29-01-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీరు మీ యోగబలముతోనే వికర్మలను వినాశనము చేసుకుని పావనముగా తయారై పావన ప్రపంచాన్ని తయారుచేయాలి, ఇదే మీ సేవ’’

ప్రశ్న:-
దేవీ-దేవతా ధర్మము యొక్క ఏ విశేషత మహిమ చేయబడింది?

జవాబు:-
దేవీ-దేవతా ధర్మమే చాలా సుఖాన్ని ఇచ్చేటటువంటిది. అక్కడ దుఃఖము యొక్క నామ-రూపాలు ఉండవు. పిల్లలైన మీరు మూడు వంతులు సుఖము పొందుతారు. ఒకవేళ సగం సుఖము, సగం దుఃఖము ఉంటే అందులో అంత ఆనందమే ఉండదు.

ఓంశాంతి
భగవానువాచ. ఏ మనుష్యమాత్రుడినీ భగవంతుడు అని అనలేము అని భగవంతుడే అర్థం చేయించారు. దేవతలను కూడా భగవంతుడు అని అనరు. భగవంతుడైతే నిరాకారుడు, వారికి ఎటువంటి సాకారీ రూపము కానీ, ఆకారీ రూపము కానీ లేదు. సూక్ష్మవతనవాసులకు కూడా సూక్ష్మ ఆకారము ఉంది, అందుకే దానిని సూక్ష్మవతనము అని అంటారు. ఇక్కడ సాకారీ మనుష్య శరీరాలు ఉన్నాయి, అందుకే దీనిని స్థూలవతనము అని అంటారు. సూక్ష్మవతనములో ఈ పంచ తత్వాల స్థూల శరీరము ఉండదు. ఈ పంచ తత్వాలతో మనుష్య శరీరము తయారయ్యింది, దీనిని మట్టి బొమ్మ అని అంటారు. సూక్ష్మవతనవాసులను మట్టి బొమ్మ అని అనరు. దేవతా ధర్మము వారు కూడా మనుష్యులే, కానీ వారిని దైవీ గుణాలు కలిగిన మనుష్యులు అని అంటారు. వారు దైవీ గుణాలను శివబాబా నుండి ప్రాప్తి చేసుకున్నారు. దైవీ గుణాలు కలిగిన మనుష్యులకు మరియు ఆసురీ గుణాలు కలిగిన మనుష్యులకు మధ్యన ఎంత తేడా ఉంది. మనుష్యులే శివాలయములో ఉండేందుకు లేక వేశ్యాలయములో ఉండేందుకు యోగ్యులుగా అవుతారు. సత్యయుగాన్ని శివాలయము అని అంటారు. సత్యయుగము ఇక్కడే ఉంటుంది. అది మూలవతనములో లేక సూక్ష్మవతనములో ఉండదు. అది శివబాబా స్థాపించిన శివాలయమని పిల్లలైన మీకు తెలుసు. ఎప్పుడు స్థాపించారు? సంగమయుగములో. ఇది పురుషోత్తమ యుగము. ఇప్పుడు ఈ ప్రపంచము పతితముగా, తమోప్రధానముగా ఉంది, దీనిని సతోప్రధాన కొత్త ప్రపంచము అని అనరు. కొత్త ప్రపంచాన్ని సతోప్రధాన ప్రపంచము అని అంటారు. అదే మళ్ళీ ఎప్పుడైతే పాతగా అవుతుందో, అప్పుడు దానిని తమోప్రధాన ప్రపంచము అని అంటారు. మళ్ళీ సతోప్రధానముగా ఎలా తయారవుతుంది? పిల్లలైన మీ యోగబలము ద్వారా. యోగబలముతోనే మీ వికర్మలు వినాశనమవుతాయి మరియు మీరు పవిత్రముగా అవుతారు. పవిత్రముగా అయినవారికి మరి తప్పకుండా పవిత్ర ప్రపంచము కావాలి. కొత్త ప్రపంచాన్ని పవిత్ర ప్రపంచమని, పాత ప్రపంచాన్ని అపవిత్ర ప్రపంచమని అనడం జరుగుతుంది. పవిత్ర ప్రపంచాన్ని తండ్రి స్థాపన చేస్తారు, పతిత ప్రపంచాన్ని రావణుడు స్థాపన చేస్తాడు. ఈ విషయాలు మనుష్యులెవరికీ తెలియవు. ఈ పంచ వికారాలు లేకపోతే మనుష్యులు దుఃఖితులై తండ్రిని ఎందుకు స్మృతి చేస్తారు! తండ్రి అంటారు, నేను దుఃఖహర్త, సుఖకర్తను. పంచ వికారాల రూపీ రావణుడిని పది తలల బొమ్మగా తయారుచేసారు. ఆ రావణుడిని శత్రువుగా భావించి కాలుస్తారు. అలాగని ద్వాపరయుగ ప్రారంభము నుండే కాల్చడం మొదలుపెడతారని కాదు. అలా కాదు. ఎప్పుడైతే తమోప్రధానముగా అవుతారో అప్పుడు ఏదో ఒక మత-మతాంతరము వారు కూర్చుని ఈ కొత్త విషయాలను తయారుచేస్తారు. ఎప్పుడైనా ఎవరైనా బాగా దుఃఖాన్ని ఇస్తే, అప్పుడు వారి దిష్టిబొమ్మను తయారుచేస్తారు. అలాగే ఇక్కడ కూడా మనుష్యులకు ఎప్పుడైతే చాలా దుఃఖము లభిస్తుందో, అప్పుడు ఈ రావణుడి దిష్టిబొమ్మను తయారుచేసి కాలుస్తారు. పిల్లలైన మీకు మూడు వంతులు సుఖము ఉంటుంది. ఒకవేళ సగం దుఃఖము ఉంటే ఆనందమేమి ఉంటుంది! తండ్రి అంటారు, మీ ఈ దేవీ-దేవతా ధర్మము చాలా సుఖాన్ని ఇచ్చేటటువంటిది. సృష్టి అయితే అనాదిగా తయారై ఉంది. సృష్టి ఎందుకు తయారయ్యింది, మళ్ళీ ఎప్పుడు పూర్తి అవుతుంది అని ఎవరూ అడగడానికి లేదు. ఈ చక్రము తిరుగుతూనే ఉంటుంది. శాస్త్రాలలో కల్పము యొక్క ఆయువును లక్షల సంవత్సరాలుగా చూపించారు. తప్పకుండా సంగమయుగము కూడా ఉంటుంది, ఆ సమయములోనే సృష్టి పరివర్తన అవుతుంది. ఇప్పుడు మీరు అనుభవం చేసినట్లుగా ఇంకెవ్వరూ అర్థం చేసుకోరు. బాల్యములో రాధ-కృష్ణులు అన్న పేర్లు ఉంటాయి, ఆ తర్వాత స్వయంవరం జరుగుతుంది అని ఈ మాత్రము కూడా అర్థం చేసుకోరు. ఇరువురూ వేరు-వేరు రాజధానులకు చెందినవారు, మళ్ళీ వారి