31-07-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - పిల్లలు పెద్దవారైతే నా సేవ చేస్తారు అనే ఆశ కూడా శివబాబాకు లేదు, వారెప్పుడూ వృద్ధునిగా అవ్వరు, తండ్రియే నిష్కామ సేవాధారి’’

ప్రశ్న:-
భోళానాథుడైన శివబాబా పిల్లలైన మనందరికీ చాలా పెద్ద కస్టమర్ - అది ఎలా?

జవాబు:-
బాబా అంటారు - నేను ఎంతటి అమాయకపు కస్టమర్ ను అంటే, మీ వద్ద ఉన్న పాత వస్తువులన్నింటినీ కొంటాను మరియు వాటికి రిటర్నులో అన్నీ కొత్త-కొత్త వస్తువులను ఇస్తాను. మీరంటారు - బాబా, ఈ తనువు, మనసు, ధనము అన్నీ మీవే. కావున వాటికి రిటర్నులో మీకు సుందరమైన తనువు లభిస్తుంది, అపారమైన ధనము లభిస్తుంది.

పాట:-
భోళానాథుని కన్నా అతీతమైనవారు...

ఓంశాంతి
భక్తి మార్గములో ఈ పాటను పాడుతారు. పాటలన్నీ భక్తి మార్గానికి సంబంధించినవి, వాటి అర్థాన్ని కూడా తండ్రి అర్థం చేయిస్తారు. భోళానాథుడని అని ఎవరిని అంటారు అనేది కూడా పిల్లలు అర్థం చేసుకుంటారు. దేవతలను భోళానాథ్ అని అనరు. సుదాముడు రెండు పిడికెళ్ళ అన్నాన్ని ఇస్తే మహళ్ళు లభించాయని అంటూ ఉంటారు. అది కూడా ఎంత కాలం కోసము? 21 జన్మల కోసము. తండ్రి వచ్చి భారతవాసులకు తప్పకుండా వజ్ర-వైఢూర్యాల మహళ్ళను ఇస్తారని ఇప్పుడు పిల్లలు అర్థం చేసుకున్నారు. దేనికి రిటర్నులో ఇస్తారు? బాబా, ఈ తనువు-మనసు-ధనము అన్నీ మీవే, ఇవన్నీ మీరిచ్చినవే అని పిల్లలంటారు. ఎవరికైనా కొడుకు పుడితే భగవంతుడు ఇచ్చారని అంటారు. ధనము గురించి కూడా భగవంతుడు ఇచ్చారని అంటారు. అలా అంటుంది ఎవరు? ఆత్మ. భగవంతుడు ఇచ్చారు అనగా తండ్రి ఇచ్చారు. తండ్రి అంటారు - ఇప్పుడు మీరు అంతా ఇవ్వాల్సి ఉంటుంది. దానికి రిటర్నులో నేను మీకు చాలా సుందరమైన తనువును ట్రాన్స్ఫర్ చేస్తాను, అపారమైన ధనాన్ని ఇస్తాను. కానీ ఎవరికి ఇస్తారు? తప్పకుండా పిల్లలకే ఇస్తారు. లౌకిక తండ్రి నుండి అల్పకాలము కొరకు ధనము లభించింది. అనంతమైన తండ్రి మనకు అనంతమైన వారసత్వాన్ని ఇస్తారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - జ్ఞానానికి మరియు భక్తికి, రాత్రికి పగలుకు ఉన్నంత వ్యత్యాసము ఉంది. భక్తిలో అల్పకాలము కొరకు లభిస్తుంది. ధనముంటే