30-09-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - తండ్రి అందరి దుఃఖాలను హరించి సుఖాన్ని ఇవ్వడానికి వచ్చారు, కావున దుఃఖహర్త పిల్లలైన మీరు ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వకండి’’

ప్రశ్న:-
ఉన్నత పదవిని పొందే పిల్లల యొక్క ముఖ్యమైన గుర్తులేమిటి?

జవాబు:-
1. వారు సదా శ్రీమతముపై నడుస్తూ ఉంటారు. 2. ఎప్పుడూ మొండితనముతో ఉండరు. 3. స్వయానికి స్వయమే రాజ్యతిలకాన్ని దిద్దుకునేందుకు చదువు చదువుకుని గ్యాలప్ చేస్తారు (వేగముగా ముందుకు వెళ్తారు). 4. స్వయాన్ని ఎప్పుడూ నష్టపరచుకోరు. 5. సర్వుల పట్ల దయార్ద్ర హృదయులుగా మరియు కళ్యాణకారులుగా ఉంటారు. వారికి సేవ పట్ల చాలా అభిరుచి ఉంటుంది. 6. ఎటువంటి తుచ్ఛమైన పనులు చేయరు. కొట్లాడటము-గొడవపడటము చేయరు.

పాట:-
నీవు నిదురించి రాత్రిని పోగొట్టుకున్నావు...

ఓంశాంతి
ఆత్మిక పిల్లలు ఆత్మిక తండ్రి ఎదురుగా కూర్చున్నారు. ఇప్పుడు ఈ భాషనైతే పిల్లలైన మీరు మాత్రమే అర్థం చేసుకుంటారు, కొత్తవారు ఎవరూ అర్థం చేసుకోలేరు. ‘‘ఓ ఆత్మిక పిల్లలూ’’ అని ఇలా ఎప్పుడూ ఎవ్వరూ పిలవలేరు. ఇలా పిలవడం అసలు ఎవరికీ రాదు. మనము ఆత్మిక తండ్రి ఎదురుగా కూర్చున్నామని మీకు తెలుసు. ఆ తండ్రి గురించి యథార్థ రీతిలో ఎవరికీ తెలియదు. పరస్పరము భాయి-భాయిగా (సోదరులుగా) కూడా భావిస్తారు. మనమందరమూ ఆత్మలము, తండ్రి ఒక్కరే అని కూడా భావిస్తారు కానీ వారి గురించి యథార్థ రీతిలో తెలియదు. ఎప్పటివరకైతే సమ్ముఖములోకి వచ్చి అర్థం చేసుకోరో, అప్పటివరకు ఎలా అర్థం చేసుకోగలరు? మీరు కూడా సమ్ముఖములోకి వచ్చినప్పుడే అర్థం చేసుకుంటారు. మీరు బ్రాహ్మణ-బ్రాహ్మణీలు. మీ ఇంటిపేరు - బ్రహ్మావంశీ బ్రహ్మాకుమార్, బ్రహ్మాకుమారీ. శివుని సంతానమైతే అంతా ఆత్మలు. మిమ్మల్ని శివకుమార్ లేదా శివకుమారీ అని అనరు. ఈ పేరు తప్పు అవుతుంది. కుమారులూ ఉన్నారు, కుమారీలు కూడా ఉన్నారు. శివుని సంతానము ఆత్మలందరూ. మనుష్యులకు సంతానముగా అయినప్పుడు కుమారులు-కుమారీలు అని అంటారు. శివుని సంతానమైతే నిరాకారీ ఆత్మలే. మూలవతనములో అంతా ఆత్మలే నివసిస్తారు, వాటిని సాలిగ్రామాలు అని అంటారు. ఇక్కడకు వచ్చిన తర్వాత దేహము పరంగా కుమారులు మరియు కుమారీలుగా అవుతారు. వాస్తవానికి మీరు కుమారులు, శివబాబాకు సంతానము. ఎప్పుడైతే శరీరములోకి వస్తారో, అప్పుడు కుమారులుగా మరియు కుమారీలుగా అవుతారు. మీరు బి.కె.లు, అందుకే సోదరీ-సోదరులుగా పిలువబడతారు. ఇప్పుడు ఈ సమయములో మీకు జ్ఞానము లభించింది. బాబా మనల్ని పావనముగా తయారుచేసి తీసుకువెళ్తారని మీకు తెలుసు. ఆత్మ ఎంతగా తండ్రిని స్మృతి చేస్తుందో, అంతగా పవిత్రముగా అవుతుంది. ఆత్మలు బ్రహ్మాముఖము ద్వారా ఈ జ్ఞానాన్ని చదువుకుంటున్నారు. చిత్రాలలో కూడా తండ్రి యొక్క జ్ఞానము స్పష్టముగా ఉంది. శివబాబాయే మనల్ని చదివిస్తారు. మనల్ని శ్రీకృష్ణుడూ చదివించలేరు, అలాగే శ్రీకృష్ణుని ద్వారా తండ్రి చదివించలేరు. శ్రీకృష్ణుడైతే వైకుంఠానికి రాకుమారుడు, ఇది కూడా పిల్లలైన మీరు అర్థం చేయించాలి. శ్రీకృష్ణుడైతే స్వర్గములో తన తల్లిదండ్రులకు సంతానముగా ఉంటారు. స్వర్గవాసిగా ఉన్న తండ్రికి సంతానముగా ఉంటారు, శ్రీకృష్ణుడు వైకుంఠానికి రాకుమారుడు. వారి గురించి కూడా ఎవరికీ తెలియదు. శ్రీకృష్ణ జయంతి నాడు శ్రీకృష్ణుని కోసం తమ-తమ ఇళ్ళల్లో ఊయలలు తయారుచేస్తారు లేక మందిరాలలో ఊయలలు తయారుచేస్తారు. మాతలు వెళ్ళి హుండీలో డబ్బులు వేస్తారు, పూజలు చేస్తారు. ఈ రోజుల్లో క్రైస్టును కూడా శ్రీకృష్ణుని వలె తయారుచేస్తున్నారు. కిరీటము మొదలైనవి పెట్టి తల్లి ఒడిలో చూపిస్తున్నారు. శ్రీకృష్ణుడిని చూపించినట్లుగా చూపిస్తున్నారు. ఇప్పుడు శ్రీకృష్ణుడు మరియు క్రైస్టు, ఈ పేర్లు అయితే కలుస్తున్నాయి. వారు కాపీ చేస్తారు. వాస్తవానికి శ్రీకృష్ణుని జన్మకు మరియు క్రైస్టు జన్మకు చాలా వ్యత్యాసము ఉంది. క్రైస్టు జన్మ చిన్న బిడ్డ జన్మించినట్లుగా జరుగదు. క్రైస్టు ఆత్మ వెళ్ళి ఒకరిలోకి ప్రవేశించింది. క్రైస్టు విషము ద్వారా జన్మించరు. ఇంతకుముందు క్రైస్టును ఎప్పుడూ చిన్న బిడ్డగా చూపించేవారు కాదు. శిలువపైన చూపించేవారు. చిన్న బిడ్డలా ఈ మధ్యన చూపిస్తున్నారు. ధర్మ స్థాపకులను ఎవరూ ఆ విధంగా హతమార్చలేరని పిల్లలకు తెలుసు, మరి అక్కడ ఎవరిని హతమార్చినట్లు? ఎవరిలోనైతే ప్రవేశించారో, వారికి దుఃఖము కలిగింది. సతోప్రధాన ఆత్మకు దుఃఖము ఎలా కలుగుతుంది? అంతటి దుఃఖాన్ని అనుభవించేందుకు వారు ఏ కర్మను చేసారు. ఆత్మ సతోప్రధాన అవస్థలో ఉన్నప్పుడు వస్తుంది. అందరి లెక్కాచారాలు సమాప్తమవుతాయి. ఈ సమయములో తండ్రి అందరినీ పావనముగా తయారుచేస్తారు. అక్కడ నుండి సతోప్రధాన ఆత్మ వచ్చి దుఃఖాన్ని అనుభవించదు. అనుభవించేది ఆత్మయే కదా. ఆత్మ శరీరములో ఉన్నప్పుడు దుఃఖము కలుగుతుంది. నాకు నొప్పిగా ఉంది అని ఎవరు అంటారు? ఈ శరీరములో ఉండేవారు ఎవరో ఉన్నారు. వారు - పరమాత్మ లోపల ఉన్నారు అని అంటారు, మరి అటువంటప్పుడు నాకు దుఃఖము కలుగుతుంది అని పరమాత్మ అయితే అనరు కదా. అందరిలోనూ పరమాత్మ విరాజమానమై ఉంటే మరి పరమాత్మ దుఃఖాన్ని ఎలా అనుభవిస్తారు. వాస్తవానికి ఓ పరమపిత పరమాత్మా, మా దుఃఖాలను హరించండి అని పిలుస్తుంది ఆత్మ, పారలౌకిక తండ్రినే ఆత్మ పిలుస్తుంది.

