23-04-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - ఇప్పుడు నాటకం పూర్తవుతుంది, తిరిగి ఇంటికి వెళ్ళాలి, కలియుగ అంతిమం తర్వాత మళ్ళీ సత్యయుగము రిపీట్ అవుతుంది, ఈ రహస్యాన్ని అందరికీ అర్థం చేయించండి’’

ప్రశ్న:-
ఆత్మ పాత్రను అభినయిస్తూ-అభినయిస్తూ అలసిపోయింది, అలసటకు ముఖ్యమైన కారణము ఏమిటి?

జవాబు:-
ఎంతో భక్తి చేసి, అనేక మందిరాలను నిర్మించి, ధనాన్ని ఖర్చు చేసి, ఎదురుదెబ్బలు తింటూ-తింటూ సతోప్రధాన ఆత్మ తమోప్రధానముగా అయిపోయింది. తమోప్రధానముగా అయిన కారణంగానే ఆత్మ దుఃఖమయంగా అయ్యింది. ఎప్పుడైనా ఏదైనా విషయములో ఎవరైనా విసుగు చెందితే, అప్పుడు అలసట కలుగుతుంది. ఇప్పుడు తండ్రి అలసటనంతా తొలగించేందుకు వచ్చారు.

ఓంశాంతి
ఆత్మిక తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తారు, వారి పేరు ఏమిటి? శివ. ఇక్కడ పిల్లలైన మీరు కూర్చున్నారు కావున ఈ విషయం మంచి రీతిలో గుర్తుండాలి. ఈ డ్రామాలో అందరి పాత్ర ఏదైతే ఉందో, అది ఇప్పుడు పూర్తవుతుంది. నాటకం పూర్తయ్యే సమయంలో పాత్రధారులందరూ - మా పాత్ర ఇప్పుడు పూర్తవ్వనున్నది, ఇప్పుడిక ఇంటికి వెళ్ళాలి అని భావిస్తారు. పిల్లలైన మీకు కూడా తండ్రి ఇప్పుడు జ్ఞానాన్ని ఇచ్చారు, ఈ జ్ఞానము ఇంకెవ్వరికీ లేదు. ఇప్పుడు తండ్రి మిమ్మల్ని తెలివైనవారిగా తయారుచేసారు. పిల్లలూ, ఇప్పుడు నాటకం పూర్తవుతుంది, ఇప్పుడు మళ్ళీ కొత్తగా చక్రము ప్రారంభమవ్వనున్నది. కొత్త ప్రపంచంలో సత్యయుగం ఉండేది. ఇప్పుడు పాత ప్రపంచంలో ఇది కలియుగము యొక్క అంతిమము. ఈ విషయాలు మీకు మాత్రమే తెలుసు, మీకే తండ్రి లభించారు. కొత్తగా ఎవరైతే వస్తారో, వారికి కూడా ఇది అర్థం చేయించాలి - ఇప్పుడు నాటకం పూర్తవుతుంది, కలియుగ అంతిమం తర్వాత మళ్ళీ సత్యయుగం రిపీట్ అవ్వనున్నది. ఇంతమంది ఎవరైతే ఉన్నారో, వారంతా తిరిగి ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడు నాటకం పూర్తవుతుంది, కావున మనుష్యులు ప్రళయం జరుగుతుందని భావిస్తారు. పాత ప్రపంచ వినాశనము ఎలా జరుగుతుంది అనేది ఇప్పుడు మీకు తెలుసు. భారత్ అవినాశీ ఖండము, తండ్రి కూడా ఇక్కడికే వస్తారు. మిగిలిన ఖండాలన్నీ వినాశనమైపోతాయి. ఈ ఆలోచన ఇంకెవ్వరి బుద్ధిలోకి రాదు. తండ్రి పిల్లలైన మీకు అర్థం చేయిస్తారు - ఇప్పుడు నాటకం పూర్తవుతుంది, మళ్ళీ రిపీట్ అవుతుంది అని. ఇంతకుముందు నాటకము అన్న పేరు కూడా మీ బుద్ధిలో లేదు. కేవలం నామమాత్రంగా - ఇది సృష్టి నాటకమని, ఇందులో మనము పాత్రధారులమని అనేవారు. ఇంతకుముందు ఈ మాటలు అన్నప్పుడు