సుఖముంటుంది. ధనము లేకపోతే మనుష్యులు ఎంత దుఃఖితులవుతారు. బాబా మనకు అపారమైన ధనాన్ని ఇస్తున్నారని పిల్లలకు తెలుసు, అందుకే సంతోషము కలుగుతుంది. సుఖధామములోనైతే సుఖానికి ఎటువంటి లోటు ఉండదు. ప్రతి ఒక్కరికీ తమ-తమ రాజధాని ఉంటుంది. దానిని పవిత్ర గృహస్థాశ్రమమని అంటారు. బాబా ఎంతటి భోళా అయినవారు, వారు తీసుకునేది ఏమిటి మరియు ఇచ్చేది ఏమిటి! బాబా ఎంత మంచి కస్టమర్! మామూలుగా కూడా తండ్రి అనేవారు పిల్లలకు కస్టమర్ గా ఉంటారు. కొడుకు పుట్టగానే మొత్తం ఆస్తి అంతా ఇక అతనిదే. వారు హద్దు కస్టమర్లు, వీరు అనంతమైన భోళానాథుడు, అనంతమైన పిల్లలకు కస్టమర్. తండ్రి అంటారు - నేను పరంధామము నుండి వచ్చాను, మీ నుండి పాతదంతా తీసుకుని కొత్త ప్రపంచములో మీకు అన్నీ ఇస్తాను. అందుకే వారిని దాత అని అంటారు. వారి వంటి దాత ఇంకెవ్వరూ లేరు. వారు నిష్కామ సేవ చేస్తారు. తండ్రి అంటారు - నేను నిష్కాముడిని, నాకు ఎటువంటి ఆశ లేదు. వృద్ధుడైన తండ్రిని సంబాళించడము పిల్లలైన మీ పని ఎందుకంటే నేను మిమ్మల్ని సంభాళించాను కదా - అని నేను అనను, అలా అనను. తండ్రి వృద్ధుడైతే పిల్లలు అతడిని సంభాళించాలి - అనే నియమము ఉంటుంది. కానీ ఈ తండ్రి అయితే ఎప్పుడూ వృద్ధునిగా అవ్వరు, సదా యువకునిగానే ఉంటారు. ఆత్మ ఎప్పుడూ వృద్ధునిగా అవ్వదు. లౌకిక తండ్రి - నేను వృద్ధుడినైతే నా పిల్లలు నాకు సేవ చేస్తారు అని పిల్లల పట్ల ఆశ పెట్టుకుంటారని మీకు తెలుసు. పిల్లలకు అంతా ఇచ్చేసినా కూడా, తండ్రికి సేవ అయితే జరుగుతుంది. ఇక్కడ శివబాబా అంటారు - నేను ఉన్నదే అభోక్తను. నేను ఎప్పుడూ తిననే తినను. నేను కేవలం పిల్లలకు జ్ఞానాన్ని ఇవ్వడానికి వస్తాను. పరమాత్మ కూర్చుని ఆత్మలకు అర్థం చేయిస్తారు. ఆత్మయే వింటుంది, ప్రతీది ఆత్మయే చేస్తుంది. సంస్కారాలను కూడా ఆత్మయే తీసుకువెళ్తుంది, వాటి ఆధారముగానే శరీరము లభిస్తుంది. ఇక్కడ మనుష్యులకు అనేక మతాలు ఉన్నాయి. కొందరు ఆత్మయే పరమాత్మ అని అంటారు. ఆత్మకు ఏమీ అంటదని, ఆత్మ నిర్లేపి అని అంటారు. ఒకవేళ ఆత్మ నిర్లేపి అయితే పాపాత్మ, పుణ్యాత్మ అని ఎందుకంటారు. ఒకవేళ ఆత్మ నిర్లేపి అయితే పాప శరీరము, పుణ్య శరీరము అని అనాలి.