ఇప్పుడు మీకు తెలుసు - తండ్రి వచ్చి ఉన్నారు, వారు దుఃఖాన్ని హరించే యుక్తిని తెలియజేస్తున్నారు. ఆత్మ శరీరముతోనే ఎవర్ హెల్దీగా, వెల్దీగా అవుతుంది. మూలవతనములోనైతే హెల్దీ-వెల్దీ అని అనరు. అక్కడ ఏమీ సృష్టి లేదు. అక్కడ ఉన్నది శాంతియే. శాంతి స్వధర్మములో స్థితులై ఉంటారు. ఇప్పుడు తండ్రి అందరి దుఃఖాలను హరించి సుఖాన్ని ఇవ్వడానికి వచ్చారు. కావున పిల్లలకు కూడా చెప్తున్నారు - మీరు నాకు చెందినవారిగా అయ్యారు, ఎవ్వరికీ దుఃఖమునివ్వకండి. ఇది యుద్ధ మైదానము, కానీ గుప్తముగా ఉంది. అది ప్రత్యక్షముగా ఉంది. యుద్ధ మైదానములో ఎవరైతే మరణిస్తారో వారు స్వర్గములోకి వెళ్తారు అని గాయనమేదైతే ఉందో, దాని అర్థాన్ని కూడా అర్థం చేయించవలసి ఉంటుంది. ఈ యుద్ధానికి కూడా ఎంత మహత్వముందో చూడండి. ఆ యుద్ధములో మరణించడముతో ఎవ్వరూ స్వర్గములోకి వెళ్ళలేరని పిల్లలకు తెలుసు. కానీ గీతలో ఈ విషయము భగవానువాచ అని ఉంది కావున అది నమ్ముతారు కదా. భగవంతుడు ఎవరికి చెప్పారు? ఆ యుద్ధము చేసేవారికి చెప్పారా లేక మీకు చెప్పారా? ఇద్దరికీ చెప్పారు. వారికి కూడా - స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి అని అర్థం చేయించడం జరుగుతుంది. ఈ సేవ కూడా చెయ్యాలి. ఇప్పుడు ఒకవేళ మీరు స్వర్గములోకి వెళ్ళాలనుకుంటే పురుషార్థము చేయండి. యుద్ధములోనైతే అన్ని ధర్మాల వారూ ఉంటారు, సిక్కులు కూడా ఉంటారు, మరి వారు సిక్కు ధర్మములోకే వెళ్తారు. ఎప్పుడైతే బ్రాహ్మణులైన మీ వద్దకు వచ్చి జ్ఞానము తీసుకుంటారో, అప్పుడే స్వర్గములోకి రాగలుగుతారు. సిక్కులు బాబా వద్దకు వచ్చినప్పుడు - మీరు యుద్ధము చేస్తూ శివబాబా స్మృతిలో ఉన్నట్లయితే స్వర్గములోకి రాగలరు అని బాబా వారికి అర్థం చేయించేవారు. కానీ స్వర్గములో రాజులుగా అవుతారని కాదు. అలా కాదు. వారికి కూడా ఎక్కువగా అర్థం చేయించలేము. వారికి జ్ఞానము కొద్దిగానే అర్థం చేయించడం జరుగుతుంది. యుద్ధములో తమ ఇష్ట దేవతలను తప్పకుండా గుర్తు చేసుకుంటారు. సిక్కులైతే - గురు గోవింద్ కు జై అని అంటారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ పరమాత్మను స్మృతి చేసేవారు ఎవ్వరూ లేరు. ఇకపోతే ఎవరైతే తండ్రి పరిచయము తీసుకుంటారో, వారు స్వర్గములోకి వస్తారు. అందరి తండ్రి ఒక్కరే - పతిత-పావనుడు. వారు పతితులకు చెప్తున్నారు - నన్ను స్మృతి చేసినట్లయితే మీ పాపాలు తొలగిపోతాయి మరియు నేను ఏదైతే సుఖధామాన్ని స్థాపిస్తున్నానో, అందులోకి మీరు వచ్చేస్తారు. యుద్ధములో కూడా శివబాబాను స్మృతి చేసినట్లయితే స్వర్గములోకి వచ్చేస్తారు. ఆ యుద్ధ మైదానము విషయము వేరు, ఇక్కడి విషయము వేరు. తండ్రి అంటారు - జ్ఞానము యొక్క వినాశనము అవ్వదు. అందరూ శివబాబాకు పిల్లలే. ఇప్పుడు శివబాబా చెప్తున్నారు - నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీరు నా వద్దకు ముక్తిధామానికి వచ్చేస్తారు. మరియు మీకు ఏదైతే జ్ఞానము నేర్పించడం జరుగుతుందో, అది చదువుకున్నట్లయితే స్వర్గ రాజ్యాధికారము లభిస్తుంది. ఇది ఎంత సహజము. స్వర్గములోకి వెళ్ళే మార్గము సెకండులో లభిస్తుంది. ఆత్మలమైన మనము తండ్రిని స్మృతి చేస్తున్నాము. యుద్ధ మైదానములోకైతే సంతోషముగా వెళ్ళాలి. కర్మలైతే చేయవలసిందే. దేశ రక్షణ కోసం అన్నీ చేయవలసి ఉంటుంది. అక్కడ ఒకే ధర్మము ఉంటుంది. అభిప్రాయ భేదాల విషయమేమీ ఉండదు. ఇక్కడ ఎన్ని అభిప్రాయ భేదాలు ఉన్నాయి. నీటి కోసం, భూమి కోసం గొడవలు జరుగుతుంటాయి. నీటిని ఆపు చేస్తే, రాళ్ళతో కొట్టడం మొదలుపెడతారు. ఇతరులకు ధాన్యము ఇవ్వకపోతే గొడవ అయిపోతుంది.