శరీరాలను అంటున్నారని భావించేవారు. ఇప్పుడు తండ్రి అంటారు - స్వయాన్ని ఆత్మగా భావించండి మరియు తండ్రిని స్మృతి చేయండి. ఇప్పుడు మనం తిరిగి ఇంటికి వెళ్ళాలి, అది స్వీట్ హోమ్ (మధురమైన ఇల్లు). ఆ నిరాకారీ ప్రపంచంలో ఆత్మలమైన మనము ఉంటాము. ఈ జ్ఞానము మనుష్య మాత్రులెవ్వరిలోనూ లేదు. ఇప్పుడు మీరు సంగమములో ఉన్నారు. ఇప్పుడు మనము తిరిగి వెళ్ళాలని మీకు తెలుసు. పాత ప్రపంచం సమాప్తమైతే భక్తి కూడా సమాప్తమవుతుంది. మొట్టమొదట ఎవరు వస్తారు, ఈ ధర్మాలు నంబరువారుగా ఎలా వస్తాయి అన్న విషయాలు ఏ శాస్త్రాలలోనూ లేవు. ఇప్పుడు తండ్రి కొత్త విషయాలను అర్థం చేయిస్తున్నారు. ఈ విషయాలను ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు. తండ్రి కూడా ఒకే సారి వచ్చి అర్థం చేయిస్తారు. జ్ఞానసాగరుడైన తండ్రి ఒకే సారి వస్తారు, అప్పుడు కొత్త ప్రపంచము యొక్క స్థాపనను, పాత ప్రపంచము యొక్క వినాశనాన్ని చేస్తారు. తండ్రి స్మృతితో పాటు ఈ చక్రం కూడా బుద్ధిలో ఉండాలి. ఇప్పుడు నాటకం పూర్తవుతుంది, మనం తిరిగి ఇంటికి వెళ్తాము. పాత్రను అభినయిస్తూ-అభినయిస్తూ మనము అలసిపోయాము. ధనాన్ని కూడా ఖర్చు చేశాము, భక్తి చేస్తూ-చేస్తూ మనం సతోప్రధానము నుండి తమోప్రధానముగా అయిపోయాము. ఈ ప్రపంచమే పాతగా అయిపోయింది. నాటకాన్ని పాతది అని అంటారా? అలా అనరు. నాటకము ఎప్పుడూ పాతబడదు. నాటకము నిత్యం కొత్తగానే ఉంటుంది. ఇది కొనసాగుతూనే ఉంటుంది. కానీ ప్రపంచము పాతదిగా అవుతుంది, పాత్రధారులైన మనము తమోప్రధానముగా, దుఃఖితులుగా అయిపోతాము, అలసిపోతాము. సత్యయుగములో ఏమైనా అలసిపోతారా. అక్కడ ఏ విషయములోనూ అలసిపోవడం కానీ విసుగు చెందడం కానీ జరగదు. ఇక్కడైతే ఎన్నో రకాలుగా విసిగిపోవాల్సి వస్తుంది. మీకు తెలుసు, ఈ పాత ప్రపంచము సమాప్తమవ్వనున్నది. సంబంధీకులు మొదలైనవారెవ్వరూ గుర్తుకు రాకూడదు. ఒక్క తండ్రినే స్మృతి చేయాలి, తద్వారా వికర్మలు వినాశనమవుతాయి, వికర్మలు వినాశనము అయ్యేందుకు వేరే ఉపాయమేమీ లేదు. గీతలో కూడా మన్మనాభవ అన్న పదము ఉంది. కానీ దాని అర్థాన్ని ఎవ్వరూ తెలుసుకోలేకపోయారు. తండ్రి అంటారు - నన్ను స్మృతి చేయండి మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి. మీరు విశ్వానికి వారసులుగా అనగా యజమానులుగా ఉండేవారు. ఇప్పుడు మీరు విశ్వానికి వారసులుగా అవుతున్నారు. మరి ఎంత సంతోషము ఉండాలి. ఇప్పుడు మీరు గవ్వ నుండి వజ్రము వలె తయారవుతున్నారు. ఇక్కడికి మీరు వచ్చిందే తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునేందుకు.