ఇప్పుడు మీకు తెలుసు - ఆత్మలందరి ఆత్మిక తండ్రి ఆత్మలైన మనల్ని ఈ శరీరము ద్వారా చదివిస్తున్నారు. ఆత్మను పిలుస్తారు కూడా కదా. మా తండ్రి ఆత్మ వచ్చింది, రుచి చూసింది అని అంటారు. ఆత్మయే రుచి చూస్తుంది. బాబా అయితే అలా అనరు, వారు అభోక్త. బ్రాహ్మణులకు తినిపిస్తారు, ఆత్మ వస్తుంది. ఆ ఆత్మ ఎక్కడో అయితే విరాజమానమై ఉంటుంది. బ్రాహ్మణులు మొదలైనవారికి తినిపించడము భారత్ లో కామన్ విషయము. ఆత్మను పిలుస్తారు, ఆ ఆత్మను అడుగుతారు, ఆ ఆత్మ చెప్పే చాలా విషయాలు నిజమవుతాయి కూడా. పితృలకు తినిపించే ఆచారము కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. ఇందులో ఏమీ ఆశ్చర్యపోకూడదు. తండ్రి సారములో డ్రామా రహస్యాలను తెలియజేస్తారు. డ్రామా గురించి అంత విస్తారముగా వివరించలేరు. ఒక్కొక్కరి గురించి వివరించడానికి ఎన్నో సంవత్సరాలు పడుతుంది. పిల్లలైన మీకు చాలా సహజమైన శిక్షణ లభిస్తుంది. ఓ పతిత-పావనా రండి, వచ్చి మమ్మల్ని పావనముగా చేయండి అని పాడుతారు కూడా. వారి పేరే పతిత-పావనుడు. బ్రహ్మా, విష్ణు, శంకరులను పతిత-పావనులని అనలేము. తండ్రినే పతిత-పావనుడు, ముక్తిదాత అని అంటారు. దుఃఖహర్త-సుఖకర్త అని కూడా వారినే అంటారు. వారు నిరాకారుడు. శివుని మందిరాలకు వెళ్ళి చూస్తే, అక్కడ శివ లింగాన్ని ఉంచుతారు. తప్పకుండా చైతన్యములో ఉండేవారు కావుననే పూజ చేస్తారు. ఈ దేవతలు కూడా ఎప్పుడో చైతన్యములో ఉండేవారు, కనుకనే వారికి మహిమ ఉంది. నెహ్రూ చైతన్యములో ఉండేవారు, అందుకే వారి ఫోటో పెట్టుకుని మహిమ చేస్తారు. ఎవరైనా మంచి పని చేసి వెళ్తే, వారి జడ చిత్రాలను తయారుచేసి మహిమ చేస్తారు. పవిత్రులను మాత్రమే పూజిస్తారు. మనుష్యులెవ్వరినీ పూజించలేము. వికారాల ద్వారా జన్మ తీసుకుంటారు కదా, అందుకే వారికి పూజ జరగదు. సదా పవిత్రముగా ఉండే దేవతలకే పూజ జరుగుతుంది. తండ్రి వచ్చేసారని మీకు తెలుసు, స్వర్గ స్థాపన చేయడానికి ఇప్పుడు మళ్ళీ సంగమములో వచ్చారు. తర్వాత ద్వాపరము నుండి రావణ రాజ్యము ప్రారంభమవుతుంది. రావణ రాజ్యము ప్రారంభమవ్వడముతో వెంటనే శివుని మందిరాన్ని నిర్మిస్తారు. ఇప్పుడు వారు చైతన్యములో జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. వారు సత్యమైనవారు, చైతన్యమైనవారు. వారి మహిమనే పాడుతారు. నిరాకారునికి శరీరమైతే కావాలి కదా. కనుక తండ్రియే వచ్చి విశ్వాన్ని స్వర్గముగా తయారుచేస్తారు. ఆ స్వర్గములో రాజ్యము చేయడానికి మీరు పురుషార్థము చేస్తున్నారు. మీరు స్వర్గవాసులుగా అవుతున్నారు. నిరాకార పరమపిత పరమాత్మ జ్ఞానసాగరుడు. కానీ వారెలా వినిపించాలి? తండ్రి అంటారు - నేను ఈ శరీరములోకి వచ్చాను, డ్రామాలో నాకు ఈ పాత్ర ఉంది, నేను ప్రకృతిని ఆధారముగా తీసుకుంటాను. ఇతను మొదటి నంబరువారు, ఇతని అనేక జన్మల అంతిమములో నేను వచ్చి ప్రవేశిస్తాను మరియు వీరికి బ్రహ్మా అన్న పేరును పెడతాను. ముందు వీరంతా భట్టీలో ఉండేవారు, అప్పుడు చాలామందికి పేర్లు పెట్టారు. కానీ చాలామంది తర్వాత వదిలేశారు, అందుకే పేరు పెట్టడము వలన లాభమేముంది? మీరు ఆ పేర్లు వింటే ఆశ్చర్యపోతారు. ఒకేసారి ఎన్ని రమణీకమైన పేర్లు వచ్చాయి. సందేశీ పేర్లు తీసుకుని వచ్చేవారు. ఆ లిస్టు కూడా తప్పకుండా ఉంచుకోవాలి. సన్యాసులు కూడా సన్యాసము తీసుకున్నప్పుడు, వారి పేర్లు కూడా మారిపోతాయి. వారు ఇళ్ళు-వాకిళ్ళను వదిలేస్తారు. మీరు వదలరు. మీరు వచ్చి బ్రహ్మాకు చెందినవారిగా అవుతారు. మీరు ఎలాగూ శివునికి చెందినవారే. మీరు బాప్ దాదా అని అంటారు. సన్యాసులది అలా ఉండదు. వారికి పేరు మారుతుంది కానీ వారికి బాప్ దాదా లభించరు. వారికి కేవలం గురువు లభిస్తారు. హద్దు సన్యాసులైన హఠయోగులకు, అనంతమైన సన్యాసులైన రాజయోగులకు రాత్రికి-పగలుకు ఉన్నంత వ్యత్యాసము ఉంది. జ్ఞానము, భక్తి మరియు వైరాగ్యము అని అంటూ ఉంటారు కూడా. సన్యాసులకు కూడా వైరాగ్యముంది కానీ వారిది ఇళ్ళు-వాకిళ్ళ పట్ల వైరాగ్యము. మీకు మొత్తము ప్రపంచము పట్ల వైరాగ్యముంది. సృష్టి మారుతుందని వారికి అసలు తెలియనే తెలియదు. మీది అనంతమైన వైరాగ్యము. ఈ సృష్టి సమాప్తమవ్వనున్నది. మీ కోసం కొత్త ప్రపంచము తయారవుతూ ఉంది. అక్కడికి వెళ్ళాలి కానీ పావనముగా అవ్వకుండా అక్కడికి వెళ్ళలేరు. తప్పకుండా కొత్త ప్రపంచములో దేవీ-దేవతల రాజ్యముండేదని మనసుకు అనిపిస్తుంది, దానిని తండ్రి ఇప్పుడు స్థాపన చేస్తున్నారు. శివబాబాను స్మృతి చేయడముతో మీరు పుణ్యాత్ములుగా అవుతారని మీకు తెలుసు. ఇది చాలా సహజము కానీ స్మృతిని మర్చిపోతారు. భక్తి మార్గములోని ఆచారాలు, పద్ధతులు పూర్తిగా వేరు. తిరిగి తమ ఇంటికి ఎవ్వరూ వెళ్ళలేరు. పునర్జన్మలను అందరూ తప్పకుండా తీసుకోవాలి. ఇంటికి వెళ్ళే సమయము అందరికీ ఒక్కటే. ఫలానావారు మోక్షము పొందారని అనడము తప్పు. తండ్రి అంటారు - ఏ ఆత్మ కూడా మధ్యలో తిరిగి వెళ్ళలేదు. లేదంటే మొత్తం ఆటంతా పాడైపోతుంది. ప్రతి ఒక్కరూ సతో, రజో, తమోలలోకి తప్పకుండా రావాలి. మోక్షము కోసమని చాలామంది వస్తారు కానీ మోక్షమనేది లభించదని వారికి అర్థం చేయించడము జరుగుతుంది. ఇది అనాదిగా తయారై, తయారుచేయబడిన డ్రామా. ఇది ఎప్పటికీ మారదు. ఈగ ఇక్కడి నుండి వెళ్ళిందంటే, మళ్ళీ 5 వేల సంవత్సరాల తర్వాత ఇలాగే వెళ్తుంది. బాబా ఎంతటి భోళా అయినవారో మీకు తెలుసు. పతిత-పావనుడైన తండ్రి పాత్రను అభినయించేందుకని తమ పరంధామము నుండి వస్తారు. ఈ డ్రామా ఎలా తయారుచేయబడి ఉంది, ఇందులో ముఖ్యమైనవారు ఎవరెవరు అనేది వారే అర్థం చేయిస్తారు. ఈ ప్రపంచములో అందరికన్నా షావుకారులు ఎవరు అని అడుగుతారు కదా. దీని కోసం నంబరువారుగా పేర్లు తీస్తారు. అందరికన్నా షావుకారులు ఎవరు అనేది మీకు తెలుసు. వారు అమెరికా అని అంటారు. కానీ స్వర్గములోని ఈ లక్ష్మీ-నారాయణులే అందరికన్నా షావుకారులుగా అవుతారని మీకు తెలుసు. మీరు భవిష్యత్తు కోసం పురుషార్థము చేస్తారు, అందరికన్నా గొప్ప షావుకారుగా అయ్యేందుకు పురుషార్థము చేస్తారు. ఇది ఒక రేస్. ఈ లక్ష్మీ-నారాయణుల వంటి షావుకారులు ఇంకెవరైనా ఉంటారా? అల్లా అవల్దీన్ కథను కూడా తయారుచేస్తారు. దీపాన్ని రుద్దగానే కుబేర ఖజానా వెలువడింది. రకరకాల నాటకాలను చాలా తయారుచేస్తారు.

