27-06-2024 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - మీరు శరీరము నుండి వేరై తండ్రి వద్దకు
వెళ్ళాలి, మీరు శరీరాన్ని మీతోపాటు తీసుకువెళ్ళరు, అందుకే శరీరాన్ని మరచి ఆత్మనే
చూడండి’’
ప్రశ్న:-
పిల్లలైన మీరు మీ ఆయువును యోగబలముతో పెంచుకునే పురుషార్థాన్ని ఎందుకు చేస్తారు?
జవాబు:-
ఎందుకంటే, మేము
బాబా ద్వారా ఈ జన్మలో అన్నీ తెలుసుకోవాలి, బాబా ద్వారా అన్నీ వినాలి అని మీ మనసు
కోరుకుంటుంది, అందుకే మీరు యోగబలముతో మీ ఆయువును పెంచుకునే పురుషార్థము చేస్తారు.
ఇప్పుడే మీకు బాబా నుండి ప్రేమ లభిస్తుంది. ఇటువంటి ప్రేమ మళ్ళీ పూర్తి కల్పములో
ఇంకెప్పుడూ లభించదు. ఇకపోతే, ఎవరైతే శరీరాన్ని వదిలి వెళ్ళిపోయారో, వారి విషయములో
డ్రామా అనే అనడం జరుగుతుంది, వారికి అంతే పాత్ర ఉంది.
ఓంశాంతి
పిల్లలు జన్మ జన్మాంతరాలూ ఇతర సత్సంగాలలోకి వెళ్ళారు మరియు ఇక్కడకు కూడా వచ్చారు.
వాస్తవానికి దీనిని కూడా సత్సంగము అని అంటారు. సత్య సాంగత్యము తీరాన్ని చేరుస్తుంది.
మేము మొదట భక్తి మార్గపు సత్సంగాలలోకి వెళ్ళేవారము మరియు ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాము
అని పిల్లల మనస్సులో అనిపిస్తుంది. రాత్రికి, పగలుకు ఉన్నంత తేడా అనుభవమవుతుంది.
ఇక్కడ మొట్టమొదటైతే తండ్రి ప్రేమ లభిస్తుంది, మళ్ళీ తండ్రికి పిల్లల ప్రేమ
లభిస్తుంది. ఇప్పుడు ఈ జన్మలో మీ పరివర్తన జరుగుతోంది. మేము ఆత్మ, అంతేకానీ శరీరము
కాదు అని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. ఇది నా ఆత్మ అని శరీరము అనదు, ఇది నా
శరీరము అని ఆత్మ అనగలుగుతుంది. జన్మ జన్మాంతరాలైతే ఆ సాధువులు, సన్యాసులు, మహాత్ములు
మొదలైనవారి వద్దకు వెళ్తూ వచ్చామని ఇప్పుడు పిల్లలు అర్థం చేసుకున్నారు. ఈ
రోజుల్లోనైతే - సాయిబాబా, మెహర్ బాబా... అని ఫ్యాషన్ ఏర్పడింది. వారంతా కూడా
దైహికమైనవారే. దైహికమైన ప్రేమలో సుఖమనేది ఉండనే ఉండదు. ఇప్పుడు పిల్లలైన మీది
ఆత్మిక ప్రేమ. రాత్రికి, పగలుకు ఉన్నంత తేడా ఉంది. ఇక్కడ మీకు వివేకం లభిస్తుంది,
అక్కడైతే పూర్తిగా వివేకహీనులుగా ఉండేవారు. బాబా వచ్చి మనల్ని చదివిస్తున్నారని
ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. వారు అందరి తండ్రి. పురుషులు, స్త్రీలు అందరూ
స్వయాన్ని ఆత్మగా భావిస్తారు. ఓ పిల్లలూ, అని బాబా పిలుస్తారు కూడా. పిల్లలు కూడా
బదులు ఇస్తారు. ఇది తండ్రి మరియు పిల్లల మేళా. తండ్రి మరియు పిల్లల యొక్క, పరమాత్మ
మరియు ఆత్మల యొక్క ఈ మేళా (మిలనము) ఒకేసారి జరుగుతుందని పిల్లలకు తెలుసు. పిల్లలు