మీకు తెలుసు, ఎప్పుడైతే కళలు తగ్గిపోతాయో, అప్పుడు పుష్పాలతోట వాడిపోతుంది. ఇప్పుడు మీరు గార్డెన్ ఆఫ్ ఫ్లవర్ (పుష్పాల తోట) వలె తయారవుతారు. సత్యయుగము పుష్పాల తోటగా ఉన్నప్పుడు ఎంత సుందరంగా ఉండేది, ఆ తర్వాత నెమ్మది-నెమ్మదిగా కళలు తగ్గిపోతూ ఉంటాయి. రెండు కళలు తగ్గడంతో పుష్పాల తోట వాడిపోయింది. ఇప్పుడైతే ముళ్ళ అడవిలా అయిపోయింది. ఇప్పుడు మీకు తెలుసు, ప్రపంచానికి అసలేమీ తెలియదు. ఈ జ్ఞానము మీకు లభిస్తుంది. ఇది కొత్త ప్రపంచము కొరకు కొత్త జ్ఞానము. కొత్త ప్రపంచము స్థాపనవుతుంది. స్థాపన చేసేవారు తండ్రి. సృష్టి రచయిత ఆ తండ్రి. స్మృతి చేయడము కూడా ఆ తండ్రినే చేస్తారు - మీరు వచ్చి స్వర్గాన్ని రచించండి, సుఖధామాన్ని రచించండి అని. అప్పుడు తప్పకుండా దుఃఖధామము వినాశనము అవుతుంది కదా. బాబా ప్రతిరోజూ ఈ విషయాలను అర్థం చేయిస్తూ ఉంటారు, వీటిని ధారణ చేసి, ఆ తర్వాత అర్థం చేయించాలి. మొట్టమొదట - మన తండ్రి ఎవరు, ఎవరి నుండి వారసత్వాన్ని పొందాలి అన్న ముఖ్యమైన విషయాన్ని అర్థం చేయించాలి. భక్తి మార్గంలో కూడా గాడ్ ఫాదర్ ను - మా దుఃఖాలను హరించండి, సుఖాన్ని ఇవ్వండి అని తలచుకుంటారు. కావున పిల్లలైన మీ బుద్ధిలో కూడా ఈ స్మృతి ఉండాలి. స్కూల్లో విద్యార్థుల బుద్ధిలో జ్ఞానము ఉంటుంది, అంతేకానీ ఇల్లు-వాకిళ్ళు కాదు. విద్యార్థి జీవితంలో వ్యాపార-వ్యవహారాల విషయాలు ఉండవు. కేవలం చదువే గుర్తుంటుంది. ఇక్కడ కర్మలు చేస్తూ, గృహస్థ వ్యవహారంలో ఉంటూ, ఈ చదువును చదవండి అని తండ్రి అంటారు. అంతేకానీ సన్యాసులు లా ఇల్లు-వాకిళ్ళను వదలమని చెప్పరు. ఇది రాజయోగము. ఇది ప్రవృత్తి మార్గము. సన్యాసులకు కూడా మీరు ఈ విధంగా చెప్పవచ్చు - మీది హఠయోగము, మీరు ఇల్లు-వాకిళ్ళను వదిలేస్తారు, ఇక్కడ ఆ విషయము లేదు. ఈ ప్రపంచమే ఎంత అశుద్ధంగా ఉంది. ఏమేమి జరుగుతున్నాయి! పేదవారు ఎలా ఉంటున్నారు. అది చూడడంతోనే అయిష్టం కలుగుతుంది. బయటి నుండి విజిటర్స్ (సందర్శకులు) ఎవరైతే వస్తారో వారికి మంచి-మంచి స్థానాలను చూపిస్తారు, పేదవారు మురికిలో ఎలా ఉంటున్నారు అనేది అయితే చూపించరు. ఇది నరకము కానీ ఇక్కడ ఉన్నవారిలో కూడా ఎంతో తేడా ఉంది కదా. షావుకారులు ఎక్కడ ఉంటారు, పేదవారు ఎక్కడ ఉంటారు, ఇది కర్మల లెక్క కదా. సత్యయుగంలో ఇటువంటి మురికి ఉండదు. అక్కడ కూడా తేడా అయితే ఉంటుంది కదా. కొందరు బంగారముతో మహళ్ళను నిర్మిస్తారు, కొందరు వెండితో, మరి కొందరు ఇటుకలతో నిర్మిస్తారు. ఇక్కడ ఎన్ని ఖండాలు ఉన్నాయి. ఒక్క యూరోప్ ఖండమే ఎంత పెద్దది. అక్కడైతే కేవలం మనమే ఉంటాము. ఈ విషయము బుద్ధిలో ఉన్నా సరే హర్షితముఖ అవస్థ ఉంటుంది. విద్యార్థి