ఈ శరీరాన్ని వదిలి స్వర్గములోకి వెళ్తామని ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. మనకు అపారమైన ఖజానా లభిస్తుంది. తండ్రి అంటారు, నన్ను స్మృతి చేసినట్లయితే, మాయ ఒక్కసారిగా పారిపోతుంది. తండ్రిని స్మృతి చేయకపోతే ఇక మాయ విసిగిస్తుంది. బాబా, మాకు మాయా తుఫానులు చాలా వస్తున్నాయని అంటారు. అచ్ఛా, తండ్రిని చాలా ప్రేమగా స్మృతి చేసినట్లయితే, తుఫానులు మాయమైపోతాయి. ఇకపోతే నాటకాలు మొదలైనవి కూర్చుని తయారుచేసారు, అటువంటి విషయాలేవీ ఉండవు. తండ్రి ఎంత సహజముగా తెలియజేస్తారు - కేవలం తండ్రిని స్మృతి చేసినట్లయితే, మీలో ఉన్న మాలిన్యమంతా తొలగిపోతుంది, ఇంకే కష్టము ఇవ్వరు. పవిత్రముగా, సత్యమైన బంగారముగా ఉండే ఆత్మ, ఇప్పుడు అసత్యముగా అయిపోయింది, మళ్ళీ ఈ స్మృతి అనే అగ్నితోనే సత్యముగా అవుతుంది. అగ్నిలో వేయకుండా బంగారము పవిత్రముగా అవ్వలేదు, దీనిని కూడా యోగాగ్ని అని అంటారు. అయితే ఇది స్మృతికి సంబంధించిన విషయము. వారైతే అనేక రకాల హఠయోగాలను నేర్పిస్తారు. మీకైతే తండ్రి చెప్తున్నారు, మీరు లేస్తూ-కూర్చుంటూ స్మృతి చేయండి. మీరు ఆసనాలు మొదలైనవి ఎంతవరకని చేస్తారు. ఇక్కడైతే నడుస్తూ-తిరుగుతూ, పనులు చేసుకుంటూ స్మృతిలో ఉండాలి. అనారోగ్యము ఉన్నా, ఇక్కడ చారబడి అయినా సరే తండ్రిని స్మృతి చేయవచ్చు. శివబాబాను స్మృతి చేయండి మరియు చక్రాన్ని తిప్పండి, అంతే. దీని గురించే వారు - గంగా తీరములో ఉండాలి, అమృతము నోటిలో ఉండాలి అని వ్రాశారు. గంగా తీరములోనైతే గంగా జలమే లభిస్తుంది, అందుకే మనుష్యులు హరిద్వార్ కు వెళ్ళి కూర్చుంటారు. తండ్రి అంటారు, మీరు ఎక్కడైనా కూర్చోండి, అనారోగ్యముగా ఉన్నా కేవలం తండ్రిని స్మృతి చేయండి. స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉన్నప్పుడు ప్రాణము తనువు నుండి వెళ్ళిపోవాలి. ఈ అభ్యాసము చేయాల్సి ఉంటుంది. ఆ భక్తి మార్గపు విషయాలకు మరియు ఈ జ్ఞాన మార్గపు విషయాలకు, రాత్రికి-పగలుకు ఉన్నంత వ్యత్యాసము ఉంది. తండ్రి స్మృతితో మీరు స్వర్గానికి యజమానులుగా అవుతారు. ఎవరైతే యుద్ధ మైదానములో మరణిస్తారో వారు స్వర్గములోకి వెళ్తారు అని యుద్ధము చేసేవారికి చెప్తూ ఉంటారు. వాస్తవానికి ఇదే యుద్ధము. వారేమో కౌరవులు, పాండవుల సైన్యాలను చూపించారు. మహాభారత యుద్ధము జరిగిన తర్వాత ఏమయ్యింది? ఫలితమేమీ లేదు. పూర్తిగా ఘోర అంధకారము ఉంది. ఏమీ అర్థం చేసుకోరు. అందుకే అజ్ఞానాంధకారము అని అంటారు. తండ్రి మళ్ళీ వెలుగును ఇచ్చేందుకు వచ్చారు. వారిని జ్ఞానసాగరుడు, నాలెడ్జ్ ఫుల్ అని అంటారు. ఇప్పుడు మీకు కూడా జ్ఞానమంతా లభించింది. అది మూలవతనము, ఆత్మలైన మీరు అక్కడ నివసిస్తారు, దానిని బ్రహ్మాండమని కూడా అంటారు. ఇక్కడ రుద్ర యజ్ఞాన్ని రచించినప్పుడు, తండ్రితో పాటు ఆత్మలైన మీకు కూడా పూజ చేస్తారు, ఎందుకంటే మీరు అనేకుల కళ్యాణము చేస్తారు. తండ్రితో పాటు మీరు కూడా విశేషముగా భారత్ కు మరియు ప్రపంచమంతటికీ ఆత్మిక సేవను చేస్తారు. అందుకే తండ్రితో పాటు పిల్లలైన మీకు కూడా పూజ జరుగుతుంది. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. మాయా తుఫానులను పారద్రోలేందుకు తండ్రిని చాలా-చాలా ప్రేమగా స్మృతి చేయాలి. ఆత్మను యోగాగ్నితో సత్యాతి-సత్యమైన బంగారములా తయారుచేసుకోవాలి.