మనము మన స్వరాజ్యాన్ని స్థాపన చేసుకుంటున్నామని పిల్లలైన మీకు తెలుసు. చదువు ద్వారా రాజ్యాన్ని పొందుతారు. కొత్త ప్రపంచము తప్పకుండా స్థాపన అవ్వనున్నది, ఇది నిశ్చితమై ఉంది, కావున ఎంత సంతోషముండాలి. దేని గురించైనా కొట్లాడటము-గొడవపడటము యొక్క విషయమేమీ లేదు. ఉండటము కూడా చాలా సాధారణముగా ఉండాలి. బాబా అర్థం చేయించారు - మీరు అత్తవారింటికి వెళ్ళబోతున్నారు కావున ఇప్పుడు వనవాహములో ఉన్నారు. ఆత్మలందరూ వెళ్తారు, శరీరాలు ఏమైనా వెళ్తాయా. శరీర అభిమానాన్ని కూడా వదిలేయాలి. నేను ఆత్మను, 84 జన్మలు ఇప్పుడు పూర్తయ్యాయి. భారతవాసులు ఎవరైతే ఉన్నారో, వారికి చెప్పండి - భారత్ స్వర్గముగా ఉండేది, ఇప్పుడు ఉన్నది కలియుగము. కలియుగములో అనేక ధర్మాలు ఉన్నాయి. సత్యయుగములో ఒకే ధర్మముండేది. భారత్ మళ్ళీ స్వర్గముగా అవ్వనున్నది. భగవంతుడు వచ్చారని అర్థం చేసుకుంటారు కూడా. మున్ముందు భవిష్యవాణి కూడా వినిపిస్తూ ఉంటారు. వాయుమండలాన్ని చూస్తారు కదా. కావున తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. తండ్రి అందరివారు కదా. అందరికీ హక్కు ఉంది. తండ్రి చెప్తున్నారు - నేను వచ్చాను మరియు అందరికీ చెప్తున్నాను - నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి. ఇప్పుడు మనుష్యులు ఏమని భావిస్తున్నారంటే - యుద్ధము ఎప్పుడైనా జరగవచ్చు, అది రేపు అయినా జరగవచ్చు. యుద్ధము వేగము అందుకోవడానికి ఆలస్యమేమీ అవ్వదు. కానీ, ఇప్పుడు ఇంకా మన రాజధాని స్థాపనవ్వలేదు కావున వినాశనము ఎలా జరగగలదు అని పిల్లలైన మీరు భావిస్తారు. ఇప్పుడు ఇంకా తండ్రి సందేశాన్ని నలువైపులా ఎక్కడ ఇచ్చారు. పతిత-పావనుడైన తండ్రి చెప్తున్నారు - నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి. ఈ సందేశము అందరి చెవులకు చేరాలి. యుద్ధము జరిగినా కానీ, బాంబులు వేసినా కానీ మీకు నిశ్చయముంది - మన రాజధాని తప్పకుండా స్థాపనవ్వనున్నది, అప్పటివరకు వినాశనము జరుగదు. విశ్వములో శాంతి అని అంటారు కదా. విశ్వములో దాడులు జరిగితే విశ్వాన్ని సమాప్తము చేసేస్తారు.

