25-07-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీరు ఇక్కడకు మీ శరీర సహితముగా మొత్తం ప్రపంచము వారందరి శరీరాలను కల్పతరువుగా చేయడానికి వచ్చారు, స్మృతి ద్వారానే శరీరము కల్పతరువుగా తయారవుతుంది’’

ప్రశ్న:-
నరకవాసుల నుండి స్వర్గవాసులుగా అయ్యే విధి ఏమిటి? ఇప్పుడు పిల్లలైన మీకు ప్రాణదానము లభిస్తుంది, అది ఎలా?

జవాబు:-
నరకవాసుల నుండి స్వర్గవాసులుగా అయ్యేందుకు తప్పకుండా మరణించవలసి ఉంటుంది. బాబా అంటారు - మీ అందరికీ మృత్యువును ఇవ్వడానికి నేను వచ్చాను. మీ ఈ దేహాలను సమాప్తము చేయించి మిగిలిన ఆత్మలను తీసుకువెళ్తాను, ఇదే సత్యమైన ప్రాణదానము. దీని కోసం ఈ మహాభారత యుద్ధము జరుగుతుంది, ఇందులో అందరి వినాశనము జరుగుతుంది. తర్వాత ఆత్మలు పావనముగా అయి తిరిగి ఇంటికి వెళ్తాయి, ఆ తర్వాత స్వర్గములోకి వస్తాయి.

పాట:-
మాతా ఓ మాతా...