బుద్ధిలో చదువు మాత్రమే గుర్తుంటుంది - తండ్రి మరియు వారసత్వము. ఇంకా కొద్ది సమయము మాత్రమే ఉంది అన్నదైతే అర్థం చేయించారు. వారేమో లక్షల-వేల సంవత్సరాలు అని అనేస్తారు. వాస్తవానికి ఇదంతా 5 వేల సంవత్సరాల విషయము. పిల్లలైన మీరు అర్థం చేసుకోగలరు - ఇప్పుడు మన రాజధాని స్థాపనవుతుంది, మిగిలిన ప్రపంచమంతా వినాశనం అవ్వనున్నది. ఇది చదువు కదా. బుద్ధిలో - మేము విద్యార్థులము, మమ్మల్ని భగవంతుడు చదివిస్తున్నారు అన్నది గుర్తుండాలి. ఇది గుర్తున్నా ఎంత సంతోషము ఉంటుంది. దీనిని ఎందుకు మర్చిపోతారు! మాయ చాలా శక్తివంతమైనది, అది మరపింపజేస్తుంది. స్కూలులో విద్యార్థులందరూ చదువుతున్నారు. మమ్మల్ని భగవంతుడు చదివిస్తున్నారని అందరికీ తెలుసు. అక్కడైతే అనేక రకాల విద్యలను చదివించడం జరుగుతుంది. ఎంతోమంది టీచర్లు ఉంటారు. ఇక్కడైతే టీచరు ఒక్కరే, చదువు కూడా ఒక్కటే. ఇకపోతే అసిస్టెంట్ టీచర్ల అయితే తప్పకుండా కావాలి. స్కూలు ఒక్కటే, మిగిలినవన్నీ శాఖలు, చదివించేవారు ఒక్క తండ్రే. తండ్రి వచ్చి అందరికీ సుఖాన్ని ఇస్తారు. అర్ధకల్పము మనం సుఖముగా ఉంటామని మీకు తెలుసు. కావున శివబాబా మనల్ని చదివిస్తున్నారు అన్న సంతోషం కూడా ఉండాలి. శివబాబా స్వర్గము యొక్క రచననే రచిస్తారు. మనం స్వర్గానికి యజమానులుగా అయ్యేందుకు చదువుతాము. మరి లోలోపల ఎంతటి సంతోషం ఉండాలి. ఆ విద్యార్థులు కూడా తింటూ-తాగుతూ, ఇంట్లో పనులు మొదలైనవన్నీ చేస్తారు. ఎవరైనా హాస్టల్ లో ఉంటే వారికి చదువు పట్ల ఎక్కువ ధ్యాస ఉంటుంది. సేవ చేసేందుకు కుమార్తెలు బయట ఉంటారు. అక్కడికి ఎలాంటి-ఎలాంటి మనుష్యులు వస్తారు. ఇక్కడ మీరు ఎంతో సురక్షితంగా కూర్చుని ఉన్నారు. ఎవ్వరూ లోపలికి ప్రవేశించలేరు. ఇక్కడ ఇంకెవ్వరి సాంగత్యమూ లేదు. పతితులతో మాట్లాడాల్సిన అవసరము లేదు. మీకు ఎవరి ముఖాన్ని చూడవలసిన అవసరము కూడా లేదు. అయినా బయట ఉండేవారు చురుకుగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఇది ఎంత విచిత్రము, బయట ఉండేవారు ఎంతమందిని చదివించి, తమ సమానముగా తయారుచేసి ఇక్కడికి తీసుకువస్తారు. మీరు ఎలాంటి రోగులను తీసుకొచ్చారు అని బాబా సమాచారాన్ని అడుగుతారు, ఎవరైనా చాలా ఎక్కువ రోగగ్రస్థముగా ఉంటే వారిని 7 రోజుల భట్టీలో ఉంచడం జరుగుతుంది. ఇక్కడికి శూద్రులెవరినీ తీసుకురాకూడదు. ఈ మధుబన్ బ్రాహ్మణులైన మీకు ఒక గ్రామము వంటిది. ఇక్కడ తండ్రి పిల్లలైన మీకు కూర్చుని అర్థం చేయిస్తారు, విశ్వానికి యజమానులుగా తయారుచేస్తారు. ఎవరైనా శూద్రులను తీసుకొస్తే, వారు వైబ్రేషన్లను పాడు చేస్తారు. పిల్లలైన మీ నడవడిక కూడా చాలా రాయల్ గా ఉండాలి.