బాబా, బాబా అని అంటూ ఉంటారు. ‘బాబా’ అన్న పదము చాలా మధురమైనది. బాబా (తండ్రి) అని
అనడంతోనే వారసత్వము గుర్తుకొస్తుంది. మీరు చిన్నవారైతే కారు. తండ్రిని పిల్లలు
త్వరగా తెలుసుకుంటారు. బాబా నుండి ఏం వారసత్వం లభిస్తుంది అన్నది ఒక చిన్నపిల్లవాడు
అర్థం చేసుకోలేడు. మనం బాబా వద్దకు వచ్చామని ఇక్కడ మీకు తెలుసు. ఓ పిల్లలూ అని
తండ్రి అంటారు, అందులో పిల్లలందరూ వచ్చేస్తారు. ఆత్మలందరూ పాత్రను అభినయించడానికి
ఇంటి నుండి ఇక్కడకు వస్తారు. ఎవరు ఎప్పుడు పాత్రను అభినయించడానికి వస్తారు అనేది
కూడా బుద్ధిలో ఉంది. అందరి సెక్షన్లు వేర్వేరుగా ఉంటాయి, అక్కడి నుండి వస్తారు.
మళ్ళీ చివరిలో అందరూ తమ-తమ సెక్షన్లలోకి వెళ్ళిపోతారు. ఇదంతా డ్రామాలో రచింపబడి ఉంది.
తండ్రి ఎవ్వరినీ పంపించరు. ఆటోమేటిక్ గా ఈ డ్రామా అంతా తయారై ఉంది. ప్రతి ఒక్కరూ
తమ-తమ ధర్మాలలోకి వస్తూ ఉంటారు. బుద్ధుని ధర్మము స్థాపించబడనంతవరకు ఆ ధర్మమువారు
ఎవ్వరూ రారు. మొట్టమొదట సూర్యవంశీయులు, చంద్రవంశీయులే వస్తారు. ఎవరైతే తండ్రి ద్వారా
బాగా చదువుకుంటారో, వారే నంబరువారుగా సూర్యవంశములో, చంద్రవంశములో శరీరము తీసుకుంటారు.
అక్కడ వికారాల విషయమే ఉండదు. యోగబలము ద్వారా ఆత్మ వచ్చి గర్భములోకి ప్రవేశిస్తుంది,
తద్వారా నా ఆత్మ ఈ శరీరములోకి వెళ్ళి ప్రవేశిస్తుంది అని అర్థం చేసుకుంటారు. నా
ఆత్మ వెళ్ళి యోగబలము ద్వారా ఈ శరీరాన్ని తీసుకుంటుంది, నా ఆత్మ ఇప్పుడు పునర్జన్మను
తీసుకుంటుంది అని వృద్ధులు భావిస్తారు. నా వద్దకు కొడుకు వచ్చాడు అని ఆ బిడ్డ యొక్క
తండ్రి కూడా భావిస్తారు. కొడుకు ఆత్మ వస్తోంది అని సాక్షాత్కారమవుతుంది. అలాగే నేను
వెళ్ళి ఇంకొక శరీరములోకి ప్రవేశిస్తాను అని ఆ ఆత్మ కూడా అర్థం చేసుకుంటుంది. ఈ
ఆలోచనలు కూడా ఉత్పన్నమవుతాయి కదా. తప్పకుండా అక్కడి నియమము ఉంటుంది. కొడుకు ఏ వయసులో
పుడతాడు అన్నది కూడా అంతా రెగ్యులర్ గా నడుస్తుంది కదా. అది మున్ముందు అనుభవమవుతుంది,
అంతా తెలుస్తుంది. అక్కడేమీ ఇక్కడిలా 15-20 సంవత్సరాల వయసులో పిల్లలు పుట్టరు. అలా
జరగదు. అక్కడ ఆయువు 150 సంవత్సరాలు ఉంటుంది. ఎప్పుడైతే సగం కన్నా కొద్దిగా తక్కువ
ఆయువు ఉంటుందో అప్పుడు ఆ సమయంలో కొడుకు పుడతాడు ఎందుకంటే అక్కడ ఆయువు ఎక్కువగా
ఉంటుంది. ఒకే కొడుకు పుట్టడం జరుగుతుంది, ఆ తర్వాత కూతురు కూడా పుడుతుంది,
నియమానుసారంగా జరుగుతుంది. మొదట కొడుకు ఆత్మ, ఆ తర్వాత కూతురు ఆత్మ వస్తుంది. మొదట
కొడుకే పుట్టాలి అని వివేకం చెప్తుంది. మొదట పురుషుడు, ఆ తర్వాత స్త్రీ, 8-10
సంవత్సరాల తేడాతో పుడతారు. మున్ముందు పిల్లలైన మీకు అన్నీ సాక్షాత్కారమవ్వనున్నాయి.