స్వయంవరం జరిగిన తర్వాత లక్ష్మీ-నారాయణులుగా అవుతారు. ఈ విషయాలన్నింటినీ తండ్రి అర్థం చేయిస్తారు. తండ్రే నాలెడ్జ్ ఫుల్. అలాగని వారు సర్వము తెలిసినవారు అని కాదు. తండ్రి వచ్చి జ్ఞానాన్ని ఇస్తారని ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకుంటారు. జ్ఞానము పాఠశాలలో లభిస్తుంది. పాఠశాలలో లక్ష్యము-ఉద్దేశ్యమైతే తప్పకుండా ఉండాలి. ఇప్పుడు మీరు చదువుకుంటున్నారు. ఈ ఛీ-ఛీ ప్రపంచములో రాజ్యము చేయలేరు. పుష్పము వంటి ప్రపంచములో రాజ్యము చేస్తారు. రాజయోగాన్ని ఏమీ సత్యయుగములో నేర్పించరు. సంగమయుగములోనే తండ్రి రాజయోగాన్ని నేర్పిస్తారు. ఇది అనంతమైన విషయము. తండ్రి ఎప్పుడు వస్తారు, ఎవ్వరికీ తెలియదు. ఘోర అంధకారములో ఉన్నారు. జ్ఞాన సూర్యుడు అన్న పేరును బట్టి జపాన్ లో వారు తమను తాము సూర్యవంశీయులుగా చెప్పుకుంటారు. వాస్తవానికి సూర్యవంశీయులు దేవతలు. సూర్యవంశీయుల రాజ్యము సత్యయుగములోనే ఉండేది. జ్ఞాన సూర్యుడు ఉదయించగానే అజ్ఞానము అనే అంధకారము వినాశనమయ్యింది అని అంటూ ఉంటారు. కనుక భక్తి మార్గపు అంధకారము వినాశనమవుతుంది. కొత్త ప్రపంచము పాతదిగా, పాత ప్రపంచము మళ్ళీ కొత్తదిగా అవుతుంది. ఇది అనంతమైన పెద్ద ఇల్లు. ఇది ఎంత పెద్ద రంగస్థలము. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఎంత పని చేసిపెడతాయి. రాత్రివేళ ఎంతో పని నడుస్తుంది. కొందరు రాజులైతే పగలుపూట పడుకుని, రాత్రివేళ తమ సభలు మొదలైనవి నిర్వహిస్తారు, కొనుగోళ్లు అవి చేస్తూ ఉంటారు, అటువంటివారు కూడా ఉన్నారు. ఇది ఇప్పటికీ కొన్ని-కొన్ని ప్రదేశాలలో జరుగుతుంది. మిల్లులూ మొదలైనవి కూడా రాత్రివేళలో నడుస్తాయి. ఇవి హద్దులోని పగలు, రాత్రి. అది అనంతమైన విషయము. ఈ విషయాలు మీ బుద్ధిలో తప్ప ఇంకెవ్వరి బుద్ధిలోనూ లేవు. వారికి శివబాబా గురించి కూడా తెలియదు. తండ్రి ప్రతీ విషయాన్ని అర్థం చేయిస్తూ ఉంటారు. వీరు ప్రజాపిత బ్రహ్మా అని బ్రహ్మా గురించి కూడా అర్థం చేయించారు. తండ్రి ఎప్పుడైతే సృష్టిని రచిస్తారో, అప్పుడు తప్పకుండా ఎవరిలోకో ప్రవేశిస్తారు. పావనమైన మనుష్యులైతే సత్యయుగములోనే ఉంటారు. కలియుగములోనైతే అందరూ వికారాల ద్వారా జన్మిస్తారు, అందుకే పతితులు అని అనబడతారు. వికారాలు లేకుండా సృష్టి ఎలా నడుస్తుంది అని మనుష్యులు అంటారు. అరే, దేవతలను మీరు సంపూర్ణ నిర్వికారులు అని అంటారు. ఎంత శుద్ధతతో వారి మందిరాలను నిర్మిస్తారు. బ్రాహ్మణులను తప్ప ఇంకెవ్వరినీ లోపలికి అనుమతించరు. వాస్తవానికి ఈ దేవతలను వికారులెవ్వరూ ముట్టుకోకూడదు. కానీ ఈ రోజుల్లోనైతే డబ్బుతోనే అంతా అవుతుంది. ఎవరైనా ఇంటిలో మందిరాలు మొదలైనవి పెట్టుకున్నా, అప్పుడు కూడా బ్రాహ్మణులనే పిలుస్తారు. కానీ ఆ బ్రాహ్మణులు కూడా వికారులే, కేవలం బ్రాహ్మణులు అన్న పేరు ఉంది. ఇక్కడ ఈ ప్రపంచమే వికారీ కావున పూజ కూడా వికారులు ద్వారానే జరుగుతుంది. నిర్వికారులు ఎక్కడి నుండి వస్తారు! నిర్వికారులు ఉండేదే సత్యయుగములో. అలాగని ఎవరైతే వికారాలలోకి వెళ్ళరో, వారిని నిర్వికారులు అని అంటారని కాదు. వారి శరీరమైతే ఎంతైనా వికారాల ద్వారానే జన్మించింది కదా. తండ్రి ఒకే విషయాన్ని తెలియజేశారు - ఇదంతా రావణ రాజ్యము. రామ రాజ్యములో ఉన్నది సంపూర్ణ నిర్వికారులు, రావణ రాజ్యములో ఉన్నది వికారులు. సత్యయుగములో పవిత్రత ఉండేది కావున సుఖము, సంపన్నత ఉండేది. సత్యయుగములో ఈ లక్ష్మీ-నారాయణుల రాజ్యముండేది కదా, అక్కడ పంచ వికారాలు ఉండవు అని మీరు చూపించవచ్చు. అది ఉన్నదే పవిత్ర రాజ్యము, దానిని భగవంతుడు స్థాపన చేస్తారు. భగవంతుడు పతిత రాజ్యాన్ని స్థాపన చేస్తారా. సత్యయుగములో ఒకవేళ పతితులుంటే మరి పిలిచేవారు కదా. అక్కడ ఎవరూ పిలవనే పిలవరు. సుఖములో ఎవరూ స్మృతి చేయరు. సుఖ సాగరుడు, పవిత్రతా సాగరుడు... అని పరమాత్ముని మహిమను కూడా చేస్తారు. శాంతి ఏర్పడాలి అని అంటారు కూడా. ఇప్పుడు మొత్తం ప్రపంచములో శాంతిని మనుష్యులు ఎలా స్థాపించగలరు? శాంతియుతమైన రాజ్యమైతే ఒక్క స్వర్గములోనే ఉండేది. ఎప్పుడైనా ఎవరైనా పరస్పరం గొడవపడుతూంటే, అప్పుడు శాంతపరచవలసి ఉంటుంది. అక్కడైతే ఉండేదే ఒక్క రాజ్యము.