అక్కడ ఏమేమి జరుగుతుంది అని మున్ముందు మీకు చాలా సాక్షాత్కారాలు జరుగుతూ ఉంటాయి. జంతువులు కూడా ఎంత మంచి-మంచివి ఉంటాయి, అన్నీ మంచి వస్తువులే ఉంటాయి. సత్యయుగానికి సంబంధించిన వస్తువులేవీ ఇక్కడ ఉండవు. అక్కడ మళ్ళీ ఇక్కడి వస్తువులు ఉండవు. మేము స్వర్గము కోసము పరీక్ష పాస్ అవుతున్నామని మీ బుద్ధిలో ఉంది. ఎంతగా చదివితే, అంతగా చదివించగలుగుతారు. టీచర్లుగా అయి ఇతరులకు మార్గాన్ని తెలియజేస్తారు. అందరూ టీచర్లే. అందరికీ నేర్పించవలసి ఉంటుంది. మొట్టమొదట తండ్రి పరిచయాన్ని ఇచ్చి ఈ విధంగా చెప్పాలి - తండ్రి నుండి ఈ వారసత్వము లభిస్తుంది. గీతను తండ్రి వినిపించారు. వీరు ప్రజాపిత బ్రహ్మా, కావున బ్రాహ్మణులు కూడా ఇక్కడ ఉండాలి. బ్రహ్మా కూడా శివబాబా ద్వారా చదువుతూ ఉంటారు. ఇప్పుడు మీరు విష్ణుపురిలోకి వెళ్ళేందుకు చదువుతున్నారు. ఇది మీ అలౌకిక ఇల్లు. లౌకికము, పారలౌకికము మరియు అలౌకికము. ఇది కొత్త విషయము కదా. భక్తి మార్గములో ఎప్పుడూ బ్రహ్మాను తలచుకోరు. బ్రహ్మాబాబా అని అనడం కూడా ఎవరికీ రాదు. దుఃఖము నుండి విడిపించండి అని శివబాబాను తలచుకుంటారు. వారు పారలౌకిక తండ్రి, వీరు అలౌకిక తండ్రి. వీరిని మీరు సూక్ష్మవతనములో కూడా చూస్తారు, అలాగే ఇక్కడ కూడా చూస్తారు. లౌకిక తండ్రి అయితే ఇక్కడ కనిపిస్తారు, కానీ పారలౌకిక తండ్రిని అక్కడ పరలోకములోనే చూడగలరు. వీరు అలౌకికమైన అద్భుతమైన తండ్రి. ఈ అలౌకిక తండ్రిని అర్థం చేసుకోవడంలోనే తికమక పడతారు. శివబాబాను నిరాకారుడు అని అంటారు. వారు ఒక బిందువు అని మీరు అంటారు. కానీ మనుష్యులు వారిని అఖండ జ్యోతి లేక బ్రహ్మము అని అనేస్తారు. అనేక మతాలు ఉన్నాయి. మీకు మాత్రం ఒకే మతము ఉంది. ఒక్కరి ద్వారా తండ్రి తమ మతాన్ని ఇవ్వడం మొదలుపెట్టారు, తర్వాత ఎంత వృద్ధి జరిగింది. కావున పిల్లలైన మీ బుద్ధిలో ఉండాలి - మమ్మల్ని శివబాబా చదివిస్తున్నారు, పతితుల నుండి పావనులుగా తయారుచేస్తున్నారు అని. రావణ రాజ్యంలో తప్పకుండా పతితముగా, తమోప్రధానముగా అవ్వాల్సిందే. దీని పేరే పతిత ప్రపంచము. ఇక్కడ అందరూ దుఃఖితులుగా ఉన్నారు, అందుకే కదా తండ్రిని తలచుకుంటారు - బాబా, మా దుఃఖాలను దూరం చేసి మాకు సుఖాన్ని ఇవ్వండి అని. పిల్లలందరికీ తండ్రి ఒక్కరే. వారు అందరికీ సుఖాన్ని ఇస్తారు కదా. కొత్త ప్రపంచంలో సుఖమే సుఖము ఉంటుంది. మిగిలినవారందరూ శాంతిధామములో ఉంటారు. ఇప్పుడు మనము శాంతిధామానికి వెళ్తాము అన్నది బుద్ధిలో ఉండాలి. ఎంతగా సమీపంగా వస్తూ ఉంటారో, అంతగా నేటి ప్రపంచం ఎలా ఉంది, రేపటి ప్రపంచం ఎలా ఉంటుంది, అంతా చూస్తూ ఉంటారు. స్వర్గ రాజ్యాధికారాన్ని సమీపంగా చూస్తూ ఉంటారు. కావున పిల్లలకు ముఖ్యమైన విషయాన్ని అర్థం చేయిస్తారు, బుద్ధిలో ఈ విషయము గుర్తుండాలి - మేము స్కూల్లో కూర్చుని ఉన్నాము. మనల్ని చదివించేందుకు శివబాబా ఈ రథంపై స్వారీ అయ్యి వచ్చారు. వీరు భగీరథుడు. తండ్రి రావడము కూడా తప్పకుండా ఒకే సారి వస్తారు. భగీరథుడు అన్న పేరు ఎవరిదో, ఇది కూడా ఎవరికీ తెలియదు.