అక్కడి ఆచార-వ్యవహారాలు ఎలా ఉంటాయి అని చెప్తూ ఆ కొత్త ప్రపంచ విషయాలన్నింటినీ
తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. తండ్రే కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తారు.
ఆచార-వ్యవహారాలను కూడా తప్పకుండా వినిపిస్తూ ఉంటారు. మున్ముందు ఎన్నో వినిపిస్తారు,
అప్పుడు సాక్షాత్కారాలవుతూ ఉంటాయి. పిల్లలు ఎలా జన్మిస్తారు అన్నది కొత్త విషయమేమీ
కాదు.
ఎక్కడికైతే కల్ప-కల్పమూ తప్పకుండా వెళ్ళవలసే ఉంటుందో, అటువంటి స్థానానికి మీరు
వెళ్తారు. వైకుంఠమైతే ఇప్పుడు సమీపముగా వచ్చేసింది. ఇప్పుడైతే పూర్తిగా సమీపముగా
వచ్చి చేరుకుంది. ఎంతెంతగా మీరు జ్ఞాన-యోగాలలో దృఢముగా అవుతూ ఉంటారో, అంతగా ప్రతి
విషయమూ మీకు దగ్గరగా కనిపిస్తుంది. అనేక సార్లు మీరు పాత్రను అభినయించారు. ఇప్పుడు
మీకు వివేకం లభిస్తుంది, దీనినే మీరు మీతో పాటు తీసుకువెళ్తారు. అక్కడి ఆచార
వ్యవహారాలు ఏమి ఉంటాయో, అవన్నీ తెలుసుకుంటారు. ప్రారంభములో మీకు అన్ని
సాక్షాత్కారాలు జరిగాయి. ఆ సమయములో మీరు కేవలం అల్ఫ్ (అల్లా) మరియు బే (రాజ్యాధికారము)
గురించి చదువుకునేవారు, మళ్ళీ చివరిలో కూడా తప్పకుండా మీకు సాక్షాత్కారాలు జరగాలి.
వాటి గురించి తండ్రి కూర్చొని వినిపిస్తారు. వాటన్నింటినీ చూసే కోరిక మీకు ఇక్కడే
కలుగుతుంది. శరీరము వదలకూడదు, అన్నింటినీ చూసి వెళ్ళాలి అని భావిస్తారు. ఇందులో
ఆయువును పెంచుకునేందుకు కావాల్సింది యోగబలము. ఆయువు ఉంటే బాబా నుండి అంతా
వినగలుగుతారు, అంతా చూడగలుగుతారు. ఎవరైతే ముందే వెళ్ళిపోయారో, వారి గురించి చింతన
చేయకూడదు. అది డ్రామా పాత్ర. తండ్రి నుండి ఎక్కువ ప్రేమను తీసుకోవడమనేది వారి
భాగ్యములో లేదు, ఎందుకంటే ఎంతెంతగా మీరు సేవాధారులుగా అవుతారో, అంతంతగా తండ్రికి
చాలా, చాలా ప్రియంగా అనిపిస్తారు. ఎంతగా సేవ చేస్తారో, ఎంతగా తండ్రిని స్మృతి
చేస్తారో, అంతగా ఆ స్మృతి స్థిరమవుతూ ఉంటుంది, మీకు ఎంతో ఆనందం కలుగుతుంది. ఇప్పుడు
మీరు ఈశ్వరీయ సంతానముగా అవుతారు. తండ్రి అంటారు, ఆత్మలైన మీరు నా వద్ద ఉండేవారు కదా.