తండ్రి అంటారు, ఈ ప్రపంచము ఇప్పుడు అంతమవ్వనున్నది. ఈ మహాభారత యుద్ధములో అన్నీ వినాశనమవుతాయి. వినాశ కాలే విపరీత బుద్ధి అని కూడా వ్రాయబడి ఉంది. తప్పకుండా మీరే పాండవులు కదా. మీరు ఆత్మిక పండాలు (మార్గదర్శకులు). అందరికీ ముక్తిధామము యొక్క మార్గాన్ని తెలియజేస్తారు. అది ఆత్మల ఇల్లు అయిన శాంతిధామము. ఇది దుఃఖధామము. ఇప్పుడు తండ్రి అంటారు, ఈ దుఃఖధామాన్ని చూస్తూ కూడా మర్చిపోండి. ఇప్పుడు ఇక మనము శాంతిధామానికి వెళ్ళాలి, అంతే. ఇలా ఆత్మ అంటుంది, ఆత్మ రియలైజ్ అవుతుంది. నేను ఆత్మను అని ఆత్మకు స్మృతి కలిగింది. తండ్రి అంటారు, నేను ఎవరినో, ఎలా ఉన్నానో... అలా ఇంకెవ్వరూ అర్థం చేసుకోలేరు. నేను బిందువును అని మీకు మాత్రమే అర్థం చేయించాను. మనము 84 జన్మల చక్రాన్ని ఎలా తిరిగాము అన్నది ఘడియ, ఘడియ మీ బుద్ధిలో ఉండాలి. దీని ద్వారా తండ్రి కూడా గుర్తుకు వస్తారు, ఇల్లు కూడా గుర్తుకు వస్తుంది, చక్రము కూడా గుర్తుకు వస్తుంది. ఈ ప్రపంచ చరిత్ర, భూగోళము గురించి మీకే తెలుసు. ఎన్ని ఖండాలు ఉన్నాయి. ఎన్ని యుద్ధాలు మొదలైనవి జరిగాయి. సత్యయుగములో యుద్ధాలు మొదలైన మాటే లేదు. రామ రాజ్యమెక్కడ, రావణ రాజ్యమెక్కడ. తండ్రి అంటారు, ఇప్పుడు మీరు ఈశ్వరీయ రాజ్యములో ఉన్నట్లు ఎందుకంటే రాజ్య స్థాపన చేయడానికి ఈశ్వరుడు ఇక్కడికి వచ్చారు. ఈశ్వరుడు స్వయమైతే రాజ్యము చేయరు, స్వయం రాజ్యాన్ని తీసుకోరు, వారు నిష్కామ సేవ చేస్తారు. ఉన్నతోన్నతమైన భగవంతుడే సర్వాత్మలకు తండ్రి. బాబా అని అనడంతోనే ఒక్కసారిగా సంతోషపు పాదరసము పైకి ఎక్కిపోవాలి. అతీంద్రియ సుఖము అనేది మీ అంతిమ అవస్థకు సంబంధించి గానం చేయబడింది. పరీక్షల రోజులు దగ్గరకు వచ్చినప్పుడు ఆ సమయములో అన్నీ సాక్షాత్కారమవుతాయి. అతీంద్రియ సుఖము కూడా పిల్లలకు నంబరువారుగా ఉంది. కొందరైతే తండ్రి స్మృతిలో చాలా సంతోషముగా ఉంటారు.