2. అనంతమైన వైరాగులుగా అయి ఈ పాత ప్రపంచాన్ని మర్చిపోవాలి. ప్రపంచము మారుతోంది, కొత్త ప్రపంచములోకి వెళ్ళాలి, అందుకే దీని నుండి సన్యాసము తీసుకోవాలి.

వరదానము:-
అడుగడుగులోనూ అప్రమత్తముగా ఉంటూ పదమాల సంపాదనను జమ చేసుకునే పదమపతి భవ

పిల్లలను బాబా - మీరు చాలా ఉన్నతమైన స్థితిలో ఉండాలి అంటూ అప్రమత్తము చేస్తున్నారు, కావున ఇప్పుడు ఇది కొద్దిగా కూడా పొరపాట్లు చేసే సమయము కాదు, ఇప్పుడైతే అడుగడుగులోనూ అప్రమత్తముగా ఉంటూ, ప్రతి అడుగులోనూ పదమాల సంపాదనను చేసుకుంటూ పదమపతులుగా అవ్వండి. ఏ విధముగా పదమాపదమ భాగ్యశాలురు అన్న పేరు ఉందో, అదే విధముగా కర్మలు కూడా ఉండాలి. ఒక్క అడుగు కూడా పదమాల సంపాదన లేకుండా పోకూడదు. కావున బాగా ఆలోచించి, అర్థం చేసుకుని, శ్రీమతము అనుసారముగా ప్రతి అడుగు వేయండి. శ్రీమతములో మన్మతాన్ని మిక్స్ చేయకండి.

స్లోగన్:-
మనసును ఆర్డర్ అనుసారముగా నడిపించినట్లయితే మన్మనాభవ స్థితి స్వతహాగా ఉంటుంది.

అవ్యక్త ప్రేరణలు - జ్వాలా స్వరూప స్థితిలో ఉంటూ శక్తిశాలి స్మృతిని అనుభవము చేయండి

స్మృతిని శక్తిశాలిగా తయారుచేసుకునేందుకు విస్తారములోకి వెళ్తూ కూడా సార స్థితి యొక్క అభ్యాసము తక్కువవ్వకూడదు, విస్తారములోకి వెళ్ళి సారాన్ని మర్చిపోకూడదు. తినండి-తాగండి, సేవ చేయండి కానీ అతీతత్వాన్ని మర్చిపోకండి. సాధన అనగా శక్తిశాలి స్మృతి, నిరంతరం బాబాతో హృదయపూర్వకమైన సంబంధము. కేవలం యోగములో కూర్చుని ఉంటే దానిని సాధన అని అనరు, కానీ ఎలా అయితే శరీరముతో కూర్చుని ఉంటారో, అలాగే హృదయము, మనసు, బుద్ధి ఒక్క బాబా వైపు ఉండాలి, బాబాతో పాటు కూర్చుండిపోవాలి. ఇటువంటి ఏకాగ్రతయే జ్వాలను ప్రజ్వలితము చేస్తుంది.