భక్తి మార్గములో ముక్తి కొరకు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు, జీవన్ముక్తి గురించైతే
తెలియనే తెలియదు. ఇది చాలా ప్రియమైన జ్ఞానము. ఇందులో ఎంతో ప్రేమ ఉంటుంది. తండ్రి,
తండ్రి కూడా, టీచర్ కూడా, సద్గురువు కూడా. వారు సత్యాతి-సత్యమైన ఉన్నతోన్నతుడైన
తండ్రి, వారు మనల్ని 21 జన్మల కోసం సుఖధామములోకి తీసుకువెళ్తారు. ఆత్మయే
దుఃఖితమవుతుంది. సుఖ-దుఃఖాలను ఆత్మయే అనుభవం చేస్తుంది. పుణ్యాత్మ, పాపాత్మ అని కూడా
అంటూ ఉంటారు. ఇప్పుడు మనల్ని అన్ని దుఃఖాల నుండి విడిపించేందుకు తండ్రి వచ్చారు.
ఇప్పుడు పిల్లలైన మీరు అనంతములోకి వెళ్ళాలి. అందరూ సుఖవంతులుగా అవుతారు. మొత్తం
ప్రపంచమంతా సుఖవంతముగా అయిపోతుంది. డ్రామాలో ఆ పాత్ర ఉంది, దానిని కూడా మీరు అర్థం
చేసుకున్నారు. మీరు ఎంత సంతోషములో ఉంటారు. బాబా మనల్ని స్వర్గములోకి
తీసుకువెళ్ళేందుకు వచ్చారు. వారు ఆత్మలైన మనందరినీ స్వర్గములోకి తీసుకువెళ్తారు.
తండ్రి ఓదార్పునిస్తున్నారు - మధురాతి మధురమైన పిల్లలూ, నేను మిమ్మల్ని అన్ని
దుఃఖాల నుండి దూరం చేయడానికి వచ్చాను. మరి ఇటువంటి తండ్రి పట్ల ఎంతటి ప్రేమ ఉండాలి.
అన్ని సంబంధాలూ మీకు దుఃఖాన్ని ఇచ్చాయి. ఇక్కడున్నదే దుఃఖాన్ని ఇచ్చే సంతానము. మీరు
దుఃఖితులుగా అవుతూ, దుఃఖపు విషయాలనే వింటూ వచ్చారు. ఇప్పుడు తండ్రి అన్ని విషయాలనూ
అర్థం చేయిస్తున్నారు. అనేక సార్లు అర్థం చేయించారు మరియు చక్రవర్తీ రాజులుగా
తయారుచేసారు. కావున ఏ తండ్రి అయితే మనల్ని ఈ విధంగా స్వర్గాధిపతులుగా తయారుచేస్తారో,
వారిపై ఎంతటి ప్రేమ ఉండాలి, ఒక్క తండ్రినే మీరు స్మృతి చేస్తారు. ఒక్క తండ్రితో
తప్ప ఇంకెవ్వరితోనూ సంబంధం లేదు. ఆత్మకే అర్థం చేయించడం జరుగుతుంది. మనం
ఉన్నతోన్నతుడైన తండ్రి యొక్క పిల్లలము. ఏ విధంగా ఇప్పుడు మనకు దారి లభించిందో, అలానే
ఇతరులకు కూడా సుఖము యొక్క దారిని తెలియజేయాలి. మీకు కేవలం అర్ధకల్పం కొరకే కాదు,
ముప్పావు కల్పం కొరకు సుఖము లభిస్తుంది. మీపైన కూడా ఎంతోమంది బలిహారమవుతారు ఎందుకంటే
మీరు బాబా సందేశాన్ని తెలియజేసి అన్ని దుఃఖాలనూ దూరం చేస్తారు.