పిల్లలైన మీకు రోజంతా ఇదే ఫీలింగ్ ఉండాలి - ఓహో బాబా, మీరు మమ్మల్ని ఎలా ఉన్నవారి నుండి ఎలా తయారుచేసారు! మీ నుండి మాకు ఎంత సుఖము లభిస్తుంది... మిమ్మల్ని స్మృతి చేస్తూ ఉంటే ప్రేమ అశ్రువులు వస్తాయి. అద్భుతము, మీరు వచ్చి మమ్మల్ని దుఃఖము నుండి విడిపిస్తారు, విషయ సాగరము నుండి క్షీర సాగరములోకి తీసుకువెళ్తారు, రోజంతా ఇదే ఫీలింగ్ ఉండాలి. తండ్రి ఏ సమయములోనైతే మీకు ఈ స్మృతిని కలిగిస్తారో, అప్పుడు మీరు ఎంతగా ఆనందముతో పులకరించిపోతారు. శివబాబా మనకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. తప్పకుండా శివరాత్రి కూడా జరుపుకోవడం జరుగుతుంది. కానీ మనుష్యులు శివబాబాకు బదులుగా గీతలో శ్రీకృష్ణుని పేరును వేసేశారు. ఇది అన్నింటికన్నా పెద్ద ఏకైక పొరపాటు. మొట్టమొదట గీతలోనే పొరపాటు చేసారు. డ్రామాయే ఇలా తయారై ఉంది. తండ్రి వచ్చి ఈ పొరపాటు గురించి చెప్తున్నారు - పతితపావనుడిని నేనా, లేక శ్రీకృష్ణుడా అని. మీకు నేను రాజయోగాన్ని నేర్పించి మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేసాను. అకాలమూర్తి, అయోనిజుడు అన్న మహిమ కూడా నాదే కదా. శ్రీకృష్ణుడిని ఇలా మహిమ చేయలేరు. అతనైతే పునర్జన్మలలోకి వస్తారు. పిల్లలైన మీలో కూడా ఈ విషయాలన్నీ నంబరువారుగా బుద్ధిలో ఉంటాయి. జ్ఞానముతో పాటు నడవడిక కూడా బాగుండాలి. మాయ కూడా తక్కువేమీ కాదు. ఎవరైతే మొదట వస్తారో, వారు తప్పకుండా అంతటి శక్తి కలవారై ఉంటారు. పాత్రధారులు భిన్న-భిన్నమైనవారు ఉంటారు కదా. హీరో, హీరోయిన్ పాత్ర భారతవాసులకే లభించింది. మీరు అందరినీ రావణ రాజ్యము నుండి విడిపిస్తారు. శ్రీమతము ఆధారముగా మీకు ఎంత బలం లభిస్తుంది. మాయ కూడా చాలా శక్తివంతమైనది, నడుస్తూ-నడుస్తూ మోసం చేసేస్తుంది.