ఇక్కడ పిల్లలైన మీరు తండ్రి సమ్ముఖంలో కూర్చున్నప్పుడు బుద్ధిలో ఏమని గుర్తుండాలంటే - బాబా వచ్చి ఉన్నారు, మనకు సృష్టి చక్రము యొక్క రహస్యాన్ని తెలియజేస్తున్నారు. ఇప్పుడిక నాటకం పూర్తవుతుంది, ఇప్పుడు మనము వెళ్ళాలి. ఇది బుద్ధిలో ఉంచుకోవడం ఎంత సహజము, కానీ పిల్లలు ఇది కూడా గుర్తు చేసుకోలేకపోతున్నారు. ఇప్పుడిక చక్రము పూర్తవుతుంది, ఇప్పుడు మనం తిరిగి వెళ్ళాలి, ఆ తర్వాత కొత్త ప్రపంచంలోకి వచ్చి పాత్రను అభినయించాలి, మళ్ళీ మన తర్వాత ఫలానా-ఫలానా వారు వస్తారు. మీకు తెలుసు, ఈ మొత్తం చక్రమంతా ఎలా తిరుగుతుంది, ప్రపంచం ఎలా వృద్ధి చెందుతుంది అని. ప్రపంచము కొత్తది నుండి పాతదిగా, మళ్ళీ పాతది నుండి కొత్తదిగా అవుతుంది. వినాశనము కొరకు ఏర్పాట్లను కూడా మీరు చూస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాలు కూడా జరగనున్నాయి. ఇన్ని బాంబులు తయారుచేసి పెట్టారు, మరి వాటిని తప్పకుండా ఉపయోగిస్తారు కదా. బాంబుల ద్వారా ఎంత పని జరుగుతుందంటే ఇక మనుష్యులు గొడవపడాల్సిన అవసరము ఉండదు. సైన్యాన్ని పంపిస్తూ ఉంటారు. బాంబులు వేస్తూ ఉంటారు. ఇంతమంది మనుష్యులకు ఉద్యోగాలు లేకపోతే ఆకలితో మరణిస్తారు కదా. ఇవన్నీ జరగనున్నాయి. అప్పుడు సైనికులు మొదలైనవారు ఏమి చేస్తారు. భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి, బాంబులు పడుతూ ఉంటాయి. ఒకరినొకరు హతమార్చుకుంటూ ఉంటారు. అనవసరమైన రక్తసిక్తపు ఆట జరగనున్నది కదా. మరి ఇక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు ఈ విషయాల గురించి ఆలోచించవలసి ఉంటుంది. శాంతిధామాన్ని, సుఖధామాన్ని స్మృతి చేస్తూ ఉండండి. నాకు ఏమేమి గుర్తొస్తున్నాయి అని మనసును ప్రశ్నించుకోండి. ఒకవేళ తండ్రి స్మృతి లేదు అంటే తప్పకుండా బుద్ధి ఎక్కడో భ్రమిస్తూ ఉందని అర్థము. అప్పుడు వికర్మలూ వినాశనమవ్వవు, పదవి కూడా తగ్గిపోతుంది. అచ్ఛా, తండ్రి స్మృతి నిలవకపోతే చక్రాన్ని అయినా స్మృతి చేయండి, తద్వారా సంతోషం కలుగుతుంది. కానీ శ్రీమతముపై నడవకపోతే, సేవ చేయకపోతే బాప్ దాదా హృదయాన్ని కూడా అధిరోహించలేరు. సేవ చేయకపోతే ఎంతోమందిని విసిగిస్తూ ఉంటారు. కొందరైతే అనేకులను తమ సమానంగా తయారుచేసి తండ్రి వద్దకు తీసుకొస్తారు. అప్పుడు బాబా వారిని చూసి సంతోషిస్తారు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. సదా హర్షితముగా ఉండేందుకు బుద్ధిలో చదువు మరియు చదివించే తండ్రి యొక్క స్మృతి ఉండాలి. తింటూ-తాగుతూ అన్ని పనులు చేస్తూ చదువు పట్ల పూర్తి ధ్యాస ఉంచాలి.

