువలో ఎక్కువ లక్ష, లక్షన్నర ఉంటుంది. ఈ అనంతమైన తండ్రి మీకు అనంతమైన వారసత్వాన్ని ఇస్తారు.

పిల్లలైన మీరు అర్ధకల్పము అసత్యమైన కథలు వింటూ వచ్చారు. ఇప్పుడు సత్యమైన కథను తండ్రి ద్వారా వింటారు కావున ఇటువంటి తండ్రిని స్మృతి చేయాలి. పూర్తి ధ్యానముతో వినాలి. హంసో (మేమే అది) అన్న పదము యొక్క అర్థాన్ని కూడా వివరించాలి. వారైతే ఆత్మయే పరమాత్మ అని అనేస్తారు. ఈ 84 జన్మల కథనైతే ఎవ్వరూ తెలియజేయలేరు. తండ్రినైతే కుక్క, పిల్లి అన్నింటిలోనూ ఉన్నారు అని అంటారు. తండ్రిని గ్లాని చేస్తారు కదా. ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. ఎవరి పైనా దోషము మోపరు. డ్రామాయే ఈ విధంగా రచింపబడి ఉంది. ఎవరైతే మిమ్మల్ని జ్ఞానము ద్వారా దేవతలుగా తయారుచేస్తారో, వారినే మీరు గ్లాని చేయడం మొదలుపెడతారు. మీరు ఈ విధంగా పిల్లిమొగ్గల ఆటను ఆడుతారు. ఈ డ్రామా కూడా రచింపబడి ఉంది. నేను మళ్ళీ వచ్చి మీపై కూడా ఉపకారం చేస్తాను. మీ దోషం కూడా లేదు, ఇది ఒక ఆట అని నాకు తెలుసు. ఈ కథను మీకు అర్థం చేయిస్తాను, ఇదే సత్యాతి-సత్యమైన కథ, దీని ద్వారా మీరు దేవతలుగా అవుతారు. దీనికి భక్తి మార్గములో లెక్కలేనన్ని కథలను తయారుచేసారు. అక్కడ లక్ష్యము-ఉద్దేశ్యము ఏమీ లేదు, అవన్నీ కింద పడేందుకే. ఆ పాఠశాలలో విద్యను బోధిస్తారు, అక్కడ శరీర నిర్వహణ కొరకు లక్ష్యముంటుంది. పండితులు తమ శరీర నిర్వహణ కొరకు కూర్చుని కథలను వినిపిస్తారు, మనుష్యులు వారి ముందు డబ్బు పెడుతూ ఉంటారు, ప్రాప్తి ఏమీ లేదు. మీకైతే ఇప్పుడు జ్ఞాన రత్నాలు లభిస్తాయి, వీటి ద్వారా మీరు కొత్త ప్రపంచానికి యజమానులుగా అవుతారు. అక్కడ ప్రతి వస్తువూ కొత్తగా లభిస్తుంది. కొత్త ప్రపంచములో అన్నీ కొత్తగా ఉంటాయి. వజ్ర-వైఢూర్యాలన్నీ కొత్తగా ఉంటాయి. ఇప్పుడు తండ్రి అంటారు, మీరు ఇతర విషయాలన్నింటినీ వదిలి పిల్లిమొగ్గల ఆటను గుర్తు చేసుకోండి. ఫకీర్లు కూడా ఇలా పిల్లిమొగ్గలు వేస్తూ తీర్థాలకు వెళ్తారు, కొందరు కాలినడకన కూడా వెళ్తారు. ఇప్పుడైతే మోటార్లు, విమానాలు కూడా వచ్చేసాయి, పేదవారైతే వాటిలో వెళ్ళలేరు. ఎవరైనా చాలా శ్రద్ధ కలవారు ఉంటే వారు కాలినడకన కూడా వెళ్ళిపోతారు. రోజురోజుకు సైన్స్ ద్వారా ఎంతో సుఖము లభిస్తూ ఉంటుంది. ఇది అల్పకాలికమైన సుఖము, ఒకవేళ విమానం కూలిపోతే ఎంత నష్టం కలుగుతుంది. ఈ వస్తువులలో అల్పకాలికమైన సుఖము ఉంది, చివరికి అందులో మృత్యువే నిండి ఉంది. అది సైన్స్, మీది సైలెన్స్. తండ్రిని స్మృతి చేయడం ద్వారా అన్ని రోగాలూ సమాప్తమైపోతాయి, నిరోగులుగా అయిపోతారు. సత్యయుగములో సదా ఆరోగ్యవంతులుగా ఉండేవారని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఈ 84 జన్మల చక్రము తిరుగుతూనే ఉంటుంది. తండ్రి ఒకేసారి వచ్చి అర్థం చేయిస్తారు - మీరు నన్ను గ్లాని చేసారు, మిమ్మల్ని మీరు చెంపదెబ్బ వేసుకున్నారు, గ్లాని చేస్తూ-చేస్తూ మీరు శూద్ర బుద్ధి కలవారిగా అయిపోయారు. సాహెబును జపించినట్లయితే సుఖము లభిస్తుంది అనగా మన్మనాభవ అని సిక్కులు కూడా అంటారు. ఉన్న పదాలు రెండే, ఇంకా ఎక్కువగా కష్టపడవలసిన అవసరమే లేదు. ఇది కూడా తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు. సాహెబును స్మృతి చేయడం ద్వారా మీకు 21 జన్మల సుఖం లభిస్తుంది అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. వారు కూడా ఆ మార్గాన్ని చెప్తారు కానీ వారికి పూర్తి దారి గురించి తెలియనే తెలియదు. స్మరిస్తూ-స్మరిస్తూ సుఖాన్ని పొందండి. సత్యయుగములో రోగాలు మొదలైన దుఃఖపు విషయాలు కూడా ఏవీ ఉండవని పిల్లలైన మీకు తెలుసు. ఇది సామాన్యమైన విషయము. దానిని సత్యయుగము, బంగారుయుగము అని అంటారు, దీనిని కలియుగము, ఇనుపయుగము అని అంటారు. సృష్టి చక్రము తిరుగుతూ ఉంటుంది. వివరణ ఎంత బాగా ఉంది. ఇది పిల్లిమొగ్గల ఆట. ఇప్పుడు మీరు బ్రాహ్మణులు, మళ్ళీ దేవతలుగా అవుతారు. ఈ విషయాలను మీరు మర్చిపోతారు. పిల్లిమొగ్గల ఆట గుర్తు ఉన్నట్లయితే ఈ జ్ఞానమంతా గుర్తుంటుంది. ఇటువంటి తండ్రిని స్మృతి చేసి రాత్రి పడుకోవాలి. అయినా కానీ బాబా, మర్చిపోతున్నాము అని అంటారు. మాయ ఘడియ, ఘడియ మరపింపజేస్తుంది. మీకు మాయతో యుద్ధం జరుగుతుంది. మళ్ళీ అర్ధకల్పం మీరు దానిపై రాజ్యం చేస్తారు. ఎంతో సహజమైన విషయాన్ని తెలియజేస్తారు. దీని పేరే సహజ జ్ఞానము, సహజ స్మృతి. కేవలం తండ్రిని స్మృతి చేయండి, వారు ఏమి కష్టాన్ని ఇస్తారు. భక్తి మార్గములోనైతే మీరు ఎంతో కష్టపడ్డారు. సాక్షాత్కారాల కొరకు శిరస్సును ఖండించుకునేందుకు కూడా సిద్ధమైపోతారు, కాశీలో కత్తుల బావిలో దూకుతారు. అయితే, ఎవరైతే నిశ్చయబుద్ధి కలవారిగా అయి చేస్తారో, వారి వికర్మలు వినాశనమవుతాయి. మళ్ళీ కొత్తగా లెక్కాచారాలు ప్రారంభమవుతాయి. అంతేకానీ నా వద్దకైతే రారు. నా స్మృతి ద్వారా వికర్మలు వినాశనమవుతాయి, అంతేకానీ జీవహత్య ద్వారా కాదు. నా వద్దకైతే ఎవరూ రారు. ఇది ఎంత సహజమైన విషయము. ఈ పిల్లిమొగ్గల ఆట అయితే వృద్ధులకు కూడా గుర్తుండాలి, అలాగే పిల్లలకు కూడా గుర్తుండాలి. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. వృక్షపతి అయిన తండ్రి నుండి సుఖము-శాంతి-పవిత్రత యొక్క వారసత్వాన్ని తీసుకునేందుకు స్వయాన్ని అకాలమూర్త ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయాలి, ఈశ్వరీయ బుద్ధిని తయారుచేసుకోవాలి.