బాబా ప్రేమసాగరుడు కావున పిల్లలైన మీరు కూడా తండ్రి సమానముగా ప్రేమసాగరులుగా అవ్వాలి. ఎప్పుడూ చేదుగా మాట్లాడకండి. ఎవరికైనా దుఃఖము ఇస్తే దుఃఖితులై మరణిస్తారు. ఈ అలవాట్లన్నింటినీ తొలగించాలి. అన్నింటికన్నా అశుద్ధమైన అలవాటు విషయ సాగరములో మునకలు వేయడము. కామము మహాశత్రువని తండ్రి కూడా అంటారు. ఎంతమంది పిల్లలు దెబ్బలు తింటారు. కొందరైతే తమ కూతురిని పవిత్రముగా ఉండమని చెప్తారు. అరే, ముందు మీరు పవిత్రముగా అవ్వండి. కూతురిని ఇచ్చేస్తే ఖర్చు మొదలైన భారము నుండి విముక్తులవుతాము అని అనుకుంటారు ఎందుకంటే ఎలా ఆలోచిస్తారంటే - వీరి భాగ్యములో ఏముందో తెలియదు, సంబంధము కూడా మంచిది దొరుకుతుందో దొరకదో తెలియదు. ఈ రోజుల్లో ఖర్చు కూడా చాలా అవుతుంది. పేదవారైతే వెంటనే ఇచ్చేస్తారు. కొందరికి మళ్ళీ మోహము ఉంటుంది. పూర్వము ఒక ఆదివాసి స్త్రీ వచ్చేవారు, ఆమెను జ్ఞానములోకి రానివ్వలేదు ఎందుకంటే ఇంద్రజాలం చేస్తారేమో అన్న భయము ఉండేది. భగవంతుడిని ఇంద్రజాలికుడని కూడా అంటారు. దయార్ద్ర హృదయుడని కూడా భగవంతుడినే అంటారు. శ్రీకృష్ణుడిని అనరు. ఎవరైతే నిర్దయ నుండి రక్షిస్తారో, వారే దయార్ద్ర హృదయులు. నిర్దయ కలవాడు రావణుడు.