ఇది విశ్వవిద్యాలయము, మొత్తము విశ్వానికి మీరు జ్ఞానాన్నిస్తారు. ఒక్క తండ్రే వచ్చి మొత్తము విశ్వాన్ని పరివర్తన చేస్తారు. వారైతే కల్పము యొక్క ఆయుష్షు లక్షల సంవత్సరాలు అని అంటారు. దీని ఆయుష్షు పూర్తిగా 5 వేల సంవత్సరాలని మీకు తెలుసు. క్రైస్టుకు 3 వేల సంవత్సరాల క్రితము స్వర్గముండేదని అంటారు. ఇస్లామీయులు, బౌద్ధులు మొదలైనవారందరి లెక్కలను తీస్తారు. వారి కన్నా ముందు ఇంకెవ్వరి పేరు లేదు. మీరు తిథి తారీఖుల సహితముగా చెప్పగలరు. కావున మీకు ఎంత నషా ఉండాలి. గొడవలు మొదలైనవాటి విషయమే లేదు. ఎవరైతే అనాథలుగా ఉంటారో, వారే గొడవపడతారు. ఇప్పుడు మీరు ఏదైతే పురుషార్థము చేస్తారో, దానితో 21 జన్మల కోసం ప్రారబ్ధము తయారవుతుంది. కొట్లాడుకుంటూ-గొడవపడుతూ ఉంటే ఉన్నత పదవి లభించదు. శిక్షలు కూడా అనుభవించవలసి ఉంటుంది. ఏదైనా విషయముంటే, ఏదైనా కావాలంటే తండ్రి వద్దకు రండి. మీరు చట్టాన్ని మీ చేతిలోకి తీసుకోకండి అని గవర్నమెంట్ కూడా చెప్తుంది కదా. కొందరు, మాకు విదేశీ బూట్లు కావాలని అడుగుతారు. బాబా అంటారు - పిల్లలూ, ఇప్పుడు మీరు వనవాహములో ఉన్నారు. అక్కడ మీకు చాలా సంపద లభిస్తుంది. ఇలా అడగటము సరి కాదు అని బాబా రైట్ విషయాన్నే అర్థం చేయిస్తారు కదా. ఇక్కడ మీరు ఈ ఆశను ఎందుకు పెట్టుకుంటారు. ఇక్కడైతే చాలా సాధారణముగా ఉండాలి. లేకపోతే దేహాభిమానము వచ్చేస్తుంది, ఇక్కడ మీకు తోచింది చేయకూడదు, బాబా ఏది చెప్తే అది చెయ్యాలి. అనారోగ్యము వస్తే డాక్టర్ మొదలైనవారిని కూడా పిలుస్తారు, మందులు మొదలైనవాటితో అందరి సంభాళన జరుగుతుంది. అయినా ప్రతి విషయములోనూ తండ్రి కూర్చుని ఉన్నారు. శ్రీమతము శ్రీమతమే కదా. నిశ్చయములో విజయముంది. వారైతే అంతా అర్థం చేసుకుంటారు కదా. తండ్రి సలహాపై నడవడములోనే కళ్యాణముంది. స్వయం యొక్క కళ్యాణము కూడా చేసుకోవాలి. ఎవరినైనా విలువైనవారిగా తయారుచేయలేకపోతున్నారంటే, మరి స్వయం అంత విలువైనవారిగా లేరనే కదా. అటువంటివారు విలువైనవారిగా అయ్యేందుకు యోగ్యులుగా లేరు. ఇక్కడ విలువ లేకపోతే అక్కడ కూడా విలువ ఉండదు. సర్వీసబుల్ పిల్లలకు సేవ పట్ల ఎంత అభిరుచి ఉంటుంది. తిరుగుతూనే ఉంటారు. సేవ చేయకపోతే వారిని దయార్ద్ర హృదయులు అని, కళ్యాణకారులు అని అనరు. బాబాను స్మృతి చేయకపోతే తుచ్ఛమైన పనులు చేస్తూ ఉంటారు. పదవి కూడా తుచ్ఛమైనదే పొందుతారు. నాకైతే శివబాబాతో యోగముంది కదా అని అనుకోవడానికి లేదు. ఇక్కడ ఉన్నది బి.కె.లు. శివబాబా బ్రహ్మా ద్వారానే జ్ఞానాన్ని ఇవ్వగలరు. కేవలం శివబాబాను స్మృతి చేసినట్లయితే మురళి ఎలా వింటారు, ఇక దాని ప్రతిఫలము ఎలా ఉంటుంది? చదువుకోకపోతే ఏ పదవిని పొందుతారు. అందరి భాగ్యము ఉన్నతముగా అవ్వదు అని కూడా తెలుసు. అక్కడ కూడా నంబరువారు పదవులుంటాయి. పవిత్రముగానైతే అందరూ అవ్వవలసిందే. ఆత్మ పవిత్రముగా అవ్వకుండా శాంతిధామానికి వెళ్ళలేదు.