ఓంశాంతి
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాటలోని లైన్ ను విన్నారు. జగదాంబ మహిమను విన్నారు. జగదాంబ గురించి ఇక్కడ భారత్ లోనే గాయనము చేయడము జరుగుతుంది. జగదాంబ ఉన్నప్పుడు జగత్ పిత కూడా తప్పకుండా ఉంటారు. జగదాంబ అని సరస్వతినే అంటారు. వాస్తవానికి వారికి ఒక్క పేరే ఉండాలి. మీకు కూడా ఒక్క పేరే ఉంటుంది కదా, 2-3 పేర్లు అయితే ఉండవు. ఇప్పుడు జగదాంబను తప్పకుండా సాకారములో శరీరధారిగా చూపిస్తారు. జగత్ పిత కూడా ఉన్నారు, వారిని ప్రజాపిత అని కూడా అంటారు. ఎలాగైతే మొత్తం జగత్తుకు అంబ అని ఉంటారో, అలా మొత్తం జగత్తుకు పిత కూడా ఉంటారు. తప్పకుండా ఇద్దరూ ఇక్కడే ఉంటారు. ఇద్దరి పేర్లను కూడా వినిపించాము. ప్రజాపిత మరియు ప్రజామాత, ఇద్దరూ ఉన్నారు. ఇప్పుడు ఇంకొక జగత్ పితగా నిరాకార శివబాబాను అంటారు. వారు అందరికీ తండ్రి, వారి పేరు పరమపిత పరమ ఆత్మ శివ. కేవలం ఈశ్వరా లేక పరమాత్మ అని అనకూడదు. వారికి నామ-రూపాలు కూడా ఉన్నాయి కదా, వారిని గాడ్ ఫాదర్ అని అంటారు. ఒకరేమో ఆత్మల తండ్రి, ఇంకొకరు సాకారీ మనుష్యాత్మల తండ్రి మరియు తల్లి. శివుడు ఆత్మలకు తండ్రి. వారు మా తండ్రి అని ఆత్మ అంటుంది. తర్వాత ఆత్మకు ఈ సాకార శరీరము లభించినప్పుడు బ్రహ్మాబాబా అని అంటారు. కావున ఇద్దరు తండ్రులయ్యారు. ఒకరు శివబాబా, రెండవవారు ప్రజాపిత బ్రహ్మా. శివబాబా పుత్రుడు బ్రహ్మా. ఒకరు నిరాకార తండ్రి, మరొకరు సాకార తండ్రి. నిరాకార తండ్రిని పతిత-పావనుడని అంటారు. బ్రహ్మాను లేక సరస్వతిని పతిత-పావనా అని అనరు. పతిత-పావనుడు ఒక్కరే. బ్రహ్మా-సరస్వతులు ఇద్దరయ్యారు. పతిత-పావనా రండి, అని అందరూ పిలుస్తారు. కనుక ఇద్దరు తండ్రులయ్యారు. శివబాబా రచయిత. వారు కొత్త ప్రపంచాన్ని రచిస్తారు. కనుక మొదట బ్రహ్మాను తప్పకుండా రచించాలి. విష్ణువును లేక శంకరుడిని ఎప్పుడూ ప్రజాపిత అని అనరు. బ్రహ్మానే ప్రజాపిత అని అంటారు. కనుక శివబాబా, ప్రజాపిత బ్రహ్మా ద్వారా దత్తత తీసుకుంటారు. మేము శివబాబా పిల్లలమని అంటారు. శివబాబా వీరిలో ప్రవేశించి దత్తత తీసుకున్నారు. వారే ఆత్మలను పావనముగా తయారుచేస్తారు. ఆత్మయే పతితముగా అయిపోయింది. ఈ కారణముగా శరీరము కూడా పతితమైనదే లభిస్తుంది. బంగారములో వెండి, రాగి, ఇనుముల మాలిన్యము కలిపినట్లుగా, ఆత్మలో కూడా మాలిన్యము చేరుకుంటుంది. వాస్తవానికి ఆత్మ పవిత్రమైన ముక్తిధామములో ఉండేటటువంటిది, అక్కడ శివబాబా కూడా ఉంటారు. ఇప్పుడు శివబాబా, ప్రజాపిత బ్రహ్మా - ఒకరిని తండ్రి అని, ఒకరిని దాదా అని అంటారు. మనుష్యమాత్రులందరూ శివుని సంతానమని మీకు తెలుసు. మీరు ముందు శివవంశీయులు, ఆ తర్వాత బ్రహ్మాకుమార-కుమారీలుగా అవుతారు. శివబాబా మరియు దాదా కలిసే ఉన్నారు. శివబాబా