మొట్టమొదట జ్ఞానము. జ్ఞానము, భక్తి, ఆ తర్వాత వైరాగ్యము. అంతేకానీ భక్తి, జ్ఞానము, ఆ తర్వాత వైరాగ్యము అని అనరు. జ్ఞానము పట్ల వైరాగ్యము అని అనరు కదా. భక్తి పట్ల వైరాగ్యము కలగాలి, అందుకే జ్ఞానము, భక్తి, వైరాగ్యము అనేది సరైన వరుస. తండ్రి మీకు అనంతమైన వైరాగ్యాన్ని అనగా పాత ప్రపంచము పట్ల వైరాగ్యాన్ని కలిగిస్తారు. సన్యాసులైతే కేవలం ఇళ్ళు-వాకిళ్ళ పట్ల వైరాగ్యాన్ని కలిగిస్తారు. ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. మనుష్యుల బుద్ధిలో కూర్చోనే కూర్చోదు. భారత్ 100 శాతము సంపన్నముగా, నిర్వికారిగా, ఆరోగ్యవంతముగా ఉండేది, ఎప్పుడూ అకాల మృత్యువులు జరిగేవి కాదు, ఈ విషయాలన్నింటి ధారణ చాలా కొద్దిమందికి మాత్రమే జరుగుతుంది. ఎవరైతే మంచి సేవ చేస్తారో వారు చాలా షావుకారులుగా అవుతారు. పిల్లలకైతే రోజంతా బాబా, బాబా అన్నదే స్మృతిలో ఉండాలి. కానీ మాయ స్మృతి చేయనివ్వదు. తండ్రి అంటారు, సతోప్రధానముగా అవ్వాలంటే నడుస్తూ, తిరుగుతూ, తింటూ, నన్ను స్మృతి చేయండి. నేను మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా తయారుచేస్తాను, మరి మీరు నన్ను స్మృతి చేయరా! చాలామందికి మాయ తుఫానులు ఎన్నో వస్తాయి. ఇదైతే జరుగుతుంది అని తండ్రి అర్థం చేయిస్తారు. ఇది డ్రామాలో నిశ్చితమై ఉంది. స్వర్గ స్థాపన అయితే జరగవలసిందే. కొత్త ప్రపంచమైతే సదా ఉండదు. చక్రము తిరిగితే తప్పకుండా కిందికి దిగుతారు. ప్రతి వస్తువు కొత్తది నుండి పాతదిగా తప్పకుండా అవుతుంది. ఈ సమయములో మాయ అందరినీ ఏప్రిల్ ఫూల్ చేసింది, తండ్రి వచ్చి పుష్పాలుగా తయారుచేస్తారు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. తండ్రి సమానముగా ప్రేమ సాగరులుగా అవ్వాలి. ఎప్పుడూ ఎవరికీ దుఃఖము ఇవ్వకూడదు. చేదు మాటలు మాట్లాడకూడదు. చెడు అలవాట్లను సమాప్తము చేయాలి.