తండ్రి అర్థం చేయిస్తున్నారు - మీరు అందరికీ ఈ జ్ఞానాన్ని వినిపిస్తూ ఉండండి, ఒకవేళ ఎవరైనా ఇప్పుడు వినకపోయినా కానీ మున్ముందు తప్పకుండా వింటారు. ఇప్పుడు ఎన్ని విఘ్నాలు, తుఫానులు తీవ్రముగా వచ్చినా కానీ మీరు భయపడకూడదు, ఎందుకంటే కొత్త ధర్మము యొక్క స్థాపన జరుగుతుంది కదా. మీరు గుప్త రాజధానిని స్థాపన చేస్తున్నారు. బాబా సర్వీసబుల్ పిల్లలను చూసి సంతోషిస్తారు. మీకు మీరే రాజ్యతిలకాన్ని దిద్దుకోవాలి, శ్రీమతముపై నడవాలి. ఇందులో మీ మొండితనము నడవదు. అనవసరముగా స్వయాన్ని నష్టపరుచుకోకూడదు. తండ్రి అంటారు - పిల్లలూ, సర్వీసబుల్ గా మరియు కళ్యాణకారులుగా అవ్వండి. విద్యార్థికి టీచరు చెప్తారు కదా - చదువుకుని గ్యాలప్ చేయండి (వేగముగా ముందుకు వెళ్ళండి) అని. మీకు 21 జన్మల కోసం స్వర్గము యొక్క స్కాలర్షిప్ లభిస్తుంది. ఆ వంశములోకి వెళ్ళడమే పెద్ద స్కాలర్షిప్. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. సంగమయుగములో చాలా సింపుల్ గా, సాధారణముగా ఉండాలి ఎందుకంటే ఇది వనవాహములో ఉండే సమయము. ఇక్కడ ఎటువంటి ఆశ పెట్టుకోకూడదు. ఎప్పుడూ చట్టాన్ని మీ చేతిలోకి తీసుకోకూడదు. కొట్లాడటము-గొడవపడటము చేయకూడదు.