వీరిలో విరాజమానమై ఉన్నారు. మనల్ని బ్రాహ్మణులుగా చేసి, మనుష్యులను దేవతలుగా తయారుచేయడానికి రాజయోగాన్ని నేర్పిస్తారు. దేవతలు సత్యయుగములో ఉంటారు. దేవతలను పతిత-పావనులని, జ్ఞాన సాగరులని అనరు. వారిని తండ్రి అని కూడా అనలేము. ఇప్పుడు మీరు విష్ణుపురికి యజమానులుగా అవుతున్నారు. విష్ణువు యొక్క రెండు రూపాలు లక్ష్మీ-నారాయణులు, ఇది మనుష్యులకు తెలియదు. ఎవరైతే భక్తి చేస్తారో, వారికి తప్పకుండా ఇద్దరు తండ్రులు ఉన్నారు. సత్యయుగములో ఒకే తండ్రి ఉంటారు. అక్కడ - ఓ పరమపిత పరమాత్మ, దుఃఖహర్త-సుఖకర్త రండి అని పిలవరు. అక్కడైతే దేవీ-దేవతల రాజ్యముండేది. వారు ఎప్పుడూ - ఓ గాడ్ ఫాదర్, ముక్తిప్రదాత అని అనరు. పతిత-పావనుడిని పిలిచేందుకు అసలు అక్కడ పతితులు గాని, దుఃఖితులు గాని, ఎవరూ ఉండరు. భారత్ లో నేటికి 5 వేల సంవత్సరాల క్రితం దేవీ-దేవతల రాజ్యముండేదని మీకు తెలుసు. 1250 సంవత్సరాల తర్వాత సీతా-రాముల రాజ్యముంటుంది. సత్య, త్రేతాయుగాలలో మీరు 21 జన్మలు తీసుకున్నారని, తండ్రి ఋజువు చేసి తెలియజేస్తారు. బ్రాహ్మణులు, దేవతలు, క్షత్రియులు... అందరూ భారత్ లోనే ఉంటారు. తండ్రి వచ్చి పాత ప్రపంచాన్ని కొత్తదిగా చేస్తారు, పునరుజ్జీవింప చేస్తారు, శరీరాన్ని కల్పతరువుగా చేస్తారు, అమరులుగా చేస్తారు. తండ్రి వచ్చి పిల్లలైన మిమ్మల్ని అమరలోకానికి యజమానులుగా చేస్తారు. భారత్ అమరలోకములా ఉన్నప్పుడు దేవతల రాజ్యముండేది. మెట్లు దిగుతూ-దిగుతూ మృత్యులోకానికి యజమానులుగా అయ్యారు. మా భారత్ అని అంటారు కదా కనుక ప్రజలు కూడా యజమానులు అయినట్లే కదా. మీరు కూడా మా భారత్ అని అంటారు. మనము భారత్ కు యజమానులుగా ఉండేవారము కానీ నరకవాసులుగా ఉండేవారము. దేవతలు, మేము స్వర్గవాసులమని అంటారు. మీరు కూడా స్వర్గవాసులుగా ఉండేవారు, తర్వాత 84 జన్మలను అనుభవించి నరకవాసులుగా అయ్యారు. ఇక్కడ భారత్ లోనే శివబాబా జన్మిస్తారు. శివరాత్రి లేక శివజయంతి అని అంటూ ఉంటారు. శ్రీకృష్ణ జయంతిని కూడా జరుపుకుంటారు, వారి విషయములో వారు జన్మించిన సమయాన్ని కూడా తెలియజేస్తారు. ఫలానా సమయములో తల్లి గర్భము నుండి జన్మించారని అంటారు. సత్యయుగములో తప్పకుండా తల్లి గర్భము నుండే జన్మించి ఉంటారు. శ్రీకృష్ణ జయంతి సత్యయుగ కొత్త ప్రపంచములో జరుగుతుంది, ఆ తర్వాత పునర్జన్మలలోకి రావడము మొదలుపెట్టారు. బాబా కేవలం ఒక్కరి గురించే చెప్పడము లేదు. కృష్ణపురియే విష్ణుపురి. రాజులు దిగజారిపోతే మొత్తం వంశమంతా దిగజారిపోతుంది. అందులో రాజు-రాణి, ప్రజలు అందరూ వచ్చేస్తారు. చంద్రవంశీయుల రాజ్యము వచ్చేటప్పటికి సూర్యవంశీయుల రాజ్యము గతించిపోయింది. రాజ్యము ట్రాన్స్ఫర్ అయి చంద్రవంశీయులకు లభిస్తుంది, ఆ తర్వాత వైశ్యవంశీయులకు లభిస్తుంది.