2. బాబాతో మధురాతి మధురమైన మాటలు మాట్లాడుతూ ఇదే ఫీలింగ్ లో ఉండాలి - ఓహో బాబా, మీరు మమ్మల్ని ఎలా ఉన్నవారి నుండి ఎలా తయారుచేసారు! మీరు మాకు ఎంత సుఖాన్ని ఇచ్చారు! బాబా, మీరు క్షీర సాగరములోకి తీసుకువెళ్తారు... ఇలా రోజంతా బాబా, బాబాయే స్మృతిలో ఉండాలి.

వరదానము:-
సర్వ సంబంధాలు మరియు సర్వ గుణాల అనుభూతిలో సంపన్నముగా అయ్యే సంపూర్ణ మూర్త భవ

సంగమయుగములో విశేషముగా సర్వ ప్రాప్తులలో స్వయాన్ని సంపన్నముగా తయారుచేసుకోవాలి, అందుకే సర్వ ఖజానాలను, సర్వ సంబంధాలను, సర్వ గుణాలను మరియు కర్తవ్యాలను ఎదురుగా ఉంచుకుని చెక్ చేసుకోండి - అన్ని విషయాలలో అనుభవీగా అయ్యారా. ఒకవేళ ఏదైనా విషయము యొక్క అనుభవములో లోటు ఉంటే అందులో స్వయాన్ని సంపన్నముగా చేసుకోండి. ఒక్క సంబంధములోనైనా లేక ఒక్క గుణములోనైనా లోటు ఉన్నట్లయితే సంపూర్ణ స్థితి లేక సంపూర్ణ మూర్తి అని అనలేరు, అందుకే తండ్రి గుణాలను మరియు మీ ఆది స్వరూపపు గుణాలను అనుభవము చెయ్యండి, అప్పుడు సంపూర్ణ మూర్తులుగా అవుతారు.

స్లోగన్:-
ఆవేశములోకి రావటము కూడా మనసుతో ఏడ్వడమే - ఇప్పుడు ఏడ్చే ఫైలును సమాప్తము చెయ్యండి.

మీ శక్తిశాలి మనసా ద్వారా సకాష్ ను ఇచ్చే సేవ చెయ్యండి

మనసా సేవను చేసేందుకు సర్వ శక్తులను మీ జీవితములో భాగముగా చేసుకోండి. బాబా సమానముగా ఎంత పర్ఫెక్టుగా అవ్వండి అంటే లోపల ఎటువంటి డిఫెక్ట్ (లోపము) ఉండకూడదు, అప్పుడు శ్రేష్ఠ సంకల్పాల ఏకాగ్రత ద్వారా అనగా మనసా ద్వారా స్వతహాగా సకాష్ వ్యాపిస్తుంది.