వీరికి (బ్రహ్మాకు) కూడా ఈ జ్ఞానము ఉన్నతోన్నతుడైన తండ్రి నుండే లభిస్తుందని మీరు
అర్థం చేసుకున్నారు. వీరు మళ్ళీ మనకు సందేశాన్ని ఇస్తారు. మనం మళ్ళీ ఇతరులకు ఇస్తాము.
తండ్రి పరిచయాన్నిస్తూ పిల్లలందరినీ అజ్ఞాన నిద్ర నుండి మేల్కొలుపుతూ ఉంటారు.
భక్తిని అజ్ఞానం అని అంటారు. జ్ఞానం మరియు భక్తి వేర్వేరు. జ్ఞానసాగరుడైన తండ్రి
ఇప్పుడు పిల్లలైన మీకు జ్ఞానాన్ని నేర్పిస్తున్నారు. బాబా ప్రతి 5000 సంవత్సరాల
తర్వాత వచ్చి మనల్ని మేల్కొలుపుతారని మీ మనస్సులోకి వస్తుంది. మన జ్యోతి ఏదైతే ఉందో,
అందులో ఇంకా కొద్ది నూనె మాత్రమే మిగిలి ఉంది, కావున ఇప్పుడు మళ్ళీ జ్ఞానమనే నూనెను
వేసి దీపాన్ని వెలిగిస్తారు. ఎప్పుడైతే తండ్రిని స్మృతి చేస్తారో, అప్పుడు ఆత్మ రూపీ
దీపము ప్రజ్వలితమవుతుంది. ఆత్మలో ఏ తుప్పు అయితే పట్టి ఉందో, అది తండ్రి స్మృతి
ద్వారానే తొలగుతుంది, ఇందులోనే మాయ యుద్ధం జరుగుతూంటుంది. మాయ ఘడియ-ఘడియ
మరిపింపజేస్తుంది మరియు తుప్పు తొలగిపోయేందుకు బదులుగా ఇంకా పెరుగుతూ ఉంటుంది.
ఎంతైతే తగ్గిందో, అంతకన్నా ఎక్కువ పెరిగిపోతుంది. తండ్రి అంటారు - పిల్లలూ, నన్ను
స్మృతి చేసినట్లయితే తుప్పు తొలగిపోతుంది. ఇందులో శ్రమ ఉంది. శరీరాల పట్ల ఆకర్షణ
ఉండకూడదు. దేహీ-అభిమానులుగా అవ్వండి. మనం ఒక ఆత్మ, బాబా వద్దకు శరీర సహితముగానైతే
వెళ్ళలేరు, శరీరము నుండి వేరుగా అయ్యే వెళ్ళాలి. ఆత్మను చూడడం ద్వారా తుప్పు
తొలగుతుంది, శరీరాన్ని చూడడం ద్వారా తుప్పు పెరుగుతుంది. ఒక్కోసారి పెరుగుతుంది,
ఒక్కోసారి తగ్గుతుంది, ఇది ఇలా కొనసాగుతూ ఉంటుంది. ఒక్కోసారి పైకి, ఒక్కోసారి కిందకు,
ఇది చాలా నాజూకైన మార్గము. ఇలా జరుగుతూ, జరుగుతూ చివరిలో కర్మాతీత అవస్థను పొందుతారు.
ముఖ్యంగా ప్రతి విషయములోనూ కళ్ళే మోసగిస్తాయి, అందుకే శరీరాన్ని చూడకండి. మన బుద్ధి
శాంతిధామానికి, సుఖధామానికి వ్రేలాడుతూ ఉంది, అంతేకాక దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి.