బ్రాహ్మణ కులానికి చెందిన మనము పిలక వంటి వారమని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. పిలక స్థానము కన్నా పై భాగములో ఉన్నది తండ్రి. మనము ముందు బ్రాహ్మణులుగా ఉండేవారము, ఆ తర్వాత శూద్రులుగా అనగా పాదాల స్థానానికి చేరుకున్నాము. పాదాల స్థానము నుండి ఒక్కసారిగా పిలక వలె అవుతాము. ముందు శివబాబా, ఆ తర్వాత పిలక స్థానము కలవారు. బాబా మిమ్మల్ని బ్రాహ్మణులుగా తయారుచేసారు. ఇప్పుడు మీరు శివబాబాను ‘బాబా-బాబా’ అని అంటారు. ఈ లెక్క ప్రకారము మీరు మనవలు-మనవరాళ్ళుగా అయ్యారు. బ్రాహ్మణ, బ్రాహ్మణీలైన మనమంతా బ్రహ్మా సంతానమని మీకు తెలుసు. మనమంతా ఒక్క తండ్రి పిల్లలము. సోదరీ-సోదరులు ఎప్పుడూ వికారీ చేష్టలు చేయలేరు. ఎంతోమంది పిల్లలు ఉన్నారు, అందరూ బాబా... అని అంటున్నారు అంటే ఇంతమంది అసత్యము కారు. అందరికీ తండ్రి అయితే ఆ నిరాకార శివుడు మరియు సాకారములో ప్రజాపిత బ్రహ్మా, అంతే. ఒక్క తండ్రి పిల్లలు సోదరీ-సోదరులు. మీరు పవిత్రముగా తప్పకుండా అవ్వాలి. పతి-పత్ని పవిత్రముగా ఎలా అవ్వగలరు? అందుకే డ్రామాలో ఈ యుక్తి నిశ్చితమై ఉంది. ఇక్కడ కేవలం బ్రహ్మాకుమార-కుమారీలు ఉన్నారు. శూద్ర కుమార-కుమారీలు ఎవరూ లేరు. వారు పతితులు, శూద్రులు, తుచ్ఛ బుద్ధి కలవారు, ఎందుకంటే వారికి తండ్రి గురించి తెలియదు. ఓ గాడ్ ఫాదర్ అని అంటారు. అచ్ఛా, వారి కర్తవ్యము గురించి తెలుసా? వారి నామ, రూప, దేశ, కాలాలు చెప్పండి. వారి జీవిత కథ చెప్పండి. ఒకవేళ తెలియకపోతే నాస్తికులు అయినట్లు. రచయిత మరియు రచనల ఆదిమధ్యాంతాల గురించి తెలియదు. ఇది ఉన్నదే పతిత ప్రపంచము. సత్యయుగాన్ని పావన ప్రపంచమని, కలియుగాన్ని పతిత ప్రపంచమని అంటారు. ఈ సమయములో పూర్తిగా తమోప్రధానముగా ఉన్నారు, దీనిని రౌరవ నరకమని అంటారు. దీనికి కూడా స్టేజీలు ఉంటాయి. ద్వాపరము నుండి నరకముగా అవ్వడము మొదలవుతుంది, ఆ తర్వాత వృద్ధి చెందుతుంది. భక్తి కూడా ముందు సతోప్రధానముగా, అవ్యభిచారిగా ఉండేది, తర్వాత సతో, రజో, తమోగా అవుతుంది. ఎక్కడైతే మూడు రోడ్లు కలుస్తాయో, దానిని కూడలి అని అంటారు, అక్కడ నూనె మొదలైనవి వేసి తల వంచి నమస్కరించడాన్ని మీరు చూసే ఉంటారు. ఇప్పుడు శివబాబాను పూజించడము ఎక్కడ? కూడలిని పూజించడము ఎక్కడ? దీనిని తమోప్రధాన భక్తి అని అంటారు. నీటిని కూడా పూజిస్తారు. పతిత-పావని గంగ అని చాలా పాడుతారు. ఇప్పుడు పతిత-పావనుడు ఎవరు? నీటి గంగ పతిత-పావని ఎలా అవ్వగలదు? అది నీరు కదా. పతిత-పావనుడైతే తండ్రి. శివ జయంతి కూడా భారత్ లోనే జరుగుతుంది కావున పతితులను పావన దేవతలుగా తయారుచేయడానికి తప్పకుండా భారత్ లోనే వచ్చి ఉంటారు. బ్రహ్మా తనువులోకి వచ్చి మనుష్యులను దేవతలుగా చేస్తారు. ఇక్కడకు మీరు వచ్చేది పతితము నుండి పావనముగా అయ్యేందుకే. ఎలాగైతే మీకు రెండు భుజాలు ఉన్నాయో, అలాగే దేవతలకు కూడా రెండు భుజాలు ఉంటాయి. 4-8 భుజాలు కల మనుష్యులెవ్వరూ ఉండరు. ఈ అలంకరణలను చూపించారు. ప్రవృత్తి మార్గాన్ని చూపించేందుకు చతుర్భుజుడిని చూపించారు. విష్ణుపురి అని లక్ష్మీ-నారాయణపురిని అంటారు. వైష్ణవ అనే పదము కూడా విష్ణువు నుండే వెలువడింది. దేవతలు వైష్ణవులు. వల్లభాచారీ వైష్ణవులు శాకాహారిగా ఉంటారు కానీ వారు నిర్వికారులుగా ఏమీ ఉండరు. వారికి పెద్ద భవనాలు ఉంటాయి. వైష్ణవులంటే అర్థం కూడా తెలియదు. విష్ణుపురిలో ఉండేవారిని వైష్ణవులని అంటారు. వైష్ణవులని పవిత్రులను అంటారు. రాధ-కృష్ణులకు వేరే మందిరాలను, లక్ష్మీ-నారాయణులకు వేరే మందిరాలను నిర్మించారు. వారి మధ్యన ఉన్న తేడా ఏమిటి అనేది భారతవాసులకు అసలు తెలియనే తెలియదు. రాధ-కృష్ణులే లక్ష్మీ-నారాయణులుగా అవుతారని ఎవరికీ తెలియదు. అది బాల్య రూపము, ఇది పెద్దవారైన తర్వాత రూపము. లక్ష్మీ-నారాయణుల బాల్యపు చిత్రాలేవీ లేవు. లక్ష్మీ-నారాయణులను సత్యయుగములోకి, రాధ-కృష్ణులను ద్వాపరములోకి తీసుకువెళ్ళారు. ఇప్పుడు మీరు రచయిత అయిన తండ్రి గురించి మరియు రచన యొక్క ఆదిమధ్యాంతాల గురించి తెలుసుకున్నారు. బాబా వృక్షము యొక్క రహస్యాన్ని కూడా అర్థం చేయిస్తారు. డ్రామా రహస్యాన్ని కూడా అర్థం చేయిస్తారు. వృక్షాన్ని చూస్తే, శంకరాచార్యులు కలియుగములో వస్తారని అర్థం చేసుకుంటారు. సన్యాసుల వంశము సత్యయుగములోనైతే ఉండదు. అందరూ భగవంతునికి పిల్లలే కనుక స్వర్గవాసులుగా ఉండాలి, కానీ స్వర్గవాసులుగా అయితే అందరూ అవ్వరు. కేవలం దేవతలు మాత్రమే అవుతారు. ఇప్పుడు మీరు బ్రాహ్మణ వంశీయులుగా అయ్యారు, తర్వాత దేవతలుగా అవుతారు. పవిత్రముగా తప్పకుండా అవ్వాలి.