2. బాప్ దాదా హృదయాన్ని అధిరోహించేందుకు శ్రీమతము అనుసారంగా అనేకులను తమ సమానముగా తయారుచేసే సేవ చేయాలి. ఎవరినీ విసిగించకూడదు.

వరదానము:-
అశరీరీతనము యొక్క ఇంజెక్షన్ ద్వారా మనస్సును కంట్రోల్ చేసే ఏకాగ్రచిత్త భవ

ఏ విధంగా ఈ రోజుల్లో ఒకవేళ ఎవరైనా కంట్రోల్ లోకి రాకపోతే, చాలా విసిగిస్తే, ఎగురుతూ ఉంటే లేక పిచ్చివానిగా అయిపోతే, వారికి ఎటువంటి ఇంజెక్షన్ వేస్తారంటే, దానితో వారు శాంతిగా అయిపోతారు. అదే విధంగా ఒకవేళ సంకల్ప శక్తి మీ కంట్రోల్ లోకి రాకపోతే, అశరీరీతనము యొక్క ఇంజెక్షన్ ను వేయండి. అప్పుడిక సంకల్ప శక్తి వ్యర్థముగా పోదు. సహజముగా ఏకాగ్రచిత్తులుగా అయిపోతారు. కానీ ఒకవేళ బుద్ధి అనే కళ్ళెమును తండ్రికి ఇచ్చి మళ్ళీ తీసుకున్నట్లయితే మనసు మిమ్మల్ని వ్యర్థమనే కష్టములో పడేస్తుంది. ఇప్పుడు వ్యర్థమనే కష్టము నుండి విముక్తులుగా అవ్వండి.

స్లోగన్:-
తమ పూర్వజ స్వరూపాన్ని స్మృతిలో ఉంచుకుని సర్వాత్మలపై దయ చూపించండి.

అవ్యక్త సూచనలు - "కంబైండ్ రూపపు స్మృతి ద్వారా సదా విజయీగా అవ్వండి"

ఎలాగైతే శరీరము మరియు ఆత్మ రెండూ కంబైండ్ గా ఉంటూ కర్మలు చేస్తున్నాయో, అలాగే కర్మ మరియు యోగము రెండూ కంబైండ్ గా ఉండాలి. కర్మ చేస్తూ స్మృతిని మర్చిపోకూడదు మరియు స్మృతిలో ఉంటూ కర్మను మర్చిపోకూడదు ఎందుకంటే మీ టైటిల్ కర్మయోగి. కర్మలు చేస్తూ స్మృతిలో ఉండేవారు సదా అతీతముగా మరియు ప్రియముగా ఉంటారు, తేలికగా ఉంటారు. నాలెడ్జ్ ఫుల్ తో పాటు శక్తిశాలి స్థితిలో ఉండండి. నాలెడ్జ్ ఫుల్ మరియు పవర్ ఫుల్, ఈ రెండు స్థితులు కంబైండ్ గా ఉండాలి, అప్పుడు స్థాపనా కార్యము తీవ్రగతితో జరుగుతుంది.