భోజనము కూడా శుద్ధమైనదే తినాలి. దేవతలది పవిత్రమైన భోజనము. వైష్ణవులు అన్న పదము
విష్ణువు నుండి వెలువడింది. దేవతలు ఎప్పుడూ అశుద్ధమైన వస్తువులను తినరు. విష్ణువు
మందిరము ఉంది, వారిని నర-నారాయణుడు అని కూడా అంటారు. వాస్తవానికి
లక్ష్మీ-నారాయణులైతే సాకారులే. వారికి నాలుగు భుజాలు ఉండకూడదు. కానీ భక్తి మార్గములో
వారికి కూడా నాలుగు భుజాలను చూపించారు. దీనిని అనంతమైన అజ్ఞానము అని అంటారు. నాలుగు
భుజాలు కల మనుష్యులెవ్వరూ ఉండలేరు అని అర్థం చేసుకోరు. సత్యయుగములో రెండు భుజాలు
కలవారు ఉంటారు. బ్రహ్మాకు కూడా రెండు భుజాలే ఉన్నాయి. బ్రహ్మా కూతురు సరస్వతి,
వారివి కూడా కలిపి నాలుగు భుజాలను చూపించారు. సరస్వతి ఏమీ బ్రహ్మాకు పత్ని కాదు, ఆమె
ప్రజాపిత బ్రహ్మాకు పుత్రిక. ఎంతమంది పిల్లలు దత్తత అవుతూ ఉంటారో, అంతగా వారి భుజాలు
పెరుగుతూ ఉంటాయి. బ్రహ్మాకే 108 భుజాలు ఉన్నాయి అని అంటారు. విష్ణువుకు లేక
శంకరునికి అలా అనరు. బ్రహ్మాకు భుజాలు ఎన్నో ఉన్నాయి. భక్తి మార్గములోనైతే ఏమీ
వివేకము లేదు. తండ్రి వచ్చి పిల్లలకు అర్థం చేయిస్తారు. బాబా వచ్చి మమ్మల్ని
వివేకవంతులుగా తయారుచేసారని మీరు అంటారు. మేము శివుని భక్తులము అని మనుష్యులు అంటారు.
అచ్ఛా, మీరు శివుడిని ఏమని భావిస్తున్నారు? శివబాబా ఆత్మలందరికీ తండ్రి అని, అందుకే
వారిని పూజిస్తున్నారని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ముఖ్యమైన విషయమేమిటంటే -
నన్నొక్కరినే స్మృతి చేయండి అని తండ్రి అంటారు. ఓ పతిత-పావనా రండి, వచ్చి మమ్మల్ని
పావనంగా తయారుచేయండి అని మీరు పిలిచారు కూడా. పతిత-పావన సీతారాం, అని అందరూ
పిలుస్తూనే ఉంటారు. ఇతను కూడా అలా పాడుతూ ఉండేవారు. స్వయంగా తండ్రే వచ్చి నాలోకి
ప్రవేశిస్తారు అని బాబాకు ఇంతకుముందు తెలియదు. ఇది ఎంత అద్భుతము, ఎప్పుడూ సంకల్పములో
కూడా లేదు. మొదటిలో ఇదేమి జరుగుతోంది అని ఆశ్చర్యపోయేవారు. నేను ఎవరినైనా
చూసినప్పుడు, అలా కూర్చుని ఉండగానే వారికి ఆకర్షణ కలిగేది. ఏం జరిగేది? శివబాబా
ఆకర్షించేవారు. ఎవరైనా ఎదురుగా కూర్చుంటే వెంటనే ధ్యానములోకి వెళ్ళిపోయేవారు.
ఏమిటిది అని ఆశ్చర్యపోయేవారు! ఈ విషయాలను అర్థం చేసుకునేందుకు ఏకాంతము కావాలి.