చిన్న-పెద్దా అందరూ బ్రహ్మాకుమార-కుమారీలు అని మీకు తెలుసు. బాబా, మేము మీ పిల్లలము, బ్రాహ్మణులమని ఇరువురూ అంటారు. వీరు బాప్ దాదా - ఆది దేవ్ బ్రహ్మా మరియు శివబాబా. మేము బ్రహ్మాబాబా మరియు శివబాబా ఎదురుగా కూర్చున్నామని మీకు తెలుసు. తండ్రి అంటారు - నన్ను స్మృతి చేసినట్లయితే పతితుల నుండి పావనులుగా అయిపోతారు. మనము వారసత్వాన్ని శివబాబా నుండి తీసుకుంటాము. శివబాబా మన తండ్రి కూడా, పతిత-పావనుడు కూడా, గురువు కూడా. ఇప్పుడిది సంగమయుగము. పతితము నుండి పావనముగా అయ్యే మేళా ఇది. పతిత-పావనుడి ద్వారానే పావనముగా అవుతారు. సంగమములో నదులు మరియు సాగరము యొక్క మేళా జరుగుతుంది. కేవలం నదుల మేళా అయితే ఉండదు. ఇప్పుడు జ్ఞాన సాగరుడు మరియు ఆత్మలైన (పిల్లలైన) మీ యొక్క మేళా జరుగుతుంది. మీరు జ్ఞాన సాగరుడి వద్దకు వచ్చారు. జ్ఞాన గంగలైన మీరు జ్ఞాన సాగరుడి నుండి వెలువడ్డారు. మీరు జ్ఞాన స్నానము చేయించి పావనముగా చేస్తారు, యోగము నేర్పిస్తారు. సాగరుని పరిచయాన్ని ఇచ్చి, మీరు ఇక్కడకు మేళాకు తీసుకువచ్చారు. ఈ సమయములో మీరు బ్రాహ్మణులుగా అయినప్పుడు, మీకు ముగ్గురు తండ్రులు ఉన్నారు. లౌకిక తండ్రి కూడా ఉన్నారు మరియు ప్రజాపిత కూడా ఉన్నారు, ఇంకా శివబాబా కూడా ఉన్నారు. భక్తి మార్గములో ఇద్దరు తండ్రులు ఉంటారు. సత్యయుగములో ఒక్క తండ్రి ఉంటారు. ఇవి అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఇప్పుడు మీ ఆత్మ అంటుంది - నాకైతే ఒక్క శివబాబా తప్ప ఇంకెవ్వరూ లేరు. మిత్ర-సంబంధీకులు మొదలైనవారున్నా కూడా, నాకైతే ఒక్క శివబాబాయే ఉన్నారని అంటారు. వారి స్మృతితోనే పతితము నుండి పావనముగా అవ్వాలి. వారు మనకు తండ్రి కూడా, టీచరు కూడా, సద్గురువు కూడా అని ఆత్మకు తెలుసు. తండ్రి మన ఆత్మను తీసుకువెళ్ళేందుకు వచ్చారు. బ్రహ్మా తనువులో ప్రవేశించి పావనముగా తయారుచేస్తారు. మిమ్మల్ని తీసుకువెళ్ళేందుకు తండ్రి వచ్చారు. మీ అందరికీ మృత్యువును ఇచ్చేందుకు వచ్చాను. నరకవాసుల నుండి స్వర్గవాసులుగా అయ్యేందుకు తప్పకుండా మరణించాల్సి ఉంటుంది కదా. మీ ఈ దేహాలను సమాప్తము చేయించి ఆత్మలను తీసుకువెళ్తాను. తండ్రి అంటారు - మీకు ప్రాణ దానము ఇస్తాను. ఇది మహాభారత యుద్ధము కదా. అందరి వినాశనము జరుగుతుంది. లేదంటే ఎలా తీసుకువెళ్తాను. ఆత్మలను పవిత్రముగా తయారుచేసి ఇంటికి తీసుకువెళ్తాను. అది శాంతిధామము. సత్యయుగము వస్తుందంటే కలియుగము తప్పకుండా వినాశనమవుతుంది. అందుకే మహాభారత యుద్ధము ప్రసిద్ధి చెందింది. ఆ యుద్ధము ఈ సంగమములోనే జరుగుతుంది, ఇప్పుడే మీరు మనుష్యుల నుండి దేవతలుగా కూడా అవుతారు. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. జ్ఞాన సాగరునిలో జ్ఞాన స్నానము చేసి స్వయాన్ని పావనముగా తయారుచేసుకోవాలి. మిత్ర-సంబంధీకులతో పాటు ఉంటూ - నాకైతే ఒక్క శివబాబా తప్ప ఇంకెవ్వరూ లేరు అని బుద్ధిలో ఉండాలి.