2. తండ్రి ద్వారా సత్యమైన కథను విని ఇతరులకు వినిపించాలి. మాయాజీతులుగా అయ్యేందుకు మీ సమానముగా తయారుచేసే సేవను చేయాలి. మేము కల్ప-కల్పపు విజయులము, తండ్రి మాతోపాటు ఉన్నారు అని బుద్ధిలో ఉండాలి.

వరదానము:-

నిర్బలుల నుండి శక్తివంతులుగా అయ్యి అసంభవాన్ని సంభవము చేసే ధైర్యవాన్ ఆత్మా భవ

‘‘పిల్లలు ధైర్యమును ఉంచితే తండ్రి సహాయము లభిస్తుంది’’ ఈ వరదానము యొక్క ఆధారముతో ధైర్యముతో కూడిన మొట్టమొదటి సంకల్పాన్ని చేసారు, అదేమిటంటే - మేము పవిత్రులుగా అవ్వవలసిందే... మరియు దానికి తండ్రి పదమాల రెట్లు సహాయాన్ని ఇచ్చారు, అదేమిటంటే - ఆత్మలైన మీరు అనాది-ఆదిలో పవిత్రులు, అనేక సార్లు పవిత్రులుగా అయ్యారు మరియు అవుతూనే ఉంటారు అని స్మృతినిప్పించారు. అనేక సార్లు అన్న స్మృతి ద్వారా సమర్థులుగా అయ్యారు. నిర్బలుల నుండి ఎంతటి శక్తివంతులుగా అయ్యారంటే విశ్వాన్ని కూడా పావనంగా చేసే చూపిస్తాము అన్న ఛాలెంజ్ చేస్తారు. ఋషులు, మునులు, మహాన్ ఆత్మలు ప్రవృత్తిలో ఉంటూ పవిత్రముగా ఉండటము కష్టము అని దేనినైతే భావిస్తారో, దానిని మీరు అతి సహజము అని అంటారు.

స్లోగన్:-

దృఢ సంకల్పాన్ని చెయ్యటమే వ్రతాన్ని చేపట్టడము, సత్యమైన భక్తులు ఎప్పుడూ వ్రతాన్ని భంగం చేయరు.