2. వినాశనము కన్నా ముందే కొత్త రాజధానిని స్థాపన చేసేందుకు అందరికీ తండ్రి సందేశాన్ని ఈ విధముగా ఇవ్వాలి - తండ్రి అంటారు, నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి మరియు మీరు పావనముగా అవుతారు అని.

వరదానము:-
సంతుష్టత యొక్క విశేషత ద్వారా సేవలలో సఫలతామూర్తులుగా అయ్యే సంతుష్టమణి భవ

సేవలో విశేష గుణము సంతుష్టత. పేరుకు సేవ కానీ స్వయమూ డిస్టర్బ్ అయ్యి ఇతరులను కూడా డిస్టర్బ్ చేస్తుంటే, అటువంటి సేవ చేయకపోవడం మంచిది. ఎక్కడైతే స్వయముతో సంతుష్టత మరియు సంపర్కమువారితో సంతుష్టత ఉండదో ఆ సేవ స్వయానికి ఫలము యొక్క ప్రాప్తిని కలిగించదు, అలాగే ఇతరులకు ఫలము యొక్క ప్రాప్తిని కలిగించదు. అందుకే మొదట ఏకాంతవాసులుగా అయ్యి స్వ పరివర్తన ద్వారా సంతుష్టమణి అన్న వరదానాన్ని ప్రాప్తి చేసుకుని, ఆ తర్వాత సేవలోకి రండి, అప్పుడు సఫలతామూర్తులుగా అవుతారు.

స్లోగన్:-
విఘ్నాల రూపీ రాళ్ళను పగలగొట్టడములో సమయాన్ని పోగొట్టుకోకుండా వాటిని హై జంప్ చేసి దాటి వేయండి.

అవ్యక్త ప్రేరణలు - ఇప్పుడు లగనము అనే అగ్నిని ప్రజ్వలితము చేసి యోగాన్ని జ్వాలా రూపముగా చేయండి

జ్వాలా స్వరూపపు స్మృతి కొరకు మనసు మరియు బుద్ధి, రెండింటికీ, ఒకటేమో శక్తిశాలి బ్రేక్కావాలి మరియు ఇంకొకటి మలుచుకునే శక్తి కూడా కావాలి. దీని ద్వారా బుద్ధి యొక్క శక్తి అయినా లేక ఇంకే శక్తి అయినా వ్యర్థమవ్వకుండా జమ అవుతూ ఉంటుంది. ఎంతగా జమ అవుతుందో, అంతగానే పరిశీలించే మరియు నిర్ణయము తీసుకునే శక్తి పెరుగుతుంది. దీని కొరకు ఇప్పుడు సంకల్పాల విస్తారాన్ని సమాప్తము చేస్తూ వెళ్ళండి అనగా సర్దుబాటు శక్తిని ధారణ చేయండి.