2. విష్ణుపురిలోకి వెళ్ళేందుకు పక్కా వైష్ణవులుగా అనగా పవిత్రముగా అవ్వాలి. నరకములో జీవిస్తూ మరణించి బుద్ధియోగాన్ని స్వర్గముతో జోడించాలి.

వరదానము:-
ఒకే లగనము, ఒకే విశ్వాసము మరియు ఏకరస అవస్థ ద్వారా సదా నిర్విఘ్నముగా ఉండే నివారణ స్వరూప భవ

సదా ఒక్క బాబా పట్ల లగనములో మరియు బాబా కర్తవ్యము పట్ల లగనములో ఎలా నిమగ్నమై ఉండండి అంటే అసలు ప్రపంచములో ఏదైనా వస్తువు ఉందని లేక ఎవరైనా వ్యక్తులు ఉన్నారని అనుభవమే అవ్వకూడదు. ఇలా ఒకే లగనములో, ఒకే విశ్వాసములో మరియు ఏకరస అవస్థలో ఉండే పిల్లలు, సదా నిర్విఘ్నముగా ఉంటూ ఎక్కే కళను అనుభవం చేస్తారు. వారు కారణాన్ని పరివర్తన చేసి దానిని నివారణ రూపముగా చేస్తారు. వారు కారణాన్ని చూసి బలహీనముగా అవ్వరు, నివారణ స్వరూపులుగా అవుతారు.

స్లోగన్:-
ప్రశంస ఆధారముగా కలిగే ప్రసన్నత అల్పకాలికముగానే ఉంటుంది.

అవ్యక్త ప్రేరణలు - జ్వాలా స్వరూప స్థితిలో ఉంటూ శక్తిశాలి స్మృతిని అనుభవము చేయండి

జ్వాలా స్వరూపపు స్థితిని అనుభవం చేసేందుకు నిరంతర స్మృతి అనే జ్వాల ప్రజ్వలితమై ఉండాలి. దీనికి సహజమైన విధి ఏమిటంటే - సదా స్వయాన్ని ‘‘సారథి’’ గా మరియు ‘‘సాక్షీ’’ గా భావిస్తూ నడుచుకోండి. ఆత్మ ఈ రథానికి సారథి - ఈ స్మృతి స్వతహాగానే ఈ రథము (దేహము) నుండి మరియు ఏ విధమైన దేహ భానము నుండైనా అతీతముగా చేస్తుంది. స్వయాన్ని సారథిగా భావించటం ద్వారా అన్ని కర్మేంద్రియాలు మీ కంట్రోల్ లో ఉంటాయి. సూక్ష్మ శక్తులైన ‘‘మనసు-బుద్ధి-సంస్కారాలు’’ కూడా ఆర్డర్ అనుసారముగా ఉంటాయి.