అప్పుడిక, ఎక్కడికి వెళ్ళాలి అని వైరాగ్యం కలిగింది. అచ్ఛా, బనారస్ కు వెళ్తాను అని
అనుకున్నారు. ఇది శివబాబా ఆకర్షణ. వీరికి కూడా ఆకర్షణను కలిగించేవారు. ఇంతటి పెద్ద
వ్యాపారమంతటినీ వదిలి వెళ్ళిపోయారు. బెనారస్ కు ఎందుకు వెళ్తున్నారు? అన్నది పాపం
వారికేమి తెలుసు! అక్కడకు వెళ్ళి తోటలో కూర్చున్నారు. అక్కడ చేతిలోకి పెన్సిల్
తీసుకొని గోడలపై చక్రాలు గీసేవాడిని. బాబా ఏం చేయించేవారో ఏమీ తెలిసేది కాదు.
రాత్రివేళ నిద్ర వచ్చేది, నేను ఎక్కడికో ఎగిరిపోయాను అని భావించేవాడిని, మళ్ళీ
కిందకు వచ్చేసేవాడిని. ఏం జరుగుతుందో ఏమీ తెలిసేది కాదు. ప్రారంభంలో ఎన్ని
సాక్షాత్కారాలు జరిగేవి. కుమార్తెలు కూర్చుంటూ, కూర్చుంటూ ధ్యానములోకి
వెళ్ళిపోయేవారు. మీరు ఎంతో చూసారు. మేము ఏదైతే చూసామో దానిని మీరు చూడలేదు అని మీరు
అంటారు. మళ్ళీ చివరిలో కూడా బాబా ఎన్నో సాక్షాత్కారాలను చేయిస్తారు, ఎందుకంటే
సమీపముగా వస్తూ ఉంటారు. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. బాబా సందేశాన్ని వినిపించి అందరి దుఃఖాన్ని దూరం చేయాలి. అందరికీ సుఖము యొక్క
దారిని తెలియజేయాలి. హద్దుల నుండి బయటకు వచ్చి అనంతములోకి వెళ్ళాలి.
2. అంతిమములో అన్ని సాక్షాత్కారాలను పొందేందుకు మరియు బాబా ప్రేమ పాలనను
తీసుకునేందుకు జ్ఞాన-యోగాలలో దృఢముగా అవ్వాలి. ఇతరుల గురించి చింతన చేయకుండా
యోగబలముతో మీ ఆయువును పెంచుకోవాలి.
వరదానము:-
నిర్లక్ష్యము మరియు అటెన్షన్ యొక్క అభిమానమును వదిలి
తండ్రి సహాయానికి పాత్రులుగా అయ్యే సహజ పురుషార్థీ భవ
చాలామంది పిల్లలు ధైర్యము పెట్టేందుకు బదులుగా
నిర్లక్ష్యము కారణంగా అభిమానములోకి వచ్చేస్తారు, అది ఎలా అంటే - మేమైతే సదా
పాత్రులమే, తండ్రి మాకు సహాయము చెయ్యకపోతే ఇంకెవరికి చేస్తారు అన్న అభిమానములోకి
వచ్చేస్తారు. ఈ అభిమానము కారణంగా ధైర్యము అనే విధిని మర్చిపోతారు. మరికొంతమందిలో
స్వయానికి అటెన్షన్ ఇచ్చుకునే అభిమానము కూడా ఉంటుంది, ఈ అభిమానము సహాయము నుండి
వంచితము చేసేస్తుంది. మేమైతే చాలా యోగము చేసేసాము, జ్ఞానీ-యోగీ ఆత్మలుగా అయిపోయాము,
సేవా రాజధాని తయారైపోయింది... అని భావిస్తుంటారు. ఈ విధమైన అభిమానాన్ని వదిలి
ధైర్యము ఆధారముగా సహాయానికి పాత్రులుగా అయినట్లయితే సహజ పురుషార్థులుగా అయిపోతారు.
స్లోగన్:-
వ్యర్థము మరియు నెగెటివ్
సంకల్పాలేవైతే నడుస్తాయో, వాటిని పరివర్తన చేసి విశ్వ కళ్యాణ కార్యములో పెట్టండి.
| | |